5, జులై 2014, శనివారం

149. Life Story -53(1) (సూక్తులు చదవండి - విజ్ఞానాన్ని పెంచుకోండి)

                                                               

సూక్తులు  చదవండి -విజ్ఞానాన్ని పెంచుకోండి. (అంత్య  ప్రాస భావ సూక్తులు-నా మనసులో మెదిలినవి తేలిక పదాలతో తెలియ పరుస్తున్నాను)
1. మంచిని మంచిగా చూడు, చెడును చెడుగా  చూసి వీడు
    కులసతిని మంచిగా  చూడు,   దుర్-వ్యసనాలను  వీడు
    పిల్లల  భవిషత్ చూడు ,  కలియుగ  పద్దతిలో   పోరాడు
    మనిషిని మనిషిగా చూడు, మనిషిలోదేవుడు కనిపిస్తాడు

2. మతల భారం మనతలపై నాట్య మాడు తున్నది
    అభిప్రాయాల  బారం మనస్సును వెదిస్తూ ఉన్నది
    ఆదర్శాల భారం హృదయాన్ని భందించు తున్నది
    ధనప్రభావం మనిషిని మూర్ఖునిగా మారుస్తున్నది

3. మెత్తని వానిని చూసిన  మొత్త   బుద్ధి యగు
    పాలతుత్తిని చూసిన మెత్తగా వత్తబుద్ధి యగు
    మందు సీసాను చూసిన త్రాగాలని ఇష్ట మగు                   
    రోగికి  మాత్రలు మింగించాలన్న  నరక మగు

4. మనోరధ   ప్రవాహమునకు   కట్టలు     లేవు
    ప్రేమకు కుల మతాలు ఎప్పుడు  అడ్డు   రావు
    సుఖాలు,కష్టాలు, ఎప్పుడు ఎవరికీ చెప్పి రావు 
    పెళ్ళైన కొత్త వారికి ఎప్పుడు  ఏమి  కన బడవు

5. చెవిటి వాని ముందు శంఖం ఊదిన ప్రయోజనం ఉండదు
    వెలయాలి  ముందు పెళ్ళాన్ని  తిట్టినా  ఫలితం  ఉండదు
    షుగరున్నవానికి పంచదార గులికలతో పని అసలుండదు
    ఆరోగ్య వంతునకు మందులతో అవసర మనేది  ఉండదు

6. నవ్వుతూ చేస్తారు, ఎడుస్తూ అనుభ భవిస్తారు
    నవ్వుతూ కలుస్తారు, బిడ్డ పుట్టాక  ఏడుస్తారు
    నవ్వుతూ తింటారు, ఖర్చుకు భాద పడతారు
     నవ్వుతూ త్రాగ్రుతారు, తిట్లతో    బాదు తారు

7.  మంచి వారితో మైత్రి, మరణం నుండి  రక్షించు    వచ్చు
     భార్య మాట పాటిస్తే, చెడు అలవాట్లకు దూరమవ   వచ్చు
     పెద్దలమాట విన్నవారు,  జీవతములొ  సుఖ పడ  వచ్చు
     దేవుని నమ్మినవారికి, మనసు ప్రశాంతముగా ఉండవచ్చు 

8. కాలమును బట్టి వస్తువు విలువ మారును
    దేశమును బట్టి   రాజ  కీయము మారును
    కులమును బట్టి  ఆచారములు   మారును
    దేవుడ్ని బట్టి తీర్ధ ప్రసాదములు  మారును

9. ధీరులు న్యాయ మార్గము నుండి   చలించరు
    పతివ్రతలు ధర్మ మార్గామునుండి  చలించరు
    జ్ఞానులు శాంతి మర్గాము నుండి   చలించరు
    బ్రాహ్మనులు నీతి మార్గామునుండి చలించరు 

10. నీచులు   జగడము  కోరు    కొందురు
      సత్పురుషులు సంధిని కోరు కొందురు
      వేశ్యులు  ధనమును   కోరు  కొందురు    
      స్త్రీలు భర్త సుఖమును కోరు  కొందురు

11. సమ్పాదన లేని పురుషుడు గడ్డి పరకతో  సమానము
      వెలుగు చూడని ఇల్లు పశువుల సావిడతో సమానము
      సువాసన లేని పువ్వులు    గడ్డి పూలతో  సమానము
      పిల్లలులేని స్త్రీ ,పురుషుడు  గొడ్రాలతో      సమానము

12. స్తనములు లేని   స్త్రీ   రేవికను   నిందించును
      ఓర్వలేని స్త్రీ శాంతము గూర్చి ఉపన్యసిన్చును
      తృప్తి పొందని స్త్రీ భర్తను వెదించుతూ ఉండును
      కాపురము చేయని స్త్రీ సంసారము గురించి చెప్పును

13. దక్షిణ లేని కృతువు బలహీన మగును
      శోభనం లేని  పెళ్లి  పటా  పంచ    లగును
      తృప్తి పరచని  కాపురం  కలహ   మగును
      కన్నీరుచిందని కుటుంబము లేదనగలను

14. గోడలున్నా  చిత్తరువులు   వెయ  వచ్చును
      వెంట్ర్రుకలున్న అందము అలంకరించ వచ్చను
      ఉల్లి పాయలున్న కన్నీరు తెచ్చుకోవచ్చును  
      సంపాదనతో కొండ మీద కోతిని కొనవచ్చును

15. పర ద్రవ్యము మట్టి  పెడ్డ  వలే చూడవలెను
      పరస్త్రీలను కన్నతల్లి, చెల్లి వలె చూడవలెను
      పురుషులతో స్రీలు ప్రేమగా మాట్లాడ వలెను
      స్త్రీలతో పురుషులు ఆగిచూసి మాట్లాడ వలెను

16. ఎ చెట్టు లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షం
      గుడిశెలున్న చోట  చిన్న  ఇల్లే  మహా  భవణం
      ఎదిక్కు   లేక పోతె అక్క  మొగుడే  దిక్కవటం
      స్త్రీ గుడ్డిదైనా మనసుతో సంసారం నెట్టుకు రావడం  

17. ఇంట్లో దీపమ్ ఉంటె ఇల్లంతా ప్రకాశం
      ఇంట్లో పాము ఉంటె ఇల్లంతా  భయం
      ఇంట్లో శవంఉంటె ఇల్లంతా ఉపవాసం
      ఇంట్లో ఇరుకుంటే శృంగారం  మాయం

18. భోజనము చివర మజ్జిగ అన్నము తినవలెను
      భోజనము ఆయిన  తర్వాత  నీరు త్రాగవలెను
      భోజనముఆయిన తర్వాత కిల్లి వేసుకొనవలెను
      రాత్రిపడుకొనే ముందు నీరు, పాలు త్రాగవలెను

19. స్ర్తీ పురుష సంపాదనే కుటుంబానికి  భూషణం
      పురుషులను  సుఖ  పెట్టడమే  స్త్రీ భూషణం
      తల్లి తండ్రులను చూడటమె  పిల్లల భూషణం
      దేవుణ్ణి   ప్రార్దిమ్చటమే    అందరి   భూషణం 

20. నిర్భాగుడు ఎక్కడ పోయినా అక్కడికే ఆపదలు ముందు పోయినట్లు
         పిల్లి  కల్లుమూసుకొని  పాలు త్రాగుతూ ఎవ్వరు చూడ రనుకున్నట్లు
         తాటి చెట్టు  క్రింద కూర్చొని  పాలు త్రాగిన  తాటి  కల్లును  త్రాగి  నట్లు   
         బట్టతలతో చెట్టు క్రింద కూర్చొన్న చిన్నపండుతలపై పడ్డ శబ్ధమైనట్లు

21. మందుగా మద్యమమును రాత్రి   త్రాగ వచ్చు
      మందుగా వేశ్య వాటికకు ఎప్పుడైనా పోవచ్చు
      మందుగా చెడుమాటల సలహాలు ఇవ్వవచ్చు  
      పై వణ్ణి భార్యకు చెపితే సంసారం కూల  వచ్చు

22. శాంతము లేని వానికి సుఖము లేదు
      కోపము ఉన్న వానికి  ఆదరణ  లేదు
      ఆశతో ఉన్న వణికి మార్గమనేది లేదు
      భార్య తోడూ లేకపోతె బర్తకు విలువలేదు

23. అద్దమునకు మకిలి పట్టిన తొలగించ వచ్చు
      మురికిపట్టిన వస్త్రాలను సబ్బుతో ఉతకవచ్చు
      పగలు ఏర్పడిణ  తగాదాలు రాత్రి తీర్చ వచ్చు
      పగలు రాత్రి,  రాత్రి వెలుతురూ  మార  వచ్చు

24. ఉత్తమమునకు కోపము క్షణ కాలము
      పతి వ్రతకు ఎప్పుడు నవ యవ్వనము
      ఓర్పుఉన్న వానికి ప్రతి పని సులభము
      మాయనుఆవహించిన వానికిఅన్ని కష్టము

25. వ్యాది గ్రస్తుడైన వానికి నియమములతో పనిలేదు
      తెగించిన వాని  ఏమి  చెప్పిన  వినే  ఓపిక  లేదు
      సంసార సుఖము పొందుటకు సమయము లేదు    
      కాలాన్ని ఎదిరించి బ్రతుకుట ఎవ్వరికీ  చేత కాదు
                                 



బుచ్చిబాబు కథలు – మనోవైజ్ఞానిక దృక్పథం.! 

– శ్రీ కోడూరి శ్రీ రామమూర్తి. 

.... 
తెలుగు సాహిత్యంలో కథకుల సంఖ్యకు కొదవలేదుగాని, మంచి కథకుల గురించి చెప్పాలంటే, ఆ సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఆ కొద్దిమంది కథకుల్లో ఎన్నదగినవాడు బుచ్చిబాబు. జీవితాన్నీ, జీవితంలో తనకెదురయిన వ్యక్తులనీ, ఆ వ్యక్తుల జ్ఞాపకాలు అందిచ్చే అనుభూతుల్నీ, నిశితంగా పరిశీలించి గుండెల్లో పదిలపరుచుకొని, ఒక్కొక్క పాత్రగా తీర్చిదిద్దాడు బుచ్చిబాబు. అయితే, ఆ పాత్రలను సృష్టించిన కథకుడు అటు విశ్వసాహిత్యంలోని ఆధునిక పోకడలను, ఇటు మనస్తత్వశాస్త్ర, తత్వశాస్త్ర సిద్ధాంతాల సారాంశాన్ని ఆకళింపు చేసుకున్న మేధావికావడంతో – అతని కథలు కాలక్షేపపు పరిధిని దాటి ముందుకు వెళ్ళగలిగాయి. - 
”నా కథలన్నీ నే ఎరిగున్న మనుషులు, స్థలాలు, అనుభవాలు వీటిగురించే వ్రాసినవే” అని చెప్పుకున్న బుచ్చిబాబు, మామ్‌లాగానే ‘నోట్‌బుక్‌’లో తనను కదిలించిన విషయాల నన్నిటినీ ‘నోట్‌’ చేసుకొనేవాడు. నిజానికి, వాస్తవపు ఆధారంలేని కల్పన సాహిత్యంలో రాణించలేదనుకుంటాను 
బుచ్చిబాబు కథల్లో ”నన్నుగురించి కథరాయవూ” ప్రసిద్ధి చెందింది. బుచ్చిబాబు చిన్నవాడుగా ఉన్నప్పుడు ఒక అమ్మాయి అతణ్ణి నన్ను గురించి కథ రాయవూ అని అడిగిందట ! తర్వాత పదిహేనేళ్ళకి బుచ్చిబాబు అదే మకుటంతో ఒక కథ రాయగలిగాడు. అయితే, ఇందుకు మరికొన్ని ప్రేరణలు కూడా ఉన్నాయి. బుచ్చిబాబు స్నేహితుడు ఒకాయన కొన్ని షరతులు పెట్టి ఒక కథ రాయమన్నాడట. ‘ప్రేమ’ అనే పదం రాని ప్రేమకథ అయి ఉండాలి. కథలో ఏమీ జరక్కూడదు అనేవి ఈ షరతులు. ఈ షరతుల పరిధిలో కథ మలుచుకొనేందుకు అతని చిననాటిజ్ఞాపకాలు కూడా తోడయ్యాయి. ”నన్ను గురించి కథ రాయవూ?” లో కుముదానికీ, కథచెప్పే ”నేను” అనే వ్యక్తికీ మధ్యన ఉండే శారీరకమైన సంబంధంలేని ”ప్రేమ” (‘ప్లేటోనిక్‌ లవ్‌’ వంటిది) బుచ్చిబాబు తండ్రికీ, ‘కోమలి’ అనే అమ్మాయికి (ఈ ‘కోమలి’ అనే పేరునే బుచ్చిబాబు ‘చివరకు మిగిలేది’ నవలలో వాడుకున్నాడు) మధ్యన ఉండేదని బుచ్చిబాబు తన ”అంతరంగ కథనం” (స్వీయచరిత్ర)లో రాసుకున్నాడు. ఈ భావాలన్నీ జమిలిగా జతచేరిన ఫలితమే ”నన్ను గురించి కథరాయవూ” అనే కథ. ”కుముదం” అనబడే ఓ మధ్యతరగతి కుటుంబీకురాలి పాతికేళ్ళ జీవితకథను సుమారు పాతికపేజీల ఈ కథలో ఇముడుస్తాడు బుచ్చిబాబు. కథ ప్రారంభం అయ్యేటప్పటికి చిన్నపిల్లగా ఉండే కుముదం కథ చివరికొచ్చేసరికి నలుగురు పిల్లల తల్లి అవుతుంది. అయితే – ఈ మార్పు శారీరకమైంది మాత్రమే ! మనసులోని భావనలో మాత్రం మార్పులేదు. 
కథకుణ్ణి కుముదం ”నన్ను గురించిన కథరాయవూ” అని అడగడానికి కారణం ఒక మామూలు కథకు కథానాయిక అవుదామన్న కోరిక కాదు. కుముదానికి చిననాటి నుండి కథకుడంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానాన్ని శారీరక అనుభవంగా మార్చగల తెగువ అతనికి లేదు – ఆమెకీ లేదు. అందుచేత తనకున్న మానసిక బంధం మరింత పటిష్టం కావడానికి ఆమె అతగాడి కథకు కథానాయిక కాదలచింది. ఒక కథలో తాను ఇమిడిపోయి శాశ్వతంగా అతడి దగ్గర ఉండపోదలచింది. కాని, ఇది జరగాలంటే ఆమెలో ఏదో ‘అసాధారణత’ ఉండాలంటాడు కథకుడు. తనలో లేని ‘అసాధారణత’ ఏమిటో కుముదానికి తెలుసు. అందుచేతనే – తనలో అట్టి అసాధారణతను కలిగించేందుకు ప్రోదిని కల్పించే స్వేచ్ఛపై ఆమె నానాటికీ మమకారాన్ని పెంచుకోసాగింది. ఉద్యోగం దొరకలేదని బాధపడే కథకుడిలో కుముదం ఉద్యోగం చెయ్యడం బానిసత్వమని చెప్పడం దాస్యాన్ని తాను సహించలేననడం, వ్యవస్థ గీసిన గిరిపట్ల నానాటికి ఆమెలో పెరిగిపోతున్న రోతకు పరోక్ష వ్యక్తీకరణగా చెప్పుకోవచ్చు. అయితే, ఆమె తన మనసులోని మాటను ప్రత్యక్షంగా వ్యక్తీకరించగల తెగువను పెంపొందించుకొనేటప్పటికి జీవితపు తుది ఘడియలు సమీపించాయి. చావు బ్రతుకుల మధ్య ఉన్న కుముదాన్ని చూడ్డానికి కథకుడు ఆస్పత్రికి వస్తే – ”నువ్వెందుకు పెళ్ళిచేసుకోలేదో నాకు తెలుసు… నా కోసం…” అని అనడంతో ఆమె స్వేచ్ఛకోసం పడిన తపన పరాకాష్ఠకు చేరుకొంది. ఈ ఒక్కమాటతో కుముదం కథకుడి కథకు నాయిక కాగల అర్హతను సంపాదించుకొంటుంది. 
బుచ్చిబాబు కథల్ని మొత్తంమీద చూచినప్పుడు ఒక విషయం మనకు సులువుగా అవగాహనకు వస్తుంది. అతని కథల్లో సాధారణంగా కనబడేది అంతరంగంలో అణచి వేయబడిన శృంగార భావనలు, ”ప్రేమించి దూరంగా ఉండి, శరీరసుఖం కోరక, మనస్సుని ఆనందంతో నింపుకొనే ఉదంతం సాహిత్యంలో రాణిస్తుంది” అంటాడతను. కుముదంతో బాటుగా ”మేడమెట్లు” కథలోని అరుణ, ”ఆశాప్రియ” కథలోని ఆశాప్రియ, ”పొగలేని నిప్పు” కథలోని సీతారత్నం, ”వీరేశలింగం ఏం చెయ్యాలి?” కథలోని మైథిలి, ”తెరచాప దించిన పడవ” లోని విదురమ్మ, ”ఆ రాలిన ఆకులు” కథలోని కాంతం – ఇత్యాదులందరూ మనసులోని కోరికకూ, శరీరపు అనుభవానికీ, పొందిక కుదరక వేర్వేరు విధాలుగా ఆవేదనతో అలమటించినవారే !
”పొగలేని నిప్పు” కథలోని సీతారత్నం కథ చాలా చిత్రంగా ఉంటుంది. ఈ కథలో ఇరుగు పొరుగున ఉన్న, భాస్కరం, సీతారత్నంల మధ్య నిప్పు ఉంది. అది రోజురోజుకూ రాజుకుని మహాగ్ని అవుతున్నది. అయినప్పటికీ, ఇద్దరూ తప్పుచెయ్యలేక పోయారు. పవిత్రతకూ, అపవిత్రతకూ మధ్య ఉన్న అడ్డుగీతను దాటిపోయేందుకు పరిగెడుతూ, తమకు తామే కళ్ళాలు వేసుకుని వాళ్ళు ఎలా ఆగిపోయేవారో కుతూహలాన్ని కలిగించే రీతిలో చెబుతాడు బుచ్చిబాబు ఈ కథలో. తను రాసిన కథల్లో ఇది తనకు ఇష్టమైనకథ అని చెప్పుకున్నాడు బుచ్చిబాబు. 
”మేడమెట్లు” కథలోని అరుణ కథ కూడా ఇంతే. అయితే సీతారత్నం మాదిరిగా అరుణకు నిత్యసంఘర్షణ లేదు. సంస్కారపు ముసుగును పదిలంగా పరుచుకోగల నైపుణ్యము, బ్రతుక నేర్చినతనం, ఆమెలో అధికంగా ఉండడమే ఇందుకు కారణం. అరుణకాక, ఈ కథలోని మరి రెండు ప్రధానపాత్రలు ‘అధికారి’ ‘దౌర్భాగ్యుడు’ వీళ్ళిద్దరూ మిత్రులు. అధికారి అరుణ భర్త. దౌర్భాగ్యుడు ఆమె చిన్ననాటి ప్రియుడు. మనిషిలో ఉండే ‘రెండుతరహాల ప్రవృత్తులకూ వేర్వేరు సంకేతాలు. ఐశ్వర్యంపట్ల, అధికారం పట్ల మనిషికి ఉండే ఆకాంక్షకు సంకేతం ‘అధికారి’ అయితే – సౌందర్యపిపాసకు, అలౌకికమైన శాశ్వత విలువలకు, సంకేతం ‘దౌర్భాగ్యుడు’ ! – పరస్పర విరుద్ధమైన ఈ రెండు ప్రవృత్తులలో దేనినీ వరించలేక వీటిమధ్య జరిగే సంఘర్షణలో ఎటూ తేల్చుకోలేక సతమతమయ్యే సగటు మనిషికి ‘అరుణ’ సంకేతం. ఈ ప్రతీకల నేపథ్యంలో ఫ్రాయిడియిన్‌ సైకాలజీని దృష్టిలో ఉంచుకుని అంతరంగంలో చెలరేగే తపనల కథ చెబుతాడు బుచ్చిబాబు ”మేడమెట్లు” కథలో – 
ఫ్రాయిడ్‌ మనస్తత్వశాస్త్రం ప్రకారం (సైకోఎనాలిసిస్‌) మేడమెట్లు ఎక్కడం, దిగడం అనేవి కలలోనికి వస్తే, అంతరంగంలో చెలరేగే మైథునవాంఛకు ప్రతీకగా చెప్పడం జరుగుతుంది. నిజానికి దౌర్భాగ్యుడి ప్రేమకథ కూడా ఒక కలలాంటిదే ! దౌర్భాగ్యుడు తన చిననాటి ప్రియురాలితో ఆడుకున్నది మేడమెట్ల మీద. ఆమెకోసం కలవరించింది మేడ మెట్లమీద. కథ చివర్లో అధికారి కూతురు కళ్యాణిని చూచి, తన చిననాటి స్నేహితురాలిగా భావించి, ఆవేశంతో మేడమీదనించి దిగుతూ కాలుజారి పడి చనిపోయింది గూడా మేడమెట్లమీదనే ! అతని జీవితకథలో మేడమెట్లకు గల స్థానం అత్యంత ముఖ్యమైంది. 
దౌర్భాగ్యుడి ప్రేమకథను పెనవేసుకున్న మరొక విషయం అరుణ ఉంగరం. ఆ ఉంగరాన్ని అతడు విడిచిపెట్టలేకపోవడానికి కారణం మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్పే ”స్టఫ్‌ ఫెటిషిజమ్‌”గా అభివర్ణించుకోవచ్చు. అరుణకు ఆ ఉంగరం దౌర్భాగ్యుడి దగ్గిర ఉండడమే ఇష్టం. ప్రతిసారి అది తనకు తిరిగి ఇచ్చెయ్యమని అడగడం, దానికోసం దౌర్భాగ్యుడితో పోట్లాడడం – అతనిపట్ల గల మమకారాన్ని దానికి విరుద్ధమైన భావంగా వ్యక్తీకరించడమే! అయితే, ఆమె బ్రతుకనేర్చింది. దౌర్భాగ్యుడు కోరుకున్నట్టుగా ఆమె నగలన్నీ విడిచేసి పువ్వుల్ని ప్రేమించలేదు. అందుకే అధికారానికి అర్థాంగి అయింది. అయినప్పటికీ ఆమె దౌర్భాగ్యుణ్ణి మరచిపోలేదనడానికి కారణం భర్తకు నచ్చకపోయినా, పట్టుపట్టి ఇదివరకు తాను చిన్నతనంలో దౌర్భాగ్యుణ్ణి (అతని పేరు అదే అనుకుంటే) కలుసుకున్న ఇంటికి ఉన్నట్టుగానే సరిగ్గా అదే ఇరవైమూడు మెట్లున్న మేడను అద్దెకు తీసుకునేలా చెయ్యడం. కాని, ఆమె ఎప్పుడూ మేడ దిగివచ్చేది కాదు. ఆ మెట్లు దిగిరాగలిగితే ఆ రోజేఆమె దౌర్భాగ్యుడికి అంకితమై పోయేది ! దౌర్భాగ్యుడి చేతికి ఉన్న ఉంగరాన్ని అరుణ తీయించడం మధురమైన జ్ఞాపకాలను తన గుండెల్లో భద్రపరచుకోవడానికి ఆమె చేసిన మరో ప్రయత్నంగా భావించవచ్చు. 
ఇట్లాంటి ఆవేదనే మరోరూపంలో ‘ఆశాప్రియ’ కథలోని ఆశాప్రియలో కనబడు తుంది. ఈ కథలో బుచ్చిబాబు – ఒక సినిమాతార, ఒక సినిమాపత్రిక సంపాదకుడు, ఒకరినొకరు ద్వేషించుకుంటూ అంతరంగంలో ఆత్మీయతతో, ఆరాధనాభావంతో, ఎలా సతమతమై పోయారో చక్కగా చిత్రిస్తాడు. అంతరంగంపై తనకు తానుగా పెట్టుకున్న మూతను తొలగించే అవకాశం రాకుండానే ఆశాప్రియ తారాపథం నుండి రాలిపోతుంది. కథ కంచికి వెళ్ళిపోతుంది. 
కుముదం, సీతారత్నం, అరుణ, ఆశాప్రియ వీళ్ళందరూ ఒకేభావానికి విభిన్న రూపాలు. సంప్రదాయం కోసమో, ఆర్ధిక సామాజిక స్థాయిల కోసమో, మనసుని చంపుకోడానికి వీళ్ళందరూ వ్యర్ధప్రయత్నం చేసారు. బుచ్చిబాబు స్త్రీ పాత్రల విషయంలో సాధారణంగా కనబడే ధోరణి ఇది. కొన్ని సందర్భాలలో అతని స్త్రీ పాత్రలు మానవత్వాన్ని కూడా మరచిపోయినట్టుగా కనబడతాయి. ”జ్యోతి” కథలోని జ్యోతి, ”అనురాగ ప్రస్థారం” కథలోని శోభాసుందరి, ”నొసటన వ్రాసినవ్రాత” కథలోని రాజమ్మ, ఇత్యాదుల గడుసుదనం, తమ ప్రయోజనాలకు మొగవారిని ఉపయోగించుకునే ధోరణి, మనల్ని ఆశ్చర్యపరిస్తే – ”మీరు, నేనూ, మామ్‌” కథలోని పద్మావతి, ”నిరంతర త్రయం” కథలోని సుగుణ, ”వనకన్య” కథలోని వనకన్యల ప్రవర్తన మనకు బాధను కూడా కలిగిస్తుంది. అయితే, వీళ్ళెవరూ సోమర్‌సెట్‌ మామ్‌ నవల ”ఆఫ్‌ హ్యూమన్‌ బాండేజి” లోని ”మాల్‌డ్రిడ్‌” మాదిరిగా క్రూరులు కారు.కొన్ని సందర్భాలలో బుచ్చిబాబు స్త్రీ పాత్రల ఆశక్తతను, బ్రతుకనేర్చినతనాన్ని, క్షమించగలుగుతాం కూడా. బుచ్చిబాబుకు తన పాత్రలపట్ల సానుభూతి ఉండడమే ఇందుకు కారణం. బుచ్చిబాబు మామ్‌లో లేదని భావించిన ”జీవితం పట్ల ఉండాల్సిన గౌరవభావం” ఇదేననుకుంటాను ! – 
బుచ్చిబాబు కథల్లో కనబడే స్త్రీ పాత్రల్లో ‘తెరచాప దించిన పడవ’ కథలోని విదురమ్మకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని నా అభిప్రాయం. రచయితగా అతడు పాత్ర చిత్రణలో ఆకాంక్షించిన ‘అర్థంకాని గొడవ’ విదురమ్మ కథలో పుష్కలంగా ఉంటుంది. నా దృష్టిలో బుచ్చిబాబు కథల్లో ఆణిముత్యం అనదగ్గ కథ ఇది. యుద్ధానికి పోయి తిరిగిరాని తన భర్త జ్ఞాపకాలతో సతమతమవుతూ, మృత్యువును ఆహ్వానిస్తూ బ్రతుకుతున్న పతివ్రతగా కథ మొదటిలోమనకు విదురమ్మ పరిచయం అవుతుంది. అయితే, కథ చివరికొచ్చేసరికి పరిస్థితి వేరు. శరీరం చేసే అలజడికి తట్టుకోలేక, లొంగిపోయిన ఒక సామాన్యురాలిగా ఆమె మనకు కనిపిస్తుంది. అయినా ఆమె మీద మనకు కోపం రాదు. దీనికి కారణం రెండింటిలోనూ ఉన్నది. – విదురమ్మ సిసలైన వ్యక్తిత్వమే ! ఆమె తన భర్తను ఎంతగానో ప్రేమించింది. అతడి ఎడబాటును భరించలేక పోయింది. యుద్ధానికి వెళ్ళిన భర్త తిరిగి వస్తాడేమో నన్నఆశతో అతడి గదిని ఆమె ప్రతిరోజూ శుభ్రం చేసి, అతడు వాడే వస్తువులన్నీ ఎక్కడివక్కడే ఉంచేది. భర్తమీద ప్రేమను అతడు వాడిన వస్తువులపైన కూడా చూపించేది. అందుచేతనే, ప్రభుత్వంవారు ఆమెకున్న కొద్దిపాటి భూమిలో కొన్నిగజాల స్థలాన్ని కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం కలుపుకోవాలని అడిగినా – తనూ, తన భర్త, కూర్చుని కబుర్లు చెప్పుకన్న బండరాయిని కదల్చడానికి వీల్లేదంటూ అభ్యంతరం చెప్పింది. అతి బలవంతం మీద ఆ బండరాయిని కాస్త ప్రక్కకి తొలగించడానికి ఒప్పుకుంది గానీ, కమ్యూనిటీ హాలు నిర్మాణానికి అడ్డంగా ఉన్న చెట్టునుమాత్రం కొట్టడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే, ఆ బండరాయి మీద ఉన్నవి తను గడిపిన తీయటిరోజుల జ్ఞాపకాలు. తను పోయినప్పుడు ఆ జ్ఞాపకాల చిహ్నం ఏమయినా ఫరవాలేదు. కాని, తాను చెట్టుమొదటిలో కప్పెట్టిన చేదు జ్ఞాపకాలు మాత్రం తనతోనే పోవాలి! అందుకే ఆ జ్ఞాపకచిహ్నాన్ని చేజిక్కించుకోవడం కోసం ప్రాణాల్ని కూడా పణంగా పెట్టుకొంది. మనిషిలో ఉండే బొమ్మా, బొరుసుల కథను హృదయానికి హత్తుకొనే రీతిలో చెబుతాడు బుచ్చిబాబు ఈ కథలో. విదురమ్మ మనస్తత్వంలోని వైచిత్రిని ఆవిష్కరించడం మాత్రమే గాక, బుచ్చిబాబు ఈ కథలో మరొక ప్రయోజనాన్ని కూడా సాధించగలిగాడు. అది – వ్యక్తి ప్రయోజనానికీ, సామాజిక ప్రయోజనానికీ మధ్య గల తేడాను చూపించడం. సంఘానికి కమ్యూనిటీహాలు ముఖ్యం. ఒక ముదుసలి విధవరాలు బండరాళ్ళపై పెట్టుకున్న సెంటిమెంటు ముఖ్యం కాదు. సామూహిక ప్రయోజనాన్ని సాధించదలుచుకున్నప్పుడు వ్యక్తిచేసే ఆర్తనాదం పట్టించుకునే తీరిక ఎవరికీ ఉండదనే సత్యాన్ని ఈ కథ మరోమారు మనకు జ్ఞాపకం చేస్తుంది. చాలాకాలం జ్ఞాపకం ఉండేకథ, కథకు కావలసిన మొదలు, మధ్య, తుదిభాగాలు మూడు చక్కగా అమిరాయి. 
కథకి తుదీ, మొదలూ, లేకుండా ఉండి – మధ్యలో ప్రారంభమై మధ్యలో అంతమయ్యే ధోరణిని, అంటే చెహోవ్‌ రీతిలో కథ చెప్పేధోరణిని, సోమర్‌సెట్‌మామ్‌ హర్షించనట్టే బుచ్చిబాబు కూడా హర్షించడు. ”చెహోవ్‌ పద్ధతికథ ఇసుక మీద కెరటం దిగవిడచిన చారలాంటిది. నాకది తృప్తినివ్వదు. ఆ కథ కెరటంగా కనబడాలి. కెరటం వెనుక సముద్రం హోరు వినబడాలి” అంటాడతను. సోమర్‌సెట్‌ మామ్‌ కూడా అదే అభిప్రాయాన్ని ‘తన ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌’ కథల సంపుటి మొదటిమాటలో వ్యక్తీకరించడాన్ని గమనించవలసి ఉంది. ”కథకు తుదీ మొదలూ ఉండకూడదని అనడం తలా తోకాలేని చేప కావాలనుకోవడం లాంటిది. ఆ రెండూ లేకపోతే అది చేప కానేకాదు”. అన్న మామ్‌ – సరిఅయిన తుదీ, మొదలూ దొరకక తన దృష్టిలోకి వచ్చిన మంచి ఇతివృత్తాలను వదులుకున్న వైనాన్నికూడా తన ‘రైటర్స్‌ నోట్‌బుక్‌’లో రాసుకున్నాడు. బుచ్చిబాబు కూడా ఇట్లాంటి వాటిని వదిలి పెట్టాలనుకున్నాడు గానీ, కొన్ని సందర్భాలలో నిగ్రహించుకోలేక పోయాడనుకుంటాను. ‘రైటర్స్‌ నోట్‌బుక్‌’లో మామ్‌ ప్రస్తావించి, కథగా రాయకుండా వదిలేసిన ఒక ఉదంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని ‘మామ్‌ రాయని కథ’ అంటూ రాసి దాన్నొక కాశీమజిలీ కథలాగా తయారుచేశాడు. ”బీ” అనే కథ విషయంలో కూడా పరిస్థితి ఇంతే ! 
మాంసం సాహేబు కూతురు ‘హసీమాబీ’కి వేగంగా తిరిగే ఏ చక్రాన్నయినా ఆపడం ఇష్టం. తిరుగుతున్న ఫేన్‌లోనూ, సైకిల్‌ చక్రంలోనూ, కుట్టుమిషను చక్రంలోనూ, వేళ్ళు పెట్టి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటుంది. ఈ అలవాటును మనస్తత్వ శాస్త్రరీత్యా ఒక ‘అబ్సెషన్‌’ అని చెప్పవచ్చు. ఇట్లాంటివి ఏర్పడ్డానికి చిన్నతనంలో పెరిగిన వాతావరణం దగ్గిరనుంచి, చాలా కారణాలుంటాయి. ‘బీ’ విషయంలో ఈ అలవాటు ఒక శాపంగా మారి ఆమె బ్రతుకును విషాదపు అగాధాల్లోకి తోసేస్తుంది. చివరకు ఆమె జీవితాన్నే బలి తీసుకుంటుంది. హషీమాబీలోని ఈ అబ్సెషన్‌ వెనుక ఏదో ఒక ‘ముసోఖిక్‌’ ప్రవృత్తి కారణభూతంగా ఉండిఉంటుంది. కాని, బుచ్చిబాబు దీనికొక తాత్త్విక అర్థం ఇవ్వడానికి ప్రయత్నించాడు. నిత్యకర్మ అనే చక్రంలో తిరిగిపోతున్న మనిషిని అందులోంచి తప్పించడానికి గాను, చక్రం ఆపేందుకు జరిగే ప్రయత్నానికి ప్రతీకగా ‘బీ’ని నిలుపుదామనుకొని, దానిని సక్రమంగా నిర్వహించలేక అభాసుపాలయ్యాడు. ఈ కథను బుచ్చిబాబు ఒక ‘సైకలాజికల్‌ స్టోరీ’గా ప్రారంభించి,మధ్యలో ఆ భావనను వదిలితాత్త్విక అర్థాలవైపు, భగవద్గీత వైపు పరిగెట్టాడు. అందువల్లనే ‘బీ’ కథ అసమగ్రంగా ఉన్నట్టు కనబడుతుంది. 
ఇక, – ”నేను’ అనబడే కథకుడికి ‘బీ’ పట్ల అంతటి కుతూహలం ఉండడానికి మాత్రం సమర్ధన చెప్పుకోవచ్చు. అతడి అంతరంగంలో ‘బీ’ కి ఉన్న ‘మసోఖిక్‌’ ప్రవృత్తి లాంటిదే ఉన్నది.తాను చేయదలచి చేయలేని పనుల్ని ‘బీ’ అవలీలగా చేస్తూండటంతో, అతడు ‘బీ’కి ఓ రకంగా మానసికంగా సన్నిహితుడయ్యాడు. – ఇక, ఈ కథలోని మారెన్నకు ‘బీ’ పై గల అభిప్రాయాన్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో దొరికిన ‘బీ’ తలవెంట్రుకను అతడు దాచుకోడాన్ని బట్టే అవగతం చేసుకోవచ్చు. ఇట్లాంటి స్టఫ్‌ ఫెటిషిజమ్‌ ”ముగింపు మీకు తెలుసు” కథలోని అటవీశాఖ ఉద్యోగి విషయంలో కూడా కనబడుతుంది. తను ప్రేమించిన అమ్మాయి తలవెంట్రుకను అతడు చేతి పిడికర్రలో దాచుకుంటాడు. ”ఆ రాలిన ఆకులు” కథలోని కాంతం తన మరిది పంపిన గులాబీ మొక్కను అప్యాయంగా పెంచడం, అది ఎప్పుడు పువ్వుపూస్తుందా, దాన్నెప్పుడు తల్లో పెట్టుకుందామా అని కలవరించడం, కూడా ఈ బాపతు అంతరంగ సంక్షోభానికి గుర్తుగా చెప్పుకోవచ్చు. ‘చివరకు మిగిలేది’ నవలలో దయానిధి అమృతం తలవెంట్రుకను దాచుకోవడాన్ని కూడా పాఠకులు ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవచ్చు. మనస్తత్వ శాస్త్రంలో తనకు గల పరిజ్ఞానాన్ని ఇలా పలు సందర్భాలలో బుచ్చిబాబు పాత్రల స్వరూపాన్ని తీర్చిదిద్దేందుకు ఉపయోగించుకున్నాడు. ”వీరేశలింగం ఏం చెయ్యాలి?” కథలోని మైథిలి, ”యువపాశం” కథలోని మాయల విషయంలో జరిగిన ‘సబ్లిమేషన్‌ యాక్టివిటీ’కి కూడా మనస్తత్వ శాస్త్రపరమైన వ్యాఖ్యానం చెయ్యవచ్చు. 
– ఇదంతా బాగానే ఉందిగాని, ”బీ” జీవిత కథను బుచ్చిబాబు మనకు చూపించిన తీరు అతని తాత్త్విక పరిజ్ఞానానికి గానీ, మనస్తత్వశాస్త్ర పరిజ్ఞానానికి గానీ సూచికగా లేదు. ”బీ” వింత ప్రవర్తన వెనుకగల విచిత్ర మనస్తత్వాన్ని గానీ, ఆ విచిత్ర ప్రవర్తన ప్రేరేపించే తాత్త్విక జిజ్ఞాసనుగానీ, ఆవిష్కరించడంలో రచయిత దాదాపుగా విఫలీ కృతుడయ్యాడు. మనం చెయ్యగలిగిందల్లా దేన్ని గురించీ పట్టించుకోకుండా ఉండడమే నన్న మారెన్న సూక్తి కథకు ‘నీతి’ కావడం ‘బీ’ కథను మరింత గందరగోళంలో పడేసింది. కథలో ఆలోచించవలసిన విషయం ఉండాలి, నిజమే ! కాని, దానికీ ఒక పరిమితి ఉంది. సోమర్‌సెట్‌మామ్‌ అన్నట్టు – పాఠకుణ్ణి గాలిలో వదిలెయ్యడం మంచిదే గాని, పాఠకుడితో బాటు రచయిత కూడా గాలిలో ఉండిపోకూడదు ! – 
ముందే చెప్పినట్టు, బుచ్చిబాబుకి మనిషి మనసులో జరిగే అలజడి వివరించడం చాలా అభిమానపాత్రమైన విషయం. ఇందుకుగాను అతను ‘చైతన్యస్రవంతి’ విధానాన్ని కూడా ఉపయోగించుకున్నాడు. పాశ్చాత్య సాహితీసీమలో జేమ్స్‌జాయిస్‌, వర్జీనియావుల్ఫ్‌ మార్సెల్‌ ఫ్రోస్ట్‌ ఇత్యాదులచే రచనలు చేయంచిన ‘స్ట్రీమ్‌ ఆఫ్‌ కాన్‌షస్‌నెస్‌’ రచనా శిల్పాన్ని తెలుగులో ప్రచారంలోకి తీసుకువచ్చినవారిలో బుచ్చిబాబు ప్రముఖుడు. అయితే – ఈ ధోరణిలో అతడు రాసిన ‘చైతన్య స్రవంతి’ అనే పేరుగల కథ కథగా రాణించలేదు. ఈ కథ చదివితే చైతన్య స్రవంతి విధానానికి ఉన్న కొద్దిపాటి ప్రయోజనం కూడా లేదనే భ్రాంతి కలుగుతుంది. 
కథకుడుగా బుచ్చిబాబును గురించి తెలిపే ఏ పరిశీలనలోనయినా అతని ”రసెల్‌కి అంకితమైన రెండుకథలు” గురించి చెప్పకపోతే – అది అసమగ్ర పరిశీలనే అవుతుందని నా అభిప్రాయం. పాశ్చాత్య తత్త్వశాస్త్రవేత్తలలో తీవ్రంగా వివాదానికి గురిఅయిన వారిలో బెర్‌ట్రాండ్‌ రసెల్‌ ఒకడు. ‘నీతి’ అనే పేరుతో ‘సంప్రదాయం’ అనే పేరుతో, సంఘంలో పేరుకుపోయి ఉన్న కుళ్ళును ఎదుర్కోడానికి రసెల్‌ చేసినంతటి పోరాటం సమకాలీన ప్రపంచంలో మరే తత్త్వశాస్త్రవేత్తా చేసి ఉండడు. ఆ మహనీయుడు రాసిన వఇనీబిశి | లీలిజిరిలిఖీలివ అనే గ్రంథంలోని కొన్ని భావాలను ప్రాతిపదికగా చేసుకుని బుచ్చిబాబు ‘మరమేకులు – చీరమడతలు’, ‘కొత్త నీరు – పాతవంతెన’ అనే రెండుకథల్ని రాశాడు. రసెల్‌ భావాల ప్రభావం తెలుగుసాహిత్యంపై ప్రత్యక్షంగాపడడం ఇదే మొదలు అని చెప్పవచ్చు.జ రసెల్‌ సిద్ధాంతాలలోని ”స్వేచ్ఛా ఆరాధన” సోమర్‌సెట్‌ మామ్‌ని ఆకట్టుకున్నట్టుగానే, బుచ్చిబాబును కూడా ఆకట్టుకుంది. 
‘మరమేకులు – చీరమడతలు’ కథలో బుచ్చిబాబు చెప్పదలుచుకున్నవి రెండు విషయాలు. ఒకటి – నీతికీ, అవినీతికీ, మధ్య ఉన్న దూరం.రెండోది – మరమేకులకు, చీర మడతలకు గల వ్యత్యాసం. ఈ కథలోని రవిప్రకాశం సౌందర్యాన్వేషణను వ్యభిచారం క్రిందా – వ్యభిచారాన్ని ఘోరమైన నేరం క్రిందా పరిగణించి లోకం అతనిని ఇబ్బంది పాలు చేయడం పట్ల మనం సానుభూతి చూపించవచ్చు. దైవభక్తుడుగా, నీతిమంతుడుగా చలామణీ అవుతూ గంగాధరం చేసే పరపీడనా కృత్యాలను మనం ద్వేషించవచ్చు. అయితే – అంతమాత్రాన వ్యాపార నిర్వహణలో రవిప్రకాశం అసమర్థను మనం సమర్థించలేం. వ్యాపారస్తులకు కావలసింది చిత్రకారులు కారు. వాళ్ళకు కావలసింది మరమేకులే ! చీరమడతలెందుకు ? – అదిన్నీ గాక, రవిప్రకాశం చిత్రం ఆర్ట్‌ఎగ్జిబిషన్‌లో ఉత్తమంగా ఎన్నిక చేయబడి – అటుతర్వాత గంగాధరం పార్టీవాళ్ళ ‘అవినీతి మార్కు’ ప్రచారం ద్వారా బహుమానార్హతను కోల్పోయిందనడం సమంజసంగా లేదు. 
ఇక, ‘కొత్త వంతెన – పాతనీరు’ కథలో రచయిత ఆలిమేలు జీవితానికి ఇచ్చిన ముగింపు, కథను గందరగోళంలో పడేసింది. నిజాయితీపరుడయిన ఇంజనీరు ప్రభాకరంపై పాఠకులకు కలిగే ‘సింపతీ’ కథ చివరికొచ్చేసరికి అలిమేలు చావు ఫలితంగా కరిగిపోతుంది. బుచ్చిబాబే అన్నట్టు ఈ కథలోని ఇంజనీరు ఉదంతం వెనుక భావం, మెదడు ఉండే – అతని ప్రేయసి అలిమేలు కథ వెనుక హృదయం, ఉద్రేకం ఉన్నాయి. బుచ్చిబాబుని మొదటినుండి ఆకట్టుకునేది ఈ రెండో విషయమే ! అందుచేతనే ఒక దోవలో బయలుదేరి మరొక దోవలో బయటకువచ్చాడు బుచ్చిబాబు. 
నిజానికి – ఏ కథకుణ్ణయినా ముందుగా కదలించేది హృదయానికి సంబంధించిన ఉద్రేకాలే ! దీనికున్న శక్తి మెదడుకు సంబంధించిన భావానికి లేదు. అందుచేత ఒక మంచి కథ మేథాపరంగా లోతయిన భావాల నెన్నింటినో వ్యక్తీకరించవచ్చు. కాని – ఒక గొప్ప భావం మంచికథకు ప్రాతిపదిక కాగలదని చెప్పలేము. 
ఏది ఏమైనా – ఈ వివరణలన్నీ కథ రాద్దామని కూర్చున్న కథకుడికి అవసరం లేదు. ఏదో ఒక భావం, లేదా ఏదో ఒక సంఘటన తనని కదిలించినప్పుడల్లా అతడు కథ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అతనిది నిరంతర కృషి. ఈ విషయాన్ని గురించి చెబుతూ అంటాడు బుచ్చిబాబు – ”పక్షి గూడు కట్టుకుంటుంది. దానికోసం కావాల్సిన ఆకు, అలము, గడ్డి, పుల్ల – ఎన్నెన్నో పోగుచేసుకొచ్చి గూడు కడుతుంది. అందులో గుడ్డుపెడుతుంది. అనుక్షణమూ ఏదో సేకరిస్తూ ఉంటాడు కథకుడు. పెద్దగాలికి గూడు పడి గ్రుడ్డు పగులుతుంది. మళ్ళా మరో కథ రాస్తాడు. తుఫానుకి ఆ చెట్టు కూలుతుంది. మరోచోటుకి పోతాడు. మనుషులను కూలని చెట్లుగా భ్రమించి, వారి హృదయంలో జొరబడి వారి ఆనందానికి కృషిచేసే జీవి కథకుడు” తన అల్పజీవితంలో బుచ్చిబాబు చేసిన అనల్ప కృషి ఇదే! కథా రచయితగా బుచ్చిబాబు దృక్పథం సరిపడనివారు ఉండవచ్చు. అతడి కథల్లో సామాజిక ప్రయోజనం కానరాదనే విమర్శ కూడా ఉండవచ్చు. కాని, సాహిత్య కృషిలో బుచ్చిబాబుకు గల నిజాయితీని మాత్రం శంకించనవసరం లేదు. మార్కెట్‌లో ఏ సరుకుకు గిరాకీ ఉందో పరిశీలించి – దానికనుగుణంగా సోషలిస్టు మార్కు కథల్నో, రొమాంటిక్‌ ధోరణి కథలనో, అతను రాయలేదు. ఇతరుల అభిప్రాయం ఏదన్నా గాని – తన హృదయాన్ని కదిలించి, ఉద్వేగం కలిగించిన విషయాల గురించే అతను రాశాడు. బుచ్చిబాబు అంటాడు – ”నిజాయితీ, ఉద్వేగము, ఈ రెండూ కథకుడి ఆయువుపట్లు. ఒకటి – గుండె, రెండవది నాడి” అని. కథకుడిగా బుచ్చిబాబు మేనిఫెస్టో ఇది. అతని కథలు ఇప్పటికీ – బహుశా ఎప్పటికీ – తమ స్థానాన్ని నిలబెట్టుకోడానికి గల కారణం ఇదేననుకుంటాను. 



1 కామెంట్‌: