2, జనవరి 2024, మంగళవారం


శ్రీమద్రామాయణము || ఉత్తర కాండము

మొదటి సర్గ.(1)


రామ రావణ యుద్ధంలో రాముడు రావణుని సంహరించాడు. రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్యకు వచ్చాడు. భరతుడు అప్పటి దాకా తాను పాలిస్తున్న అయోధ్యను రామునికి తిరిగి

సమర్పించాడు. రాముడు అయోధ్యారాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. జనరంజకంగా రాజ్యపాలన చేస్తున్నాడు.

రాముని అభినందించడానికి ఎందరో మహామునులు రాముడి ఆస్థానానికి వచ్చారు. తూర్పుదిక్కు నుండి కౌశికుడు, గార్యుడు, గాలవుడు, కణ్వుడు మొదలగు మహామునులు వచ్చారు.

అలాగే దక్షిణ ప్రాంతము నుండి ఆత్రేయుడు, నముచి, ప్రముచి,

అగస్త్యుడు, సుముఖుడు, విముఖుడు వచ్చారు. వారందరికీ అగస్త్యుడు పెద్దగాఉన్నాడు. పడమటి దిక్కునుండి పృషంగుడు, కవషి, ధౌమ్యుడు, కౌషేయుడు మొదలగు మహా మునులు తమ తమ శిష్యులను వెంట పెట్టుకొని రాముని ఆస్థానమునకు వచ్చారు. ఉత్తర ప్రాంతము నుండి వసిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అనబడే సప్తఋషులు అక్కడకు వచ్చారు. వారందరూ రాముని వద్దకు వచ్చి ద్వార పాలకుల ద్వారా తమ రాకను గురించి రామునికి తెలియ జేసారు. రాముడు వెంటనే వారినందరినీ లోపలకు ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు. రాముడు ఆ ఋషులనందరినీ సాదరంగా ఆహ్వానించాడు. వారికి అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. వారిని ఉచితములైన ఆసనముల మీద ఆసీనులను చేసాడు. ఋషులందరూ సుఖాసీనులు అయిన తరువాత రాముడు ఆ ఋషుల క్షేమములు అడిగి తెలుసుకున్నాడు. వారు రామునితో ఇలా అన్నారు. “రామా! నీ పరిపాలనలో మేము అందరమూ క్షేమముగా ఉన్నాము. నీవు రాక్షస సంహారము చేసి ఋషులకు మునులకు ఎంతో మేలు చేసావు. లోకకంటకుడైన రావణుని చంపావు. ముల్లోకములను జయించ సమర్థుడవైన నీకు ఆ రావణుని చంపడం అతి తేలికైన పని. నీవు ఒక్క రావణునే కాదు, ప్రహస్తుని, విరూపాక్షుని, మహోదరుని, అకంపనుని, త్రిశిరస్సుని, అతికాయుని, దేవాంతక, నరాంతకులను, కుంభనికుంభులను, యుద్ధోన్మత్తుని, మత్తుని, యజ్ఞకోపుని, ధూమ్రాక్షుని ఇంకా ఘోరకృత్యములు చేయు అనేక మంది రాక్షసులను కూడా సంహరించావు. వారంతా మునులకు ఋషులకు ఎంతో అపకారము చేసినవారు. వారంటే దేవతలు కూడా భయపడతారు. అటువంటి వారందరినీ చంపి లోకానికి ఎంతో మేలుచేసావు. రామా! రావణుని తమ్ముడు కుంభకర్ణుడు సామాన్యుడా! అటువంటి వాడిని నీవు తుదముట్టించావు. నీ పరాక్రమము అత్యంత శ్లాఘనీయము. రావణ కుమారుడు ఇంద్రజిత్తు సాక్షాత్తు ఇంద్రునే జయించిన వాడు. అటువంటి వాడిని లక్ష్మణుని చేత చంపించావు. ఎవరి చేతకూడా చంపబడని ఇంద్రజిత్తు మరణించాడని వార్త విని మేమంతా ఎంతో ఆశ్చర్యపోయాము. రావణుని, కుంభకర్ణుని, ఇతర రాక్షస వీరులను చంపడం అంత గొప్ప పని కాదు. కాని ఇంద్రజిత్తును చంపడం మీ అదృష్టమే అనుకోవాలి. ఇంద్రజిత్తును చంపి విజయం పొందడం సామాన్యమైన పని కాదు. ఎందుకంటే యుద్ధములో ఇంద్రజిత్తును ఎవరూ చంపలేరు. అందుకని

ఇంద్రజిత్తు మరణం మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఓ రామా! నీవు లోకంటకులైన రాక్షసులనందరినీ చంపి రావణ సంహారము చేసి సీతతో మాకు అభయాన్ని ప్రసాదించావు. కూడా అయోధ్యకు తిరిగి వచ్చి, రాజ్యపట్టాభిషిక్తుడవైన నిన్ను చూడటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. పదునాలుగు సంవత్సరముల తరువాత నిన్ను నీ భార్యతోనూ, నీ సోదరులతోనూ, నీ తల్లులతోనూ చూడటం మాకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది." అని ఆ మునులు రాముని ఎంతో శ్లాఘించారు. వారి మాటలు విన్న రాముడు చేతులు జోడించి వారికి

నమస్కరించి ఇలా అన్నాడు. “ఓ మహామునులారా! రావణుడు,

కుంభకర్ణుడు, ప్రహస్తుడు మొదలగు వారు మహావీరులు. వారందరినీ

కాదని మీరు ఇంద్రజిత్తును మాత్రమే పొగుడుతున్నారు. కారణం ఏమి? ఎందుకంటే మహోదరుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మత్తుడు, ఉన్మత్తుడు, దేవాంతక, నరాంతకులు, అతికాయుడు, త్రిశిరస్సు, ధూమ్రాక్షుడు, తక్కువేం కాదు. వారందరూ మహా బలవంతులు. పరాక్రమవంతులు. యుద్ధవిశారదులు. అటువంటి వారిని వదిలిపెట్టి కేవలం ఇంద్రజిత్తును మాత్రమే ఎందుకు ప్రశంసిస్తున్నారు? ఇంతకూ ఈ ఇంద్రజిత్తు ఎవరు? అతనికి ఆ పేరు ఎలా వచ్చింది? అతని బల పరాక్రమములు ఎటువంటివి? అతడు ఎందుకని రావణునికంటే కుంభకర్ణునికంటే ఇతర రాక్షస వీరుల కంటే గొప్పవాడయ్యాడు? అతడు దేవేంద్రుని ఎలా జయించగలిగాడు? అతడు ఎవరి వలన వరములు పొందాడు? తండ్రి కన్నా కుమారుడు ఎలా బలవంతుడు అయ్యాడు? దయచేసి నాకు తెలియజేయండి." అని అడిగాడు రాముడు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము మొదటి సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్









శ్రీమద్రామాయణము ||ఉత్తరకాండము

ముప్పదియవ సర్గ. (30)


దేవతా గణము లన్నీ పరుగు పరుగున బ్రహ్మ దేవుని వద్దకు

వెళ్లాయి. దేవతా గణములందరూ జరిగిన సంగతి అంతా

బ్రహ్మదేవునికి చెప్పారు. ప్రస్తుతము ఇంద్రుడు రావణుని వద్ద లంకలో

బందీగా ఉన్నాడు అని విన్నవించుకున్నారు. దేవతాగణములను

వెంటబెట్టుకొని బ్రహ్మదేవుడు లంకానగరానికి వచ్చాడు. తన

పుత్రులతోనూ సోదరులతోనూ కూర్చుని ఉన్న రావణుని చూచాడు.

రావణునితోఇలా అన్నాడు. “కుమారా! రావణా! దేవతలు రాక్షసుల యుద్ధంలో నీ కుమారుడు మేఘనాధుడు తన అసమాన పరాక్రమాన్ని చూచాడు. నాకు చాలా సంతోషం అయింది. అటువంటి పరాక్రమవంతుడు నీకు కుమారుడిగా జన్మించడంతో నీ జన్మధన్యము అయింది. వీరత్వంలో నీ కుమారుడు నిన్ను మించిపోయాడు. నీవు కూడా సామాన్యుడికి కావు. మూడులోకములను జయించావు. త్రిలోకాధిపత్యము పొందుతాను అన్న నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ముల్లోకములో కెల్లా అత్యంత బలవంతుడు, వీర్యవంతుడు, ఇంద్రునే జయించి బంధించిన నీ కుమారుడు మేఘనాధుడు ఈ రోజు నుండి ఇంద్రజిత్తు అనే పేరుతో ప్రసిద్ధుడు అవుతాడు. అతని సాయముతోనే

కదా నీవు దేవతలను జయించగలిగావు. కాని ఒక్క మాట! ఇంద్రుని 

బంధించడం ధర్మం కాదు. అతనిని వెంటనే విడిచిపెట్టు. ఇంద్రుని విడిచి పెట్టడానికి దేవతలు నీకు ఏమి ఇవ్వాలో అడుగు." అని అన్నాడు బ్రహ్మ. ఇంద్రజిత్తు బ్రహ్మదేవునికి నమస్కరించి "దేవా! నేను

ఇంద్రుడిని వదిలిపెట్టాలంటే నాకు చావులేకుండా వరం ప్రసాదించు.”

అని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. “కుమారా!

పుట్టినవాడు చావక తప్పదు. ఇది కాలధర్మము. ఏ ప్రాణి కూడా

కలకాలము మరణం లేకుండా జీవించలేదు. మీరే కాదు మానవులకు,

జంతువులకు కూడా మరణం లేకుండా జీవించడం దుర్లభం. కాబట్టి

నీకు మరణం లేకుండా వరం ప్రసాదించడం కుదరదు.” అని చెప్పాడు

బ్రహ్మ. అప్పుడు మేఘనాధుడు ఇలా అన్నాడు. “దేవా! నేను

ఇంద్రుడిని విడిచిపెట్టాలంటే నాకు మరొక వరము ప్రసాదించండి.

నాకు ఒక దివ్య రథమును ఇవ్వండి. నేను యుద్ధమునకు బయలు

దేరే ముందు నాకు విజయము, శత్రువులకు వినాశము కలగడానికి

హెూమం చేస్తాను. నేను ఆ హెూమం పూర్తి చేసి కానీ యుద్ధ

రంగములో ప్రవేశించను. అప్పుడు ఆ అగ్ని గుండము నుండి ఒక

దివ్యమైన రథము నా ముందు ప్రత్యక్షం కావాలి. నేను ఆ రథము ఎక్కి యుద్ధం చేస్తాను. నేను ఆ రథము మీద ఉన్నంత వరకూ నాకు

మరణం లేకుండా వరం ప్రసాదించండి. ఏ కారణం చేతనైనా నేను

హెూమం పూర్తి కాకుండా యుద్ధరంగంలో ప్రవేశిస్తే, నాకు మరణం

రావచ్చు. కనీసం ఈ వరం అన్నా నాకు ఇవ్వండి. లేక పోతే నేను

ఇంద్రుడిని విడిచిపెట్టను. ఓ బ్రహ్మదేవా! ఋషులు, మునులు అందరూ తపస్సుచేసి అమరత్వమును కోరుకుంటారు. కాని నేను నా వీరత్వమును చూపి, నాకు అమరత్వము సిద్ధింపజేయమని

కోరుతున్నాను. ” అనిఅన్నాడు మేఘనాధుడు. " మేఘనాధుడు కోరిన కోరికకు బహ్మదేవుడు ఎలాంటి అభ్యంతరము చెప్పలేదు. “నీవు కోరిన కోరిక సిద్ధిస్తుంది” అని దీవించాడు. మేఘనాధుడు ఇంద్రుని విడిచిపెట్టాడు. ఇంద్రుని తీసుకొని బ్రహ్మదేవుడు, దేవతాగణములు స్వర్గలోకమునకు వెళ్లిపోయారు.” రామా! మేఘనాధునికి ఇంద్రజిత్తు అనే పేరు ఇలా వచ్చింది.” అనిఅగస్త్యుడు రామునికి మేఘనాధునిగురించి వివరించాడు. అగస్త్యుడు ఇంకా ఇలాచెప్పసాగాడు. “రామా! ఇంద్రుడు స్వర్గలోకము వెళ్లిన తరువాత అతని ముఖంలో తేజస్సు అంతా తగ్గిపోయింది.. ఇంద్రుడు ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. దీర్ఘాలోచనలో మునిగి ఉన్న దేవేంద్రుని చూచి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. “ఇంద్రా! నీవే చేయకూడని పని ఏదో చేసావు? ఎందుకు చేసావు? నేను ఒకే వర్ణము, ఒకే భాష, ఒకే రూపము కల ప్రజలను సృష్టించాను. వారిలో ఎట్టి బేధభావము లేదు. నేను ఆ ప్రజలను గూర్చి ఆలోచిస్తున్నాను. అప్పుడు నేను మానవుని ప్రతి అవయవము నుండి శ్రేష్టమైన భాగమును తీసి, వాటితో ఒక స్త్రీని సృష్టిచేసాను. ఆ స్త్రీపేరు అహల్య. హలము అంటే వికారము అయినది. వికారములు

కలది. ఈమె ఎలాంటి వికారములు లేనిది కాబట్టి ఆమె అహల్య

అయింది.

 (హలము అంటే నాగలి. అది వికారంగాఉంటుంది. పైకి ఒక

కర్ర లేచి ఉంటుంది. దానిని మేడి అంటారు. దానిని పట్టుకొని పొలం

దున్నుతాడు రైతు. కిందికి ఒక కర్రులాగా ఉంటుంది. అదిభూమిలోకి

చొచ్చుకుపోతుంది. ముందుకు ఒక పొడుగాటి కర్ర ఉంటుంది. దాని

కొసన కాడి కడతారు. ఆ కాడికి ఎద్దులు కడతారు. దీనిని నాగలి,

అరక, హలము అంటారు.)

ఎలాంటి హల్యము లేనిది కాబట్టి ఆమెకు అహల్య అనే పేరు

సార్థకము అయింది. అందుకే ఆమెకు ఆ పేరు పెట్టాను. ఆమెను

ఎవరికి ఇచ్చి వివాహము చెయ్యాలా అని ఆలోచించాను. అప్పుడు

“నేను ఇంద్రుడిని. ఆమెను నాకు ఇచ్చి వివాహం చెయ్యండి" అని నీవు నన్ను అడిగావు. కాని అప్పటికే అహల్యను గౌతమునికి పరిచర్యలు చేయడానికి ఆయన వద్ద ఉంచాను. నేను పెట్టిన గడువు తీరిపోగానే గౌతముడు అహల్యను తిరిగి నాకు అప్పగించాడు. గౌతముని నిగ్రహ శక్తిని, అతని మానసిక బలాన్ని పరీక్షించి, అహల్యకు అతనే తగిన వరుడని నిర్ణయించాను. అహల్యను గౌతమునికి ఇచ్చి వివాహము చేసాను.అహల్య నీకు దక్కలేదని నీవు నిరుత్సాహపడ్డావు. కాని నీవు అహల్య మీద ఉన్న కోరికను చంపుకోలేకపోయావు. నీవు గౌతముని

ఆశ్రమమునకు వెళ్లి ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేసావు. కామంతో

ఆమెతో రతిక్రీడలు సలిపావు. నువ్వు తన ఆశ్రమంలో ఉండగా

గౌతముడు నిన్ను చూచాడు. నీవు చేసిన అకృత్యానికి గౌతముడు

నిన్ను శపించాడు. “ఓ ఇంద్రా! నేను ఇంటలేని సమయంలో నీవు నా

భార్యను అనుభవించావు. ఆ పాపానికి ప్రతిఫలంగా నీవు నీ

శత్రువులచేత బంధింపబడతావు. ఓ ఇంద్రా!ముల్లోకములను

పాలిస్తున్నావు. నిన్ను చూచి లోకములలో ప్రజలు కూడా నీ పాపపు

పనులను అనుసరిస్తారు. అందుకని నీ పాలనలో ఉన్న ప్రజలు ఏ

పాపం చేసినా అందులో సగభాగం నీకు సంక్రమిస్తుంది. నీకు ఈ

ఇంద్రపదవి స్థిరంగా ఉండదు. నీవు రాక్షసులు, దైత్యులు, అసురుల

భయంతో అనుక్షణం భయం భయంగా బతుకుతావు. నీవే కాదు. నీ

తరువాత ఇంద్రపదవిని ఎవరు అధిష్టించినా ఎవరూ ఆ పదవిలో

స్థిరంగా ఉండరు. ఇది నాశాపము" అని శపించాడు. తరువాత గౌతముడు అహల్యను చూచి ఇలా అన్నాడు. “ఓసి దుర్మార్గురాలా! నీవు తక్షణమే నా ఆశ్రమమునుండివెళ్లిపో, నీకు ఉన్న అందం చందం, రూపం యౌవనం వీటితో మదించి నీవు చెడు దారిలో నడిచావు. నీవే కాదు నీ కన్నా అందమైన వాళ్లు యౌవనంలో ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కాని వాళ్లు నీ మాదిరి చెడుదారి తొక్కలేదు. ఈ రోజునుండి మూడులోకాల్లో ఉన్న జనులు నీ కన్నా అందంగా, మంచి రూపంతో, యౌవనంతో విరాజిల్లుతారు.” అని అన్నాడు. అహల్య గౌతమునితో ఇలా అంది. “ఓ మహర్షీ! నేను ఏ తప్పూ చేయలేదు. ఇంద్రుడు తమరు ఇంటలేని సమయమున తమరి రూపంలో వచ్చి నన్ను అనుభవించాడు. ఇందులో నా తప్పు ఏముంది. నన్ను క్షమించండి" అని ప్రాధేయపడింది. అప్పుడు గౌతముడు ఇలా అన్నాడు. “రాబోవు యుగంలో ఇక్ష్వాకు వంశంలో రాముడు అనే పేరుతో ఒక క్షత్రియుడు జన్మిస్తాడు. ఆయన ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అతడు ఒక బ్రాహ్మణుని పని మీద ఇక్కడకు వస్తాడు. రాముని చూడగానే నీవు పవిత్రురాలవు అవుతావు. నీవుచేసి పాపాన్ని ప్రక్షాళన చేయడానికి రాముడే సమర్ధుడు. రాముడు నీ వద్దకు వచ్చినపుడు నీవు రామునికి ఆతిథ్యము ఇచ్చి సత్కరించు. ఆయన నిన్ను కరుణిస్తాడు. తరువాత నీవు నా దగ్గరకు వచ్చి నాతో ఉండవచ్చును." అని పలికి గౌతముడు ఆశ్రమమునకు వెళ్లిపోయాడు. తరువాత అహల్య చాలా కాలము తపస్సు చేసింది.

ఓ ఇంద్రా! నాడు నీకు గౌతముడు ఇచ్చిన శాపము ఈ నాడు నీకు ఇలా పరిణమించింది. నీవు అహల్య పట్ల చేసిన అపచారమును గుర్తుకు తెచ్చుకో! ఆ పాపకారణము చేతనే నీవు రాక్షసునిచేత బంధింపబడ్డావు. నీవు వెంటనే విష్ణుయాగము చెయ్యి. నీకు ఆ పాపము నుండి విముక్తి లభిస్తుంది. తరువాత స్వర్గమునకు

వెళ్లు. నీ కుమారుడు జయంతుడు క్షేమంగా ఉన్నాడు. జయంతుని

తాతగారు జయంతుని తీసుకొని పోయి దాచిపెట్టాడు. అతడు

క్షేమంగా నీ వద్దకు వస్తాడు." అని అన్నాడు. తరువాత బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్లిపోయాడు. తరువాత ఇంద్రుడు విష్ణుయాగము

చేసి స్వర్గలోకమునకు వెళ్లిపోయాడు.


(ఈ కధ మనకు కొత్తగా ఉంది కదూ! బాలకాండలో ఉన్న

కధకన్నా భిన్నంగా ఉంది. మనకు ఈ ఉత్తర కాండ కన్నా వాల్మీకి చేత

రచింపబడిన బాలకాండయే ప్రమాణము.)


ఓ రామా! నీకు ఇంద్రజిత్తు గురించి అతని బలపరాక్రమముల గురించి వివరంగా చెప్పాను. అతడు సాక్షాత్తు ఇంద్రునే జయించి బంధించాడు. ఇతరులు ఒక లెక్కా!" అని అన్నాడు అగస్త్యుడు.

అగస్త్యుడు చెప్పిన మాటలు విన్న రాముడు, అతని తమ్ములు, వానర ప్రముఖులు ఎంతో ఆశ్చర్యపోయారు. విభీషణుడు కలుగచేసుకొని “మునీంద్రా! మీరుచెబుతుంటే నా చిన్ననాటి స్మృతులు

గుర్తుకువస్తున్నాయి.” అని అన్నాడు. “రామా! రావణుని జన్మ వృత్తాంతము, అతని కుమారుడు మేఘనాధుని జన్మ వృత్తాంతము అతని బలపరాక్రముల గురించి వివరంగా చెప్పాను." అని అన్నాడు అగస్త్యుడు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పదియవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్


శ్రీమద్రామాయణము ||ఉత్తరకాండము

ముప్పది ఒకటవ సర్గ. (31)


తిరిగే కాలూ తిట్టే నోరూ ఊరుకుండవు అని లోకోక్తి.

యుద్ధం యుద్ధం అంటే తిరిగే రావణునికి ఎవరితోనో ఒకరితో

కయ్యానికి కాలుదువ్వనిది నిద్రపట్టడం లేదు. దేవలోకమును జయించి ఇంద్రుడిని బందీగా పట్టుకున్న తరువాత ఆ దురద మరీ ఎక్కువ అయింది. కాని రావణుని విపరీతమైన యుద్ధకాంక్ష గురించి విన్న రామునికి ఒక సందేహం వచ్చింది. అగస్త్యునితో ఇలా అన్నాడు.

“మునీంద్రా! దుర్మార్గుడు, క్రూరుడు అయిన రావణుడు ఈ ప్రకారం యుద్ధం పేరుతో పీడిస్తుంటే అతనిని అడ్డుకునేవాళ్లు అతని

యుద్ధోన్మాదానికి అడ్డుకట్ట వేసేవాళ్లు క్షత్రియులు కానీ, క్షత్రియేతరులు

కానీ, ముల్లోకాలలో ఎవరూ లేరా! ఎవరికీ పరాక్రమమూ వీరత్వమూ

లేవా! ఎవరికీ రావణునితో సమానంగా అస్త్ర శస్త్ర విద్యానైపుణ్యము

లేదా! ఎవరికీ రావణునికి ఉన్నంత సైనిక బలం లేదా! లేక ఆ రోజుల్లో

క్షత్రియులందరూ భోగలాలసులై తమ పరాక్రమమును వీరత్వమును

మరిచిపోయి, అస్త్ర శస్త్ర విద్యలు నేర్చుకోవడంలో శ్రద్ధ చూపలేదా! '

అని అడిగాడు. "“ఎందుకు లేరు రామా! ఆరోజుల్లో కూడా వీరాధి వీరులు, అమితమైన పరాక్రమవంతులు, యుద్ధ విద్యలో ఆరితేరిన వారు ఉన్నారు. కొంతమందికి కాలం కలిసిరాక ఓడిపోతే, మరి కొందరు మనకెందుకులే అని నిర్లిప్తంగా రావణునికి లొంగిపోయారు. దేనికైనా సమయం రావాలి కదా! యుద్ధోన్మాదంతో విర్రవీగుతున్న రావణునికి కూడా పతనం ప్రారంభం అయింది. అందుకనే రావణుడు నర్మదా నదీ తీరంలో ఉన్న మాహిష్మతీనగరాన్ని పరిపాలించే కార్తవీర్యార్జుని మీదికి యుద్ధానికి వెళ్లాడు. కార్తవీర్యార్జునుని అమాత్యులను పిలిచి “నేను రావణుడను. మీ రాజు మీదికి యుద్ధానికి వచ్చాను అని చెప్పండి. నాతో యుద్ధం చేస్తాడా లేక ఓడిపోయానని ఒప్పుకొని నాకు దాసోహం అంటాడా. " అని హుంకరించాడు రావణుడు. దానికి అమాత్యులు “కార్తవీర్యార్జునుడు నగరంలో లేడు. విహారానికి వెళ్లాడు” అని చెప్పారు. “మీరాజు ఎక్కడ ఉన్నాడో చెప్పండి" అని అడిగాడు. వారు “నర్మదానదీ

తీరానికి వెళ్లారు" అని చెప్పారు. రావణుడు వెంటనే వింధ్యపర్వతముల వద్దకు వెళ్లాడు. విధ్యపర్వత ప్రాంతములో విహరిస్తూ ఆ పర్వతము అందాలను ఆస్వాదిస్తున్నాడు. రావణుడు నర్మదా నదీ తీరాన. తన మంత్రులతో సమావేశం అయ్యాడు. తన మంత్రులను చూచి ఇలా అన్నాడు. "చూచారా! ఇప్పుడు మధ్యాహ్నం అయింది. సూర్యుడు తన ప్రతాపం చూపించాలి. కానీ నేను ఇక్కడ ఉన్నానని తెలిసి సూర్యుడు భయపడి తన తాపం చూపడం లేదు. గాలికూడా నాకు భయపడి చల్లగా వీస్తూ ఉంది. ఈ నర్మదా నది కూడా ఉధృతంగా కాకుండా భయపడుతూ భయపడుతూ మెల్ల మెల్లగా ప్రవహిస్తూ ఉంది. మీరు కూడా ఈ నర్మగా నదిలో దిగి హాయిగా జలకాలాడండి. నేను కూడా తనివిదీరా స్నానం చేస్తాను. తరువాత మనతో తెచ్చిన స్వర్ణ లింగమునకు అభిషేకాదులు చేసి శివునికి పూజలు చేస్తాను" అని పలికాడు రావణుడు. వెంటనే రావణుని సేనాధిపతులు అయిన శుకుడు, సారణుడు, ప్రహస్తుడు, మహోదరుడు, ధూమ్రాక్షుడు అందరూ నర్మదా నదిలో దిగిస్నానాలు చేస్తున్నారు. రావణుడు కూడా నర్మదా నదిలో దిగి పుణ్యస్నానం చేసాడు. రావణుని అనుచరులు శివపూజకై పుష్పములను

తీసుకొని వచ్చారు. రావణుడు శుభ్రమైన వస్త్రములను ధరించాడు.

తనలో ఎల్లప్పుడూ ఉండే బంగారు శివలింగమును నర్మదా నదీ

తీరంలో ప్రతిష్ఠించాడు. ఆ శివలింగమునకు పూజలు చేసాడు. శివుని

ఎదుట సామగానమును ఆలపించాడు. నృత్యము కూడా చేసాడు. 

తన పూజ,నృత్య,గానములతో పరమశివుని తృప్తిపరిచాడు రావణుడు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పదిటవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్


శ్రీమద్రామాయణము||ఉత్తర కాండము

ముప్పదిరెండవ సర్గ. (32)


రావణుడు శివలింగమును పూలతో అర్చిస్తున్న నర్మదా

నదీతీర సమీపంలోనే కార్తవీర్యార్జునుడు తన భార్యలతో నర్మదా నదిలో దిగి జలక్రీడలు ఆడుతున్నాడు. ఈ సంగతి రావణునికి తెలియదు. రావణుడు నర్మదానది ఒడ్డున శివుని పూజిస్తున్న సంగతి కార్తవీర్యునికి తెలియదా. ఆ సమయంలో కార్తవీర్యుడు తన వేయి చేతులను చాచి నర్మదానదీ ప్రవాహమును నిరోధించాడు. అప్పుడు నర్మదా నదిలో ఉన్న నీరు, నీటి వాలుకు ఎదురుగా ప్రవహించడం మొదలెట్టింది. అప్పుడు రావణుడు ఉన్న ప్రదేశంలో నదీజలాలు ఎదురు తన్ని గట్టు మీదికి ప్రవహించాయి. ఆ ప్రవాహ వేగమునకు రావణుడు ప్రతిష్టించిన శివలింగము, లింగము మీదవేసిన పూలు అన్నీ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. రావణుడు ఆశ్చర్యపోయాడు. నర్మదా నదీ వాలుగా కాకుండా ఎదురు ప్రవహించడం గమనించాడు. వెంటనే తన మంత్రులైన

శుకుడు సారణుని పిలిచి ఆ విపరీతమునకు కారణమేమో

తెలుసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. శుక సారణులు ఆకాశంలోకి ఎగిరి నదీ తీరంవెంట చూసుకుంటూ పోతున్నారు. వారికి నర్మదా నదిలో దిగి తన భార్యలతో స్నానం చేస్తున్న కార్తవీర్యుడు కనపడ్డాడు. అతడు తనవేయి చేతులు అడ్డుపెట్టి నదీ ప్రవాహాన్ని ఆపుచేయడం చూచారు. వెంటనే వెనుకకు మరలి వచ్చి ఆ విషయమును రావణునికి చెప్పారు. “రాక్షసరాజా! ఎవరో తన బాహువులను అడ్డుపెట్టి నదీ ప్రవాహాన్ని ఆపుతున్నాడు. తన భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు." అని చెప్పారు. రావణునికి విషయం అర్థం అయింది. తాను ఎవరి కోసం వెదుకుతున్నాడో ఆ కార్తవీర్యార్జునుడు అతనే అని తెలుసుకున్నాడు. వెదుకుతున్న తీగ కాలికి తగిలినట్టు కార్తవీర్యార్జునుడు తనకు సమీపంలో ఉన్నాడని తెలుసుకున్న రావణుడు వెంటనే అతని మీదికి యుద్ధానికి వెళ్లాడు. రావణుని మంత్రులు సేనాధి పతులు అతనిని అనుసరించారు. నర్మదా నదిలో స్త్రీల మధ్యలో జలక్రీడలు ఆడుతున్న కార్తవీర్యార్జునుని చూచాడు రావణుడు. రావణుని కోపం మిన్నుముట్టింది. నది ఒడ్డున నిలిచిఉన్న కార్తవీర్యుని అమాత్యులతో “రావణుడు యుద్ధం కోరుతూ వచ్చి ఉన్నాడు అని మీ రాజుకు చెప్పండి” అని ఆదేశించాడు. ఆ మాటలు విన్న అమాత్యులు రావణుని చూచి “రాజా! కార్తవీర్యుడు మదిరా పాన మత్తులో, నదీజలాలలో స్త్రీలతో క్రీడించుచున్నాడు. యుద్ధం చేయడానికి మంచి సమయాన్ని ఎంచుకున్నావే! స్త్రీలతో కేళీవిలాసాలతో తేలియాడుతున్న వారు యుద్ధానికి సిద్ధంగాఉంటారా! నీవూ ఒక రాజువే కదా! ఆ మాత్రం తెలియదా నీకు! నీకు అంతగా మా రాజుతో యుద్ధం చేయాలని ఆసక్తిగా ఉంటే కాస్త ఓపిక పట్టు. ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపో. సుఖాలన్నీ అనుభవించు. రేపు వచ్చి మా రాజుతో యుద్ధం చెయ్యి. అయినా నీకు అంత తొందరగా ఉంటే మేము ఉన్నాము కదా! ముందు మాతో యుద్ధం చేసి గెలువు. తరువాత మా రాజు గారితో చేయవచ్చును. నీలాంటి వీరుడితో యుద్ధం చేయడానికి మేము చాలు" అని పరిహాసంగా అన్నారు. యుద్ధం ఆమాటలకు రావణుని అమాత్యులకు కోపం వచ్చింది. కార్తవీర్యుని అమాత్యుల మీద పడి, చంపి, తినేసారు. ఇంతలో కార్తవీర్యుని సేనలు రావణుని అనుచరులను చుట్టుముట్టారు. ఇరుపక్షములకు యుద్ధం మొదలయింది. శుకుడు, సారణుడు తమ మాయాయుద్ధంతో కార్తవీర్యుని సేనలను సమూలంగా నాశనం చేసారు. ఈ గందరగోళం అంతా కార్తవీర్యార్జునుడు స్నానం చేసే చోటికి వినపడుతూ ఉంది. ఇంతలో కొంతమంది సేనానాయకులు పరుగు పరుగున వెళ్లి కార్తవీర్యునికి జరిగిన విషయం తెలియజేసారు. కార్తవీర్యుడు జలములలో నుండి బయటకు వచ్చాడు. జరిగిన విషయం తెలుసుకున్నాడు. తాను స్త్రీలతో క్రీడిస్తున్న సమయంలో యుద్ధానికి పిలిచిన మూర్ఖుడి మీద కోపంతో మండి పడ్డాడు. తన గద తీసుకున్నాడు. రాక్షస సేనలలోకి చొచ్చుకుపోయాడు. ప్రహస్తుడు ఒక

ముసలంతో కార్తవీర్యుని అడ్డుకున్నాడు. తన ముసలాన్ని కార్తవీర్యుని మీదికి విసిరాడు. ఆ ముసలము అగ్ని కణాలను విరజిమ్ముతూ కార్తవీర్యుని మీదికి వేగంగా దూసుకుపోయింది. కార్తవీర్యుడు ఏమాత్రం తొటుపడకుండా ఆ ముసలమును తన గదతో మోదాడు. ఆ ముసలం విరిగి కిందపడింది. తన గదను పైకెత్తి ప్రహస్తుని తల మీద ఆ గదతో మోదాడు. ఆ దెబ్బకు ప్రహస్తుడు మొదలు నరికిన చెట్టు వలె నేలకూలాడు. తమ నాయకుడు ప్రహస్తుడు పడిపోగానే శుకుడు, సారణుడు,మహోదరుడు, ధూమ్రాక్షుడు పారిపోయారు. ఇది చూచి రావణుడు కార్తవీర్యుడి మీదికి దూకాడు. రావణుడికి కార్తవీర్యుడికి ఘోరంగాయుద్ధం జరిగింది. ఇద్దరూ గదలతో కొట్టుకుంటున్నారు. వారి గదలు ఒకదానితో ఒకటి కొట్టుకోడం వలన పుట్టే ధ్వనులతో నలుదిక్కులు మారుమోగిపోయాయి. రావణుడు కార్తవీర్యుడు తమ గదలతో ఒకరి వక్షస్థలము మీద ఒకరు మోదుకుంటున్నారు. రెండు ఏనుగులు కుమ్ములాడుకుంటున్నట్టు కొట్టుకుంటున్నారు. కార్తవీర్యుడు తన బలాన్ని అంతా కూడగట్టుకొని తన గదతో రావణుని వక్షస్థలము మీద గట్టిగా మోదాడు. బ్రహ్మవరప్రసాది అయిన రావణుని ఆ గద ఏమీ చేయలేకపోయింది.. రెండుగా విరిగి కిందపడింది. కాని కార్తవీర్యుని గదాఘాతానికి రావణుడువెనక్కుతూలాడు. పెద్దగా అరుస్తూ కిందపడ్డాడు. ఇదే సందని

కార్తవీర్యుడు ఎగిరి రావణుని మీదికి దూకాడు. రావణుని కంఠం

పట్టుకున్నాడు. తన బాహువులతో రావణుని బంధించాడు. రావణుని కార్తవీర్యుడు గట్టిగా తాళ్లతో కట్టేసాడు. పెద్దగా గర్జించాడు.

ఇంతలో ప్రహస్తుడు స్పృహలోకి వచ్చాడు. రావణుడు కార్తవీర్యుని చేతిలో బందీ కావడం చూచాడు. వెంటనే ప్రహస్తుడు కార్తవీర్యుని మీదికి వెళ్లాడు. ప్రహస్తుడు స్పృహలోకి రావడం చూచిన రాక్షస వీరులు ప్రహస్తుని వెంట కార్తవీర్యుని మీదికి ఉరికారు. రాక్షస

వీరులు కార్తవీర్యుని చుట్టుముట్టారు. వాడి అయిన ఆయుధములతో

కార్తవీర్యుని కొట్టారు. కాని కార్తవీర్యుడు చలించకుండా ఆ

ఆయుధములను తన గదతో ఎదుర్కొన్నాడు. గదతో మోదుతూ రాక్షస వీరులను చెల్లాచెదరు చేసాడు. రాక్షస వీరులు పారిపోగానే

కార్తవీర్యుడు రావణుని బందీగా తీసుకొని తన నగరానికి వెళ్లాడు.

రావణుని బంధించిన కార్తవీర్యునికి మాహిష్మతీ నగరంలో

ఘనస్వాగతం లభించింది.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పది రెండవ సర్గ సంపూర్ణము.

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్


శ్రీమద్రామాయణము|| ఉత్తరకాండము

ముప్పది మూడవసర్గ. (33)


రావణుడు కార్తవీర్యుడికి బంది అయ్యాడు అన్న వార్త ముల్లోకములలో పాకి పోయింది.. అంతా విచిత్రంగా చెప్పుకుంటు

న్నారు. ఒక యుద్ధోన్మాదికి తగిన గుణపాఠం చెప్పాడని కార్తవీర్యుని

అందరూ పొగిడారు. ఈ సంగతి రావణుని తాతగారు అయిన పులస్త్యునికి తెలిసింది. హుటాహుటిన కార్తవీర్యుని వద్దకు వచ్చాడు. వాయు మార్గంలో మాహిష్మతీ నగరానికి వచ్చాడు పులస్త్యుడు. పులస్త్యుడి రాక గురించి కార్తవీర్యునికి తెలిసింది. కార్తవీర్యుడు వెంటనే నెత్తిన చేతులు పెట్టుకొని నమస్కారం చేస్తూ పులస్త్యునికి ఎదురు వెళ్లాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసాడు. అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. సగౌరవంగా రాజభవనానికి తీసుకొని వచ్చాడు. పులస్త్యుని ముందు చేతులుకట్టుకొని వినయంగా

నిలబడ్డాడు కార్తవీర్యుడు. "బ్రాహ్మణోత్తమా! నేను ఈ జన్మలో తమరిని చూస్తానని అనుకోలేదు. నా పుణ్యవిశేషము వలన తమరే నా నగరానికి విచ్చేసారు. నా జన్మధన్యం అయింది. నా నగర వాసులు ధన్యులయ్యారు. నేను, నా రాజ్యము, నా భార్య, నా కుమారులు తమరి అధీనములో ఉన్నాము. ఆజ్ఞాపించండి. తమరికి ఏమి సేవ కావాలో అది చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము." అని వినయంగా పలికాడు కార్తవీర్యుడు. కార్తవీర్యుని వినయానికి, బ్రాహ్మణ భక్తికి ఎంతో సంతోషించాడు పులస్త్యుడు. "రాజేంద్రా! నీవు, నీ భార్య, పుత్రులు క్షేమంగా ఉన్నారు. ప్రజలను ధర్మం తప్పకుండా పరిపాలిస్తున్నావా! అగ్నిహోత్రములు చక్కగా వెలుగుతున్నాయి కదా! ప్రజలు ఏ భయమూ లేకుండా సుఖంగాఉన్నారు కదా! ముల్లోకములను జయించిన రావణుని జయించిన నీ పరాక్రమము, వీరత్వము సాటిలేనిది. సముద్రములు, దిక్పాలకులు, వాయువు, అగ్ని ఎవరికి భయపడి తమ తమ సహజ గుణములను కూడా ప్రకటించరో అట్టి నా పౌత్రుడు రావణుని జయించి లోకోత్తరవీరుడవని అనిపించుకున్నావు. ఇప్పటిదాకా రావణుడు ఆర్జించిన కీర్తిని అంతా నీవు అతిక్రమించి అందరి ప్రశంసలకు పాత్రుడవు అయ్యావు. అటువంటినిన్ను ఒక కోరికకోరుతున్నాను. కాదనకుండా తీర్చు. రావణుని విడిచి పెట్టు."అని అడిగాడు. కార్తవీర్యుడు మారు మాటాడకుండా పులస్త్యునికి నమస్కరించి రావణుని విడిచిపెట్టాడు. రావణునికి అతిథి సత్కారములు చేసాడు. అగ్ని సాక్షిగా రావణునికి కార్తవీర్యునికి స్నేహం కుదిరింది. ఇద్దరూ భక్తితో పులస్త్యునకు నమస్కరించారు. పులస్త్యుడు రావణుని లంకకు వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. రావణుడు తన మంత్రులతో సేనాధి పతులతో, సైన్యముతో లంకానగరానికి వెళ్లిపోయాడు. తరువాత బ్రహ్మదేవుని కుమారుడు అయిన పులస్త్యుడు బ్రహ్మలోకమునకు వెళ్లిపోయూడు.

రామా! ఇదీ రావణుని మొదటి ఓటమి. మహాబలశాలి అయిన రావణుడు కార్తవీర్యుని వలన ఓటమి పాలై అవమానము పొంది, పులస్త్యుని జోక్యముతో విడిచిపెట్టబడ్డాడు. రామా! ఎవరూ తాము బలవంతులమని విర్రవీగకూడదు. వాడి కంటే బలవంతులు ఉంటారు అని మరిచిపోకూడదు. (తాడిని తన్నేవాడు ఒకడయితే, వాడి

తల తన్నే వాడు మరొకడు ఉంటాడు అని లోకోక్తి).

రామా! ఇంతజరిగినా రావణునికి బుద్ధిరాలేదు. మరలా తన

జైత్రయాత్ర కొనసాగించాడు. రాజుల మీదికి యుద్ధానికి పోవడం

వారిని హింసించడం, వారి స్త్రీలను అపహరించడం యధేచ్ఛగా

కొనసాగించాడు.” అని చెప్పాడు అగస్త్యుడు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పది మూడవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

శ్రీమద్రామాయణము || ఉత్తరకాండము

ముప్పది నాలుగవ సర్గ.(34)


“రామా! కార్తవీర్యుని చేతిలో శృంగభంగము పొందినా సిగ్గు లేకుండా,

నిర్భయంగా భూమి నలుచెరగులా తిరుగుతూ రాజులను యుద్ధానికి ఆహ్వానిస్తున్న రావణునికి వాలి రూపంలో మరొక ఎదురు దెబ్బ తగిలింది. రావణునికి ఎదుటి వాడు రాక్షసుడా, మానవుడా,

ఎవడైనా లెక్కలేదు. వెళ్లడం యుద్ధానికి ఆహ్వానించడం, ఓడించడం,

హింసించడం రావణుని నిత్యకృత్యం అయింది. ఆ పరంపరలో ఒకసారి రావణుడు కిష్కింధకు వెళ్లాడు. అప్పుడు కిష్కింధను వాలి

అనే వానర రాజు పరిపాలిస్తున్నాడు. రావణుడు వెళ్లి వాలిని యుద్ధమునకు పిలిచాడు. అప్పుడు వాలి మామగారు తారుడు అనే వానరుడు రావణునితో ఇలా అన్నాడు. “ఓ రాక్షస రాజా! వాలి ప్రస్తుతము కిష్కింధలో లేడు. సంధ్యావందనమునిమిత్తము బయటకు వెళ్లాడు. కిష్కింధలో నిన్ను ఎదిరించే వాడు ఎవరూ లేరు.

అందుకనికొంచె సేపు ఉండు. వాలి నాలుగు సముద్రముల జలములలో సంధ్యావందనము ఆచరించి ముహూర్తకాలములో తిరిగి రాగలడు. రావణా! మరొక విషయము. అదుగో అక్కడ ఒక ఎముకల గుట్ట కనపడుతూ ఉంది. ఆ ఎముకలు ఎవరివి అనుకున్నావు. వాలితో యుద్ధం చేసి చచ్చిన వాళ్ల ఎముకల గుట్ట. నీకేదో ఎవరి చేతిలోనూ చావకుండా బ్రహ్మ వరం ఉందని విన్నాను. ఆ వరసలో వానరులు లేరు కదా! అందుకని నీవు వాలిని యుద్ధంలో ఎదుర్కొంటే నీకు మరణం తప్పదు. తరువాత నీ ఇష్టం. వాలి వచ్చే లోపల ఈ లోకంలో ఉన్న అందాలను అన్నీ చూడు. ఆనందించు. స్త్రీలతో సుఖించాలంటే సుఖపడు. ఎందుకంటే వాలి వచ్చిన తరువాత నీకు ఈ అవకాశం దొరకదు. వాలిని ఎదుర్కొని నీవు ముహూర్తకాలం కూడా జీవించలేవు. లేదూ నీకు చావాలని మహా తొందరగా ఉంటే, వెంటనే దక్షిన సముద్రతీరమునకు వెళ్లు. వాలి నీకు అక్కడ తారస పడతాడు.” అని మెల్ల మెల్లగా రావణునికి నాలుగు చురకలు అంటించాడు వాలి మామగారు తారుడు. ఆ మాటలు విన్న రావణునికి కోపం తలకెక్కింది. తారుడిని గట్టిగా అరిచి జడిపించాడు. వెంటనే తన పుష్కక విమానము ఎక్కి దక్షిణ సముద్రతీరానికి వెళ్లాడు. దక్షిన సముద్ర తీరంలో సంధ్యోపాసన చేస్తున్న వాలిని చూచాడు రావణుడు. రావణుడు పుష్పకము దిగాడు. వెనక నుండి వాలిని పట్టుకోడానికి వెనకనుండి తక్కుతూ తారుతూ వెళ్లాడు. వాలి కూడా క్రీగంటితో రావణుని చూచాడు. కాని చూడనట్టు ఊరుకున్నాడు. “వీడు నన్ను పట్టుకోవాలని వస్తున్నాడు. వీడిని ఒక పట్టు పట్టాలి" అని అనుకున్నాడు. ఏమీ ఎరుగనట్టు వేద మంత్రములు పఠిస్తూ సూర్యోపాసన చేస్తున్నాడు. వాలిని పట్టుకోడానికి రావణుడు వాలి దగ్గరగా వచ్చాడు. తన చేతికి అందే దూరంలోకి రాగానే, వాలి రావణుని గరుడుడు పామును పట్టుకున్నట్టు మెడపట్టుకున్నాడు.రావణుని తన ముందుకు లాగి తన చంకలో ఇరికించుకున్నాడు. వేగంగా ఆకాశంలోకి ఎగిరాడు. రావణుడు కిందికి వేలాడుతున్నాడు. గిలా గిలా కొట్టుకుంటున్నాడు. కట్టుకున్న ధోవతీ ఊడిపోతూ ఉంది. అయినా వాలి వాయువేగంతో ఎగుతున్నాడు. రావణునికి ఊపిరి ఆడటం లేదు. ఇదంతా చూస్తున్న రావణుని మంత్రులు సేనాధి పతులు పెద్దగా అరుస్తూ వాలిని వెంబడించారు. ముందు వాలి, వాలి చంకలో రావణుడు, వెనుకగా అరుస్తూ రావణుని మంత్రులు, సేనాధిపతులు ఆకాశంలో ఎగురుతూ పోతున్నారు. కాని వారు వాలి వేగాన్ని అందుకోలేకపోయారు ఎగిరి ఎగిరి వారి చేతులు, కాళ్లు తొడలు, అరిచి అరిచి నోరు నొప్పెట్టాయి. కాని వాలి దొరకలేదు. ఇంక లాభం లేదని ఆగిపోయారు. వాలి రావణుని చంకలో ఇరికించుకొని అన్ని సముద్రజలములలో సంధ్యావందనము ఆచరించాడు. వాలి పశ్చిమ సముద్ర తీరానికి చేరుకున్నాడు. వాలి పశ్చిమసముద్రంలో స్నానం చేసి, సంధ్యావందనము ముగించుకొని ఉత్తరసముద్రతీరం చేరుకున్నాడు. ఉత్తరసముద్రంలో స్నానం చేసి సూర్యోపాసన చేసి తరువాత తూర్పుసముద్రతీరానికి వెళ్లాడు. అక్కడకూడాస్నానం, సంధ్య పూర్తి చేసుకొని వాలి కిష్కింధకు బయలు దేరాడు. ఇంత దూరమూ ప్రపంచ విజేత రావణుడు వాలి చంకలో ఇరుక్కుని పిల్లి పిల్ల వేలాడినట్టు వేలాడుతున్నాడు. వాలి వాయువేగానికి తట్టుకోలేక అల్లల్లాడిపోతున్నాడు. వాలి కిష్కింధ దగ్గర ఉన్న ఉద్యానవనంలో దిగాడు. రావణుని మోసి మోసిఅలిసిపోయిన వాలి, అక్కడ ఆగి అలసట తీర్చుకుంటున్నాడు. రావణుని తన చంకలో నుండి విడిచిపెట్టాడు. బతుకు జీవుడా అనుకుంటూ రావణుడు వాలి చంకలో నుండి బయటకు వచ్చి ఒళ్లు విరుచుకున్నాడు. అప్పుడు వాలి ఇలాఅడిగాడు. “ఇంతక ఎవరు నీవు! ఎక్కడి నుండి వచ్చావు? నన్ను ఎందుకు పట్టుకోబోయావు?” అనికుశల ప్రశ్నలు వేసాడు.

రావణుడు ఆశ్చర్యంతో వాలిని చూచి ఇలా అన్నాడు. “ఓ వానరేంద్రా! నేను రాక్షస రాజు రావణుడను. నీతో యుద్ధం చేయడానికి వచ్చాను. నాతో యుద్ధం చేయకుండా ఈ ప్రకారం నన్ను బాధపెట్టావు. నన్నుఒక జంతువును పట్టుకొని తిప్పినట్టు నాలుగు సముద్రములు తిప్పావు. నీ బలము అనుపమానము. నన్ను మోసుకుంటూ నాలుగు సముద్రములు తిరిగావు కదా! నీకు అలసట కలగలేదా! నీకు ఉన్నటు వంటి గమన వేగము కేవలము మనస్సుకు, వాయువుకు, గరుడునికి మాత్రమే ఉంది. నీతో అనవసరంగా పెట్టుకున్నాను. నాకు తగిన శాస్తి జరిగింది. నీతో స్నేహమును కోరుతున్నాను. మనము అగ్నిసాక్షిగా స్నేహితులము అవుదాము.తరువాత వాలి రావణుడు అగ్నిని మండించి, పరస్సరము

కౌగలించుకొని అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు. సోదర స్నేహము

పెంపొందించుకున్నారు. వాలి రావణుని తీసుకొని కిష్కింధలో

ప్రవేశించాడు. రావణుడు కిష్కింధలో ఒక నెలరోజులు ఆనందంగా

గడిపాడు. తరువాత రావణుడు లంకకు వెళ్లాడు. రామా! ఇదీ వాలి రావణుల మైత్రి కధ. రావణుని నాలుగు సముద్రముల నీళ్లు తాగించిన ఆ వాలిని నీవు సునాయాసంగా చంపావు." అని అన్నాడు అగస్త్యుడు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పది నాలుగవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్


శ్రీమద్రామాయణము ||ఉత్తరకాండము

ముప్పది ఐదవ సర్గ లో ఒకటో భాగం. (35-1) 

హనుమంతుని వృత్తాంతం 


అప్పటి దాకా రావణుని జన్మవృత్తాంతము, రాక్షసుల పుట్టుక గురించి విన్న రాముడు, ఆఖరున వాలి యొక్క బల పరాక్రమముల గురించి విని ఆశ్చర్యపోయాడు. కాని రాముడికి ఒక అనుమానము వచ్చింది. హనుమంతుడు వాలి సుగ్రీవులకన్నా బలవంతుడు అని విని ఉన్నాడు అది ఎలా సాధ్యం అని అనుకున్నాడు. అదే ప్రశ్నను అగస్త్యుని అడిగాడు రాముడు. “ఓ అగస్త్య మహర్షీ! మీరు చెప్పినట్టు వాలి బలము, రావణుని బలమూ అసమాన్యము. కానీ హనుమంతుని బలముతో పోలిస్తే, వీరి బలము తక్కువే కదా ఎందుకంటే, రావణునికి, వాలికి బలంతో పాటు అహంభావము, పొగరు, ఇతరుల పట్ల తృణీకారభావము ఉన్నాయి. కాని హనుమంతునిలో బలము, శౌర్యము, దానికి తగ్గట్టుbవినయము,

విధేయతా, మంచి తనము, బుద్ధి, నీతి, కార్యసాధనము, ఇవన్నీ హనుమంతుని బలమును ఇనుమడింపజేసాయి.  నూరుయోజనముల దూరము ఉన్న సముద్రమును ఎలా దాటాలా అని దిగులుపడుతున్న వానరసేనల మాదిరి దిగాలు పడకుండా, తన వంతు ప్రయత్నం తాను చేసాడు. సముద్రమును దాటాడు. ఎంత వెదికినా సీత కనపడలేదు. కాని పట్టుదల మానలేదు. సీత దొరికే వరకూ వెదుకుతూనే ఉన్నాడు. సీతను చూచాడు ఆమెను ఓదార్చాడు. అదీ హనుమంతునిలో ఉన్న కార్యదీక్ష, పట్టుదల. ప్రతి

మనిషిలో ఇవి ఉండాలి. రాక్షసులు తనను ఎదిరించినపుడు

భయపడిపారిపోలేదు. తన బలపరాక్రమములతో వారిని ఎదిరించాడు.bసంహరించాడు. ప్రతీకారం తీర్చుకోడంలో కూడా హనుమంతుడు గట్టివాడు. దూతగా వచ్చిన వాడిని చంపమన్నాడు రావణుడు. తుదకు తోకకుbనిప్పు అంటించమన్నాడు. నిప్పు అంటించి వదిలేసి ఉంటే తన దారిన తాను పోయేవాడు హనుమంతుడు. కాని, రాక్షసులు అమితోత్సాహంతోnహనుమంతుని తోకకు నిప్పు అంటించి, డప్పులు కొట్టుకుంటూbఊరేగించారు. లంకా నగరం అంతా తిప్పారు. అప్పుడు హనుమంతుడికిbకోపం వచ్చింది. ఒక కొంపకు నిప్పు పెట్టాడు. అది లంకను దహించివేసింది. హనుమంతుడు చేసిన పనులను యమ, కుబేర,bవరుణులు కూడా చేసినట్టు మనం వినలేదు. కేవలము హనుమంతుని బలపరాక్రమములు, బుద్ధికుశలత వల్లనే నేను నా సీతను,

రాజ్యమును పొందగలిగాను అనడంలో అతిశయోక్తి లేదు.

మునీంద్రా! అసలు హనుమంతుడు లేకపోతే కనీసం సీత ఎక్కడ ఉన్నదీ నాకు తెలిసేది కాదు. ఇంతటి బలపరాక్రమములు బుద్ధికుశలత ఉన్న హనుమంతుడు, వాలికి సుగ్రీవునికి వైరము

ఏర్పడప్పుడు ఎందుకు పారిపోయాడు. వాలిని ఎందుకు ఎదిరించి

చంపలేదు. ఇదే నాకు అర్థం కావడం లేదు. దయచేసి నాకు

హనుమంతుని వృత్తాంతము అంతా సవిస్తరంగా తెలియజేయండి.”

అని అడిగాడు. ఆ సమయంలో హనుమంతుడు రాముని పక్కనే ఉన్నాడు. అమాయకంగా రాముని వంక, అగస్త్యుని వంక చూస్తున్నాడు. హనుమంతుని వంక చూచాడు అగస్త్యుడు. చిరునవ్వు నవ్వి రామునితో హనుమంతుని వృత్తాంతమును ఇలా చెప్పసాగాడు. “రామా! ఈ హనుమంతుని విషయంలో నువ్వు చెప్పినది అంతా సత్యమే. బలపరాక్రమములలో బుద్ధికుశలతలో హనుమంతునికి సాటి ఎవరూ లేరు, రారు. కాని హనుమంతునికి మునుల శాపం ఒకటి ఉంది. దాని ప్రభావంతో హనుమంతునికి తన బలం తన పరాక్రమము తనకు తెలియదు. ఒకరు చెబితేకాని తాను

మహాబలవంతుడు అని తెలుసుకోలేడు. ఈ హనుమంతుడు తన

బాల్యము నుండి అత్యంత సాహసోపేతమైన కార్యములు చేసాడు. అవన్నీ ఇతనికి గుర్తులేవు. అందుకని ఏమీ ఎరుగనట్టు అమాయకంగా కూర్చుని ఉన్నాడు. ఈ హనుమంతుని గురించి నీకు సవిస్తరంగా చెబుతాను విను. మేరు పర్వతమును హనుమంతుని తండ్రి కేసరి పరిపాలిస్తున్నాడు. ఆ మేరు పర్వతము మీద సూర్య కిరణములు పడి బంగారు పర్వతము మాదిరి ప్రకాశిస్తూ ఉంటుంది. కేసరి భార్యపేరు అంజనాదేవి. విధి వశాత్తు వాయుదేవుడు ఆమెతో సంగమించాడు. వాయుదేవుని కరుణ వలన అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు. పుట్టినప్పుడు హనుమంతుడు పచ్చని శరీర కాంతితో ప్రకాశించాడు. ఒకరోజు అంజనాదేవి పండ్లు తీసుకురావడానికి అడవికి వెళ్లింది. అప్పుడు హనుమంతునికి ఆకలి వేసింది. గట్టిగా ఏడిచాడు. అప్పుడు సూర్యోదయము అవుతూ ఉంది. సూర్యుడు మేరు పర్వతము మీద చిన్న గుండ్రటి పండు మాదిరి ప్రకాశిస్తున్నాడు. ఆకలిగా ఉన్న హనుమంతుడు ఆ ఫలమును అందుకొని తినవలెనని పైకి ఎగిరాడు. సూర్యుని వైపుపోతున్నాడు. అంత చిన్న బాలుడు సూర్యలోకము వంక

ఎగురుతూ వెళ్లడం చూచి దేవతాగణములు ఆశ్చర్యపోయారు. చిన్న

పిల్లవాడప్పుడే ఇంత వేగంగా ఎగురుతున్నాడు. ఇంక పెద్ద వాడైతే ఎంత వేగంగా ఎగురుతాడో అని ఆశ్చర్యపోయారు. తన కుమారుడు అలా ఎగరడం చూచిన వాయుదేవుడు చిన్నవాడు ఎక్కడ సూర్యరశ్మికి కమిలిపోతాడో అని భయపడ్డాడు. పసివాడి వెంటనే ఉంటూ చల్లటి గాలి వీచ సాగాడు. ఆ బాలుడు ఫలము లాగా ఉన్న సూర్యుని పట్టుకోవాలని ఎగురుతూ సూర్యమండలం చేరుకున్నాడు. ముద్దుగా ఉన్న హనుమను చూచి సూర్యుడు కూడా చల్లబడి పోయాడు “ పసివాడు...ఏదో తెలిసీతెలియకుండా నా దగ్గరకు వచ్చాడు. ఇతనిని ఎందుకు బాధ పెట్టడం” అని అనుకున్నాడు సూర్యుడు.


సశేషం


శ్రీమద్రామాయణము || ఉత్తరకాండము

ముప్పది ఐదవ సర్గ లో రెండవ భాగం (35-2)

హనుమంతుని వృత్తాంతం 


కాని ఆ సమయంలోనే రాహుగ్రస్త సూర్యగ్రహణం సంభవించింది. రాహువు సూర్యుని పట్టుకోడానికి వస్తున్నాడు. కాని సూర్యుని దగ్గరగా ఉన్న హనుమంతుని చూచాడు. “ఇదేమిటి. నేను సూర్యుని పట్టుకోకముందే మరొకడు పట్టుకున్నాడు. ఇదేమిటో ఇంద్రునితోనే తేల్చుకుంటాను.”. అని రాహువు ఇంద్రుని దగ్గరకు వెళ్లాడు. ఇంద్రుని చూచి హేళనగా ఇలా అన్నాడు. “ఓ ఇంద్రా! సూర్యగ్రహణము

రోజు నేను సూర్యుని పట్టుకోవాలి కదా! మరి ఈ రోజు సూర్యుని

మరొకడుపట్టుకున్నాడు. నీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా!

లోకాచారమునకు విరుద్ధముగా ప్రవర్తించడం త్రిలోకాధిపతివి నీకు

తగునా! ఈ రోజు సూర్యగ్రహణము. నేను సూర్యుని పట్టుటకు వెళ్లాను. అప్పటికే మరొకడు అక్కడ ఉన్నాడు. మరి నేనేం చెయ్యాలో చెప్పు.” అనినిష్టూరంగాఅడిగాడు. రాహువు మాటలు విన్న ఇంద్రుని అహం దెబ్బతింది. వెంటనే తన సింహాసనము మీది నుండి లేచాడు. ఐరావతమును ఎక్కి వజ్రాయుధమును చేత ధరించి సూర్యమండలమునకు వెళ్లాడు. రాహువు కూడా ఇంద్రుని వెంట వెళ్లాడు. కాని ఇంద్రుని కంటే కాస్త ముందుగా, అత్యుత్సాహంగా, సూర్యుడి దగ్గరకు వెళ్లాడు రాహువు. హనుమంతుడు రాహువును చూచాడు. అప్పటి దాకా సూర్యుని ఎర్రటి ఫలము అని పట్టుకున్న హనుమంతుడు, రాహువును మరొక చిన్న ఫలము అనుకున్నాడు. బాల్యచాపల్యము చేత సూర్యుని వదిలి పెట్టి రాహువును పట్టుకోడానికి రాహువు వెంట పడ్డాడు. హనుమంతుడు తన వెంట పడటం చూచి భయపడిన రాహువు వెనక్కుతిరిగి పరుగు లంకించుకున్నాడు. ఇంద్రుడి దగ్గరకు పోయి తనను రక్షించమని ఇంద్రుడి వెనక దాక్కున్నాడు. “ఇంద్రా! ఇంద్రా! నన్ను రక్షించు ఈ బాలకుడు నన్ను చంపడానికి వస్తున్నాడు” అని పెద్దగా అరిస్తున్నాడు.

“భయపడకు. ఈ బాలకుని నేను సంహరిస్తాను" అని అభయం ఇచ్చాడు ఇంద్రుడు. ఇంతలో హనుమంతుడు తెల్లగా ఉన్న ఐరావతమును చూచాడు. “అమ్మో ఇది అన్నిటి కన్నా పెద్ద పండు. ఇది నాకు కావాలి. దీనిని నేను పట్టుకుంటాను” అని ఐరావతము వెంట పడ్డాడు హనుమంతుడు. ఐరావతము వెంట పడ్డ బాలుని చూచి ముచ్చట పడ్డాడు ఇంద్రుడు. కాని ఐరావతమును, రాహువును, రక్షించాలనే ఉద్దేశంతో, కేవలం తన వజ్రాయుధము కొనతో హనుమంతుని కొట్టాడు. ఆ వజ్రాయుధము కొన హనుమంతుని ఎడమ దవడకు తగిలింది. ఆ దెబ్బకు బాలుడు అయిన హనుమంతుడు గిరా గిరా తిరుగుతూ నేల మీదికి పడిపోయాడు. చిన్న బాలుడు అని కూడా చూడకుండా వజ్రాయుధమును ప్రయోగించిన ఇంద్రుని మీద మండిపడ్డాడు వాయువు. వాయువు తన కుమారుడైన హనుమంతుని నేల మీద పడకుండా పట్టుకొని ఒక గుహలోకి ప్రవేశించాడు. వాయువు లేకపోవడంతో మూడు లోకములలో వాయు ప్రసారము ఆగిపోయింది. ప్రాణులకు ప్రాణవాయువు అందక విలవిలలాడుతున్నాయి. ఎవరికీ ఊపిరి ఆడటం లేదు. ప్రాణులు చచ్చిపోతున్నాయి. దేవతలకు హవిర్భాగములు అందడం లేదు. శబ్దప్రసారం ఆగిపోయింది. ఒకరి మాట ఒకరికి వినపడటం లేదు. ఈ మాదిరి ముల్లోకములు మూడురోజులు నరకం అనుభవించాయి. ముల్లోకవాసులు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి మొరపెట్టుకున్నారు. “ఓ బ్రహ్మదేవా! మూడు లోకములను, అందులో సమస్త ప్రాణులను నీవే సృష్టిచేసావు. ప్రాణులకు ఊపిరి ఆడటానికి

వాయువును అధిపతిగా చేసావు. వాయుప్రసారం వలన లోకాలు

బతుకుతున్నాయి. అకారణంగా వాయువు స్తంభించి పోయింది.

ప్రాణులకు ఊపిరి ఆడటం లేదు. నీవే మమ్ములను రక్షించాలి." అని

మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఏమి జరిగిందా అని ఆరా తీసాడు. విషయం అర్థం అయింది. “ఓ ప్రాణులారా మీకు ఊపిరి ఆడకపోవడానికి పెద్ద కారణమే ఉంది. అది ఏమో చెబుతాను వినండి. వాయుదేవుని పుత్రుడు బాలుడు అయిన హనుమంతుని ఇంద్రుడు తన వజ్రాయుధముతో కొట్టాడు. ఆ దెబ్బకు ఆ బాలుడు చనిపోయాడు. అందుకు కోపించి వాయువు స్తంభించాడు. అందుకని మీకు ఊపిరి ఆడటం లేదు. అందుకని మనం అందరం వాయుదేవుని వద్దకు వెళ్లాము. నా వెంట రండి.” అని అందరినీ తీసుకొని బ్రహ్మదేవుడు వాయుదేవుడు ఉన్న చోటికి వెళ్లారు. బ్రహ్మదేవుడి వెంట యక్ష, గంధర్వ, దేవ, ఋషి, కిన్నెర, కింపురుష, రాక్షస జాతులన్నీబయలుదేరాయి. మానవులు సరేసరి అక్కడే ఉన్నారు.

బ్రహ్మదేవుడు, వాయుదేవుని ఒడిలో నిర్జీవంగా పడుకుని ఉన్న బాలుడిని చూసి జాలిపడ్డాడు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

శ్రీమద్రామాయణము || ఉత్తరకాండము

ముప్పది ఆరవ సర్గ లో ఒకటో భాగం (36-1)

హనుమంతుని వృత్తాంతము 


బ్రహ్మదేవుడు రావడం చూచిన వాయుదేవుడు చనిపోయిన బాలుని ఎత్తుకొని లేచి నిలబడ్డాడు. బ్రహ్మదేవునికి పాదాభివందనం చేసాడు. బ్రహ్మదేవుడు వాయుదేవుని బుజాలు పట్టుకొని పైకి లేపాడు. తన అమృత హస్తంతో చనిపోయిన హనుమంతుని ఒళ్లంతా నిమిరాడు. బ్రహ్మదేవుని చేతి స్పర్శ తగలగానే హనుమంతుడు కదిలాడు. కళ్లు తెరిచాడు. చిరునవ్వు నవ్వాడు. హనుమంతుడు పునర్జీవితుడు అయ్యాడు. తన కుమారుడు తిరిగి బతకడం చూచిన వాయుదేవుడు ఎంతో సంతోషించాడు. ఎవరూ చెప్పకుండానే ముల్లోకములలో వాయు ప్రసరణను ప్రారంభించాడు. అందరికీ ప్రాణవాయువు అందింది. ప్రాణులు అన్నీ యథాస్థితికి వచ్చాయి. ముల్లోకములలో జీవులు కళకళాలాడాయి. ప్రాణులన్నీ తమతమ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. బ్రహ్మదేవుడు తనతో వచ్చిన దేవతా గణములను చూచి ఇలా అన్నాడు. “ఓ మహేంద్రా ! అగ్నిదేవా!వరుణ దేవా! కుబేరా! నేను చెప్పే మాటలను వినండి. మీకందరకూ తెలిసిన విషయమే అయినా మరలా చెబుతున్నాను. ఈ శిశువు సామాన్యుడు కాడు. దేవకార్యమును సాధించడానికి పుట్టాడు. కాబట్టి ఈ శిశువునకు మీరందరూ వరాలు ప్రసాదించండి.” అని అన్నాడు. ముందుగా మహేంద్రుడు తనమెడలోని బంగారు

పద్మముల మాలను తీసి అందరికీ చూపించి ఇలా అన్నాడు. “నేను

ప్రయోగించిన వజ్రాయుధముతో ఈ శిశువు దవడ భాగము

వాచిపోయింది. అందుకని ఈ రోజునుండి ఈ వానర కుమారుడు

“హనుమ” అనే పేరుతో పిలువబడతాడు. (హను: అంటే దవడ అని

అర్థం.) అంతే కాకుండా ఈ వానర కుమారుడు నా వజ్రాయుధము

చేత కూడా చావకుండా వరము ఇస్తున్నాను." అని అన్నాడు.

ఇంతలో సూర్యుడు లేచి “నేను నా తేజములో నూరవవంతు ఇతనికి ఇస్తున్నాను. ఇతనికి ఉపనయనము కాగానే నేను ఈ హనుమకు అన్ని శాస్త్రములు నేర్పుతాను. ఇతనిని మాటలలో చతురుని

చేస్తాను.” అని అన్నాడు. వరుణుడు హనుమకు పదిలక్షల సంవత్సరముల దీర్ఘాయువు ప్రసాదించాడు. తన మృత్యుదండము ఎన్నటికీ హనుమను తాకదని, ఇతనికి ఏ రోగమూ రాదనీ, ఏ యుద్ధములో కూడా ఇతనిని అపజయం వరించదని, యముడు వరం ఇచ్చాడు. (అందుకే హనుమను చిరంజీవి అని అంటారు.) “నా గదాదండము ఇతనిని ఎన్నటికీ తాకదు. ఇతనికి నా చేతిలో చావు లేదు." అని కుబేరుడు వరం ఇచ్చాడు. విశ్వకర్మ ఆ బాలుని చూచి ఇలా అన్నాడు. “నేను తయారు చేసిన ఏ ఆయుధము కానీ, ఏఅస్త్రము కానీ, ఈ హనుమను చంపలేదు. ఇతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు." అని వరం ఇచ్చాడు. పనిలో పనిగా బ్రహ్మదేవుడు కూడా "ఇతను బ్రహ్మాస్త్రము చేత కూడా కట్టబడడు. బ్రహ్మాస్త్రము కూడా ఇతనిని ఏమీ చేయలేదు.” అని వరం ఇచ్చాడు.

అందరూ అన్ని వరాలు ఇస్తుంటే హనుమ అమాయకంగా

చిరు నవ్వు నవ్వుతున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వాయుదేవుని చూచి ఇలా అన్నాడు. “వాయుదేవా! నీ కుమారుడు సామాన్యుడు కాడు. శత్రుభయంకరుడు. మిత్రులకు మిత్రుడు. శత్రువులకు శత్రువు. ఎంత దూరం అయినా వాయువేగంతో ఎగరగలడు. ఏ మాత్రం అలసట చెందడు. తన ఇష్టం వచ్చిన రూపం ధరించగలడు. ఇతని కీర్తి

ముల్లోకములలో వ్యాపిస్తుంది. చిరంజీవిగా ఉంటాడు." అని పలికి

బ్రహ్మదేవుడు దేవతాగణములు తమ తమ లోకములకు వెళ్లిపోయారు. వాయుదేవుడు హనుమను తీసుకొని అంజన వద్దకు వెళ్లాడు. హనుమను అంజనకు అప్పగించి, జరిగిన విషయములు అన్నీ అంజనకు చెప్పి వెళ్లిపోయాడు. అప్పటికి హనుమ మంచి బాలుడు. మంచీ చెడు తెలియవు. పైగా తనకు ఎదురు లేదు అనే గర్వము. బాల్య చాపల్యము. ఇవన్నీ కలిసాయి. హనుమ మునుల ఆశములలోకి జొరబడి వారి తపస్సులను పాడుచేయసాగాడు. యజ్ఞ పాత్రలను, గరిటెలను విరగ్గొట్టేవాడు. యజ్ఞము చేయడానికి సమకూర్చుకున్న వస్తువులను పాడుచేసేవాడు. అతనిని ఏమీ అనడానికి వీలు లేదు. అతనికి బ్రహ్మ దేవుడు, ఇతర దేవతలు ఇచ్చిన వరముల గురించి తెలిసిన ఋషులు, మునులు హనుమ ఆగడాలను సహిస్తున్నారు. కాని దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా! ఆ హద్దు కూడా దాటాడు హనుమంతుడు. వారి సహనం, ఓర్పు నశించింది. హనుమంతునికి శాపం ఇచ్చారు.“నీవు ఏ వరముల బలంతో ఇన్ని ఆగడాలు, అకృత్యాలు చేస్తున్నావో, ఆ బలము నీకు ఉందన్న సంగతి నీవు మరిచిపోతావు. నీవు సామాన్య వానరుడు మాదిరి ఉంటావు. ఎవరైనా నీ వరముల గురించి, నీ బలము గురించి నీకు గుర్తుచేసినప్పుడు మాత్రమే నీ బలపరాక్రమములు నీకు

గుర్తుకువస్తాయి.” అని శాపం ఇచ్చారు.


సశేషం


శ్రీమద్రామాయణము ||ఉత్తరకాండము

ముప్పది ఆరవ సర్గ లో రెండగ భాగం (36-2)

హనుమంతుని వృత్తాంతము 


ఆ శాపం ప్రభావంతో హనుమంతుడు జరిగినది అంతా మరిచిపోయాడు. తాను కూడా ఒక సామాన్యమైన వానరము

అనుకున్నాడు. శాంతంగా, అమ్మ మాట వింటూ, పెద్దల మాట వింటూ ఉంటున్నాడు. ఇది ఇలా ఉండగా, ఋక్షరజసుడు అనే వానర రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరుకుమారులు. వారి పేరు వాలి, సుగ్రీవుడు. ఋక్షరజసుడు చాలా కాలము రాజ్యము పాలించి మరణించాడు. ఋక్షరజసుని తరువాత వాలి రాజ్యమునకు వచ్చాడు. సుగ్రీవుడు యువరాజు అయ్యాడు. వాలి, సుగ్రీవులు ఎంతో అన్యోన్యంగా ఉ౦డేవారు. వారి మధ్య ఏ మాత్రమూ మాట తేడా వచ్చేది కాదు. ఇద్దరూఒకే మాట మీద ఉంటూ రాజ్యపాలన చేసేవారు. అట్టి వాలి సుగ్రీవులకు అహంభావము, అపోహల వలన

వైరము సంభవించింది. ఆ సమయంలో హనుమకు మహర్షుల

శాపం వలన తన శక్తి ఏమిటో తనకు తెలియదు. అందుకని వాలిని

ఎదిరించలేదు. సుగ్రీవుని మంత్రిగానే ఉండిపోయాడు. వాలి సుగ్రీవుని

ముల్లోకములలో తరుముతున్నప్పుడు కూడా హనుమ సుగ్రీవుని వెంట ప్రాణభయంతో పరుగెత్తాడు కానీ ఎదిరించలేదు. ఎందుకంటే

హనుమకు తనకు ఇవ్వబడిన వరములు, తనకు ఉన్న శక్తి గుర్తులేదు.

అందుకనే హనుమ వాలితో యుద్ధం చేయలేదు. రామా! నీ సందేహము తీరినది కదా! అటువంటి సద్గుణ సంపన్నుడు, బల పరాక్రమములు కల వాడు, బుద్ధిమంతుడు, నీతిమంతుడు, మాటలు నేర్పుకలవాడు, గొప్ప ధైర్యవంతుడు, అయిన హనుమకు సాటి రాగల వాడు ఈ లోకంలో ఎవడన్నా ఉన్నాడా! రామా! ఈ హనుమంతుడు వ్యాకరణశాస్త్రమును సూర్యభగవానుని వద్ద

అభ్యసించాడు. ఆ సమయంలో హనుమ సూర్యుని వెంట ఉదయాద్రి

నుండి పశ్చిమాద్రి వరకూ ప్రయాణం చేసాడు. అంతే కాదు సకల

విద్యలలోనూ హనుమ బృహస్పతికి సమానుడు. అటు బలపరాక్రమ

ములలో కానీ, ఇటు శాస్త్రపరిజ్ఞానములో కానీ హనుమకు సాటి రాగల వాడు ముల్లోకములలో ఎవరూ లేరు. నీకు రావణునితో యుద్ధములో సాయము చేయుటకు ఈ హనుమతో పాటు మైందుడు, ద్వివిదుడు, నీలుడు, తారుడు, అంగదుడు, నలుడు, రంభుడు ఇంకా అనేక మంది వానర వీరులు సృష్టింపబడ్డారు. ఇదీ హనుమ యొక్క వృత్తాంతము." అని అగస్త్యుడు రామునికి చెప్పాడు. తమ వెంట ఎంతగానో ఒదిగిఉండే హనుమ ఇంతటి గొప్పవాడా అని రాముడు, లక్ష్మణుడు ఆశ్చర్యపోయారు.

“రామా! నీ దర్శనము కొరకు నీ వద్దకు వచ్చాము. నిన్ను చూచాము. మాకు చాలా సంతోషము అయింది. ఇంక మేము మా మా స్వస్థలములకు వెళ్తాము అని అన్నాడు అగస్త్యుడు,ఆయనతో వచ్చిన మునులు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు. “ఓ మహర్షీ! మీ దర్శనభాగ్యము వలన నేను, మా పితృదేవతలు, అందరమూ

కృతార్ధులమయ్యాము. మిమ్ములను నేను ఒక కోరిక కోరుతున్నాను.

నేను ప్రజాపాలనకు తగిన చర్యలు తీసుకున్న తరువాత కొన్ని

యజ్ఞములు యాగములు చేయ సంకల్పించాను. ఆ క్రతువులకు మీరు వచ్చి ఆధ్వర్యము వహించి నన్ను ధన్యుడిని చేయమని నా ప్రార్థన. మీకే సేవచేసుకుంటూ నేను ధన్యతను పొందుతాను. నా ప్రార్థనను మన్నించి మీరు అప్పుడప్పుడు అయోధ్యకు వచ్చి తమరి దర్శన భాగ్యమును నాకు కలుగచేయవలసినదిగా ప్రార్ధిస్తున్నాను.” అని అన్నాడు రాముడు. రాముని ప్రార్థనను మన్నించారు ఆ ఋషులు. తరువాత రాముని అనుజ్ఞతీసుకొని అందరూ తమ తమ స్వస్థలములకు వెళ్ళిపోయారు. తరువాత రాముడు ఋషులు చెప్పిన వాక్యములను తలచుకుంటూ అంత:పురమునకు వెళ్ళిపోయాడు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పది ఆరవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్


శ్రీమద్రామాయణము ||ఉత్తరకాండము

ముప్పది ఏడవ సర్గ. (37)


రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడు అయిన తరువాత ఒక రోజు గడిచిపోయింది. మరునాడు రాముని మేల్కొలపడానికి వందిమాగధులు వచ్చి వేచి ఉన్నారు. వారందరూ రాముని

గుణగణములను, ఇక్ష్వాకు వంశరాజుల కీర్తిని మృదుమధురంగా

గానం చేస్తున్నారు. వారి స్తోత్రపాఠములను వింటూ రాముడు

నిద్రలేచాడు. రాముడు కాలకృత్యములు తీర్చుకొని స్నానాదికములు

ఆచరించాడు. అగ్నికార్యమును చేసాడు. తరువాత ఇక్ష్వాకు

వంశరాజులు అర్చించే దేవతార్చన గృహమునకు వెళ్లాడు. రాముడు

దేవతలను, పితరులను, బ్రాహ్మణులను పూజించాడు. తరువాత

మంత్రులు, సేనాధి పతులు, కులగురువు వసిష్ఠుడు, రాముని దగ్గరకు

వచ్చారు. రాముని తమ్ములు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పక్కనే

కూర్చున్నారు. సభాసదులు ఎవరికి ఉచితమైన ఆసనములలో వారు

కూర్చున్నారు. తన నలుగురు మంత్రులతో విభీషణుడు రామునికి

సమీపంలో ఆసీనుడు అయ్యాడు. పురప్రముఖులు, పౌరసంఘ

ప్రతినిధులు వచ్చి రామునికి నమస్కరించారు. ఆ ప్రకారంగా రాముడు అయోధ్యానగర పాలనను చేపట్టాడు. ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు.


ఉత్తరకాండము ముప్పదిఏడవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.


వాస్తవానికి రామాయణ కధ ఇంతటితో పూర్తి అయింది.

కాని కొంత మంది ఔత్సాహిక కవులు వాలి, సుగ్రీవుల పూర్తి

వృత్తాంతమును కూడా చెప్పాలని సంకల్పించినట్టున్నారు. అందుకని

కొన్ని సర్గలు అదనంగా చేర్చారు. కాని ఈ సర్గలకు వ్యాఖ్యాతలు

ఎటువంటి వ్యాఖ్యలు రాయలేదనీ, ఇవి ప్రాచ్యప్రతిలో కూడా లేవని కొంతమంది. పండితుల అభిప్రాయము. దానికి కారణం కూడా ఉంది. అగస్త్యుడు ఆయనతో వచ్చిన ఋషులు, మునులు, రాముడు అడిగిన విషయములు అన్నీచెప్పి, రాముడి సందేహములు అన్నీ తీర్చి రాముని వద్ద సెలవు తీసుకొని వెళ్లిపోయారు. కాని తరువాతి సర్గలో రాముడు అగస్త్యుని వాలి సుగ్రీవులకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయని, వారి తల్లి తండ్రులు ఎవరనీ అడిగాడు. ఒక సారి రాముని వద్ద సెలవు తీసుకొని వెళ్లిపోయిన తరువాత, మరలా రాముడు అగస్త్యుని వాలిసుగ్రీవుల గురించి అడగడం అసందర్భంగా ఉంది. ఎందుకంటే, రామాయణంలో హనుమంతుని పాత్ర ప్రాధాన్యమయింది. అందుకని హనుమంతుని పుట్టుక గురించి ఆయన బాల్యం గురించి వాల్మీకి విపులంగా చెప్పారు. కాని వాలి, సుగ్రీవులకు అంత ప్రాధాన్యము ఇవ్వలేదు. అందుకని వారి

పుట్టుకల గురించి వాల్మీకి ప్రస్తావించలేదు. కాని వాలి సుగ్రీవుల

గురించి చెప్పక పోవడం అసంపూర్ణంగా ఉంటుందనే భావనతో

కొందరు కవులు వారి వృత్తాంతములను కూడా చేర్చిఉంటారు. వారి కృషి అభినందనీయము. కాబట్టి, విషయ పరిజ్ఞానము కొరకు వీటిని కూడా సనాతన ధర్మం లో పెడుతున్నాను ,)

శ్రీమద్రామాయణము || ఉత్తర కాండము

ముప్పది ఎనిమిదవ సర్గ.(38)


ఇక్ష్వాకు కులతిలకుడైన శ్రీరామచంద్రుడు అయోధ్యానగరానికి

పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలిస్తున్నాడు. ఎవరికి తగిన పనులను వారికి అప్పగిస్తూ అందరి చేతా పనులు చేయించుకుంటున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. పట్టాభిషేక మహోత్సవమునకు వచ్చిన ఆహతులందరూ ఎవరి నగరములకు వారు వెళ్లిపోయారు. ఒక రోజు రాముడు తన మామగారు జనకమహారాజును చూచి ఇలా అన్నాడు. “ఓ జనకమహారాజా! మీ ఆశీస్సులవలననే నేను రాక్షస సంహారం చేయగలిగాను. మీ ఆశీస్సుల వలననే నేను అయోధ్యారాజ్యమును జనరంజకంగా పరిపాలిస్తున్నాను. మా ఇక్ష్వాకు వంశస్థులకు, మిథిలా నగర వాసులకు కల సంబంధము అద్వితీయము. మీరు నాచే ఇవ్వబడే

కానుకలను స్వీకరించండి. భరతుడు మిథిలా నగరం వరకూ మీకు

సాయంగా మీతో వస్తాడు." అని అన్నాడు. జనకుడు సరే అన్నాడు.

మిథిలకు ప్రయాణము అయ్యాడు. రాముడు తనకు ఇచ్చిన

బహుమతులను రత్నములను, బంగారమును, విలువగల వస్తువులు అన్నింటినీ తన కుమార్తెలకు ఇచ్చాడు. జనకుడు మిథిలకు వెళ్లిపోయాడు. తరువాత భరతుని మేనమామ అయిన కేకయ రాజును చూచి రాముడు ఇలా అన్నాడు. “నీ ఆశీర్వాదము వలననే భరతుడు ఇన్నాళ్లు రాజ్యపాలన చేసాడు. తరువాత నాకు రాజ్యము అప్పగించాడు. ఇప్పుడు యువరాజుగా నాతో పాటు పాలనా బాధ్యతలు స్వీకరించాడు. ఇదంతా మీ శుభాశీస్సులవలననే జరిగింది. కేకయ దేశములో మీ తండ్రిగారు మీ కొరకు అనుదినము ఎదురుచూస్తూ ఉంటారు. నా శక్తికొలది మీకు ధనము, బంగారము, మణిమాణిక్యాదులు బహుమతిగా ఇస్తున్నాను. వాటిని తీసుకొని లక్ష్మణుడు తమ వెంట వస్తున్నాడు.” అని అన్నాడు రాముడు. దానికి భరతుని మేనమామ యుధాజిత్తు ఇలా అన్నాడు. “రామా! నాకెందుకయ్యా ఈ బహుమానములు. అవన్నీ ఇక్కడే ఉండనీ.” అని అన్నాడు. తరువాత రాముని వద్ద సెలవు తీసుకొని యుధాజిత్తు కేకయ రాజ్యమునకు వెళ్లిపోయాడు. ఆయనకు తోడుగా లక్ష్మణుడు ఆయన వెంట వెళ్లాడు. తరువాత కాశీరాజు ప్రతర్ధనుడిని చూచి రాముడు ఇలా అన్నాడు. “రాజా! మీ సహాయ సహకారముల వలన భరతుడు ఈ 14 ఏళ్లు రాజ్యపాలన చేయగలిగాడు. ఇన్నాళ్లు అయోధ్యలో ఉండటం వలన అక్కడ కాశీరాజ్యములో పరిపాలన సక్రమంగా జరుగుతున్నట్టు లేదు. అందుకని తమరు కాశీరాజ్యమునకు వెళ్లడం ఉత్తమం." అని కాశీరాజుకు అనేక బహుమానములు ఇచ్చాడు. ఆ బహుమానములను తీసుకొని

కాశీరాజు వారణాసికి ప్రయాణమై వెళ్లాడు. తరువాత తనకు సామంతులు, పట్టాభిషేక మహోత్సవమును చూడటానికి వచ్చిన 300 మంది రాజులను చూచి రాముడు ఇలా అన్నాడు. “ఓ రాజోత్తములారా! మీ అందరి శుభాశీస్సులతో నేను రాక్షస సంహారము చేయగలిగాను. మీ అందరి సహాయ సహకారాలు లేకుండా నేను ఏమీ చేయగలిగే వాడిని కాదు. నేను దండకారణ్యములో ఉండగా రావణుడు సీతను అపహరించాడు అని తెలిసిన భరతుడు నాకు సాయంగా మిమ్ములను అందరినీ పిలిపించాడు. కాని నాకు మీ సాయము తీసుకోవలసిన అవసరమురాలేదు. అందుకని ఈసంవత్సర కాలము మీరు ఇక్కడే ఉండిపోయారు. ఇంక మీరు మీ మీ రాజ్యములకు వెళ్లండి.” అని అన్నాడు రాముడు. రాముని మాట మేరకు అందరూ వారి

వారి రాజ్యములకు వెళ్లిపోయారు.


శ్రీమద్రామాయణము

ఉత్తరకాండము ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము

ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్