24, ఏప్రిల్ 2020, శుక్రవారం

శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము


🌹. శ్రీ ఆర్యా ద్విశతి వైభవము - 1 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక  (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

మన ప్రాచీన భారతీయ ఋషులలో శ్రీవిద్యలోనూ, శైవములోనూ రెండిటా సిధ్ధిని పొంది, పరబ్రహ్మమును దర్శించినవారు, శ్రీ లలితా పరాభట్టారికా అమ్మవారి యొక్క పన్నెండు మంది ప్రఖ్యాత శ్రీవిద్యోపాసకులలో ఒకరైనవారు, సాక్షాత్తు శివాంశలో జన్మించినవారు శ్రీశ్రీశ్రీ దుర్వాసో మహర్షి.

దుర్వాస మహర్షినే క్రోధ భట్టారక అనే పేరుతోనూ పిలుస్తారు, క్రోధ భట్టారక అంటే వారిది సాధారణ మానవులలాగా ఉండే తామసిక/రాజసిక క్రోధము కాదు. వారి క్రోధము లోక కళ్యాణము కోసమై ఉపకరిస్తుంది.

అందుచేత మనవంటి వాళ్ళకు కలిగే తుఛ్చమైన కోపముతో వారి కోపమును పోల్చకూడదు. మహాత్ముల ప్రతీ గుణమూ లోకకళ్యాణము కొరకే అని గుర్తెరిగి ఉండాలి. దుర్వాసో మహర్షి, అమ్మ వారి యొక్క సాత్త్విక కోపమునకు ప్రతీక. ఆయన కోపము, భక్తులను సరిదిద్దడానికి, తద్వారా వారిని రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇదే అమ్మ వారి యొక్క అమితమైన క్రియా శక్తి.

ఆర్ష వాఙ్మయములో ‘భట్టారకా’ అని పిలువబడినవారు ముగ్గురు. ఒకరు సాక్షాత్తు శ్రీ లలితా పరాభట్టారికా అమ్మవారు. రెండవవారు క్రోధ భట్టారక అని పిలువబడిన దుర్వాస మహర్షి, మూడవవారు శృంగార భట్టారక అని పిలువబడిన మహాకవి కాళిదాసు గారు.

శ్రీ దుర్వాస మహర్షి సాక్షాత్తు పరమ శివుని అంశలో, అత్రి మహర్షి మరియు అనసూయ మాతకి పుట్టారు. త్రిమూర్తులు అత్రి అనసూయల తపస్సును పరీక్షించడానికి వచ్చినప్పుడు, అనసూయ మాత వారికి భోజనం వడ్డించబోతే, ఆమె నగ్నంగా వడ్డిస్తేనే ఆతిథ్యం స్వీకరిస్తామని అనడంతో, త్రిమూర్తులే ఇలా వచ్చారు అని గుర్తు పట్టిన ఆ తల్లి, తన పాతివ్రత్య బలముతో ఆ ముగ్గురిని పసి పాపలుగా చేసి, అన్నం తినిపించి, ఊయలలో వేసి ఆడిస్తూ ఉంటుంది.

ఇంతలో త్రిమూర్తుల యొక్క భార్యలైన ముగురమ్మలు, వారి వారి పతులకోసం వెతికి అత్రి ఆశ్రమానికి వచ్చి, పతి భిక్ష పెట్టమని అర్ధిస్తారు. అంతట అనసూయ మాత ఆ పాపలను మళ్ళీ మంత్ర జలం చల్లి త్రిమూర్తులకు యథా స్వరూపాన్నిస్తుంది. అప్పుడు అనసూయ మాత యొక్క పాతివ్రత్యానికి మెచ్చిన త్రిమూర్తులు వరం కోరుకోమంటారు.

ఆ తల్లి త్రిమూర్తులే నాకు బిడ్డలుగా రావాలని అడుగుతుంది. తత్ఫలితంగా, శివుడు దుర్వాసుడిగానూ, శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుల వారి గానూ, చతుర్ముఖ బ్రహ్మగారు చంద్రుడి గానూ పుట్టిన వైనం అందరికీ తెలిసే ఉంటుంది. పరమశివుడే నాలుగు యుగాలలోనూ దుర్వాస, పరశురామ, ధౌమ్య మరియు ఆదిశంకర భగవత్పాదాచార్యులుగా వచ్చారని పెద్దలు చెప్తారు. శ్రీ దుర్వాసో మహర్షి అమ్మవారిని ఆరాధించ ప్రముఖమైన శ్రీవిద్యోపాసకులలో ఒకరు. దుర్వాస మహర్షి ఇచ్చిన శ్రీవిద్యా విభాగమును సాది విద్య అంటారు. అలాగే లోపాముద్ర అమ్మ ఇచ్చిన శ్రీవిద్యా విభాగమును హాది విద్య అంటారు.

కంచి కామాక్షీ అమ్మవారి మూల స్వరూపం ఎదురుగా భూ-ప్రస్థాన శ్రీచక్రమును ప్రతిష్ఠ చేసినది శ్రీ దుర్వాస మహర్షియే. వారు అమ్మవారిని కీర్తిస్తూ, లలితా స్తవరత్నము (దీనినే ఆర్యా ద్విశతి అంటారు), త్రిపుర మహిమ్న స్తోత్రము (ఈ స్తోత్రం మొత్తం మంత్ర శాస్త్రమే), పరాశంభు మహిమ్న స్తోత్రము అనే మూడు అద్భుతమైన స్తోత్రములు చేశారు.

వారు చేసిన లలితా స్తవరత్నము అనే స్తోత్రము “ఆర్యా ద్విశతి”గా ప్రఖ్యాతి వహించిన స్తోత్రము.  కామాక్షీ అమ్మవారి వైభవమును, శ్రీచక్ర రహస్యాలను వర్ణించే స్తోత్రములు ఇప్పటి వరకు ఆర్షవాఙ్మయములో మూడు ఉన్నాయి. మొదటిది దుర్వాసో మహర్షి ప్రణీత ఆర్యాద్విశతి, రెండవది శంకర భగవత్పాదులు చేసిన సౌందర్య లహరి, మూడవది మూకశంకరులు చేసిన మూకపంచశతి. ఈ మూడు స్తోత్రములు అమ్మవారిని కీర్తించిన అత్యత్ద్భుతమైన స్తోత్ర రాజములు. దుర్వాసో మహర్షియే సరస్వతీ అమ్మవారి శాపం వలన, మూక శంకరులుగా తిరిగి జన్మించారని పెద్దలు చెప్తారు.

పైన వ్రాసిన స్తోత్రములే కాకుండా, శ్రీ దుర్వాస మహర్షి "సౌభాగ్య చింతామణి కల్పము" ఇచ్చారు. దీనినే దుర్వాస సంహిత అని కూడా అంటారు. ఈరోజుకీ కంచి కామాక్షీ అమ్మవారి దేవాలయములో అమ్మవారి ఆరాధన ఈ చింతామణి కల్పము ఆధారముగానే చేస్తారు.

దుర్వాస మహర్షి, కంచి కామాక్షీ అమ్మవారి ఆలయంలో అనేక మంది భక్తులకి వారు ప్రత్యక్ష దర్శనం ఇచ్చి అనుగ్రహించారు. కామాక్షీ అమ్మవారికి చందనోత్సవం చేసినప్పుడు ఇప్పటికీ, అమ్మవారి కుడి వైపు దుర్వాస మహర్షిని చూడవచ్చని, ఆ దర్శనం చేయగలిగిన సత్పురుషులకు వారు కనబడతారని పెద్దల విశ్వాసం.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి