27, జనవరి 2022, గురువారం

 శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

33వ నామ మంత్రము  27.1.2022

ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్యై నమః

కామేశ్వరుని భౌతాకాతీతమైన ప్రేమరత్నమును పొందుటకు కామేశ్వరి (శ్రీమాత) తన భౌతికమైన స్తనరత్నములను పణముగా సమర్పించుకున్న జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తనీ అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్యై నమః అని ఉచ్చరించుచూ భక్తితత్పరతతో ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునకు భౌతికపరమైన వాంఛలు పోయి ఆధ్యాత్మికతా తత్త్వ మానసుడై ఆ పరమేశ్వరీ పాదసేవాపరాయణుడై శాశ్వత బ్రహ్మత్వసాధనలో తరించును.

ఈ నామ మంత్రమందు విశేషమైన ఆధ్యాత్మికతత్త్వము ఇమిడి ఉంది. అదేమిటంటే పార్వతీ పరమేశ్వరులవలె అన్యోన్యంగా జీవించండి అని నూతన దంపతులను ఆశీర్వదించడం జరుగుతూ ఉంటుంది.

ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములను నిర్వహిస్తూఉంటాడు. పరమేశ్వరుడిని నిరంతరారాధన చేసేవారి హృదయమే కైలాసమై, వారి మనసులోని కామక్రోధాదులు శమించి నిరంతరానందాన్ని పొందుతారన్నది సత్యము. నిర్గుణ పరబ్రహ్మ యొక్క కర్మ స్వరూపం శ్రీమహావిష్ణువు అయితే, జ్ఞాన స్వరూపం పరమేశ్వరుడు. అందుకే లౌకిక పురోగతికి విష్ణు రూపాన్ని, ఆధ్యాత్మిక పురోగతికి శివ స్వరూపాన్ని ఆరాధన చేయాలి. ఇంతటి భౌతికాతీతమైన పరమేశ్వరుని ప్రేమ అనే ఒక రత్నాన్ని పొందడానికి జగన్మాత తన స్తన రత్నములను రెండిటిని పణముగా పరమేశ్వరునికి ఇచ్చినది. ఇలా ఆ ఆది దంపతులు  వారి ప్రేమ అనే వస్తువులను ఇచ్చి పుచ్చుకున్నారు అంటే పరమేశ్వరుని ప్రేమరత్నంపై శ్రీమాతకు, శ్రీమాత స్తన రత్నములపై పరమేశ్వరునకు హక్కులు ఇచ్చి పుచ్చుకున్నారు అంటే అయ్యవారి ప్రేమ ఇంక అమ్మవారిదే...అమ్మవారికొక్కదానికే...ఆ ప్రేమలో ఇంకొకరికి భాగంలేనట్లే అంటే అయ్యవారు ఏక పత్నీవ్రతుడే గదా. అలాగే అమ్మవారి స్తనరత్నాలు అయ్యవారికి మాత్రమే అంటే అమ్మవారి పాతివ్రత్యానికి నిదర్శనమేగదా. అయ్యవారి, అమ్మవారి దివ్యమైన మరియు పవిత్రమైన దాంపత్య ఫలితమే ఈ విశ్వం గనుక దంపతులైనవారు అందరూ ఇదే పాతివ్రత్యాన్ని, ఏక పత్నీవ్రతాన్ని కలిగి ఉండాలని సూచనయే కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తనీ అను నామ మంత్రములోని భావము.

వశిన్యాది వాగ్దేవతలు అమ్మ ఆదేశం మేరకు కోట్లాది సహస్ర నామాలలో శ్రీలలితా సహస్ర నామములను అత్యంత ప్రాధాన్యమైనదిగా రచించారు. శ్రీలలితా సహస్ర నామాలు ఇతర సహస్ర నామాలవలె ఋషులుగాని, తాపసులుగాని ఇంకెవరో మానవమాత్రులు రచించినవి కావు. సాక్షాత్తు ఆదిపరాశక్తి నుండి వెడలివచ్చిన ఎనిమిది అద్భుతమైన కిరణములే ఆ వశిన్యాదులు (వశినీ, కామేశ్వరి, మోదిని, విమల, జయిని, అరుణ,  సర్వేశ్వరి, కౌళిని). వారు పరబ్రహ్మస్వరూపిణియైన పరమేశ్వరి అంశ నుండి వ్యక్తమైన బ్రహ్మజ్ఞానస్వరూపులు. అమ్మవారిని కీర్తించడానికి, ఆ తల్లికి ప్రియాతి ప్రియమైన సహస్రనామములు మాత్రమేగాక, బ్రహ్మజ్ఞాన తత్త్వము, పిండాండము నుండి బ్రహ్మాండము వరకు  ఇమిడియున్న అనంతమైన పంచకృత్యపరాయత్వము, ఆ పరమేశ్వరియొక్క స్థూల, సూక్ష్మ, కారణ రూపముల తత్త్వము, శ్రీయంత్రము, బ్రహ్మాండము, పిండాండము - ఈ మూడింటియొక్క సమన్వయమును తెలిపే షట్చక్రాది విశేషములు, చతుష్షష్టికోటి యోగినీ గణదేవతలు, తిథిమండలములు... ఇంకను ఎన్నో పరబ్రహ్మ తత్త్వమునకు సంబంధించిన విషయములను రహస్యాతి రహస్యమైన శ్రీలలితా సహస్ర నామములలో నిక్షిప్తముజేసి అనంతమైన బ్రహ్మజ్ఞాననిధిని మనకు సమర్పించారు. అమ్మవారి నామములు కేవలము సహస్రము మాత్రమేకాదు. పంచదశీమంత్ర స్వరూపమైన త్రిశతి మాత్రమేకాదు. సకలదేవతా స్వరూపిణియైన ఆ పరమేశ్వరికి అనంతకోటి నామములు గలవు. అనంతకోటి స్వరూపములుగలవు. అంతటి అమ్మవారు పరమేశ్వరుని ప్రేమ యనే రత్నమును పొందుటకు తన స్తనద్వయం పణంగా (మూల్యముగా) సమర్పించినది అంటే పరమేశ్వరుడు ఎవరు? ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు.

పరమేశ్వరుడిని నిరంతరారాధన చేసేవారి హృదయమే ఒక వెండికొండ. నిరంతరానందాన్ని పొందుతుంది.  జ్ఞాన స్వరూపం ఆ పరమేశ్వరుడు. ఆధ్యాత్మిక పురోగతికి శివ స్వరూపాన్ని ఆరాధన చేయాలని వేదాలు చెబుతున్నాయి.

వేదం శివుడిని సకల దుఃఖ హరుడైన రుద్రుడిగా చెబుతోంది. శత్రుబాధ, పిశాచపీడ, దుఃఖము పోవడానికి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని,

విషపూరిత జీవుల నుండి రక్షణకై ఓం నమో భగవతే నీలకంఠాయ అనే మంత్రాన్ని పఠించాలన్నది వేదవచనం. అంతటి వాడైన పరమేశ్వరునికి ఆ పరమేశ్వరి ఆ విధంగా తనను తాను సమర్పించుకున్నది. ఆయనలో సగం తానై అర్ధనారీశ్వర తత్త్వాన్ని లోకానికి తెలియజేసింది ఆ పరమేశ్వరి. 

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు  ఓం కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణ స్తన్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

34వ నామ మంత్రము 28.1.2022

ఓం నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయ్యై నమః

 నాభి (అను పాదు) నుండి వక్షస్థలం వరకూ ఉన్న నూగారు (సన్నని నూగువలె ఉన్న రోమాళి) అను తీగ (లత) కు ఫలముల వలె ఉన్న స్తనములతో తేజరిల్లు జగన్మాతకు నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయీ అను పదహారక్షరముల (షోడశాక్షరీ)  నామ మంత్రమును ఓం నాభ్యాలవాల రోమాళి లతా ఫల కుచద్వయ్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకుడు రాగద్వేషరహితుడై, ఆత్మానందానుభూతిని పొందును.

పొట్ల, చిక్కుడు వంటి తీగ మొక్కలను పెంచుటకు ముందు ఒక చిన్న గుంటచేసి, గింజను వేసి కొంచం మట్టితో కప్పి చిన్న పళ్ళెంవలె మట్టిని ఆ గుంటకు చుట్టూ ఏర్పాటు చేస్తారు. దానిని పాదు అంటారు. అందులో నీరు పోస్తూండగా గింజ మొలకెత్తి తీగవస్తే దానిని పందిరిపైకి వచ్చేలా ఏదైనా ఆధారం ఏర్పాటు చేస్తారు. తీగ పందిరిపైకి వచ్చిన తరువాత ద్రాక్షతీగ వంటిదైతే ఆ తీగకు పందిరిపై ద్రాక్షపళ్ళు ఏర్పడతాయి. అలాగ శ్రీమాత అమ్మవారి బొడ్డు అనే పాదునుండి సన్నని రోమాళి నాభి నుండి వక్షస్థలం క్రింది వరకూ ఊర్థ్వముఖంగా ఉంటుంది,  దీనినే నూగారు అంటారు, అటువంటి నూగారు అనే తీగకు  అమ్మవారి స్తనయుగము తీగకు రెండు ప్రక్కల ఫలముల వలె ఉండి జగన్మాత విరాజిల్లుచున్నదని వశిన్యాదులు ఈ నామ మంత్రములో వర్ణించారు.

ఇచ్చట నాభి అనునది మణిపూర చక్రస్థానము అయితే,  స్తన మధ్యభాగం - అనాహత చక్రస్థానము అవుతుంది.  ఇడా, పింగళా నాడుల ఆ పరమేశ్వరి స్తనములుగా భావించితే, బొడ్డు నుండి వక్షస్థలంవరకూ ఉర్ధ్వముఖంలో ఉన్న సన్నని రోమాళిని సుషమ్నా నాడిగా భావించవచ్చును.

నాభియందు ఆలవాలత్వము  (పాదు అనే భావము), రోమాళియందు లతాత్వము సమన్వయించబడినవి. కుచముల యందు ఫలత్వము సమన్వియింపబడినది. మొదటి సమన్వయము రెండవ సమన్వయత్వమునకు కారణములుగా భావింపదగును. తల్లీ బిడ్డల మధ్యగల   పుట్టిన వెంటనే బొడ్డును కోయడంతో భౌతిక బంధం తెగుతుంది. అందుకే బొడ్డును కోస్తారు. అయితే ప్రేమబంధంతో సంబంధం ఉండదు అని తెలియదగును.  శివుని కోపాగ్నికి మన్మథుడు కాలిపోతే, ఆ తాపం తగ్గడం కోసం అమ్మవారి నాభి అనే సరసులో దూకితే - అప్ఫుడు ఆ బొడ్డు అనే సరస్సునుండి సన్నని తీగలాగా పైకిలేచిన పొగతీగవలె అమ్మవారి నూగారు (సన్నని) రోమాళి ఉంటుందని శంకరాచార్యులవారు సౌందర్యలహరియందు  డెబ్బది ఎనిమిదవ శ్లోకంలో ఇలా వర్ణించారు.

స్థిరో గంగావర్త - స్తనముకుళ రోమావళిలతా

కలావాలం కుండం - కుసుమశరతేజో హుతభుజః ||

రతేర్లీలాగారం - కిమపి తవ నాభి ర్గిరిసుతే

బిలద్వారం సిద్ధే - ర్గిరిశ నయనానాం విజయతే॥78॥

ఓ పరమేశ్వరీ!  నీ నాభి నిశ్చలమైన గంగ ప్రవాహం. స్తనములు అను పూలమొగ్గలకు ఆధారమైన రోమరాజి యనెడు తీగకు పాదు. మన్మథుని పరాక్రమాగ్నికి హోమగుండము. రతీ దేవికి విహార గృహము. ఈశ్వరుని కనుల సిద్ధికి గుహాముఖము. అయి విరాజిల్లుచున్నది.

జననీ!  ఓ జగన్మాతా! నీ నాభిని, వక్షస్థలం పైకి ఊర్ధ్వమఖంగా ఉన్న సన్నని రోమాళి -  నూగారును ఎంత వర్ణించినా తక్కువే తల్లీ. అవి అంత సౌందర్యవంతమైనవి. నీ నాభి గంగానదియందు పుట్టిన స్థిరమైన సుడిగుండమయితే,  పయోధరములు అను రెండు పుష్పములు పూచిన రోమావళి (నూగారు) అను లతకు ఆధారమైన పాదులా ఉంటుంది. (అమ్మ నాభి పాదు ఐతే నూగారు దానినుండి వచ్చిన తీగగా, ఆపైన పాలిండ్లు ఆ తీగకు పూచిన రెండు పుష్పములు గా ఉన్నవి అని) మన్మథుని తేజస్సు అను కాంతితో ప్రకాశించుచున్న అగ్నిహోత్రంతో కూడిన హోమగుండలా ఉంటుంది, రతీదేవి విహరించే గృహంలా ఉంటుంది, ఇక పరమేశ్వరుని కంటికేమో తనకు తపస్సిద్ది నొసంగు గుహద్వారంలా ఉంటుంది ఇలా ఎంతని చెప్పను జగన్మాతా! ఎంత వర్ణించినా తనివి తీరనంతటి అందంతో నీ నాభి విరాజిల్లుతున్నది -  ఇక్కడ  వర్ణింపబడిన అమ్మ నాభి పాదువలె, రోమావళి లతవలె చెప్పబడినది.

శంకరాచార్యులవారు పై శ్లోకములో  పూలమొగ్గలని చెప్పినవి ఈ నామ మంత్రంలో వశిన్యాదులు ఫలములుగా వర్ణించారు.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయ్యై నమః అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

35వ నామ మంత్రము 29.1.2022

ఓం  లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమాయై నమః.

కనబడుచున్న నూగారు (రోమలత) అను తీగకు ఆధారంగా విరాజిల్లు సన్నని నడుము గలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమా అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రముసు ఓం లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమాయై నమః అని ఉచ్చరించుచూ పరమేశ్వరీ పాదసేవాపరాయణులైన భక్తులకు పరమేశ్వరి అనుగ్రహంలభించి శ్రీవిద్యా తత్త్వము పూర్తిగా అవగాహన చేసుకొని ఆత్మానందానుభూతిని పొంది తరించుదురు.

పందిరి మీదకు తీగ పాకాలంటే ఆలంబన అవసరము. పాదులో మొక్క తీగ వేయుట ప్రారంభించిందంటే ఏదో ఒక సన్నని కర్రవంటిది లేదా పాదుకు చూట్టూ కంపకట్టి ప్రారంభమైన తీగ పందిరి మీదకు వెళ్ళడానికి ఆధారం ఇస్తారు. ఆ తీగ చాలా సున్నితంగా ఉంటుంది. ఇచ్చిన ఆలంబనను తీసుకొని పందిరి మీదకు తీగ ప్రాకడం ప్రారంభిస్తుంది. అమ్మ వారి నాభి అనే పాదులో ప్రారంభమైన నూగారు (నూగువంటి రోమాళి) అను తీగ వక్షస్థలము పైకి ప్రాకుతుంది. ఆ నూగారు తీగకు అమ్మవారి స్తనములు ఫలములైనవని  ఇంతకు ముందు నామములో చెప్పబడినది. ఆ నూగారు అను తీగ పైకి పాకడానికి ఆలంబన (ఆధారం) అవసరము.  అమ్మవారి సన్నని అందమైన నడుమే ఆ నూగారు అను తీగకు ఆధారము.

సన్నని నడుము గల స్త్రీని సింహమధ్య అంటారు. స్త్రీలకు నడుము అందంగా సన్నగా ఉండడం శుభప్రదమైన సాముద్రిక లక్షణము. 

అమ్మవారి నడుమును శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరి, ఏడవ శ్లోకంలో ఇలా వర్ణించారు:-

క్వణత్కాంచీ-దామా కరి కలభ కుంభస్తనభరా

పరిక్షీణా మధ్యే - పరిణత శరచ్చంద్రవదనా |

ధనుర్బాణాన్ పాశం -  సృణిమపి దధానా కరతలైః

పురస్తా దాస్తాం నః -  పురమథితు రాహోపురుషికా॥7॥
 
మంగళప్రదమైన సవ్వడులు చేయుచున్న మెరయుచున్న మణులతో కూడిన బంగారు మొలనూలు ధరించినదియు, మదపుటేనుగుల కుంభస్థలముల వంటి స్తనముల భారముచే కొంచము ముందుకు వంగినదియు, (సాధారణ తల్లులే తమ బిడ్డలకై క్షీరసమృద్ధితో భారమైన స్తనద్వయం కలిగియుండగా  సకల జగత్తుకూ తల్లియైన జగన్మాత, జగత్తులోని అందరి బిడ్డల ఆకలినీ పోగొట్టుటకు భారమైన స్తనములతో ఒప్పారుచున్నది)
కృశించిన సన్నని నడుము కలదియు, శరత్కాల పూర్ణిమనాటి చంద్రబింబమువంటి ముఖారవిందము కలిగినదియు, చతుర్భుజముల కరములయందు చెరకువిల్లు, పుష్పబాణములు, పాశ, అంకుశములు ధరించునదియు, త్రిపురాసురులను సంహరించిన పరమేశ్వరుని యొక్క అహంకారమే స్వరూపముగా కలిగినదియు అయిన అటువంటి జగన్మాతయైన ఆదేవి ఎల్లవేళలా నా మనోనేత్రములయందు గోచరమవుతూ నా మనో ఫలకముపై సుఖాసీనయై ఉండుగాక!

అందమైన సన్నని నడుము గల స్త్రీలను అసలు నడుము ఉందా లేదా అని సందేహించేంత సన్నని నడుము కలది అని అంటూంటారు.. స్త్రీలకి నడుము బాగము ఎంత సన్నగా ఉంటే అంత తేలికగా పిల్లలను ప్రసవించ గలుగుతారు అని అంటారు. ఇది కూడా ఉత్తమ సాముద్రిక లక్షణము. జగదేక సుందరి, సకలజగములకు తల్లి అయిన పరమేశ్వరికి నడుము ఈ కారణం చేతనే సన్నగా ఉన్నది అని భావము.

శంకరభగవత్పాదులవారు ఇంకను తమ సౌందర్యలహరియందు డెబ్బది తొమ్మిదవ (79వ) శ్లోకంలో ఇలా వర్ణించారు.

నిసర్గక్షీణస్య - స్తనతటభరేణక్లమజుషో

నమన్మూర్తే ర్నారీతిలక శనకైస్త్రుట్యత ఇవ|

చిరం తే మధ్యస్య - త్రుటితతటినీతీర తరుణా

సమావస్థాస్థేమ్నో - భవతు కుశలం శైలతనయే||79||

సహజముగానే కృశించింది. స్తన భారముచే వంగినది. నాభియు, వళులు (మడతలు) ను ఉన్న చోట విఱిగిపోవునో యన్నట్లున్నది. ఒడ్డు విఱిగిన నదీ తీరమున ఉన్న చెట్టువలె ఊగుచున్నది.
 
ఓ జగన్మాతా!  నారీ శిరోమణీ!  అతి సన్నగా ఉన్న నీ నడుమును చూస్తుంటే అది ఎక్కడ తునిగిపోవునో (విరిగిపోవునో) అని నాకు కంగారు కలుగుచున్నది. సహజంగానే మిగుల కృశించి సన్నంగా ఉండేది, స్తన భారంచేత బడలిపోయి కొంచెం వంగిన ఆకారము కలిగినది, ఒడ్డు (గట్టు) మీద ఉండి వాగువైపునకు వంగిన చెట్టులా వంపుతిరిగి ఉండేది అయిన నీ నడుము చిరకాలమూ కుశలంగా ఉండి మాకు క్షేమం కలిగించుగాక.

సన్నగా కృశించి ఉన్న నడుము స్త్రీ అందంలో ప్రధాన. భూమిక పోషించును. అమ్మవారి నడుము అత్యంత సుకుమారంగా సుందరంగా ఉన్నది అని కవి భావన.  అమ్మ నడుముకు పై భాగము, క్రింద భాగము విశాలముగా ఉండి మధ్యలో ఈ నడుము ఉన్నదా లేదా అని అనిపించేంత అతి సన్నదిగా ఉన్నది అని భావము.

దేవియొక్క ఆవిర్భావ కాలమున ఇంద్రుని తేజముచే నడుము ఏర్పడెను అని దేవీభాగవతంలో పంచమస్కంధంలో, పదకొండవ అధ్యాయంలో డెబ్బది ఒకటవ శ్లోకంలో చెప్పబడినది.

సౌమ్యేన తేజసా జాతం స్తనయో ర్ముగ్మముత్తమమ్‌|

ఇంద్రేణా స్యా స్తథా మధ్యం జాతం త్రివళిసంయుతమ్‌॥71॥

చంద్రుని తేజస్సుతో రెండు వక్షోజములు, ఇంద్రుని తేజస్సుతో మధ్యభాగమగు కటిప్రదేశము మరియు త్రివళులు (పొట్టపై ఉండు మూడు మడతలు),

సమున్నేయ మధ్యమా అనగా చక్కగా  ఉద్ధరింపబడిన నడుముకలిగినది అని అర్థము. అమ్మవారి విరాట్స్వరూపంలో నాభికి పైన ఊర్ధ్వలోకములు,  నాభికి దిగువన అధోలోకములు ఉన్నవి. ఊర్ధ్వలోకములను, అధోలోకములను ఉద్ధరించేందుకే అంతసన్నని నడుము ఉన్న పరమేశ్వరిని సమున్నేయ మధ్యమా  యని విశేషించి చెప్పడం జరిగినది.

శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం లక్ష్యరోమలతాధారతా సమున్నేయమధ్యమాయై నమ  అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

36వ నామ మంత్రము 30.1.2022

ఓం స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయాయై నమః

దృఢమైన స్తనముల భారముచే నడుము విరుగునేమోయని నడుము చుట్టూ పట్టీలువలెనున్న వళిత్రయము (పొట్టపై మూడు మడతలు) గలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళియందలి స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరాశక్తిని ఉపాసించు సాధకులకు కాలస్వరూపిణియైన శ్రీమాత కరుణచే సర్వసౌభాగ్యములు, సుఖసంతోషములు, ఎనలేని ఆత్మానందము కలుగును మరియు పరాశక్తి ఆరాధనలో మరింత ఏకాగ్రత ఏర్పడి పరమపదమునకు సోపానములు ప్రాప్తించి తరించుదురు.

అమ్మవారి స్తనద్వయం రవిసోమాత్మకమైన కాలాన్ని తెలియజేస్తుంది. అట్టి కాలమును భరించునది కావున ఆ పరమేశ్వరి కాలస్వరూపిణి యను భావము గ్రహించునది. స్తనముల బరువుచే నడుము విరుగునేమో యని కట్టిన పట్టీలవలె ఆ అమ్మవారి పొట్టమీద మూడు ముడుతలు గలవట.  చాలా సహజంగా యుక్తవయసు రాగానే పొట్టమీద మడతలు ప్రతివారికిని ఏర్పడుతాయి. జగన్మాత విషయంలో కొంచం ఉత్ప్రేక్షించడం జరిగింది. స్తనభారముచే సన్నని నడుము వంగిపోవునేమోనని భయంతో బంగారు పట్టీని నడుముచుట్టూ కట్టినట్లుగా శ్రీమాత వళిత్రయము (పొట్టపైగల మూడు మడతలు) ఒప్పుచున్నదట..ఆ వళిత్రయముతో అమ్మవారి సౌందర్యము మరింత ఇనుమడిస్తోందట. ఇది అంతయు వశిన్యాదులు జగన్మాత సౌందర్య వర్ణనలో ఉపయోగించిన ఉత్ప్రేక్షాలంకారమే అవుతుంది. అలా ఈ నామ మంత్రమును వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి ఎదుట పఠించారట. ఆ తల్లి కన్నులు అరమోడ్పులయాయట. ఆ పెదవులపై మందస్మితము తళుక్కున మెరసిందట. 

అమ్మవారి నడుముచుట్టూగల ఆ మూడు ముడుతలు గుణత్రయముగా (సత్త్వరజస్తమో గుణములు), స్దూల, సూక్ష్మ కారణదేహములుగా,. అలాగే మువురమ్మలుగా(మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి), త్రిమూర్తులుగా (బ్రహ్మవిష్ణుమహేశ్వరులు), ముల్లోకములుగా (భూ, భువ, సువర్లోకములు) సమన్వయించు కోవచ్చును. 

శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు ఎనుబదియవ శ్లోకంలో అమ్మవారి వళిత్రయాన్ని ఇలా వర్ణించారు.

కుచౌ సద్య స్స్విద్య - త్తటఘటితకూర్పాసభిదురౌ

కషంతౌ దోర్మూలే - కనకకలశాభౌ కలయతా|

తవ త్రాతుం భంగా - దలమితి వలగ్నం తనుభవా‌

త్రిధా నద్ధం దేవి - త్రివళిలవలీవల్లిభి రివ॥80॥

మన్మథ నిర్మితములై కాంచన కలశములవంటి ఆ శ్రీమాత స్తనములు ఈశ్వర స్మరణచేత సారెకు ప్రక్కలయందు చెమర్చుచు రవికను పిగుల్చుచున్నవి. చంకలను ఒరయుచున్నవి. ఆ కుచ భారమునకు నడుము విరిగిపోకుండా కాపాడుటకై దేవి వళులు (నడుముపైని మూడు ముడుతలు) లవలీలతచే కట్టబడిన మూడు కట్లవలెనున్నవి.

ఓ తల్లీ! పరమేశ్వరీ! నిరంతరం స్వేదంతో తడచి ఇరు పార్శ్వములయందు అంటుకుని ఉన్న రవికను ఛిద్రం  చేయుచున్న, బాహుమూల సమీప ప్రదేశముల ఒరిపిడికి గురయగుచున్న, బంగారు కలశముల కాంతితో, అత్యంత సౌందర్య సౌభాగ్యాలతో ఒప్పు నీ స్తనముల బరువు వలన అతి సున్నితము, సుకుమారము సూక్ష్మము ఐన నీ నడుమునకు భంగపాటు కలుగకుండా ఉండడానికా అన్నట్లు, ఆ మన్మథుడు ఏలకి లత (ఏలక్కాయ లత) తీగలచేత మూడు చుట్లుతో మూడు కట్లు కట్టినట్లుగా నీ ఉదరం(పొట్ట) మీద ఉన్న ఆ మూడు మడతలు మూడు రేఖలుగా తోచుచున్నవి.

ఇచ్చట గమనించవలసిన విషయం ఒకటున్నది. అమ్మ సౌందర్యం కన్యా సౌందర్యంగా వర్ణించుటలేదు. కన్యగా అయితే ఆ ముడుతలు అందం కాకపోవచ్చు,కాని ఇక్కడ అమ్మను మన అందరి కన్నతల్లిలా, ప్రౌడ సౌందర్యంగా శ్రీ శంకరులు వర్ణించారు. బిడ్డల తల్లి అయిన ప్రౌఢ స్త్రీకి ఉదరంపై ముడుతలు అందమేకాక స్త్రీత్వానికి పరిపూర్ణతనిచ్చు మాతృమూర్తిగా, సంతానవతి ఈమె అను గొప్పను తెలుపునది కూడా. అందువల్ల అమ్మ ముడుతలతో అందంగా శోభిల్లుతున్నది. స్తనభారము మోయు నడుమును కాపాడుటకు మధ్యన పట్టబంధముతో కట్టబడినట్లు మూడు ముడుతలతో అమ్మ ఒప్పారుచున్నది అని భావము.

శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం స్తనభారదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయాయై నమః  అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

37వ నామ మంత్రము 31.1.2022

ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతట్యై నమః

బాలభానుని (ఉదయించు సూర్యుని) ఎఱుపు రంగువలెను, కుంకుమపువ్వు ఎఱుపు రంగువలెను కనిపించు వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశం కలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ అను పదహారు అక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును  ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతట్యై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులకు జీవనమే శుభప్రదమై, భోగభాగ్యములతోను, సుఖసంతోషములతోను విలసిల్లుచూ, పరమేశ్వరీ పాదసేవలో పరమపద సోపానములు కూడా అనాయాసముగా లభించును.

అరుణవర్ణము అంటే ఎఱుపు వర్ణము. అరుణారుణము అనగా  అరుణవర్ణాన్ని మరింత ఎక్కువజేసే మిక్కిలి అరుణవర్ణము. ఆ అరుణవర్ణము ఎలాంటిదంటే కౌసుంభ (కుంకుమ వర్ణము).  అనూరునివలె (అనూరుడు అరుణవర్ణంలో ఉంటాడు. అందుచే అరుణుడు అని కూడా అన్నారు. సూర్యుని రథచోదకుడు అనూరుడు. ఇతనికి ఊరువులు లేవు. ఊరువులు లేకుండా పుట్టాడు. మిక్కిలి అరుణవర్ణంలో ఉన్న అనూరునివలె) ఎర్రని రంగువస్త్రములతో ప్రకాశించే కటిప్రదేశముగలిగినది ఆ పరమేశ్వరి. గనుకనే అమ్మవారు అరుణారుణకౌసుంభవస్త్ర భాస్వత్కటీతటీ యని అనబడినది.

అమ్మవారికి అరుణవర్ణం అంటే చాలా ఇష్టము. ధ్యాన శ్లోకములో

సిందూరారుణ విగ్రహాం సిందూరం మాదిరిగా ఎర్రనైన శరీరము గలిగినది అమ్మవారు. రక్తోత్పలం బీభ్రతీమ్ ఎర్రని కలువను ధరించియున్నది. రత్నఘటస్థరక్తచరణాం రత్న ఘటమునందు రక్తమువలె ఎర్రని పాదములు గలిగినది అరుణాం కరుణా తరఙ్గితాక్షీం ఆపాద మస్తకమూ ఎర్రని రంగులో ప్రకాశించునదియు, సదా కనులనుండి కరుణా తరంగములు ప్రసరించునది ఆ పరమేశ్వరి. అమ్మవారు ఇష్టపడే మందారములు, కదంబములు, దాడిమీ కుసుమములు, అమ్మవారి పెదవులు అన్నియునూ అరుణవర్ణమే. అందుకే అమ్మవారు సర్వారుణా యని కూడా అనబడినది.

సాయ సంధ్యవేళలో కుంకుమపరచినట్లు ఉండే పడమటిదిశ  చూడముచ్చటగాను, వర్ణనాతీతముగాను ఉంటుంది. సకలవేదవేదాంగములను పుక్కిటబట్టిన వేదబ్రాహ్మణుని ముఖకమలం అరుణవర్ణ రంజితమై  ఉంటుంది. అంటే అతనిలో వేదరూపములో బ్రహ్మజ్ఞానము ప్రస్ఫుటమౌతున్నది గదా! ప్రేమకు, అనురాగమునకు ఎర్రని గులాబీ సంకేతము. సృష్టి అనేది ఉదయసంధ్యవంటిది. ఉదయసంధ్య ఎర్రని బాలభానుని వంటిది. జాగ్రదావస్థ అంటే అరుణవర్ణరంజితమైన ఉదయసంధ్యవంటిది. అరుణవర్ణము చైతన్యమునకు సంకేతము. పరమేశ్వరి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, అనంతకోటి జీవరాశికి అనురాగభరితమైన మాతృశ్రీ. గనుకనే అమ్మవారు అన్నివిధముల అరుణారుణ వర్ణరంజితమూర్తి. 

అటువంటి జగన్మాతకు నమస్కరించునపుడు  ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతట్యై నమః  అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

38వ నామ మంత్రము 1.2.2022

ఓం రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితాయై నమః

రత్నములతోను, చిఱుగజ్జెలతోను మిక్కిలి రమణీయమై అలరారే ఒడ్డాణపు త్రాడును ధరించియున్న శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళియందలి రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ జగన్మాత కరుణించి సకలాభీష్టములను నెరవేర్చును.

అమ్మవారు ఆపాద మస్తకమూ సకలాభరణభూషిత. ఆ ఆభరణములు నవరత్నఖచితములు.  అమ్మవారి ఒడ్డాణము సువర్ణముతో చేయబడినది. ఆ ఒడ్డాణమునకు అంచులందు రత్నములు పొదిగిన చిఱుగంటలు ఉన్నవి. అటువంటి రత్నఖచితమైన చిఱుగంటల అంచులుగలిగిన అందమైన బంగారపు ఒడ్డాణముతో   అలంకృత అయిన పరమేశ్వరి రత్నకింకిణికారమ్య రశనాదామ భూషితా యని అనబడినది.

మగవాళ్ళకు మొలత్రాడు, ఆడవాళ్ళు బంగారు మొలనూలు లెేదా ఒడ్డాణము ధరించుట సాంప్రదాయము. మొలనూలు లేదా  ఒడ్డాణము శరీరమునందు మధ్యభాగమున ఉంటుంది. అమ్మవారు ధరించిన ఒడ్డాణము నాభిమీదుగా ఉండును. అమ్మవారి విరాట్స్వరూపమును ఆలోచిస్తే ఆ తల్లి నాభికి పైనగల ఊర్ధ్వలోకములు, నాభికి క్రిందగల అధోలోకములను అనుసంధానము చేయుచున్నట్లుగా ఉండును.

సౌమ్యేన తేజసా జాతం స్తనయో ర్ముగ్మముత్తమమ్‌|

ఇంద్రేణా స్యా స్తథా మధ్యం జాతం త్రివళిసంయుతమ్‌॥71॥

జంఘోరూ వరుణస్యాఽథ తేజసా సంబభూవతుః| 

నితంబః స తు సంజాతో విపుల స్తేజసా భువః॥72॥॥

(దేవీభాగవతము, పంచమస్కంధము, పదకొండవ అధ్యాయము)

చంద్రుని తేజస్సుతో రెండు వక్షోజములు, ఇంద్రుని తేజస్సుతో మధ్యభాగమగు కటిప్రదేశము మరియు త్రివళులు (పొట్టపై ఉండు మూడు మడతలు), వరుణుని తేజస్సుతో తొడలు ప్రకటితమయ్యెను

శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం రత్నకింకిణికా రమ్య రశనా దామ భూషితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

39వ నామ మంత్రము 2.2.2022
 
ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః

పరమేశ్వరునికి (శ్రీమాత భర్తకు) మాత్రమే తెలిసిన సౌభాగ్యశ్రీలతోను మృదుత్వంతోను కూడిన ఊరువులు కలిగిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి  కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః అని ఉచ్చరించుచూ శ్రీమాతను పూజించు భక్తులకు ఆ తల్లి ఆత్మానందమును, బ్రహ్మానందమును ప్రసాదించి కరుణించును.

భార్యయొక్క అంగాంగములు భర్తకు మాత్రమే తెలియును. ఇందుకు పార్వతీ పరమేశ్వరులు ఏమాత్రమూ మినహాయింపుకారు.  ఆదర్శదాంపత్యానికి పార్వతీపరమేశ్వరులే ప్రతీకలు. అమ్మవారి సర్వాంగములు వివిధ దేవతలయొక్క అంశలనుండి ప్రకటితమయినవి. 

జంఘోరూ వరుణస్యాఽథ తేజసా సంబభూవతుః| 

నితంబః స తు సంజాతో విపుల స్తేజసా భువః॥72॥॥ (దేవీభాగవతం, పంచమస్కంధం, పదకొండవ అధ్యాయము)

వరుణుని తేజస్సుతో తొడలు, పిక్కలు, భూదేవి తేజముతో విశాలమైన నితంబభాగము (పిరుదులు)  ప్రకటితమయ్యెను.

పరమేశ్వరుడు ఈ జగత్తుకే సాక్షీభూతుడు, సచ్చిదానంద స్వరూపుడు. ఆయన కామేశ్వరుడు. ఆ పరమేశ్వరి కామేశ్వరి. కామేశునికి మాత్రమే తెలియదగిన ఊరుద్వయము కామేశ్వరి కలిగియున్నది. ఈ విషయాన్నే శ్రీలలితా సహస్ర నామావళిలో వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా యని అన్నారు. కామేశజ్ఞాత అనగా కామేశ్వరునికి మాత్రమే తెలిసిన, సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా సౌభాగ్యము, మార్దవముగలిగిన ఊరుద్వయముతో కూడినది ఆ పరమేశ్వరి. అమ్మవారి ఊరువుల జంటలో ఎడమ తొడ సౌభాగ్య సంకేతము, కుడి తొడ మార్దవ సంకేతము గలిగి యున్నది. ఊరు అనగా ఊ అను అక్షరము, రు లో ఉ కారము గలవు.  ఇందులో ఉ కారము దక్షిణోరువు, ఊ కారము వామోరువు. వామోరువు పరాసూచితము. దక్షిణోరువు అపరాసూచితము. వామోరువు జగత్తులోని బ్రహ్మక్షత్రియ వైశ్యశూద్రులు అను నాలుగువర్ణములకు సూచన అయితే, దక్షిణోరువు భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము అను పంచభూతములను మరియు మనోబుద్ధ్యహంకారములను సూచిస్తాయి.

అమ్మవారి కపోలము అష్టమీచంద్రుడనియు, కనుబొమలు మన్మథగృహ తోరణమునియు, రెండు కన్నులు ఆ తల్లి ముఖప్రవాహమున చలించెడి మీనముల జంట అనియు, నాసాదండము నవ సంపెంగవంటి దనియు, చెక్కిళ్ళు పద్మరాగ శిలలను, అద్దమును తిరస్కరించుచుండెననియు, ఆ తల్లి పెదవులలో ఒక పెదవి క్రొత్తపగడమును, క్రింది పెదవి దొండపండును వెక్కిరించు చున్నవనియు, ఆ తల్లి దంతపంక్తులజంట శుద్ధవిద్యాంకురములైన ద్విజులనియు, ఆ తల్లి పలుకులు కచ్ఛపి వీణానాదముకన్నా మధురమనియు... ఇలా అన్నిటికీ ఉపమానములు చెప్పగా, అమ్మవారి ఊరుద్వయము కామేశ్వరునికి మాత్రమే తెలియడం చేత వశిన్యాది వాగ్దేవతలు ఉపమానమును చెప్పలేదు.

శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరిలో ఎనుబది రెండవశ్లోకంలో వర్ణించినవిధం ఇలా ఉన్నది:

కరీన్ర్దాణాం శుండాన్‌ - కనక కదళీకాండపటిలీం

ముభాభ్యా మూరుభ్యా - ముభయమపి నిర్జిత్య భవతి|

సువృత్తాభ్యాం పత్యుః - ప్రణతికఠినాభ్యాం గిరిసుతే

విధిజ్ఞే జానుభ్యాం - విబుధకరికుంభద్వయమసి॥82॥

అమ్మా! ఓ పరమేశ్వరీ! వేదవిహితమైన ధర్మానుష్టానము కలిగినదానా.. నీ ఊరువులు ( తొడలు) రెండూ, దిగ్గజముల యొక్క తొండాల శోభనూ, బంగారు అరటిబోదెల అందాన్ని కూడా ధిక్కరిస్తూ అత్యంత శోభాయమానంగా వెలుగొందుచున్నవి. అలాగే నీ జానువులు (మోకాళ్ళు) రెండూ చక్కనైన వట్రువులు (గోళాకారం) కలిగి ఉండి, నీవు నిరంతరం పతివ్రతా ధర్మంతో అనునిత్యం నీ భర్తకు సేవలు చేస్తూ ఆయనకు నీవు మోకాళ్ళపై పాదాభివందనములు చేయుటచేత, ఆ మోకాళ్ళు నేలకు తగిలి అవి కఠినములై ఐరావత దిగ్గజముయొక్క కుంభస్థలాలను సైతం త్రోసి రాజిల్లుతూ అవి జయకరంగా ప్రకాశించుచున్నవి.

 శ్రీమాతకు నమస్కరించునపుడు  ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితాయై నమః అని అనవలెను.

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

40వ నామ మంత్రము 3.2.2022

ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః

మాణిక్య కిరీటము వంటి మోకాలు చిప్పల జంటతో విరాజిల్లు లలితాంబకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం  మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకుడు బ్రహ్మజ్ఞాన సంపదలతో ఆత్మానందమునంది తరించును.


మహిషాసురాది రాక్షస సంహారమునకు దేవతలవలన పరమేశ్వరి శరీరము మొత్తము వివిధ వారివారి అంశలతో ప్రకటితమయ్యెను. ఆ తల్లి ధరించిన ఆయుధములుకూడ దేవతలనుండి లభించినవే. అందుచే అమ్మవారి శరీర నిర్మాణములో వివిధ అంగములు ప్రత్యేకతను సంతరించుకొని యున్నవి. 

అమ్మవారి మోకాలి చిప్పలు మాణిక్య ఖచితమైన మకుటములవలెనున్నవి. వేరే మాటలో చెప్పాలంటే పెద్దమాణిక్యము ఒకటి తీసుకొని, ఆ మాణిక్యముతో చేసిన టోపీలవలవంటి మోకాలి చిప్పలతో అమ్మవారు ప్రకాశించుచున్నది.

శంకర భగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు ఎనుబది రెండవ శ్లోకంలో అమ్మవారి ఊరువులను, జానువులను ఇలా వర్ణించారు.

కరీన్ర్దాణాం శుండాన్‌ - కనక కదళీకాండపటిలీం

ముభాభ్యా మూరుభ్యా - ముభయమపి నిర్జిత్య భవతి|

సువృత్తాభ్యాం పత్యుః - ప్రణతికఠినాభ్యాం గిరిసుతే

విధిజ్ఞే జానుభ్యాం - విబుధకరికుంభద్వయమసి‌||82||

అమ్మా! పార్వతీ!  వేదవిహితమైన ధర్మానుష్టానము కలిగిన ఓ జగన్మాతా! నీ ఊరువులు ( తొడలు) రెండూ, దిగ్గజముల యొక్క తొండాల శోభనూ, బంగారు అరటిబోదెల అందాన్ని కూడా ధిక్కరిస్తూ అత్యంత శోభాయమానంగా వెలుగొందుచున్నవి. అలాగే నీ జానువులు (మోకాళ్ళు) రెండూ చక్కనైన వట్రువులు (గోళాకారం) కలిగి ఉండి, నీవు నిరంతరం పతివ్రతా ధర్మంతో అనునిత్యం నీ భర్తకు సేవలు చేస్తూ ఆయనకు నీవు మోకాళ్ళపై పాదాభివందనములు చేయుటచేత, ఆ మోకాళ్ళు నేలకు తగిలి అవి కఠినములై ఐరావత దిగ్గజముయొక్క కుంభస్థలాలను సైతం త్రోసి రాజిల్లుతూ అవి జయకరంగా ప్రకాశించుచున్నవి.

 ఆ జగన్మాత మోకాళ్ళు కఠినములై ఉన్నవి అని ఇచట అమ్మను విధిజ్ఞే అని కీర్తించారు అనగా వేదవిహిత కర్మానుష్టానము కలిగినదానా అని. అందువల్ల అమ్మ పతివ్రతా ధర్మాన్ని తను పాటించి లోకానికి తెలిపినది. అందువలనే తను సర్వం సహా మహారాజ్ఞి అయినప్పటికిని తన భర్త అయిన పరమేశ్వరుని సన్నిధిలో మాత్రం మామూలు స్త్రీ వలె తన ధర్మాన్ని పాటించి, మోకాళ్ళపై సాష్టాంగపడి భర్తను పూజించడం వలన అమ్మ జానువులు (మోకాళ్ళు) కఠినములై మాణిక్యములతో చేయబడిన మకుటములుగా విరాజిల్లు చున్నవి.. ఈ శ్లోకంలో శ్రీ శంకరులు అమ్మ తొడలను మోకాళ్ళను వర్ణించారు. ఈ రెండిటినీ వర్ణిస్తూ లలితా సహస్రం నామావళి యందు కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా అని ఊరువులను మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా అని జానువులను వర్ణించిరి. అనగా కామేశ్వరునికి మాత్రమే తెలిసిన మెత్తనైన ఊరువులు కలిగినదానా అని ఓ నామం అర్ధం. అంటే స్త్రీ గోప్య సౌందర్యం రతీ విలాసవేళ భర్తకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి అలా వర్ణించారని భావించవచ్చు. కాని అదికాక వేరే నిగూఢ రహస్యం ఉన్నది. పార్వతి పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు. శంకరుడు పద్మాసనంలో కూర్చుని ఉండువాడు (శాంత పద్మాసనస్తం) అలా పద్మాసనం లో కూర్చుని ఉన్నప్పుడు ఎడమ తొడమీదకు కుడి అరికాలు వచ్చి చేరును .ఆ ఎడమ తొడ అమ్మవారిది దాని మీదకు చేరిన అరికాలు శివునిది.  ఆ అరికాలి స్పర్శతో పరమేశ్వరి తొడ మార్ధవం అర్ధనారీశ్వర తత్వంలో శంకరునికి గోచరమైనది. అంతే కాని రతికేళీ విలాసంలో కాదు. ఇక అమ్మ మోకాళ్ళు మాణిక్యాలు పొదిగిన కిరీటాల్లా విరాజిల్లుతున్నాయని మరొక నామం అర్ధం. మాణిక్యం ఎర్రగా ఉండును. అమ్మ ఎర్రచీరతో కూర్చుని ఉంటే మోకాళ్ళు ముందుకి పొడుచుకుని వచ్చి ఆ ఎర్రచీర కప్పబడి ఉన్న ఆ మోకాళ్ళు మాణిక్య మకుటాల్లా ఉన్నాయని దాని భావము.

ఆ పరమేశ్వరి బ్రహ్మానందస్వరూపిణి, పరబ్రహ్మస్వరూపిణి, సచ్చిదానందస్వరూపిణి, శివశక్త్యైక్యరూపము, సర్వవేదవేదాంగవేద్య. బ్రహ్మానందపు అంశయైన ఆనందకలిక  కలిక అనగా మొగ్గ. ప్రతీ జీవిలోను మొగ్గస్థితిలో అవ్యక్తంగా ఉన్న బ్రహ్మానందాన్ని జగన్మాత యొక్క కృపతో సాధన ద్వారా వికసింపజేసుకోవచ్చని అనగా అనుభవంలోకి తెచ్చుకోవచ్చని ఈ కలిక అను శబ్దములో గుప్తముగానున్న భావము.

శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

41వ నామ మంత్రము  4.2.2022
 
ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః.

ఎర్రని రంగులో ఉన్న ఆరుద్ర పురుగులచే చుట్టూ చెక్కబడిన మన్మథుని అమ్ములపొదుల బోలిన జంఘికలు (పిక్కలు) గలిగిన జగదాంబకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి ఇంద్రగోప స్మరతూణాభి జంఘికా అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరుని పూజించు భక్తులకు అనంతమైన సుఖసంతోషములు, భౌతికానందముతో బాటు బ్రహ్మానందమును ప్రాప్తించును.

మోక్షమునిచ్చి రక్షించేది మరియు స్మరణ మాత్రముచే కోరికలను పూరించు ప్రకాశావిర్భావము గలిగినది శ్రీమాత.

అమ్మవారి జంఘికలు మన్మథుని యొక్క సుమబాణ తూణీరము వంటిది. మన్మథుని బాణతూణీరము ఇంద్రగోపములు పొదగబడి ఉంటాయి. ఆరుద్ర పురుగులు ఎర్రని గురువింద గింజల రంగులో ఉంటాయి. ఆరుద్ర పురుగులు వ్యవసాయము మొదలు పెట్టుటకు,ఆరుద్ర కార్తె అనుకూలమైనది. ఈ కార్తెలో మాత్రమే కనబడేది ఆరుద్ర పురుగు. ఇది మొఖమల్లు వస్త్రమును (అందమైన, సున్నితమైన, ఎర్రని పట్టువస్త్రమును) చుట్టుకున్నట్లుగా ఉండి, ఎర్రగా బుర్రగా, బొద్దుగా ఉంటుంది.  అమ్మవారి జంఘములు ఇంద్రగోపములు అతుకబడిన మన్మథుని బాణతూణీరములను బోలి ఉన్నవి. ఆ బాణ తూణీరముల యందు మల్లెలు, చంపకములు (సంపంగిలు), పున్నాగములు మొదలైన సుగంధభరిత పుష్పములతో చేయబడిన బాణములు ఉంటాయి. మన్మథుని విల్లు ఇక్షుకముతోను (చెఱకు గడతోను), ఆ వింటినారి బిసతంతువులతోను తామరతూడులోని సన్నని దారముతో) చేయబడి, ఆ విల్లుపై సమ్మోహనమంత్ర మరియు వశీకరణమంత్ర బీజాక్షరములు లిఖింపబడి ఉంటాయి.

శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో ఎనుబది మూడవ శ్లోకంలో అమ్మ జంఘికలను ఇలా చెప్పారు.

పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే

నిషజ్గౌ జజ్ఘే తే విషమవిశిఖో బాఢమకృత||

యదగ్రే దృశ్యంతే దశ శరఫలాః పాదయుగళీ

నఖాగ్ర చ్ఛద్మాన స్సురమకుటశాణైకనిశితా ||83||

గిరిసుతా! ఈశ్వరుని గెలుచుట కొఱకు మన్మధుడు నీ పిక్కలను పదేసి బాణములున్న అమ్ముల పొదులుగా చేసికొనెను. (ఎందుకంటే మన్మధుని దగ్గర ఉన్న ఐదే బాణాలు చాలవని). వాని చివరల నీ గోటికొనలనెడు బాణాగ్రములు (ములుకులు) కనుపించుచున్నవి. ఆ బాణాగ్రములు (అమ్మవారి పాదములకు మ్రొక్కుచున్న) దేవతల కిరీటములచే పదునుపెట్టబడియున్నవి.

ఇంద్రగోప (ఆరుద్ర పురుగులచే), పరిక్షిప్త (చుట్టును అమర్చబడిన) స్మర - తూణ (మన్మథుని అమ్ములుపొదుల వంటి), జంఘిగా (పిక్కలు గలిగిన తల్లీ).

వర్షాకాలములో ఆరుద్ర కార్తెయందు వ్యవసాయ భూములలో ఆరుద్ర పురుగులు పుట్టుకొస్తుంటాయి. అవి ఎర్రగా ముక్కమల్లు గుడ్డవలె చిన్నవిగా ఉంటాయి. వర్షంలో ఆవి చావకుండా వర్షాధిపతి ఇంద్రుడు కాపాడుతాడనియు, అందుకనే వీటికి ఇంద్రగోపములనియు పిలుస్తారు. 

ఇంద్రగోపములు అనగా మంత్రములోని బీజాక్షరములు అని రహస్యార్థము. తూణము (తూణీరము) అనగా మంత్ర సముదాయము. తూణమునందు ఉండే బాణములచే మంత్రములు సూచితమైనవి. దేవి జంఘికలు మహావర్ణ సంపుటికలు అని తెలియదగును. స్మర శబ్దము సగుణ బ్రహ్మయు, ప్రపంచ సృష్టికర్తయు అయిన పరమేశ్వరునకును - తూణా శబ్దము మాయా శక్తికిని బోధకములు అగును.

శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

42వ నామ మంత్రము 5.2.2022

ఓం గూడగుల్ఫాయై నమః

నిండైన, సుందరమైన, నిగూఢంగా ఉండే చీలమండలు గలిగిన పరాశక్తికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి  గూఢగుల్ఫా అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం గూడగుల్ఫాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు ఉపాసకుడు ఆ తల్లి కరుణతో నిగూఢతత్త్వమైన పరాశక్తి తత్త్వమును పరిపూర్ణముగా గ్రహించి, బ్రహ్మత్వమును ప్రాప్తింపజేసుకొని ఆత్మానందమునందును

ధ్యానించు వారిని రక్షించు స్వభావం గలిగినదని ఈ నామ మంత్రములోని అంతరార్థము. గూఢ (లావైన, ఇంపైన) గుల్ఫా (చీలమండలు గలిగినది). లావైన లేదా అందమైన లేదా ఇంపైన చీలమండలు గలిగినది.

గూఢ అనగా రహస్యమైన, గాన అమ్మవారి చీలమండలు రహస్యంగా కనబడకుండా ఉంటాయి; స్త్రీలు సాధారణంగా పాదములు కనబడనట్లు చీర కుచ్చెళ్ళను పాదములవరకూ జారవిడుస్తారు, అనగా కాలిమట్టెలు కూడా కనబడనంతగా చీర కప్పబడి ఉంటుంది; శ్రీమాత కూడా ఆ సాంప్రదాయం పాటించునది ఎందుకంటే  కామేశజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా  అనగా వివాహితయొక్క సౌందర్యము భర్తకు మాత్రమే అంకితము, ఆ అవయవ సొంపులు భర్తకు మాత్రమే తెలియనగును.

అయితే అమ్మవారి చీలమండలు కనబడకుండా ఎలా ఉంటాయి? అమ్మవారు పద్మాసన స్థితిలో కుర్చుని ఉంటుంది గదా అప్పుడు చీలమండలు కనబడవు అలాగే ఒక కాలు పీఠం మీద, రెండవ కాలు పద్మాసనస్థితిలో ఉన్నప్పుడు? అప్పుడు కూడా అమ్మవారి చీర అంచు పూర్తిగా చీలమండలను కప్పి ఉంటుంది కాని చీలమండల పైకి ఉండదు గాన ఈ రహస్య (గూఢ) అర్థాన్ని బట్టి ఈ నామమంత్రాన్ని అర్థం చేసుకోవాలి.

గుహ్యస్థానము రత్నమణి సూచికము. చీలమండలము సంధిస్థానము - ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అను ఈ నవార్ణవ మంత్రమునందలి

మధ్య వర్ణము చింతామణి గుర్తుగలది; మిగిలిన ఎనిమిది వర్ణములు అష్టప్రకృతులు అనబడును.

నవార్ణవ మంత్రము అనగానేమి?

నవార్ణవ మంత్రము అంటే చండీ నవార్ణవ మంత్రము. అత్యంత ప్రభావవంతమైన విద్యలలో చండీ, దుర్గా విద్యలు చాలా ప్రభావవంతమైనవి. ఎటువంటి కోరికలనైనా సిద్ధింపజేస్తుంది. ఆ చండీ దేవి తన భక్తులకు ఏమికావాలో తెలిసుకొని ఆ కోరికలను సిద్ధింపజేస్తుంది. దీనికి సంబంధించిన కథ ఒకటి కలదు.

వారు ఇద్దరు చండీ ఉపాసకులు. చాలా నిరాశతో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకడు మహారాజు. కాని రాజ్యాన్ని కోల్పోయాడు. రెండవవాడు సాధారణ ఉపాసకుడు. అతడు కడు పెదవాడు. బలహీనుడు కూడా. వారిద్దరూ చాలానిరాశతో జీవితం విరక్తి కలిగి ఉంటారు. వారు ఇద్దరూ అడవిలో కలిసినప్పుడు ఒకరి వృత్తాంతమును మరియొకరు చెప్పుకుంటారు. వారు ఇద్దరూ స్నేహితులయారు. వారికి అడవిలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఆశ్రమంలోని మునీశ్వరులను సేవించుతారు. వారిద్దరూ ఆ ఆశ్రమానికి కేవలం ప్రశాంతతకోసమే  వెళ్ళారు. నిరాశానిస్పృహలచేత ఏ కోరికలు లేనివారుగా మారుతారు. అయినప్పటికినీ ఆ మునీశ్వరునికి తమ బాధలను విన్నవించు కుంటారు.  ఆ మునీశ్వరుడు వారిపై జాలిపడి మహత్తరమైన చండీమంత్రాన్ని ఉపదేశించుతాడు. వారు ఆ చండీమంత్రాన్ని చాలాతీవ్రతరముగా సాధనచేస్తారు. వారి సాధనలో ఆ చండీమంత్ర జపంచేయునప్పుడు ఆ చండీమాతకు తమ వ్రేలిని కోసి, స్రవించిన రక్తముతో ఆ చండీమాత పాదములకు ఆభిషేకము చేస్తూ ఉంటారు.  వారి మంత్రసాధనకు ఆ చండీమాత వారియందు కరుణించి వారికి కనిపిస్తుంది. వారికి ఏమికోరిక ఉన్నదో తెలియజేయమని ఆ చండీమాత వాళ్ళను అడుగుతుండి. అందులో సాధారణ వ్యక్తి సంపదలు, గృహము వంటివి కోరుతాడు. మహారాజు మాత్రం పోయిన తన రాజ్యాన్ని తిరిగి వచ్చేలా కరుణించమని కోరుతాడు. కాని చండీ మంత్ర సాధనా ప్రభావానికి, వారు కోరిన కోరికలకు ఎక్కడా పొంతనలేదు. వారి కఠోరసాధనకు వారు కోరికలు చాలా చిన్నవి అని చండీమాత అంటుంది. అప్పుడు ఆ చండీమాత ఆ వారిరువురికి వారి కోరికలు సిద్ధించుననియు,  మరియు బ్రతికినంత కాలము సకలభోగాలు, అష్టైశ్వర్యాలు అనుభవించి అంత్యమున మనువుగా మారతారు అని చెప్పింది. మనువు అంటే ప్రజాపతులలో ఒకడు. ఆ స్థాయికి చండీమాత అతనికి వరమిస్తుంది. అంటే చండీమాత నవార్ణవ మంత్రప్రభావము అంతటిది. 

చండీ నవార్ణవ మంత్రము అంటే తొమ్మిది అక్షరములు గల చండీ మంత్రము. 

గూఢగుల్ఫా యని నామప్రసద్ధమైన తల్లికి నమస్కరించునపుడు ఓం గూఢగుల్పాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

43వ నామ మంత్రము 6.2.2022

ఓం కూర్మపృష్ఠ జయిష్ణు  ప్రపదాన్వితాయై  నమః

తాబేలు పృష్ఠ (వీపు) భాగము కంటెను సుందరమైన మీగాళ్ళు (పాదాగ్రములు)  కలిగి యలరారు తల్లికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి  కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా  యను పండ్రెండక్షరముల (ద్వాదశాక్షరీ) నామ మంత్రమును  ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై  నమః అని ఉచ్చరించుచూ ఆ  అఖిలాండేశ్వరిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించు సాధకులను ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా ఉద్దరించి సమస్త భౌతిక సుఖసంతోషములను లభింపజేసి, జీవితమంతా ఆధ్యాత్మికచింతనతో ప్రవర్తింపజేసి తరింజేయును.

కూర్మపృష్ఠ (తాబేటి వీపును) జయిష్ణు (జయించు స్వభావముగల) ప్రపద (ముంగాలు అనగా పాదాగ్రము) కూడినది - కలిగియున్నది. ఈ పండ్రెండక్షరముల నామ మంత్రమును  ఓం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై  నమః అని ఆపకుండా ఉచ్చరించ వలెను. ఏ పరిస్థితిలోనూ కూర్మపృష్ఠా అని ఆపి   చదవకూడదు...ఇంతకన్నా వివరించి చెప్పకూడదు..

తాబేటి వీపున కంటె ప్రశస్తముగా, సుందరమై ఒప్పారే పాదోపరిభాగములతో శ్రీమాత అలరారుచున్నది. అమ్మవారి పాదములు మోక్షప్రదములు. నాలుగు వేదాలకు సంబంధమైన నాలుగు వాక్యాలైన అహం బ్రహ్మాస్మి, తత్త్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, ఈ నాలుగు మహావాక్యాలు అమ్మవారి పాదాలను ప్రస్తుతించే వేదాలకు చెందినవి. అమృత మథనసమయంలో శ్రీమహావిష్ణువు ఆదికూర్మమై తన పృష్ఠభాగముతో మందరగిరిని క్షీరసాగరములోనికి క్రుంగకుండా ఉద్ధరించెను. అటువంటి బహు సుందరమైన ఆ ఆది కూర్మము యొక్క పృష్ఠభాగముకంటెను శ్రీమాత పాదాగ్రములు సుందరమై, అత్యంత మృదుత్వంతో అలరారు చున్నవని  ఈ నామ మంత్రములోని భావము.
అంత శ్రేష్ఠమైన జగన్మాత పాదములు ఆశ్రితులకు అమృతపదముసు కలిగిస్తాయి, మోక్షదాయకములై పాపకూపములో పడకుండా ఉద్ధరిస్తాయి.

శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరియందు ఎనుబది ఎనిమిదవ శ్లోకంలో అమ్మవారి ముంగాళ్ళను ఇలా వర్ణించారు:

పదం తే కీర్తీనాం - ప్రపద మపదం దేవి విపదాం

కథం నీతం సద్భిః - కఠినకమఠీకర్పరతులామ్|

కథం వా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా

యదాదాయ న్యస్తం - దృషది దయమానేన మనసా॥88॥

ఓ అఖిలాండేశ్వరీ! నీ పాదములు యశస్సును కలిగించునవి, విపత్తులను హరించునవి. పురారియైన శివుడు దయామయుడై వివాహ సమయమున నీ సుకుమార పాదములను తన చేతబట్టి మృదువుగా సన్నెకల్లును త్రొక్కించెను. అట్టి పాదాగ్రములను పూజ్యులైన పూర్వకవులు కఠినమైన తాబేటి పెంకుతో ఎట్లు పోల్చిరో తెలియరాదు.

ఓ లలితాపరమేశ్వరీ! నిన్ను ఆశ్రయించిన వారికి సత్కీర్తులను కలిగించుచు, సకల ఆపదలను తొలగించుచు, మంచికి పుట్టిల్లుగా, చెడు అనేది దరిచేరలేని శుభవాకిళ్లుగా వెలుగొందుచుండేవి, నీ పాదముల పైభాగాన ఉండు నీ మీగాళ్ళు, అటువంటి నీ పాదమును నీ వివాహ వేళ, రాతియందు వధువు పాదము పెట్టించుట అను ఒక తంతుయందు దయాపూర్ణమైన మనసు కల నీ భర్తయైన శివుడు తన చేతితో నీ పాదములు పట్టుకుని రాతియందు ఉంచుటకు ( వధువుచే సన్నికల్లు తొక్కించుట) చాల సందేహించి నాడు. ఎందుకనగా అతి మృదువులైన నీ పాదములు ఆ కఠిన రాతి స్పర్శ తో ఎక్కడ కందిపోవునో అని. మరి అంత సున్నితమైన ఆ సుకుమార పాదాన్ని, ఆ పాదంపై నున్న మీగాలుని ( అరికాలు పై భాగం) కొందరు సత్కవులు ( లలితా సహస్ర నామావళియందు వశిన్యాది వాగ్దేవతలు) కఠినంగా ఉండే ఆడ తాబేలు వీపు చిప్పతో ఉపమానం చెబుతూ ఎలా వర్ణించగలిగారమ్మా!

ఆ లలితా పరమేశ్వరి పాదపద్మములపై దృష్టి నిలిపి నమస్కరించునపుడు ఓం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై  నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

44వ నామ మంత్రము 7.2.2022

ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః

నమస్కరించు భక్తజనుల అజ్ఞానాంధకారాన్ని పోగొట్టగలిగిన కాలిగోళ్ళ కాంతులు గలిగిన జగన్మాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసించు భక్తులకు ఆ పరమేశ్వరి కాలిగోళ్ళ కాంతికిరణముల వలన తమ అజ్ఞానమును నశింపజేసికొని బ్రహ్మజ్ఞానప్రకాశముతో తేజరిల్లుచూ జగన్మాత పాదసేవాపరాయణులై జన్మతరింపజేసికొందురు.

దేవతలందరూ జగన్మాత పాదములకు శిరస్సులుతాకుచూ నమస్కరించునపుడు వారి కీరీములందున్న వివిధ రత్నములు జగన్మాత కాలిగోళ్ళకు సానబెట్టినట్లుతాకగా సహజంగానే ప్రకాశవంతముగా ఉండే ఆ తల్లి కాలిగోళ్ళు మరింత ప్రకాశవంతంగా కాంతులు విరజిమ్ముచూ, నమస్కరించు భక్తజనుల అజ్ఞానతిమిరములను పారద్రోలుచు ప్రజ్ఞానకాంతులను ప్రసాదించుచున్నవని ఈ నామమంత్రమందలి భావము.. అమ్మవారి పాదాలు షట్చాక్రాలకు పైన ఉండి, చక్రాలపై అనంతమైన కిరణాలను వర్షింపజేస్తాయి. అలా వర్షించు కిరణాల్లో అగ్నికి సంబంధించినవి 108, సూర్యసంబంధమైనవి 116, చంద్రసంబంధమైనవి 136 వెరసి 360 కిరణాలు మాత్రమే ఆ షట్చక్రాలు గ్రహిస్తాయి. వీటినే సౌర సంవత్సరమందున్న రోజులు.

శంకరాచార్యులవారు క్రింది శ్లోకాలలో వర్ణించిన విధాన్ని పరిశీలించుదాము.

సుధాధారాసారై-శ్చరణయుగలాంతర్విగలితైః

ప్రపంచం సించన్తీ - పునరపి రసామ్నాయమహసః|

అవాప్య స్వాం భూమిం -  భుజగనిభ మధ్యుష్ట వలయం

స్వమాత్మానం కృత్వా - స్వపిషి కులకుండే కుహరిణి || 10 ||
 
అమ్మా! పరమేశ్వరీ! బ్రహ్మరంధ్ర స్థానములో ఉన్న సహస్రార చక్రమందు అయ్యవారితో విహరించు ఓ జగన్మాతా!  నీ పాదద్వయం మధ్యబాగము నుండి స్రవించిన అమృతధారా వర్షములచేత (మనలోని అంతః ప్రపంచమైన) వేల నాడుల ప్రపంచమును తడుపుతున్నదానివై,అమృతాతిశయ కాంతిగల చంద్రుని స్థానమును (బ్రహ్మరంధ్రమును) వీడి, మరలా స్వస్థానమైన మూలాధారమును చేరి, నీ రూపాన్ని నీవే చుట్టుకుని, పామువలె చుట్టలు చుట్టుకుని, పృధివీతత్వమగు మూలాధారమందు, తామరదుద్దు మధ్యలోని సన్నని రంధ్రములో సూక్ష్మముగా నున్న దానియందు కుండలినీశక్తిగా నిద్రిస్తూ ఉంటావు.

క్షితౌ షట్పంచాశ -   ద్ద్విసమధిక పంచాశ దుదకే

హుతాశే ద్వాషష్టి - శ్చతురధిక పంచాశ దనిలే |

దివి ద్విఃషట్త్రింశ - న్మనసి చ చతుఃషష్టిరితి యే

మయూఖాస్తేషామప్యుపరి తవ -  పాదాంబుజయుగమ్ || 14 ||

షట్చక్రాలలోని సహస్రారములో ఉండు దేవి పాదప్రకాశ వైభవం.

అమ్మా! శ్రీమాతా! యోగసాధనలో సాధకుడు షట్చక్రాలనూ అధిగమించి,సహస్రారములో ఉన్న నీపాదపద్మాలు చేరాలంటే తన దేహంలో ఉన్న పృధివీతత్వంతో కూడిన మూలాధార చక్రంలో ఏబదియారు (56) కిరణములను దాటి, జలతత్వాత్మికమైన మణిపూరక చక్రంలో ఏబది రెండు మయూఖములను దాటి, అగ్నితత్వాత్మికమైన అనాహత చక్రంలో ఏబది నాలుగు కాంతిరేఖలు దాటి, ఆకాశతత్వాత్మికమైన విశుద్దచక్రమునందు డెబ్బదిరెండు కాంతికిరణాలు దాటి, మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రము నందు అరువది నాలుగు కిరణపుంజాలు దాటి, ఈ ప్రకారముగా ప్రసిద్ధములైన ఈ మయూఖములు దాటి పైకి చేరుకోగా అచట సహస్ర దళ మధ్యగత చంద్రబింబాత్మకమైన   బైందవ స్థానమున, సుధాసింధువునందు నీయొక్క పాదపద్మముల జంట గోచరమగుచున్నది.

 శంకర భగవత్పాదులవారు, సౌందర్యలహరియందు, ఎనుబది తొమ్మిదవ శ్లోకంలో అమ్మవారి నఖములను ఇలా వర్ణించారు.

నఖై ర్నా కస్త్రీణాం - కరకమలసంకోచశశిభి

స్తరూణాం దివ్యానాం - హసత ఇవ తే చండి చరణౌ|

ఫలాని స్వస్థ్సేభ్యః - కిసలయకరాగ్రేణ దదతామ్

దరిద్రేభ్యో భద్రాం - శ్రియమనిశ మహ్నాయ దదతౌ॥89॥

చండీమాత పాదములు బీదలకు భద్రమైన సకలైశ్వర్యములను ప్రసాదించును. చండీమాత పాదములకు దేవతలు చేతులు జోడించి అంజలి ఘటించుచున్నారు. మాత కాలిగోళ్ళనెడు చంద్రుల కాంతికి ఆదేవతాస్త్రీల కర పద్మముల ముకుళించుచున్నట్లుగా అనిపించుచున్నది. ఆ చంద్రులు స్వర్గములో (దేవతలకు సంపదలనిచ్చెడు) కల్పవృక్షములను పరిహసించుచున్నట్లున్నది.

అమ్మా!  పరమేశ్వరీ! .దేవలోకంలో ఇంద్రుని నందనవనంలో కోరికలు తీర్చే నంద‌నవనం ఉన్నది. అది తన చిగురుటాకుల చేత కోరిన కోరికలు తీర్చును.కాని ఆ కల్పవృక్షం దేవలోక వాసులైన దేవతల కోరికలు మాత్రమే తీర్చును.మరి నీ దివ్య చరణములు -  ఆలోకం ఈ లోకం అను భేదము లేక నిన్ను నమ్మిన సర్వలోకములలో ఉండు దరిద్రులైన వారందరికీ ఎల్లవేళలా తరుగు లేనన్ని సంపదలను శీఘ్రముగా అనుగ్రహిస్తూ ఉంటాయి. ఏదో ఒక్క స్వర్గలోక వాసులకు మాత్రమే సంపదలిచ్చి మిడిసిపడు ఆ కల్పవృక్షమును చూసి, సమస్త లోకవాసులనూ అనుగ్రహించు నీ పాదములు చాల్లే నీ బడాయి అన్నట్లు ఆ కల్పవృక్షాన్ని చూసి పరిహసిస్తూ ఉంటాయి. అంతే కాదు ఇంద్రుని భార్య అయిన శచీదేవి మొదలుగా గల స్త్రీలు నిన్ను సేవించుటకు అర్చించుటకు నీ పాదముల వద్దకు రాగానే పద్మములవంటి వారి చేతులు, చంద్రోదయం వంటి నీ నఖ( గోటి) కాంతులవలన అవి ముకుళింపబడి ( రెండుచేతులు దగ్గరకు ముడవబడి) నీకు నమస్కరించుచున్నవి. అటువంటి శోభతో నీ పాదాలు నీ నఖములు అలరారుచున్నవి.

పద్మములు చంద్రోదయం కాగానే ముడుచుకుపోతాయి. అమ్మ దగ్గరకు రాగానే ముడుచుకుపోయే ఆ దేవతా స్త్రీల చేతులను కరపద్మాలుగా పోల్చి, అమ్మ కాలిగోళ్లను చంద్రునితో పోల్చి శ్రీ శంకర భగవత్పాదులవారు చక్కగా వర్ణించారు. అనగా అమ్మ పాదాలు దేవతల చేత, దేవతా స్త్రీలచేత కూడా నమస్కరింపబడునని చెప్పబడినది. అందుకే కదా! పోతనగారు అమ్మలగన్నయమ్మ అను పద్యం లో వేల్పుటమ్మల మనమ్ములనుండేడియమ్మ అని వర్ణించారు. మనమందరమూ ఇష్టదైవాలుగా కొలచే ఈ దేవతలంతా, వారు తమ ఆరాధ్య దేవతగా అమ్మనే పూజించుచున్నారని పోతనగారి పద్య భావము.

మత్స్య మరియు పద్మపురాణములందు నారదుడు హిమవంతునికి ఇలా చెప్పెనని గలదు:

నారదుడు పార్వతీదేవి యొక్క సాముద్రిక లక్షణములను చూచి ఇలా వివరించాడు:-

ఈమెకు (పార్వతికి) భర్త పుట్టలేదు. ఈమె లక్షణములు లేనిది, చేతులు ఎల్లప్పుడును పైకి ఎత్తబడి మాత్రమే ఉంటాయి. ఈ పార్వతి యొక్క పాదములు వ్యభచరించునవి లేదా కాంతులు లేకయుండును అని చెప్పెను. అంతట నారదుడు పార్వతి నుదహరించి చెప్పిన ఆ విషయములు చెడ్డవి అని హిమవంతుడు కంగారు పడెను. అంతట నారదుడు ఇట్లు చెప్పదొడగెను. "ఓ పర్వతరాజా! నేను చెప్పిన ఈ  లక్షణములు సంతోషింపదగినవే. ఎందుచేతనంటే 'ఈమె భర్త జన్మించలేదని యనగా లోకములోనున్న అందరివలె తల్లిదండ్రులకు జన్మించలేదు. అలా జన్మించితే మరణించుట తథ్యము. కాని ఈ పార్వతిభర్త పుట్టుక, నాశనములేని అయోనిజా సంభూతుడైన పరమశివుడు. ఈ పార్వతి చేతులు ఎల్లప్పుడూ పైకే ఉంటాయి అనగా దానము ఇచ్చువారి చేయివలె ఈ పార్వతీదేవి చేయి పైచేయిగా ఉంటుందని భావము. పరమేశ్వరి పాదములు కాంతులచే వ్యభిచరిస్తాయి అనగా, ఆ పరమేశ్వరి పాదాల గోళ్ళతో ప్రకాశించే  ఆ తల్లి పాదాలు పద్మములవలె ఉంటాయి. అనగా దేవదానవులు నమస్కరించు నపుడు వారి కిరీటములలోని మణుల కాంతులు పరమేశ్వరి కాలి గోళ్ళ కాంతులముందు వెలవెలబోతున్నాయి. మరియు ఆ తల్లి పాదాల గోళ్ళ కాంతులు, తనను నమస్కరించువారి హృదయములలో ప్రవేశించి వారి అజ్ఞానమును తొలగించుచున్నవి' అని భావము అని నారదుడు చెప్పెను. ఆ జగన్మాత పాదనఖకాంతులు ఈ విధమగా చెప్పబడినవి.

పృథ్వీ తత్త్వాత్మిక మూలాధార చక్రమున (పృథ్వీ అగ్ని జ్వాలలు 56), మణిపూర చక్రమున (ఉదక తత్త్వాత్మిక జ్వాలలు 52) కలిపి 108 అగ్ని జ్వాలలు.
అట్లే స్వాధిష్టాన (అగ్ని తత్త్వాత్మిక కిరణములు 62), అనాహత చక్రమున (వాయు తత్త్వాత్మిక కిరణములు 54) కలిపి 116 సూర్య కిరణములు. 
ఆకాశ తత్త్వాత్మకమగు (విశుద్ధ చక్రమున 72), మనస్తత్త్వాత్మకమగు (ఆజ్ఞా చక్రమున 64) కలిసి 136 చంద్రుని కళలు అగుచున్నవి. ఇవి 108+116+136 మొత్తం 360 కిరణములు అగును. ఈ కిరణాలన్నియు అమ్మవారి పాదములనుండి వెడలినవే.

జగన్మాతకు నమస్కరించునపుడు ఓం నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

22, జనవరి 2022, శనివారం

సుభాషితం

🌺



***

పద్యం యద్యపి విద్యతే బహు      సతాం హృద్యం విగద్యం నతత్

గద్యం చ ప్రతిపద్యతే న విజహత్పద్యం     బుధాస్వాద్యతాం ౹

ఆదత్తే హి తయోః ప్రయోగ     ఉభయోరామోద భూమోదయం

సంగ: కస్య హి న స్వదేశ మనసే     మాధ్వికమృద్వికయోః ౹౹


పద్యం చాలా గొప్పగా ఉంటుంది,కావాల్సినంత రసం ఉంది.రసికులకు గద్యము లేక పద్యం అంతగా సౌందర్యమనిపించదు.గద్యము కూడా పద్యం లేకుండా పండితులకు ఇష్టంగా అనిపించదు.ఈ రెండూ కలుస్తేనే ఎక్కువ ఆనందమవుతుంది.తేనె మరియు ద్రాక్ష కలిసిన రుచి ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందా?

***

పద్య గద్య రసము పాఠము కష్టము 

తినగ వేప చేదు తీయ gundu   

తేనె మరియు ద్రాక్ష తీపి తెలియదేల

ఒక్క రున్న చాలు ఓర్పు తెలుగు    


భోగేషు ప్రసరో యస్యా మనోవృత్తేశ్చ దీయతే 

సాప్యాదావేవ హన్తవ్యా విషస్యేవాఙ్కురోద్గతిః। 


(భోగతృష్ణవలన) ఏ మనోవృత్తికి భోగములందు ప్రవేశ మివ్వబడుచున్నదో, దానిని విషాంకురముయొక్క గతినివలె మొదటనే ఛేదించి వేయవలెను। 


పూర్ణస్తు ప్రాకృతోఽ ప్యన్యత్పునరప్యభివాఞ్ఛతే 

జగత్పూరణ యోగ్యామ్బుర్గృహ్ణాత్యేవార్ణవో జలమ్‌ 


జగత్తును కూడ నింపుటకు యోగ్య మైనప్పటికిని సముద్రము నద్యాదుల జలమును గ్రహించుచునే యుండునట్లు నిగ్రహింపబడని పామరమనస్సు పదార్థములచే పూర్ణమై యున్నప్పటికిని ఆశవలన ఇంకను కోరుచునే యుండును।


హస్తం హస్తేన సంపీడ్య దన్తైర్దన్తాన్విచూర్ణ్య చ 

అఙ్గాన్యఙ్గైరివాక్రమ్య జయేచ్చేన్ద్రియశాత్రవాన్‌। 


చేతిని చేతితో నలిపి, పండ్లను పండ్లచే కొఱికి అవయవములను అవయవములచే నాక్రమించి ఏ విధముగ నైనను (సర్వప్రయత్నములచే) ఇంద్రియములను శత్రువులను జయించవలెను।


***


గౌర్గౌః కామదుఘా సమ్యక్ప్రయుక్తా స్మర్యతే బుధైః!

దుః ప్రయుక్తా పునర్గోత్వం ప్రయోక్తుః సై వ శంసతి!!


వాక్కు గోవు వంటిది. దానిని సదుపయోగము చేసినచో కామధేనువు వలె అభీష్టములనీడేర్చును. కానీ, దురుపయోగము చేసినచో, అట్లు చేసినవానికి గోత్వమును (పశుత్వమును) కలిగించును.

***

ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్ లేక రాకా నిశా

రాజశ్రీ సఖ మైన మోమున పటాగ్రం బొత్తి యెల్గెత్తి యా

రాజీవానన యేడ్చె గిన్నెర రాజత్కారాంభోజ కాం

భోజీ మేళ విపంచికా రవ సుధా పూరంబు తోరంబు గాన్


ఆ జాబిల్లి వెలుగుతో కలిగిన విరహాన్ని భరించలేక తన చంద్రుని లాంటి ముఖము పై చీర చెరగు యొత్తుకొని ఆ తామరపువ్వు వంటి ముఖముగల ఆమె కిన్నెరలు వీణ పై కాంభోజీ రాగమాలపించి నారో యన్నట్టుగా అమృతము చిందు నట్టుగా ఎలుగెత్తి యేడ్చేను.

ఈ ఏడుపునే రామకృష్ణుడు భట్టుమూర్తి బావురుమని యేడ్చె యని వ్యాఖ్యానించాడు.


స్నానేన సంగమేశం చ స్మృత్యం గౌరీశ్వరంశివం

పిండ ప్రదానం కర్తవ్యమ్ పితృ ణాం మోక్ష దాయకం.


అర్థము:--నదీ సంగమం లో పుష్కర స్నానం చేసి శంకరుడిని తలుచుకొనడం,పిండ ప్రదానం చేయడం పితరులకు మోక్ష దాయకము.యిది విధి.  ఈ ఉదాత్త ఆశయాన్ని అపహాస్యం చేయకుండా శ్రద్ద గా నిర్వర్తించండి. ఈ స్నానఘట్టం లోనే స్నానం చెయ్యాలి అని మూఢ నమ్మకాలు పెట్టుకోకుండా పుష్కరుడు ప్రవేశించిన నది ఎక్కడవున్నా అక్కడ స్నానం చెయ్యవచ్చు.12 దినాలలో ఏరోజైనా స్నానం చేయవచ్చు.


ఈ పద్యం ఎటువైపునుండీ చదివినా అదే వస్తుంది..

రాధా నాధా తరళిత

సాధక రధ తా వరసుత సరస నిధానా

నాధాని సరసత సురవ

తాధర కధ సా తళిరత ధానా ధారా!!


***

కోకిలానాం స్వరో రూపం  పాతివ్రత్యంతు యోషితాం

విద్యారూపం విరూపాణాం క్షమా రూపం తపస్వినాం


అర్థము: కోకిలకు స్వరమే అందము.మహిళలకు పా తివ్రత్యమే అందము.

కురూపులకు విద్యయే అందము.యతులకు(మునులకు) క్షమ,శాంతము లే అందము.(సూక్తిముక్తావళి)


విద్యా వివాదాయ ధనం మదాయ శక్తి: పరేషాం పర పీడనాయ

ఖలస్య సాధో ర్విపరీత మేతత్ జ్ఞానాయ దానాయ చ రక్షణాయః


అర్థము: దుర్మార్గునికి విద్య వితండ వాదము చేయుటకును, ధనము గర్వ పడుట కును, శక్తి పరులను బాధించుటకును,ఉపయోగ పడును. అదే సజ్జనులకు విద్య జ్ఞానమునకు, ధనము దానము చేయుటకును, శక్తీ పరులను రక్షించుటకును ఉపయోగపడును


***

క్రోధో మూల మనర్థానాం ; క్రోధః సంసార బంధనం

ధర్మ క్షయకరః క్రోధః ; తస్మాత్ క్రోధం విసర్జయేత్


అర్థము:--- అనర్థము లన్నింటికి కోపమే మూల కారణము. కోపమే సర్వ బంధనములకు హేతువు. అది ధర్మమును నాశనం చేస్తుంది. కనుక ముందుగా అందరూ కోపమును విడిచి పెట్టిన సుఖపడ గలరు

.

క్రోధో వైవస్వతో రాజా ; ఆశా వైతరణీ నదీ

విద్యాం కామ దుఘా ధేను: సంతుస్టో నందనం వనం


అర్థము:-- క్రోధము యమధర్మ రాజు వంటిది (అంటే మనుష్యున్ని చంపేది)ఆశ యనునది వైతరణీ నది వంటిది(దాటడానికి సాధ్యము కానిది) విద్య అన్ని కోరికలను తీర్చు కామధేనువు వంటిది. సంతోషమే నందనవనము వంటిది (మనసుకు ఆహ్లాదము కలిగించునది)

***

ఇది ఒకచమత్కార శ్లోకం.

కేశవం పతితం దృష్ట్వా,పాండవా హర్ష మాప్నుయు:

రుదంతి కౌరవాస్సర్వే,హా,హా కేశవ కేశవ


అర్థము:-కేశవుడు (కృష్ణుడు) యుద్ధము లో పడిపోయినాడట.దాన్ని చూసి పాండవులు సంతోషం తో ఎగిరారట.కౌరవులందరూ కేశవా కేశవా అని ఏడుస్తున్నారట.ఇది అసంబద్ధంగా వుంది. పదాలు కొన్నింటికి అర్థాలు మార్చుకోవాలి.కొన్ని విడదియ్యాలి.శవం=ఒక శవమును,కే=నీటియందు, పతితం=పడిపోయి వుంటే, దృష్ట్వా=చూసి, పాండవాః=గ్రద్దలు,హర్షం=ఆనందమును, ఆప్నుయు:= పొందినవి. హా హా కేశవ =నీటిలో శవము, నీటిలో శవము అని సర్వే కౌరవాః=నక్కలన్నీ ,రుదంతి=ఏడ్చుచున్నవి


.యుద్ధసమయం లో ఒక శవము నీటిలో పడి కొట్టుకువచ్చింది. గ్రద్దలు శవాన్ని ఎక్కడ వున్నా తినగలవు కనుక అవి ఆనందించినవి,నక్కలు నీటిలోకి వెళ్లి శవాన్ని తినలేవు కాబట్టి అవి ఏడుస్తూ వున్నాయి.పాండవాః =గ్రద్దలు,కౌరవా అంటే నక్కలు అని అర్థము తీసుకుంటే సరిపోతుంది.

***

ఒకసారి విద్వాన్.కావ్యతీర్థ .మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్యం గారు యిలా అనుకున్నారు

'నీతో' 'నాతో' తనతో', మనతో అనే తెనుగు విభక్తి తో గూడిన తెనుగు పదముల నిమిడ్చి సంస్కృత శ్లోకం వ్రాయ వీలగునా యనుకొని ఇట్లు శ్లోకం వ్రాసినారు.


నీతో గురు సన్నిధి మక్షరాప్తై

నాతో ధికం వస్తు తవాస్తి కించిత్

కారుణ్య దృక్పాతనతో గురూణా

మధీహి భో రామ! నతోఖిలం త్వం


తా:--రామునితో దశరథుడు అన్నట్లు ఓ రామా!త్వం=నీవు , అక్షరాప్తై=అక్షరాప్రాప్తి కొరకు (చదువు కొరకు) గురో సన్నిధిం =గురువుగారి యొద్దకు, నీతః =చేర్పబడినావు., తవ=నీకు, అతః =యింతకంటే అధికం=అధిక మైన, వస్తు=వస్తువు, కించిత్=కొంచెము కూడా, నాస్తి=లేదు, గురూణాం= గురువులయొక్క కారుణ్య దృక్పాత నతః = వాత్సల్య పూరితమైన చూపులప్రసారము వలన నతః=నమ్రత గాల వాడవై అఖిలం =సమస్త విద్యలను,అధీహి= చదువుము


***


***

వెలయాలు శిశువ ల్లుడు

నిలయేలిక యాచకుండు నేగురు ధరలో

గలిమియు లేమియు దలపరు

కలియుగమునం గీర్తికామ! కాటయవేమా!


అతిథి ర్బాలక శ్చైవ స్త్రీ జనో నృపతి స్తధా

ఏతే విత్తం న జానంతే జామాతా చైవ పంచమః


అర్థము:--అతిథి, పిల్లలు స్త్రీలు, ప్రభువు (రాజుపన్నులు విధిస్తాడు) వీరంతా గృహస్తు దగ్గర తగిన ధనం ఉందా లేదా అని ఆలోచించరట. కోరికలు తీర్చమని

అడుగు తుంటారట. వీరిలో అల్లుడు ఐదవ వాడుగా చెప్పబడినాడు. ఇది ఎప్పుడో మనువు చెప్పినది. అయినా అందరూ అలా వుంటారని కాదు. లోక రీతి ఇలా వుంటుందని, "జామాతా దశమ గ్రహః" అనే నానుడి కూడా వుంది కదా!


***

దూష కశ్చ క్రియా శూన్యో నికృ స్టో దీర్ఘ కోపనః

చత్వారః కర్మ చండాలా జాతి చండాల ఉత్తమః


అర్థము: ఇతరులను దూషించువాడు ఏ పని చేయక సోమరిగా ఉండెడి వాడు లోభము గలవాడు దీర్ఘ క్రోధము (అంటే కోపము చాల రోజుల వరకు మనసులో పెట్టుకోనువాడు)గల వాడు వీరు నలుగురు కర్మ చండాలురు . వీరికంటే జాతి చండాలుడు ఉత్తముడు.


ఉత్తమే క్షణ కోపస్యాత్ మధ్యమే ఘటికా ద్వయం

అధమేస్యాత్ దహోరాత్రం పాపిస్టే మరణాంతకం


అర్థము:ఎవరి మీదైనా కోపము వచ్చినప్పుడు ఉత్తమునియందు ఒక క్షణ కాలము మాత్రమే ఉండును మధ్యముని యందు రెండు ఘడియలు మాత్రమే యుండును

అధముని యందు యొక ఆహోరత్రముండును (ఒక రాత్రి ఒక పగలు)

చచ్చేంత వరకు కోపము మనసులో పెట్టుకొని యుండు వాడు

పాపి స్టుడు అని అనబడుతాడు (అధమాధముడు)


ఉమాదేవి జంధ్యాల 9-8-16

అమ్మ! మీఁగడపాలు తెమ్ము లే లెమ్మని, పాణిపంకజమునఁ బైఁటఁబట్టి

తిగిచినమోము నొద్దికచూచి ముద్దాడి, గిలిగింతలిడుచుఁ గౌఁగిటను జేర్చి

ఔనుర కృష్ణ! నీ వాఁకలి గొన్నావు, బువ్వపెట్టెద నని యవ్వధూటి

మీఁగడపాలతో మేళగించినయోగి, రముఁ దవనీయపాత్రముననునిచి


చేతి కందీయ మెసఁగినకౌతుకంబుఁ

దలఁచి వర్ణింప నెవ్వరి కలవియగునె

సురుచిరాకార ఉన్నవపురవిహార

రాజగోపాల రాధామనోజఖేల


ఏమిరా కృష్ణ! మ న్నేఁటికిఁ దిన్నావు?, అమ్మ! నేఁ దినలేదు అయ్యతోడు

చిన్నవాండ్రందఱు చెప్పిరి గదవోయి, నీవు వారలమాట నిజము జేసి

విందువా నేనంతవెఱ్ఱినా శిశువునా!, ఆఁకొంటినా! చూడవమ్మ నోటి

వాసన యనుచును వక్త్రంబుఁ దెఱచి లో, నా యశోదకును బ్రహ్మాండభాండ


పంక్తులెల్లను దొంతులపగిదిగాను

బెంపుచేసిననిన్ను వర్ణింప దరమె?

సురుచిరాకార ఉన్నవపురవిహార

రాజగోపాల రాధామనోజఖేల

-------------------------------శుభోదయం -------------------------------------

పద్యమ్ము నెవడురా పాతి పెట్టెద నంచు వున్మాదియై ప్రేలుచున్నవాడు

పద్యమ్ము నెవడురా పార వేయుదు నంచు వెఱ్రివాడై విర్ర వీగు వాడు

పద్యమ్ము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై పండ్లు వేవేల నొసగు

పద్యమ్ము నెన్నడో పాతి పెట్టితిమేము లోకుల హృదయాల లోతు లందు.

పద్యమన్నది వేయేండ్ల పసిడి పంట

పద్యమన్నది తెలుగింటి పాడి పంట

పద్యమ్ము యింటింట పండు నంట

కవిత పద్యమ్మె మీకేల కడుపు మంట


ప్రాంజలి ప్రభ 0010  9 .  


ఊహల తెమ్మెర బొమ్మై నిలిచే గృహలక్ష్మీ

ఆశ్చర్యాలే వెన్నెల ధారా గృహలక్ష్మీ


చక్కని పల్కులు జక్కని కుల్కులు మనసుదోచె 

జాణత సోకులు సంపద గమ్యము గృహలక్ష్మీ  

చుక్కల సొంపులు సుందర చూపులు మనసుదోచె 

జూపుల కన్నియ సుందరి చేష్టలు గృహలక్ష్మీ 


అక్కజమందుచు నందరి మెప్పులు మనసుదోచె

నద్భుత భాషగ అలతిగ పలుకుల  గృహలక్ష్మీ

నవ్వుల సవ్వడి మనసును తాకే మనసుదోచె

బీడుగ మారిన మదిలో మెరిసే గృహలక్ష్మీ 


నిలిచిన నీడలు కాంతులవైపుకు మనసుదోచె

తరలే సమయం వెన్నెల ధారా గృహలక్ష్మీ

మౌనం వీడుతు వాణి గ విద్యలు మనసుదోచె

కన్నుల ముందుకు చూపుల పలుకుల గృహలక్ష్మీ


నడిచే దారికి వెలుగుపువ్వులై గృహలక్ష్మీ

నిశలే చేరని హాసం చిలికే గృహలక్ష్మీ

****  


సుభాషితం - 555

--------------

🌺పాత్రాపాత్రా వివేకోస్తి

     ధేను పన్నగయోరివ ౹

     తృణాత్ సంజాయతే క్షీరం

     క్షీరాత్ సంజాయతే విషమ్౹౹🌺

           దానం ఇచ్చేటప్పుడు పాత్ర,అపాత్ర వివేచన ఉండాలి.గడ్డితిని ఆవు పాలు ఇస్తే,పాలు త్రాగి పాము విషం కక్కుతుంది.

🌺

---------------

🌺తావన్నాహతాం మహతీ

     యావత్ కిమపి హి న

     యాచ్యతే లోకయ్య బలిమను యాచన

     సమయే శ్రీపతిరపి వామనోజాతః ౹౹🌺

      బలి దగ్గరకు అడగడానికి శ్రీ మహావిష్ణువుడే వామన రూపంలో( చిన్నవాడిలా ) వెళ్ళేడు.ఇక మానవులైన మనలాంటి వారు ఇంకొకరిని అడగడం తప్పేమి?

🌺✍🏼

---------------

🌺కిం వాససే త్యత్ర విచారణీయమ్ వాసః

     ప్రధానం ఖలు యోగ్యతాయః

     పీతాంబరం వీక్ష్య దదో స్వకన్యాం

     చర్మాంబర వీక్ష్య విషం సముద్ర : ౹౹🌺

        సమాజంలో వేష భూషణములకు ఉన్న విలువ వెల ఎంత ఉన్నదో చూడండి.సముద్రంలోనుంచి పీతాంబరం కట్టుకున్న విష్ణువుకు శ్రీలక్ష్మి దొరికితే,చర్మం కట్టుకున్న శివుడికి దొరికినది ' హలాహలం' విషం.

🌺✍🏽

---------------

🌺పులాక ఇవ ధాన్యేషు

      పుత్తికా ఇవ పక్షిషు తద్విధాస్తే

      మనుష్యాణాం యేషాం

      ధర్మో నా కారణమ్౹౹🌺

      ఎవరికి ధర్మ ఉద్దేశం ముఖ్యం కాదో అటువంటివారు ,ధాన్యం పైన పొట్టులా,పక్షుల మధ్య ఆడ మిణుగురు పురుగులా చేరి ఉంటారు.

🌺✍️

---------------

🌺నయస్య వినయో మూలం వినయః శాస్త్ర నిశ్చయః ౹

      వినయోహీంద్రియ జయః తధ్యక్తః శాస్త్రమృచ్ఛతి ౹౹🌺  

(సంగ్రహము)

        నీతికి మూలం వినయం,వినయమంటే శాస్త్రాలు బాగా తెలిసి ఉండటం.వినయం అంటే ఇంద్రియముల జయముకూడ మరియు అది ఉన్నవాడు శాస్త్రాన్ని తెలుసుకుంటాడు.

🌺✍️

-----------------

🌺చింతాయాశ్చ చితాయాశ్చ 

     బిందు మాత్ర విశిష్యతే

     చితా దహతి నిర్జీవ చింతా

     దహతి జీవినామ్.🌺

        చింతకు చితికి ఒక్క బిందువు మాత్రం వ్యత్యాసం.చింత ప్రాణం ఉన్న దేహాన్ని దహిస్తే,చితి ప్రాణం లేని దేహాన్ని కాలుస్తుంది.అందుకే చింతలు వదిలి జీవితం సాగించాలి మనిషి అయినవాడు.

🌺✍️

---------------

🌺ఏక ఏవ ఖగో మానీ సుఖం 

     జీవితి చాతకః ౹

     అథిత్వం యాతి శక్తస్య న

     నీచముపసర్పతి౹౹🌺

      చాతకపక్షి మహా అభిమాని.ఉన్నదానిలో సుఖం పడుతుంది.చూసిన వారి దగ్గర నోరు విప్పదు.వాన నీటి కోసం వేచి ఉంటుందే కానీ,తనకన్నా క్రింద ఉన్న వారినుంచి ఆడిగి బాధపడదు.

🌺✍️

----------------

🌺ఉత్పన్నపి చాకాశం విశన్నపి రసాతలం

     అటన్నపి మహీమ్ కృత్న్సామ్

     నాదత్తముపతిష్టతే ౹౹🌺

      ఆకాశానికి ఎగిరినా,భూలోకానికి వెళ్లినా,భూమండలం అక్కడక్క తిరిగినా మనం ఇవ్వకుండా ఉన్నది ఏది  మనకి ఎక్కడైనా సరే దొరకదు.

🌺✍️

---------------

🌺అతికృష్ణ న కర్తవ్యం తృష్ణo

     నైవ పరిత్యజేత్.

     శనై: శనైశ్చ భూక్తవ్యం

     స్వయం విత్తముపార్జితమ్ ౹౹🌺

        ఆశలను తిరస్కరించే విపరీతమైన తమకాన్ని తప్పించుకోవాలి.స్వయంగా సంపాదించిన ఆస్తిని మితంగా అనుభవించాలి.

🌺✍️


---------------

🌺అంధా విద్వజ్జనైర్వీనా

     మూకా కవిభిరుజ్జితా౹

     బధిరా గాయనైర్హినా 

     సభా భవతి భూభృతామ్ ౹౹🌺

          విద్వాంసులు ఉండకపోతే సభా భవనం గుడ్డిదైనట్టే,కవులు లేని గుంపు మూగవాళ్ళ గుంపులాంటిది,సంగీత గాయకులు లేకపోతే మనం చెవిటివారితో సమానం.


--------------

🌺పాత్రవిశేషే న్యస్తం గణాంతరం

     వ్రజతి శిల్పమాధాతుః ౹

     జలమివ సముద్రశుక్తౌ

     ముక్తాఫలతాం పయోదస్య ౹౹🌺

           అర్హత తెలుసుకొని గురువులు నేర్పిన విద్య అత్యున్నత స్థానానికి వస్తుంది.అలాగే మేఘం కురిపించిన వర్షపు ధార సముద్రంలో ఉన్న ముత్యపు చిప్పులో పడితే అది మంచి ముత్యం అవుతుంది

---------------

🌺తృణపణోదకాహారా:

      సతతం వనవాసినః ౹

      జంబుకాఖు మృగాద్యాశ్చ

      తాపసాస్తే భవంతి కిమ్ ౹౹🌺

         ఎప్పుడూ అడవిలో ఉన్న గడ్డి,ఆకులు,నీళ్లు త్రాగుతూ ఉన్నంత మాత్రాన ఋషి అనేమాట అయితే,నక్క,ఎలుక,.మృగం మొదలైనవికూడా మునులు అని అనవచ్చు కదా?

-------------------

🌺ప్రదూషే దీపకశ్చంద్ర:

     ప్రభాతే దీపకో రవి: ౹

     త్రైలోక్యే దీపకో ధర్మః 

     సుపుత్రః కులదీపకః ౹౹🌺

      రాత్రి పూట చంద్రుడి వెలుగులు.పగలు సూర్యుడి కాంతి.మూడు లోకాలను ప్రజ్వలించేది ధర్మ.కులానికి సుపుత్రుడే వెలుగు.

🌺

---------------

🌺వ్యాధయో నాపి వా యమః

     ప్రాప్తుమ్ శ్రేయః ప్రతిష్టతే ౹

     యావదేవ భవేత్ కల్పస్తా వచ్చ్రేయః సమాచరేత్ ౹౹🌺

        రోగాలకానీ,యముడే కానీ, నువ్వు అన్ని మంచి పనులను చేసి ముగించు అని వేచి ఉండవు.అందువలన అవకాశం ఉన్నపుడు శక్తి సామర్ధ్యాలు ఉండగానే మనం సత్కార్యాలు చేస్తూ ఉండాలి.

🌺

---------------

🌺యే యాంట్యాభ్యుదయే ప్రీతం

     నోజ్జoతి వ్యాసనేషు చ౹

     తే బాంధవాస్తే సుహృదో లోకః

     స్వార్థపరోsపరః ౹౹🌺

        మనకి ప్రగతి కలిగిన సమయంలో ఎవరు సంతోషం చూపుతారో,ఆపత్తుల సమయంలో మనల్ని ఎవరు విడిచి వెళ్లరో అటువంటివారే బంధువులు ,స్నేహితులు.మిగిలినవారు శత్రువులు.

🌺

---------------

🌺నాస్థానే నిహితా కాచిత్

     క్రియా ఫలవతీ భవేత్ ౹

     న వ్యాపారాశతేనాపి

     శుకవత్పాఠ్యతే బకః ౹౹🌺

          సరియైన స్థలములలో ప్రయత్నాలు చేయకపోతే ఏ పని,కార్యాలు ఫలాన్ని ఇవ్వలేవు.కొంగకు ఎంత నేర్పిన అది చిలుకలా మాట్లాడ లేదు.

🌺

---------------

🌺విద్యాయా వర్ధతే వర్చో 

     విద్యయా వర్ధతే వపు:

     విద్యాయా వర్దతే వీర్యం

     విద్యాయా కిం న వర్ధతే ౹🌺

   విద్యతో వర్చసు వృద్ధి అవుతుంది.విద్యతో శరీర కాంతి వృద్ధి చెందుతుంది.అలాగే,విద్యతో పౌరుషం వృద్ధి అవుతుంది.ఇలా విద్య లేకపోతే ఏది వృద్ధి చెందదు కదా?

🌺✍🏽

🌺అవక్తాపి స్వయం లోకః

      కామం కావ్యాపరీక్షకః ౹

      రసపాకానాభిజ్నోsపి

      భోక్తా వేత్తి న కిం రసమ్ ౹౹🌺

      స్వతః మనిషి కవికాకపోయినా కావ్య పరీక్షకుడు అవ్వచ్చు.వంట చేయడం రాకపోయినా భోజనం చేసేవాడు రుచి చూడ వచ్చు కదా?

🌺✍🏽

🌺దుర్జనస్య శ్వపుచ్ఛస్య

     వ్యాలస్యోష్ట్రగలస్య చ౹

     న మంత్రైనౌర్షధైర్వా పి 

     ఖుజుతా జాతు జాయతే ౹౹🌺

(సంగ్రహము)

      దుర్జనుడు,కుక్క తోక,పాము,ఒంటి మెడ,వీటిని ఏ మంత్రాలవల్ల కానీ లేక ఎటువంటి మందులవల్ల కానీ నిలువుగా చేయలేము.

🌺✍🏽

---------------

🌺అర్థానామార్జనం కార్యం

     వర్ధనం రక్షణం తథా ౹

     భక్ష్యమాణో నిరాదాయః

     సుమేరూరపి హియతే ౹౹🌺

        డబ్బు గడించాలి.అలాగే వృద్ధి చేయాలి.రక్షించాలి.సంపాదన చేయకుండా ఊరికే కూర్చుని తింటూ ఉంటే బంగారు కొండలు సహితా కరిగిపోతూ ఉంటాయి.

🌺✍🏽

---------------

🌺ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్

     శ్రియ మిచ్చేద్దుతాశనాత్ ౹

     జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్

     మోక్షమిచ్చేత్ జనార్దనాత్ ౹౹🌺

        భాస్కర్ అంటే సూర్యుడు నుంచి ఆరోగ్యాన్ని పొందాలి.అగ్ని దేవుడునుంచి సిరిని ఆశించాలి.మహేశ్వరుడు నుంచి జ్ఞానాన్ని పొందాలి.అలాగే మోక్షాన్ని జనారద్దు నుంచి విష్ణువు నుంచి పొందాలి.

🌺✍🏽

---------------

🌺గంగా పాపం శశీ తాపం

     దైన్యం కల్పతరుస్తథా ౹

     పాపం తాపం చ దైన్యం చ ఘ్నంతి

     సంతో మహాశయః ౹౹🌺

       గంగ పాపాల్ని,చంద్రుడు తాపాన్ని,కల్పవృక్షం బాధలను పోగొడుతాయి.అయితే,మహాశయులు పాపం,తాపాన్ని,వేదన ఈ మూడింటిని తొక్కిపెడతాయి.

🌺✍🏽

---------------

🌺చింతనీయా హి విపదా

     మాదావేవ ప్రతిక్రియా ౹

     న కూపఖననం యుక్తం

     ప్రదీప్తేవహ్నినా౹౹🌺

     విపత్తులు అయ్యే ముందే సూక్తమైన పరిహారాలను,ఉపాయాలు గురించి ఆలోచించుకోవాలి.నిప్పుతో ఇల్లు అంటుకున్నప్పుడు నీటి కోసం నుయ్యి తవ్వేది యుక్తం కాదు కదా?

🌺✍🏽

          ------------------------

ఒక కథలో కాళిదాసుకు విద్వత్పరీక్షలో ఎదురైన ప్రశ్నలు అతడు చెప్పిన జవాబులు:-

ప్రశ్న: ద్వావేవ కోమలం పథ్యం?

జవాబు:  వార్తాక వనితాధరౌ.

 ప్రశ్న: ద్వావేవ కఠినం పథ్యం?

జవాబు: కూష్మాండ కుచమండలౌ.


రెండు మృదువులై హితములై యుండు నెవ్వి?

అవ్వి వంకాయయును వనితాధరములు.

రెండు కఠినమై హితములై యుండు నెవ్వి?

గుమ్మడి ఫలమ్ము మరియును కుచయుగమ్ము.


యస్య కస్య హి కర్యస్య
     ఫలితస్య విశేషతః ౹
     క్షిప్రప్రక్రియ మాణస్య కాలః
     పిబతి తద్రసమ్ ౹౹🌺

      చాలా ప్రముఖమైన కర్తవ్యం ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా తక్షణం చెయ్యాలి.అనవసరంగా ఆలస్యం చేస్తే కష్టపడినా ప్రయోజనం లేనట్లు అవుతుంది. ఎందుకంటే,కాలగతి ఆ శ్రమని నిస్సారం చేసి వదిలేస్తుంది.



*శ్లోకం*

*కురుతే గంగాసాగర గమనం వ్రతపరిపాలన మథవా దానమ్!*
*జ్ఞానవిహీనః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన!!*

పంచపది

గంగలో మునకేసినా సాగర స్నానము చేసినా
పూజలెన్నో చేసినా నోములు వ్రతాలుచేసినా
దానధర్మాలెన్ని చేసినా ధర్మదాతగాపేరొందినా
నిష్ఠలేక భక్తిభావములేని తంతులెన్ని చేసినా
ఆత్మజ్ఞానములేని జన్మలెన్నెత్తినా ముక్తి నొందునా కందూర్

---------------
🌺అర్థానామార్జనం కార్యం
     వర్ధనం రక్షణం తథా ౹
     భక్ష్యమాణో నిరాదాయః
     సుమేరూరపి హియతే ౹౹🌺
        డబ్బు గడించాలి.అలాగే వృద్ధి చేయాలి.రక్షించాలి.సంపాదన చేయకుండా ఊరికే కూర్చుని తింటూ ఉంటే బంగారు కొండలు సహితా కరిగిపోతూ ఉంటాయి.
---------------
🌺అర్థానామార్జనం కార్యం
     వర్ధనం రక్షణం తథా ౹
     భక్ష్యమాణో నిరాదాయః
     సుమేరూరపి హియతే ౹౹🌺
        డబ్బు గడించాలి.అలాగే వృద్ధి చేయాలి.రక్షించాలి.సంపాదన చేయకుండా ఊరికే కూర్చుని తింటూ ఉంటే బంగారు కొండలు సహితా కరిగిపోతూ ఉంటాయి.

--------------
🌺ఖలః సర్సపమాత్రాణి
     పచ్ఛిద్రాణి పశ్యతి ౹
     ఆత్మనో బిల్వమాత్రాణి
     పశ్యాన్నపి న పశ్యతి ౹౹🌺
         దుష్టుడైన వాడు ఇంకొకరిలో ఆవంత దోషం చూసినా అది ఎత్తి చూపుతాడు.అయితే,తనలోనే ఉన్న మారేడు కాయంత దోషాలు ఉన్నా చూడనట్టు ఉంటాడు.

--------------
🌺యస్య కస్య హి కర్యస్య
     ఫలితస్య విశేషతః ౹
     క్షిప్రప్రక్రియ మాణస్య కాలః
     పిబతి తద్రసమ్ ౹౹🌺
      చాలా ప్రముఖమైన కర్తవ్యం ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా తక్షణం చెయ్యాలి.అనవసరంగా ఆలస్యం చేస్తే కష్టపడినా ప్రయోజనం లేనట్లు అవుతుంది. ఎందుకంటే,కాలగతి ఆ శ్రమని నిస్సారం చేసి వదిలేస్తుంది.
----------------
🌺న యోజనశతం దూరం
     బాధ్యమానస్య తృష్ణయా౹
     సంతుష్టస్య కరప్రాప్తేsర్తే
     భవతి నాదరః ౹౹🌺
       ఆశలు ఉన్న వాడికి వంద మైళ్ళు దూరం అనిపించదు.అయితే,సంతృప్తి పొందనివారికి ధనం చేతికి దొరికినా సరే,దాన్ని చూసి ఆదరించరు.

---------------


🌺సద్భిరేవ సుహాసీత సద్భి:
     కుర్వీత సంగతిమ్ ౹
     సద్భిర్వివాద మైత్రీ చ
     నాసద్భి: కించిదాచరేత్ ౹౹🌺


        సజ్జనులతో కూర్చోవాలి.సజ్జనులతో స్నేహం చేసుకోవాలి.వివాదాలైనా స్నేహమైనా సజ్జనులతో ఉండాలి.నీచులతో ఏ పనులను చేయరాదు.వాళ్లకు దూరంగా ఉండాలి




9, జనవరి 2022, ఆదివారం

ఓం నమో భగవతే వాసుదేవాయ - 1 to 11ppp



🌻 సాధన- సమిష్టి జీవనము - 1 🌻 

ప్రస్తుతము వర్తిస్తున్న కుంభయుగములో ఆధ్యాత్మిక సాధనకు సమిష్టి జీవనములో భాగస్వామ్యము తప్పనిసరి అని పరమగురువులు ఉపదేశిస్తున్నారని అందరికీ తెలుసు.‌సంఘములో మెలగడంలో ఎగుడుదిగుడులు సర్దుకోక పోవడం వల్ల సాధన స్తంభిస్తుందనేది యథార్థము. 

సాధకుడు జపతపాలు, ప్రార్థనా హోమాలు శ్రద్ధగా నెరవేర్చవచ్చు ఇవన్నీ భక్తి  సాధనకు సామాగ్రియే గాని భక్తి కావు. సమాజంలో నిరంతరమూ అంతర్యామిని దర్శిస్తూ, అ అనుభూతిలో ప్రతి కర్తవ్యము ‌అంతర్యామికి అర్చనగా చేయడంలో సాధన ఎదుగుతుంది. 

సాధకుడు ఇందుకుగాను తాను పూజించే ఏ గురువును అయినా ఇష్టదేవతనయినా సరే సర్వాంతర్యామిగా  ముందు భావనలో రూఢీచేసుకోవాలి. అలా లేని సందర్భంలోనే,‌ వివిధమార్గాలు, వివిధ గురువులు, మతాలు గోచరించి, ఎక్కువ తక్కువలు, కలహాలు ఏర్పడతాయి.‌ 

అంతేకాదు సాధకుడు నిర్వర్తించే జపతపాదులు గాని, సేవాకార్యక్రమాలు గాని యావజ్జీవితము శ్రద్ధగా అనుష్ఠించాలి. మంచి పనులను ఏ మాత్రము విడువకుండా, ప్రతిదినము ఒకే సమయానికి అభ్యాసం చేస్తూ పోతేగాని, వానిలో దృఢత్వము రాదు, శ్రద్ధ ఏర్పడదు. 

కాని‌ ఇందులో ఒక ఇబ్బంది ఎదురవుతుంది, ఒక మంచిపనిని ఉదాహరణకు హోమియో వైద్య సేవను ప్రారంభించినప్పుడు  కలిగే ఉత్సాహము, కార్యదీక్ష కొన్నేండ్లు అయ్యేసరికు క్రమంగా మాటు పడుతుంటాయి. ఇక సేవ యాంత్రికముగా‌ మాత్రమే‌ సాగుతుంటుంది. 

సాధకుని ద్వారా జరిగే సేవ వలన సమాజంలో వారికి ప్రయోజనం చేకూరవచ్చునే గాని, అతనికి మాత్రం వికాసము, పరిశుద్ధి లభింపక, ఎదుగుదల ఆగిపోవును.
......✍ మాస్టర్ ఇ.కె.
(To be Continued)
🌹 🌹 🌹 🌹 🌹


 8.1.2022 ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ప్రథమ స్కంధము-మొదటి అధ్యాయము

ఋషుల ప్రశ్నలు

ఓం నమో భగవతే వాసుదేవాయ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

1.1 (మొదటి శ్లోకము)

జన్మాద్యస్య యతోఽస్వయాది తరతశ్చార్థేష్వభిజ్ఞః స్వరాట్

తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే ముహ్యన్తి యత్సూరయః|

తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోఽమృషా

ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి॥

ఓ ప్రభూ! శ్రీకృష్ణా! వసుదేవతనయుడవు. సర్వవ్యాపియైన భగవానుడవు అగు నీకు గౌరవపూర్వక వందనముల నర్పించుచున్నాను. పరతత్త్వమును, వ్యక్తమగు విశ్వముల సృష్టిస్థితిలయములకు పరమ మూలకారణుడును అగుటచే శ్రీకృష్ణభగవానుని నేను ధ్యానించుచున్నాను. ప్రత్యక్షముగను, పరోక్షముగను సర్వసృష్టుల జ్ఞానమును కలిగియున్న అతడు తనకు పరమైన కారణము వేరొకటి లేనందున స్వతంత్రుడై యున్నాడు. అతడే తొలుత వేదజ్ఞానమును ఆదిజీవియైన బ్రహ్మదేవుని హృదయమునందు తెలియజేసెను. అగ్ని యందు జలదర్శనము లేదా జలమునందు స్థలదర్శనము వంటి భ్రాంతిమయములైన వాటిచే మనుజుడు మోహగ్రస్థుడగు రీతి, అతని కారణముననే మహామునులు దేవతలు కూడా మోహమునకు గురియగుదురు. ప్రకృతి త్రిగుణముల ద్వారా తాత్కాలికముగా వ్యక్తమగు భౌతికవిశ్వములు అసత్యములైనను కేవలము ఆ దేవదేవుని కారణముననే సత్యములుగా గోచరించుచున్నవి. కనుకనే భౌతికజగము యొక్క భ్రాంతుల నుండి సదా ముక్తమై యుండెడి దివ్యధామమును నిత్యవాసుడై యున్న శ్రీకృష్ణభగవానుని నేను ధ్యానించు చున్నాను. పరతత్త్వమైనందూనే ఆ దేవదేవుని నేను ధ్యానింతును.

1.2 (రెండవ శ్లోకము)

ధర్మః ప్రోజ్ఝిత్ కైతవోఽత్ర పరమో నిర్మత్సరాజాం సతమ్

వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనమ్|

శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః

సద్యో హృద్యవరుధ్యతేఽత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్ క్షణాత్ ॥

భౌతికభావనాప్రేరితములైన ధర్మములు నన్నింటిని సంపూర్ణముగా నిరసించి, మాత్సర్యరహితులైన భక్తులు అవగతమొనర్చుకొనగల పరమోత్కృష్టమైన సత్యమును ఈ భాగవతపురాణము ప్రతిపాదించుచున్నది. పరమోత్కృష్ట సత్యమనునది మాయకు పరమైన సత్యమై యుండి సర్వులకు మంగళప్రదాయకమై యున్నది.  అట్టి సత్యము త్రివిధ తాపములను సమూలముగా నశింపజేయును. మహామునియైన వ్యాసదేవునిచే (అతని పరిపక్వస్థితిలో) రచింపబడిన ఈ శ్రీమద్భాగవతము భగవదనుభూతిని పొందుటకు సర్వవిధములుగా యోగ్యమై యున్నప్పుడు వేరొక గ్రంథము యొక్క అవసరమేమున్నది? శ్రీమద్భాగవత సందేశమును మనుజుడు శ్రద్ధతో, అణకువతో శ్రవణము చేసినంతనే తద్ జ్ఞానముచే దేవదేవుడు అతని హృదయమునందు సుస్థాపితుడగుచున్నాడు.

1.3 (మూడవ శ్లోకము)

నిగమకల్పతరోర్గలితం ఫలం      శుకముఖాదమృతద్రవ సంయుతమ్|

పిబత భాగవతం  రసమాలయమ్          ముహురహో రసికా భువి భావుకాః॥

ఓ భావుకులారా! రసికులారా! వేదవాఙ్మయమనెడి కల్పవృక్షము యొక్క పక్వఫలమై శ్రీమద్భాగవతమును ఆస్వాదింపుడు. ఇది శ్రీశుకదేవగోస్వామి ముఖతః వెలువడియున్నది. తత్కారణముగా ఈ ఫలము మరింత మధురముగా ఒప్పారి, దాని అమృతరసము ముక్తపురుషులతో సహా సర్వులకు ఆస్వాదనీయమై యున్నది.

1.4 (నాలుగవ శ్లోకము)

నైమిషేఽనిమిషక్షేత్రే ఋషయః శౌనకాదయః|

సత్రం స్వర్గాయలోకాయ సహస్రసమమాసత॥

భగవానుడు, అతని భక్తుల ప్రీత్యర్థమై వేయిసంవత్సరముల కాలము పట్టు ఒకయజ్ఞమును నిర్వహించుటకు శౌనకఋషి అధ్యక్షతన ఋషులందరును పవిత్రస్థలమైన నైమిశారణ్యమున ఒకమారు సమకూడిరి

1.5 (ఐదవ శ్లోకము)

త ఏకదా తు మునయః ప్రాతర్షుతహుతాగ్నయః |

సత్కృతం సూతమాసీనం  పప్రచ్ఛురిదమాదరాత్॥

ఒకరోజు ఋషులు యజ్ఞాగ్నిని ప్రజ్వరిల్లజేయుట ద్వారా ప్రాతఃకాల కర్మలను పూర్తిచేసి  శ్రీల సూతగోస్వామికి ఉన్నతాసనమును సమర్పించిన పిమ్మట భక్తిప్రపత్తులతో ఈ క్రింది విషయముల గూర్చి ప్రశ్నించిరి

1.6 (ఆరవ శ్లోకము)

ఋషయ ఊచుః

త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానఘ|

ఆఖ్యాతాన్యప్యధీతాని ధర్మశాస్త్రాణి యాన్యుత॥

ఋషులు పలికిరి: ఓ సూతగోస్వామీ! మీరు సంపూర్ణముగా దోషరహితులు. ధర్మశాస్త్రములందు, పురాణేతిహాసములందు మీరు నిష్ణాతులైనట్టివారు. ఆ శాస్త్రముల నన్నింటిని మీరు సరియైన నిర్దేశములో అధ్యయనము చేయుటయే గాక ప్రవచించియుండుటయే కారణము.

1.7 (ఏడవ శ్లోకము)  

యాని వేదవిదాం శ్రేష్ఠో భగవాన్  బాదరాయణః|

అన్యే చ మునయః సూత పరావరవిదో విదుః॥

ఓ సూతగోస్వామీ! వేదవిదులలోశ్రేష్ఠులైన కారణముగా మీరు భగవదవతారమైన వ్యాసదేవుడు రచించిన శాస్త్రములన్నింటి యందును నిష్ణాతులై యున్నారు. అంతియే గాక సర్వవిధములైన భౌతిక జ్ఞానము, తత్త్వజ్ఞానములందు నిష్ణాతులైన ఇతర మునులను కూడా మీరెరిగియున్నారు.

1.8 (ఎనిమిదవ శ్లోకము)

వేత్థ త్వం సౌమ్య తత్సర్వం తత్త్వతస్తదనుగ్రహాత్|

బ్రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత॥

మీరు సౌమ్యులు గనుక మీ గురువులీ నమ్రత గలిగిన శిష్యున కొసగెడి గుహ్యజ్ఞానము నంతటిని మీరు అనుగ్రహించిరి. కనుక మీరు శాస్త్రీయముగా వారినుండి గ్రహించినదంతయు మాకు తెలియజేయుడు

1.9 (తొమ్మిదవ శ్లోకము)

తత్ర తత్రాంజసాయుష్మన్ భవతా యద్వినిశ్చితమ్|

పుంసామేకన్తతః  శ్రేయస్తన్నః శంసితుమర్హసి॥

ఓ ఆయుష్మంతుడా! కనుక జనులకు ఏది పరమశ్రేయోదాయకమని నీవు నిర్ధారించితివో అట్టిదానిని సులభముగా అవగతమగు రీతిలో దయచేసి మాకు వివరింపుము.

1.10 (పదవ శ్లోకము)

ప్రాయేణాల్పాయుషః సభ్య కలావస్నిన్ యుగే జనాః|

మన్దాః సుమన్దమతయో మందభాగ్యా హ్యుపద్రుతాః॥

ఓ ఋషులారా! ఈ కలియుగమునందు జనులు అల్పాయుష్కులుగా నుందురు. వారు కలహస్వభావులు,బద్ధకస్తులు, తప్పుద్రోవ పట్టింపబడినవారు, మందభాగ్యులు మాత్రమేగాక సదా కలతకు లోనైన వారిగా యుందురు.

1.11 (పదకొండవ శ్లోకము)

భూరీణి భూరికర్మాణి శ్రోతవ్యాని విభాగశః|

అతః సాధోఽత్ర యత్సారం సముద్ధృత్య మనీషయా|

బ్రూహి భద్రాయభూతానాం యేనాత్మా సుప్రసీదతి॥

శాస్త్రములు అనేకములుగానుండి వాటన్నింటియందును పలువిధములైన విధ్యుక్తధర్మములు ఉపదేశింపబడినవి. ఆ ధర్మములు వాటి వివిధశాఖల బహుసంవత్సరముల అధ్యయనము పిమ్మటయే తెలియబడగలవు. కావున ఓ మహర్షీ! సర్వజనుల శ్రేయస్సును గోరి ఆ శాస్త్రములన్నింటి సారమును  గ్రహించి తదుపదేశము ద్వారా వారి హృదయములు సంతృప్తిచెందు రీతిలో దయతో   విశదీకరింపుడు

1.12 (పన్నెండవ శ్లోకము)

సూత జానాసి భద్రంతే భగవాన్ సాత్వతాం పతిః|

దేవక్యాం వసుదేవస్య జాతో యస్య చికీర్షయా॥

ఓ సూతగోస్వామీ! నీకు సర్వశుభములు కలుగు గాక! శ్రీకృష్ణభగవానుడు ఏ ప్రయోజనము చేత దేవకీదేవి గర్భమున వసుదేవుని తనయునిగా ఆవిర్భవించెనో నీవు ఎరుగుదువు.

1.13 (పదమూడవ శ్లోకము)

తన్నః శుశ్రూషమాణా నామర్హస్యంగానువర్ణితుమ్|

యస్యావతారో భూతానాం క్షేమాయ  చ భవాయ చ॥

ఓ సూతగోస్వామీ! శ్రీకృష్ణభగవానుని, అతని అవతారములను గూర్చి శ్రవణమూ చేయుటకు మేము అత్యంత ఉత్సాహముతో నున్నాము. కనుక ఆ విషయమున పూర్వ ఆచార్యులు గావించిన ఉపదేశములను దయతో మాకు వివరింపుడు. అట్టివాని శ్రవణము, ఉపదేశములు రెండును మనుజుని ఉద్ధరింపగలవు.

1.14 (పదునాల్గవ శ్లోకము) 

ఆపన్నః సంసృతిం ఘోరాం యన్నామ వివశో గృణన్|

తతః సద్యో విముచ్యేత యద్బిభేతి స్వయం భయమ్॥

అతిఘోరమగు జన్మమృత్యు వలలో చిక్కియుండెడి జీవులు భయమూనకే భయమును కలిగించు పవిత్రమైన శ్రీకృష్ణనామమును వివశత్వమున ఉచ్ఛరించినను శీఘ్రమే ముక్తినొందగలరు.

1.15 (పదిహేనవ శ్లోకము)

యత్పాదసంశ్రయాః సూత మునయః ప్రశమాయనాః|

సద్యః పునన్త్యుపస్పృష్టాః స్వర్ధున్యాపోఽను సేవయా॥

ఓ సూతగోస్వామీ! శ్రీకృష్ణభగవానుని పాదపద్మములకు సంపూర్ణముగా శరణుపొందిన మహామునులు తమ దరిచేరిన వారిని శీఘ్రమే పవిత్రమొనర్చగల సమర్థులైయున్నారు. కాని గంగాజలము దీర్ఘకాల సేవానంతరమే పవిత్రతను కలుగజేయుచున్నది.

1.16 (పదహారవ శ్లోకము)

కో వా భగవతస్తస్య పుణ్యశ్లోకేడ్యకర్మణః

శుద్ధికామో న శృణుయాద్యశః  కలిమలాపహమ్॥

కలహయుగమైన కలియుగము యొక్క దోషముల నుండి ముక్తిని వాంఛించుచునే శ్రీకృష్ణభగవానుని ఘనమైన యశోవైభవమును వినగోరని వాడెవడుండును?

1.17 (పదిహేడవ శ్లోకము)

తస్య కర్మాణ్యుదారాణి పరిగీతాని సూరభిః|

బ్రూహే నః శ్రద్ధధానానాం లీలయా దధతః కలాః॥

ఆ దేవదేవుని కర్మలు అద్భుతములును, దివ్యములును అయియున్నవి. మహామునియైన నారదుని వంటివారు అట్టి దివ్యకర్మలను సదా కీర్తింతురు. కనుక ఆ భగవానుడు వివిధ అవతారములలో గావించిన సాహసకృత్యములను శ్రవణాసక్తులమైన మాకు కరుణతో వివరింపుము.

1.18 (పద్దెనిమిదవ శ్లోకము)

అథాఖ్యాహి హరేర్ధీ మన్నవతారకథాః శుభాః|

లీలా విదధతః స్వైరమీశ్వరస్యాత్మమాయయా॥

ఓ ధీమంతుడైన సూతగోస్వామీ! ఆదేవదేవుని వివిధావతారముల యందలి దివ్యలీలలను మాకు వర్ణించి చెప్పుము. పరమనియామకుడైన భగవానుని అట్టి మంగళప్రదములైన సాహసకర్మలు లీలలు ఆతని అంతరంగిక శక్తిచే నిర్వహింపబడుచుండును.

1.19 (పందొమ్మిదవ శ్లోకము)

నయం తు నితృప్యామ ఉత్తమశ్లోకవిక్రమే|

యచ్ఛృణ్వతాం రసజ్ఞానాం స్వాదు స్వాదు పదే పదే॥

ఉత్తమశ్లోకుడైన శ్రీకృష్ణభగవానుని దివ్యలీలలను శ్రవణము చేయుట యందు మే మెన్నడును అలసటనొందము. ఆ దేవదేవునితో గల దివ్య సంబంధము నెడ రుచిని పెంపొందించుకొనినవారు అతని లీలాకథలను ప్రతిక్షణమును ఆస్వాదింతురు.

1.20 (ఇరువదవ శ్లోకము)

కృతవాన్ కిల కర్మాణి సహే రామేణ కేశవః|

అతిమర్త్యాని భగవాన్ గూఢః కపటమానుషః॥

దేవదేవుడైన శ్రీకృష్ణుడు బలరాముని గూడి మానవుని వలె నటించుచు గూఢముగా పెక్కు మానవాతీతకర్మలను ఒనరించియున్నాడు.

1.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

కలిమాగతమాజ్ఞాయ క్షేత్రేఽస్మిన్ వైష్ణవే నయమ్|

ఆసీనా దీర్ఘసత్రేణ కథాయాం సక్షణా హరేః॥

కలియుగము ఆరంభమైనదని ఎరిగియున్నందున శ్రీకృష్ణభగవానుని దివ్యలీలాకథలను దీర్ఘకాలము శ్రవణము చేయు నుద్దేశ్యముతో మేము ఈ పవిత్రస్థలము నందు సమకూడితిమి. అట్టి శ్రవణము  ద్వారానే మేము యజ్ఞము చేయ సంకల్పించితిమి.

1.22 (ఇరువది రెండవ శ్లోకము)

త్వం నః సందర్శితో ధాత్రా దుస్తరం నిస్తితీర్షతామ్|

కలిం సత్త్వహరం పుంసాం కర్ణధార ఇవార్ణవమ్॥

మానవుల శుభలక్షణముల నన్నింటిని హరించునట్టి కలియుగమను దుస్తర సముద్రమును దాటగోరువారి నావకు నావికునిగా పొందగలుగుటకే మేము మిమ్ము  దైవవశాత్తుగా కలువగలిగితిమని భావించుచున్నాము.

1.23 (ఇరువది మూడవ శ్లోకము)

బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణ్యే ధర్మవర్మణి|

స్వాం కాష్ఠామధునోపేతే ధర్మః కం శరణం గతః॥

పరతత్త్వమును, యోగేశ్వరుడును అగు శ్రీకృష్ణభగవానుడు తన నిజ ధామమునకేగి యున్నందున ధర్మనియమములు ఇప్పుడు ఎవరి శరణమున జేరినవో తెలియజేయుడు.

ఇంతటితో వేదవ్యాసుల వారి శ్రీమద్భాగవతం ప్రథమస్కంధం ప్రథమాధ్యాయం సంపూర్ణం

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*****
8.1.2022 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ప్రథమ స్కంధము- రెండవ అధ్యాయము

భగవత్తత్త్వము మరియు భక్తియుత సేవ

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
2.1 (మొదటి శ్లోకము)

వ్యాస ఉవాచ

ఇతి సంప్రశ్నసంహృష్టో విప్రాణాం రౌమహర్షిణిః|

ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుముపచక్రమే॥

రోమహర్షణుని సుతుడైన ఉగ్రశ్రవుడు (సూతగోస్వామి) బ్రాహ్మణుల ఉత్తమ ప్రశ్నలచే పూర్ణసంతుష్టి నొందినవాడై వారికి కృతజ్ఞతలు తెలిపే ప్రత్యుత్తరము నొసగ ఉద్యుక్తుడయ్యెను.

2.2 (రెండవ శ్లోకము)

సూత ఉవాచ

యం ప్రవ్రజన్తమను పేతమ పేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ|

పుత్రేతి తన్మయతయా తరవోఽభినేదుస్తం సర్వభూతహృదయం మునిమానతోఽస్మి॥

శ్రీల సూతగోస్వామి పలికెను: సర్వుల హృదయములలోనికి చేరగలిగిన మహామునియైన శుకదేవగోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. ఉపనయస సంస్కారమును గాని లేదా ఉన్నత కులస్థులు పాటించునటువంటి పవిత్రీకరణవిధానములను గాని అనుసరింపక  సన్న్యాసమును స్వీకరించుటకై  అతడు గృహమును వీడినప్పుడు తండ్రియైన వ్యాసదేవుఢు "హా! పుత్రా!" అని విరహకాతరుడై పలికియుండెను. అదే విరహభావములో మునిగిన వృక్షములు అంతట ఆ బాధాతప్తుడైన తండ్రికి ప్రతిధ్వానముతో ప్రత్యుత్తర మిచ్చినవి.

2.3 (మూడవ శ్లోకము)

యః స్వానుభావమఖిల శ్రుతిసారమేకమధ్యాత్మ దీపమతితితీర్హతాం తమోఽన్ధమ్|

సంసారిణాం కరుణయాహ పురాణగుహ్యం
తం వ్యాస సూనుముపయామి గురుం మునీనామ్॥

వ్యాసదేవుని తనయుడును, మునులందరికి గురువర్యుడును అగు శ్రీశుకదేవగోస్వామికి నా గౌరవపూర్వక వందనములు. అంధకారబంధురమైన సంసారమును తరించుటకు తీవ్రయత్నము సలిపెడి సంసారుల యెడ స్వయముగా అనుభూతమొనర్చుకొనిన పిమ్మట పలికియుండెను.

2.4 (నాల్గవ శ్లోకము)

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్|

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయమూదీరయేత్॥

జయమును సాధించుటకు ఏకైక మార్గమైన శ్రీమద్భాగవతమును పఠించుటకు మొదట దేవదేవుడైన నరనారాయణ ఋషికి, చదువుల తల్లి సరస్వతీదేవికి, గ్రంథకర్తయైన శ్రీల వ్యాసదేవునికి ప్రతియొక్కరు గౌరవపూర్వక వందనముల నర్పించవలెను.

2.5 (ఐదవ శ్లోకము)

మునయః సాధు పృష్టోఽహం భవద్భిర్లోకమంగళమ్|

యత్కృతః కృష్ణసంప్రశ్నో యేనాత్మా సుప్రసీదతి॥

ఓ మునులారా! యోగ్యములైన ప్రశ్నలు నన్ను అడిగారు. కృష్ణపరములుగా నుండి జగన్మంగళమునకు సంబంధించినవి కనుక శ్రేష్ఠములై యున్నవి. అటువంటి ప్రశ్నలే వాస్తవమునకు ఆత్మను సంపూర్ణముగా సుప్రసన్నము చేయసమర్ధమైనది.


2.6 (ఆరవ శ్లోకము)

స వై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే|

అ హైతుక్యప్రతిహతా యయాత్మా సుప్రసీదతి॥

అధోక్షజుడైన శ్రీకృష్ణభగవానుని యెడ ప్రేమపూర్వకమైన భక్తియుత సేవను కలిగింపజేయునదే మానవుల పరమధర్మమై యున్నది. ఆత్మ యొక్క పూర్ణసంతృప్తి కొరకు అట్టి భక్తియుతసేవ నిర్హేతుకము మరియు అవరోధరహితముగా ఉంటుంది.


2.7 (ఏడవ శ్లోకము)

వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః|

జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకమ్॥

దేవదేవుడైన శ్రీకృష్ణునకు భక్తియుతసేవ చేయుటద్వారా మనుష్యుడు తొందరగా నిర్హేతుకమైన జ్ఞానమును, జగమునుండి వైరాగ్యము పొందుచున్నాడు.

2.8 (ఎనిమిదవ శ్లోకము)

ధర్మః స్వనుష్ఠితః పుంసాం విష్వక్సేనకథాసు యః|

నోత్సాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలమ్॥

తన నిజస్థితి ననుసరించి మనుజుడు చేయు విద్యుక్తధర్మ నిర్వహణము దేవదేవుని కథలయందు అతనికి అనురక్తిని కలిగించనిచో అది కేవలము శ్రమ మాత్రమే అవుతుంది.

2.9 (తొమ్మిదవ శ్లోకము)

ధర్మస్య హ్యాపవర్గస్య నార్థోఽర్థాయోపకల్పతే|

నార్థస్య ధర్మైకాస్తస్య కామో లాభాయ హి స్మృతః॥

విద్యుక్తధర్మములన్నియును నిశ్చయముగా చరమమైన మోక్షము కొరకే ఉద్దేశింపబడినవి. వాటినెన్నడును భౌతికలాభము కొరకై నిర్వహింపరాదు. అంతమాత్రమే కాకుండా మహామునుల నిర్ణయము ప్రకారము పరమధర్మమునందు విముక్తుడైనవాడు. భౌతికలాభము నెప్పుడును ఇంద్రియభోగమునకై వినియోగింపరాదు.

2.10 (పదవ శ్లోకము)

కామస్య నేంద్రియప్రీతిర్లాభో జీవేత యావతా|

జీవస్య తత్త్వజిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః॥

జీవితములో కోరికలెన్నడును ఇంద్రియభోగముల కోసం కేంద్రీకృతమై ఉండరాదు. మానవుడు పరతత్త్వమును గూర్చి విచారణము సలుపుటకే ఉద్దేశింపబడి ఉన్నందున కేవలము ఆరోగ్యప్రదమైన జీవనము కోసం కోరికలను కలిగి ఉండవలెను. అంతకు మించి కర్మల లక్ష్యము వేరొకటి కాకూడదు.

2.11 (పదకొండవ శ్లోకము)

వదన్తి తత్తత్త్వవిదస్తత్వం యజ్ జ్ఞానమద్వయమ్|

బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే॥

పరతత్త్వము తెలిసిన తత్త్వవిదులు అట్టి అద్యయతత్త్వమును బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడని పిలుతురు.

2.12 (పన్నెండవ శ్లోకము)

తచ్ఛ్రద్దధానా మునయో జ్ఞానవైరాగ్యయుక్తయా|

పశ్యన్త్యాత్మని చాత్మానం భక్త్యా శ్రుతగృహీతయా॥

జిజ్ఞాసువైనవాడు లేదా ముని జ్ఞానవైరాగ్యయుక్తుడై వేదాంతశృతి ద్వారా తాను శ్రవణము చేసియున్న విధముగా భక్తియుతసేవను గావించుచు పరతత్త్వమును అనుభూతమొనర్చుకొనగలుగును.

2.13 (పదమూడవ శ్లోకము)

అతః పుంభిర్ధ్విజశ్రేష్ఠా వర్ణాశ్రమవిభాగశః |

స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి ర్హరితోషణమ్॥

ఓ ద్విజశ్రేష్ఠులారా! కనుకనే శ్రీకృష్ణభగవానునికి ముదమును గూర్చుటయే వర్ణాశ్రమపద్ధతి ననుసరించి మనుజుడు తన స్వధర్మమునకు నిర్దేశింపబడిన కర్మలను ఒనరింఛుట ద్వారా సాధించెడి అత్యున్నత పూర్ణత్వమని నిర్ణయింపబడినది.

2.14 (పదునాల్గవ  శ్లోకము)

తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతిః

శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా॥
కనుక ప్రతియొక్కరును ఏకైకలక్ష్యముతో సాత్వతాంపతియైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన శ్రవణము, కీర్తనము, స్మరణము, పూజనములందు ఎల్లప్పుడు నియిక్తులు కావలెను.


2.15 (పదిహేనవ శ్లోకము)

యదనుధ్యాసినా యుక్తాః కర్మగ్రంథినిబంధనమ్|

ఛిన్దన్తి కోవిదాస్తస్య కో న కుర్యాత్కథారితమ్॥

బుద్ధిమంతులైనవారు శ్రీకృష్ణుని  స్మరణమను దివ్యఖడ్గమును చేబూని కర్మగ్రంథిని త్రెంపివేయుచున్నారు. కనుక ఎవరు  ఆ దేవదేవుని కథల యందు శ్రద్ధను కనబరచకుందురు? (శ్రద్ధ కనబరచుదురు అని అర్థము).

2.16 (పదునారవ శ్లోకము)

శుశ్రూషోః శ్రద్దధానస్య వాసూదేవకథారుచిః|

స్యాన్మహత్సేవయా విప్రాః పుణ్యతీర్థనిషేవణాత్॥

ఓ విప్రులారా! సర్వపాపదూరులైనటువంటి మహాభక్తులకు సేవను గూర్చుట ద్వారా గొప్ప సేవ ఒనరింపబడుచున్నది. అట్టి సేవ ద్వారా మనుజునికి వాసుదేవుని కథలను శ్రవణము చేయుట యందు రుచి ఉత్పన్నమగుచున్నది.


2.17 (పదిహేడవ శ్లోకము)

శృణ్వతాం స్వకథాః కృష్ణః  పుణ్యశ్రవణ కీర్తనః|

హృద్యస్తఃస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతామ్॥

పరమాత్మగా సర్వజీవ హృదయములలో నిలిచినవాడును, శ్రద్ధావంతులైన భక్తుల శ్రేయోభిలాషియును అగు శ్రీకృష్ణభగవానుడు చక్కగా శ్రవణకీర్తనములు జరిగినపుడు పుణ్యప్రదములైన తన దివ్యలీలాకథల యెడ శ్రవణోత్సాహమును పెంపొందించుకొనిన భక్తుని హృదయము నుండి భౌతికసుఖాభాలాషను తొలగించివేయుచున్నాడు.

(శ్రీమద్భాగవతము, ప్రథమ స్కంధము, రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

***
9.1.2022 ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ప్రథమ స్కంధము- రెండవ అధ్యాయము

భగవత్తత్త్వము మరియు భక్తియుత సేవ

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
2.18 (పదునెనిమిదవ శ్లోకము)

నష్ట ప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా|

భగవత్యుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ॥

నిత్యము తానొనరించునటువంటి శ్రీమద్భాగవతోపదేశముల శ్రవణము,శుద్ధభక్తుల సేవనము ద్వారా హృదయమునందలి అభద్రములన్నియును దాదాపు సంపూర్ణముగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణభగవానుని యెడ అకుంఠితమైన ప్రేమయుతసేవ స్థాపితము కాగలదు.

2.19 (పందొమ్మిదవ శ్లోకము)

తదా రజస్తమోభావాః కామలోభాదయశ్చ యే|

చేత ఏతైరనావిద్ధం స్థితం సత్త్వే ప్రసీదతి॥

నిక్షేపరహితమైన ప్రేమయుతసేవ హృదయమునందు సుస్థిరమైనంతనే రజస్తమోగుణ ఫలములైన కామక్రోధ లోభములు హృదయమునుంఢి అదృశ్యమగును. అంతట భక్తుడు సత్త్వగుణమునందు స్థితిని పొంది సంపూర్ణముగా ప్రసన్నుడగును.

2.20 (ఇరువదవ శ్లోకం)

ఏవం ప్రసన్నమనసో భగవద్భక్తి యోగతః

భగవత్తత్త్వవిజ్ఞానం ముక్తసంగస్య జాయతే

ఈ విధముగా శుద్ధసత్త్వము నందు స్థితుడై శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ ద్వారా ప్రసన్నమైన మనస్సును పొందెడి మనుజుడు సమస్త   భౌతికసంగత్వము నుండి ముక్తినొందిన స్థితిలో వాస్తవమైన భగవత్తత్త్వ విజ్ఞానమును పొందగలడు.

2.21 (ఇరవై ఒకటవ శ్లోకము)

భిద్యతే హృదయగ్రంథిశ్ఛిద్యన్తే  సర్వసంశయాః|

క్షీయన్తే దాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే॥

ఈ విధముగా హృదయగ్రంథి త్రెంపివేయబడి సర్వసంశయములు సమూలముగా నశించును. అటుపిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్యకర్మపరంపర పరిసమాప్తి నొందును.

2.22 (ఇరువది రెండవ శ్లోకము)

అతో వై కవయో నిత్యం భక్తిం పరమయా ముదా|

వాసుదేవే భగవతి కుర్వన్త్యాత్మప్రసాదనీమ్॥

కనుకనే అనంతకాలము నుండి పరమభక్తులైనవారు ఆత్మకు ప్రసన్నతను గూర్చునదైనందున దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుతసేవను నిశ్చయముగా అత్యంత ముదముతో గావించుచున్నారు.

2.23 (ఇరువది మూడవ శ్లోకము)

సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్గుణాస్తైర్ యుక్తః పరః పురుష ఏక ఇహాస్య ధత్తే|

స్థిత్యాదయే హరివిరించిహరేతి సంజ్ఞాః
శ్రేయాంపి తత్ర ఖలు సత్త్వతనోర్నృణాం స్యుః॥

దివ్యుడైన పరమపురుషుడు ప్రకృతి త్రిగుణములైన సత్త్వగుణము, రజోగుణము, తమోగుణములతో పరోక్షముగా సంగత్వమును కలిగియున్నాడు. భౌతికజగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు ఆతడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులనెడి గుణావతారములను స్వీకరించుచున్నాడు. ఈ మూడింటిలో సత్త్వగుణరూపమైన విష్ణువు నుండి సమస్త మానవులు పరమశ్రేయమును పొందగలరు.

2.24 (ఇరువది నాల్గవ శ్లోకము)

పార్థివాద్దారుణో ధూమస్తస్మాదగ్నిస్త్రయీమయః|

తామసస్తు రజస్తస్మాత్సత్త్వం యద్బ్రహ్మదర్శనమ్॥

దారువు భూమి యొక్క రూపాంతరమైనను, ధూమము దారువు కన్నను శ్రేష్ఠమైనది. కాని యజ్ఞము ద్వారా ఉన్నతజ్ఞాన సముపార్జనము జరుగును గనుక అగ్నియనునది ధూమము కన్నను శ్రేష్ఠమైనది. అదేవిధముగా రజోగుణము తమోగుణము కన్నను శ్రేష్ఠమైనను,సత్త్వగుణముచే పరతత్త్వానుభవమును పొందు స్థితికి మనుజుడు చేరును గనుక సత్త్వగుణము రజోగుణము కన్నను శ్రేష్ఠమై యున్నది.


2.25 (ఇరువది ఐదవ శ్లోకము)

భేజిరే మునయోఽథాగ్రే భగవన్తమధోక్షజమ్|

సత్త్వం విశుద్ధం క్షేమాయ కల్పన్తే యేఽను తానిహ॥

ప్రకృతి త్రిగుణములకు పరుడైనందునే అధోక్షజుడైన శ్రీకృష్ణుని పూర్వము మహామునులు  భక్తియుతసేవతో అర్చించిరి. భౌతికబంధముల నుండి ముక్తిని పొంది దివ్యలాభమును పొందు నుద్దేశ్యముతోనే వారు ఆ దేవదేవుని ఆరాధించిరి. అట్టి ప్రామాణికుల ననుసరించువారు కూడ భౌతికజగము నుండి ముక్తిని పొందుటకు అర్హులగుచున్నారు.

2.26 (ఇరువదిఆరవ శ్లోకము)

ముముక్షవో ఘోరరూపాన్ హిత్వా భూతపతీనథ|

నారాయణకలాః శాన్తా భజన్తి హ్యనసూయవః॥

ముక్తిని పొందుట యందు శ్రద్ధావంతులైనవారు నిశ్చయముగా అసూయరహితులై సర్వులను గౌరవింతురు. అయినను వారు ఘోరములైన వివిధ దేవతారూపములను నిరసించి విష్ణువు మరియు అతని ప్రధానాంశముల శాంతరూపములనే అర్చింతురు.

2.27 (ఇరువది ఏడవ శ్లోకము)

రజస్తమఃప్రకృతయః సమశీలా భజన్తి వై|

పితృభూతప్రజేశాదీన్ శ్రియైశ్వర్యప్రజేస్సవః॥

రజోగుణమునందు మరియు తమోగుణమునందు స్థితిని కలిగినవారు స్త్రీసాంగత్యము, ఐశ్వర్యము, అధికారము, సంతానమాది భౌతికలాభమును పొందగోరినవారై నందున పితృదేవతలను, ఇతర జీవులను, లోకపాలనా వ్యవహారములను గాంచెడి దేవతలను అర్చింతురు.

2.28 (ఇరువది ఎనిమిదివ      శ్లోకము)

వాసుదేవపరా వేదా వాసుదేవపరా మఖాః|

వాసుదేవపరా యోగా వాసుదేవపరాః క్రియాః॥

2.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

వాసుదేవపరం జ్ఞానం వాసుదేవపరం తపః

వాసుదేవపరో ధర్మో వాసుదేవపరా గతిః॥

శాస్త్రములందలి జ్ఞానము యొక్క పరమలక్ష్యము శ్రీకృష్ణభగవానుడై యున్నాడు. యజ్ఞాచరణ ప్రయోజనము ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచుటయే. ఆ ఆదిదేవుని అనుభూతమొనర్చుకొనుటకే యోగము ఉద్దేశింపబడినది. కామ్యకర్మఫలము లన్నియును అంత్యమున అతని చేతనే అనుగ్రహింపబడుచున్నవి. దివ్యజ్ఞానమనగా అతడే. సర్వవిధములైన తీవ్ర తపస్సులు అతనిని తెలిసికొనుట కొరకే నిర్వహింపబడును. ఆ ఆదిదేవుడైన శ్రీకృష్ణునికి భక్తియుతసేవను గూర్చుటయే పరమధర్మమై యున్నది. దేవదేవుడైన అతడే మానవజన్మ యొక్క పరమగతియై యున్నాడు.


2.30 (ముప్పదవ శ్లోకము)

స ఏవేదం ససర్జాగ్రే భగవానాత్మ  మాయయా

సదసద్రూపయా చాసౌ గుణమయాగుణో విభుః॥

సృష్ట్యారంభమున దేవదేవుడైన వాసుదేవుడు తన దివ్యమైన ఆధ్యాత్మికస్థితి యందు నిలిచియుండి ఆంతరంగికశక్తి ద్వారా సథ్, అసత్తులను సృష్టించెను.

2.31 (ముప్పది ఒకటవ శ్లోకం)

తయో విలసితేష్వేషు గుణేషు గుణవానివ|

అన్తఃప్రవిష్ట  ఆభాతి విజ్ఞానేన విజృంభితః॥

భౌతిక జగమును సృష్టించిన పిమ్మట భగవానూడైన వాసుదేవుడు తన విస్తారము ద్వారా దాని యందు ప్రవేశించును. ప్రకృతిజన్య త్రిగుణములను గూడియున్నను, సాధారణ వ్యక్తజీవులలో ఒకనిగా గోచరించినను ఆ దేవదేవుడు సదా తన దివ్యస్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగియుండును. 

2.32 (ముప్పది రెండవ శ్లోకము)

యథా హ్యవహితో వహ్నిర్దారుష్వేకః స్వయోనిషు|

నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్

అగ్ని దారువు నందంతటను వ్యాపించినట్లుగా దేవదేవుడైన వాసుదేవుడు పరమాత్మునిగా సమస్తము నందును వ్యాపించి యుండును. కనకనే అద్వితీయుడైనను ఆ భగవానుడు బహురూపునిగా గోచరించును.

2.33 (ముప్పది మూడవ శ్లోకము)

అసౌ గుణమయైర్భా వైర్భూతసూక్ష్మేంద్రియాత్మభిః|
 
స్వనిర్మి తేషు నిర్విష్టో భుంక్తే భూతేషు తద్గుణాన్

పరమాత్ముడు భౌతికప్రకృతి యొక్క త్రిగుణములచే ప్రభావితులైన జీవుల దేహములందు ప్రవేశించి, వారు తమ సూక్ష్మ మనస్సు ద్వారా త్రిగుణ ప్రభావమును అనుభవించునట్లుగా చేయుచున్నాడు.


2.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

భావయత్యేష సత్త్వేన లోకాన్ వై లోకభావనః|

లీలావతారానురతో దేవతిర్యఙ్నరాదిషు॥

ఈ విధముగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు దేవతలు, మినవులు, జంతువులు మున్నగు జీవులతో నిండియున్న సర్వలోకములను     పోషించుచుండును. శుద్ధ సత్త్వమునందు స్థితులైనట్టి వారలను ఉద్ధరించుటకు అతడు అవతారములను దాల్చి పెక్కులీలలను గావించును.

(శ్రీమద్భాగవతము, ప్రథమ స్కంధము, రెండవ అధ్యాయము సమాప్తము)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

9.1.2022 ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ప్రథమ స్కంధము- రెండవ అధ్యాయము

భగవత్తత్త్వము మరియు భక్తియుత సేవ

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
2.18 (పదునెనిమిదవ శ్లోకము)

నష్ట ప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా|

భగవత్యుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ॥

నిత్యము తానొనరించునటువంటి శ్రీమద్భాగవతోపదేశముల శ్రవణము,శుద్ధభక్తుల సేవనము ద్వారా హృదయమునందలి అభద్రములన్నియును దాదాపు సంపూర్ణముగా నశించిపోయి ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణభగవానుని యెడ అకుంఠితమైన ప్రేమయుతసేవ స్థాపితము కాగలదు.

2.19 (పందొమ్మిదవ శ్లోకము)

తదా రజస్తమోభావాః కామలోభాదయశ్చ యే|

చేత ఏతైరనావిద్ధం స్థితం సత్త్వే ప్రసీదతి॥

నిక్షేపరహితమైన ప్రేమయుతసేవ హృదయమునందు సుస్థిరమైనంతనే రజస్తమోగుణ ఫలములైన కామక్రోధ లోభములు హృదయమునుంఢి అదృశ్యమగును. అంతట భక్తుడు సత్త్వగుణమునందు స్థితిని పొంది సంపూర్ణముగా ప్రసన్నుడగును.

2.20 (ఇరువదవ శ్లోకం)

ఏవం ప్రసన్నమనసో భగవద్భక్తి యోగతః

భగవత్తత్త్వవిజ్ఞానం ముక్తసంగస్య జాయతే

ఈ విధముగా శుద్ధసత్త్వము నందు స్థితుడై శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ ద్వారా ప్రసన్నమైన మనస్సును పొందెడి మనుజుడు సమస్త   భౌతికసంగత్వము నుండి ముక్తినొందిన స్థితిలో వాస్తవమైన భగవత్తత్త్వ విజ్ఞానమును పొందగలడు.

2.21 (ఇరవై ఒకటవ శ్లోకము)

భిద్యతే హృదయగ్రంథిశ్ఛిద్యన్తే  సర్వసంశయాః|

క్షీయన్తే దాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే॥

ఈ విధముగా హృదయగ్రంథి త్రెంపివేయబడి సర్వసంశయములు సమూలముగా నశించును. అటుపిమ్మట ఆత్మను ప్రభువుగా దర్శించినంతనే కామ్యకర్మపరంపర పరిసమాప్తి నొందును.

2.22 (ఇరువది రెండవ శ్లోకము)

అతో వై కవయో నిత్యం భక్తిం పరమయా ముదా|

వాసుదేవే భగవతి కుర్వన్త్యాత్మప్రసాదనీమ్॥

కనుకనే అనంతకాలము నుండి పరమభక్తులైనవారు ఆత్మకు ప్రసన్నతను గూర్చునదైనందున దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుతసేవను నిశ్చయముగా అత్యంత ముదముతో గావించుచున్నారు.

2.23 (ఇరువది మూడవ శ్లోకము)

సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్గుణాస్తైర్ యుక్తః పరః పురుష ఏక ఇహాస్య ధత్తే|

స్థిత్యాదయే హరివిరించిహరేతి సంజ్ఞాః
శ్రేయాంపి తత్ర ఖలు సత్త్వతనోర్నృణాం స్యుః॥

దివ్యుడైన పరమపురుషుడు ప్రకృతి త్రిగుణములైన సత్త్వగుణము, రజోగుణము, తమోగుణములతో పరోక్షముగా సంగత్వమును కలిగియున్నాడు. భౌతికజగత్తు యొక్క సృష్టి స్థితి లయముల కొరకు ఆతడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులనెడి గుణావతారములను స్వీకరించుచున్నాడు. ఈ మూడింటిలో సత్త్వగుణరూపమైన విష్ణువు నుండి సమస్త మానవులు పరమశ్రేయమును పొందగలరు.

2.24 (ఇరువది నాల్గవ శ్లోకము)

పార్థివాద్దారుణో ధూమస్తస్మాదగ్నిస్త్రయీమయః|

తామసస్తు రజస్తస్మాత్సత్త్వం యద్బ్రహ్మదర్శనమ్॥

దారువు భూమి యొక్క రూపాంతరమైనను, ధూమము దారువు కన్నను శ్రేష్ఠమైనది. కాని యజ్ఞము ద్వారా ఉన్నతజ్ఞాన సముపార్జనము జరుగును గనుక అగ్నియనునది ధూమము కన్నను శ్రేష్ఠమైనది. అదేవిధముగా రజోగుణము తమోగుణము కన్నను శ్రేష్ఠమైనను,సత్త్వగుణముచే పరతత్త్వానుభవమును పొందు స్థితికి మనుజుడు చేరును గనుక సత్త్వగుణము రజోగుణము కన్నను శ్రేష్ఠమై యున్నది.


2.25 (ఇరువది ఐదవ శ్లోకము)

భేజిరే మునయోఽథాగ్రే భగవన్తమధోక్షజమ్|

సత్త్వం విశుద్ధం క్షేమాయ కల్పన్తే యేఽను తానిహ॥

ప్రకృతి త్రిగుణములకు పరుడైనందునే అధోక్షజుడైన శ్రీకృష్ణుని పూర్వము మహామునులు  భక్తియుతసేవతో అర్చించిరి. భౌతికబంధముల నుండి ముక్తిని పొంది దివ్యలాభమును పొందు నుద్దేశ్యముతోనే వారు ఆ దేవదేవుని ఆరాధించిరి. అట్టి ప్రామాణికుల ననుసరించువారు కూడ భౌతికజగము నుండి ముక్తిని పొందుటకు అర్హులగుచున్నారు.

2.26 (ఇరువదిఆరవ శ్లోకము)

ముముక్షవో ఘోరరూపాన్ హిత్వా భూతపతీనథ|

నారాయణకలాః శాన్తా భజన్తి హ్యనసూయవః॥

ముక్తిని పొందుట యందు శ్రద్ధావంతులైనవారు నిశ్చయముగా అసూయరహితులై సర్వులను గౌరవింతురు. అయినను వారు ఘోరములైన వివిధ దేవతారూపములను నిరసించి విష్ణువు మరియు అతని ప్రధానాంశముల శాంతరూపములనే అర్చింతురు.

2.27 (ఇరువది ఏడవ శ్లోకము)

రజస్తమఃప్రకృతయః సమశీలా భజన్తి వై|

పితృభూతప్రజేశాదీన్ శ్రియైశ్వర్యప్రజేస్సవః॥

రజోగుణమునందు మరియు తమోగుణమునందు స్థితిని కలిగినవారు స్త్రీసాంగత్యము, ఐశ్వర్యము, అధికారము, సంతానమాది భౌతికలాభమును పొందగోరినవారై నందున పితృదేవతలను, ఇతర జీవులను, లోకపాలనా వ్యవహారములను గాంచెడి దేవతలను అర్చింతురు.

2.28 (ఇరువది ఎనిమిదివ      శ్లోకము)

వాసుదేవపరా వేదా వాసుదేవపరా మఖాః|

వాసుదేవపరా యోగా వాసుదేవపరాః క్రియాః॥

2.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

వాసుదేవపరం జ్ఞానం వాసుదేవపరం తపః

వాసుదేవపరో ధర్మో వాసుదేవపరా గతిః॥

శాస్త్రములందలి జ్ఞానము యొక్క పరమలక్ష్యము శ్రీకృష్ణభగవానుడై యున్నాడు. యజ్ఞాచరణ ప్రయోజనము ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుని సంతృప్తిపరచుటయే. ఆ ఆదిదేవుని అనుభూతమొనర్చుకొనుటకే యోగము ఉద్దేశింపబడినది. కామ్యకర్మఫలము లన్నియును అంత్యమున అతని చేతనే అనుగ్రహింపబడుచున్నవి. దివ్యజ్ఞానమనగా అతడే. సర్వవిధములైన తీవ్ర తపస్సులు అతనిని తెలిసికొనుట కొరకే నిర్వహింపబడును. ఆ ఆదిదేవుడైన శ్రీకృష్ణునికి భక్తియుతసేవను గూర్చుటయే పరమధర్మమై యున్నది. దేవదేవుడైన అతడే మానవజన్మ యొక్క పరమగతియై యున్నాడు.


2.30 (ముప్పదవ శ్లోకము)

స ఏవేదం ససర్జాగ్రే భగవానాత్మ  మాయయా

సదసద్రూపయా చాసౌ గుణమయాగుణో విభుః॥

సృష్ట్యారంభమున దేవదేవుడైన వాసుదేవుడు తన దివ్యమైన ఆధ్యాత్మికస్థితి యందు నిలిచియుండి ఆంతరంగికశక్తి ద్వారా సథ్, అసత్తులను సృష్టించెను.

2.31 (ముప్పది ఒకటవ శ్లోకం)

తయో విలసితేష్వేషు గుణేషు గుణవానివ|

అన్తఃప్రవిష్ట  ఆభాతి విజ్ఞానేన విజృంభితః॥

భౌతిక జగమును సృష్టించిన పిమ్మట భగవానూడైన వాసుదేవుడు తన విస్తారము ద్వారా దాని యందు ప్రవేశించును. ప్రకృతిజన్య త్రిగుణములను గూడియున్నను, సాధారణ వ్యక్తజీవులలో ఒకనిగా గోచరించినను ఆ దేవదేవుడు సదా తన దివ్యస్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగియుండును. 

2.32 (ముప్పది రెండవ శ్లోకము)

యథా హ్యవహితో వహ్నిర్దారుష్వేకః స్వయోనిషు|

నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్

అగ్ని దారువు నందంతటను వ్యాపించినట్లుగా దేవదేవుడైన వాసుదేవుడు పరమాత్మునిగా సమస్తము నందును వ్యాపించి యుండును. కనకనే అద్వితీయుడైనను ఆ భగవానుడు బహురూపునిగా గోచరించును.

2.33 (ముప్పది మూడవ శ్లోకము)

అసౌ గుణమయైర్భా వైర్భూతసూక్ష్మేంద్రియాత్మభిః|
 
స్వనిర్మి తేషు నిర్విష్టో భుంక్తే భూతేషు తద్గుణాన్

పరమాత్ముడు భౌతికప్రకృతి యొక్క త్రిగుణములచే ప్రభావితులైన జీవుల దేహములందు ప్రవేశించి, వారు తమ సూక్ష్మ మనస్సు ద్వారా త్రిగుణ ప్రభావమును అనుభవించునట్లుగా చేయుచున్నాడు.


2.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

భావయత్యేష సత్త్వేన లోకాన్ వై లోకభావనః|

లీలావతారానురతో దేవతిర్యఙ్నరాదిషు॥

ఈ విధముగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు దేవతలు, మినవులు, జంతువులు మున్నగు జీవులతో నిండియున్న సర్వలోకములను     పోషించుచుండును. శుద్ధ సత్త్వమునందు స్థితులైనట్టి వారలను ఉద్ధరించుటకు అతడు అవతారములను దాల్చి పెక్కులీలలను గావించును.

(శ్రీమద్భాగవతము, ప్రథమ స్కంధము, రెండవ అధ్యాయము సమాప్తము)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

9.1.2022 సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ప్రథమ స్కంధము- మూడవ అధ్యాయము

శ్రీకృష్ణభగవానుడు: సర్వావతారములకు మూలము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
3.1 (ఒకటవ శ్లోకము)

సూత ఉవాచ

జగృహే పౌరుషం రూపం భగవాన్మహదాదిభిః|

సంభూతమ్ షోడశకలమాదౌ లోకసిసృక్షయా॥

సూతగోస్వామి పలికెను: సృష్ట్యారంభమున శ్రీకృష్ణభగవానుడు విశ్వరూపముగానున్న పురుషావతారమును స్వీకరించి భౌతికసృష్టికి అవసరమైన మహదాదులను సృష్టించెను. ఈ విధముగా తొలుత భౌతికకర్మలకు సంబంధించిన పదునారు తత్త్వములు సృజింపబడినవి. భౌతికజగమును సృష్టించు ప్రయోజనమునకే ఇదియంతయు నిర్వహింపబడెను.

3.2 (రెండవ శ్లోకము)

కయస్యాంభసి శయాసస్య యోగనిద్రాం వితస్వతః|

నాభిహ్రదింబుజాదాసీద్బ్రహ్మా విశ్వసృజాం పతిః॥

అటుపిమ్మట తొలి పురుషావతారము యొక్క అంశ గర్భోదకములందు శయనింపగా అతని నాభి సరోవరము నుండి తామరతూడు ఉద్భవించి దాని ఉపరితల పుష్పమునందు విశ్వముయొక్క ప్రధాన సూత్రధారుడైన బ్రహ్మ ఆవిర్భవించెను.

3.3 (మూడవ శ్లోకము)

యస్యావయవసంస్థావైః కల్పితో లోకవిస్తరః|

తద్వై భగవతో రూపం విశుద్ధం సత్త్వమూర్జితమ్॥

సమస్త లోకములు అట్టి పురుషావతారుని దేహమునందు స్థితిని కలిగి యున్నట్లు ఉహింపబడుచున్నది. సృష్టింపబడిన భౌతిక తత్త్వములతో ఎటువంటి సంబంధములేని అతని విశుద్ధసత్త్వరూపము నిరతిశయమై యున్నది.


3.4 (నాలుగవ శ్లోకము)

పశ్యన్త్యదో రూపమదభ్రచక్షుషా సహస్రపాదోరుభుజాననాద్భుతమ్|

సహస్రమూర్ధ శ్రవణాక్షి నాసికం  సహస్రమౌల్యాంబరకుండలోల్లసత్॥

వేలాదిగా అద్భుతములైన పాదములను, ఊరువులును, భుజములును, ముఖములును కలిగిన పురుషావతారము యొక్క దివ్యరూపమును పూర్ణదృష్టిని కలిగిన భక్తులు కాంచగలరు. వేలాది శిరస్సులను, కర్ణములను, నయనములను, నాసికలను ఆ రూపము కలిగియుండును. అవన్నియును వేలాది కిరీటములతో దేదీప్యమానమైన కర్ణాభరణములతో మరింత దివ్యమైన పూమాలలతో అలంకరింపబడి యుండును.

3.5 (ఐదవ శ్లోకము)

ఏతన్నానావతారాణాం నిధానం బీజమవ్యయమ్|

యస్యాంశాంశేన సృజ్యన్తే దేవతిర్యఙ్నరాదయః॥

ఈ రూపము (ద్వితీయ పురుషావతారము) విశ్వమునందలి నానావతారములకు నిధానమును, అవ్యయబీజమును అయి ఉన్నది. ఆ రూపము యొక్క అంశము మరియు అంశాంశముల నుండియే దేవతలు, మానవులు మొదలైన ఎన్నోరకముల జీవులు సృష్టింపబడిరి.

3.6 (ఆరవ శ్లోకము)

స ఏవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః|

చచార దుశ్చరం బ్రహ్మా బ్రహ్మచర్యమఖండితమ్॥

తొలుతు సృష్ట్యారంభమున బ్రహ్మచారులైన సనకసనందనాది బ్రహ్మదేవుని నలుగురు పుత్రులు ఉదయించారు. వారందరు బ్రహ్మచర్యవ్రతమునందు స్థితులైనవారై పరతత్త్వానుభవము కొరకు తీవ్రతపముల నాచరించారు.

3.7 (ఏడవ శ్లోకము)

ద్వితీయం తు భవాయాస్య రసాతలగతాం మహీమ్|

ఉద్ధరిష్యన్నుపాదత్త యజ్లేశః సౌకరం వపుః॥

ద్వితీయావతారమున సర్వయజ్ఞములకు పరమభోక్తయైన భగవానుడు వరహావతారమును దాల్చి ధరిత్రి యొక్క క్షేమము కొరకై దానిని రసాతలము నుండి ఉద్ధరించెను.

3.8 (ఎనిమిదవ శ్లోకము)

తృతీయమృషిసర్గం వై దేవర్షిత్వము పేత్య సః|

తంత్రం సాత్వతమాచష్ట నైష్కర్మ్యం కర్మణాం యతః॥

పిదప ఋషివర్గము నందు భగవానుడు తృతీయముగా శక్త్యావేష అవతారమైన దేవర్షి నారదుని (దేవతలలో గొప్ప ఋషియైన) రూపమున అవతరించెను. ఆ అవతారమున అతడు భక్తియుతసేవకు సంబంధించినవియు, నిష్కామకర్మను ప్రేరేపించునవియు నగు వేదవివరణలను సంగ్రహింపవలెను.

3.9 (తొమ్మిదవ శ్లోకము)

తుర్యే ధర్మకలాసర్గే  నరనారాయణావృషీ|

భూత్వాత్మోపశమో పేతమకరోత్ దుశ్చరం తపః॥

నాలుగవ అవతారమున భగవానుడు రాజైన ధర్ముని భార్యకు నరనారాయణులు కవలపుత్రులుగా జన్మించెను. ఆ విధముగా అవతరించి అతడు తీవ్రమును, మార్గదర్శకమును అయిన తపస్సును ఇంద్రియ నిగ్రహము కొరకై ఒనరించెను.

3.10 (పదవ శ్లోకము)

పంచమ కపిలో నామ సిద్ధేశః కాలవిప్లుతమ్|

ప్రోవాచాసురయే సాంఖ్యం తత్త్వగ్రామవినిర్ణయమ్॥

ఐదవదైన కపిలావతారము సిద్ధులైనవారియందు అత్యంత శ్రేష్ఠమై యున్నది. సృష్టితత్త్వములు, సాంఖ్యజ్ఞాఖ నమునకు సంబంధించిన వివరణను అతడు ఆసురీ నామధేయ బ్రాహ్మణునకు ఇచ్చెను. కాలక్రమమున అట్టి జ్ఞానము నశించి యుండుటే అందుకు కారణము.

3.11 (పదకొండవ శ్లోకము)

షష్ఠం అత్రేరపత్యతం వృతః ప్రాప్తో ఽనసూయయా

ఆన్వీక్షికీమలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివాన్॥

అత్రిమహర్షి తనయుడే పురుషుని ఆరవ అవతారము. అవతారమునకై అర్థించియున్న అత్రిభార్యయైన అనసూయాదేవి గర్భమున అతడు జన్మించి అలర్కుడు, ప్రహ్లాదుడు మరియు ఇతరులకు (యదువు, హైహయాదులకు) ఆధ్యాత్మిక విషయమునందు బోధగావించెను.

3.12 (పన్నెండవ శ్లోకము)

తతః సఫ్తమ ఆకూత్యాం రుచేర్యజ్ఞోఽభ్యజాయత|

స యామాద్యైః సురగణైరపాత్స్యాయంభువాన్తరమ్॥

ప్రజాపతియైన రుచి, అతని భార్యయైన ఆకూతి తనయుడైన యజ్ఞుడే సప్తమ అవతారము. తన తనయుడైన యముని వంటి దేవతలతో సహకరింప బడినవాడై అతడు స్వాయంభువ మన్వంతర కాలమును పాలించెను.

3.13 (పదమూడవ శ్లోకము)

అష్టమే మేరుదేవ్యాం తు నాభేర్జాత ఉరుక్రమః|

దర్శయన్ వర్త్మ ధీరాణాం సర్వాశ్రమనమస్కృతమ్॥

మహారాజు నాభి మరియు మేరుదేవి యొక్క సంతానమైన ఋషభదేవుడు ఎనిమిదవ అవతారము. పూర్ణమైన ఇంద్రియనిగ్రహము కలిగి సర్వాశ్రమముల వారిచే గౌరవింపబడు ధీరులు అనుసరించునటువంటి పుర్ణత్వమార్గమును అతడు ఈ అవతారమున జూపెను.

3.14 (పదునాల్గవ శ్లోకము)

ఋషిభిర్యాచితో భేజే నవమం పార్థివం వపుః|

దూగ్ధేమామోషధీర్విప్రాస్తేనాయం స ఉశత్తమః॥

ఓ బ్రాహ్మణులారా! ఋషులచే ప్రార్థింపబడినవాడై భగవానుడు తొమ్మిదవ అవతారమున పృథుమహరాజు రూపమును స్వీకరించెను. పృథుమహారాజు వివిధ ఓషధుల ఉత్పత్తికై భూమిని దున్నిన కారణమున అది అత్యంత సౌందర్యవంతమును, ఆకర్షణీయమును అయి ఒప్పారెను.

3.15 (పదిహేనవ శ్లోకము)

రూపం స జగృహే మాత్స్యం చాక్షుషోదధిసంప్లవే|

నావ్యారోప్య మహీమయ్యామపాద్వైవస్వతం మనుమ్॥

చాక్షుసమన్వంతరము పిదప సంపూర్ణ ప్రళయము సంభవించి జలము యొక్క అడుగుభాగములోనికి భూమి మునిగినప్పుడు భగవానుడు మత్స్య రూపమును స్వీకరించి వైవస్వతమనువును నావయందు నిలిపి రక్షించెను.

3.16 (పదహారవ శ్లోకము)

సురాసురాణాముదధిం మథ్నతాం మందరాచలమ్|

దధ్రే కమఠరూపేణ పృష్థ ఏకాదశే విభుః॥

పదునొకండవ అవతారమున భగవానుడు కూర్మరూపమును ధరించెను. విశ్వమందలి దేవతలు, దానవు లొనరించిన సముద్రమంథన కార్యము నందలి కవ్వమైన మందరాచలమునకు కూర్మావతార కవచము ఆధారమయ్యెను.

3.17  (పదిహేడవ శ్లోకము)

ధాన్వంతరం ద్వాదశమం త్రయేదశమమేవ చ|

అపాయయత్సురానన్యాన్మోసిన్యా మోహయన్ స్త్రియా॥

పండ్రెండవ అవతారమున భగవానుడు ధన్వంతరి రూపమును ధరించెను. పిదప పదమూడవ అవతారమున సుందర స్త్రీరూపముతో దానవులను మోహపరచి దేవతలకు అమృతము నొసగెను.

3.18(పద్దెనిమిదవ శ్లోకము)

చతుర్దశం నారసింహం బిభ్రద్దైత్యేన్ద్రమూర్జితమ్|

దదార కరజైరూరావేరకాం కటకృద్యథా॥

పదునాలుగవ అవతారమున భగవానుడు నృసింహునిగా అవతరించి వడ్రంగివాడు వెదురును చీల్చివేయునట్లు తన వాడియైన నఖములతో దానవుడైన హిరణ్యకశిపుని దృఢమైన శరీరమూను చీల్చివేసెను.


3.19 (పందొమ్మిదవ శ్లోకము)

పంచదశం వామనకం కృత్వాగాదధ్వరం బలేః|

పదత్రయం యాచమానః ప్రత్యాదిత్సుస్త్రిపిష్ఠపమ్॥

పదునైదవ అవతారమున భగవానుడు వామనుని రూపమును స్వీకరించి బలిమహారాజు ఏర్పరచిన యజ్ఞస్థలిని దర్శించెను. త్రిభువన రాజ్యమును తిరిగిపొందవలెనని హృదిలో తలచియున్నను అతడు కేవలము మూడడుగుల నేలను మాత్రము దానముగా కోరెను.

3.20 (ఇరువదవ శ్లోకము)

అవతారే షోడశమే బ్రహ్మద్రుహో నృపాన్|

త్రిఃసప్తకృత్వః కుపితో నిఃక్ష త్రామకరోన్మహీమ్॥

పదునారవ అవతారమున భగవానుడు భృగుపతి రూపమున బ్రాహ్మణుల యెడ తిరుగుబాటు ధోరణి చూపిన క్షత్రియుల యెడ కుపితుడై వారిని ఇరువదియొక్కమార్లు నశింపజేసెను.

3.21 (ఇరువది ఒకటవ శ్లోకము)

తతః సప్తదశే జాతః సత్యవత్యాం పరాశరాత్|

చక్రే వేదతరోః శాఖా దృష్ట్వా పుంసోఽల్పమేధసః॥

తదుపరి పదునేడవ అవతారమున భగవానుడు పరాశరముని ద్వారా సత్యవతీ గర్భమున శ్రీవ్యాసదేవుని రూపమున అవతరించెను. జనసామాన్యము అల్పమేధస్సు గలవారగుటను గాంచి అతడు ఏకముగా నున్న వేదమును పలుశాఖలుగా, శాఖోపశాఖలుగా విభజించెను.

3.22 (ఇరువది రెండవ శ్లోకము)

నరదేవత్వ మాపన్నః సురకార్య చికీర్షయాః|

సముద్రనిగ్రహాదీని చక్రే వీర్యాణ్యతః పరమ్॥

పదునెనిమిదవ అవతారమున భగవానుడు శ్రీరామచంద్రునిగా అవతరించెను. దేవతలకు ముదము నొసగెడి కార్యమును గావించుట కొరకు  అతడు సముద్రమును బంధించి దానికి ఆవలి ఒడ్డునగల దానవుడైన రావణుని సంహరించుట ద్వారా మానవాతీత శక్తులను ప్రదర్శించెను.

(శ్రీమద్భాగవతము, ప్రథమ స్కంధము, మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


శ్రీశుకదేవుడు ప్రేమరసప్రవాహమున ఒలలాడుచు ఈ కథను చెప్పెను. ఇట్టి రసప్రవాహమున మునకలు వేయు గొంతు కలవాడు నేరుగా వైకుంఠముసు చేరుకొనుటకు పాత్రుడగును. శౌనకా! నేను అనే శాస్త్రములను పరిశీలించి మీకు ఈ గోప్యాతిగోప్యమైన రహస్యమును వెల్లడించితిని. ఇది సమస్త శాస్త్రముల సిద్ధాంతములయొక్క సారము. ఈ జగత్తునందు శుకశాస్త్రమునకంటే ఏ కొంచెము పవిత్రమైనదంటూ వేరేదియును లేదు. కనుక, మీరందరు పరమానందమును పొందుటకు సాధనమగు ఈ భాగవత ద్వాదశస్కంధముల రసమును ఆస్వాదింపుడు. నియమపూర్వకముగా ఈ కథను అత్యంతమగు భక్తిభావమతొ శ్రవణము చేయువారు, పరిశుద్ధమైన అంతః కరణము కలిగిన భగవద్భక్తుల యెదుట దీనిని వినిపించువాడు -ఈ ఇరువురును విధివిధానమును పూర్తిగా అమలుపరచుటవలన దీనియొక్క యథార్దఫలమును పొందెదరు. అట్టివారికి ముజ్జగములందు అసాధ్యమైనదేదియు ఉండదు. 

ఇది శ్రీపద్మపురాణముయొక్క ఉత్తరఖండమునందలి శ్రీమద్భాగవత మహాత్మ్యమునందు ఆరవ అధ్యాయము సంపూర్ణము.

సమాప్తమిదం శ్రీమద్భాగవత మహాత్మ్యమ్

హరిః ఓం తత్సత్

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
*****
10.1.2022 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

ప్రథమ స్కంధము- మూడవ అధ్యాయము

శ్రీకృష్ణభగవానుడు: సర్వావతారములకు మూలము
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
3.23 (ఇరువది మూడవ శ్లోకము)

ఏకోనవింశే వింశతిమే వృష్టిషు ప్రాప్య జన్మనీ|

రామకృష్ణావితి భువో భగవానహరద్భరమ్॥

పందొమ్మిది మరియు ఇరువదియవ అవతారములందు భగవానుడు స్వయముగా బలరాముడుగా, శ్రీకృష్ణునిగా వృష్టివంశము (యదువంశము)  నందు ఆవిర్భవించెను. ఆవిధముగా భగవానుడు భూభారమును తొలగించెను.

3.24 (ఇరువది నాలుగవ శ్లోకము)

తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషామ్|

బుద్ధో నామ్నాంజనసుతః కీకటేషు భవిష్యతి॥

శ్రద్ధావంతులైన ఆస్తికులను ద్వేషించువారిని సమ్మోహపరచెడి ఉద్దేశ్యముతో కలియుగారంభమునందు భగవానుడు గయాప్రాంతమున అంజనాసుతుడైన బుద్ధునిగా అవతరించును.

3.25 (ఇరువదియైదవ శ్లోకము)

అథాసౌ యుగసంధ్యాయాం దస్యుప్రాయేషు రాజసు| 

జనితా విష్ణుయశసో నామ్నా కల్కిర్జగత్పతిః॥

తదుపరి యుగసంధి సమయమున జగన్నాథుడైన భగవానుడు కల్కి అవతారమును దాల్చి విష్ణుయశుడను బ్రాహ్మణునకు పుత్రుడు కాగలడు. ఆ సమయమున భూపాలకులందరును చోరులుగా పతితులై యుందురు.

3.26 (ఇరువదియారవ శ్లోకము)

అవతారా హ్యసంఖ్యేయా హరేః సత్త్వనిధేర్ద్విజాః|

యథావిదాసినః కుల్యాః సరసః స్యుః సహస్రశః॥

ఓ బ్రాహ్మణులారా! అక్షయమైన జలమూలములనుండి ప్రవహించు స్వల్ప ప్రవాహముల వలె శ్రీహరి అవతారములు అసంఖ్యాకములుగా నున్నవి.

3.27 (ఇరువది ఏడవ శ్లోకము)

ఋషయో మనవో దేవా మనుపుత్రా మహౌజసః|

కలాః సర్వే హరేరేవ సప్రజాపతయః స్మృతాః॥

మహావీర్యవంతులైన ఋషులు, మనువులు, దేవతలు, మనుసంతతి వారందరును శ్రీహరి యొక్క అంశావతారములు లేదా కళావతారమలై యున్నారు. ప్రజాపతులును అందు కలరు.

3.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)

ఏతే చాంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయమ్|

ఇంద్రారివ్యాకులం లోకం మృడయన్తి యుగే యుగే॥

ఇంతవరకు పేర్కొనబడిన అవతారములన్నియును భగవానుని అంశావతారములు లేదా కళావతారములై యున్నవి. కాని శ్రీకృష్ణుడు మాత్రము స్వయముగా భగవానుడై యున్నాడు. దానవులచే కలత సృష్టింపబడినప్పుడెల్ల అట్టి అవతారములు లోకములందు వ్యక్తమగు చుండును. భక్తులను రక్షించుటకే భగవానుడట్లు అవతరించుచుండును.

3.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

జన్మ గుహ్యం భగవతో య ఏతత్ప్రయతో నరః|

సాయం ప్రాతర్గృణన్ భక్త్యా దుఃఖగ్రామాద్విముచ్యతే॥

భగవానుని ఇట్టి గుహ్యములైన  అవతారములను ఉదయ, సంధ్యల యందు భక్తితో కీర్తించువాడు సర్వదుఃఖముల నుండి విడుదలను పొందగలడు.

3.30 (ముప్పదియవ శ్లోకము)

ఏతద్రూపం భగవతో హ్యరూపస్య చిదాత్మనః|

మాయాగుణైర్విరచితం మహదాదిభిరాత్మని॥

భౌతికజగమునందు వ్యక్తమయ్యెడి భగవానుని విరాడ్రూప భావనము ఊహాత్మకమైనది.అల్పజ్ఞులకు (మరియు భక్తి యందలి ప్రారంభ స్థితిలో నున్నవారికి) భగవానుని రూపసహితత్వమును గూర్చి తెలియజేయుటకే అది ఉద్దేశింపబడినది. కాని వాస్తవమునకు భగవానుడు భౌతికరూపరహితుడై ఉన్నాడు.

3.31 (ముప్పదిఒకటవ శ్లోకము)

యథా నభసి మేఘౌఘో రేణుర్వా పార్థివోఽనిలే|

ఏవం ద్రష్టరి దృశ్యత్వమారోపితమబూద్ధి భిః॥

మేఘములు, ధూళి యనునవి వాయువుచే చలించెడి కారణముగా అబుద్ధులైనవారు ఆకాశము మేఘావృతమైనదనియు వాయువు, ధూళి భూపరిమితమైనదనియు ఆజ్ఞానముచే పలుకుదురు. అదే విధముగా వారు భగవంతునియందు భౌతికభావనలను ఆరోపింతురు.

3.32 (ముప్పది రెండవ శ్లోకము)

అతః పరం యదవ్యక్తమవ్యూఢ గుణబృంహితమ్| 

అదృష్టాశ్రుతవస్తుత్వాత్వ జీవో యత్పునర్భవః॥

ఈ స్థూలరూపభావనకు అధికముగా వేరొక సూక్ష్మరూపము కలదు. అట్టి సూక్ష్మరూపము నిర్ధిష్ఠరూపము లేనట్టిదియు, వ్యక్తము కానిదియు, వినబడనిదియు, చూడబడనిదియు అయి ఉన్నది. కాని జీవుడు అటువంటి సూక్ష్మత్వము చూచినను అంతకు మించిన రూపము కలిగియుండుట చేతనే అతనికి పునర్జన్మలు కలుగుచున్నవి.

3.33 (ముప్పది మూడవ శ్లోకము)

యత్రమే సదసద్రూపే ప్రతిషిద్ధే స్వసంవిదా|

అవిద్యయాత్మని కృతే ఇతి తద్బ్రహ్మదర్శనమ్॥

స్థూలసూక్ష్మ దేహములతో శుద్ధమైన ఆత్మకు ఎటువంటి సంబంధము లేదని ఆత్మానుభవము ద్వారా అనుభూతమొనర్చుకొనిన సమయమున మనుజుడు తనను, భగవానుని కాంచగలను.

3.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

యద్యేషోపరతా దేవీ మాయా వైశారదీ మతిః|

సంపన్న ఏవేతి విదుర్మ హిమ్ని  స్వే మహీయతే॥

భగవానుని కరుణచే మాయాశక్తిప్రభావము శమయించి జీవుడు ఆధ్యాత్మికజ్ఞాన సంపన్నుడైనచో శీఘ్రమే ఆత్మానుభూతితో వికాసము నొంది తన నిజవైభవము నందు స్థితుడగును.

3.35 (ముప్పది ఐదవ శ్లోకము)

ఏవం జన్మాని కర్మాణి హ్యకర్తురజనస్య చ|

వర్ణయన్తి స్మ కవయోవేదగుహ్యాని హృత్పతేః॥

ఈ విధముగా మహాత్మలైనవారు అజుడును అకర్తుడును అగు వేదగుహ్యుడైన భగవానుని జన్మకర్మలను వర్ణించియున్నాడు. అతడే హృత్పతియై యున్నాడు.

3.36 (ముప్పది ఆరవ శ్లోకము)

స వా ఇదం విశ్వమమోఘలీలః సృజత్యవత్యత్తి న సజ్జతేఽస్మిన్|

భూతేషు చాన్తర్హిత ఆత్మ తంత్రః షాడ్వర్గికం జిఘ్రతి షడ్గుణేశః॥

అమోఘలీలామయుడైన భగవానుడు షడేంద్రియములకు ప్రభువును, షడ్విభూతిపూర్ణుడును అయి ఉన్నాడు. తన కార్యములచే ఏమాత్రము ప్రభావితము కాకుండ అతడు విశ్వములను సృష్టించి, పోషించి, లయము కావించుచుండును. ప్రతిజీవియందును వసించు ఆ భగవానుడు సదా స్వతంత్రుడై ఉండును.

3.37 (ముప్పది ఏడవ శ్లోకం)

న చాస్య కశ్చిన్నిపుణేన ధాతు  రవైతి జన్తుః కుమనీష ఊతీః|

నామాని రూపాణి మనోవచోభిః సన్తన్వతో నటచర్యామి నాజ్ఞః॥

నాటకము నందలి నటుని వలె వర్తించు భగవానుని రూప లీలల యొక్క దివ్యత్వమును అజ్ఞానులైన మూర్ఖులు అవగతము చేసికొనజాలరు. అట్టి వాటిని మనసులో భావించుట గాని, వాక్కు ద్వారా పలుకుట గాని వారికి సాధ్యము కాదు.

3.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)

స వేద ధాతుః పదవీం పరస్య దురన్త వీర్యస్య రథాంగపాణేః|

యోఽమాయయా సన్తతయానూవృత్త్యా భజేత తత్పాదసరో జగన్ధమ్॥

రథాంగపాణియైన శ్రీకృష్ణభగవానుని చరణకమలములకు నిష్కపటముగను నిక్షేపరహితముగను అనుకూలముగను సేవ చేసెడివారే ఆ విశ్వసృష్టి యొక్క వైభవమును, శక్తిని, దివ్యత్వమును సంపూర్ణముగా అవగతము చేసికోగలరు. 

3.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)

అథేవ ధన్యా భగవన్త ఇత్థం యద్వాసుదేవేఽఖిల లోకనాథే|

కుర్వన్తి సర్వాత్మకభావమ్ న యత్ర భూయః పరివర్త ఉగ్రః॥

ఈ జగమునందు అటువంటి విచారణలను గావించుట ద్వారానే ఎవరైనను ధన్నులును, తత్త్వజ్ఞాన పూర్ణులును కాగలరు. ఏలయన ఆ విధమగు ప్రశ్నలే లోకనాథుడైన శ్రీకృష్ణభగవానుని యెడ దివ్యమగు ప్రేమను ఉత్పన్నము జేసి ఘోరమైన జన్మమృత్యు పరంపర నుండి నూటికి నూరుపాళ్ళు అభయము నొసగుచున్నది.

3.40 (నలుబదియవ శ్లోకము)

ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మసమ్మితమ్|

ఉత్తమశ్లోకచరితం చకార భగవానృషిః|

నిఃశ్రేయపాయ లోకస్య ధన్యం స్వస్త్యయనంమహత్॥

ఈ శ్రీమద్భాగవత మహాపురాణము శ్రీకృష్ణభగవానుని యొక్క గ్రంథావతారమై యున్నది.  ఇది భగవదవతారమైన శ్రీల వ్యాసదేవునిచే రచింపబడినది. ధన్యమును, ఆనందమయమును పూర్ణమును అగు ఈ మహా పురాణము సమస్తజనుల పరమశ్రేయము కొరకై ఉద్దేశింపబడియున్నది.

3.41 (నలుబది ఒకటవ శ్లోకము

తదిదం గ్రాహయామాస సుతమాత్మవతాం వరమ్|

సర్వవేదేతిహాసానాం సారం సారం సముద్ధృతమ్॥

శ్రీవ్యాసదేవుడు విశ్వమునందలి సర్వ వేదేతిహాసముల సారమును గ్రహించి దానిని ఆత్మానుభవమును బడసినవారిలోపరమశ్రేష్ఠుడైన తన పుత్రునకు అందించెను.

3.42 (నలబది రెండవ శ్లోకము)

స తు సంశ్రావయామాస మహారాజం పరీక్షితమ్|

ప్రాయోపవిష్ఠం గంగాయాం పరీతం పరమర్షిభిః॥

తదుపరి వ్యాసనందనుడైన శుకదేవగోస్వామి గంగాతలమున ఋషులచే పరివేష్ఠితుడై ఆహారపానీయములు లేకుండా మృత్యువుకై ఎదురు చూచుచున్న పరీక్షిన్మహారాజునకు ఈ శ్రీమద్భాగవతము ఉపదేశించెను.

3.43 (నలుబది మూడవ శ్లోకము) 

కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిః సహ|

కలౌ నష్టదృశామేష పురాణోర్కోఽధునోదితః॥

ధర్మజ్ఞానాదులను గూడి శ్రీకృష్ణభగవానుడు తన స్వభావమునకు నిష్క్రమించిన  పిమ్మట సూర్యుని వలె తేజోవంతమైన ఈ భాగవత పురాణము ఉదయించినది. కలియుగమునందు అజ్ఞానగాఢాంధకారముచే దృష్టి లోపించిన మానవులు ఈ పురాణమునుండి వెలుగును పొందగలరు.

3.44 (నలుబది నాలుగవ శ్లోకము)

తత్ర కీర్తయతో విప్రా విప్రర్షేర్భూరి తేజసః|

అహం చాధ్యగమం తత్ర నివిష్టస్తదనుగ్రహాత్|

సోఽహం వః శ్రావయిష్యామి యథాధీతం యథామతి॥

ఓ బ్రాహ్మణోత్తములారా! శుకదేవస్వామి (పరీక్షిన్మహారాజు సమక్షములో) శ్రీమద్భాగవతమును కీర్తించినపుడు నేను అత్యంత శ్రద్ధతో శ్రవణము చేసియుంటిని. ఆ విధముగా మహాతేజస్వియు, ఘనుడును అగు శుకదేవుని కరుణచే నేను శ్రీమద్భాగవతమును అవగాహన చేసికొనగలిగితిని. ఇప్పుడు ఆ విషయమునే నేను ఆయన నుండి శ్రవణము చేసి అనుభూతమొనర్చుకొనినట్లుగా మీకు వినిపించుటకు యత్నింతును.

(శ్రీమద్భాగవతము, ప్రథమ స్కంధము, మూడవ అధ్యాయము సమాప్తమయినది. తరువాయి నాలుగవ అధ్యాయము)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


10.1.2022 సాయంకాల సందేశం

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం - నాలుగవ అధ్యాయము

శ్రీనారదుని ఆగమనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
 4.1 ఒకటవ శ్లోకం

వ్యాస ఉవాచ

ఇతి బ్రువాణం సంస్తూయ మునీనాం దీర్ఘసత్రిణామ్|

ఈ విధముగా సూతగోస్వామి పలికినంతట దీర్ఘకాల యజ్ఞదీక్షితులైన ఋషులలో శ్రేష్ఠుడును, వృద్ధుడును అగు శౌనకముని అతనిని ఇట్లు సంబోధించుచు అభినందించెను

4.2 (రెండవ శ్లోకం)

శౌనక ఉవాచ

సూత సూత మహాభాగ వదనో వదతాం వర|

కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాన్ఛుకః॥

శౌనకుడు పలికెను:ఓ సూతగోస్వామీ!  మహాభాగుడైన నీవు వక్తలలో అత్యంత శ్రేష్థుడవు. కనుక ఘనుడును, పరమ శక్తిమండును అగు శ్రీశుకదేవగోస్వామి పలికిన శ్రీమద్భాగవత పవిత్ర కథను దయతో మా కిపుడు వినిపింపుడు.

4.3 (మూడవ శ్లోకం)

కస్మిన్ యుగే పవృత్తేయం స్థానే వా కేన హేతువా|

కుతః సంచోదితః కృష్ణః కృతవాన్ సంహితాం మునిః॥

ఈ శ్రీమద్భాగవతము ఏ సమయమునందు మరియు ఎచ్చోట తొలుత ప్రారంభింపబడినది? అదియునుగాక ఏ కారణము చేత అది ఆరంభింపబడినది? ఈ సంహితము రచించుటకు మహామునియైన కృష్ణద్వైపాయన వ్యాసుడు ఎవరి నుండి స్ఫూర్తిని పొందియుండెను?

4.4 (నాలుగవ శ్లోకం)

తస్య పుత్రో మహాయోగీ సమదృక్ నిర్వికల్పకః|

ఏకాన్తమతిరున్నిద్రో గూఢో మూఢ ఇవేయతే॥

అతని (వ్యాసదేవుని) తనయుడు గొప్ప భక్తుడు. సమదర్శి, నిర్వికల్పుడైన అతడు సదా ఏకాంతమతుడైనట్టివాడు. సమస్త భౌతిక కార్యములకు పరుడైనట్టి అతడు గూఢముగా నున్నందున బాహ్యమునకు జడుని వలె గోచరించును.

4.5 (ఐదవ శ్లోకము)

దృష్ట్వానుయాన్తమృషిమాత్మ జమప్యనగ్నం
దేవ్యో హ్రియా పరిదధుర్న సుతస్య చిత్రమ్|

తద్వీక్ష్య పృచ్ఛతి మునౌ జగదుస్తవాస్తి
స్త్రీపుంభిదా న తు సుతస్య వివిక్తదృష్టేః॥

శ్రీవ్యాసదేవుడు తన తనయుని అనుసరించుచు చనునప్పుడు నగ్నముగా జలకములాడు సుందరులైన దేవతాస్త్రీలు అతడు నగ్నముగా లేకున్నను వెంటనే వస్త్రములు ధరించిరి. కాని అతని తనయుడు తమ ఎదుటగా ప్రయాణించి నప్పుడు వారట్లు వర్తించలేదు. కాని అతని తనయుడు తమ ఎదుటగా ప్రయాణించి నప్పుడు వారట్లు వర్తించలేదు. ఈ విషయమును గూర్చి వ్యాసదేవుడు ప్రశ్నించగా అతని తనయుడు పవిత్రుడనియు, స్త్రీపురుష భేదములు గాంచని వాడనియు ఆ యువతులు ప్రత్యుత్తరమిచ్చిరి. కాని వ్యాసదేవుడు అట్టి భేదభావములను చూపియుండెను.

4.6 (ఆరవ శ్లోకము)

కథమాలక్షితః పౌరైః సంప్రాప్తః కురుజాంగలన్|

ఉన్మత్తమూకజడపద్విచరన్ గజసాహ్వయే॥

కురుజాంగల ప్రాంతములందు సంచరించిన పిదప హస్తినాపురమున ప్రవేశింపగా ఉన్మత్తుడును, మూగవాడును, జడుని వలె గోచరించువాడును అగు అతనిని (వ్యాసుని తనయుడైన శ్రీల శుకదేవుని) జనులెట్లు గుర్తించిరి.

4.7 (ఏడవ శ్లోకము)

కథం వాం పాండవేయస్య రాజర్షేన్మునినా సహ|

సంవాదః సమభూత్తాత యత్రైషా సాత్యతీ శృతిః॥

అట్టి శుకదేవగోస్వామిని పరీక్షిన్మహారాజు కలియుట ఎట్లు సంభవించెను? ఆ కలయిక వలననే వేదముల దివ్యసారమును (శ్రీమద్భాగవతము) కీర్తించుటకు అతనికి అవకాశము కలిగెను.

4.8 (ఎనిమిదవ శ్లోకము)

స గోదోహనమాత్రం హి గృహేషు గృహమేధినామ్|

అవేక్షతే మహాభాగస్థీర్థీ కుర్వంస్తదాశ్రమమ్॥

అతడు (శుకదేవగోస్వామి) గృహస్థుని ఇంటి ముంగిట గోదహనకాలము వరకే నిలిచియుండు నైజము గలవాడు. తాను దర్శించు గృహమును పునీత మొనర్చుటకే అతడట్లు చేసెను.

4.9 (తొమ్మిదవ శ్లోకము)

అభిమన్యుసుతం సూత ప్రాహుర్భాగవతోత్తమమ్|

తస్య జన్మ మహాశ్చర్యం కర్మాణి చ గృణీహి నః॥

పరీక్షిన్మహారాజు భాగవతోత్తముడనియు, అతని జన్మకర్మలు అత్యంత ఆశ్చర్యకరములనియు చెప్పబడుచుండును. దయచేసి అతనిని గూర్చి తెలియజేయుడు.

4.10 (పదవ శ్లోకం)

స సామ్రాట్ కస్య వా హేతోః పాండూనాం మానవర్ధనః|

ప్రాయోపవిష్ఠో గంగాయామనాదృత్యాధిరాట్శ్రియమ్॥

పరీక్షిన్మహారాజు గొప్ప సామ్రాట్టు మరియు గొప్ప రాజ్యసంపదను కలిగినట్టివాడు. పాండవవంశ యశస్సును వృద్ధిచేయునటువంటి అతడు ఏ కారణము చేత సమస్తమును త్యజించి గంగాతటమున ప్రాయోపవిష్ఠుడయ్యెను?

4.11 (పదకొండవ శ్లోకము)

నమన్తి యత్పాదనికేతమాత్మనః
      శివాయ హానీయ ధనాని శత్రవః

కథం స వీరః శ్రియమంగ దుస్త్యజాం
      యుజవైషతోత్ర్సష్టుమహో సహాసుభిః॥

పరీక్షిన్మహారాజు శత్రువులు తమంతట తామే  అతని పాదములకు వందనములొసగి  ధనసంపత్తులనన్నింటినీ స్వీయక్షేమము కోసం అర్పించెడివాడు. అటువంటి ఘనచక్రవర్తియైన అతడు పూర్ణశక్తిని, పూర్ణయౌవనమును, అసాధ్యమైన రాజ్యవైభవములను కలిగియుండెను. అట్టి యెడ ప్రాణముతో సహా సమస్తమును ఎందులకై అతడు త్యజింపగోరెను?

4.12 (పన్నెండవ శ్లోకము) 

శివాయ లోకస్య భవాయ భూతయే
      య ఉత్తమశ్లోకపరాయణా జనాః|

జీవన్తి నాత్మార్థమసౌ పరాశ్రయం
      ముమోద నిర్విద్య కుతః కలేవరమ్॥

దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తికే అంకితమైనవారు ఇతరుల క్షేమము, ఆనందము, అభ్యుదయముల కోసమే జీవింతురు. తమ స్వలాభము కోసం వారెన్నడును జీవించరు.  పరీక్షిన్మహారాజు కూడా ఆ విధముగా సమస్త లౌకిక సంపదల సంగమ నుండి ముక్తుడై యున్నను ఇతరులకు ఆశ్రయమైన తన దేహమును ఎందులకు పరిత్యజించెను?

4.13 (పదమూడవ శ్లోకము)

తత్సర్వం నః సమాచక్ష్వ పృష్టో యదిహ కించన|

మన్యే త్వాం విషయే వాచాం స్నాతమన్యత్ర ఛాందసాత్॥

వేదములందలి కొంత భాగము మినహా సర్వశాస్త్రభావములందును పారంగతుడవైనందున మేము వేసిన ప్రశ్నలన్నింటికినీ నీవు స్పష్టముగా సమాధానమొసగగలవని మేమెరిగియున్నాము.

4.14 (పదునాల్గవ శ్లోకము)

సూత ఉవాచ

ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగపర్యయే|

జాతః పరాశరోద్యోగీ వాసవ్యాం కలయా హరేః॥

సూతగోస్వామి పలికెను: ద్వాపరయుగము త్రేతాయుగమునందును వ్యాపించినట్టి సమయమున వ్యాసదేవుడు పరాశరుని ద్వారా వసుతనయయైన సత్యవతి గర్భమున జన్మించెను. 

4.15 (పది హేనవ శ్లోకము)

స కదాచిత్సరస్వత్యా ఉపస్పృశ్య జలం శుచిః|

వివిక్త ఏక ఆసీన ఉదితే రవిమండలే॥

అతడు (వ్యాసదేవుడు) ఒకమారు సూర్యోదయ సమయమున సరస్వతీనదీ జలముల యందు స్నానాదులను గావించి ధ్యానము సల్పుటకు ఏకాంతమున ఆసీనుడయ్యెను.

4.16 (పదహారవ శ్లోకము)

పరాశరజ్ఞః స ఋషిః కాలేనావ్యక్తరంహసా|

యుగధర్మవ్యతికరం ప్రాప్తం భువి యుగే యుగే॥

మహామునియైన వ్యాసదేవుడు యుగధర్మములందు కలిగిన విపరీతములను గాంచగలిగెను. పుడమియందు అటువంటి విపరీతములు కాలప్రభావముచే వివిధ యుగములందు కలుగుచుండును.
 
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


11.1.2022 ప్రాతఃకాల సందేశం

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం - నాలుగవ అధ్యాయము

శ్రీనారదుని ఆగమనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
 4.17 (పదిహేడవ శ్లోకము)

భౌతికానాం చ భావానాం శక్తిహ్రాసం చ తత్కృతమ్|

అశ్రద్దధానాన్నిఃసత్త్వాన్దుర్మేధాన్ హ్రసితాయుషః|

4.18 (పద్దెనిమిదవ శ్లోకము)

దుర్భగాంశ్చ జనాన్ వీక్ష్య మునిర్దివ్యేన చక్షుసా|

సర్వవర్ణాశ్రమాణాం యద్దధ్యౌ హితమమోఘదృక్॥

జ్ఞానసంపన్నుడైన ఆ మహర్షి యుగప్రభావము వలన భౌతికమైన సమస్తము నశింపనున్నదని తన దివ్యదృష్టిచే గాంచగలిగెను. శ్రద్ధారహితమైన జనసామాన్యము యొక్క ఆయుఃప్రమాణము క్షీణించుటయే గాక, సత్త్వగుణము లోపించుట వలన వారు దౌర్భాగ్యులగుటయు అతడు దర్శింపగలిగెను. అంతట అతడు సర్వవర్ణాశ్రమముల వారికి శుభమును కలుగజేయు  విషయమును గూర్చి చింతింపదొడగెను.

4.19 (పందొమ్మిదవ శ్లోకము)

చాతుర్హోత్రం కర్మ శుద్ధం ప్రజానాం వీక్ష్య వైదికమ్|

వ్యదధాద్యజ్ఞసన్తత్యై వేదమేకం చతుర్విధమ్|

మానవుల కర్మలు శుద్ధిపడుటకు వేదములందు తెలుపబడిన యజ్ఞములే మార్గమని అతడు గాంచగలిగెను. అట్టి యజ్ఞములను జనుల యందు వ్యాప్తిచేయుటకై ఆ పద్ధతిని సులభమొనర్పదలచి అతడు ఏకముగా నున్న వేదమును నాలుగు భాగములుగా విభజించెను.

4.20 (ఇరువదవ శ్లోకము)

ఋగ్యజుఃసామాథర్యాఖ్యా వేదాశ్చత్వార ఉద్ధృతాః|

ఇతిహాసపురాణం చ పంచమో వేద ఉచ్యతే॥

ఆ విధముగా జ్ఞానపు ఆదిమూలము యొక్క నాలుగు విభాగములు (వేదములు) విడిగా ఏర్పాటు చేయబడినవి. చారిత్రాత్మక విషయములు, ప్రామాణిక కథలను కలిగియున్న పురాణములు పంచమవేదముగా  పిలువబడినది.


4.21 (ఇరవై ఒకటవ శ్లోకం)

తత్ర ఋగ్వేదధరః పైలః సామగో జమినిః కవిః|

వైశంపాయన ఏవైకో నిష్ణాతో యజుషాముత॥

ఈ విధముగా వేదము నాలుగు భాగములుగా విభజింపబడిన పిమ్మట పైలఋషి ఋగ్వేదమునకు ఆచార్యుడయ్యెను. జైమినిఋషి సామవేదమునకు  ఆచార్యుడు కాగా వైశంపాయనుడు ఒక్కడే యజుర్వేదపారంగతుడయ్యెను.

4.22 (ఇరవై రెండవ శ్లోకం)

అథర్వాంగిరసామిసీత్సుమన్తుర్దారుణో మునిః|

ఇతిహాసపురాణానాం పితా మే రోమహర్షణః॥

అత్యంత శ్రద్ధావంతుడైన సుమంతముని అంగీరునికి అథర్వవేదము నివ్వగా, నా జనకుడైన రోమహర్షుణునికి పురాణేతిహాసములు ఇవ్వబడినవి.

4.23 (ఇరవై మూడవ శ్లోకం)

త ఏత ఋషయో వేదం స్వం స్వం వ్యస్యన్ననేకధా|

శిష్యైః ప్రశిష్యైస్తచ్ఛిష్యైర్వేదాస్తే శాఖినోఽభవన్॥

ఈ ఋషులందరును తమకు అప్పగింపబడిన వేదములను తిరిగి తమ శిష్యులకు,ప్రశిష్యులకు, ప్రశిష్యుల శిష్యులకు నిచ్చిరి. ఈ విధముగా వేదముల ననుసరించువారల ఆయా శాఖలు ఉనికీలోనికి వచ్చినవి.

4.24 (ఇరవై నాలుగవ శ్లోకం)

త ఏవ వేదాదుర్మే ధైర్ధార్యన్తే పురుషైర్యథా|

ఏవం చకార భగవాన్ వ్యాసః కృపణవత్సలః॥

ఈ విధముగా కృపణవత్సలుడగు వ్యాసముని మందబుధ్ధులైన మానవులు గ్రహింపగలిగెడి రీతిలో వేదములను విభజించెను.

4.25 (ఇరువది ఐదవ శ్లోకం)

స్త్రీ శూద్రద్విజబంధూనాం త్రయీ స శ్రుతిగోచరా|

కర్మ శ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవేదిహ|

ఇతి భారతమాఖ్యానం కృపయా మునినా కృతమ్॥

జనులకు ఇది జీవిత పరమలక్ష్యప్రాప్తిని కలుగజేయగలదని మహాముని కరుణతో భావించెను. ఆ విధముగా అతడు స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువుల నిమిత్తమై మహాభారతమనెడి గొప్ప ఇతిహాసమును రచించెను.

4.26 (ఇరవై ఆరవ శ్లోకం)

ఏవం ప్రవృత్తస్య సదా భూతానాం శ్రేయసి ద్విజాః|

సర్వాత్మ కేనాపి యదా నా తుష్యద్ధృదయం తతః॥

ఓ ద్విజులారా! ఈ విధముగా సర్వజనుల సంపూర్ణ శ్రేయస్సు కొరకై నియుక్తుడైనను వ్యాసదేవుని మనస్సు తృప్తి చెందలేదు.

4.27 (ఇరవై ఏడవ శ్లోకం)

నాతి ప్రసీదద్ధృదయః సరస్వత్యాస్తటే శుదౌ|

వితర్కయన్ వివిక్తస్థ ఇదం చోవాచ ధర్మవిత్॥

ఈ విధముగా హృదయమునందు అసంతృప్తిని చెందినవాడైన ముని ధర్మసారము నెరిగియున్నందున వెంటనే ఆలోచనామగ్నుడై తనలో తాను ఇట్లు పలికెను.

4.28 (ఇరవై ఎనిమిదవ శ్లోకం)

ధృతవ్రతేన హి మయా ఛందాంసి గురవోఽగ్నయః|

మానితా నిర్వ్యలీకేన గృహీతం చానుశాసనం॥

4.29 (ఇరవై తొమ్మిదవ శ్లోకం)

భారతవ్యపధేశేన హ్యామ్నాయార్థశ్చ ప్రదర్శితః|
దృశ్యతే యత్ర ధర్మాది స్త్రీశూద్రాదిభిరప్యుత॥

దృఢవ్రతములను పాటించుచు నేను నిష్కపటభావముతో వేదములను, గురువును, యాగాగ్నులను అర్చించితిని.  సర్వవిధములైన ఆజ్ఞలకు లోబడి యుండి స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువుల వంటివారు కూడా ధర్మపథమును గాంచగల రీతిలో గురుశిష్యపరంఫరయొక్క భావమును మహాభారత వ్యాఖ్యానము ద్వారా తెలియజేసితిని.

4.30 (ముప్పదవ శ్లోకము)

తథాపి బత మే దైహ్యోహ్యాత్మా చైనాత్మనా విభుః|

అసంపన్న ఇవాభాతి బ్రహ్మవర్చస్యసత్తమః॥

వేదములు గోరెడి సమస్తమును సంపూర్ణముగా కలిగియున్నప్పటికిని నేను అసంపూర్ణతను అనుభవించుచున్నాను.

4.31 (ముప్పది ఒకటవ శ్లోకం)

కిం వా భాగవతా ధర్మా స ప్రాయేణ నిరూపితాః|

ప్రియాః పరమహంసానిం త ఏవ హ్యచ్యుతప్రియాః॥

పరమహంసలకు, అచ్యుతునకు ప్రియమైనటువంటి భాగవతధర్మమును నేను ప్రత్యేకముగా తెలుపకపోవుటయే దీనికి కారణము కావచ్చును.

4.32 (ముప్పది రెండవ శ్లోకం)

తస్యైవం ఖిలమాత్మానం మన్యమానస్య భిద్యతః|

కృష్ణస్య నారదోఽభ్యాగాదాశ్రమం ప్రాగుదాహృతమ్॥

పూర్వము తెలుపబడినట్లు వ్యాసదేవుడు ఆ విధముగా తన లోపములకు పశ్చాత్తాపము చెందుచుండగా నారదముని సరస్వతీనది తటమున గల అతని ఆశ్రమమునకు అరుదంచెను.

4.33 (ముప్పది మూడవ శ్లోకం)

తమభిజ్ఞాయ సహసా ప్రత్యుత్థాయాగతం మునిః|

పూజయామాస విధివన్నారధం సురపూజితమ్॥

నారదముని శుభాగమనమును గాంచిన శ్రీవ్యాసదేవుడు గౌరవముతో లేచి నిలబడి సృష్టికర్తయైన బ్రహ్మకు ఇవ్వవలసిన గౌరవముతో ఆయనను అర్చించెను.

శ్రీమద్భాగవతము నందలి "శ్రీనారదుని ఆగమనము" అను ప్రథమ స్కంధములోని నాలుగవ అధ్యాయము సంపూర్ణము

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

11.1.2022 సాయంకాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

ఐదవ అధ్యాయము

శ్రీనారదుని ద్వారా వ్యాసదేవునికి భాగవతోపదేశము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
  5.1 (ఒకటవ శ్లోకము)

సూత ఉవాచ

అథ తం సుఖమాసీన ఉపాసీనం బృహచ్ఛ్రవాః|

దేవర్షిః ప్రాహి విప్రర్షిం వీణాపాణిః స్మయిన్నవ॥

సూతగోస్వామి పలికెను: ఆ విధముగా దేవర్షియైన నారదుడు సుఖాసీనుడై మందహాసము చేయుచున్నవాని వలె విప్రర్షియైన వేదవ్యాసునితో ఇట్లు పలుకసాగెను.

5.2 (రెండవ శ్లోకము)

నారద ఉవాచ

పారాశర్య మహాభాగ భవతః కచ్చిదాత్మనా|

పరితుష్యతి శారీర ఆత్మా మానస ఏవ వా॥

పరాశర తనయుడైన వ్యాసదేవుని సంబోధించుచు నారదుడు ప్రశ్నించెను: దేహమును లేదా మనస్సును ఆత్మానుభవ లక్ష్యముగా భావించుట ద్వారా నీవు సంతృప్తి చెందియుంటివా?

5.3 (మూడవ శ్లోకం)

జిజ్ఞాపితం సుసంపన్నమపి తే మహదద్భుతమ్|

కృతవాన్ భారతం యస్త్వం సర్వార్థపరిబృంహితమ్॥

నీ విచారణలు పూర్ణములైనట్టివి, నీ అధ్యయనములు కూడా సుసంపన్నము లైనట్టివి. సర్వవేదకర్మలను విపులముగా వర్ణించునట్టి మహాభారతమనెడి నీ రచన నిస్సందేహముగా ఘనమైనది, మహాద్భుతమైనది.

5.4 (నాలుగవ శ్లోకం)

జిజ్ఞాసితమధీతం చ బ్రహ్మయత్తత్ సనాతనమ్|

తథాపి శోచస్యాత్మానమకృతార్థ ఇవ ప్రభో॥

నిరాకార బ్రహ్మతత్త్వమును గూర్చియు, తత్సంబంధిత జ్ఞానమును గూర్చియు నీవు విపులముగా వర్ణించితివి. ఓ ప్రభూ! ఇంత కావించినప్పటికిని కృతార్థుడివి కానట్లుగా నీ వెందులకు ఇట్లు నిరాశ చెందియున్నావు?

5.5 (ఐదవ శ్లోకము)

వ్యాస ఉవాచ

అస్తేవ మే సర్వమిదం త్వయోక్తం
      తథాపి నాత్మా పరితుష్యతే మే|

తన్మూలమవ్యక్తమగాధబోధం
      పృచ్ఛామహే త్వాత్మభవాత్మభూతమ్॥

శ్రీవ్యాసదేవుడు పలికెను: మీరు నాగూర్చి పలికినదంతయు నిక్కముగా సత్యమై యున్నది. అయినప్పటికిని నాకు సంతృప్తి యనునది కలుగలేదు. ఆత్మభవుడు (లౌకిక తల్లిదండ్రులు లేనటువంటి) బ్రహ్మదేవుని తనయులైన కారణముగా మీరు అపరిచిత జ్ఞానసంపన్నులై యున్నారు. కనుకనే నా అసంతృప్తికి మూల కారణమును గూర్చి మిమ్ము ప్రశ్నించుచున్నాను.

5.6 (ఆరవశ్లోకము)

స వై భవాన్ వేద సమస్తగుహ్య
      ముపాసితో యత్పురుషః పురాణః

పరావరేశో మన సైవ విశ్వం            సృజత్యవత్యత్తిగుణైరసంగః

హే ప్రభూ! భౌతికజగపు సృష్టి,లయకారకుడును, ఆధ్యాత్మికజగపు పోషకుడును, త్రిగుణములకు పరుడును అగు పరమపురుషుని మీకు భక్తి ప్రపత్తులతో అర్చింతురు. తత్కారణముననే గుహ్యమైన ప్రతివిషయమును మీరెరిగియున్నారు.

5.7 (ఏడవ శ్లోకము)

త్వం పర్యటన్కర్మ ఇవ త్రిలోకీ మన్తశ్చరో వాయురివాత్మ సాక్షీ|

పరాపరే బ్రహ్మణి ధర్మతో వ్రతైః స్నాతస్య మే న్యూనమలం విచక్ష్య॥

సూర్యుని వలె మీరు ముల్లోకములలో ఎచ్చోటనైనను సంచరింపగలరు. వాయువురీతి ప్రతివారి అంతరమందును ప్రవేశింపగలరు. ఈ విధముగా మీరు సర్వవ్యాపియైన పరమాత్మతో సమానులై యున్నారు. కనుకనే ధర్మానుష్ఠానములను, వ్రతములను,గూడి బ్రహ్మమునందు మగ్నుడనై యున్నప్పటికిని నాయందు గోచరించెడి లోపమును దయతో అన్వేషింపుడు. 

5.8 (ఎనిమిదవ శ్లోకము) 

శ్రీనారద ఉవాచ 

భవతానుదితప్రాయం యశో భగవతోఽమలమ్|

యే నైవాసౌ న తుష్యతే మన్యే తద్దర్శనమ్  భిలమ్॥
శ్రీనారదముని  పలికెను: ఉదాత్తములును, అమలములును అయిన శ్రీకృష్ణభగవానుని వైభవములను నీవు వాస్తవముగా కీర్తించలేదు. భగవానుని దివ్యేంద్రియములను సంతృప్తిపరుపజాలనటువంటి తత్త్వము నిరర్థకమైనదిగా భావింపబడును.

5.9 (తొమ్మిదవ శ్లోకము)

యథా ధర్మాదయాశ్చార్థా మునివర్యానుకీర్తితాః|

న తథా వాసుదేవస్య మహిమా హ్యనువర్ణితః॥

ధర్మాది చతుర్విధ ఫలపురుషార్థములను నీవు విశదముగా వర్ణించినను దేవదేవుడైన వాసుదేవుని మహిమలను సమగ్రముగా వర్ణింపలేదు.

5.10 (పదవ శ్లోకము)

నయద్వచశ్చిత్రపదం హరేర్యశో జగత్ఫవిత్రం ప్రగృణీత కర్హిచిత్|

తద్వాయసం తీర్థముశన్తి మానసా న యత్ర హంసా నిరమన్త్యుశిక్ క్షయాః॥

సమస్తవిశ్వమును పవిత్రము చేయగల శ్రీకృష్ణభగవానుని యశస్సును కీర్తించనటువంటి వచనములు మహాత్ములైనవారిచే వాయసతీర్థముగా పరిగణింపబడును. పరమహంసలైనవారు దివ్యధామమున వసించునట్టివారు గనుక అట్టి వాయసతీర్థము నందు రమింపగోరరు.

5.11 (పదకొండవ శ్లోకము)

తద్వాగ్నిసర్గో జనతాఘవిప్లవో
       యస్మిన్ ప్రతిశ్లోకమబద్ధవత్యపి|

నామాన్యనన్త స్య యశోఽఙ్కితాని యత్
      శృణ్వన్తి గాయన్తి గృణన్తి సాధనః॥

అదియట్లుండగా అనంతుడైన శ్రీకృష్ణభగవానుని నామ యశో రూప లీలాదుల దివ్య వర్ణనలతో నిండియున్న వాఙ్మయము విభిన్న రచనయై యున్నది. దివ్య వాక్భరితమై యుండి పెడమార్గమును బట్టిన ఈ ప్రపంచజనుల పాపజీవనమునందు విప్లవాత్మక మార్పును గొనివచ్చుటకై ఉద్దేశింపబడిన అటువంటి దివ్యవాఙ్మయము చక్కగా రచింపబడకున్నను సాధువులైన పవిత్రాత్ములచే శ్రవణకీర్తనములు చేయబడి ప్రీతితో గ్రహించబడును.

5.12 (పన్నెండవ శ్లోకము)

నైష్కర్మ్యమప్యచ్యుతభావవర్జితమ్
      న శోభతే జ్ఞానమలం నిరంజనమ్|

కుతః పునః శశ్వదభద్రమీశ్వరే
      న చార్పితం కర్మ యత్యపికారణమ్॥

ఆత్మానుభవజ్ఞానము సర్వవిధములైన భౌతికభావనల నుండి విడివడి యున్నను అచ్యుత భావసమన్వితము గానిచో ఏ మాత్రము శోభించదు. అట్టి యెడ సహజముగా ఆది నుండియు ప్రయాసను కలిగి పరిణామశీలమైయుండు  కామ్యకర్మలను ఆ శ్రీకృష్ణభగవానుని భక్తియుత సేవలో వినియోగించనిచో ఏమి ప్రయోజనము చేకూరగలదు?

5.13 (పదమూడవ శ్లోకము)

అథో మహాభాగ భవానమోఘదృక్
      శుచిశ్రవాః సత్యరతో ధృతవ్రతః|

ఉరుక్రమస్యాభిలబన్ధ ముక్తయే
      సమాధినానూస్మర తద్విచేష్టితమ్

ఓ వ్యాసదేవా! నీ దృష్టి అమోఘమైనది. నీ యశస్సు నిష్కళంకమైనది. దృఢవ్రతుడవైన నీవు సత్యరతుడవు. కనుక జనుల భవబంధవిముక్తి కొరకు నీవు సమాధిమగ్నుడవై ఉరుక్రముడైన శ్రీకృష్ణభగవానుని దివ్యలీలానుస్మరణమున గావింపుము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

12.1.2022 ప్రాతఃకాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

ఐదవ అధ్యాయము

శ్రీనారదుని ద్వారా వ్యాసదేవునికి భాగవతోపదేశము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
5.14 ( పదునాల్గవ శ్లోకము)

తతోఽన్యథా  కించన యద్వివక్షతః పృథగ్దృశస్తత్కృతరూపనామభిః|

న కర్హిచిత్క్వాపి చ దుఃస్థితా మతిర్లభేత వాతాహతనౌరివాస్పదమ్॥

ఆశ్రయము లేనటువంటి నావను వాయువు సంక్షోభపరచురీతిగా, భగవద్భావనకు అన్యముగా నీవు రచింపగోరునదేదైనను పలు నామరూప ఫలితములను గూడియుండి మనస్సును సంక్షోభితము చేయగలదు.

5.15 (పదిహేనవ శ్లోకము)

జుగుప్సితం ధర్మకృతేఽనుశాసతః
      స్వభావరక్తస్య మహాన్ వ్యతిక్రమః|

యద్వాక్యతో ధర్మ ఇతీతరః స్థితో
      న మన్యతే తస్య నివారణం జనః॥

జనులందరును సహజముగా భోగాభిలాషులై యుందురు. ధర్మము పేరిట వారిని నీవు అదే మార్గమునందు ప్రోత్సహించితివి. ఇది నిక్కముగా నిందనీయమును, అయుక్తమును అయియున్నది. నీ ఉపదేశములచే నిర్దేశింప బడిన కారణముగా వారు అట్టి కర్మలను ధర్మము పేరిట స్వీకరించి అందలి నిషేధములను మాత్రము అలక్ష్యపరుతురు.

5.16 (పదహారవ శ్లోకము)

విచక్షణోఽస్యార్హతి వేదితుం నిభోరనన్తపారస్య నివృత్తితః సుఖమ్|

ప్రవర్తమానస్య గుణైరనాత్మనస్తతో భవాన్దర్శయ చేష్టితం విభోః॥

భగవానుడు అనంతుడు. భౌతికసుఖములకు సంబంధించిన కర్మల నుండి ముక్తుడైనట్టి ప్రవీణుడే ఈ ఆధ్యాత్మికజ్ఞానమును అవగతమొనర్చుటకు యోగ్యుడై యున్నాడు. కావున భౌతికబంధముల కారణముగా  సరియైన స్థితిలో నెలకొననివారలకు నీవు ఆ దేవదేవుని దివ్యలీలానువర్ణముల ద్వారా దివ్యానుభవ మార్గమును చూపుము.

5.17 (పదిహేడవ శ్లోకము)

త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్భజన్నపక్వోఽథ పతేత్తతో యది|

యత్ర క్వ వాభద్రమభూదముష్య కిం కో వార్థ ఆప్తోఽభజతాం స్వధర్మతః॥

శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవ యందు నియుక్తుడగుటకు తన స్వధర్మమును కూడ త్యజించువాడు. సాధనకాలమునందలి అపక్వస్థితిలో కొన్నిమార్లు పతనమునొందినను కృతార్థత్వ విషయమున అతనికెట్టి భయము లేదు. కాని అభక్తుడైనవాడు ధర్మానుష్టానమును సమగ్రముగా నొనరించిననుఎటువంటి లాభమును పొందజాలడు.

5.18 (పద్దెనిమిదవ శ్లోకము)

తస్యైవ హేతోః ప్రయతేత కోవిదో న లభ్యతే యద్భ్రమతాముపర్యధః|

తల్లభ్యతే దుఃఖవదన్యతః సుఖం కాలేన సర్వత్ర గభీరరంహసా॥

అత్యంత ఉన్నతలోకమైన బ్రహ్మలోకము నుండి అధోలోకమైన పాతాళము వరకు పరిభ్రమించినను లభించనటువంటి ప్రయోజనము కొరకే తత్త్వజ్ఞానము కలిగిన బుద్ధిమంతులైనవారు వాస్తవముగా యత్నించ వలెను. ఏలయన కోరుకున్నను దుఃఖములు మనకు కాలములో సంప్రాప్తించెడి రీతి, ఇంద్రియభోగ సుఖము కూడా దానంతటదే అప్రయత్నముగా కాలక్రమమున లభింప గలదు.

5.19 (పందొమ్మిదవ శ్లోకము)

న వై జనో జాతు కథంచనావ్రజేన్ముకున్ద సేవ్యన్యవదంగ సంసృతిమ్|
స్మరన్ముకున్దాఙ్గ్ర్యపగూహనం పునర్విహాతుమిచ్ఛేన్న రసగ్రహో జనః॥

ఓ వ్యాసదేవా! శ్రీకృష్ణభగవానుని భక్తుడైనవాడు కొన్నిమార్లు ఏదియో ఒక కారణముచే పతనమునొందినను ఇతరుల వలె (కామ్యకర్మరతుల వలె) భవబంధనమున నిక్కముగా చిక్కబడడు. ఏలయన ముకుంద పాదాశ్రయ రసాస్వాదనమును ఒకమారు కావించినవాడు అట్టి దివ్యినుభవమును పదే పదే స్మరించుట కన్నను అన్యమును గావింపడు.

5.20 (ఇరవదవ శ్లోకము)

ఇదం హి విశ్వం  భగవానివేతరో యతో జగత్ స్థాననిరోధ సమ్భవాః|

తద్ధి స్వయం వేద భవాంస్తథాపి తే ప్రాదేశమాత్రం భవతః ప్రదర్శితమ్॥

ఆ దేవదేవుడే స్వయముగా ఈ విశ్వము రూపమున నిలిచియున్నాడు. అయినను అతడు దీనికి పరుడైయున్నాడు.  ఈ విశ్వము ఆ భగవానుని నుండియే ఉద్భవించి, అతనియందే నిలిచి, చివరకు లయము పిమ్మట అతని యందే ప్రవేశించును. ఇది యంతయు నీవెరిగియున్నను సూచనగా నేను తెలియజేసితిని.

5.21 (ఇరవై ఒకటవ శ్లోకము)

త్వమాత్మనాత్మానమవేహ్యమోఘదృక్
      పరస్య పుంసః పరమాత్మనః కలామ్|

అజం ప్రజాతం జగతః శివాయ తన్
మహానుభావాభ్యుదయోఽధిగణ్యతామ్॥

నీవు అమోఘదృష్టి గలవాడవు. భగవానుని అంశయైన కారణమున నీవు స్వయముగా ఆ పరమాత్ముడైన దేవదేవుని తత్త్వమును తెలిసియున్నావు. జన్మరహితుడవైనను జనుల కల్యాణము కొరకు నీవు భూమిపై అవతరించితివి. కనుక దయచేసి శ్రీకృష్ణభగవానుని దివ్యలీలలను నీవు విపలముగా వర్ణింపుము.

5.22 (ఇరవై రెండవ శ్లోకము)

ఇదం హి పుంసస్తపసః శ్రుతస్య వా
      స్విష్టస్య సూక్తస్య చ బుద్ధి దత్తయోః|

అవిచ్యుతోఽర్థః కవిభిర్నిరూపితో యదుత్తమశ్లోకగుణానువర్ణనమ్॥

తపస్సు, వేదాధ్యయనము, యజ్ఞానుష్ఠానము, మంత్రోచ్ఛారణము, దానముల యొక్క నాశరహితమైన ప్రయోజము ఉత్తమశ్లోకుడైన శ్రీకృష్ణభగవానుని దివ్యలీలానువర్ణనమునందే పరిసమాప్తి చెందునని పండితులైనవారు వాస్తవముగా ధృవపరచియుండిరి.

5.23 (ఇరువై మూడవ శ్లోకము)

అహం పురతీత భవేఽభవం మునే
      దాస్యాస్తు కస్యాశ్చన వేదవాదినామ్|

నిరూపితో బాలక ఏవ యోగినామ్
      శుశ్రూషణే ప్రావృషి నిర్వివిక్షతామ్॥

ఓ మునీ! పూర్వకల్పమున వేదవాదులైన బ్రాహ్మణుల సేవలో నిలిచిన ఒకనొక దాసికి నేను పుత్రునిగా జన్మించియుంటిని. ఒకమారు ఆ బ్రాహ్మణులు చాతుర్మాస్య వ్రతదీక్ష యందుండగా వారి సేవ యందు నేను నియోగింపబడితిని.

5.24 (ఇరవై నాలుగవ శ్లోకము)

12.1.2022 సాయంకాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

ఐదవ అధ్యాయము

శ్రీనారదుని ద్వారా వ్యాసదేవునికి భాగవతోపదేశము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
5.27 (ఇరవై ఏడవ శ్లోకము)

తస్మింస్తదా లబ్ధరుచేర్మహామతే ప్రియశ్రవ స్వస్థలితా మతిర్మమ|

యయాహ మేతత్సదసత్స్వమాయయాపశ్యే మయి బ్రహ్మణి కల్పితం పరే॥

ఓ మహర్షీ! ఆ విధముగా దేవదేవుని యెడ ప్రీతిని పొందినంతనే అతని యెడ నా శ్రవణాసక్తి అకుంఠితమయ్యెను. పిమ్మట అట్టి రుచి వృద్ధినొందగా అజ్ఞాన కారణముననే స్థూల, సూక్ష్మ ఆచ్ఛాదనలను నేను అంగీకరించియుంటినని అవగతము చేసికొనగలిగితిని. ఏలయన నేను, భగవానుడు ఇరువురము దివ్యులమై యున్నాము.

5.28 (ఇరవై ఎనిమిదవ శ్లోకము)

ఇత్థం శరత్ప్రావృషికావృతూ హరేర్విశృణ్వతో మేఽనుసవం యశోఽమలం|

సంకీర్త్యమానం మునిభిర్మహాత్మ భిర్భక్తిః ప్రవృత్తాత్మ రజస్తమోపహా॥

ఆ విధముగా శరద్వర్ష ఋతువులు రెండింటి యందును మహాత్ములైన ఆ మునులు నిత్యము ఒనరించిన శ్రీకృష్ణభగవానుని అమల యశోకీర్తనమును ఆకర్షించుటకు నేను అవకాశమును పొందితిని. ఆ రకముగా భక్తియుతసేవ నా యందు ఉత్పన్నమైనంతనే రజస్తమోగుణముల ఆచ్ఛాదనలు సంపూర్ణముగా అంతరించినవి. 

5.29 (ఇరవై తొమ్మిదవ శ్లోకము)

తస్యైవం మేఽనురక్తస్య ప్రశ్రితస్య హతైన సః|

శ్రద్దధానస్య బాలస్య దాన్తస్యానుచరస్య చ॥

ఆ మునుల యెడ నేను మిగుల అనురక్తుడనై యుంటిని. మృదుస్వభావుడనై న నా సర్వపాపములు వారి సేవయందు సంపూర్ణముగా నశించినవి. హృదయమునంద నేను వారి యెడ దృఢమైన విశ్వాసమును కలిగియుంటిని. ఇంద్రియములను నిగ్రహించి, వారి ఉపదేశములను నేను దేహముతోను, మనస్సుతోను కచ్చితముగా పాటించితిని.

5.30 (ముప్పదవ శ్లోకము)

జ్ఞానం గుహ్యతమం యత్తత్సాక్షాద్భగవతోదితమ్|

అన్వవోచన్ గమిష్యన్తః కృపయా దీనవత్సలాః॥

పిదప దీనవత్సలురైన ఆ భక్తివేదాంతులు అచట నుండి నిష్క్రమించుచు స్వయముగా దేవదేవునిచే ఉపదేశింపబడినటువంటి పరమగుహ్యజ్ఞానమును నాకు ఉపదేశించిరి.

5.31 (ముప్పై ఒకటవ శ్లోకము)

యే నైవాహం భగవతో వాసుదేవస్య వేధసః|

మాయానుభావమిదం యేన గచ్ఛన్తి తత్పదమ్॥

అట్టి గుహ్యతమజ్ఞానముచే సమస్తమునకు సృష్టిస్థితిలయకారకుడైన శ్రీకృష్ణభగవానుని శక్తిప్రభావమును నేను స్పష్టముగా అవగతము చేసికొన గలిగితిని. అద్దాని నెరుగుటచే మనుజుడు ఆ దేవదేవుని చెంతకే తిరిగిచేరి స్వయముగా అతనిని పొందగలడు.

5.32 (ముప్పైరెండవ శ్లోకం) 

ఏతత్సంసూచితం బ్రహ్మంస్తాపత్రయచికిత్సిత మ్|

యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితమ్॥

ఓ బ్రాహ్మణుడా (వ్యాసదేవా)! మనుజుని కర్మల నన్నింటిని పూర్ణపురుషోత్తముడైన శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవకు సమర్పించుటయే సమస్త తాపత్రయములను తొలగించుటకు ఉత్తమోత్తమ నివారణోపాయమని మహాత్ములచే నిర్ణయింపబడియున్నది.

5.33 (ముప్పై మూడవ శ్లోకము)

అమయో యశ్చ భూతానాం జాయతే యేన సువ్రత|

తదేవ హ్యామయం ద్రవ్యం న పునాతి చికిత్సితమ్॥

ఓ మహాత్మా! రోగకారణ పదార్ధమునే ఔషధరూపములో చికిత్సగా ఇచ్చినప్పుడు అది ఆ వ్యాధిని నయము గావింపదా?

5.34 (ముప్పై నాలుగవ శ్లోకము) 

ఏవం నృణాం క్రియాయోగాః సర్వే సంసృతిహేతవః|

త ఏవాత్మ వినాశాయ కల్పన్తే కల్పితాః పరే॥

ఈ విధముగా మానవుని కర్మలన్నియును భగవానుని సేవకే అంకితము గావింపబడినప్పుడు అతనికి నిత్యబంధమును కలిగించిన ఆ కర్మలే కర్మవృక్షము యొక్క నాశకారకములు కాగలవు.

5.35 (ముప్పది ఐదవ శ్లోకము)

యదత్ర క్రియతే కర్మ భగవత్పరితోషణమ్|

జ్ఞానం యత్తదధీనం హి భక్తి యోగ సమన్వితమ్॥

ఈ జన్మమున భగవత్కార్యమును పూర్ణము గావించుటకై ఒనర్చబడిన ఏ కర్మయైనను భక్తియోగముగా లేదా దివ్యమైన భక్తియుతసేవగా పిలువబడుచున్నది.  జ్ఞానముగా పిలువబడునది అద్దానికి సమన్వయ అంశమే కాగలదు.

5.36 (ముప్పది ఆరవ శ్లోకము)

కుర్వాణా యత్ర కర్మాణి భగవచ్ఛిక్షయాసకృత్|

గృణన్తి గుణనామాని కృష్ణస్యానుస్మరన్పి చ॥

భక్తుడు శ్రీకృష్ణభగవానుని ఆజ్ఞానుసారము కర్మల యందు వర్తించుచునే ఆ దేవదేవుని నామములను గుణములను సదా స్మరించుచుండును

5.37 (ముప్పై ఏడవ శ్లోకము)

ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి|

ప్రద్యుమ్నాయానిరుద్ధాయా నమః సంకర్షణాయ చ॥

వాసుదేవుని మహిమలను అతని ప్రధానాంశములైన ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షుణులతో సహా కీర్తింతుము గాక!

5.38 (ముప్పై ఎనిమిదవ శ్లోకము)

ఇతి మూర్త్యాభిధానేన మన్త్రమూర్తిమమూర్తికమ్|

యజతే యజ్ఞపురుషం స సమ్యగ్దర్శనః పుమాన్॥

భౌతికరూపరహితుడైన యజ్ఞపురుషుని (విష్ణువు) ఈ విధముగా దివ్యశబ్దరూపమున   అర్చించువాడే సమ్యగ్దర్శి యనబడును.

5.39 (ముప్పై తొమ్మిదవ శ్లోకం)

ఇమం స్వనిగమం బ్రహ్మన్మవేత్య మదనుష్ఠితమ్|

అదాన్మే జ్ఞానమైశ్వర్యం స్వస్మిన్ భావం చ కేశవః॥

ఓ బ్రాహ్మణులారా! ఈ విధముగా శ్రీకృష్ణభగవానునిచే తొలత వేద రహస్యమైనట్టి భగవతత్త్వజ్ఞానమును నేన పొందగలిగితిని. తదుపరి ఆధ్యాత్మికైశ్వర్యము మరియు ఆ దేవదేవుని సన్నిహిత ప్రేమ యుక్త సేవ లనునవి నాకు సంప్రాప్తించినవి.

5.40 (నలుబదవ శ్లోకము)

త్వమస్యదభశ్రుత విశ్రుతం విభోః సమాప్యతే యేవ విదాం బభుత్సితమ్|

ప్రాఖ్యాహి దుఃఖైర్ముహురర్దితాత్మనాం సంక్లేశనిర్వాణముశన్తి నాన్యథా॥

కనుక అపారవేదజ్ఞానము ద్వారా నీవెరిగియున్నట్టి శ్రీకృష్ణభగవానుని దివ్యలీలలను దయచేసి చక్కగా వర్ణింపుము. ఏలయన అట్టి కార్యమే విద్వాంసుల జిజ్ఞాసను సంతృప్తిపరుచునదియు, సంసారకోరలలో తపించునట్టి జనసామాన్యము యొక్క క్లేశములను నివారించునదియునై యున్నది. వాస్తవమునకు అటువంటి దుఃఖముల నుండి బయటపడుటకు అన్యమార్గము వేరొక్కటిలేదు. 

శ్రీమద్భాగవతమునందలి "నారదుని ద్వారా వ్యాసదేవునకు భాగవతోపదేశము" అను ప్రథమస్కంధంలోని ఐదవ అధ్యాయం సంపూర్ణం

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

తే మయ్య పేతాఖిలచాపలేఽర్భకే దాన్తేఽధృతక్రీడనకేఽనువర్తిని|

చక్రుః కృపాం యద్యపి తుల్యదర్శనాః
      శుశ్రూషమాణే మునయోఽల్పభాషిణి॥

వేదవాదులైన బ్రాహ్మణులు స్వభావరీత్యా నిష్పక్షపాతులైనను నా యెడ నిర్హేతుక కరుణను జూపియుండిరి. ఇక బాలుడనైనప్పటికిని నేను కూడా ఇంద్రియములను నిగ్రహించి క్రీడాసక్తిని విడనాడియుంటిని అంతియేగాక చాపల్యమును వీడి మితభాషినై యుంటిని.

5.25 (ఇరవై ఐదవ శ్లోకము)

ఉచ్ఛిష్టలేపాననుమోదితో ద్విజైః
      సకృత్స్మ భుంజే తదపాస్తకిల్బిషః|

ఏవం ప్రవృత్తస్య విశుద్ధచేతసస్తద్ధర్మ
    ఏవాత్మరుచిః ప్రజాయతే॥

ఒకమారు వారి అనుమతితో నేను ఉచ్ఛిష్టాన్నమును భుజించియుంటిని. తత్కార్యముచే నా పాపములన్నియును ఒక్కమారుగా నశించిపోయినవి. ఆ విధముగా సేవలో నియుక్తుడనైయుండగా నా హృదయము పవిత్రమయ్యెను. తత్సమయమున ఆ వేదాంతులైన బ్రాహ్మణుల స్వభావము నాకు మరింత ఆకర్షణీయమయ్యెను. 

5.26 (ఇరవై ఆరవ శ్లోకము)

తత్రాస్వహం కృష్ణకథాః ప్రగాయతామనుగ్రహేణాశృణవం మనోహరాః|

తాః శ్రద్ధయా మేఽనుపదం విశృణ్వతః ప్రియశ్రవస్యంగ మమాభవిద్రుచిః॥

ఓ వ్యాసదేవా ఆ వేదాంతుల కరుణచే వారి సాంగత్యమున వారు గావించెడి ఆకర్షణీయమైన కృష్ణలీలలను నేను శ్రవణము చేయగలిగితిని. ఆ విధమైన శ్రద్ధాపూరిత శ్రవణము చేత శ్రీకృష్ణభగవానుని గూర్చిన శ్రవణ రుచి నా యందు అడుగడుగున వృద్ధినందినది.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని ఐదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

13.1.2022 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

ఆరవ అధ్యాయము

శ్రీనారద మరియు వ్యాసదేవుల సంవాదము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
6.1 (ఒకటవ శ్లోకము)

సూత ఉవాచ

ఏవం నిశమ్య భగవాన్దేవర్షేర్జన్మ కర్మ చ|

భూయః పప్రచ్చ తం బ్రహ్మాన్ వ్యాసః సత్యవతీ సుతః

సూత గోస్వామి పలికెను: ఓ బ్రాహ్మణులారా! ఈ విధముగా నారదముని యొక్క జన్మకర్మలను గూర్చి శ్రవణము జేసిన పిమ్మట సత్యవతీ సుతుడును భగవదవతారమును అయిన వ్యాసదేవుడు ఇట్లు ప్రశ్నించెను

6.2 (రెండవ శ్లోకము)

వ్యాస ఉవాచ: 

భిక్షుభిర్విప్రవసితే విజ్ఞానాదేష్టృభిస్తవ|

వర్తమానో వయస్యాద్యే తతః కిమకరోద్భవాన్॥

శ్రీవ్యాసదేవుడు పలికెను: ఈ ప్రస్తుత జన్మము యొక్క ఆరంభమునకు పూర్వము దివ్యమగు భగవద్విజ్ఞానమును మీకు ఉపదేశించిన మహాఋషుల నిష్క్రమణము పిమ్మట మీరేమి (నారదుడు) చేసితిరి?

6.3 (మూడవ శ్లోకము)

స్యాయంభువ కయా వృత్త్యా వర్తితం తే పరం వయః|

కథం చేదముదస్రాక్షీః కాలే ప్రాప్తే కలేవరమ్॥

ఓ బ్రహ్మతనయా! మంత్రదీక్షను స్వీకరించిన పిమ్మట మీరెట్లు జీవితమును గడిపితిరి? కాలక్రమమున పూర్వదేహము వదలి ఈ ప్రస్తుత దేహమును మీ రెట్లు పొంద గలిగితిరి?

6.4 (నాలుగవ శ్లోకము)

ప్రాక్కల్పవిషయామేతాం  స్మృతిం తే మునిసత్తమ|

న హ్యేష వ్యవధాత్కాల ఏష సర్వనిరాకృతిః॥

ఓ మహర్షీ! కాలమనునది సమస్తమును హరించివేయును. అట్టి యెడ పూర్వకల్పమున జరిగియున్నట్టి ఈ విషయము కాలముచే చెదరక మీ స్మృతిపథమున ఇంకను ఎట్లు నిలిచియున్నది?

6.5 (ఐదవ శ్లోకము)

నారద ఉవాచ:

భిక్షుభిర్విప్రవసితే విజ్ఞానాదేష్టృభిర్మమ|

వర్తమానో వయస్యాద్యే తత ఏతదకారషమ్॥

శ్రీనారదముని పలికెను: భగవద్విజ్ఞానమును నాకు ఉపదేశించిన మహాఋషులు వేరొక ప్రదేశమునకు వెడలిన పిమ్మట నేనిపుడు తెలుపురీతి జీవితమును గడిపితిని.

6.6 (ఆరవ శ్లోకము) 

ఏకాత్మజా మే జననీ యోషిన్మూఢా చ కింకరీ|

మయ్యాత్మ జేఽనన్యగతౌ చక్రే స్నేహానుబన్ధనమ్॥

సామాన్యస్త్రీయే గాక దాసియును అయినట్టి నా తల్లికి నేనొక్కడినే పుత్రుడనై యుంటిని. నేను ఏకైక సంతానమైనందున మరియు తనకు వేరొక రక్షణము లేనందున ఆమె నన్ను ప్రేమ పాశముతో బంధించియుండెను. 

6.7 (ఏడవ శ్లోకము) 

సాస్వతన్త్రాన కల్పాసీద్యోగక్షేమం మమేచ్ఛతీ|

ఈశస్య హి వశే లోకో యోషా దారుమయీ యథా॥

నా పోషణాభారమును చక్కగా వహింపగోరినను తాను పరాధీనయైన కారణముగా ఆమె నాకేమియును చేయలేకపోయెను. ఈ ప్రపంచమంతయు భగవానుని సంపూర్ణ అధీనమున ఉన్నట్టిది. కనుక ప్రతియొక్కరును బొమ్మలను ఆడించువారి హస్తమునందలి కర్ర బొమ్మలై యున్నారు.

6.8 (ఎనిమిదవ శ్లోకము)

అహం చ తద్భ్రహ్మకులే ఊషివాంస్తదుపేక్షయా|

ది గ్ధేశకాలావ్యుత్పన్నో బాలకః పంచహాయసః॥

ఐదేండ్ల ప్రాయమునాడు నేను ఒక బ్రాహ్మణుల ఆశ్రయమున వసించియుంటిని. తల్లిప్రేమ పైననే సంపూర్ణముగా ఆధారపడియున్న నాకు వివిధప్రదేశముల అనుభవము ఏమాత్రము లేకుండెను.  

6.9 (తొమ్మిదవ శ్లోకము)

ఏకదా నిర్గతా గేహాద్దుహన్తీం నిశి గాం పథి|

సర్ఫోఽదశత్ఫదా స్పృష్టః కృపణాం కాలచోదితః॥

ఒకమారు దీనురాలగు నా తల్లి రాత్రిసమయమున ఆవుపాలు పితుకటకు వెడలగా దివ్యకాల ప్రభావమున సర్పమొకటి ఆమె పాదముపై కాటు వేసెను.

6.10 (పదవ శ్లోకము)

తదా తదహమీశస్య భక్తానాం శమభీప్సతః|

అనుగ్రహం మన్యమానః ప్రాతిష్ఠం దిశముత్తరామ్॥

తన భక్తులకు వరములొసగ సదా వాంఛించు భగవానుని ప్రత్యేక కరుణగా దీనిని నేను స్వీకరించితిని. ఆ విధముగా భావించుచు పిమ్మట నేను ఉత్తర దిక్కుగా పయనమైతిని.

6.11 (పదకొండవ శ్లోకము)

స్ఫీతాంజనపదాంస్తత్ర పురగ్రామవ్రజాకరాన్|

ఖేటఖర్వటవాటీశ్చ వనాన్యుపవనాని చ॥

ఆ విధముగా పయనమైన నేను పెక్కు సమృద్ధవంతములైన జనపదములు, పురములు, గ్రామములు, జంతుక్షేత్రములు, గనులు, వ్యవసాయక్షేత్రములు, లోయలు, పూదోటలు, వనములు, ఉపవనముల గుండా ప్రయాణించితిని. 


6.12 (పన్నెండవ శ్లోకము)

చిత్రధాతువిచిత్రాద్రీనిభభగ్నభుజద్రుమాన్|

జలాశయాన్ఛివజలాన్నలినీః సురసేవితాః|

చిత్రస్వనైః పత్రరథైర్విభ్రమద్భ్రమరశ్రియః॥

సువర్ణరజత తామ్రాది వివిధ ధాతుభరితమైన కొండలను పర్వతములను, సుందరమైన కలువలతో నిండిన జలాశయములు గల ప్రాంతములను నేను దాటితిని.  భ్రమించినటువంటి భృంగములతో, కిలకిల ధ్వనులు గావించు పక్షులతో అలంకృతమైన  ఆ పద్మసరోవరప్రాంతములు స్వర్గలోకవాసులకు తగినవిగానుండెను.

6.13 (పదమూడవ శ్లోకము)

నల వేణుశరస్తంబకుశకీచకగహ్వరమ్|

ఏక ఏవాతియాతోఽహమద్రాక్షం విపినం మహత్|

ఘోరం ప్రతిభయాకారం వ్యాలోలూకశివాజిరమ్|

పిదప ఒంటరిగా చనుటకు అతికష్టమైన పెక్కు రెల్లు, వెదురు, కలుపు, కుశగ్రాస అరణ్యముల గుండా మరియు గుహల గుండా ఒంటరిగా పయనించితిని. గుడ్లగూబలకు, సర్పములకు, నక్కలకు, క్రీడాస్థలముల వంటి భయంకరమైన అంధకారబంధుర కీకారణ్యములను దర్శించితిని.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

*13.1.2022 సాయంకాల సందేశము*

*వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం*

*ప్రథమస్కంధం*

*ఆరవ అధ్యాయము*

*శ్రీనారద మరియు వ్యాసదేవుల సంవాదము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*6.1 (ఒకటవ శ్లోకము)*

*సూత ఉవాచ*

*ఏవం నిశమ్య భగవాన్దేవర్షేర్జన్మ కర్మ చ|*

*భూయః పప్రచ్చ తం బ్రహ్మాన్ వ్యాసః సత్యవతీ సుతః*

సూత గోస్వామి పలికెను: ఓ బ్రాహ్మణులారా! ఈ విధముగా నారదముని యొక్క జన్మకర్మలను గూర్చి శ్రవణము జేసిన పిమ్మట సత్యవతీ సుతుడును భగవదవతారమును అయిన వ్యాసదేవుడు ఇట్లు ప్రశ్నించెను

*6.2 (రెండవ శ్లోకము)*

*వ్యాస ఉవాచ:* 

*భిక్షుభిర్విప్రవసితే విజ్ఞానాదేష్టృభిస్తవ|*

*వర్తమానో వయస్యాద్యే తతః కిమకరోద్భవాన్॥*

శ్రీవ్యాసదేవుడు పలికెను: ఈ ప్రస్తుత జన్మము యొక్క ఆరంభమునకు పూర్వము దివ్యమగు భగవద్విజ్ఞానమును మీకు ఉపదేశించిన మహాఋషుల నిష్క్రమణము పిమ్మట మీరేమి (నారదుడు) చేసితిరి?

*6.3 (మూడవ శ్లోకము)*

*స్యాయంభువ కయా వృత్త్యా వర్తితం తే పరం వయః|*

*కథం చేదముదస్రాక్షీః కాలే ప్రాప్తే కలేవరమ్॥*

ఓ బ్రహ్మతనయా! మంత్రదీక్షను స్వీకరించిన పిమ్మట మీరెట్లు జీవితమును గడిపితిరి? కాలక్రమమున పూర్వదేహము వదలి ఈ ప్రస్తుత దేహమును మీ రెట్లు పొంద గలిగితిరి?

*6.4 (నాలుగవ శ్లోకము)*

*ప్రాక్కల్పవిషయామేతాం  స్మృతిం తే మునిసత్తమ|*

*న హ్యేష వ్యవధాత్కాల ఏష సర్వనిరాకృతిః॥*

ఓ మహర్షీ! కాలమనునది సమస్తమును హరించివేయును. అట్టి యెడ పూర్వకల్పమున జరిగియున్నట్టి ఈ విషయము కాలముచే చెదరక మీ స్మృతిపథమున ఇంకను ఎట్లు నిలిచియున్నది?

*6.5 (ఐదవ శ్లోకము)*

*నారద ఉవాచ:*

*భిక్షుభిర్విప్రవసితే విజ్ఞానాదేష్టృభిర్మమ|*

*వర్తమానో వయస్యాద్యే తత ఏతదకారషమ్॥*

శ్రీనారదముని పలికెను: భగవద్విజ్ఞానమును నాకు ఉపదేశించిన మహాఋషులు వేరొక ప్రదేశమునకు వెడలిన పిమ్మట నేనిపుడు తెలుపురీతి జీవితమును గడిపితిని.

*6.6 (ఆరవ శ్లోకము)* 

*ఏకాత్మజా మే జననీ యోషిన్మూఢా చ కింకరీ|*

*మయ్యాత్మ జేఽనన్యగతౌ చక్రే స్నేహానుబన్ధనమ్॥*

సామాన్యస్త్రీయే గాక దాసియును అయినట్టి నా తల్లికి నేనొక్కడినే పుత్రుడనై యుంటిని. నేను ఏకైక సంతానమైనందున మరియు తనకు వేరొక రక్షణము లేనందున ఆమె నన్ను ప్రేమ పాశముతో బంధించియుండెను. 

*6.7 (ఏడవ శ్లోకము)* 

*సాస్వతన్త్రాన కల్పాసీద్యోగక్షేమం మమేచ్ఛతీ|*

*ఈశస్య హి వశే లోకో యోషా దారుమయీ యథా॥*

నా పోషణాభారమును చక్కగా వహింపగోరినను తాను పరాధీనయైన కారణముగా ఆమె నాకేమియును చేయలేకపోయెను. ఈ ప్రపంచమంతయు భగవానుని సంపూర్ణ అధీనమున ఉన్నట్టిది. కనుక ప్రతియొక్కరును బొమ్మలను ఆడించువారి హస్తమునందలి కర్ర బొమ్మలై యున్నారు.

*6.8 (ఎనిమిదవ శ్లోకము)*

*అహం చ తద్భ్రహ్మకులే ఊషివాంస్తదుపేక్షయా|*

*ది గ్ధేశకాలావ్యుత్పన్నో బాలకః పంచహాయసః॥*

ఐదేండ్ల ప్రాయమునాడు నేను ఒక బ్రాహ్మణుల ఆశ్రయమున వసించియుంటిని. తల్లిప్రేమ పైననే సంపూర్ణముగా ఆధారపడియున్న నాకు వివిధప్రదేశముల అనుభవము ఏమాత్రము లేకుండెను.  

*6.9 (తొమ్మిదవ శ్లోకము)*

*ఏకదా నిర్గతా గేహాద్దుహన్తీం నిశి గాం పథి|*

*సర్ఫోఽదశత్ఫదా స్పృష్టః కృపణాం కాలచోదితః॥*

ఒకమారు దీనురాలగు నా తల్లి రాత్రిసమయమున ఆవుపాలు పితుకటకు వెడలగా దివ్యకాల ప్రభావమున సర్పమొకటి ఆమె పాదముపై కాటు వేసెను.

*6.10 (పదవ శ్లోకము)*

*తదా తదహమీశస్య భక్తానాం శమభీప్సతః|*

*అనుగ్రహం మన్యమానః ప్రాతిష్ఠం దిశముత్తరామ్॥*

తన భక్తులకు వరములొసగ సదా వాంఛించు భగవానుని ప్రత్యేక కరుణగా దీనిని నేను స్వీకరించితిని. ఆ విధముగా భావించుచు పిమ్మట నేను ఉత్తర దిక్కుగా పయనమైతిని.

*6.11 (పదకొండవ శ్లోకము)*

*స్ఫీతాంజనపదాంస్తత్ర పురగ్రామవ్రజాకరాన్|*

*ఖేటఖర్వటవాటీశ్చ వనాన్యుపవనాని చ॥*

ఆ విధముగా పయనమైన నేను పెక్కు సమృద్ధవంతములైన జనపదములు, పురములు, గ్రామములు, జంతుక్షేత్రములు, గనులు, వ్యవసాయక్షేత్రములు, లోయలు, పూదోటలు, వనములు, ఉపవనముల గుండా ప్రయాణించితిని. 


*6.12 (పన్నెండవ శ్లోకము)*

*చిత్రధాతువిచిత్రాద్రీనిభభగ్నభుజద్రుమాన్|*

*జలాశయాన్ఛివజలాన్నలినీః సురసేవితాః|*

*చిత్రస్వనైః పత్రరథైర్విభ్రమద్భ్రమరశ్రియః॥*

సువర్ణరజత తామ్రాది వివిధ ధాతుభరితమైన కొండలను పర్వతములను, సుందరమైన కలువలతో నిండిన జలాశయములు గల ప్రాంతములను నేను దాటితిని.  భ్రమించినటువంటి భృంగములతో, కిలకిల ధ్వనులు గావించు పక్షులతో అలంకృతమైన  ఆ పద్మసరోవరప్రాంతములు స్వర్గలోకవాసులకు తగినవిగానుండెను.

*6.13 (పదమూడవ శ్లోకము)*

*నల వేణుశరస్తంబకుశకీచకగహ్వరమ్|*

*ఏక ఏవాతియాతోఽహమద్రాక్షం విపినం మహత్|*

*ఘోరం ప్రతిభయాకారం వ్యాలోలూకశివాజిరమ్|*

పిదప ఒంటరిగా చనుటకు అతికష్టమైన పెక్కు రెల్లు, వెదురు, కలుపు, కుశగ్రాస అరణ్యముల గుండా మరియు గుహల గుండా ఒంటరిగా పయనించితిని. గుడ్లగూబలకు, సర్పములకు, నక్కలకు, క్రీడాస్థలముల వంటి భయంకరమైన అంధకారబంధుర కీకారణ్యములను దర్శించితిని.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)
*14.1.2022 సాయంకాల సందేశము*

*వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం*

*ప్రథమస్కంధం*

*ఆరవ అధ్యాయము*

*శ్రీనారద మరియు వ్యాసదేవుల సంవాదము*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*6.14 (పదునాలుగవ శ్లోకము)* 

*పరిశ్రాన్తేన్ద్రియాత్మాహం తృట్పరీతో బభుక్షితః|*

*స్నాత్వా పీత్వా హ్రదే నద్యా ఉపస్ప్రష్టో గతశ్రమః॥*

ఆ విధముగా ప్రయాణించుచూ దేహపరముగాను, మనోపరముగాను అలసట నేందిన నేను ఆకలిదప్పులకు గురియైతిని. అంతట ఒక నది యందు స్నానమాచరించి జలమును గ్రహించితిని.  ఆ జల సంపర్కముతో అలసటనుండి నేను ఉపశమనము నొందితిని.

*6.15 (పదిహేనవ శ్లోకము)*

*తస్మిన్నిర్మనుజేఽరణ్యే పిప్పలోపస్థ ఆశ్రితః|*

*ఆత్మానాత్మానమాత్మస్థం యథాశ్రుతమచిన్తయమ్॥*

తదుపరి అటువంటి నిర్జనవనమున అశ్వత్థవృక్షఛాయలో ముక్తపురుషుల నుండి శ్రవణము జేసిన రీతిగా హృదయస్థుడైన పరమాత్మను నా బుద్ధి నుపయోగించి ధ్యానించుట మొదలిడితిని.

*6.16 (పదహారవ శ్లోకం)*

*ధ్యాయతశ్చరణాంభోజం భావనిర్జితచేతసా|*

*ఔత్కంఠ్యాశ్రుకలాక్షస్య హృద్యాసీన్మే శ నైర్హరిః॥*

దివ్యమగు ప్రేమ యందు పరివర్తితమైన మనస్సుతో శ్రీకృష్ణభగవానుని చరణకమలములను ధ్యానించుట మొదలిడినంతనే నా కనుల నుండి అశ్రువులు జాలువారినవి. అంతట శీఘ్రమే ఆ దేవదేవుడు నా హృదయకమలమునందు దర్శనమొసంగెను.

*6.17 (పదిహేడవ శ్లోకం)*

*ప్రేమాతిభరనిర్భిన్న పులకాంగోఽతినిర్వృతః|*

*ఆనందసంప్లవే లీవో నాపశ్యముభయం మునే॥*

ఓ వ్యాసదేవా! ఆ సమయమున ఆనందాతిశయముచే నా శరీరమందలి ప్రతిభాగము రంజితమయ్యెను. ఆ విధముగా పరమానందసాగరమున ఓలలాడుటచేత భగవానుని మరియు నన్నును నేను గాంచలేకపోయితిని.

*6.18 (పద్దెనిమిదవ శ్లోకము)*

*రూపం భగవతో యత్తన్మనఃకాంతం శుచాపహమ్|*

*అపశ్యన్ సహసోత్త స్థే వైక్లవ్యాద్దుర్మ నా ఇవ॥*

భగవానుని దివ్యరూపము మనోహరమైనది మరియు సమస్త మనో అసంగతములను శీఘ్రముగా హరించునట్టిది. వాంఛితమైనదానిని కోల్ఫోయినంతనే మనుజుడు కలతచెందు రీతి, అట్టి దివ్యరూపము అదృశ్యమైనంతనే తీవ్రకలతతో నేను హఠాత్తుగా లేచి నిలబడితిని. 


*6.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*దిదృక్షుస్తదహం భూయః ప్రణిధాయ మనో హృది|*

*వీక్షమాణోఽపి నాపశ్యమవితృప్త ఇవాతురః॥*

భగవానుని ఆ దివ్యరూపమును నేను తిరిగి దర్శించగోరితిని. కాని తద్రూపమును గాంచుటకై ఆత్రుతతో హృదయమునందు ఎంతగా ధ్యానింప యత్నించినను ఆ దేవదేవుని ఏమాత్రము ధ్యానింప యత్నించినను ఆ దేవదేవుని ఏమాత్రము దర్శింపలేకపోయితిని. ఆవిధముగా అసంతృప్తుడనై తీవ్ర దుఃఖితుడనైతిని.

*6.20 (ఇరువదవ శ్లోకము)*

*ఏవం యతస్తం విజనే మామాహాగోచరో గిరామ్|*

*గంభీరశ్లక్ ష్టయా వాచా శుచః ప్రశమ యన్నిప॥*

నిర్జనప్రదేశమున నేను చేసెడి యత్నములను గాంచిన లౌకిక వర్ణనాతీతుడైన భగవానుడు నా శోకమునుశమింపజేయుటకు మధురమును, గంభీరమును అగు వాక్కుతో ఇట్లు పలికెను.

*6.21 (ఇరవై ఒకటవ శ్లోకము)*

*హన్తాస్మిన్ జన్మని భవాన్మా మాం ద్రష్టుమిహార్హతి|*

*అవిపక్వకషాయణాం దుర్దర్శోఽహం కుయోగినామ్॥*

భగవానుడు పలికెను: ఓ నారదా ఈ జన్మలో నీవిక నన్ను  ఏమాత్రము గాంచలేవు. సేవ యంచు అసంపూర్ణులు మరియు భౌతికకల్మషముల నుండి సంపూర్ణముగా ముక్తులు కానివారు నన్నుగాంచలేరు. 

*6.22 (ఇరవై రెండవ శ్లోకము)*

*సకృద్యద్ దర్శితం రూపమేతత్కామాయ తేఽనఘ|*

*మత్కామః శనకైః సాధు సర్వాన్ముంచతి హృచ్ఛయాన్॥*

ఓ అనఘా! నీవు నా రూఫమును ఒకమారు గాంచగలిగితివి. నాపై అనురాగమును వృద్ధి జేయుటకే నేనట్లు చేసితిని. ఏలయన ఎంతగా నాయందు అనురక్తిని పొందుదునో అంతగా నీవు భౌతికవాంఛల నుండి ముక్తుడవు కాగలవు.


*6.23 (ఇరవై మూడవ శ్లోకము)*

*సత్సేవయాదీర్ఘయాపి జాతా మయి దృఢా మతిః|* 

*హిత్వావద్యమిమం లోకం గన్తా మజ్జనతామసి॥*

పరతత్త్వమునకు ఒనర్చెడి కొలదిదినముల సేవ చేతనే భక్తుడు నా యెడ దృఢమతుడగును. తత్ఫలితముగా అతడు దుఃఖపూర్ణమైన ప్రస్తుత భౌతిక జగములను వీడిన పిమ్మట ఆధ్యాత్మికజగమును చేరి నా పార్హదుడగును.

*6.24 (ఇరవై నాలుగవ శ్లోకము)*

*మతిర్మయి నిబద్ధేయం న విపద్యేత కర్హిచిత్|*

*ప్రజాసర్గనిరోధేఽపి స్మృతిశ్చ మదనుగ్రహాత్॥*

నా భక్తి యందు నియుక్తమైన మేధస్సు ఏకాలమందును నా కరుణచే నీ దివ్య స్మృతి అకుంఠితముగా నిలిచియుండగలదు.

*6.25 (ఇరవై ఐదవ శ్లోకము)*

*ఏతావదుక్త్యోపరరామ తన్మహద్*
      *భూతం నభోలింగమలింగమీశ్వరమ్|*
*అహం చ తస్మై మహతాం మహేయసే*
      *శీర్ ష్ణావనామం విదధేఽను కంపితః*

శబ్దరూపమున మూర్తీభవించి కనబడు అగోచరుడయ్యును పరమామృతుడైన ఆ పరమాధికారి పిదప పలుకుట ఆపెను. అంతట కృతజ్ఞతా భావముతో నేను శిరము వంచి ఆ దేవదేవునకు వందనముల నర్పించితిని.

*6.26 (ఇరవై ఆరవ శ్లోకం)*

*నామాన్యనన్తస్య హేతత్రపః పఠన్*
      *గుహ్యాని భద్రాణి కృతాని చ స్మరన్|*

*గాల పర్యటంస్తుష్టమనా గతస్పృహః*
      *కాలం ప్రతీక్షన్ విమదో విమత్సరః॥*

ఈ విధముగా నేను దేవదేవుని పవిత్రనామమును యశస్సును భౌతికజగత్తు మర్యాదలను మరచి పదేపదే కీర్తించుట నారంభించితిని. భగవానుని దివ్యలీలల అట్టి స్మరణ కీర్తనములు రెండును నిక్కముగా శ్రేయోదాయకములు. ఆ విధముగా గావించుచు తృప్తినొందినవాడను, నమ్రుడను, అసూరహితుడను అయి భూమండలమంతటను పర్యటించితిని.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

---*****____

15.1.2022 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

ఏడవ అధ్యాయము

ద్రోణసుతుని  (అశ్వత్థామ) దండనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమ స్కంధము-ఏడవ అధ్యాయము

ద్రోణసుతుని దండనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

7.1 (ఒకటవ శ్లోకము)

శౌనక ఉవాచ

నిర్గతే నారదే సూత భగవాన్ బాదరాయణః|

శ్రుతవాంస్తదభిప్రేతమ్ తతః కిమకరోద్విభుః॥

శౌనకఋషి ప్రశ్నించెను: ఓ సూతగోస్వామీ! ఘనుడును ప
రమ శక్తిమంతుడును అగు వ్యాసదేవుడు శ్రీనారదముని నుండి సమస్తమును శ్రవణము చేసెను. అట్టి వ్యాసదేవుడు నారదుని నిష్క్రమణము పిమ్మట ఏమి చేసెను?

7.2 (రెండవ శ్లోకము)

సూత ఉవాచ

బ్రహ్మనద్యాం సరస్వత్యామాశ్రమః పశ్చిమే తటే|

శమ్యాప్రాస ఇతి ప్రోక్త ఋషీణాం సత్రవర్ధనః ॥

శ్రీసూతగోస్వామి పలికెను: వేదములతో సన్నిహితముగా ముడిపడియున్న సరస్వతీనది యొక్క పశ్చిమతటమున శమ్యాప్రాశమను చోట ఋషుల ఆధ్యాత్మికకర్మలకు ఉపయుక్తమైన ఒక ఆశ్రమము కలదు. 

7.3 (మూడవ శ్లోకము)

తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో బదరీషణ్డమణ్డితే| 

ఆసీనోఽప ఉపస్పృశ్య ప్రణిదధ్యౌ మనః స్వయమ్॥

బదరీ వృక్షములచే సమావృతమైన అట్టి స్థలమున శ్రీల వ్యాసదేవుడు తన ఆశ్రమమునందు ఆసీనుడై, పవిత్రీకరణ కొరకు ఆచమనము గావించి ధ్యానమగ్నుడయ్యెను.

7.4 (నాలుగవ శ్లోకము)

భక్తియోగేన మనసి సమ్యక్ ప్రణిహితేఽమలే|

అపశ్యత్పురుషం పూర్ణం మాయాం చ తదపాశ్రయఆ ॥

ఆ విధముగా అతడు భౌతికత్వరహితముగా మనస్సును భక్తియోగమునందు నిలిపి ధ్యానమగ్నుడై పూర్ణపురుషోత్తముని మరియు అతని సంపూర్ణ అధీనమున యున్నటువంటి బాహ్యశక్తిని గాంచగలిగెను.

7.5 (ఐదవ శ్లోకము)

యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకమ్|

పరోఽపి మనుతేఽనర్థం తత్కృతం చాభిపద్యతే॥

ఈ బాహ్యశక్తి కారణముననే జీవుడు తాను త్రిగుణాతీతుడైనను తనను ప్రకృతికి సంబంధించినవానిగా భావించుచు భౌతిక క్లేశములను అనుభవించుచుండును.

7.6 (ఆరవ శ్లోకోము)

అనర్థోపశమం సాక్షాద్భక్తి యోగమధోక్షజే|

లోకస్యాజానతో విద్వాంశ్చక్రే సాత్వతసంహితామ్॥

జీవుని అపరిమితమైన భౌతిక క్లేశములు భక్తియుత సేవా విధానము ద్వారా ప్రత్యక్షముగా శమింపగలవు. కాని జనసామాన్యము ఈ విషయమును ఎరుగనందున విధ్వాంసుడైన వ్యాసదేవుడు పరమసత్యమునకు సంబంధించిన ఈ వేదవాఙ్మయమును రచించెను.

7.7 (ఏడవ శ్లోకము)

యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపూరుషే|

భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహభయాపహా॥

ఈ వేదవాఙ్మయమును కేవలమ శ్రవణము చేసినంత మాత్రముననే శోక మోహ భయానలమును నశింపజేయుటకు దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ భక్తియుతసేవా భావన శీఘ్రమే ఉత్పన్నమగుచున్నది.

7.8 (ఎనిమిదవ శ్లోకము)

స సంహితాం భాగవతీం కృత్వానుక్రమ్య చాత్మజమ్|

శుకమధ్యాపయామాస నివృత్తినిరతం మునిః॥

మహామునియైన వ్యాసదేవుడు ఆ విధముగా శ్రీమద్భాగవతమును రచించి పనర్విమర్శ గావించిన పిమ్మట ఆత్మానుభవమునందు అంతకు పూర్వమే మగ్నుడైనట్టి తన పుత్రుడగు శ్రీశుకదేవగోస్వామికి దానిని బోధించెను.

7.9 (తొమ్మిదవ శ్లోకము)

శౌనక ఉవాచ

స వై నివృత్తినిరతః సర్వత్రోప్రేక్షకో మునిః|

కస్య వా బృహతీమేతామాత్మారామః సమభ్యపత్॥

శ్రీశౌనకుడు సూతగోస్వామిని ప్రశ్నించెను: శ్రీశుకదేవగోస్వామి నివృత్తి మార్గమున చనుచు ఆత్మారాముడైనట్టివాడు ఏ కారణము చేత అతడు అట్టి విస్త్రుత శాస్త్ర అధ్యయనము చేపట్ఠెను?

7.10 (పదవ శ్లోకము)

సూత ఉవాచ

ఆత్మారామశ్చ మునయో నిర్గ్రన్థా అప్యురుక్రమే|

కుర్వన్త్య హైతుకీం భక్తిమిత్థంభూతగుణో హరిః॥

పలువిధములగు ఆత్మారాములు (ఆత్మయందే ఆనందముగొనవాడు) ముఖ్యముగా ఆత్మానూభవమార్గమున స్థితులైనట్టివారు సర్వవిధములైన భౌతిక బంధముల నుండి ముక్తినొందియున్నను దేవదేవడైన శ్రీకృష్ణునకు విశద్ధ భక్తియుత సేవను ఒనరింపగోరుదురు.  దీని భావమేమనగా ఆ దేవదేవుడు దివ్యగుణములను కలిగియుండును. కనుకనే అతడు ముక్తపురుషులతో సహా ప్రతియొక్కరిని ఆకర్షంపగలడు.

7.11 (పదకొండవ శ్లోకము)

హరేర్గుణాక్షిప్తమతిర్భగవాన్ బాదరాయణిః|

అధ్యగాన్మహదభ్యాసం నిత్యం విష్ణుజనప్రియః॥

శ్రీలవ్యాసదేవుని తనయుడైన శ్రీల శుకదేవగోస్వామి పరమశక్తిమంతుడే గాక విష్ణూజనులకు పరమప్రియుడైనట్టివాడు. ఈ విధముగా అతడు ఈ గొప్ప  అభ్యాసమును (శ్రీమద్భాగవతమును) అధ్యరనము గావించెను.

7.12 (పన్నెండవ శ్లోకము)

పరీక్షితోఽథ  రాజర్షేర్జన్మకర్మవిలాపనమ్|

సంస్థాం చ పాండుపుత్రాణాం వక్ష్యే కృష్ణకథోదయమ్॥

సూతగోస్వామి ఈ విధముగా శైనకుని అధ్యక్షతన గల ఋషులతో ఇట్లు పలికెను: శ్రీకష్ణభగవానుని దివ్యచరితమును రాజర్షియైన పరీక్షిన్మహారాజు యొక్క జన్మ కర్మ ముక్తి వృత్తాంతమును, పాండుతనయుల మహాప్రస్థానమును నేనిపుడు వర్ణించెదను.

7.13 (పదమూడవ శ్లోకము) 

యదా మృదే కౌరవసృంజయానాం వీరేష్వథో వీరగతిం గతేషు|

వృకోదరావిద్ధగదాభిమర్శభగ్నోరుదణ్డే ధృతరాష్ట్రపుత్రే॥
7.14 (పదునాలుగవ శ్లోకము)

భర్తుః ప్రియమ్ ద్రౌణిరితి స్మ పశ్యన్ కృష్ణాసుతానాం స్వపతాం శిరాంసి|

ఉపాహరద్విప్రియమేవ తస్య జుగుప్సితమ్ కర్మ నిగర్హయన్తి॥

కురుపాండవుల ఇరుపక్షములందలి వీరులు కురుక్షేత్రరణరంగమందు చంపబడి తమకు తగిన గమ్యస్థానములను పొందిరి. ధృతరాష్ట్రతనయుడు భీముని గదాఘాతములచే ఊరువులు  విరుగగొట్టబడి శోకతప్తుడై నేలపై పడియుండెను. ఆ సమయమున ద్రోణాచార్యుని తనయుడైన అశ్వత్థామ నిదురించుచున్న ద్రౌపది తనయుల శిరముల ఖండించి తన కార్యముచే అతడు ప్రియము నొందునని భావించి వాటిని తన ప్రభువునకు కానుకగా నొనగెను. కాని దుర్యోధనుడు ఆ హీనకార్యమును సమ్మతింపక కించిత్తు కూడా ఆనందమును పొందలేదు.

7.15 (పదిహేనవ శ్లోకము)

మాతా శిశూనాం నిధనం సుతానాం నిశమ్య ఘోరం పరితప్యమానా|

తదారుదద్భాష్పకలాకులాక్షీ తాం సాన్త్వయన్నాహ కిరీటమాలీ॥

పాండవుల ఐదుగురు సంతానమునకు తల్లియైన ద్రౌపది తన పుత్రుల సంహారమును గూర్చి విని బాధతో అశ్రుపూర్ణవదనయై ఏడ్వదొడగెను. జరిగిన తీవ్రమైన నష్టమునకు అర్జునుడు అంతట ఆమెను ఓదార్చుచు ఇట్లు పలికెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

15.1.2022 సాయం కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

ఏడవ అధ్యాయము

ద్రోణసుతుని  (అశ్వత్థామ) దండనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
7.16 (పదహారవ శ్లోకము)

తదా శుచస్తే ప్రమృజామి భద్రే యద్బ్రహ్మబన్ధోః శిర ఆతతాయినః|

గాణ్డీవముక్తైర్విశిఖైరుపాహరేత్వాక్రమ్యయత్స్నాస్యసి దగ్ధ పుత్రా॥

ఓ కళ్యాణీ! నా గాండీవ శరములతో ఆ బ్రాహ్మణుని శిరమును ఖండించి నీకు కానుకగా సమర్పించిన పిమ్మటయే నీ అశ్రువులను తుడిచి నిన్ను ఓదార్తును.  నీ పుత్రుల దేహములను దహనము కావించిన పిమ్మట నీవు అతని శిరముపై నిలిచి స్నానమాచరింపుము.

7.17 (పదిహేడవ శ్లోకము)

ఇతి ప్రియాం వల్గువిచిత్రజల్పైః స సాస్త్వయిత్వాచ్యుతమిత్రసూతః|

అన్వాద్రవద్దంశిత ఉగ్రధన్వాకపిధ్వజో గురుపుత్రం రథేన॥

మిత్రునిగాను, అచ్యుతునిచే మార్గదర్శనము గావింపబడు అర్జునుడు ఆ విధముగా మధుర వచనమూలతో తన ప్రియురాలైనట్టి ఆమెను ఊరడించెను. పిదప కవచమును ధరించి, ఉగ్రాయుధములను బూని, రథమునెక్కి గురుపుత్రుడైన అశ్వత్థామను వెంబడించెను.

7.18 (పద్దెనిమిదవ శ్లోకము)

తమాపతస్తం స విలక్ష్య దూరాత్ కుమారహోద్విగ్నమనా రథేన|

పరాద్రవత్ప్రాణపరీప్సురుర్వ్యామ్ యావద్గమం రుద్రభయాద్యథాకః॥

రాకుమారుల హంతకుడైన అశ్వత్థామ ఆ రీతి అర్జునుడు అతివేగముగా తనను జేరుటను దూరము నుండియే గాంచి, భయావిహ్వలుడై శివుని భయము వలన బ్రహ్మదేవుడు పరుగుదీసిన చందమున తస ప్రాణ రక్షణకై రథముపై పలాయనమయ్యెను.

7.19 (పందొమ్మిదవ శ్లోకము)

యదాశరణమాత్మానమైక్షత శ్రాన్తవాజినమ్|

అస్త్రం బ్రహ్మశిరో మేనే ఆత్మత్రాణం ద్విజాత్మజః॥

తన రథాశ్వములు అలసట చెందుటను గాంచిన బ్రాహ్మణ తనయుడు (అశ్వత్థామ) తన రక్షణమునకు బ్రహ్మాస్త్ర (అణ్వాయుధము) ప్రయోగము తప్ప వేరొక మార్గము లేదని భావించెను.

7.20 (ఇరవైయవ శ్లోకము)

అథో పస్పృశ్య సలిలం సన్దధే తత్సమాహితః|

అజానన్నపి సంహారం ప్రాణకృచ్ఛ్ర ఉపస్థితే॥

తన ప్రాణము ఆపదకు గురైనందున అతడు జలమును స్పృశించి ఉపసంహరించుటను ఎరుగకున్నను బ్రహ్మాస్త్రమును ప్రయోగించుటకై మంత్రోచ్ఛారణమున సమాహితుడయ్యెను.

7.21 (ఇరవై ఒకటవ శ్లోకం)

తతః ప్రాదుష్కృతం తేజః ప్రచండం సర్వతోదిశమ్|

ప్రాణ పదమభిప్రేక్ష్య విష్ణుం జిష్ణురువాచ హ॥

అంతట తేజోమయమైన కాంతి  సర్వదిక్కుల ప్రసరించెను. అత్యంత ప్రచండమైన ఆ వెలుగును గాంచిన అర్జునుడు తనకు ప్రాణాపాయము సంభవించినదని భావించి శ్రీకృష్ణభగవానునితో ఇట్లు పలికెను.

7.22 (ఇరవై రెండవ శ్లోకము)

అర్జున ఉవాచ

కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానామభయంకర|

త్వమేకో దహ్యమానానామ పవర్గోఽసి సంసృతేః॥

అర్జునుడు పలికెను: ఓ శ్రీకృష్ణా! నీవు దేవదేవుడవు! నీ వివిధ శక్తులు అనంతమైనవి. కనుక నీవే నీ భక్తుల హృదయములందు అభయత్వమును కలిగించుటలో సమర్థుడవై యున్నావు. భవాగ్నిచే పీడితులైనవారు కేవలము నీయందే ముక్తిమార్గమును గాంచగలరు.

7.23 (ఇరవై మూడవ శ్లోకము)

త్వమాద్యః పురుషః సాక్షాదీశ్వరః ప్రకృతే పరః|

మాయాం వ్యుదస్య చిచ్ఛ క్త్యా కైవల్యే స్థిత ఆత్మని॥

సమస్త విశ్వములందు వ్యాపించియున్నట్టి వాడవు. భౌతికశక్తికి పరుడవు అగు నీవు  ఆదిపురుషుడవు.  ఆధ్యాత్మికశక్తిచే భౌతికశక్తి ప్రభావములను నీవు దూరము కావించి యున్నావు. నీవు సదా  నిత్యానందము మరియు ఆధ్యాత్మిక జ్ఞానములందు స్థిరుడవై యుందువు.

7.24 (ఇరవై నాలుగవ శ్లోకం)

స ఏవ జీవలోకస్య మాయామోహిత చేతసః|

విధత్సే స్వేన వీర్యేణ శ్రేయో ధర్మాదిలక్షణమ్॥

నీవు భౌతికశక్తి పరిధికి పరుడవైనను బద్ధ జీవుల పరమశ్రేయస్సు కొరకై ధర్మాది చతుర్విధపురుషార్థములను కలిగింపజేయుచున్నావు.

7.25 (ఇరవై ఐదవ శ్లోకం)

తథాయం చావతారస్తే భువో భారజిహీర్షయా| 

స్వానాం చానన్య భావానామనుధ్యానాయ చాసకృత్॥

ఈ విధముగా నీవు భూభారమును తొలగించి స్వజనులకు, ముఖ్యముగా నీ ధ్యానముచే అనురక్తులైన నీ ఆంతరంగిక భక్తులకు శ్రేయమును గూర్చుటకు అవతరింతువు.

7.26 (ఇరవై ఆరవ శ్లోకం)

కిమిదం స్విత్కుతో వేతి దేవదేవ న వేద్మ్యహమ్|

సర్వతోముఖమాయాతి తేజః పరమదారుణమ్॥

ఓ దేవదేవా! ఈ భయంకరమైన  తేజస్సు ఏ విధముగా సర్వత్రా వ్యాపించి యున్నది? ఇది ఎచ్చట నుండి వచ్చుచున్నది? నేను ఈ విషయమును ఎరుగలేకున్నాను.

7.27 (ఇరవై ఏడవ శ్లోకము)

శ్రీభగవానువాచ

వేత్థేదం ద్రోణపుత్రస్య బ్రహ్మమన్త్రం ప్రదర్శితమ్|

నైవాసౌ వేద సంహారం ప్రాణబాధ ఉపస్థితే॥

శ్రీకృష్ణభగవానుడు పలికెను:  ఓ అర్జునా! ఇది ద్రోణతనయుని కార్యముగా నీ వెరుగుము. దాని తేజమును ఏవిధముగా ఉపసంహరించవలెనోఎరుగకున్నను అతడు బ్రహ్మాస్త్రమంత్రమును ప్రయోగించియున్నాడు. ఆసన్నమైన మృత్యువుచే భయపడినవాడై నిస్సహాయస్థితిలో అతడు దీనిని ఒనర్చెను. 

7.28 (ఇరవై ఎనిమిదవ శ్లోకం)

న హ్యస్యాస్యమతం కించిదస్త్రం ప్రత్యవకర్శనమ్|

బ్రహ్మాస్త్రతేజ ఉన్నద్ధమస్త్రజ్ఞొ హ్యస్త్రతేజసా॥

ఓ అర్జునా! వేరొక బ్రహ్మాస్త్రమే ఈ ఆయుధమును నివారింపగలదు. యుద్ధవిద్య యందు నిపుణుడవైనందున నీ అస్త్రతేజముతో ఈ అస్త్రతేజమును ఉపశమింపచేయుము.

7.29 (ఇరవై తొమ్మిదవ శ్లోకం)

సూత ఉవాచ

శ్రుత్వా భగవతా ప్రోక్తం ఫాల్గునః పరవీరహా|

స్పృష్ట్వాపస్తం పరిక్రమ్య బ్రాహ్మం బ్రాహ్మాస్త్రం సన్ద ధే॥
శ్రీసూతగోస్వామి పలికెను: శ్రీకృష్ణభగవానుని వచనముల నాకర్ణించిన అర్జునుడు అంతట జలమును స్పృశించి, ఆ దేవదేవునకు ప్రదక్షిణము గావించి అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రమును నివారించుటకు తన బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను.

7.30 (ముప్పయవ శ్లోకము)

సంహత్యాన్యోన్యముభాయోస్తేజసీ శరసంవృతే|

ఆవృత్య రోదసీ ఖం చ వవృధాతేఽర్కవహ్నివత్॥

రెండు బ్రహ్మాస్త్రముల తేజములు ఒకదానితో నొకటి కలిసినంతనే సూర్యబింబము వంటి గొప్ప అగ్నివలయము ఏర్పడి ఆకాశమును, రోదసిని కప్పివేసెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

16.1.2022 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

ఏడవ అధ్యాయము

ద్రోణసుతుని  (అశ్వత్థామ) దండనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
7.31 (మప్పై ఒకటవ శ్లోకము)

దృష్ట్వాస్త్ర తేజస్తు తయోస్త్రీల్లోకాన్ ప్రదహన్మహత్|

దహ్యమానాః ప్రజాః సర్వాః సాంవర్తకమమంసత॥

అస్త్రముల యొక్క  సంయుక్తమైన ఉష్ణముచే ముల్లోకజనులు తపించి పోయిర. ప్రళయసమయమున సంభవించెడి సాంవర్తకాగ్నిని అది సర్వులకు తలపింపజేసెను.

7.32 (ముప్పైరెండవ శ్లోకము)

ప్రజోపద్రవమాలక్ష్య లోకవ్యతికరం చ తమ్|

మతం చ వాసుదేవస్య సంజహారార్జునోద్వయమ్॥

ఆ విధంగా జనులకు సంభవించిన ఉపద్రవమును మరియు లోకములకు వాటిల్లిన నాశమును గమనించిన అర్జునుడు ఆ రెండు బ్రహ్మాస్త్రములను శీఘ్రముగా శ్రీకృష్ణభగవానుడు కోరిన రీతి ఉపసంహరించెను.

7.33 (ముప్పై మూడవ శ్లోకము)

తత ఆసాద్య తరసా దారుణం గౌతమీ సుతమ్|

బబంధామర్షతామ్రాక్షః పశుం రశనయా యథా॥

అంతట అర్జునుడు కోపముతో ఎర్రని తామ్రగోళముల వంటి నేత్రములు గలవాడై గౌతమీ సుతుని చాకచక్యముగా చే జిక్కుంచుకొని త్రాటితో పశువును బంధించినట్లు బంధించెను.

7.34 (ముప్పది నాలుగవ శ్లోకము)

శిబిరాయ నినీషన్తం రజ్జ్వాబద్ధ్వారిపుం బలాత్| 

ప్రాహర్జునం ప్రకుపితో భగవానంబుజేక్షణః॥

అశ్వత్థామను ఆ రీతిగా బంధించిన పిమ్మట అర్జునుడు అతనిని యుద్ధశిబిరమునకు గొనిపోవదలచెను. అంతట అంబుజేక్షణుడైన శ్రీకృష్ణభగవానుడు క్రుద్ధుడైన అర్జనునితో ఇట్లు పలికెను.

7.35 (ముప్పై ఐదవ శ్లోకము)

మైనం పార్థార్హసి త్రాతుం బ్రహ్మబన్ధుమిమం జహి|

యోఽసావనాగసః సుప్తానవధీన్నిశి బాలకాన్॥

శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ అర్జునా! నిద్రావస్థలోనున్న అమాయకులైన బాలురను సంహరించినందున ఈ బ్రాహ్మణబంధువుని కనికరముతో నీవు విడువరాదు.

7.36 (ముప్పైఆరవ శ్లోకం)

మత్త ప్రమత్తమున్మత్తం సుప్తం బాలం స్త్రియం జడమ్|

ప్రపన్నం విరథం భీతం న రిపుం హన్తి ధర్మవిత్॥

ధర్మవిషయముల నెరిగినవాడు  అప్రమత్తముగా లేనివానిని, మత్తులోనున్న వానిని, పిచ్టివానిని, నిదురించినవానిని, భీతుడైనవానిని, రథహీనుని ఎన్నడును వధింపడు.

7.37 (ముప్పైఏడవ శ్లోకం) 

స్వప్రాణాన్ యః పరప్రాణైః ప్రపుష్ణాత్యఘృణః ఖలః|

తద్వధస్తస్య హి శ్రేయో యద్దోషాద్యాత్యధః పుమాన్॥

పరుల ప్రాణమును పణముగా పెట్టి తన జీవితమును పోషించుకొనునట్టి క్రూరుడు, దుర్మార్గుడైనట్టివాడు తన నిజశ్రేయము కొరకు నిక్కముగా వధార్హుడు.

7.38 (ముప్పై ఎనిమిదవ శ్లోకం)

ప్రతిశ్రుతం చ భవతా పాంచాల్యై శృణత్వో మమ|

ఆహరిష్యే శిరస్తస్య యస్తే మానిని పుత్రహా॥

పైగా తన పుత్రుల హంతకుని శిరమును దెచ్చి అర్పింతునని ద్రౌపదికి నీవు చేసిన వాగ్దానమును నేను ప్రత్యక్షముగా వినియుంటిని.

7.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకం)

తదసౌ వధ్యతాం పాప ఆతతాయ్యాత్మ బన్ధుహా|

భర్తుశ్చ విప్రియం వీర కృతవాన్ కులపాంసనః॥

ఇతడు ఘాతకుడు మరియు నీ స్వజన హంతకుడే గాక తన ప్రభువునకు కూడా అసంతృప్తి కలిగించినట్టివాడు. కులపాంసుడైన ఇతనిని శీఘ్రమే వధించి వేయుము.

7.40 (నలుబదవ శ్లోకము)

సూత ఉవాచ

ఏవం పరీక్షతా ధర్మం పార్థః కృష్ణేన చోదితః|

నైచ్ఛద్ధన్తుం గురుసుతం యద్యప్యాత్మహనం మహాన్॥

సూతగోస్వామి పలికెను: అర్జునుని ధర్మనిష్ఠను పరీక్షించుచున్న శ్రీకృష్ణుడు ద్రోణాచార్య సుతుని సంహరింపుమని ప్రోత్సహించినను మహాత్ముడైన అర్జునుడు తన స్వజన హంతకుడైన అశ్వత్థామను వధింపవలెననెడి భావనను ఇష్టపడలేదు.

7.41 (నలబై ఒకటవ శ్లోకము)

అథోపేత్య స్వశిబిరం గోవిన్దప్రియ సారథిః|

న్య వేదయుత్తం ప్రియాయై శోచన్త్యా ఆత్మజాన్ హతాన్॥

అర్జునుడు తన స్నేహితుడును, సారథి అగు శ్రీకృష్ణని గూడి తన శిబిరమును చేరిన పిమ్మట హతపుత్రులకై శోకించుచున్న ద్రౌపదికి హంతకుని అప్పగించెను.

7.42 (నలబై రెండవ శ్లోకము)

తథాహృతం పశువత్ పాశబద్ధమవాఙ్ముఖం కర్మజుగుప్సితేన|

నిరీక్ష్య కృష్ణాపకృతం గురోః సుతం వామస్వభావా కృపయా ననామ చ॥

సూతగోస్వామి పలికెను: అంతట పశువు వలె త్రాళ్ళతో కట్టివేయబడి తీవ్రమగు అపకీర్తికర హత్యాకార్యము నొనరించిన కారణముగా మౌనమును దాల్చియున్న అశ్వత్థామను ద్రౌపది గాంచెను. చక్కని నడవడిక సహజముగా మంచితనమును కలిగిన ఆమె తన స్త్రీ స్వభావముతో బ్రాహ్మణుడనెడి భావనలో అతనికి నమస్సులర్పించెను.

7.43 (నలబై మూడవ శ్లోకము)

ఉవాచ చాసహన్త్యస్య బన్ధనానయనం సతీ|

ముచ్యతాం ముచ్యతామేష బ్రాహ్మణో నితరాం గురుః॥

అశ్వత్థామ ఆ విధముగా త్రాళ్ళతో బంధింపబడియుండుటను ఆమె నిగ్రహించుకోలేకపోయెను. సాధ్వియైన ఆమె వెంటనే "మన గురువైన బ్రాహ్మణుడు కావున ఇతనిని విడుదల చేయుడు" అని పలికెను.

7.44 (నలబై నాల్గవ శ్లోకము)

నరహస్యో ధనుర్వేదః సవిసర్గోపసంయమః|

అస్త్రగ్రామశ్చ భవతా శిక్షితో యదనుగ్రహాత్॥

ద్రోణాచార్యుని కరుణ చేతనే మీరు ధనుర్విద్యను, పరమగోప్యమైనటువంటి అస్త్ర ఉపసంహారవిద్యను నేర్చియున్నారు.

7.45 (నలబై ఐదవ శ్లోకము)

స ఏష భగవాన్ ద్రోణః ప్రజారూపేణ వర్తతే|

తస్యాత్మనోఽర్థం పత్న్యాస్తే నాన్వగాద్వీరసూః కృపీ॥

అతడు (ద్రోణాచార్యుడు) ఇంకను తన పుత్రుని రూపమున నిలిచియే ఉన్నాడు. పుత్రుని కలిగియున్న కారణముగా అతని భార్యయైన కృపి సహగమనమూ చేయలేదు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

16.1.2022 సాయం కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

ఏడవ అధ్యాయము

ద్రోణసుతుని  (అశ్వత్థామ) దండనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
7.46 (నలబై ఆరవ శ్లోకము)

తద్ ధర్మజ్ఞ మహాభాగ భవద్భిర్గౌరవం కులమ్|

వృజినం నార్హతి ప్రాప్తుం పూజ్యం వంద్యమభీక్ ష్ణశః॥
ఓ ధర్మజ్ఞుడైన మహాభాగా! సదా పూజ్యులును వంద్యులును అగు గౌరవకుటుంబం వారికి దుఃఖములను కలిగించుట నీకు తగదు.  

7.47 (నలబై ఏడవ శ్లోకము)

మా రోదీదస్య జననీ గౌతమీ పతిదేవతా|

యథాహం మృతవత్సార్తా రోదిమ్యశ్రుముఖీ ముహుః॥

ఓ నాథా! నా వలెనే ద్రోణాచార్యుని భార్య కూడా దుఃఖించునట్లు చేయకుము. పుత్రుల మరణముతో నేను మిగుల దుఃఖితనై యున్నాను. నా వలెనే ఆమెయు నిరంతరము దుఃఖించరాదు.

7.48 (నలబై ఎనిమిదవ శ్లోకం)

యైః కోపితం బ్రహ్మకీలం రాజన్యైరజితాత్మభిః|

తత్కులం ప్రదహత్యాశు సానుబంధం శుచార్పితమ్॥

ఇంద్రియనిగ్రహము లేనివారై రాజవంశమువారు బ్రాహ్మణకులము నెడ అపరాధము గావించి వారికి క్రోధమును కలిగించినచో, అట్టి క్రోధాగ్ని రాచవంశము నంతటినీ భస్మీపటలము గావించి సర్వులకు దుఃఖమును కలుగ జేయగలదు.

7.49 (నలబై తొమ్మిదవ శ్లోకం)

సూత ఉవాచ

ధర్మ్యం న్యాయ్యం సకరుణం నిర్వ్యలీకం సమం మహత్ |

రాజా ధర్మసుతో రాజ్ఞ్యాః ప్రత్యనన్దద్వచో ద్విజః॥

సూతగోస్వామి పలికెను: ఓ బ్రాహ్మణులారా! ధర్మసిద్ధాంతములకు అనుగుణముగా ఉండి న్యాయములును, శ్లాఘనీయములును, దయాపూర్ణములును, సమత్వపూర్ణములును, కపటరహితములును అయిన ద్రౌపది వచనములను ధర్మరాజు సంపూర్ణముగా బలపరచెను.

7.50 (ఏబయ్యవ శ్లోకము)

నకులః సహదేవశ్చ యుయుధానో దనంజయః|

భగవాన్ దేవకీపుత్రో యే చాన్యే యాశ్చ యోషితః॥

నకుల సహదేవులు (ధర్మరాజు కనిష్ఠసోదరులు), సాత్యకి, అర్జునుడు, దేవదేవుడైన శ్రీకృష్ణుడు, స్త్రీలు మరియు ఇతరులందరును ధర్మరాజుతో సంపూర్ణముగా ఏకీభవించిరి.

7.51 (ఏబై ఒకటవ శ్లోకము)

తత్రాహామహర్షితో భీమస్తస్య శ్రేయాన్ వధః స్మృతః|

న భర్తుర్నాత్మనశ్చార్థే యోఽహన్ సుస్తాన్ శిశూన్ వృథా॥

కాని భీముడు మాత్రము వారితో ఏకీభవింపక నిదురించుచున్న బాలురను క్రొధముతో తనకుగాని, తన ప్రభువునకు గాని ఎటువంటి ప్రయోజనము లేకనే వధించినటువంటి ఆ నేరస్థుని సంహారమునే బలపరచెను.

7.52 (ఏబై రెండవ శ్లోకము)

నిశమ్య భీమగదితం ద్రౌపద్యాశ్చ చతుర్భుజః|

ఆలోక్య వదనం సఖ్యురిదమాహ హసన్నిప॥

భీముడు, ద్రౌపది మరియు ఇతరుల వచనములను ఆలకించిన పిమ్మట చతుర్భుజుడైన శ్రీకృష్ణభగవానుడు తన ప్రియమిత్రుడైన అర్జునుని గాంచి మందహాసము చేయుచున్నవానివలె ఇట్లు పలికెను.

7.53 (ఏబై మూడవ శ్లోకం)

శ్రీభగవానువాచ

బ్రహ్మబన్ధుర్న హస్తవ్య ఆతతాయీ వధార్హణః|

మయైవోభయమామ్నాతం పరిపాహ్యనుశాసనమ్॥

7.54 (ఏబై నాలుగవ శ్లోకము)

కురు ప్రతిశ్రుతం సత్యం యత్తత్సాన్త్వయతా ప్రియామ్|

ప్రియం చ భీమసేనస్య పాంచాల్యా మహ్యమేవ చ॥
శ్రీకృష్ణభగవానుడు పలికెను: బ్రాహ్మణబంధువైనవాడు వధార్హుడు కాడు. కాని అతడు పాపియైనచో నిక్కముగా వధార్హూడు. శాస్త్రములలో తెలుపబడిన ఈ నియమముల ననుసరించియే నీవు వర్తింపవలసియున్నది. నీ భార్యకు ఒసగిన వచనమును పూర్ణమొనర్చుటయే గాక భీమసేనునకు, నాకును సంతృప్తి కలుగు రీతిలో నీవు వర్తింపుము. 

7.55 (ఏబై ఐదవ శ్లోకము)

సూత ఉవాచ

అర్జునః సహసాజ్ఞాయ హరేర్హా ర్దమథాసినా|

మణిం జహార మూర్ధన్యం ద్విజస్య సహమూర్ధజమ్॥

శ్రీకృష్ణభగవానుని అనేకార్థ సహితమైన వచనముల ద్వారా ఆ దేవదేవుని అంతరార్థమును గ్రహించిన అర్జునుడు అంతట తన ఖడ్గముతో అశ్వత్థామ శిరముపైని కేశములను మరియు మణిని తొలగించివేసెను.  

7.56 (ఏబై ఆరవ శ్లోకము)

విముచ్య రశనాబద్ధం బాలహత్యా హతప్రభమ్|

తేజసా మణినా హీనం శిబిరాన్నిరయాపయత్॥

శిశుహత్యచే ఇదివరకే దేహకాంతిని కోల్పోయిన అతడు (అశ్వత్థామ) తన శిరము నుండి మణి తొలగింపబడినంతట మరింతగా తేజోహీనుడయ్యెను. ఆ విధముగా అతడు బంధములు తొలగింపబడినవాడై శిబిరము నుండి తరిమివేయబడెను.

7.57 (ఏబై ఏడవ శ్లోకము)

వ పనం ద్రవిణాదానం స్థానాన్నిర్యాపణం తథా|

ఏవ హి బ్రహ్మ బన్ధూనాం వధో నాన్యోఽస్థి దైహికః॥

శిరోజములను తొలగించుట, ధనమును లాగుకొనుట,గృహము నుండి వెడలు గొట్టుట యనునవి బ్రాహ్మణ బంధువైన వానికి నిర్దేశితములైన శిక్షలు. అతనిని వధించుటకు ఆదేశము లేదు.

7.58 (ఏబై ఎనిమిదవ శ్లోకము)

పుత్రశోకాతురాః సర్వే పాండవాః సహ కృష్ణయా|

స్వానాం మృతానాం యత్కృత్యం చక్రుర్నిర్హరణాదికమ్॥

అటుపిమ్మట పాండురాజు తనయులు, ద్రౌపది శోకతప్తులై తమ బంధువుల మృతదేహములకు తగిన ఉత్తర క్రియల నాచరించిరి.

శ్రీమద్భాగవతమునందలి "ద్రోణసుతుని  (అశ్వత్థామ) దండనము" అను ప్రథమస్కంధము లోని ఏడవ అధ్యాయము  సంపూర్ణము

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


: 17.1.2022 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం
ఎనిమిదవ అధ్యాయము
కుంతేదేవి ప్రార్థనలు మరియు పరీక్షిత్తు రక్షణము

ఓం నమో భగవతే వాసుదేవాయ
8.1 (ప్రథమ శ్లోకము)

సూత ఉవాచ

అథ తే సంపరేతానాం స్వానాముదకమిచ్ఛతామ్|

దాతుం సకృష్ణా గంగాయాం పురస్కృత్య యయుః స్త్రియః॥271॥

సూతగోస్వామి పలికెను: తదుపరి మృత్యువును గోరి మృతులైనట్టి బంధువులకు పాండవులు జలతర్పణముల నొసగగోరినవారై ద్రౌపదిని గూడి స్త్రీలను ముందిడుకొని గంగానదికి చనిరి.

8.2 (రెండవ శ్లోకము)

తే నినీయోదకం సర్వే విలప్య చ భృశం పుసః|

ఆప్లుతా హరిపాదాబ్జరజఃపూత సరిజ్జలే॥272॥

మృతబంధువుల కొరకై  శోకించిన పిమ్మట తగినరీతి తర్పణముల నొసగి హరిపద్మధూళిచే మిళితమై పవిత్రమైనటువంటి  గంగాజలమున వారు స్నానమాడిరి. 

8.3 (ఎనిమిదవ శ్లోకము)

తత్రాసీనం కురుపతిం ధృతరాష్ట్రం సహానుజమ్|

గాన్ధారీం పుత్రశోకార్తాం పృథాం కృష్ణాం చ మాధవః॥273॥

పిమ్మట శోకతప్తులై తన సోదరులను, ధృతరాష్టృని, గాంధారిని, కుంతీదేవిని, ద్రౌపదిని గూడి కురుపతియైన ధర్మరాజు అచ్చట కూర్చుండెను. శ్రీకృష్ణభగవానుడును అచట నిలిచియుండెను.

8.4 (నాలుగవ శ్లోకము)

సాన్త్వయామాస మునిభిర్హతబన్ధూన్ శుచార్పితాన్|

భూతేషు కాలస్య గతిం దర్శయన్న ప్రతిక్రియామ్॥274

భగవానుని కఠిననియమములను, జీవులపై వాటి ప్రభావమును ఉదహరించుచు శ్రీకృష్ణభగవానుడు, మునుల నిశ్చేష్టులును, ప్రభావితులును అయిన వారిని ఓదార్చ యత్నించిరి.

8.5 (ఐదవ శ్లోకము)

సాదయిత్వాజాతశత్రోః స్వమ్ రాజ్యం కితవైర్హృతమ్|

ఘాతయిత్వాసతో రాజ్ఞః కచస్పర్శక్షతాయుషః॥275॥

అజాతశత్రువైన ధర్మరాజు యొక్క రాజ్యమును తెలివిగల దుర్యోధనుడు, అతని పక్షమువారు కుట్రతో అపహరించిరి. అయినను శ్రీకృష్ణభగవానుని కరుణచే పాండవుల రాజ్యము తిరిగి వారికి లభించుటయే గాక దుర్యోధనుని పక్షమున జేరిన దుర్మార్గులైన రాజులందరును ఆ దేవదేవునిచే సంహరింపబడిరి. ద్రౌపది శిరోజములను పట్టి లాగిన కారణముగా ఆయువు క్షీణించుట చేత ఇతరులును మరణించిరి. 

8.6 (ఆరవ శ్లోకము)

యాజయిత్వాశ్వమేధైస్తం త్రిభిరుత్తమకల్పకైః|

తద్యశః పావనం దిక్షు శతమన్యోరివాతనోత్॥276॥

శ్రీకృష్ణుడు ధర్మరాజుచే మూడు ఉత్తమములైన అశ్వమేధయజ్ఞములను నిర్వర్తింపజేసి, శతాశ్వమేధ యజ్ఞములను గావించిన ఇంద్రుని యశస్సువలె అతని యశస్సును సర్వదిక్కుల యందును వ్యాఫింపజేసెను.

8.7 (ఏడవ శ్లోకము)

ఆమన్త్ర్య పాండుపుత్రాంశ్చ శైనేయోద్ధవసంయుతః|

ద్యైపాయనాదిభిర్విప్రైః పూజితైః ప్రతిపూజితః॥277॥

అటుపిమ్మట శ్రీకృష్ణుడు తన తిరుగు ప్రయాణమునకు సంసిద్ధుడయ్యెను.  శ్రీల వ్యాసదేవుని అధ్యక్షతన గల బ్రాహ్మణులతో పూజలనందిన పిమ్మట అతడు ఫాండవులను ఆమంత్రించెసు. అలాగుననే తనను అభినందించిన వారలకు తిరిగి తన అభినందనలను తెలియజేసెను.

8.8 (ఎనిమిదవ శ్లోకము)

గన్తుం కృతమతిర్బ్రహ్మన్ ద్వారకాం రథమాస్థితః| 

ఉపలేఖేఽభిధావన్తీముత్తరాం భయవిహ్వలామ్॥278॥

ఆవిధముగా ద్వారకకు పయనమవగోరి రథమునందు ఆసీనుడైనంతనే భయవిహ్వలతతో ఉత్తర తన వైపునకు పరుగులతో అరుదెంచుటను శ్రీకృష్ణభగవానుడు గాంచెను.

8.9 (తొమ్మిదవ శ్లోకము)

ఉత్తరోవాచ

పాహి పాహి మహాయోగిన్దేవదేవ జగత్పతే|

నాన్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యుః పరస్పరమ్॥279॥

ఉత్తర పలికెను: ఓ దేవదేవ! జగన్నాథా! మహాయోగీ! దయచేసి నాకు రక్షణమును గూర్చుము. ద్వంద్వపూర్ణమైన ఈ జగమున నీవు తప్ప ఇతరులెవ్వరును నన్ను మృత్యువు నుండి రక్షించలేరు.


8.10 (పదవ శ్లోకం)

అభిద్రవతి మామీశ శరస్తప్తాయసో విభో|

కిమం దహతు మాం నాథ మా మే గర్భో నిపాత్యతామ్॥280॥

హే ప్రభూ! నీవు సర్వశక్తి సంపన్నుడవు! అగ్నిమయమైన  లోహపు బాణమొకటి నా చెంతకు వేగముగా అరుదెంచుచున్నది. ఓ దేవా! నీవు కోరినచో అది నన్ను దహించినను సరియే. కాని అది నా గర్భమును దహించి నాశనము చేయునట్లుగా మాత్రము చేయకుము. ఓ నాథా! దయచేసి నా యెడ ఈ అనుగ్రహమును జూపుము.


8.11 (పదకొండవ శ్లోకము)

సూత ఉవాచ

ఉపధార్య వచస్తస్యా భగవాన్ భక్తవత్సలః|

అపాండవమిదం కర్తుం ద్రౌణేరస్త్రమబుధ్యత॥281॥

సూతగోస్వామి పలికెను: ఉత్తర పలుకులను సావధానముగా ఆలకించిన భక్తవత్సలుడైన శ్రీకృష్ణభగవానుడు ద్రోణాచార్యుని తనయుడైన అశ్వత్థామ పాండవవంశము నందలి చివరివానిని నశింపజేయుటకై బ్రహ్మాస్త్రమును ప్రయోగించెనని శీఘ్రమే అవగతము ఛేసికొనెను.

8.12 (పన్నెండవ శ్లోకము)

తర్హ్యేనాథ మునిశ్రేష్ఠ పాండవాః పంచ సాయకాన్|
ఆత్మనోఽభిముఖాన్దీప్తానాలక్ష్యా స్త్రాణ్యుపాదదుః॥282॥

ఓ ముని శ్రేష్ఠా! (శౌనకా)! మండుచున్న బ్రహ్మాస్త్రము అతివేగముగా తమవైపునకే అరుదెంచుటను గాంచిన పాండవులు వెంటనే తమ ఐదు ఆయుధములను చేపట్టిరి.

8.13 (పదమూడవ శ్లోకము)

వ్యసనం వీక్ష్య తత్తేషామనన్యవిషయాత్మనామ్|

సుదర్శనేన స్వాస్త్రేణ స్వానాం రక్షాం వ్యధాద్విభుః॥283॥

సంపూర్ణ శరణాగతులైన తన శుద్ధభక్తులకు ఘోరమైన ఆపద వాటిల్లుటను గాంచిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు వారిని రక్షించుట కొరకై శీఘ్రమే తన సుదర్శనచక్రమును ధరించెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

17.1.2022 సాయం కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

ఎనిమిదవ అధ్యాయము

కుంతేదేవి ప్రార్థనలు మరియు పరీక్షిత్తు రక్షణము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
8.14 (పదునాలుగవ శ్లోకము)

అన్తఃస్ఠః సర్వభూతానామాత్మా యోగేశ్వరో హరిః|

స్వమాయయావృణోద్గర్భం వైరాట్యాః కురుతన్తవే॥284॥

ప్రతివారి హృదయమునందును పరమాత్మ రూపమున వసించియుండు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు కురువంశాంకురమును రక్షించుట కొరకు తన యోగమాయచే ఉత్తర గర్భమును కప్పివేసెను.

8.15 (పదిహేనవ శ్లోకం)

యద్యప్యస్త్రం బ్రహ్మశిరస్త్వమోఘం చాప్రతిక్రియమ్|

వైష్ణవం తేజ అసాధ్య సమశామ్యద్భృగూద్వహ॥285॥

ఓ శౌనకా! అశ్వత్థామ ప్రయోగించిన దివ్యమగు బ్రహ్మాస్త్రము అమోఘము, అనివార్యము నైనప్పటికిని విష్ణు (శ్రీకృష్ణుని) తేజముచే ఎదిరింపబడినప్పుడు నిరర్థకమై భంగపడెను.

8.16 (పదహారవ శ్లోకమ)

మా మంస్థా హ్యేతదాశ్చర్యం సర్వాశ్ఛర్యమయేఽచ్యుతే|

య ఇదం మాయయా దేవ్యా సృజత్యవతి హస్త్యజః॥286॥

ఓ బ్రాహ్మణులారా! ఆశ్చర్యమయుడును, అచ్యుతుడును అగు శ్రీకృష్ణభగవానుని కర్మలలో ఇది పరమాశ్చర్యకరమైనదని ప్రత్యేకముగా భావింపనవసరము లేదు. తాను అజుడైనను ఆ దేవదేవుడు తన దివ్యశక్తిద్వారా సమస్త భౌతికజగత్తును పోషించుచు లయింపజేయును.

8.17 (పదిహేడవ శ్లోకము)

బ్రహ్మతేజోవినిర్ముక్తైరాత్మజైః సహ కృష్ణయా|

ప్రయాణాభిముఖం కృష్ణమిదమాహ పృథా సతీ॥287॥

ఆ విధముగా బ్రహ్మాస్త్రతేజము నుండి రక్షింపబడిన పిమ్మట తన ఐదుగురు పుత్రులను, ద్రౌపదిని గూడి పరమ భక్తురాలైన కుంతీదేవి స్వీయ నగరమున  కేగుటకు సిద్ధపడిన శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను.

8.18 (పద్దెనిమిదవ శ్లోకము)

కున్త్యువాచ

నమస్యే పురుషం త్వాద్యమీశ్వరం ప్రకృతేః పరమ్|

అలక్ష్య సర్వభూతానామన్తర్బహిరవస్థితమ్॥288॥

శ్రీమతి కుంతీదేవి పలికెను: ఓ కృష్ణా! ఆది పురుషుడవు, భౌతికజగత్తు గుణములకు పరమైనవాడవు అగు నీకు  వందనముల నర్పించుచున్నాను. సమస్తము యొక్క బాహ్యాంతరములందు నిలిచియున్నను నీవు సర్వులకు అగోచరుడవై యున్నావు.

8.19 (పందొమ్మిదవ శ్లోకము)

మాయాజవకాచ్ఛన్నమజ్జాధోక్షజమవ్యయమ్|

న లక్ష్య సే మూడదృశా నటో నాట్యధరో యథా॥289॥

పరిమిత ఇంద్రియజ్ఞానమునకు పరుడవైనందున నీవు యోగమాయా తెరచే కప్పబడియుండెడి అవ్యయతత్త్వమై యున్నావు. వేషధారియైన నటుడు గుర్తింపబడని చందమున నీవు మూఢునకు గోచరింపకున్నావు.

8.20 (ఇరవైయవ శ్లోకము)

తథా పరమహంసానాం మునీనామమలాత్మ నామ్|

భక్తియోగవిధానార్థం కథం పశ్యేమ హి స్త్రియ॥290॥

ఆత్మానాత్మ వివేచన ద్వారా పవిత్రాత్ములైన పరమహంసలకు, మునులకు దివ్యమగు భక్తియుతసేవను  తెలియజేయుటకే నీవు అవతరింతువు. అట్టి యెడ స్త్రీలమైన మేము నిన్నెట్లు సంపూర్ణముగా తెలిసికొనగలము?

8.21 (ఇరవై ఒకటవ శ్లోకము)

కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ|

నందగోపకుమారాయ గోవిన్దాయ నమో నమః॥291॥

వసుదేవునకు తనయుడైనవాడును, దేవకీదేవికి ఆనందకారకుడైనవాడును, బృందావనము నందలి వ్రజావాసులకు బాలుడైనవాడును, గోవులను ఇంద్రియములను రంజింపజేయు వాడును అగు భగవానునకు గౌరవపూర్వక వందనముల నర్పించుచున్నాను.

8.22 (ఇరవై రెండవ శ్లోకము)

నమః పంకజనాభాయ నమః పంకజమాలినే|

నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే॥292॥

హే ప్రభూ! పద్మనాభుడవు, సదా పద్మమాలచే అలంకృతునిగా నుండెడివాడవు, పద్మములవంటి చల్లని చూడ్కులు కలవాడవు, పద్మ చిహ్నితములగు పాదములు గలవాడవు నగు నీకు హృదయ పూర్వక వందనముల నర్పించుచున్నాను.

8.23 (ఇరవై మూడవ శ్లోకము)

యథా హృషీకేశ ఖలేన దేవకీ కంసేన రుద్ధాతిచిరంశుచార్పితా|

విమోచితాహం చ సహాత్మజా విభో త్వ యైవ నాథేన ముహుర్విపద్గణాత్॥293॥

ఓ హృషీకేశా! దేవదేవా! క్రూరుడైన కంసునిచే చిరకాలము బంధింపబడి కష్టములకు గురిచేయబడిన నీ తల్లి దేవకీదేవిని నీవు విముక్తురాలను చేసితివి. అదే విధముగ నన్ను, నా తనయులను పలు విపత్తులనుండి రక్షించితివి. 

8.24 (ఇరవై నాలుగవ శ్లోకము)

విషాన్న హాగ్నేః పురుషాదదర్శనాదసత్సభాయా వనవాస కృచ్ఛ్రతః|

మృధే మృధేఽనేకమహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రతశ్చాస్మ హరేఽభిరక్షితాః॥294॥

ఓ శ్రీకృష్ణా! విషాహారము నుండి, మహాగ్ని నుండి, నరమాంస భక్షకులనుండి,  దుష్ట సభాగృహము నుండి, అరణ్యవాసపు క్లేశముల నుండి, పలువురు మహారథులు పాల్గొనిన కురుక్షేత్రరణము నుండి మమ్ము రక్షించితివి. అదే విధమగా ఇప్పుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము నుండి మమ్ము కాపాడితివి.

8.25 (ఇరవై ఐదవ శ్లోకము)

విపదః సన్తు తాః శశ్వత్తత్ర తత్ర జగద్గురో|

భవతో దర్శనం యత్స్యాదపునర్భవదర్శనమ్॥295॥

మరల మరల నీ దర్శనం కలుగునట్లుగా ఆ విపత్తులన్నియును మరల మరల కలుగవలెనని నేను కోరుకొనుచున్నాను.  ఏలయన నీ దర్శన మనగా నిరంతర జన్మమృత్యువుల దర్శనము మాకిక కలుగదనియే భావము.

8.26 (ఇరవైయారవ శ్లోకము)

జన్మైశ్వర్యశ్రుత శ్రీభిరేధమానమదః పుమాన్|
నైవార్హత్యభిధాతుం వై త్వామకించనగోచరమ్॥296॥

హే ప్రభూ! అకించనులైనవారిచే  నీవు సులభముగా పొందబడువాడవు. ఉన్నతజన్మము, ఐశ్యర్యము, విద్య, దేహసౌందర్యములను వృద్ధి గావించకొన యత్నించుచు భౌతికపురోగతి మార్గమున చనువాడు మనఃపూర్వకముగా నీ దరి చేరలేడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


[03:44, 18/01/2022] +91 95058 13235: 18.1.2022 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

ఎనిమిదవ అధ్యాయము

కుంతేదేవి ప్రార్థనలు మరియు పరీక్షిత్తు రక్షణము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
8.27 (ఇరవై ఏడవ శ్లోకమీ)

నమోఽకించనవిత్తాయ నివృత్తగుణవృత్తయే|

ఆత్మారామాయ శాన్తాయ కైవల్య పతయే నమః॥297॥

అకించనులైనవారికి పరమధనమైనటువంటి నీకు వందనముల నర్పించు చున్నాను. ప్రకృతి గుణవృత్తులకు నీవు పరమైనవాడవు. ఆత్మారాముడవైన కారణమున  నీవు శాంతుడవు, అద్వైతులకు ప్రభువువై యున్నావు.

8.28 (ఇరవై ఎనిమిదవ శ్లోకము)

మన్యే త్వాం కాలమీశానమనాదినిధనం విభుమ్|

సమం చరన్తం సర్వత్ర భూతానాం యన్మిథః కలిః॥298॥

హే ప్రభూ! నిన్ను నేను అనంతమైన కాలముగను, దివ్యనియామకునిగను, ఆద్యంతములు లేనివానిగను, సర్వవ్యాపిగను భావించుచున్నాను. నీ కరుణను పంచుటలో నీవు నిష్పక్షపాతుడవై యున్నావు. జీవుల నడుమ ఈ వైషమ్యములు…
[
*****

18.1.2022 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

ఎనిమిదవ అధ్యాయము

కుంతేదేవి ప్రార్థనలు మరియు పరీక్షిత్తు రక్షణము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
8.27 (ఇరవై ఏడవ శ్లోకమీ)

నమోఽకించనవిత్తాయ నివృత్తగుణవృత్తయే|

ఆత్మారామాయ శాన్తాయ కైవల్య పతయే నమః॥297॥

అకించనులైనవారికి పరమధనమైనటువంటి నీకు వందనముల నర్పించు చున్నాను. ప్రకృతి గుణవృత్తులకు నీవు పరమైనవాడవు. ఆత్మారాముడవైన కారణమున  నీవు శాంతుడవు, అద్వైతులకు ప్రభువువై యున్నావు.

8.28 (ఇరవై ఎనిమిదవ శ్లోకము)

మన్యే త్వాం కాలమీశానమనాదినిధనం విభుమ్|

సమం చరన్తం సర్వత్ర భూతానాం యన్మిథః కలిః॥298॥

హే ప్రభూ! నిన్ను నేను అనంతమైన కాలముగను, దివ్యనియామకునిగను, ఆద్యంతములు లేనివానిగను, సర్వవ్యాపిగను భావించుచున్నాను. నీ కరుణను పంచుటలో నీవు నిష్పక్షపాతుడవై యున్నావు. జీవుల నడుమ ఈ వైషమ్యములు వార పరస్పర సింగత్యము చేతనే కలుగుచున్నవి.

8.29 (ఇరవై తోమ్మిదవ శ్లోకము)

న వేద కశ్చిద్భగవంశ్చికీర్తితం తవేహమానస్య నృణాం విడంబనమ్|

న యస్య కశ్చిద్దయితోఽస్తి కర్హిచిద్ ద్వేష్యశ్చ యస్మిన్ విషమా మతిర్నృణామ్॥299॥

హే ప్రభూ! సామాన్యమానవుని కర్మల వలె గోచరించుచు భ్రమను కలిగించు నీ దివ్యలీలలను ఎవ్వరును అవగతము చేసికొనజాలరు.  ప్రత్యేకానుగ్రహపాత్రుడు గాని లేదా ద్వేషింపదగినవాడుకాని నీ కెవ్వడును లేడు. కేవలము జనులే నిన్ను పక్షపాతిగా భావించుచుందురు.

8.30 (ముప్పదవ శ్లోకము)

జన్మ కర్మ చ విశ్వాత్మన్నజస్యాకర్తురాత్మనః |

తిర్యజ్ నృషిమ యాదఃసు తదత్యన్తవిడంబనమ్॥300॥

ఓ విశ్వాత్మా! నీవు అకర్తుడవైనను కర్మ నొనరించుట, పరమాత్మవు, అజడవైనను జన్మనొందుట యనునవి విడంబనమాత్రములై యున్నవి. జంతువులు, నరులు, ఋషులు, జలచరరూపములలో నీవు స్వయముగా అవతరించుచుందువు. ఇది నిక్కముగా సంభ్రమ పూర్ణమై యున్నది.

8.31 (ముప్పైఒకటవ శ్లోకము)

గోప్యాదదే త్వయి కృతాగసి దామ తావద్ యా తే దశాశృకలిలాంజనసంభ్రమాక్షమ్|

వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య సా మాం విమోహయతి భీరపి యద్భిభేతి॥301॥

ఓ కృష్ణా! నీవొక తప్పు చేసినప్పుడు నిన్ను బంధించుటకై యశోద ఒక త్రాటిని గైకొనెను. అంతట భయభీతములైన నీ కన్నుల నుండి నీరు కారి కంటికాటుక చెదరిపోయినది. ఆ విధముగా భయమునకే భయము కలిగించు నీవు భీతుడవైతివి. ఆ దృశ్యము నన్ను మోహమునకు గురిచేయుచున్నది.

8.32 (ముప్పై రెండవ శ్లోకము)

కేచిదాహురజం జాతం పుణ్యశ్లోకస్య కీర్తయే|

యదోః ప్రియస్యాన్యవాయే మలయస్యేవ చన్దనమ్॥302॥

పుణ్యాత్ము లైన రాజుల యశస్సును ఇనుమడింఫ జేయుటకే అజుడవైన నీవు జన్మనొందితినని కొందరు పలుకగా, నీ ప్రియభక్తులలో ఒకడైన యదురాజునకు ముదమును గూర్చుటకే జన్మించితివని ఇంకొందరు పలుకుదురు.  మలయపర్వతములందు చందనవృక్షము వలె నీవు ఆ భక్తుని వంశమున జన్మించితివి

8.33 (ముప్పైమూడవ శ్లోకము)

అపరే వసుదేవస్య దేవక్యాం యాచితోఽభ్యగాత్|

అజస్త్వమస్య క్షేమాయ వధాయ చ సురద్విషామ్॥303॥

దేవకీవసుదేవులు నిన్ను ప్రార్థించినందున నీవు వారి పుత్రునిగా జన్మించితివని కొందరు పలుకుదురు. నీవు నిస్సందేహముగా జన్మరహితుడవే యైనను భక్తులైనవారి క్షేమము కొరకు మరియు సురద్వేషులైనవారిని సంహరించుటకు జన్మించుచుందువు.

8.34 (ముప్పైనాలుగవ శ్లోకం)

భారావతారణాయాన్యే భువో నావ ఇవోదధౌ|

సీదన్త్యా భూరిభారేణ జాతో హ్యాత్మభువార్థితః॥304॥


సముద్రమునందలి అధికభారము కలిగిన నౌకవలె జగత్తు భారముతో కలత చెందెను. అంతట నీ తనయుడైన బ్రహ్మదేవుడు నీ కొరకై ప్రార్థించగా అట్టి కష్టమును నివారించుటకు నీవు అవతరించితివని మరికొందరు పలుకుదురు.

8.35 (ముప్పై ఐదవ శ్లోకము)

భవేఽస్మిన్ క్లిశ్యమానానామవిద్యాకామకర్మభిః|

శ్రవణస్మరణార్హాణి కరిష్యన్నితి  కేచన॥305॥

భౌతిక క్లేశముల యందు దుఃఖితులైన బద్ధజీవులకు అవకాశము నొసగి వారు ముక్తినొందునట్లుగా చేయుటకు శ్రవణము, స్మరణము, అర్చనాదులను గూడిన భక్తియుతసేవను ఉద్దీపితము చేయుటకే నీవు అవతరించితివని మరికొందరు పలుకుదురు.

8.36 (ముప్పై ఆరవ శ్లోకము)

శృణ్వన్తి గాయన్తి గుణస్త్యభీక్ ష్ణశః స్మరన్తి నన్దన్తి తవేహితం జనాః|

త ఏవ పశ్యస్త్యచిరేణ తావకం భవప్రవాహో పరమం పదాంబుజమ్॥306॥

ఓ కృష్ణా! నీ దివ్యకర్మలను శ్రవణము చేయుచు, కీర్తించుచు పలికెడివారలు లేదా ఇతరులు ఆ విధముగా కావించుట పట్ల ముదము నొందెడి వారలు జన్మమృత్యుపరంపరను ఆపగలిగిన నీ పాదపద్మములను నిక్కముగా దర్శించగలరు.

8.37 (ముప్పై ఏడవ శ్లోకము)

అప్యద్య నస్త్వం స్వకృతేహిత ప్రభో జిహాససి స్విత్సుహృదోఽసుజీవినః|

యేషాం న చాన్యద్భవతః పదాంబుజాత్ పరాయణాం రాజసు యోజితాంహసామ్॥307॥

హేప్రభూ! సర్వకర్మలను స్వయముగా నీవే ఒనరించియుంటివి. అయినచో అన్యాశ్రయము లేకుండా నీ కరుణపైననే మేము సంపూర్ణముగా ఆధారపడినప్పటికినీ రాజులందరు మా యెడ శత్రుత్వము కలిగియున్న ఈ సమయమున మమ్ము విడిచివేయుచుంటివా యేమి?

8.38 (ముప్పైఎనిమిదవ శ్లోకము)

కే వయం నామరూపాభ్యాం యదుభిః సహ పాండవాః|

భవతోఽదర్శనం యర్హి హృషీకాణామివేశితుః॥308॥

ఆత్మ వైదొలగినంతనే దేహము యొక్క నామ యశస్సులు నశించెడి రీతి, నీ కృపాదృష్టి సోకనిచో పాండవులు యాదవుల యశస్సు మరియు కర్మలన్నియును శీఘ్రమే అంతమొందగలవు.

8.39 (ముప్పై తొమ్మిదవ శ్లోకము)

నేయం శోభిష్యతే తత్ర యథేదానీం గదాధర|

త్వత్పదైరంకితా భాతి స్వలక్షణవిలక్షితైః॥309॥

ఓ గదాధర (శ్రీకృష్ణా)! నీ చరణముద్రలను దాల్చి యున్నందున నేను, మా రాజ్యము దివ్యముగా శోభించుచున్నది. కాని నీవు వెడలినంతనే అది అట్లు శోభిల్లజాలదు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


18.1.2022 సాయం కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

ఎనిమిదవ అధ్యాయము

కుంతేదేవి ప్రార్థనలు మరియు పరీక్షిత్తు రక్షణము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
8.40 (నలబైయవ శ్లోకము)

ఇమే జనపదాః స్వృద్ధాఃసుపక్వౌషధివీరుధః|
వనాద్రినద్యుదన్వన్తో హ్యేదన్తే తవ వీక్షి తైః॥310॥

ఓషధులు, ధాన్యము పుష్కలముగా లభించుట చేతను, వృక్షములు ఫలభరితములగుటచేతను, నదులు చక్కగా ప్రవహించుట చేతను, పర్వతములు ధాతుపూర్ణములగుట చేతను, సముద్రములు నిధిపూర్ణములై విరాజిల్లుట చేతను నగరములు గ్రామములు వృద్ధిచెంది యున్నవి. నీవు వాటిపై వీక్షణము సారించుటయే దీనికంతటికి కారణము. 

8.41 (నలబై ఒకటవ శ్లోకము)

అథ విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వ కేషు మే|

స్నేహపాశమిమం ఛిన్ది దృఢం పాండుషు వృష్టిషు॥311॥

ఓ విశ్వేశా! విశ్వాత్మా! విశ్వమూర్తి!  కనుక దయచేసి నా స్వజనులైన పాండవుల యెడ మరియు వృష్టివంశస్థుల యెడ నాకు గలప్రేమపాశమును ఛేదించివేయుము.

8.42 (నలబై రెండవ శ్లోకము)

త్వయి మేఽనన్యవిషయా మతిర్మధుపతేఽసకృత్|

రతిముద్వహతాదధ్ధా గంగేవైఘముదన్వతి॥312॥

ఓ మధుపతీ! ఎట్టి ఆటంకము లేకుండా గంగానది నిరంతరము సముద్రము వైపునకు ప్రవహించురీతి, ఇతరుల వైపునకు మరలక నిరంతరము నీ యందే నాకు ఆకర్షణము కలుగు గాక.

8.43 (నలబై మూడవ శ్లోకము)

శ్రీకృష్ణ కృష్ణసఖ వృష్ట్యృషభావనిధృగ్ రాజన్యవంశదహనానపవర్గవీర్య|

గోవింద గోద్విజసురార్తిహరావతార యోగేశ్వరాఖిలగురో భగవన్మమస్తే॥313॥

ఓ కృష్ణా! అర్జున సఖా! వృష్టి ఋషభా! భూమిపై కలతకు కారణమైన రాజవంశములను నీవు నశింపజేసితివి. నీ శక్తి నశింపులేనట్టిది. నీవు దివ్యధామమునకు అధిపతివి. గోవులు, బ్రాహ్మణులు, భక్తుల ఆర్తులను హరించుటకే నీవు అవతరింతువు. యోగీశ్వరుడవైన నీవే సమస్త విశ్వమునకు దివ్యగురుడవు. దేవదేవుడవైన నీకు నేను గౌరవపూర్వక వందనముల నర్పించుచున్నాను.

8.44 (నలబై నాలుగవ శ్లోకము)

సూత ఉవాచ

పృథయేత్తం కలపదైః పరిణూతాఖిలో దయః|

మన్దం జహాస వైకుంఠో మోహయన్నివ మాయయా॥314॥

సూతగోస్వామి పలికెను: ప్రశస్తమగు వచనములను గూడిన కుంతీదేవి ఫ్రార్థనల నాలకించిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు మందహాసము చేసెను.  ఆ మందహాసము యోగశక్తివలె మనోహరముగా నుండెను.

8.45 (నలబై ఐదవ శ్లోకము)

తాం బాఢమిత్యుపామన్త్ర ప్రవిశ్య గజసాహ్వయమ్|

స్త్రియశ్చ స్వపురం యాస్యన్ ప్రేమ్ణా రాజ్ఞా నివారితః॥315॥

ఆవిధముగా కుంతీదేవి ప్రార్థనల నాలకించిన శ్రీకృష్ణభగవానుడు తదుపరి రాజప్రాసాదములోనికి ప్రవేశించి ఇతర స్త్రీలందరికీ తన ప్రయాణమును గూర్చి తెలియజేసెను. కాని ప్రయాణము నారంభించునంతలో ప్రేమమయి ప్రార్థనలతో ధర్మరాజు అతనిని ఆపెను.

8.46 (నలబై ఆరవ శ్లోకము)

వ్యాసాద్యైరీశ్వరేహాజ్ఞైః కృష్ణేనాద్భుతకర్మణా|

ప్రబోధతోఽపీతిహాసైర్నాబుధ్యత శుదిర్పితః॥316॥
 
వ్యాసదేవుని అధ్యక్షతన గల మహామునులు, అద్భుతకర్మల నొనరించు శ్రీకృష్ణభగవానుడు (స్వయముగా) ఉపదేశములను కావించినప్పటికిని మరియు చారిత్రక ప్రామాణములను ఒసగినప్పటికిని దుఃఖితుడైన ధర్మరాజు ఏ మాత్రము సంతృప్తి చెందలేదు.

8.47 (నలబై ఏడవ శ్లోకము)

ఆహ రాజా ధర్మసుతశ్చిన్తయన్ సహృదాం పధమ్|

ప్రాకృతేనాత్మానా విప్రాః స్నేహమోహవశం గతః॥317॥

ధర్మనందనుడైన ధర్మరాజు ఆ విధముగా మిత్రుల మరణముచే మిగుల చింతాక్రాంతుడై సామాన్యమానవుని వలె దుఃఖించెను. ఓ మునులారా! ఆ విధముగా అనురాగముచే మోహితుడై ఆతడిట్లు పలికెను.

8.48 (నలబై ఎనిమిదవ శ్లోకము)

అహో మే పశ్యతాజ్ఞానం హృది రూఢం దురాత్మనః|

పారక్యస్యైవ దేహస్య బహ్వ్యే మేఽక్షౌహిణీర్హతాః॥318

ధర్మరాజు పలికెను: అహో! నేను పరమ పాపాత్ముడను! అజ్ఞానభరితమైన నా హృదయమనొక్కమారు గాంచుడు! అంత్యమున ఇతరులకు చెందెడి ఈ దేహము పలు అక్షౌహిణుల సైన్యమును నిహతులను గావించినది. 

8.49 (నలబై తొమ్మిదవ శ్లోకము)

బాలద్విజసుహృన్మిత్రపిత్రభ్రాత్రుగురుదృహః|

న మే స్యాన్నిరయాన్మోక్షో హ్యపి వర్షాయుతాయుతైః॥319॥

పెక్కుమంది బాలురను, బ్రాహ్మణులను, హితైసులను, తండ్రులను, గురువులన, సోదరులను నేను వధించితిని. ఈ పాపములకై నాకు సంప్రాప్తింపనున్న నరకమున కోట్లాది సంవత్సరములు వసించినసు అచటి నుండి ముక్తినొందజాలను.

8.50 (ఏబైయవ శ్లోకము)

నైనో రాజ్ఞః ప్రజాభర్తుర్ధర్మయుద్ధే వధో ద్విషామ్|

ఇతి మే న తు బోధాయ కల్పతే శాసనం వచః॥320॥

తన ప్రజలను పోషించుట యందు నియుక్తుడైన రాజు ధర్మము నిమిత్తమై సంహారము  గావించినను ఎట్టి పాపమును పొందడనుట సత్యమేయైనను ఆ ధర్మనిర్ణయము నాకు ఏమాత్రము వర్తించదు.

8.51 (ఏబై ఒకటవ శ్లోకము)

స్త్రీణాం మద్ధతబంధూనాం ద్రోహో యోఽసావిహోత్థితః|

కర్మబిర్గృహమేధీయైర్నాహం కల్పో వ్యపోహితమ్॥321॥

స్త్రీల యొక్క పలువురి బంధువులను నేను వధించి అమితమైన శత్రుత్వమునకు కారణమైతిని. భౌతికమైన శ్రేయోదాయక కర్మ ద్వారాను దానిని పరిహరించుట సాధ్యము కాజాలదు. 

8.52 (ఏబై రెండవ శ్లోకము)

యథా పంకేన పంకాంభః సురయా వా సురాకృతమ్|

భూతహత్యాం తథైవైకాం న యజ్ఞైర్మార్ ష్టుమర్హతి॥322॥

బురదద్వారా బురదనీటిని వడగట్టుట సాధ్యము కానట్లుగా లేక మద్యముచే మద్యపాత్రను పవిత్రము చేయలేనట్లుగా, జంతువుల బలి ద్వారా జనసంహార పాపము నివారింపబడజాలదు.

శ్రీమద్భాగవతము నందలి "కుంతేదేవి ప్రార్థనలు మరియు పరీక్షిత్తు రక్షణము" అను ప్రథమ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము సమాప్తము

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


19.1.2022 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

తొమ్మిదవ అధ్యాయము

శ్రీకృష్ణభగవానుని సమక్షమున భీష్మదేవుని నిర్యాణము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.17 (పదిహేడవ శ్లోకము)

తస్నాదిదం దైవతస్త్రం వ్యవస్య భరతర్షభ|

తస్యానువిహితోఽనాథా నాథ పాహి ప్రజాః ప్రభో॥339॥

కావున ఓ భరతశ్రేష్ఠా (యుధిష్ఠిరా)! ఇదియంతయు భగవానుని యోచనయేనని నేను భావించుచున్నాను. అట్టి అచింత్యమైన భగవత్ సంకల్పమును ఆమోదించి దానిని అనుసరింపుము. ఇప్పుడు నీవు పాలనాధికారివైతివి. కనుక ఓ ప్రభూ! అనాథలైన ప్రజల రక్షణా భారమును నీవిపుడు స్వీకరింపవలెను.

9.18 (పద్దెనిమిదవ శ్లోకము)

ఏష వై భగవాన్ సాక్షాదాద్యో నారాయణ! పుమాన్|

మోహయన్మాయయా లోకం గూఢశ్చరతి వృష్ణిమ॥340॥

అచింత్యుడైన ఆదిపురుషుడే ఈ శ్రీకృష్ణుడు. కాని వృష్ణి వంశమున ఈతడు మనలో ఒకని వలె చరించుచు తనచే సృష్టింపబడిన మాయచే మనలను మోహపరచుచున్నాడు.

9.19 (పందొమ్మిదవ శ్లోకము)

అస్యానుభావం భగవాన్ వేద గుహ్యతమం శివః|

దేవర్షిర్నారదః సాక్షాద్భగవాన్ కపిలో నృప॥341॥

ఓ రాజా! శివుడు, దేవర్షియైన నారదుడు, భగవదవతారమైన కపిలుడు మొదలగు వారందరును ఈతని మహిమలను ప్రత్యక్షానుభవము ద్వారా నెరిగియున్నారు.

9.20 (ఇరవైయవ శ్లోకము)

యం మన్యసే మాతులేయం ప్రియం మిత్రం సుహృత్తమమ్|

అకరోః సచివం దూతం సౌహృదాదథః సారధిమ్॥342॥

ఓ రాజా! ఎవరినైతే నీవు అజ్ఞానముచే మేనబావ యని, ప్రియ మిత్రుడని, శ్రేయోభిలాషియని, సచివు డని, దూతయని, సుహృత్తని భావించితివో అతడే సాక్షాత్తుగా దేవుడు.

9.21 (ఇరవై ఒకటవ శ్లోకం)

సర్వాత్మనః సమదృశో  హ్యద్వయస్యానహంకృతేః|

తత్కృతం మతివైషమ్యం నిరవద్యస్య న క్వచిత్॥343॥

దేవదేవుడైనందున ఈతడు సర్వుల హృదయములందు విరాజమానుడై యున్నాడు. సమదర్శియైన ఈతడు వైషమ్యమనెడి అహంకారమునకు దూరుడు. తత్కారణమున ఈతడు ఏది ఒనర్చినను అది భౌతికత్వమునకు పరమైయుండును. అంతియేగాక ఈతడు సమచిత్తము కలిగినవాడు. 

9.22 (ఇరవైరెండవ శ్లోకము)

తథాప్యేకాన్తభక్తేషు పశ్య భూపానుకంపితమ్|

యన్మేఽసూంస్త్యజతః సాక్షాత్ కృష్ణో దర్శనమాగతః॥344॥

సర్వుల యెడ సమానమగు దయను కనబరచువాడైనను నేను అనన్యసేవకుడనైన కారణమున ఈ దేవదేవుడు నా ప్రాణత్యాగ సమయమున అత్యంత దయతో నాకు దర్శనమొసగినాడు.

9.23 (ఇరవై మూడవ శ్లోకము)

భక్త్యావేశ్యో మనో వాచా యన్నామ కీర్తయన్|

త్యజన్ కలేవరం యోగీ ముచ్యతే కామకర్మభిః॥345॥

అనన్యభక్తి చేతను, ధ్యానము చేతను, పవిత్రమైన నామకీర్తనము చేతను భక్తుని మనస్సు నందు సాక్షాత్కరించెడి శ్రీకృష్ణభగవానుడు దేహత్యాగ సమయమున ఆ భక్తుని సర్వవిధములైన కామ్యకర్మల బంధము నుండి ముక్తుని చేయును.

9.24 (ఇరవై నాలుగవ శ్లోకము)

స దేవదేవో భగవాన్ ప్రతీక్షతాం కలేవరం యావదిదం హినోమ్యహమ్|

ప్రసన్నహాసారుణలో చనోల్ణసన్ముఖాంబుజో ధ్యానపథశ్చతుర్భుజః॥346॥

చతుర్భుజములను దాల్చినవాడును, ఉదయించు సూర్యుని వంటి ఎర్రని నేత్రములతో శోభిల్లు ముఖపద్మమున చిరునవ్వును కలిగినవాడును అగు నా ప్రభువు నేను భౌతికదేహమును పరిత్యజించు క్షణమున దయచేసి నా చెంతనే వేచియుండుగాక!

9.25 (ఇరవై ఐదవ శ్లోకము)  

సూత ఉవాచ

యుధిష్ఠిరస్తదాకర్ణ్య శయానం శరపంజరే|

అపృచ్ఛద్వివిధాన్ధర్మానృషీణామ్ చానుశృణ్వతామ్॥347

సూతగోస్వామి పలికెను: భీష్మదేవుని హృద్యమైన పలుకుల నాకర్ణించిన ధర్మరాజు పిదప ధర్మనియమములను గూర్చి ఋషుల సమక్షమున అతనిని అడిగెను.

9.26 (ఇరవై ఆరవ శ్లోకము)

పురుషస్వభావవిహితాన్ యథావర్ణం యథాశ్రమమ్|

వైరాగ్యరాగోపాధిభ్యామామ్మాతోభయలక్షణాన్॥348॥

ధర్మరాజు విచారణపై అంతట భీష్మదేవుడు తొలుత స్వభావము ననుసరించి యున్న వర్ణాశ్రమవిభాగములను వివరించెను. అటుపిమ్మట అతడు నివృత్తి, ప్రవృత్తి మార్గములనెడి రెండు విభాగములను క్రమబద్ధముగా తెలియజేసెను.

9.27 (ఇరవై ఏడవ శ్లోకము)

దానధర్మాన్ రాజధర్మాన్ మోక్షధర్మాన్ విభాగశః|

స్త్రీధర్మాన్ భగవద్ధర్మాన్ సమాసవ్యాసయోగతః॥349॥

అతడు తదుపరి దానధర్మములను, రాజధర్మములను, మోక్షధర్మములను వాటి విభాగము ననుసరించి వివరించెను. అటుపిమ్మట స్త్రీధర్మములను, భక్తులధర్మములను రెండింటిని సంక్షేపముగను మరియు విస్తారముగను వివరించి చెప్పెను.

9.28 (ఇరవై ఎనిమిదవ శ్లోకము)

ధర్మార్థకామమోక్షాంశ్చ సహోపాయాన్ యథా మునే|
నానాభ్యానేతిహాసేషు వర్ణయామాస తత్త్వవిత్॥350॥

అతడు స్వయముగా సర్వము నెరిగినవాడై నందున వివిధ వర్ణాశ్రమ ధర్మములకు సంబంధించిన విధ్యుక్తధర్మములను ఇతిహాసముల నుండి దృష్టాంతములను ఉదహరించుట ద్వారా వర్ణించెను.

9.29 (ఇరవై తొమ్మిదవ శ్లోకము)

ధర్మం ప్రవదతస్తస్య స  కాలః ప్రత్యుపస్థితః|

యో యోగినశ్ఛన్దమృతోర్వాంఛితస్తూత్తరాయణః॥351॥

భీష్మదేవుడు విధ్యుక్తధర్మములను గూర్చి వర్ణించుచుండగా ఉత్తరాయణ కాలము సమీపించెను. స్వచ్ఛంద మరణము కలిగిన యోగులకు ఆ సమయము అత్యంత అభిలషణీయమైనది.

9.30 (ముప్పైయవ శ్లోకము)

తదోపసంహృత్య గిరః సహస్రణీర్విముక్తసంగం మన ఆదిపూరుషే|

కృష్ణే లసత్సీతపటే చతుర్భుజే  పురః స్థితేఽమీలితదృగ్వ్యధారయత్॥352॥

పలువిషయములపై వేలాది భావములతో ప్రసంగించినవాడును, వేలాది యుద్ధములను గావించి వేలాది జనులను రక్షంచినవాడును అగు భీష్మదేవుడు అంతట మౌనము వహించెను. సంపూర్ణముగా ముక్తసంగుడైన అతడు తదుపరి మనస్సును అన్యవిషయముల నుండి నిగ్రహించి దేదీప్యమానమైన పీతవసనమును దాల్చి చతుర్భుజములతో తన యెదుట నిలచియున్న ఆదిదేవుడైన శ్రీకృష్ణునిపై విప్పారిన నేత్రములతో దృష్టిని సంలగ్నము చేసెను.

9.31 (ముప్పై ఒకటవశ్లోకము)

విశద్ధయా ధారణయా హతాశుభస్తదీక్షయైవాశు గతాయుధశ్రమః|

నివృత్త సర్వేన్ద్రియవృత్తివిభ్రమ స్తుష్టావ జన్యం విసృజన్ జనార్ధనమ్॥353

శ్రీకృష్ణభగవానునే తదేకముగా గాంచుచు శుద్ధమైన ధ్యానముద్వారా అతడు శీఘ్రమే సర్వఅశుభములనుండి ముక్తుడై శరాఘాత గాయములచే కలిగిన దేహబాధలనుండి ఉపశాంతిని పొందెను.  ఆ విధముగా బాహ్యేంద్రియ కర్మలన్నియును ఒక్కమారుగా అణగినంతట భౌతికదేహము త్యజించుచు సర్వజీవులను నియమించు జనార్ధనుని అతడు భక్తితో ప్రార్థింపదొడగెను.

9.32 (ముప్పైరెండవ శ్లోకము)

శ్రీభీష్మ ఉవాచ

ఇతి మతిరుపకల్పితా వితృష్ణా భగవతి సాత్వతపుంగవే విభూమ్ని|

స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం ప్రకృతిము పేయుషి యద్భవప్రభావః॥354॥

భీష్మదేవుడు పలికెను: ఇంతవరకు వివిధ విషయములందు, విధ్యుక్త ధర్మములయందు నియుక్తమైన నా ఆలోచనలు, అనుభవములు, కోరికలిప్పుడు శక్తిమంతుడైన శ్రీకృష్ణుని యందు సంలగ్నమగుగాక! అతడు ఆత్మతృప్తుడే యైనను భక్తులకు ప్రభువైన కారణమున  తన నుండియే సృష్టింపబడిన భౌతికజగమున అవతరించి కొన్నిమార్లు దివ్యానందము నొందుచుండును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


19.1.2022 సాయంకాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

తొమ్మిదవ అధ్యాయము

శ్రీకృష్ణభగవానుని సమక్షమున భీష్మదేవుని నిర్యాణము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
9.33 ( ముప్పైమూడవ శ్లోకము)

త్రిభువనకమనం తమాలవర్ణం రవికరగౌరవరాంబరం దధానే|

వపురలకకులావృతాననాబ్జం విజయసఖే రతిరస్తు మేఽనవద్యా॥355

శ్రీకృష్ణుడు అర్జునుని సన్నిహిత స్నేహితుడు, ఆతడు తమాలవృక్షపు నీలిరంగుఛాయ గల దివ్యదేహమతో ధరిత్రి యందు అవతరించినాడు. అతని రూపము త్రిభువనములందు (ఊర్ధ్వ, మధ్య, అధోఃలోకములందు) ప్రతి యొక్కరిని ఆకర్షించునటువంటిది. అటువంటి దేవదేవుని పీతవసనము, చందన చర్చితమైన ముఖపద్మములందు ఫలాభిలాష లేనటువంటి ఆకర్షణము నాకు కలుగుగాక.

9.34(ముప్పైనాలుగవ శ్లోకము)

యుధి తురగరజో విధూమ్రవిష్వక్ కచలులితశ్రమవార్యలంకృతాస్యే|

మమ నిశితిశ రైర్విభిద్యమానత్వచి విలసత్కవచేఽస్తు కృష్ణ ఆత్మా॥356॥

(స్నేహము కారణముగా శ్రీకృష్ణుడు అర్జునుని కూడియున్న) రణరంగమందు గుర్రపు డెక్కల వలన రేగిన ధూళిచే కదలుచున్న శ్రీకృష్ణుని ముంగురులు ధూసరవర్ణముగా  మారెను. శ్రమకారణమున అతని ముఖము స్వేదబిందువులతో శోభిల్లెను. నా వాడియైన బాణములచే కలిగిన గాయములతో మరింతగా సుసంపన్నములైన ఈ శృంగారములన్నింటి యందును అతడు ఆనందమును గొనెను. అటువంటి శ్రీకృష్ణని యందు నా మనస్సు సంలగ్నమగు గాక!

9.35 (ముప్పైఐదవ శ్లోకము)

సపది సఖివచో నిశమ్య మధ్యే నిజపరయోర్బలయో రథం నివేశ్య|

స్థితపతి పరసైనికాయురక్ ష్ణా హృతవతి పార్థసఖే యతిర్మమాస్తు॥357॥

మితృడైన అర్జునుని ఆజ్ఞకు బద్ధుడై కురుక్షేత్ర రణరంగమునందు అర్జునుడు మరియు దుర్యోధనుని సేనల నడుమ ప్రవేశించిన శ్రీకృష్ణుడు అచట తన కరుణాదృక్కులచే శత్రుపక్ష సైన్యమువారి ఆయువును తగ్గించెను. కేవలము శత్రువును వీక్షించుట ద్వారానే అట్టి కార్యము కావించిన శ్రీకృష్ణుని యందు నా మనస్సు ఏకాగ్రత చెందుగాక!

9.36 (ముప్పైఆరవ శ్లోకము)

వ్యవహితపృతనాముఖం నిరీక్ష్య స్వజనవధాద్విముఖస్య దోషబుద్ధ్యా|

కుమతిమహరదాత్మ విద్యయాయశ్చరణరతిః పరమస్య తస్య మేఽస్తు॥358॥

యుద్ధరంగమున తన ఎదుట నిలిచియున్న సైనికులను, సేనానాయకులను గాంచి అర్జునుడు మోహవశుడనట్లు గోచరించగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మికజ్ఞానము నొసగుట ద్వారా అతని అజ్ఞానమును నశింపజేసెను. అట్టి దేవదేవుని చరణకమలముల యందే సదా నాకు ఆశక్తి కలుగు గాక!

9.37 (ముప్పై ఏడవ శ్లోకము)

స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞామృతమధికర్తుమవప్లుతో రథస్థః|

ధృతరథచరణోఽభ్యయాచ్చలద్గుర్హరివ హన్తుమిభం గతోత్తరీయః॥359॥

తన ప్రతిజ్ఞను వదలిపెట్టి నా కోరికను పూర్ణము చేయుచు అతడు రథము నుండి క్రిందకురికి, రథచక్రమును చేపట్టి, ఏనుగును సంహరించుటకు సింహము చనెడి రీతి వేగముగా నా వైపు పరుగు తీసెను.  మార్గమధ్యమున అతని ఉత్తరీయము కూడా జారిపోయెను.

9.38 (ముప్పైఎనిమిదవ శ్లోకము)

శితవిశిఖహతో విశీర్ణదంశః క్షతజపరిప్లుత ఆతతాయినో మే|

ప్రసభమభిససార మద్వధార్థం  స భవతు మే భగవాన్ గతిర్ముకున్దః॥360॥

ముక్తినొసగు ముకుందుడైన శ్రీకృష్ణభగవానుడే నాకు పరమగమ్యమగు గాక!  నా తీక్షణమైన శరములచే కలిగిన గాయముల వలన క్రోధితుడైనట్లుగా అతడు యుద్ధరంగమున నన్ను వధింప సమకట్ఠెను. అతని కవచము ధ్వంసమై గాయముల వలన రక్తసిక్తమై యుండెను.

9.39 (ముప్పై తొమ్మిదవ శ్లోకం)

విజయరథకుటుంబ ఆత్తతోత్రే ధృతహయరశ్మిని తచ్ఛ్రియేక్షణీయే|

భగవతి రతిరస్తు మే ముమూర్షోర్యమిహ నిరీక్ష్య హతా గతాః స్వరూపమ్॥361॥

ఈ మరణ సమయమున  నా చరమ ఆకర్షణము శ్రీకృష్ణభగవానుడే అగు గాక!  ఎడమచేత పగ్గములను, కుడిచేత చెండ్రకోలను పట్టి అర్జునుని రథమునకు అన్నివిధములుగా రక్షణమును గూర్చుటకు జాగరూకునిగా నిలిచిన అర్జున రథసారథి యందు నేను మనస్సును లగ్నము చేసెదను.  కురుక్షేత్ర రణమున అతనిని దర్శించిన వారందరును మరణానంతరము తమ నిజరూపములను పొందియుండిరి.

9.40 (నలబైయవ శ్లోకము)

లలితగతివిలాసవల్గుహాసప్రణయనిరీక్షణకల్పితోరుమానాః|

కృతమనుకృతవత్య ఉన్మ దాన్ధాః ప్రకృతిమగన్ కిల యస్య గోపవధ్వః॥362॥

ఎవని సుందరమైన గమనములు, హాసములు వ్రజధామమునందలి గోపికల మనస్సులను ఆకర్షించెనో అట్టి శ్రీకృష్ణుని యందు నా మనస్సు  లగ్నమగుగాక!

9.41 (నలబై ఒకటవ శ్లోకము)

మునిగణనృపవర్యసంకులేఽన్తఃసదసి యుధిష్ఠిరరాజసూయ ఏషామ్|

అర్హణముపవేద ఈక్షణీయో మమ దృశిగోచర ఏష అవిరాత్మా॥363॥

ధర్మరాజు ఒనరించిన రాజసూయయాగమున మునులు, రాజులవంటి ప్రపంచము యొక్క శ్రేష్ఠజనులతో నిండిన గొప్ప సభ యందు శ్రీకృష్ణుడు ప్రతియొక్కరిచే దేవదేవునిగా పూజింపబడినాడు. ఆ దేవదేవని యందు మనస్సును సంలగ్నము చేయుటకై నా సమక్షమున జరిగిన ఆ సంఘటనను నేను స్మరించుచున్నాను.

9.42 (నలబై రెండవ శ్లోకము)

తమిమమహమజం శరీరభాజాం హృది హృది ధిష్ఠితమాత్మకల్పితానామ్|

ప్రతిదృశమివ నైకథార్కమేకం సమధిగతోఽస్మి విధూతభేదమోహః॥364॥

నేనిపుడు నా యెదుట నిలిచియున్న ఆ ఏకైక భగవానుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ ఏకాగ్రతతో ధ్యానింపగలరు. ఏలయన మనోకల్పనాపరుల హృదయములతో సహా ప్రతివారి హృదయమునందు గల ఆ దేవదేవుని ఉనికి విషయమున భేదభావమును నేనిపుడు దాటితిని. సూర్యుడు అనేకవిధములుగా గోచరించినను వాస్తవమునకు ఏకమై యున్నాడు.

9.43 (నలబైమూడవ శ్లోకము)

సూత ఉవాచ

కృష్ణ ఏవం భగవతి మనోవాగ్దృష్టివృత్తిభిః|

ఆత్మన్యాత్మానమావేశ్య సోఽన్తః శ్వాస ఉపారమత్॥365॥

సూతగోస్వామి పలికెను: ఈ విధముగా భీష్మదేవుడు తన మనస్సు,వాక్కు,దృష్టి, వృత్తుల ద్వారా పరమాత్ముడైన శ్రీకృష్ణభగవానుని యందు మగ్నుడై, మౌనము వహించి అంతిమ శ్వాసవదలెను.

9.44 (నలబైనాలుగవ శ్లోకము)

సంపద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే|

సర్వే బభూపుస్తే తూష్ణీం వయాంశీవ దినాత్యయే॥366॥

భీష్మదేవుడు అనంతమగు పరబ్రహ్మమందు ప్రవేశించినవాడని తెలిసి అచట నున్న వారందరును దినాంతమున పక్షులవలె మౌనము వహించిరి.

9.45 (నలబై ఐదవ శ్లోకం)

తత్ర దున్దుభయో నేదుర్దేవమానవవాదితాః|

శశంసుః సాధవో రాజ్ఞాం ఖాత్పేతుః పుష్పవృష్టయః॥367॥

తదుపరి మానవులు, దేవతలు గౌరవముతో దుందుభులను మ్రోగించిరి. నిష్కపటులైన రాజవంశమువారు భీష్ముని గౌరవార్థమై స్తుతులు కావించిరి. ఆకాశమునుండి పుష్పవృష్టి కురిసెను.

9.46 (నలబైయారవ శ్లోకము)

తస్య నిర్హరణాదీని సంపరేతస్య భార్గవ|

యుధిష్ఠిరః కారయిత్వా ముహూర్తం దుఃఖితోఽభవత్॥368॥

ఓ భృగువంశీయుడా (శౌనకుడా)!  భీష్మదేవుని మృతదేహమునకు దహన సంస్కారముల నాచరించిన పిమ్మట ధర్మరాజు తృటికాలము దుఃఖితుడయ్యెను.

9.47 (నలబైఏడవ శ్లోకము)

తుష్టువుర్మునయో హృష్టాః కృష్ణం తద్గుహ్యనామభిః|

తతస్తే కృష్ణహృదయాః స్వాశ్రమాన్ ప్రయయుః పునః॥369॥

పిమ్మట మహామునులందరు గుహ్యములైన వేదమంత్రములతో అచట నున్న శ్రీకృష్ణభగవానుని కీర్తించిరి.  తదనంతరము వారు శ్రీకృష్ణనే హృదయములందు నిలుపుకొని తమ తమ ఆశ్రమములకు వెడలిరి.

9.48 (నలబై ఎనిమిదవ శ్లోము)

తతో యుధిష్ఠిరో గత్వా సహకృష్ణో గజాహ్వయమ్|

పితరం సాన్త్వయామాస గాన్ధారీం చ తపస్వినీమ్॥370॥

తదనంతరము ధర్మరాజు శ్రీకృష్ణుని గూడి వెంటనే రాజధానియైన హస్తినాపురమున కేగి పెదతండ్రియైన ధృతరాష్టృని, తపసస్వినియైన గాంధారిని ఓదార్చెను.

9.49 (నలబై తొమ్మిదవ శ్లోకం)

పిత్రా చానుమతో రాజా వాసూదేవానుమోదితః|

చకార రాజ్యం ధర్మేణ పితృపైతామహం విభుః॥371॥

అటు పిమ్మట పరమ ధర్మాత్ముడైన రాజగు ధర్మరాజు తన పెదతండ్రిచే ఆమోదింబడినవి మరియు శ్రీకృష్ణభగవానునిచే ధృవపరుపబడినవి అయిన రాజధర్మముల ననుసరించి రాజ్యపాలనము కావించెను.

శ్రీమద్భాగవతము నందలి "శ్రీకృష్ణభగవానుని సమక్షమున భీష్మదేవుని నిర్యాణమ" అను ప్రథమస్కంథములోని తొమ్మిదవ అధ్యాయము సమాప్తము

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

*****
20.1.2022 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

పదియవ అధ్యాయము

శ్రీకృష్ణుని ద్వారకాగమనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
10.1 (ఒకటవ శ్లోకము)

శౌనక ఉవాచ

హత్వా స్వరిక్థస్పృధ ఆతతాయినో యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠః| 

సహానుజైః ప్రత్యవరుద్ధభోజనః కథం ప్రవృత్తః కిమకారషీత్తతః॥372॥

శౌనకముని ప్రశ్నించెను: తన ధర్మబద్ధమైన పితృసంపత్తిని అపహరింప యత్నించిన శత్రువులను దునుమాడిన పిమ్మట ధర్మభృతుడైన ధర్మరాజు సోదరుల సహాయమున ఏ విధముగా ప్రజాపాలనము కావించెను? నిక్కముగా అతడు రాజ్యమును విచ్చలవిడిగా అనుభవించి ఉండకపోవచ్చును.

10.2 (రెండవ శ్లోకము)

సూత ఉవాచ)

వంశం కురోర్వంశదవాగ్నినిర్హృతం సంరోహయిత్వా భవభావనో హరిః|

నివేశయిత్వా నిజరాజ్య ఈశ్వరో యుధిష్ఠిరం ప్రీతమనా బభూవ హ॥373॥

సూతగోస్వామి పలికెను: జగత్పాలకుడును, దేవదేవుడును అగు శ్రీకృష్ణభగవానుడు ధర్మరాజును  అతని రాజ్యమున పునఃస్థాపితుని గావించి, క్రోధమనెడి వంశదావాగ్నిచే నశించిన కురువంశమును పునర్జీవితము కావించి సంతుష్టచిత్తుడయ్యెను. 

10.3 (మూడవ శ్లోకము)

నిశమ్య భీష్మోక్తమథాచ్యుతోక్తం ప్రవృత్తవిజ్ఞానవిధూతవిభ్రమః|

శశాన గామిన్ద్ర ఇవాజితాశ్రయః పరిధ్యుపాన్తామనుజానువర్తితః॥374॥

భీష్ముడు, అచ్యుతుడైన శ్రీకృష్ణభగవానుడు పలికినదానిచే జ్ఞానవంతుడైన ధర్మరాజు సర్వసందేహములు నశించినందున పూర్ణజ్ఞానమునకు సంబంధించిన విషయములందు నియుక్తుడయ్యెను.  ఆ విధముగా అనుజ సోదరులు తనను అనుసరింపగా సముద్ర పర్యంతమగు భూమిని అతడు  చక్కగా పరిపాలించెను.

10.4 (నాలుగవ శ్లోకము)

కామం వవర్ష పర్జన్యః సర్వకామదుఘా మహీ|

సిషిచుః స్మ వ్రజాన్ గావః పయసోధ స్వతీర్ముదా॥375॥

ధర్మరాజు పాలనలో మేఘములు ప్రజలకు వలసినంతగా వర్షములు కురిసెడివి. భూమి మానవావసరములను పుష్కలముగా ఉత్పత్తి చేసినది. క్షీరము నిండిన పొదుగులతో ముదమును గూడియుండుటచే గోవులు పచ్చిక బయళ్ళను పాలతో తడుపుచుండెడివి. 

10.5 (ఐదవ శ్లోకము)

నద్యః సముద్రా గిరయః సవనస్పతివీరుధః|

ఫలన్త్యోషధయః సర్వాః కామమన్వృతు తస్య వై॥376॥ 

నదులు, సముద్రములు, కొండలు, పర్వతములు, అరణ్యములు, లతలు, ఫలవంతములైన ఓషధులు ప్రతిఋతువు నందును రాజునకు పుష్కలముగా తమ వంతు శిస్తుభాగమును చెల్లించెడివి.

10.6 (ఆరవ శ్లోకము)

నాధయో వ్యాధయః క్లేశా దైవభూతాత్మ హేతవః|

అజాతశత్రావభవన్ జన్తూనం రాజ్ఞి కర్హిచిత్॥377॥

ధర్మరాజు అజాతశత్రుడైన కారణమున జీవులు ఏ సమయమునను మనోక్లేశములు, వ్యాధులు, అధిక శీతోష్ణములచే కలతకు గురికాలేదు.  

10.7 (ఏడవ శ్లోకము)

ఉషిత్వా హాస్తినపురే మాసాన్ కతిపయాన్ హరిః|

సుహృదాం చ విశోకాయ స్వసుశ్చ ప్రియకామ్యయా॥378॥

తన బంధువులను, స్వంత సోదరియైన సుభద్రను ఆనందపరచుటకు శ్రీకృష్ణుడు కొలది మాసములు హస్తినాపురమునందే వసించెను.

10.8 (ఎనిమిదవ శ్లోకము)

ఆమన్త్ర్యచాభ్యనుజ్ఞాతః పరిష్వజ్యాభివాద్య తమ్|

ఆరురోహ రథం కైశ్చిత్పరిష్వక్తోఽభివాదితః॥379॥

శ్రీకృష్ణుడు ప్రయాణమునకేగ అనుమతిని గోరి ధర్మరాజుచే అనుమతింప బడినపుడు ఆ దేవదేవుడు అతని పాదముల చెంతవ్రాలి వందనముల నర్పించెను. పిదప ధర్మరాజు అతనిని ఆలింగనము చేసికొనెను. తదనంతరము మరికొందరు శ్రీకృష్ణుని ఆలింగనము చేసికొనగా వారి అభివాదములను గొని అతడు తన రథము నధిరోహించెను.

10.9 (తొమ్మిదవ శ్లోకము)

సుభద్రా ద్రౌపదీ కున్తీ విరాటతనయా తథా|

గాన్ధారీ ధృతరాష్ట్రశ్చ యుయుత్సర్గౌతమో యమౌ॥380॥

10.10 (పదవ శ్లోకము)

వృకోదరశ్చ థౌమ్యశ్చ స్త్రియో మత్స్యసుతాదయః|

న సేహిరే విముహ్యన్తో విరహం శార్ ఙ్గ ధన్వనః॥381॥

ఆ సమయమున సుభద్ర, ద్రౌపది, కుంతీదేవి, ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు, యుయుత్సుడు, కృపాచార్యుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, ధౌమ్యుడు, సత్యవతి మున్నగు వారు శ్రీకృష్ణుని విరహమును సహింపలేక దాదాపు మూర్చనొందిన వారైరి.

10.11 (పదకొండవ శ్లోకము)

సత్సంగాన్ముక్తదుస్సంగో హాతుం నోత్సహితే బుధః|

కీర్త్యమానం యశో యస్య సకృదాకర్ణ్య రోచనమ్॥382॥

10.12 (పన్నెండవ శ్లోకము)

తస్మిన్న్యస్తధియః పార్థాః సహేరన్ విరహం కథమ్|

దర్శనస్పర్శసంలాపశయనాసనభోజనైః॥383॥

శుద్దభక్తుల సాంగత్యమున శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొని దుస్సాంగత్యము నుండి ముక్తులైన బుధజనులు ఆ దేవదేవుని యశోశ్రవణమును ఒక్కమారు కావించినను దానిని త్యజింపజాలరు. అట్టియెడ శ్రీకృష్ణుని ముఖాముఖి దర్శించుచు, అతనిని స్పర్శించుచు, అతనితో సంభాషించుచు, శయనాసన భోజనాదులను అతనితో కలసి కావించుచు సన్నిహిత సాహచర్యము ననుభవించిన పాండవులు ఏ విధముగా ఆ దేవదేవుని విరహము సహింపగలరు?

10.13 (పదమూడవ శ్లోకము)

సర్వే తేఽనిమిషైరక్షైస్తమనుద్రుతచేత సః|

వీక్షన్తః స్నేహసంబద్ధా విచేలుస్తత్ర తత్ర హ॥384॥

ఆకర్షణమనెడి పాత్రలో శ్రీకృష్ణుని కొరకు వారందరి హృదయములు కరుగ సాగినవి. రెప్పవాల్చకుండా వారు ఆ దేవదేవునే తదేకముగా వీక్షించుచు అసహనముతో అటునిటు కదలసాగిరి. 

10.14 (పద్నాలుగవ శ్లోకము)

న్యరున్ధన్నుద్గలద్భాష్పమౌత్కంఠ్యాద్దేవకీసుతే|

నిర్యాత్యగారాన్నోఽభద్రమితి స్యిద్బాన్ధవస్త్రియః॥385॥

శ్రీకృష్ణుని యెడ గల ఉత్కంఠతో భాష్పపూరిత నయనములు కలిగిన బంధువులైన స్త్రీజనము అంతఃపురము నుండి వెలుపలికి వచ్చిరి. తమ కన్నీటిని వారు అత్యంత కష్టముతో నిరోధింపగలిగిరి. ప్రయాణ సమయమున ఆ కన్నీరు అశుభమును కలుగజేయునేమోయని వారూ మిగుల భీతిచెందిరి.

10.15 (పదిహేనవ శ్లోకము)

మృదంగశంఖభేర్యశ్చ వీణాపణవగోముఖాః|

ధున్ధుర్యానకఘంటాద్యా నేదుర్దున్దుభయస్తథా॥386॥

హస్తినాపుర రాజప్రాసాదము నుండి శ్రీకృష్ణుడు నిష్క్రమించినపుడు మృదంగము, డోలు, నగారా, ధున్ధురీ, దుందుభి వంటి వివిధ  డోలు వాద్యములు మరియు వివిధరకముల మురళీ వాద్యములు, వీణ, గోముఖము, భేరి మొదలగునవి ఆ దేవదేవుని గౌరవార్థమై సంయుక్తముగా  మ్రోగింపబడినవి. 

10.16 (పదహారవ శ్లోకము)

ప్రాసాదశిఖరారూఢాః కురునార్యో దిదృక్షయా|

వవృషుః కుసుమైః కృష్ణం ప్రేమవ్రీడాస్మి తేక్షణాః॥387॥

ప్రేమ పూర్వకమైన కృష్ణ దర్శనాభిలాషచే కురునారీగణము రాజప్రాసాదపు ఉపరిభాగమును చేరి ప్రేమలజ్జా పూర్వకముగా మందహాసము చేయుచు శ్రీకృష్ణునిపై పుష్పవృష్టిని కురుపించిరి.

10.17 (పదిహేడవ శ్లోకము)

సితాతపత్రం జగ్రాహ ముక్తాదామవిభూషితమ్|

రత్నదండం గుడాకేశః ప్రియః ప్రియతమస్య హ॥388॥

ఆ సమయమున పరమయోధుడును, గుడాకేశుడును, పరమ ప్రియతముడైన శ్రీకృష్ణుని ప్రియసఖుడును అగు అర్జునుడు ముత్యపుటంచులతో విభూషితమై రత్నదండమును కలిగినట్టి ఛత్రమును పట్టెను.

10.18 (పద్థెనిమిదవ శ్లోకము)

ఉద్దవః సాత్యకిశ్చైవ వ్యజనే పరమాద్భుతే|

వికీర్యమాణః కుసుమై రేజే మధూపతిః పథి॥389॥

ఉద్ధవుడు, సాత్యకి ఇరువురును అలంకృతములైన చామరములచే శ్రీకృష్ణునికి విసరసాగిరి. మధుపతియైన శ్రీకృష్ణభగవానుడు వెదజల్లబడిన పుష్పములపై ఆసీనుడై దారి పొడుగునా వారి సేవలనందెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని పదియవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

20.1.2022 సాయం కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

పదియవ అధ్యాయము

శ్రీకృష్ణుని ద్వారకాగమనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
10.19 (పందొమ్మిదవ శ్లోకము)

అశ్రూయన్తాశిషః సత్యాస్తత్ర తత్ర ద్విజేరితాః|

నానురూపానురూపాశ్చ నిర్గుణస్య గుణాత్మనః॥390॥

ప్రస్తుతము మానవునిగా పాత్రపోషణము చేయుచున్న పరమపురుషునికే ఒసగబడుచున్నందున శ్రీకృష్ణునకు గూర్చినటువంటి ఆశీర్వాదములు ఉపయుక్తములు గాని, అనుపయుక్తములుగాని కాకున్నవని అచ్చటచ్టట వినవచ్చెను. 

10.20 (ఇరవైయవ శ్లోకము)

అన్యోన్యమాసీత్సంజల్ప ఉత్థమశ్లోకచేతసామ్| 

కౌరవేన్ద్రపురస్త్రీణాం సర్వశ్రుతిమనోహరః॥391॥


ఉత్తమశ్లోకుడైన శ్రీకృష్ణభగవానుని దివ్యగుణముల ఆలోచన యందు సంలగ్నమైన స్త్రీలు హస్తినాపుర గృహోపరిభాగములఫై అతనిని గూర్చి చర్చించుట మొదలిడిరి. ఆ సంభాషణము వేదమంత్రముల కన్నను మనోహరముగా నుండెను.

10.21 (ఇరవై ఒకటవ శ్లోకం)

స వై కిలాయం పురుషః పురాతనో య ఏక ఆసీదవిశేష ఆత్మని|

అగ్రే గుణేభ్యో జగదాత్మనీశ్వరే నిమీలితాత్మన్నశి సుప్తశక్తి షు॥392॥

వారిట్లు పలికిరి: మనము నిశ్చితముగా స్మరించు ఆదిపురుషుడు ఈతడే. ప్రకృతి త్రిగుణముల సృష్టికి పూర్వము ఈతడొక్కడే నిలిచియుండెను. ఆదిదేవుడైన కారణమున ఈతని యందే సమస్తజీవులు రాత్రి సమయమున నిద్రించువారి వలె చేతనారహితులై లీనమగుదురు.

10.22 (ఇరవై రెండవ శ్లోకము)

స ఏవ భూయో నిజవీర్యచోదితాం స్వజీవమాయాం ప్రకృతిం సిసృక్షతీమ్|

అనామరూపాత్మని రూపనామనీ విధిత్సమానోఽనుసార శాస్త్రకృత్॥393॥

తన అంశలైన జీవులకు నామరూపముల నొసగ తిరిగి సంకల్పించిన ఈ భగవానుడు వారిని భౌతికప్రకృతి యొక్క ఆధీనమున నిలిపెను. ఈతని నిజశక్తి ద్వారానే పునఃసృష్టికార్యమునకు భౌతికప్రకృతికి అధికారమొసగబడినది.

10.23 (ఇరువది మూడవ శ్లోకము)

స వా అయం యత్పదమత్ర సూరయో జితేంద్రియా నిర్జితమాతరిశ్వనః|

పశ్యంతి భక్త్యుత్కలితామలాత్మనా నన్వేష సత్త్వం పరిమార్ష్టమర్హతి॥

ఈ శ్రీకృష్ణుడే స్వయముగా సాక్షాత్తు పూర్ణబ్రహ్మ పరమాత్మ. ఇస్వామి సాక్షాత్కారమునకై విద్వాంసులు తమ ఇంద్రియములను వశపరచుకొని, ప్రాణాయామాది సాధనల ద్వారా అన్వేషించుచుందురు. వారి శుద్ధాంతః కరణమునందు భక్తి కుదురుకొని, అది సత్త్వగుణయుక్త మైనప్పుడు ఈ ప్రభువుయొక్క అనుగ్రహమువలన వారికి సాక్షాత్కారము కలుగును. అట్టి  పరమాత్ముడే ఇప్పుడు మనముందున్నాడు. బుద్ధిని శుద్ధము చేయదగినవాడు ఈ శ్రీకృష్ణపరమాత్ముడే కాని, ఆ యోగసాధనలు కావుగదా!

10.24 (ఇరవైనాలుగవ శ్లోకము)

స వా అయం సఖ్యనుగీతసత్కథో వేదేషు గుహ్యేషు చ గుహ్యవాదిభిః|

య ఏక ఈశో జగదాత్మ లీలయా సృజత్యవత్యత్తి న తత్ర సజ్జతే॥394॥

ఓ ప్రియసఖులారా! ఎవ్వాని మనోహరములను గుహ్యములును అగు లీలలు వేదవాఙ్మయము నందలి రహస్యభాగములలో పరమభక్తులచే వర్ణింపబడినచో  ఆ దేవదేవుడు ఈతడే. భౌతికజగమును సృష్టించి, పోషించి, లయింపజేయుచున్నను ప్రభావితుడు కాక నిలిచియుండునది కేవలము ఈతడే. 

10.25 (ఇరవ ఐదవ శ్లోకమ)

యదా హ్యధర్మేణ తమోధియో నృపా జీవన్తి తత్రైష హి సత్త్వతః కిల|

ధత్తే భగం సత్యమృతం దయాం యశో భవాయ రూపాణి దధద్యుగే యుగే॥395॥

రాజులు, పరిపాలకులు జంతువుల వలె తమోగుణమున జీవించినపుడు దివ్యరూపమున వాస్తవమగు తన దివ్యశక్తిని ప్రదర్శించెడి ఈతడు భక్తుల యెడ ప్రత్యేక కరుణను జూపుచు, అద్భుతకర్మల నొనరించుచు వివిధకాలములకు, యుగములకు అవసరమైన పలు దివ్యరూపములను ప్రదర్శించుచుండును. 

10.26 (ఇరవై ఆరవ శ్లోకం)

అహో అలం శ్లాఘ్యతమం యదోః కులమహో అలం పుణ్యతమం మధోర్వనమ్|

యదేష పుంసామృషభః శ్రియః పతిః స్వజన్మనా చంక్రమణేన చాంచతి॥396॥

అహో! యదువంశము ఎంత శ్లాఘతమమైనది! అలాగుననే సర్వజీవుల దివ్యప్రభువును లక్ష్మీపతియును అగు ఈతడు జన్మనొంది, బాల్యమున చరించినట్టి మధురానగర భూమి ఎంత పుణ్యతమమైనది!

10.27 (ఇరవై ఏడవ శ్లోకము)

అహో బత స్వర్యశసస్తిరస్కరీ కుశస్థలీ పుణ్యయశస్కరీ భువః|

పశ్యన్తి నిత్యం యదనుగ్రహేషితం స్మితావలోకం స్వపతిం స్మ యత్ప్రజాః॥397॥

ద్వారకానగరము స్వర్గలోకముల యశస్సును అతిశయించి ధరిత్రి యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేయుట నిస్సందేహముగా పరమాద్భుతమ్! ద్వారకా వాసులు సర్వజీవులకు ఆత్మయైనవానిని (శ్రీకృష్ణుని) అతని ప్రేమమయి రూపమున సదా గాంచుచుందురు. ఆతడును వారిని గాంచుచు మధుర హాసములతో అనుగ్రహించుచుండును.

10.28 (ఇరవై ఎనిమిదవ శ్లోకము)

నూనం వ్రతస్నానహుతాదినేశ్వరః సమర్చితో హ్యస్య గృహీత పాణిభిః|

పిబన్తి యాః సఖ్యధరామృతం ముహుర్వజస్త్రియః సమ్ముముహుర్యదాశయాః॥398॥

ఓ సఖులారా! ఈతడి పాణిగ్రహణము కావించిన రాణుల నొకమారు తలపుడు. ఇప్పుడు ఈతని అధరామృతమును (చుంబనమ ద్వారా) నిరంతరము ఆస్వాదించుటకు వారెన్ని వ్రతములను, స్నానములను, యజ్ఞములను, భగవత్పూజలను గావించిరో కదా! అటువంటి అనుగ్రహమును అపేక్షించుట చేతనే వ్రజభూమి యందలి గోపికలు తరచు మూర్చిల్లెడివారు.

10.29 (ఇరవై తొమ్మిదవ శ్లోకము)

యా వీర్యశుల్కేన హృతాః స్వయంవరే ప్రమథ్య చైద్యప్రముఖాన్ హి శుష్మిణః|

ప్రద్యుమ్నసాంబాంబసుతాదయోఽపరా యాశ్చాహృతా భౌమవధే సహశ్రసః॥399॥

ప్రద్యుమ్నుడు, సాంబుడు, అంబుడు వంటివారు ఆ రాణల సంతానమై యున్నారు. రుక్మిణీదేవి, సత్యభామ, జాంబవతి వంటి స్త్రీలను ఈతడు శిశుపాలుని అధ్యక్షతన గల పలువురు శక్తిమంతులైన రాజులను ఓడించిన పిమ్మట స్వయంవరముల నుండి బలవంతముగా హరించియున్నాడు. ఇతర స్త్రీలు కూడా భౌమాసురుడు మరియు అతని వేలాది అనుచరుల వధ పిమ్మట ఈతనిచే గొనిపోబడిరి. ఆ స్త్రీలందరును నిక్కముగా మహిమాన్వితులు.

10.30 (ముప్పైయవ శ్లోకము)

ఏతాః పరం స్త్రీత్వమపాస్త పేశలం నిరస్తశౌచం బత సాధు కుర్వతే|

యాసాం గృహాత్పుష్కరలోచనః పతిర్నజాత్వ పైత్యాహృతిభిర్హ్ళది స్పృశన్॥400॥ 

ఆ స్త్రీలందరు అబలలు అపవిత్రులైనను తమ జన్మలను ధన్యము కావించుకొనిరి. పుష్కరాక్షుడగు వారి భర్త వారిని గృహమునందు ఏ
నాడును ఒంటరిగా వదలలేడు. విలవైన బహుమానముల నొసగుట ద్వారా అతడు సదా వారి హృదయములకు ముదమును గూర్చెను.

10.31 (ముప్పైఒకటవ శ్లోకము)

ఏవంవిధా గదన్తీనాం స గిరః పురయోషితామ్|

నీరీక్షణేనాభినన్దన్ సస్మితేన యయౌహరిః॥401॥

హస్తినాపుర స్త్రీలు ఈ విధముగా భగవానుని అభినందించుచు సంభాషించుకొనుచుండగా ఆ దేవదేవుడు వారి శుభాభినందనలను గైకొని వారిపై కరుణాదృష్టిని సారించి నగరము నుండి నిష్క్రమించెను.

10.32 (ముప్పైరెండవ శ్లోకము)

అజాతశత్రుః పృతానాం గోపీథాయ మధుద్విషః|

పరేభ్యః శంకితం స్నేహాత్ ప్రాయూఙ్త్క చతురంగిణీమ్॥401॥

ధర్మరాజు అజాతశత్రువైనను అసురారియైనను శ్రీకృష్ణుని వెంట చతురంగబలములను (రథ,గజ,తురగ,పదాతిదళము) నియుక్తము చేసెను. శత్రుకారణముననే గాక భగవానుని యెడ గల ప్రేమకారణమునను అతడు అది కావించెను.

10.33 (ముప్పైమూడవ శ్లోకము)

అథ దూరాగతాన్ శౌరిః కౌరవాన్ విరహాతురాన్|

సన్నివర్త్య దృఢం స్నిగ్ధాన్ ప్రాయత్స్వనగరీం ప్రియైః॥403॥

శ్రీకృష్ణుని యెడ గల ప్రగాఢమైన అనురాగము వలన కురువంశీయులైన పాండవులు వీడ్కోలు పలుకుటకై బహుదూరము వరకు అతనిని అనుసరించిరి. భావినియోగమును గూర్చిన ఆలోచనతో వారు ఉద్విగ్నులైరి. అయినప్పటికిని ఆ దేవదేవుడు వారిని గృహమునకు మళ్ళింపజేసి తన ప్రియసహచరులను గూడి ద్వారకకు ప్రయాణించెను.

10.34 (ముప్పైనాలుగవ శ్లోకము)

కురుజాంగలపాంచాలాన్ శూరసేనాన్ సయామునాన్|

బ్రహ్మావర్తం కురుక్షేత్రం మత్స్యాన్ సారస్వతానథ॥404॥

10.35 (ముప్పైఐదవ శ్లోకము)

మరుధన్వమతిక్రమ్య సౌవీరాభీరియోః పరాన్|

ఆనర్తాన్ భార్గవోపాగాచ్ఛ్రాన్తవాహో మనాగ్విభుః॥405॥

ఓ శౌనకా! శ్రీకృష్ణభగవానుడు పిదప కురుజాంగలమును, పాంచాలమును, యమునాతటమున గల శూరసేన ప్రాంతమును, బ్రహ్మావర్తమును, కురుక్షేత్రమును, మత్స్యదేశమును, ఎడారిప్రాంతమైన సారస్వతమును మరియు స్వల్పజల ప్రాంతమును దాటెను. ఆ ప్రాంతములను దాటిన పిమ్మట అతడు క్రమముగా సౌవీరము, అభీరములనెడి ప్రాంతములను చేరి పిదప పడమటన గల ద్వారకకు సమీపించెను. 

10.36 (ముప్పైఆరవ శ్లోకము)

తత్ర తత్ర హ తత్రత్యైర్హరిః ప్రత్యుద్యతార్హణః|

సాయం భేజే దిశం పశ్చాద్గవిష్ఠో గాం గతస్తదా॥406॥

ఆ ప్రాంతముల గుండా ప్రయాణించునపుడు జనులు ఆ దేవదేవుని ఆహ్వానించి, పూజించి, వివిధ కానుకల నర్పించిరి. సంధ్యాది కర్మలను గావించుటకు అతడు (అన్ని ప్రాంతములలో సాయం సమయమున) ప్రయాణమును నిలిపివేసెను. సూర్యాస్తమయము పిమ్మట అది క్రమము ననుసరించి పాటింపబడెను.

శ్రీమద్భాగవతము నందలి "శ్రీకృష్ణుని ద్వారకామనము" అను ప్రథమస్కంధములోని పదియవ అధ్యాయము సమాప్తము.

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

21.1.2022 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

పదకొండవ అధ్యాయము

శ్రీకృష్ణుని ద్వారకాగమనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
11.1 (ఒకటవ శ్లోకము)

సూత ఉవాచ

ఆనర్తాన్ స ఉపవ్రజ్య స్వృద్ధాన్జానపదాన్ స్వకాన్|

దధ్మౌ దరవరం తేషాం విషాదం శమయన్నివ॥407॥

సూతగోస్వామి పలికెను: ఆనర్తదేశముగా (ద్వారక) తెలియబడు సమృద్ధవంతమైన స్వీయనగరు పొలిమేరను చేరినంతట శ్రీకృష్ణభగవానుడు తన ఆగమనమును దాటుచు తద్దేశవాసుల విషాదమును శమింపజేయునట్లుగా తన మంగళప్రదమైన శంఖమును పూరించెను.

11.2 (రెండవ శ్లోకము)

స ఉచ్చకాశే ధవలో దరో దరోఽప్యురక్రమస్యాధరోశోణ శోణిమా|

దాధ్మాయమానః కరకంజసంపుటే యథాబ్జఖండే కలహంస ఉత్స్వనః॥408॥

శ్రీకృష్ణుని కరకమలమున ధరింపబడిన తెల్లని లావైన శంఖము ఆ దేవదేవుని దివ్యాధరముల స్పర్శచే ఎర్రబారినట్లు కన్పట్టెను. తెల్లని రాజహంస ఎర్రని పద్మముల నడుమ క్రీడించు చున్నట్లు అది తోచెను.

11.3 (మూడవ శ్లోకమ)

తముపశ్రుత్య నినదం జగద్భయభయావహమ్|

ప్రత్యుద్యయుః ప్రజాః సర్వా బర్తృదర్శనలాలసాః॥409॥

భౌతికజగమునందలి భయమునకే భయముకలిగించు ఆ ధ్వనిని వినినంతనే ద్వారకావాసులు భక్తరక్షకుడైన ఆ భగవానుని దర్శనాభిలాషులై వేగముగా అతని వైపునకు పరుగుతీసిరి.

11.4 (నాలుగవ శ్లోకము)

తత్రోపనీతబలయో రవేర్దీపమివార్దృతాః|

ఆత్మారామం పూర్ణకామం నిజలాభేన నిత్యదా॥410॥

11.5 (ఐదవ శ్లోకము)

ప్రీత్యుత్ఫుల్లముఖాః ప్రోచుర్హర్షగద్గదయా గిరా|

పితరం  సర్వసుహృదమవితారమివార్భకాః॥411॥

పురజనులు తమతమ కానుకలను గూడి శ్రీకృష్ణుని చేరి పూర్ణకాముడును, ఆత్మారాముడును, స్వీయశక్తిచే  నిరంతరము ఇతరులకు సమస్తము నొసగు వాడును అగు అతనికి వాటిని అర్పించిరి. ఆ కానుకలన్నియును సూర్యునికి  దీపము అర్పించిన చందమున ఉండును. అయినప్పటికిని బాలురు తమ రక్షకుని మరియు తండ్రిని ఆహ్వానించెడి రీతి, వారు శ్రీకృష్ణుని ఆదరించుటకై గద్గద స్వరముతో ఇట్లు పలికిరి.

11.6 (ఆరవ శ్లోకము)

నతాః స్మ తే నాథ సదాంఘ్రిపంకజం విరించవైరించ్యసురేంద్రవందితమ్|

పరాయణం క్షేమమి హేచ్ఛతాం పరం న యత్ర కాలః  ప్రభవేత్ పరః ప్రభుః॥412॥

పురజనులు పలికిరి: హే ప్రభూ! స్వర్గాధిపతి సహా బ్రహ్మదేవుడు, సనకసనందనాదుల వంటి వారి చేతను నీవు అర్చింపబడువాడవు. జీవితపు అత్యున్నత ప్రయోజనమును నిజముగా సాధింపగోరువారికి నీవే చరమాశ్రయమై యున్నావు. నీవు దివ్యప్రభుడవు మరియు అనివార్యమైన కాలము నీపై ఏమాత్రము తన ప్రభావమును చూపలేదు.

11.7 (ఏడవ శ్లోకము)

భవాయ నస్త్వం భవ విశ్వభావన త్వమేవ మాతాథ సుహృత్పతిః పితా|

త్వం సద్గురుర్నః పరమం చ దైవతం యస్యానువృత్త్యా కృతినో బభూవిమ॥413॥

ఓ విశ్వభావనా! నీవే మా జననివి, శ్రేయోభిలాషివి, భగవానుడవు, జనకుడవు, ఆధ్యాత్మికగురుడవు, ఆరాధ్యదేవుడవు అయి యున్నావు. నిన్నే అనుసరించెడి కారణమున అన్నివిధములా మేము కృతార్థులమైతిమి. కనుక నిరంతరము నీ కరుణతో మమ్ము అనుగ్రహింపుమని మేము ప్రార్థించుచున్నాము.

11.8 (ఎనిమిదవ శ్లోకము)

అహో సనాథా భవతా స్మ యద్వయం త్రైవిష్టపానామపి దూరదర్శనమ్|

ప్రేమస్మితస్నిగ్ధనిరీక్షణాననం పశ్యేమ రూపం తవ సర్వసౌభగమ్॥414॥

ఆహా! భాగ్యవశమున నీ సన్నిధిచే నేడు నీ రక్షణమునకు తిరిగి అరుదెంచితిమి. ఏలయన నీవు స్వర్గలోకవాసులను కూడా అరుదుగా గాంతువు. ప్రేమమయ చూడ్కులు కలిగిన నీ స్మితవదనమును గాంచుట మాకిపుడు సాధ్యపడగలదు. సర్వశుభదాయకమైన నీ దివ్యరూపమును మేమిపుడు గాంచగలము.

11.9 (తొమ్మిదవ శ్లోకము)

యర్హ్యంబుజాక్షా పససార భో భవాన్ కురూన్ మధూన్ నాథ సుహృద్దిదృక్షయా|

తత్రాబ్దకోటిప్రతిమః క్షణో భవేద్ రవిం వినాక్ ష్టోరివ నస్తవాచ్యుత॥415॥

ఓ అంబుజాక్షా! మిత్రులము, బంధువులను కలిసికొనుటకు నీవు మథురకు గాని బృందావనమునకు గాని లేక హస్తినాపురమునకు గాని వెడలినపుడు నీ అభావపు ప్రతిక్షణము మాకు లక్షలాది సంవత్సరములుగా తోచును. ఓ అచ్యుతా! ఆ సమయమున సూర్యుడు లేనట్లుగా మా కన్నులు వ్యర్థములగును.

11.10 (పదవ శ్లోకము)

కథం వయం నాథ చిరోషితే త్వయి ప్రసన్నదృష్ట్యాఖిలతాపశోషణమ్|

జీవేమ తే సుందరహాసశోభితమపస్యమానా వదనం మనోహరమ్

ఇతి చోదీరితా వాచః ప్రజానాం  భక్తవత్సలః|

శృణ్వానోఽనుగ్రహం దృష్ట్యా వితన్వన్ ప్రావిశత్పురమ్॥416॥

ఓ ప్రభూ! నీవు సదా పరదేశముననే నిలిచినచో మా సర్వతాపములను హరించునట్టి దరహాసమును కలిగిన నీ మనోహర వదనమును మేము గాంచలేము. నీ సన్నిధి లేకుండా మేమెట్లు జీవింపగలము?

పురజనులు, భక్తుల యెడ కరుణాంతరంగుడైన శ్రీకృష్ణభగవానుడు వారి పలుకులను విని తన దివ్యమగు దృష్టిని సాధించుట ద్వారా వారి అభినందనలను కృతజ్ఞతతో స్వీకరించి ద్వారకా నగరమున ప్రవేశించెను.

11.11 (పదకొండవ శ్లోకము)

మధుభోజదశార్హా ర్హకుకురాన్ధకవృష్ణిభిః|

ఆత్మతుల్యబలైర్గుప్తాం నాగైర్భోగవతీమివ॥417॥

నాగలోక రాజధానియైన భోగవతీనగరము నాగులచే రక్షింపబడినట్లు, శ్రీకృష్ణునితో సమానమైన శక్తిసామర్ధ్యములను కలిగిన వృష్ణివంశజులగు భోజ,మధు,దశార్హ,కుకుర, అంధకులచే ద్వారకానగరము పరిరక్షింపబడెను.

11.12 (పన్నెండవ శ్లోకము)

సర్వర్తుసర్వవిభవ పుణ్యవృక్షలతాశ్రమైః|

ఉద్యానోపవనారామైర్వృత పద్మాకరశ్రియమ్॥418॥

ఆ ద్వారకానగరము సర్వఋతు వైభవములతో నిండియుండెను. ఆశ్రమములు, ఉద్యానవనములు, ఉపవనములు, ఆరామములు, కమలములకు ఆకరమైన జలాశయములు సర్వత్రా శోభిల్లుచుండెను.

11.13 (పదమూడవ శ్లోకము)

గోపురద్వారమార్గేషు కృతకౌతుకతోరణామ్|

చిత్రధ్వజపతాకాగ్రైరన్తః ప్రతిహతాతపామ్॥419॥

శ్రీకృష్ణుని ఆహ్వానించుటకై నగరద్వారము, గృహద్వారములు, రాజమార్గమునందలి తోరణ ద్వారములన్నియును ఉత్సవ చిహ్నములైన మామిడాకులు, అరటిచెట్లతో అలంకరింపబడినవి. ధ్వజములు, తోరణములు, పతాకాగ్రములు సంయుక్తములై సూర్యకాంతిని నిరోధించుచుండెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

21.1.2022 సాయం కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

పదకొండవ అధ్యాయము

శ్రీకృష్ణుని ద్వారకాగమనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉️
11.14 (పద్నాలుగవ శ్లోకము)

సమ్మార్జితమహామార్గరథ్యాపణకచత్వరామ్|

సిక్తాం గంధజలైరుప్తాం ఫలపుష్పాక్షతాంకురైః॥420॥

రాచమార్గములు, చిన్నవీధులు, సందులు, అంగళ్ళు కూడలి ప్రాంతము లన్నియును చక్కగా శుభ్రపరుపబడి సుగంధజలముచే తడుపబడెను. శ్రీకృష్ణుని ఆహ్వానము కొరకై ఫలములు, పుష్పములు, అక్షతలు సర్వత్రా చల్లబడెను.

11.15 (పదిహేనవ శ్లోకము)

ద్వారి ద్వారి గృహాణాం చ దధ్యక్షతఫలేక్షుభిః|

అలంకృతాం పూర్ణకుంభైర్భలిభిర్ధూపదీపకైః॥422॥

నివాసగృహముల ప్రతి గృహద్వారము నందును మంగళకరములైనట్టి పెరుగు, అక్షతఫలములు, చెరుకుగడలు, జలపూర్ణకుంభములు, ధూపదీపములను కూడిన పూజాసామాగ్రి అమర్చబడినవి.

11.16 (పదహారవ శ్లోకము)

నిశమ్య ప్రేష్ఠమాయాన్తం వసుదేవో మహామనాః|

అక్రూరశ్చోగ్రసేనశ్చ రామశ్చాద్భుతవిక్రమః॥423॥

11.17 (పదిహేడవ శ్లోకం)

ప్రద్యుమ్నశ్చారుదేష్ణశ్చ సాంబో జాంబవతీసుతః|

ప్రహర్షవేగోచ్ఛశితశయనాసనభోజనాః॥424॥

తమప్రియతముడైన శ్రీకృష్ణుడు ద్వారకాధామమునకు అరుదెంచినాడని వినినంతనే వసుదేవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, (మానవాతీతమగు శక్తిమంతుడగు) బలరాముడు, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, జాంబవతీ తనయుడైన సాంబుడు మున్నగువారు ఆనందాతిరేకముతో శయనాసన భోజనాదులను విడిచిపెట్టిరి.

11.18 (పద్దెనిమిదవ శ్లోకము)

వారణేన్ద్రం పురస్కృత్య బ్రాహ్మణైః ససుమంగళైః|

శంఖతూర్యనినాదేన బ్రహ్మఘోషేణ చాదృతాః|

ప్రత్యుజ్జగ్మూ రథైర్హృష్టాః ప్రణయాగతసాధ్వసాః॥425॥

పుష్పములను పట్టుకొనిన బ్రాహ్మణులను గూడి వారందరును రథములపై శ్రీకృష్ణుని చెంతకు వేగముగా చనిరి. శుభచిహ్నములైన గజములు వారి ముందర నడిచినవి. శంఖతూర్యములు మ్రోగింపబడుచుండగా వేదమంత్రములు పలుకబడెను. ఆవిధముగా వారందరును ప్రణయాగతమైన వందనముల నర్పించిరి.

11.19 (పందొమ్మిదవ శ్లోకము)

వారముఖ్యాశ్చ శతశో యానైస్తద్దర్శనోత్సుకాః|  

లసత్కుండలనిర్భాతకపోలవదనశ్రియః॥426॥

అదే సమయమున వందలాది ప్రసిద్ధి చెందిన వారకాంతలు వివిధ వాహనములపై ప్రయాణమైరి. వారందరును శ్రీకృష్ణుని కలియుట కొరకు మిగుల ఆతురతను కలిగియుండిరి. కపోలశోభను ఇనుమడింపజేయు తేజోమయ కర్ణకుండలములచే వారి సుందరవదనములు అలంకృతములై యుండెను.

11.20 (ఇరవైయవ శ్లోకము)

నటనర్తకగన్ధర్వాః సూతమాగధవన్దినః| 

గాయన్తి చోత్తమశ్లోకచరితాన్యద్భుతాని చ॥427॥

నిపుణులైన నటులు, కళాకారులు, నర్తకులు, గాయకులు, సూతులు, మాగధులు, పాండిత్యము కలిగిన వక్తలు శ్రీకృష్ణభగవానుని మానవాతీత కర్మలచే ఉత్తేజితులైనవారై తమవంతు సేవాకార్యమును ఒసగుచు ముందుకు సాగిరి.

11.21 (ఇరవై ఒకటవ శ్లోకము)

భగవాంస్తత్ర బంధూనాం పౌరాణామనువర్తినామ్|

యథావిధ్యుపసంగమ్య సర్వేషాం మానమాదధే॥428॥

దేవదేవుడైన శ్రీకృష్ణుడు తనకు ఆదరమొసగి స్వాగతము పలుక అరుదెంచిన బంధువులను, పురజనులను, ఇతరులనందరినీ కలిసికొని ప్రతియొక్కరికి తగిన గౌరవమర్యాదలనొసగెను.

11.22 (ఇరవై రెండవ శ్లోకము)

ప్రహ్వాభివాదనాశ్లేషకరస్పర్శస్మితేక్షణైః|

ఆశ్వాస్య చాశ్వపాకేభ్యో వరైశ్చాభిమతైర్విభుః॥429

సర్వశక్తిసంపన్నుడైన శ్రీకృష్ణభగవానుడు తన శిరమును వంచుట ద్వారా, అభివాదనల ద్వారా, అభినందనల ద్వారా, ఆలింగనము ద్వారా, కరచాలనము ద్వారా, ధరహాసవీక్షణముల ద్వారా, ఆశ్వాసమును గూర్చుట ద్వారా, వరముల నొసగుట ద్వారా అతి నీచ స్థాయికి చెందినవారితో సహా అచటకు చేరిన ప్రతియొక్కరిని అభినందించెను.

11.23 (ఇరవై మూడవ శ్లోకము)

స్వయం చ గురుభిర్విప్రైః సదారైః స్థవిరైరపి|

ఆశీర్భిర్యుజ్యమానోఽన్యైర్వన్దిభిశ్చావిశత్పురమ్॥430॥

ఆశీర్వాదముల నొసగుచు తన మహిమలను కీర్తించెడి పత్నీసహిత వృద్ధ బ్రాహ్మణులను, పెద్దవారైన బంధువులను గూడి తదుపరి శ్రీకృష్ణభగవానుడు ద్వారకానగరమున ప్రవేశించెను. ఇతరులును ఆ దేవదేవుని మహిమలను కొనియాడిరి. 

11.24 (ఇరవై నాలుగవ శ్లోకము)

రాజమార్గం గతే కృష్ణే ద్వారకాయాః  కులస్త్రియః|

హర్మ్యాణ్యారురుహుర్విప్ర తదీక్షణమహోత్సవాః॥431॥

శ్రీకృష్ణుడు రాజమార్గము గుండా చనునప్పుడు అతని దర్శనమునకై ద్వారకానగర కులస్త్రీలు తమ తమ ప్రాసాదముల ఉపరిభాగమున చేరిరి. అట్టి దర్శనమును వారు మహోత్సవముగా భావించిరి.

11.25 (ఇరవై ఐదవ శ్లోకము)

నిత్యం నిరీక్షమాణానాం యదపి ద్వారకౌకసామ్|

న వితృప్యన్తి హి దృశః శ్రియోధామాంగమచ్యుతమ్॥432॥

ద్వారకావాసులు సౌందర్యనిధియైన అచ్యుతుని నిత్యము గాంచుటకు అలవాటు పడినను ఎన్నడును సంతృప్తి చెందలేదు.

11.26 (ఇరవై ఆరవ శ్లోకము)

శ్రియో నివాసో యస్యోరః పానపాత్రం ముఖం దృశామ్

బాహవో లోకపాలానాం సారంగాణాం పదాంబుజమ్|॥433॥

శ్రీకృష్ణుని వక్షస్థలము లక్ష్మీదేవికి నివాసస్థానము. సౌందర్యపిపాస కలిగిన నేత్రములకు ఆతని ముఖచంద్రము పానపాత్రము, ఆతని భుజములు లోకపాలురగు దేవతలకు విశ్రాంతిస్థానము మరియు ఆ దేవదేవుని పాదపద్మములు ఆతనికి అన్యమగు విషయములు చర్చించుట గాని, కీర్తించుటగాని చేయని శుద్ధ భక్తులకు ఆశ్రయస్థానము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ప్రథమ స్కంధములోని పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏

22.1.2022 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసులవారి సంస్కృత మహాభాగవతం

ప్రథమస్కంధం

పదకొండవ అధ్యాయము

శ్రీకృష్ణుని ద్వారకాగమనము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
11.27 (ఇరవై ఏడవ శ్లోకము)

సితాతపత్ర వ్యజనైరుపస్కృతః ప్రసూన వర్షైరభివర్షితః పథి|

పిశంగవాసా వనమాలయా బభౌ ఘనో యదార్కోడుపచాపవైద్యుతైః॥434॥

శ్రీకృష్ణుడు ద్వారకానగర రాజమార్గము గుండా ప్రయాణీంచునపుడు సూర్యతేజము నుండి తెల్లని ఛత్రము అతని శిరమును రక్షించెను. తెల్లని చామరలు అర్థవృత్తాకారములో వీచబడెను. రహదారిలో పుష్పవృష్టి కురిసెను. అతని పీతవసనములు, పూమాలలు అనునవి కారుమేఘము ఒకే సారి సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తేజము, ఇంద్రచాపములతో పరివృత్తమైనట్లు భావనను కలుగ జేసెను.

11.28 (ఇరవై ఎనిమిదవ శ్లోకము)

ప్రవిష్టస్తు గృహం పిత్రోః పరిష్వక్తః స్వమాతృభిః|

వవన్దే శిరసా సప్త దేవకీ ప్రముఖా ముదా॥435॥

తన పితృగృహమున ప్రవేశించినంతట ఆ దేవదేవుడు అచటగల తల్లులచే ఆలింగనము చేసికొనబడెను. పిదప అతడు దేవకీదేవి (స్వంతజనని) అధ్యక్షతన గల వారందరికిని శిరము వంచి నమస్కరించెను.

11.29 (ఇరవైతొమ్మిదవ శ్లోకము)

తాః పుత్రమంకమారోప్య స్నేహస్నుతపయోధరాః|

హర్షవిహ్వలితాత్మానః సిషిచుర్నేత్రజైర్నలైః॥436॥

జననులందరును తమ పుత్రుని ఆలింగనము చేసికొనిన పిమ్మట ఆతనిని తమ అంకముపై కూర్చుండబెట్టుకొనిరి. ప్రేమాతిరేకముచే వారి స్తనముల నుండి క్షీరము స్రవించెను. వారు హర్ష విహ్వలురు కాగా వారి కన్నీరు దేవదేవుని తడిపి వేసెను.

11.30 (ముప్పైయవ శ్లోకము)

అథావిశత్ స్వభవనం సర్వకామమనుత్తమమ్|

ప్రాసాదా యత్ర పత్నీనాం సహస్రాణి చ షోడశ॥437॥

తదుపరి శ్రీకృష్ణుడు సమగ్రముగా తన భవనములందు ప్రవేశించెను.  వాటి యందు పదహారువేలకు పైగా గల అతని పత్నులు వసించి యుండిరి.

11.31 (ముప్పై ఒకటవ శ్లోకము)

పత్న్యః పతిం ప్రోష్య గృహానుపాగతం విలోక్య సంజాతమనోమహోత్సవాః

ఉత్తస్థురారాత్ సహసాసనాశయాత్ సాకం వ్రతైర్వ్రీడితలోచనాననాః॥438॥

శ్రీకృష్ణుని రాణులందరూ తమ నాథుడు బహుకాలము పిదప పరదేశము నుండి గృహమునకు తిరిగి వచ్చుటను గాంచి అంతరంగమున మహోత్సాహమును పొందిరి. వారందరు ధ్యానము నుండి వెలకి వచ్చి ఆసనముల నుండి ధిగ్గునలేచి నిలబడిరి. సాంఘిక కట్టుబాటు ననుసరించి లజ్జావదనులై ముఖమును కప్పుకొని వారు బిడియముగా అతనిని గాంచిరి.

11.32 (ముప్పై రెండవ శ్లోకము)

తమాత్మ జైర్దృష్టిభిరన్తరాత్మనా దురన్తభావాః పరిరేభిరే పతిమ్|

నిరుద్ధమప్యాప్రసదంబు నేత్రయో ర్విలజ్జతీనాం భృగువర్య వైక్లవాత్॥439॥

లజ్జాపూరితులైన రాణులు అసాధ్యమగు విహ్వలత కారణమున తొలుత శ్రీకృష్ణుని తమ హృదయాంతరాళమునందు ఆలింగనము చేసికొనిరి. పిదప దృష్టిచే అతనిని ఆలింగనము చేసికొని, ఆ పిదప తమ పుత్రులను అతని పరిష్వంగమునకై (స్వయముగా ఆలింగనము చేసికొనుటతో సమానము) పంపిరి. కాని ఓ భృగువర్యా! వారెంతగా తమ భావములను నిరోధింప యత్నించినను వివశత్వముచే అశ్రువులను రాల్చిరి.

11.33 (ముప్పై మూడవ శ్లోకము)

యద్యప్యసౌ పార్శ్వగతో రహోగతస్తథాపి తస్యాంఘ్రియుగం నవం నవమ్|

పదే పదే కా విరమేత తత్పదాచ్చలాపి యచ్ఛ్రీర్న జహాతి కర్హిచిత్॥440॥

దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఏకాంతముగా తమ చెంతనే సదా నిలిచియున్నను ఆదేవదేవుని ఆంఘ్రియుగ్మము వారికి నిత్యనూతనముగా తోచుచుండెను. చంచల స్వభావయైన లక్ష్మీదేవియే అతని పాదపద్మములను వీడలేకున్నచో ఒకమారు ఆపాదములకు శరణుజొచ్చి పిమ్మట ఏస్త్రీయైనను ఎట్లు వాటికీ దూరము కాగలదు?

11.34 (ముప్పై నాలుగవ శ్లోకము)

ఏవం నృపాణాం క్షితిభారజన్మ నామక్షౌహిణీభిః  పరివృత్త తేజసామ్|

విధాయ వైరం శ్వసనో యథాసలం మిథో వధేనోపరతో నిరాయుధః॥441॥

రథ, గజ, తురగ, పదాతిదళ సైన్యబలముతో విర్రవీగి భూభారముగా మారినట్టి రాజులను వధించి శ్రీకృష్ణభగవానుడు ఉపశమనము పొందెను. వెదురుపొదల యందు రాపిడిని సృష్టించి తద్ద్వారా అగ్నిని ప్రజ్వరిల్లజేయు వాయువు రీతి, ఆ దేవదేవుడు ఎవరిపక్షమునను యుద్ధము చేయక కేవలము శక్తిమంతులైన రాజుల నడుమ వైరమును కల్పించగా వారు ఒకరితో నొకరు యుద్ధము చేసిరి.

11.35 (ముప్పై ఐదవ శ్లోకము)

స ఏష నరలోకేఽస్మిన్నవతీర్ణః స్వమాయయా|

రేమే స్త్రీరత్నకూటస్థో భగవాన్ ప్రాకృతో యథా॥442॥

ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన నిర్హేతుక కరుణచే ఆంతరంగిక శక్తి ద్వారా ఈ నరలోకమున అవతరించి తాను ప్రాకృతకర్మల యందు నియుక్తుడైనట్లుగా స్త్రీరత్నములతో క్రీడించెను.

11.36 (ముప్పై ఆరవ శ్లోకము)

ఉద్దామభావపిశునామలవల్గుహాసవ్రీడావలోకనిహతో మదనోఽపి యాసామ్|

సమ్ముహ్య చాపమజహాత్ప్రమదోత్తమాస్తా  యస్యేన్ద్రియం విమథితుం కుహకైర్న శేకుః॥443॥

రాణుల సుందరహాసములు, క్రీగంటిచూపులు, అమలములు మరియు ఉత్తేజకరములైనను, భంగముతో మన్మథుడే తన ధనస్సును త్యజించునట్లుగా చేసి అతనిని వారు జయింపగలిగినను, ధీరుడైన పరమశివుడే వారిచే సమ్మోహితుడు కాగలిగినను వారు తమ హావభావ ఆకర్షణలచే శ్రీకృష్ణుని ఇంద్రియములను కలత పెట్టలేకపోయిరి.

11.37 (ముప్పై ఏడవ శ్లోకము)

తమయం మన్యతే లోకో హ్యసంగమపి సంగినమ్|

ఆత్మౌ పమ్యేన మనుజం వ్యాపృణ్వానం యతోఽబుధః॥444॥

బద్ధజీవులైనవారు శ్రీకృష్ణభగవానుని తమలో ఒకనిగా భావింతురు. ఆ దేవదేవుడు అసంగుడైనను వారు అజ్ణాన కారణమున ఆతనిని భౌతికపదార్థముచే ప్రభావితుడైనవానిగా తలతురు.

11.38 (ముప్పై ఎనిమిదవ శ్లోకము)

ఏతదీశనమీశస్య ప్రకృతిస్థోఽపి తద్గుణైైః|

న యుజ్యతే సదాత్మస్థైర్యథా బుద్ధిస్తదాశ్రయా॥445॥

భగవానుని దివ్యత్వమిదియే. ప్రకృతిగుణములతో సంపర్కము కలిగి యున్నను ఆ దేవదేవుడు తద్గుణములచే ప్రభావితడు కాడు. అదే విధముగా అతనిని ఆశ్రయించిన భక్తులు కూడా త్రిగుణములచే ప్రభావితులు కారు.

11.39 (ముప్పై తొమ్మిదవ శ్లోకము)

తం మేనిరేఽబలా మూఢాః స్త్రైణం చానువ్రతం రహః|

అప్రమాణవిదో భర్తురీశ్వరం మతయో యథా॥446॥

అబలలు, సరళ స్వభావులైన రాణులు తమ నాథుడైన శ్రీకృష్ణుడు తమనే అనుసరించుచు తమ వశమున నిలిచియున్నాడని నిక్కముగా తలచిరి. నాస్తికులైనవారు అతనిని పరమనియామకునిగా ఎరగలేని చందమున వారందరును తమ భర్త యొక్క మహిమల విస్తారము నెరుగకుండిరి.

శ్రీమద్భాగవతము నందలి "శ్రీకృష్ణుని ద్వారకా నగర ప్రవేశము" అను ప్రథమ స్కంధములోని పదునొకండవ అధ్యాయము సంపూర్ణము

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏