9, ఏప్రిల్ 2020, గురువారం

మహాభాగవతం పంచమ స్కంధము - రెండవ అధ్యాయము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

పంచమ స్కంధము -  రెండవ అధ్యాయము

అగ్నీధ్రుని వృత్తాంతము

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


శ్రీశుక ఉవాచ

2.1 (ప్రథమ శ్లోకము)

ఏవం పితరి సంప్రవృత్తే తదనుశాసనే వర్తమాన అగ్నీధ్రో జంబూద్వీపౌకసః ప్రజా ఔరసవద్ధర్మావేక్షమాణః పర్యగోపాయత్॥4039॥

శుకయోగి నుడివెను- తండ్రియైన ప్రియవ్రతుడు ఇట్లు వనములలో తపస్సునందు నిరతుడుకాగా, అతని ఆజ్ఞానుసారము అగ్నీధ్రుడు జంబూద్వీపమునకు రాజయ్యెను. అతడు ప్రజలను కన్నబిడ్డలవలె చూచుకొనుచు ధర్మబద్ధముగా పరిపాలించెను.

2.2 (రెండవ శ్లోకము)

స చ కదాచిత్ పితృలోకకామః సురవరవనితాక్రీడాచలద్రోణ్యాం భగవంతం విశ్వసృజాం పతిమాభృతపరిచర్యోపకరణ ఆత్మైకాగ్ర్యేణ తపస్వీ ఆరాధయాంబభూవ॥4040॥

అతడు సత్సంతానార్థియై ఫలపుష్పాది పూజాద్రవ్యములను అన్నింటిని సమకూర్చుకొని దివ్యభామినులకు క్రీడా భూమియైన  మందరగిరియొక్క లోయకు చేరెను. అతడు తపశ్చర్యయందు నిమగ్నుడై ఏకాగ్ర చిత్తముతో ప్రజాపతులకు పతియైన బ్రహ్మదేవుని ఆరాధించెను.

2.3 (మూడవ శ్లోకము)

తదుపలభ్య భగవానాదిపురుషః సదసి గాయంతీం పూర్వచిత్తం నామాప్సరసం అభియాపయామాస॥4041॥

అప్ఫుడు ఆది పురుషుడైన బ్రహ్మదేవుడు అతని అభిలాషను గుర్తించెను. అందువలన తన సభయందు గానము చేయుచుండెడి పూర్వచిత్తి అను  అప్సరసను ఆయనకడకు పంపెను.

2.4 (నాలుగవ శ్లోకము)

సా చ తదాశ్రమోపవనమతిరమణీయం వివిధనిబిడవిటపివిటపనికరసంశ్లిష్టపురటలతారూఢస్థల విహంగమమిథునైః ప్రోచ్యమానశ్రుతిభిః ప్రతిబోధ్యమానసలిలకుక్కుటకారండవకలహంసాదిభిర్విచిత్రముపకూజితామల జలాశయకమలాకరమ్ ఉపబభ్రామ॥4042॥

అగ్నీధ్రుని ఆశ్రమ సమీపమునరమణీయమైన ఒక ఉపవనము గలదు. పూర్వచిత్తి అను ఆ అప్సరస ఆవనమునకు చేరి విహరింపసాగెను. ఆ వనమునందు వివిధములగు వృక్షములు దట్టముగా వ్యాపించియుండెను. వాటి కొమ్మలను స్వర్ణకాంతులుగల లతలు అల్లుకొనియుండెను. భూమిపై సంచరించెడి నెమళ్ళు మొదలగు పక్షుల జంటలు ఆ కొమ్మలపై చేరి కలరవములు చేయుచుండెను. జలకుక్కుటములు, బెగ్గురుపక్షులు, కలహంసలు మొదలగు జలపక్షులు కొమ్మలపై చేరియున్న ఆ పక్షుల షడ్జాది మధురస్వరములకు స్ఫూర్తిని పొంది, పలురకముల కలకల ధ్వనులను చేయుచుండెను. అచ్చటి సరస్సులు చక్కగా వికసించియున్న కమలముల శోభతో మనోహరముగా ఉండెను.

2.5 (ఐదవ శ్లోకము)

తస్యాః సులలితగమనపదవిన్యాసగతివిలాసాయాః చానుపదం ఖణఖణాయమానరుచిర చరణాభరణస్వనముపాకర్ణ్య నరదేవకుమమారః సమాధియోగేన ఆమీలితనయననలనముకుల యుగలమీషద్ వికచయ్య వ్యచష్ట॥4043॥

పూర్వచిత్తి యొక్క విలాసవంతమైన గమనమునకు అనుకూలముగా ఆమె పాదవిన్యాసములు అలరారుచుండెను. ఆమె అడుగులు వేయునప్పుడు కాలియందెల రవళులు వీనులవిందు గావించుచుండెను. సమాధిస్థితిలో కనులు మూసికొని, తపమాచరించుచున్న అగ్నీధ్రుడు ఆమెయొక్క కాలియందెల మనోజ్ఞధ్వనులను విని, కమలములవంటి తన నయనములను కొద్దిగా తెరచి చూడగా సమీపమునందే యున్న ఆ  అప్సరస కనబడెను.

2.6 (ఆరవ శ్లోకము)

తామేవావిదూరే మధుకరీమివ సుమనసః ఉపజిఘ్రంతీం దివిజమనుజమనోనయ నాహ్లాదదుఘైర్గతవిహారవ్రీడావినయావలోక సుస్వరాక్షరావయవైః మనసి నృణాం కుసూమాయుధస్య విదధతీం వివరం నిజముఖవిగలితామృతాసవసహాసభాషణామోదమదాంధమధుకరనికరోపరోధేన ద్రుతపదవిన్యాసేన వల్గుస్పందనస్తనకలశకబరభారరశనాం దేవీం తదవలోకనేన వివృతావసరస్యభగవతో మకరధ్వజస్య వశముపనీతో జడవదితి హోవాచ॥4044॥

ఆ అఫ్సరస ఆడు తుమ్మెదవలె ఒక్కొక్కపూవుకడకేగి, దాని పరిమళములను ఆఘ్రాణించుచుండెను. ఆమె వన్నెచిన్నెలు మానవులకేగాక, దేవతలకును ఆహ్లాదమును గూర్చుచుండెను. ఆమె యొయ్యారపు నడకలు, సిగ్గులను ఒలకబోయుచు చంచలములైన ఆమె వినయ వీక్షణములు, మధురములగు పలుకులు, పరిపుష్టములై ఆకర్షణీయముగానున్న ఆమె హృదయ వైభవములు పురుషలలో మన్మథవికారములను రేకెత్తించుచుండెను. దరహాసముతో ఆమె మాట్లాడు చున్నప్పుడు మత్తుగొలిపెడి అమృతమయమైన తేనెలొలుకు చున్నట్లుండెను. ఆమె నిట్టూర్పుల సువాసనలకు ఆకర్షితములైన తుమ్మెదలు ఆమె ముఖకమలముపై ముసురుకొనుచుండెను. వాటి నుండి తప్పించుకొనుటకు ఆమె త్వరత్వరగా నడచుచుండగా కలశముల వంటి ఆమె
కుచములు కదలాడుచుండెను. కొప్పుజారిపోవుచుండెను. ఒడ్డాణము సడలిపోవుచుండెను. ఆమెను చూచినంతనే అగ్రీధ్రుని హృదయములో శృంగార భావములు మొలకెత్తెను. కామవశుడైన ఆ రాజకుమారుడు ఆమెను ప్రసన్నురాలినిగా జేసికొనుటకు ఉన్మత్తుని వలె ఇట్లు పలికెను.

(పంచమ స్కంధము లోని  రెండవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి