6, జూన్ 2022, సోమవారం

* స్టోరీస్

ఆలు -మగల హాస్యానందం!
😊
"ఏఁవోయ్ .... "

"ఆఁ .... "
*కాస్త పూజ చేయనిస్తావా... శ్రీ మతిగారు


"పులుసులో చిలగడ దుంపలు వేసావా, ఘుమఘుమలాడుతోంది?"

"కళ్ళు మూసుకుని పూజ్జేసుకుంటూ మళ్ళీ లౌకికాలు ఎందుకు?"

"కళ్ళు మూసుకున్నాను గానీ ముక్కు మూసుకోలేదుగా?"

"బానే ఉంది. ముందు పూజ కానివ్వండి".

"నైవేద్యానికి ముక్కల పులుసు బ్రహ్మాండంగా ఉంటుందనుకో. భగవంతుడికి ప్రీతికరమైనది".

"మరే .... మీకు కలలోకొచ్చి చెప్పాడాయన!"

"కలలోకే రావాలేఁవిటే రాజ్జం? మనకు ఇష్టమైనవన్నీ ఆ భగవంతుడికి నైవేద్యాలే. అలా నైవేద్య రూపంలో పెడితే మనం తినేవి పూర్తిగా వంటబడతాయ్ .... భక్తిగా తింటాం కాబట్టి".

"ఓహో .... అలాగా?"

"ఆంజనేయ స్వామికి అప్పాలు, వెంకన్నకు దధ్యోజనం, చక్ర పొంగలి, శివుడికి పాయసం, విఘ్నేశ్వరుడికి లడ్లు, కుమారస్వామికి తేనె, పాలు .."

"ఇంకా ....?"

"అసలు మహా నైవేద్యం అంటేనే మనకు ఇష్టమైనవి మనఃస్పూర్తిగా తినడానికేనే .... ఆ భగవంతుడి పేరు చెప్పి కళ్ళకద్దుకుని ఆరగించడఁవే".

"మరి అమ్మ వారికి ఇష్టమైనవి చెప్పలేదెందుకో?"

"దుర్గమ్మకు పులిహోర, శ్రీ మహా లక్ష్మీకి పూర్ణాలు ...."

"అవేఁవీ కావు .... "

"మరి .... ?"

"అమ్మ వారికి వడ్రాణ్ణం, గాజులు, కమ్మలు, వంకీలు, బుట్టలు, చంద్రహారం, జడలో చామంతి బిళ్ళ  ...."

"ఆపుతావా దండకం? నీకిష్టమైనవాటన్నిటికీ అమ్మవారి పేరు చెబుతావా?"

"మీకిష్టమైన వాటికి భగవంతుడి పేరు చెప్పుకోవడం లేదేంటి మరి?"

"నన్ను కాసేపు పూజ్జేసుకోనిస్తావా? అసలు నిన్ను కదిలించడం నాదీ బుధ్ధి తక్కువ".

"మీరా, నేనా కదిలించింది? శ్రావణ మాసానికి ఏం చేయించుకున్నావని అమ్మాయడుగుతోంది".

"శ్రీ మహా విష్ణోరాఙ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యః బ్రహ్మణః ద్వితీయ పదార్ధే శ్వేత వరాహ కల్పే వైవశ్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైఋతి ప్రదేశే ...."

"నైఋతి ఇక్కడ కాదు, ఈశాన్య ప్రదేశే .... అని చెప్పుకోవాలి".

"నీతో ఇంకొంచెం సేపు మాట్లాడితే ప్రవర కూడా మరచిపోతాను".

🤫
*..నాటి గుర్తులు నేటి పిల్లలకు (14-06-2022)
ప్రియమైన  స్నేహితులు సరదాగా చదివి  ఆనందించి  నవ్వుకోండి 
16 -60 years    నిండిన   మేము  రెండు   తరాలకు    సాక్షులం 
స్వచ్చమైన     గాలి  నీళ్ళు,.      పచ్చటి  పొలాలు.  
పరిశుభ్రమైన.    వాతావరణం  లో  పుట్టి.    పెరిగిన   వాళ్ళం... 
తలపై   నుండి.    చెంపల   మీదకు     కారిపోయేలా    నూనె రాసుకుని..
 చేతికి     పుస్తకాల.   సంచి తగిలించుకుని...,
ఒక్కడిగా.    బయలుదేరి    దారిలో స్నేహితులను
ఒక్కొక్కళ్లను.      కలుస్తూ పెద్దగుంపుగా.  
 కిలోమీటర్ల    దూరంలో     ఉన్న  బడికి     కాళ్లకు    చెప్పులు    లేకుండా    నడచి   వెళ్ళిన     తరం వాళ్ళం,
జారిపోయే    నిక్కరు    మీదకు   మొలతాడు.   లాక్కుంటు ..., చిరుగు.    బొక్కలకు    గుడ్డ ముక్కలు    అతుకు లేయించుకున్న వాళ్ళం 
10 వ తరగతి    అయ్యే  వరకు    నిక్కరు.   వేసుకున్న.  ,  తరం మాదే..
గోలీలు,     బొంగరాలు,
కర్రా బిళ్ళ, 
నేలా బండ,.    ఉప్పాట,
ఏడు పెంకులాట.....
   బంతి పుచ్చుకుని.   నేరుగా కొట్టేసుకుంటే    బంతి    లాగ  వంటి మీద    ముద్ర   పడే      ముద్రబాల్.   లాంటి    ఆటలాడిన తరం...,
బడికి    వేసవి కాలం.   , సెలవులు రాగానే   తాటి చెట్లూ,. ..  సీమ తుమ్మ చెట్లూ    ఈతచెట్లు    ఎక్కి కాయలు.   కోసుకొని    తిన్న వాళ్ళం,   చెరువులు,     కాలవల్లో స్నానాలు     చేసిన   వాళ్ళం.   , తాటి   బుర్రలు     బండితో ఆడినోళ్లం...
దీపావళి  కి.    తాటి    బొగ్గుల రవ్వల   దివిటీ    కోసం   వళ్ళంతా మసి   పూసుకొని     మరీ     తయారు చేసుకనే    వాళ్ళం.
5 ps     ఐస్   తిన్నది   మేమె. ,,  .  పది    పైసలతో   బళ్ళో.  మ్యాజిక్   షో.   చూసింది    మేమే.... 
 వర్షం   వస్తె   తాటాకు.  గొడుగూ,    యూరియా   సంచులు, కప్పుకుని   బడికి  వెళ్ళిన    వాళ్ళం..
 second    hand   text  books     కోసం     పరీక్షలు 
అయినప్పటి    నుండి   ముందు తరగతి   వాళ్ళని    బతిమాలిన తరం.
సెకెండ్   హ్యాండ్    సైకిల్  తొ  పక్క.   తొక్కుడుతో      సైకిల్ నేర్చుకున్నోల్లo     మేమే...
ఉత్తరాలు.., రాసుకున్న..   ,అందుకున్న తరంవాళ్ళం... 
పండగ    సెలవులు,
వేసవి   సెలవులు. , ,దసరా,  సంక్రాంతి   సెలవులు
ఎన్ని సెలవులు.   వొచ్చినా   ఐదు పైసలు   ఖర్చులేకుండా    ఆనందాన్ని.   అనుభవించిన    తరంవోళ్ళం...,
  పెద్దలు.  /పిల్లలూ అందరం    వీధి    అరుగుల మీద కూర్చుని   ఎన్నో     సాయంత్రాలు/రాత్రులు   ఆనందంగా    కబుర్లు చెప్పుకుని.   పొట్ట    చెక్కలయ్యేలా
నవ్వుకున్నదీ మేమే.... 
 ఊర్లో,.  ఎవరి   ఇంట్లో    ఏ వేడుక  జరిగినా,.   మన   ఇంట్లో  జరిగినట్లు,.    అంతా మాదే. ,
అంతామేమే.  అన్నట్లుగా    భావించి    స్వచ్చందంగా. / నిస్వార్థంగా    పాలుపంచుకున్న    తరం   మాదే...
ఉర్లో   ఒక    ఇంట్లో   దొంగలు  పడ్డారని ,.  పిల్లలు.    అందరం  కలిసి    ఊరు  చుట్టూ    తెల్లవార్లూ   ఎన్నో రాత్రులు
టార్చిలైట్స్,    కర్రలు  పట్టుకుని  కాపలా కాసిన    వాళ్ళం  మేమే.
ప్రతీ శ్రీరామ
నవమి కీ      గుడి   దగ్గర   తాటాకు పందిరికి     రంగు   కాగితాలు అంటించడం,   ,  మామిడి తోరణాలు కట్టడం.  కోసం.  ముందు రోజు     రాత్రంతా      జాగారం.   చేసింది మేమే.  
చుట్టాలు    వస్తేనే అమ్మ     కోడి కూర.   , వండి పెట్టిన  తరం....
అత్తయ్యా,
మామయ్య,.  ,పిన్ని,,    బాబాయ్,   అక్కా   ,బావ       అంటూ ఆప్యాయంగా    పిలుచుకున్న  తరం,
స్కూలు    మాష్టారు    కనపడితే భయంతో    పక్కనున్న     సందుల్లోకి    పారిపోయిన   తరం... ,
పుల్లల    పొయ్యి    మీద   అన్నం/కూర     ఉడుకుతున్నప్పడు   వచ్చే అద్బుతమైన    పరిమళాన్ని ఆస్వాదించిన   తరం.   వాళ్ళం..,
పొయ్య     మీదనుంచి.   నేరుగా    పళ్ళెం   లోకి    వచ్చిన   వేడి  వేడి అన్నంలో   ఆవకాయ,    వెన్నపూస వేసుకుని    పొయ్యి   దగ్గరే  
తాతయ్యలు.    అమ్మమ్మ/నాయనమ్మ, ,   అమ్మా    నాన్నా, పెదనాన్న. ,, ,పెద్దమ్మ,, . పిన్ని బాబాయ్,.    అత్తయ్య    మామయ్య,   అక్కలు    చెల్లెళ్లు    అన్నయ్యలు   తమ్ముళ్లు   అందరం    ఒకే.   దగ్గర   చేరి    మధురమై.      అనుభూతితో  కూర్చుని   అన్నం.  తిన్న    తరం ..,..
అమ్మమ్మలు. / నాయమ్మల   చేత గోరుముద్దలు   తిన్నది,.   అనగనగా ఒక రాజు....      కథలు   విన్నది  ,
నూనె పిండితో    నలుగు పెట్టించుకుని     కుంకుడు  కాయ పులుసుతో      తలంటు   స్నానం చేయించు కున్న      తరం...,
రేడియో,
దూరదర్శన్
టూరింగ్ టాకీస్.   కాలం చూచిన వాళ్ళం... .
 40 పైసల.   నేల   టిక్కెట్  తో నేల   మీద   కూర్చుని, 
1. .20. రూపాయల    chair   టిక్కెట్ తో  ,,rs 2    ticket    బాల్కనీ లో కూర్చుని    సినిమా  చూచిందీ    మేమే...
యన్.టి.ఆర్. సినిమా అంటే చొక్కాలు చింపుకొనేవాళ్లం, తెల్లవారుజామున 5.00 గంటలకే సినిమా చూసిపవాళ్ళం.
 స్కూల్   , కాలేజీ   రోజుల్లోనే ఎలక్షన్లు   చూచిన    వాళ్ళం.. .
జెండాలు పట్టి తిరిగే వాళ్ళం
అమ్మా   నాన్నా    తో     సంవత్సరానికి   ఒక సారి,   పరీక్ష పాస్     అయ్యావా.. ..    అని మాత్రమే    అడిగించు కున్న   తరం వాళ్ళం...
నాడు లేవు నేడు 
ప్రస్తుత0   ఉన్న    Whatsapp Fb లు   మీతో   పాటు సమానంగా     వాడేస్తున్న మాతరం...,
మేమే    ఆ  తరానికి    ఈ  తరానికి మధ్యవర్తులం...
 మేమే-- -
 అవును.......రెండు   తరాల   మద్యలో    జరిగిన   అనూహ్యమైన    మార్పులకు   మేమే  సాక్షులం  
   అప్పటి గుండె   లోతుల్లో   నుంచి   వచ్చిన     ప్రేమని   చూసిన  వాళ్ళం,
ఇప్పుడు    గుండీల   g పైనుంచి  వచ్చే    ప్రేమని 
చూస్తున్న వాళ్ళం--
ఒక  విధంగా  చెప్పాలంటే   మేం  చాలా     అదృష్టవంతులం...
గతం గతః.. భవిష్యత్ ఇది
_____(()))____
0

* బోధనమెక్కడ..బాధల తక్కెడా
బడి బాటంటే ప్రచార 
బడికి రంగులేసి హంగులున్నాయని 
ఉన్నఊరులో విద్వత్తున్న పాఠశాలని 
హంగులున్న పొరుగూరు పాఠశాలకన్నా మిన్న అని
కార్పొరేటు ప్రయివేటు పాఠశాలలకన్నా గొప్పదని 
మన ఊరు మన బడిలో లక్షల ధనం వెచ్చించామని
బడులను సుందర బృందావనాలుగా తీర్చిదిద్దామని
వేసవిలో బడిబాట పేరుతో పంతుళ్ళను బడికి రమ్మనే
బడిలో మధ్యాహ్న భోజనముందని 
మాబడిలో విశాలమైన ఆటస్థలముందని 
సమగ్ర శిక్షలో సర్వహంగులు కూర్చామని
ఎవరినో చూపిస్తూ మన పాఠశాల వెలుగుతుందని 
కులం పేర మతం పేర బడులు కావని
చిన్నారుల మనసులను కులమతాలతో విడదీయమని
ప్రాంతాలు భాషలపేరుతో విద్యార్థులను రెచ్చగొట్టమని
చిన్నారుల బంగారు కలల్ని భగ్నం చేయమని
మా పాఠశాలలో విందు భోజనముందని 
మాబడులు మంచి ఉత్తీర్ణతతో ప్రగతిపథాన ఉన్నాయని
విద్యార్థుల అభ్యున్నతికై ఎన్నో ప్రణాళికలని 
నేటితరం శిక్షకులే ఉత్తమ ఉపాధ్యాయులని
సిలబస్సును చిత్రవిచిత్రాలుగా మార్చమని
చిన్నారుల గుణాన్ని మార్చమని
మరోసారి మరోయేడు పాఠశాలల పునఃప్రారంభం అవుతున్నదని విద్యాబోధనే ధ్యేయమని నిరంతరం కృషి చేయాలని మాసంకల్పమని మరీ మరీ ప్రజలందరికీ వినయపూర్వకముగా తెలియపరుస్తూ మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెట్టండి నేటి విద్యార్థులే రేపటి పౌరులు 
సర్కారు బడుల్లో పడిపోతున్న సంఖ్య స్థాయిని పట్టించుకునేదెవ్వరని అనకండి 
కానీ ఈ పరిస్థితిని తెస్తారని నేననుకోలేదు. ఆంగ్లభాష పైఆశలొద్దు, మాతృభాషలో వుంది ముద్దు. అర్ధం పరమార్ధం తెలుపుటకు తెలుగు భాష ఉత్తమం మనం మనరాష్ట్రంలో నే బ్రతుకుతాం.పరరాష్ట్రభా‌ష నేర్పి ఉన్న గూడు వదలి పరుల పంచచేరి బ్రతుకు అవసరమా 
తెలుగు భాష తేటతేనియల మాధుర్యం మాయమైనదని
పరీక్షల్లో మేటిపోటీ ఉండాలంటేఆంగ్ల మాధ్యమం ముద్దని
క్రొత్త క్రోత్త విషయాలను ప్రవేశపెడుతున్నామని 
అటు ఆంగ్లంరాక ఇటు తెలుగు ఉర్దూ మాతృభాషలు రాక
ఎక్కడో సంధిగ్ధస్థితిలో అభ్యసనార్థులు
తెలుగులో చదివిన అధ్యాపకులు భాషనుమరచి భాషణం
ఆంగ్లం చదవనివారితో ఆంగ్ల మాధ్యమంలో బోధన
సంకరణ వంకరలలో ఎటు పోతున్నామనే సంశయం!
చిన్నారుల మానసిక స్థితిని మరిచి విద్యాబోధనం
అభ్యసనంలో ఉపాధ్యాయులు చిన్నారుల సంసిద్ధత ప్రశ్నార్థకం ?
 వాస్తవాలను మరచిన నేటి తల్లితండ్రులు భూమి గుండ్రంగా వున్నది  తెలుగు భాష భోధనే కావాలనే రోజులొస్తాయి ఇదే ప్రాంజలి ప్రభ ఆశలు?
                   ————
***
* "" తెలివిగల అత్తా ""

ఓ అత్తగారు కిరాణా షాప్ కి వెళ్లారు.

దుకాణదారు : చెప్పండమ్మా, ఏం కావాలి ? 

అత్త : ఓ కిలో శనగ పప్పూ, ఓ కిలో మినప్పప్పు, ఓకిలో పెసరపప్పు ఇవ్వండి, ఇదిగో అన్నీ ఈ సంచిలో వేసీవ్వండి.

దుదా: కానీ అమ్మా, అన్నీ ఇందులో వేసేస్తే కలిసిపోతాయి.

అత్త : ఏం పర్లేదు, ఇంట్లో ముగ్గురు కోడళ్ళున్నారు,
పని ఏమిలేదు, అన్నీ వేరు చేస్తారులే 

దుకాణదారు ఆమె చెప్పినట్టే అదే సంచిలో వె్సీ  : అమ్మా ఇంకా ఏమైనా కావాలా అనడిగాడు 

అత్త : ఆఁ , రెండుకిలోల బియ్యం, అదికూడా అందులోనే వేసేయండి.

దుదా: అమ్మా, బియ్యం కూడా  ఇందులోనే ? 

అత్త : ఏం పర్లేదు, ఇంట్లో ముగ్గురు కోడళ్ళు ఉన్నారు పనీ పాట ఏమి లేదు, వేరు చేస్తారులే.

దుకాణదారు నాకెందుకు వచ్చిందిలే అని ఆమె చెప్పినట్టే అన్నీ ఆ సంచిలో వేసీ, 412 రూపాయలు ఇవ్వండి అన్నాడు.

అత్త : డబ్బులు లేవు, తర్వాత ఇస్తాను, రాసుకో.

దుదా : కానీ అమ్మా ...

అత్త  : అప్పు ఇవ్వలేను అనేటైతే సామాన్లు వద్దు నీ సామాన్లు నువ్వు తీసేసుకో 

దుదా: అమ్మా  తీసుకెళ్లండి, అవి ఇప్పుడు వేరు చేసేందుకు నాకు ముగ్గురు కోడళ్ళు కూడా లేరు


"రోజూ నడిస్తే దారి ఏర్పడుతుంది। రోజులు గడిస్తే సమస్యలకు పరిష్కారం కనపడుతుంది। సహనంతో ఉండు సమయం మారుతూ ఉంటుంది।"
నీ మీద నాకు నమ్మకం ఉంది, మీ ఋణం తీర్చాలని ఉంది 
ఆ ।   


____(((()))____

* మన పండుగలు మన సాంప్రదాయం#చిన్న_కథ

రెండు జాంకాయలున్నాయి కదా నాన్నమ్మా ..! ఒకటే తీసుకుని నన్నూ చెల్లినీ పంచుకుని తినమంటావేంటి ..! రవి గాడి మాటలకు నవ్వుతూ . అందాకా ఒకటి పంచుకుని తినండిరా . మళ్ళా కాసేపున్నాక రొండోది పంచుకుని తిందురుగాని అంది నాన్నమ్మ నవ్వుతూ . అలాగే నాన్నమ్మా అంటూ చెల్లిని తీసుకుని వరండాలోకి వెళ్ళాడు రవిగాడు . పెద్దింటి నుంచి వచ్చిన కోడలికి ఇది నచ్చలేదు . ఎందుకత్తయ్యగారు ఉన్నాయికదా చెరొకటి ఇచ్చేస్తే సరిపోయే కదా అంది నవ్వుతూనే ఈసడింపుగా .
అత్తగారు నవ్వేసి ఊరుకుంది ..!
పండక్కి మా ఊరెళదామంటే ఈ పల్లెటూరికి తీసుకొచ్చి పడేశారు . ఇక్కడేమో నాకు బోర్ కొట్టి చచ్చిపోతున్నాను ..! మీరేమో మీ చిన్నప్పటి స్నేహితుల్తోటి కబుర్లాడుకుని వస్తున్నారు . వాళ్లలో ఒక్కడు కూడా చదువుకున్నోడు లేడు ,  వాళ్ళతో తిరుగుతుంటే మీరు పెద్ద ఆఫీసర్ అన్న సంగతి కూడా మర్చిపోతున్నారు ..!  ఇక్కడేమో మాయదారి కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు ..! మీ అమ్మ గారు సరేసరి ఒక్క జాంకాయిచ్చి పిల్లలిద్దర్నీ పంచుకుని తినమంటాది ..! నాకు నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు ..! చుట్టుపక్కలవాళ్ళ పిల్లలందరూ వీళ్ళని వరసలు పెట్టి పిలిచి ఆడుతుంటే నాకు కంపరం వస్తోంది బాబూ ..! అంటూ ఆవిడ ఏకరువు పెడుతుంటే నవ్వుతూ వింటూ నిద్రపోతున్న మొగుణ్ణి చూసి ఖర్మ అనుకుని అటు తిరిగి పడుకుంది ..!
భోగి నాడు చుట్టుపక్కల పిల్లలంతా ఎక్కడెక్కడ్నుంచో తెచ్చిన చెట్ల దుంగలు , పాత కర్ర సామాను తెచ్చి భోగిమంట వేస్తుంటే రవిగాడు , వాడి చెల్లి ఎప్పుడు నిద్ర లేచారో , నాన్నమ్మ ఎప్పుడు తలంటిపోసి కొత్తబట్టలు కట్టి ముస్తాబు చేసిందో ..! భోగిమంట దగ్గరకు వెళ్లి నించుంటే పిల్లలంతా వాళ్ళు తెచ్చుకున్న భోగిపిడకల దండలు వీళ్ళతో భోగి మంటల్లో వేయిస్తుంటే ..! సిటీలో పెరుగుతున్న ఆ పిల్లల ఆనందానికి అంతులేదు ..!
ఒరే రవీ ..! నువ్వూ చెల్లీ వెళ్లి ఈ కొత్త బట్టలు మనింట్లో పని చేస్తున్న లక్ష్మి వాళ్ళింటికెళ్లి వాళ్ళ పిల్లలకు ఇచ్చి రండి ..! అంది నాన్నమ్మ ..! రవిగాడు ఆ బట్టలు తీసుకుని చెల్లిని వెంటబెట్టుకుని వెళ్ళాక ..! ఎందుకత్తయ్యా పనివాళ్ల ఇంటికి పిల్లల్ని పంపిస్తున్నారు ..! లక్ష్మి ఎలాగూ వస్తుందిగా ..! దాని చేతిలో ఆ బట్టలేవో పెట్టేస్తే సరిపోతుందిగా అంది కోడలు ..! అత్త గారు నవ్వేసి ఊరుకుంది ..! సంక్రాంతి నాడు ప్రసాదం తయారుజేసి పిల్లలిద్దరితోటి గుడిలో పంచిపెట్టించింది ..!
పండగ సెలవులన్నీ సరదాగా గడిచిపోయాయి ఒక్క కోడలికి తప్ప ..! రవిగాడికి కొత్తగా ఏర్పడిన స్నేహితులు,వాళ్ళ నాన్న స్నేహితులు నాన్నమ్మ కట్టిన మూటలన్నీ మోసుకుని రైల్వే స్టేషన్ కు దేబెట్టారు ..! రైలు కదిలేదాకా అక్కడే ఉండి వీడ్కోలు చెప్పి వెనుదిరిగారు ..!
సంక్రాంతికి ఊరెళ్ళి వచ్చిన తర్వాత రవిగాడిలో చాలా మార్పు వచ్చిందండి ..! ఇంతకుముందు ఎవరితోను మాట్లాడేవాడు కాడు ..! ఎప్పుడూ ముభావంగా ఉండి తన చదువేదో తన లోకమేదో అన్నట్టుండేవాడు ..! ఇప్పుడందరితో కలివిడిగా ఉంటున్నాడు ..! వాడికేదైనా పెడితే చెల్లికి తీసుకెళ్లి పెడుతున్నాడు ..! నువ్వు తిన్నావా మమ్మీ అని నన్ను కూడా అడుగుతున్నాడు ..! అంది కన్నీళ్లు తుడుచుకుంటూ ..! అతను చిరునవ్వు నవ్వాడు వాళ్ళమ్మను తలుచుకుంటూ ..!
#పెద్దవాళ్ల_మాటలు_చేతలు_అన్నీ_కూడాను_చద్దన్నం_మూటలే
#మన_పండుగలు_మన_సాంప్రదాయాలు 🙏👌💪
పిల్లలకు కంప్యూటర్ , ఇంటర్నెట్ పరిజ్ఞానంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పడం మన బాధ్యత అండి .
శుభసాయంత్రం 😊💐
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 01-06-2022
ఆది శంకరుల శివానందలహరి శ్లోకము

నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాంపతే
పశ్యన్కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్ ।
సర్వామర్త్యపలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరళం గళే న గిళితం నోద్గీర్ణ మేవ త్వయా ॥ 31 ॥

భావము

ఓ పశుపతీ! నీ కుక్షిలోనూ వెలుపలా ఉన్న సకల చరాచరప్రాణులను రక్షించుటకొరకు, సకల దేవతలూ పారిపోవుచుండగా నిలుపుటకు భయంకరమైనదీ గొప్ప అగ్ని జ్వాలలతో నున్నదీ అగు కాలకూట విషమును కంఠమున నుంచుకొన్నావు. మ్రింగలేదు, కక్కలేదు. నీ పరోపకారత్వమునకు ఈ ఒక్కటీ (నిదర్శనం) చాలదూ ?

వివరణ

ఏ దేవత కూడా ప్రపంచానికి చెయ్యని మహోపకారం శివుడొక్కడే చేసాడని 'ఆర్తత్రాణపరాయణుడు' 'జగద్రక్షకుడు' 'ఆపద్బాoధవుడు''మహానుభావుడు' అనే పేర్లకు సరిగ్గా తగినవాడు శివుడొక్కడేనని ఈ శ్లోకం ద్వారా శంకరులు నిర్ధారిస్తున్నారు.
సహాయం చెయ్యమని కోరినా చెయ్యని వాణ్ణి 'అహంభావుడు' అంటారు.సహాయం అవసరమని తెలుసుకుని అడక్కుండానే చేసి ఆదుకునేవారిని
'మహానుభావు' డంటారు. బాధ్యతలను గుర్తుచేసి చెయ్యమని చెప్తే చేసేవారు కొందరుంటారు. వారి కన్నా చెయ్యవలసినవి చెప్పించుకోకుండానే చేసేవారు కొందరుంటారు.
ఈ రెండోరకం వారినే 'ఆత్మీయు' లటారు.ఎంతో ప్రేమ వుంటే గాని ఆత్మీయతా దృక్పథం ఉండదు. దేవతలు,
దానవులు,కలసి క్షీరసముద్రాన్ని మధించారు.జ్వాలలు చిందిస్తూ కాలకూటవిషం ఉద్భవించింది. దేవతలు, దానవలు హడలిపోయారు.
భయభ్రాంతులతో ప్రయత్నం
విరమించి పారిపోదా మనుకున్నారు. ఏదైనా మంచి ఫలితం దక్కితే అనుభవిద్దా మనుకున్నారే గాని ఇలా హాలాహలం ఉద్భవిస్తే ఏం చేస్తారు ? ఎవరి బ్రతుకు వారు చూసుకునే స్వార్దప్రయత్నంలో పడ్డారు. అప్పుడు శివుడు ఆ హాలాహలాన్ని తాను భక్షించి దేవదానవులందర్నీ రక్షిద్దామనుకున్నాడు. కాని,ఆ విషాన్ని మ్రింగితే లోపల కుక్షిలో(కడుపులో) సకల చరాచర ప్రాణికోటి ఆహుతి 
అయిపోతుందేననే ఉద్దేశ్యంతో అటు లోపల ప్రాణికోటి,ఇటు బయట దేవదానవులు అందరూ రక్షిఒపబడటం కోసం- ఆ విషాన్ని మ్రింగి, లోపలకు పోనీయకుండా కంఠం వద్దనే నిలిపివేశాడు. ఇంతటి సమయస్ఫూర్తి,ఇంతటి దయాగుణం, ఇంతటి తెగింపు, సాహసము,
ఆర్తత్రాణ పరాయత్వం ఎవరికి వుంటాయి? కల్పవృక్షం వస్తేను,
కామధేనువు వస్తేను,
లక్ష్మిదేవి వస్తేను, ఉచితంగా సంగ్రహించడానికైతే ముందుకు వస్తారు గాని, ఇలా హాలాహలం వస్తే- పూర్తిగా మ్రింగకుండా, బయటకు ఉమ్మియకుండా-కంఠం వద్దే నిలిపి, అందర్నీ కాపాడే రక్షణ గుణం, ఉపకార గుణం 
ఎవరికుంటుంది? ఈ ఒక్క మహోపకార గుణం చాలు శివుడు అందరి దేవతలలో అగ్రగణ్యుడని చెప్పుకోవడానికి-అంటున్నారు శ్రీ శంకరులు.

దేవదానవులంతా క్షీరసాగరాన్ని మధించే వేళ ముందుగా హాలాహలం పుట్టింది. దాని వేడికి సకల లోకాలూ తల్లడిల్లసాగాయి. అది సర్వత్రా వ్యాపించింది. జింకలా గంతువేసింది, పాములా పాకింది, సింహంలా దూకింది, పక్షిలా ఎగిరింది, ఒక్కోసారి ఏనుగు లాగా కదలకుండా ఒకచోటే నిలిచింది. దాంతో అనేక జీవరాసులు తల్లడిల్లాయి. ఆ పరిస్థితి చూసి దేవతలంతా ఓచోట చేరి సమస్య పరిష్కారానికి శివుడొక్కడే శరణ్యమని నిర్ధరించారు. ఆ వెంటనే అంతా కలిసి కైలాసానికి బయలుదేరి వెళ్ళి పరమశివుడికి హాలాహలం వల్ల కలుగుతున్న ప్రమాదాన్ని గురించి వివరించి చెప్పారు. శివుడు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తన ఇల్లాలు జగన్మాత అయిన పార్వతి వంక చూచి
రక్షింతు ప్రాణి కోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖీ!!

పార్వతీ! నేను ఈ హాలాహలమును చిన్న ద్రాక్షపండును తినేసినట్లు తినేస్తాను. దానివలన నాకేమీ ఇబ్బంది రాదు. అలా చేసి ఈ ప్రాణికోట్లనన్నిటిని రక్షిస్తాను. అది నా దివ్యమయిన లీల. నాకేమయినా అవుతుందని నీవేమాత్రం బెంగ పెట్టుకోనవసరం లేదు. నేనెలా తినేస్తానో సంతోషంగా చూస్తూ ఉండు’ అన్నాడు. అపుడు పార్వతీ దేవి ‘సరే, మీకు ఎలా ఇష్టమయితే అలా చేయండి’ అంది. 

పోతనా మాత్యులవారి పద్యములు

కందపద్యము

మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో!!

ఆవిడకు శంకరుడు త్రాగబోయేది విషం అని తెలుసు. విషం త్రాగితే ప్రమాదమనీ తెలుసు. త్రాగుతున్న వాడు తన భర్త అనీ తెలుసు. అయినా త్రాగమంది. ఆవిడ సర్వమంగళ. అందుకని తాగెయ్యమంది. శంకరుని జీవనమునకు హేతువు పార్వతీదేవి మెడలోని మంగళ సూత్రమని పోతనగారు తీర్పు ఇచ్చారు. దేవతలందరూ జయజయధ్వానాలు చేస్తుంటే హాలాహలమునకు ఎదురువెళ్ళి దానిని చేతితో పట్టుకుని ఉండచేసి నేరేడు పండంతచేసి గభాలున నోట్లో పడేసుకుని మింగేశాడు. ఎదురు వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మ్రింగినప్పుడు కానీ వేడిచేసి ఆయన ఒంటిమీద ఒక్క పొక్కు పుట్టలేదు. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. ఆయన చల్లని చూపులతో అలానే ఉన్నాడు. శంకరుని పాదములు నమ్ముకున్న వాడు

హాలాహలం లాంటి కష్టము వచ్చినా కూడా అలా చల్లగా ఉంటాడు. అటువంటి వానికి బెంగ ఉండదు. ఆయన నోట్లో పెట్టుకుని మ్రింగుదామనుకున్నాడు. కంఠం వరకు వెళ్ళింది.

(ఇది అసామాన్య శబ్దార్థసౌందర్యభరితమైన పద్యం. శివుడు లోకాలన్ని దహించేస్తున్న ఆ హాలాహలాన్ని మింగాడు అనగానే. కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది. భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా. అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకొన్నావిడ. ఇదే అనుమానం పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పిన సమాదానం ఈ పద్యం. మ్రింగ్ మ్రింగ్ అంటూ ఎలా ధ్వనిస్తోందో. (పూర్ణానుస్వరపూర్వక గకార ప్రాస) అటుపక్క ఆ గరళానికి, మంగళ మంగళ అంటూ సమాధానాలను వేసిన తీరు పద్యానికి ఎంత అందాన్నిచ్చిందో. మరల మరల ప్రయోగించిన గ’, ళ’ లు, మింగటంలో గళం లోనే ఆపేసాడు అని, శక్తి స్వరూపిణి స్త్రీతో పాలుపంచుకంటుంటే ఎంతటి కాలకూటవిషం ఎదురొచ్చినా మంగళానికి లోటు ఉండదు అని స్పురిస్తోంది.)

మత్తేభ విక్రీడితము

కదలం బాఱవు పాఁప పేరు; లొడలన్ ఘర్మాంబుజాలంబు పు
ట్టదు; నేత్రంబులు నెఱ్ఱ గావు; నిజజూటా చంద్రుఁడుం గందఁడున్;
వదనాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ
బదిలుండై కడి జేయుచోఁ దిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్.

తాత్పర్యము

మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ, దానిని సమిపించే టప్పుడు కానీ, పదిలంగా పట్టుకుని ముద్దచేసే టప్పుడు కానీ, నోట్లో ఉంచుకునే టప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, మ్రింగే టప్పుడు కానీ, ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు; చెమటలు గ్రమ్మ లేదు; కన్నులు ఎఱ్ఱబార లేదు; సిగలోని చంద్రుడు కందిపోలేదు; ఆయన ముఖ పద్మం వడల లేదు.

కందపద్యము

ఉదరము లోకంబులకును 
సదనంబాగు టెరిగి శివుడు చటుల విషాగ్నిం 
గుదురుకొన గంఠబిలమున 
బదిలంబుగ నిలిపె సూక్ష్మ ఫలరసము క్రియన్!!

మింగేస్తే అడుగున అధోలోకములు ఉన్నాయి. కాలిపోతాయని మింగలేదు. పైన ఊర్ధ్వలోకములు ఉన్నాయి. కక్కితే ఊర్ధ్వలోకములు పోతాయి. పైకీ వదలలేదు, క్రిందకీ వదలలేదు. కంఠంలో పెట్టుకున్నాడు. ఆయన అలా చేసేసరికి పార్వతీ దేవి చాలా సంతోషించింది. లోకం పొంగిపోయింది. అప్పటినుండి ఆయనకు నీలలోహితుడు, నీలగ్రీవుడు అని పేరు వచ్చింది. ఆయనకు నీలకంఠుడు అని పేరు. ‘నీలకంఠా అని పిలిస్తే చాలు ఆయన పొంగిపోతాడు. హాలాహాల భక్షణం కథ వీనిన వాళ్లకి మూడు ప్రమాదములు జరుగవు. ఈ కథ వినిన వాళ్ళని పాము కరవదు. హాలాహలభక్షణం కథను నమ్మిన వాళ్ళని తేలు కుట్టదు. అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదములు రావు. అంతంత శక్తులు ఇటువంటి లీలలయందు ఉన్నాయి. వాటిని క్షీరసాగర మథనంలో ఆవిష్కరించి వ్యాస భగవానుడు ఫలశ్రుతి చెప్పారు. 
మళ్ళీ అందరూ బయలుదేరి ఆనందంతో పాలసముద్రం దగ్గరకి వెళ్ళిపోయారు.క్షీరసాగరమథనం మొదలుపెట్టారు. అలా మథిస్తుంటే సురభి కామధేనువు పైకి వచ్చింది. ఆ కామదేనువుకి అందరూ నిలబడి నమస్కారం చేశారు. దేవమునులకు లౌకికమయిన కోరికలు ఉండవు. వారు కామధేనువు పాలతో హవిస్సులను అర్చిస్తాము అని అన్నారు. లోక కళ్యాణార్థం హవిస్సులను ఇస్తారు. ఆ గోవును స్వామి దేవమునులకు ఇచ్చి మీరు దీని పాలతో దేవతలకు హవిస్సులను అర్పించాలి. అపుడు దేవతలు సంతోషించి వర్షములు కురిపిస్తారు. అందరూ బాగుంటారు. అందరికీ పనికి వచ్చేవాడికి కామధేనువు ఉండాలి. అందుకని కామధేనువు దేవమునులకు ఇవ్వబడింది. వారు దానిని పుచ్చుకున్నారు.

పార్వతీ పరమేశ్వరులు ఆదర్శ దాంపత్యానికి ఓ చక్కని ఉదాహరణగా ఈ కథా ఘట్టం పేర్కొంటుంది. శివుడు ప్రజలను రక్షించాలని ముందుకెళ్ళేటప్పుడు ఆయన భార్య పార్వతీదేవి తన భర్త నిర్ణయాన్ని తప్పుపట్టలేదు. తన భర్తకు ఏమైనా అవుతుందోమోనని శంకించలేదు. పరోపకారం కోసం ఎంతటి త్యాగానికైనా ప్రభువు ఒడిగట్టటాన్ని ఆమె సమర్థించింది.  పార్వతికి పరమేశ్వరుడు చెప్పిన మాటల్లోని సారాన్ని భర్తలు,పార్వతి సమర్థన తీరును ఇల్లాళ్ళు అనుసరిస్తే సమాజమంతా పరోపకార బుద్ధి కలిగన వారితో నిండి విశ్వశాంతి వర్ధిల్లుతుంది. ఇది ఈ కథలోని సామాజిక సందేశం. అయితే పురాణపరంగా చూస్తే హాలాహల భక్షణం అనే ఈ కథను సంతోషంగా విన్నా, రాసినా, చదివినా భయానికి గురికారు. పాములు, తేళ్ళు, అగ్నిలాంటి వాటివల్ల కష్టాలు కలగవనేది ఈ కథకు సంబంధించిన ఫలశ్రుతి అని భాగవతం చెబుతోంది.
సేకరణ :

___(())___

*యవ్వనం  &  ముసలితనం* *ప్రాంజలి ప్రభ కదలిక* 
 *నేను యవ్వనంలో ఉన్నప్పుడు "మొటిమల్ని" గురించి బాధ*
*నాకు ముసలితనం వచ్చినప్పుడు  "ముడతల్ని" గురించి బాధ*
*నేను యవ్వనంలో ఉన్నప్పుడు "ఆమె" చెయ్యి పట్టుకోవాలని ఎదురుచూసె*
*నాకు ముసలితనం వచ్చినప్పుడు ఆమె వచ్చి "నా చేయి"  పట్టు కోవాలని  ఎదురు చూసె*
*నేను యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను "ఒంటరిగా" వదిలేస్తే బాగుండును  అనుకునే వాణ్ణి*
*నాకు ముసలితనం వచ్చినప్పుడు పిల్లలు నన్ను "ఒంటరిగా" వదిలేసారే  అని బాధపడు తిండేవాణ్ణి*
*నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే "చికాకు పడేవాణ్ణి*
*నాకు ముసలితనం వచ్చినప్పుడు నాకు ఎవరూ    'సలహాలు ' ఇవ్వడం లేదే అని బాధపడేవాణ్ణి*
*నేను యవ్వనంలో ఉన్నప్పుడు "అందాన్ని" ఆస్వాదించే వాణ్ణి*
*నాకు ముసలితనం వచ్చినప్పుడు " భందాన్ని " ఆస్వాదిస్తున్న వాణ్ణి*
*నేను యవ్వనంలో ఉన్నప్పుడు "నిద్రలేవడం" కష్టంగా ఉండేవాణ్ణి*
*నాకు ముసలితనం వచ్చినప్పుడు "నిద్రపట్టడం" కష్టంగా వుండేవాణ్ణి*
*నేను యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా నా "గుండెల మీద పెద్ద శబ్దంతో  "  గుద్దుకునే వాణ్ణి*
*నాకు ముసలితనం వచ్చినప్పుడు " చిన్న శబ్దానికే గుండె ఆగి   పోతుందేమోనని  "  అని భయపడుతున్న వాణ్ణి* 
*జీవితంలో రకరకాల "ఆటు పోట్లు" వస్తుంటాయి. దేనికీ భయపడ కూడదణే వాణ్ణి*
*ధైర్యంగా ఎదుర్కోవడమే అది "యవ్వనంలో" నైనా అనేవాణ్ణి*
 *ముసలితనంలో" నైనా.. అన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా "ప్రశాంతంగా"  ఉంటుంది. అనేవాణ్ణి*
****


ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 02-06-2022

*'జ్ఞానపీఠం' అవార్డు అందుకొన్న తొలి తెలుగు కవి 'కవి సమ్రాట్'

విశ్వనాథ సత్యనారాయణ 10-9-1895 ★ 18-10-1976

●●●●●ప్రాంజలి ప్రభ ●●●●●

సాహిత్యం, సంస్క్రతి అవిభాజ్యమని,వాటి ఉద్ధరణ కూడా ఏకంగా జరగాలని ఉద్దేశ్యపడిన।।।

దేశోద్ధరణకు,జాతి ఉద్ధరణకూ, వాటి ఉద్ధరణ అవసరమని ప్రగాఢంగా విశ్వసించిన।।।

విశ్వనాథ సత్యనారాయణ గారు,1895 సెప్టెంబరు10 న, సనాతన బ్రాహ్మణ కుటుంబంలో ,విశ్వనాథ శోభనాద్రి,శ్రీమతి పార్వతమ్మ దంపతులకు, కృష్ణా జిల్లా, నందమూరు గ్రామంలోజన్మించారు। 'పలుకు తేనియ తల్లి చదువుల కల్పవల్లి ' అయిన  సరస్వతీ దేవి అనుగ్రహంతో ఇరవయ్యో శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖులలోవిశ్వనాథ వారికి ప్రత్యేకమైన పీట వేయబడింది।

కథలు, నవలలు, నాటకాలు,విమర్శనా  గ్రంథాలు,  అనువాదాలు,వ్యాసాలు,కవితలు,ఖండికలు,పీఠికలు 

ఇలా।।। ఆయనఎన్నో రచించారు। ఆయన మొదటి రచనలలోప్రధానమైన 'ఆంధ్ర పౌరుషం', 'ఆంధ్ర ప్రశస్తి'ఆయనకు తెలుగుతనం మీద ఉన్నఅభిమానాన్ని-ఆప్యాయతను తెలియజేస్తాయి। ఆయనకు గొప్ప పేరు తెచ్చిన నవల'ఏకవీర'। ఈ నవలను పుట్టపర్తి నారాయణాచార్యులు గారు  మళయాళం లోకి, అంబటిపూడి హనుమయ్య గారు

హిందీ లోకి అనువదించారు।

విశ్వనాథ వారు వ్యావహారికంలో రాసిన 'కోకిలమ్మ పెళ్లి', 'కిన్నెరసాని' పాటలు నాటి యువతరాన్ని ఉర్రూత లూగించాయి।'వేయిపడగలు' ఆయన రాసిన 

గొప్ప నవలల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకొంది। 

మాజీ ప్రధాని పి।వి।నరసింహారావు గారు ఈ నవలను 'సహస్ర ఫణ్' పేరిట హిందీలో అనువదించారు।

విశ్వనాథ వారి'శ్రీమద్రామాయణ కల్పవృక్షం' ఆయన కావ్యాలలో కెల్లా అగ్రతాంబూలాన్ని అందుకొని  ప్రసిద్ధి చెందింది।

'వేయిపడగలు' నవలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి బహుమతి లభించగా,'శ్రీమద్రామాయణ కల్పవృక్షం' కు 'జ్ఞానపీఠ'అవార్డు అందుకొన్నారు। 

విశ్వనాథ వారు ఎన్నో సన్మానాలు, పురస్కారాలు అందుకొన్నారు।గుడివాడలోగజారోహణ సన్మానాన్ని అందుకొన్న వీరు,కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీలఅవార్డులు కూడా పొందారు।ఆంధ్ర విశ్వవిద్యాలయం  'కళాప్రపూర్ణ'  గా గౌరవించింది।  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 'గౌరవ డాక్టరేట్' పట్టా ప్రదానం చేసింది।ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థాన కవిగా నియమించి,శాసన మండలి సభ్యత్వాన్ని కూడా ఇచ్చి గౌరవించింది। భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారం ప్రదానం చేసింది।

"మాట్లాడే  వెన్నెముక" అనిమహాకవి శ్రీశ్రీ గారిచే 

అభివర్ణింపబడిన, విశ్వనాథ వారికున్న శిష్య వర్గం,అనుచర వర్గంమరొకరికి లేదంటే అతిశయోక్తి కాదు। విశ్వనాథ గారు కనుకనన్నయ, తిక్కన కాలాల్లో ఉండి వుంటే 'కవిత్రయం' కాక 'కవి చతుష్టయం' అనే వారేమో? అని అనిపించే వీరు,1976 అక్టోబరు 18 నవిజయవాడలో కీర్తిశేషులయ్యారు।

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం నవమ స్కంధము -  పదహారవ అధ్యాయము పరశురాముడు క్షత్రియ సంహారము చేయుట - విశ్వామిత్రుని వంశ వృత్తాంతము

ఓం నమో భగవతే వాసుదేవాయ

___((()))___\

ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 03-06-2022
*శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాక ఆయన శరీరమంతా ఐదు మూలకాలలో కలిపారు కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషి గుండెలా కొట్టుకుంటూనే ఉంది.

💕ఆయన గుండె ఈనాటి వరకూ సురక్షితంగా ఉంది. ఇది  జగన్నాథుని  చెక్క విగ్రహంలో ఉంది. అలా కొట్టుకుంటూనే ఉంది.

🌺పూరీజగన్నాథ్ (శ్రీ కృష్ణుడి) ని కలియుగ ప్రభువు అని కూడా అంటారు.

💕ప్రతి 12సంవత్సరాలకు ఒకసారి మహాప్రభు విగ్రహం మార్చబడుతుంది. ఆ సమయంలో పూరి నగరం మొత్తం చీకటిగా మారుతుంది.  అంటే మొత్తం నగరం అంతటా లైట్లు ఆపివేయబడతాయి.  లైట్లు ఆపివేసిన తరువాత సిఆర్ పిఎఫ్. సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతుంది ... 

ఆ సమయంలో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు.

❤️ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంటుంది. పూజారి కళ్ళు కట్టుకుంటారు... పూజారి చేతిలో చేతి తొడుగులు ఉంటాయి.. పాత విగ్రహం నుండి "బ్రహ్మ పదార్ధం" తీసి కొత్త విగ్రహంలోకి మార్చుతారు...  ఈ బ్రహ్మ పదార్ధం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ... ఈ రోజు వరకు ఎవరూ చూడలేదు.  .. వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతూనే ఉన్నది.

🌺ఈ రోజు వరకు మహాప్రభు జగన్నాథ్ విగ్రహంలో ఏముంది అని ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు.

💕కొంతమంది పూజారులు మేము చేతిలో తీసుకున్నప్పుడు ఆయన కుందేలు లాగా దూకుతున్న అనుభూతి కలిగిందని చెప్పారు.

❤️ఇప్పటికీ జగన్నాథ్ యాత్ర సందర్భంగా పూరి రాజు స్వయంగా బంగారు చీపురుతో ఊడుస్తాడు.

చాలా దేవాలయాల శిఖరాలపైన పక్షులు కూర్చుని ఎగురుతూ ఉండడాన్ని మనం చూస్తూంటాం. కాని జగన్నాథ్ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు.

🌺జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది

 ❤️జగన్నాథ్ ఆలయం యొక్క 45 అంతస్తుల శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజూ మార్చడం జరుగుతుంది, జెండాను ఏరోజైనా మార్చకపోతే ఆనాటినుండి ఆలయం 

18 సంవత్సరాలపాటు మూసివేయబడుతుంది.

❤️జగన్నాథ్ ఆలయం పైభాగంలో ఉన్న సుదర్శన్ చక్రం ఏదిశ నుండి చూసినా అది  మనకు ఎదురుగానే  ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. జగన్నాథ్ ఆలయ వంటగదిలో 

7 మట్టి కుండలు ఒకదానిపైన ఒకటిఉంచి ప్రసాదాన్ని కట్టెలపొయ్యి మీదనే వండుతారు.

💕జగన్నాథ్ ఆలయంలో ప్రతిరోజూ చేసిన ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తగ్గదు. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయ తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది.🌹

============================

---((()))--

ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 04-06-2020

* ఉద్ధరేదాత్మ నాత్మానం 

ఎవరి మంచి చెడులకు వారే కారణం

ఉద్ధరేదాత్మ నాత్మానం 

ఆత్మాన మవసాదయేత్‌

ఆత్మైవ హ్యాత్మోనో బంధుః 

ఆత్మైవ రిపురాత్మనః

మన మనసు కున్న శక్తితో మనలను మనమే ఉద్ధరించు కోవాలి.  అంతే తప్ప నాశనం చేసుకో కూడదు.  మన మనసే మనకు చుట్టం.  అదే మనకు శత్రువు కూడా అవుతుందని అంటుంది భగవద్గీత.

అర్థమయ్యేలా చెప్పు కోవాలంటే...తల్లి దండ్రులైనా, గురువులైనా, శ్రేయోభిలాషులైనా.. మన మంచి కోరి,  మంచి మాటలు చెబుతారు. కొందరు మిత్రులుగా, బంధువులుగా మనం పక్కనుంటూ మన చెడు కోరుకునే వారు చెడ్డ దారులు పట్టిస్తారు.

మంచి మాటలు వినాలా చెడు మార్గంలో సాగాలా? అనే నిర్ణయం తీసుకోవాల్సింది మనం మాత్రమే.

మన ఇంద్రియాలు తరచుగా మనల్ని తప్పు దోవల్లోకి లాక్కు పోతాయి. వాటికి లొంగి పోయామా..  పతనం తప్పదు!

వాటిని మన అదుపులో పెట్టుకుంటేనే  మనం జయిస్తాం. ఇది జీవిత రహస్యం.

విజయం సాధించడాని కైనా, ఓడిపోవడాని కైనా మూల కారణం మనమే.    చాలా మంది తమ ఓటములకు,  తాము జీవితంలో ఎదగక పోవడానికి ఇతరులే కారణమని చెబు తుంటారు.

మరి కొందరేమో.. పరిస్థితుల ప్రభావం అంటుంటారు.

తరచిచూస్తే.. చాలా మంది విజేతల కుటుంబ పరిస్థితులు మన కంటే ప్రతి కూలంగా ఉంటాయి. కానీ వారు ప్రతీ దాన్నీ తమకు అనుకూలంగా మార్చు కుంటారు. ప్రతి ఓటమిని, ప్రతికూల పరిస్థితులను కూడా సోపానాలుగా మార్చు కుంటారు. దీనికి కారణం.. వారికి ఉండే వివేక జ్ఞానం!

ఈ ప్రపంచాన్ని ఒక్కసారి గమనించి నట్లయితే ఎన్నో అద్భుతాలు గోచరిస్తాయి.

అచేతనాలుగా పరిగణించ బడే రాళ్లు, రప్పలు మొదలు కొని   ప్రాణమున్న జీవుల్లో గొప్పవాడనిపించు కున్న మానవుడి దాకా అంతా ప్రపంచమే.  రాళ్లు, రప్పలకు అసలు ప్రాణమే ఉండదు. పశు పక్ష్యాదులకు ప్రాణం, జ్ఞానం ఉన్నా..  ఆ జ్ఞానం     వాసనా జ్ఞానమే కానీ, వివేకం ఉండదు.  వివేకంతో కూడిన జ్ఞానం ఉండేది ఒక్క మనుషులకే.  అంత గొప్ప సామర్థ్యం ఉన్న మనిషి ఎప్పుడూ నిరాశ చెందకూడదు. చిన్న చిన్న వైఫల్యాలకు కుంగిపోకూడదు.

ఆ వైఫల్యాలకు ఇతరులను, పరిస్థితులను కారణంగా చూప కూడదు.  ఈ ప్రపంచంలో మానవులుగా పుట్టినందుకు..   వివేకంతో కూడిన జ్ఞానాన్ని కలిగి ఉన్నందుకు మనం ఎంతో అదృష్ట వంతులం. 

పంచ భూతాలు మనకు అనేక రకాలుగా ఉపయోగ పడుతున్నాయి. ఎన్నో రకాల ప్రాణులు మన జీవనాన్ని సుఖ మయం చేస్తున్నాయి.

ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్న మనిషి స్వశక్తిని నమ్ముకుని మనసా, వాచా, కర్మణా కృషి చేస్తే సాధించ లేనిది ఏదీ లేదు. ఆధ్యాత్మిక ఉన్నతికైనా.. జీవితంలో పురోగతికైనా అదే ముఖ్యం!

---((()))___

ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 05-06-2020

* తులసిమొక్క పచ్చగా ఉండాలంటే.. నాటేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి..

 హిందూ మతంలో తులసి ఆకులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే చాలా మంది తమ ఇళ్లలో తులసి మొక్కను నాటుతారు. అయితే కొందరి ఇళ్లలో తులసి మొక్క ఎండిపోతుంది. దీనికి కారణం మీ అజాగ్రత్త కావచ్చు. అలాగే తులసి మొక్క మొక్కలకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎండిపోతుంది. తులసి మొక్క ఆకుపచ్చగా ఉండే కొన్ని ప్రభావవంతమైన చిట్కాలను తెలుసుకుందాం.

1. తులసి మొక్కలను నాటడానికి ముందు, దాని నేల ఎంపికపై శ్రద్ధ వహించండి. అటువంటి మట్టిలోనే ఎల్లప్పుడూ మొక్కలను నాటండి. తులసిమొక్కను నాటే మట్టిలో 30 శాతం ఇసుక ఉండేలా చూసుకోవాలి.

2. ఆవు పేడ మొక్కలకు చాలా మంచిదని భావిస్తారు. అయితే తడి ఆవు పేడను ఎప్పుడూ వేయకూడదు. ఎప్పుడూ ఆవు పేడను ఎండబెట్టి, తులసికి ఆవు పేడను పొడి రూపంలో కలపండి. ఇలా చేయడం వల్ల తులసిమొక్క పచ్చగా ఉంటుంది.

3. మొక్క నాటిన తర్వాత మీకు కావాలంటే మీరు దానిలో జిప్సం ఉప్పును ఉపయోగించవచ్చు. దీని కోసం, 1 లీటరు నీటిలో 1 టీస్పూన్ ఉప్పు కలపండి. ఇప్పుడు ఈ నీటిని మొక్కల ఆకులపై పిచికారీ చేయాలి.

4. మొక్కను నాటిన 20 -25 రోజుల తర్వాత మాత్రమే జిప్సం ఉప్పును ఉపయోగించాలని గుర్తుంచుకోండి. అలాగే ఎరువులు వేసిన తర్వాత మరుసటి రోజు తులసి ఆకులను కడిగి వాడాలి. కంపోస్ట్ చేసిన వెంటనే ఆకులను అస్సలు ఉపయోగించవద్దు.

5. మధ్యమధ్యలో తులసి ఆకులకు నీళ్లు పెట్టాలి. శీతాకాలంలో మీరు 5 -6 రోజుల తర్వాత నీటిని జోడించవచ్చు. అదే సమయంలో, వర్షంలో నీరు పోయవలసిన అవసరం లేదు. అయితే, వేసవిలో నేల ఎండిపోవడం ప్రారంభించినప్పుడు, వెంటనే నీరు పెట్టండి.

xxxxxxxxxxxxxxxxxxxx

 సేకరణ :

*ప్రాంజలి ప్రభ

ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక 06-06-2020)

సేకరణ, రచయిత :మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ    కధలు (1)  

(1) దాంపత్య జీవితం

*దాంపత్య జీవితము మనసులో ఉదయించే* *మధురమైన ఊహ ప్రేమ. దాన్ని వికసింపజేసి, ఆ ఆనంద పరిమళాన్ని పరివ్యాప్తం చేసేదే పరిణయం. ప్రేమించి పెళ్లాడినా, పెళ్లాడి ప్రేమించినా రెండు మనసులూ కలిశాక,* *ఏడడుగులూ నడిచాక,చిరకాల అనుబంధానికి నాంది పలికేదే భారతీయ దాంపత్య వ్యవస్థ.*

*పెళ్లంటే, మనసులు కలిసిన ఇద్దరు జీవించడం మాత్రమే కాదు. రెండు కుటుంబాలు, రెండు విభిన్న వాతావరణాలు, రెండు భిన్నాభిప్రాయాలు, రెండు వేర్వేరు అభిరుచులు సమన్వయంతో సుదీర్ఘ సుఖమయ జీవనయానం కొనసాగించడమే పెళ్లి. భార్యాభర్తల బంధం ఎంత శాశ్వతమైందో, అంత సున్నితమైంది.*

*ఆ అనుబంధానికి ఎన్ని అవరోధాలు కలిగినా ఎంతో ఓర్పుగా, నేర్పుగా అధిగమించడమే దాంపత్య ధర్మంలోని ప్రధాన సూత్రం. పరస్పర విశ్వాసం, అవగాహన, భావాల వ్యక్తీకరణతో పాటు ఒకరి అభిప్రాయాల్ని మరొకరు మన్నించడం వల్ల దాంపత్య బంధం బలపడుతుంది. అనుకూలవతి అయిన భార్య లభించడం భర్తకు మహా వరం. విశ్వసనీయుడైన భర్త దొరకడం భార్య సుకృతం. శ్రీలక్ష్మి కోసం శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠం వదిలి, ఆమె పుట్టినిల్లయిన సముద్రంలోనే పడక ఏర్పాటు చేసుకున్నాడు. సీతాదేవి కోసం సముద్రాన్నే బంధించిన శ్రీరాముడు అక్కడ వారధి కట్టి, దానిమీదుగా లంకకు వెళ్లి, రావణుణ్ని సంహరించాడు.* 

*ఇటువంటి అనేక వర్ణనలు పరాశర భట్టరు రాసిన _శ్రీగుణరత్న కోశం_ లో చోటుచేసుకున్నాయి.*

*"సూర్యుడి నుంచి కాంతిని వేరు చేయలేనట్లే, నా నుంచి సీతను ఎవరూ వేరు చేయలేరు" అని ఒక సందర్భంలో రాముడు అంటాడు.*

*దంపతులు ఏకోన్ముఖంగా ఉంటే, తోడూనీడగా మనుగడ సాగిస్తే, ఆ దాంపత్యం ఆదర్శవంతమవుతుంది. ఆ కుటుంబం సంతోష సుమ కదంబంగా విలసిల్లుతుంది. వేదవిహితమైన సమస్త కర్మల్ని దంపతులు కలిసి చేయాలి. పూజలు, వ్రతాలు కలిసే ఆచరించాలి. అదే దాంపత్య ధర్మం.*

*గృహంలో ఒకరి వల్ల మరొకరు శాంతిగా, ప్రసన్నంగా ఉండాలి. ఒకరికొకరు సలహాలు ఇచ్చిపుచ్చుకోవాలి.*

*అటువంటి గృహంలోనే సంతోష సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని మనుస్మృతి చెబుతుంది. ఇంటికి వచ్చే అతిథుల్ని సాదరంగా ఆహ్వానించాలంటుంది అధర్వ వేదం.

*దంపతుల్లో దైవభక్తి, ధర్మకార్యాలపై శ్రద్ధ సంపూర్ణంగా నెలకొనాలి.* *ఆటుపోట్లను తట్టుకొనే ఆత్మస్థైర్యం ఉభయులకూ కావాలి. ఏది మాట్లాడినా, ఏ పని చేసినా అది తమ పిల్లలమీద ప్రభావం చూపుతుందని వారు సదా గుర్తుంచుకోవాలి*

*అన్ని విద్యలకూ నిలయం గృహనీతి. అది మంచి ప్రవర్తన నేర్పే గురువు, వంశాభివృద్ధికి మూలం, సద్గతికి వూతం, కీర్తిప్రతిష్ఠలకు కారణమని మహాభారతం బోధిస్తుంది. ఆశ్రమ ధర్మాలు ఎన్ని ఉన్నా, గృహస్థాశ్రమమే అన్నింటి కంటే ఉత్తమం.*

*దానికి ఏ ఇతర ఆశ్రమాలూ సాటి రావని _శాంతిపర్వం_ చాటుతుంది. వసిష్ఠుడు, అత్రి మహర్షి ఉత్తమ గృహస్థులుగా రాణించారు.*

*రామకృష్ణ పరమహంస భక్తిసాధనను భార్య శారదాదేవి ప్రోత్సహించింది.*

*జనకుడు గృహస్థ ధర్మం నిర్వర్తిస్తూనే, మోక్షగామి కాగలిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఆదర్శవంతుడైన గృహస్థుడు.*

*దేవతలు అమృతాన్ని రక్షించుకున్నట్లు కుటుంబ మర్యాద అనే నిధిని గృహ యజమాని, యజమానురాలు పదిలపరచుకోవాలి.*

*మంకుతనానికి, మొండి పట్టుదలకు తావివ్వకూడదు.*

*సంకల్పాలను పరస్పరం గౌరవించుకోవడమే గొప్ప సంస్కారం*.

*గృహిణి ఆనందంగా ఉన్నంతకాలమే ఆ కుటుంబ జీవనం ప్రశాంతంగా గడుస్తుంది. దంపతుల ప్రేమానురాగాల పందిరి కుటుంబసభ్యులందరికీ చల్లని నీడనిస్తుంది అని బృహదారణ్యకోపనిషత్తు హితవు పలుకుతుంది.*

దాంపత్య ధర్మంపైనే జాతి ప్రగతి ఆధారపడి ఉంది.


శా::దాంపత్యం వినయమ్ము కీర్తి సమయం ధాతృత్వ ఉత్కృష్టమై

దాంపత్యం ధరణీ తలమ్ము న సుఖా  దాశ్యమ్ము ప్రేమమ్ముగా 

దాంపత్యం హృదయమ్ము పంచ కలిగే దానమ్ము నిస్వార్థమే దాంపత్యం వచయి0చ నొప్పితిని లే దారోగ్య ధర్మ0బుయే

--((**))--

ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక (7-06-2022)

సేకరణ, రచయిత :మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ    కధలు (2)  

*ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి? 

అని ప్రశ్నిస్తే ధర్మోరక్షతి రక్షితః అని సమాధానం.

ధర్మం వల్ల ఏం లభిస్తుందో? అనే ఫలాపేక్షతో ఉండడం కన్నా ధర్మాచరణయే ఫలంగా భావించడం ఉత్తముల మార్గం.

ధర్మం ఆచరిస్తున్నప్పుడు లభించే తృప్తిని అత్యుత్తమ ఫలంగా భావించే వాడు అసలైన ధార్మికుడు. 

"" త న  ధ ర్మ ము న కు  భం గం

బొ న రఁ గ  నె వ్వం డు  ధ ర్మ మెం డొ క దా నిన్

గొ నఁ ద గు   భా ర తీ య

ప్ర ణ యం బే  మనకు బ ర మ  పా వ న ము  సు డీ ""      

మనిషి సాధించవలసిన ప్రయోజనాలు నాలుగు అని విభజించారు భారతీయ మహర్షులు. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఇందులో ‘అర్థకామాల’ గురించి వివరించనవసరం లేదు. ఈ రెండు ప్రయోజనాల చుట్టూ మాత్రమే తిరుగుతుంటాం మనం. కానీ వాటికన్నా ముందు ధర్మాన్ని సంపాదించుకోవాలి. ధర్మం అనే ప్రాతిపదిక మీదనే అర్థకామ సంపాదన సాగాలి. అర్థ కామ సంపాదన మాత్రమే ధ్యేయంగా సాగితే వ్యక్తికీ, సమాజానికీ కూడా హాని. అందుకే ధర్మం అనే హద్దులో అర్థ కామ సంపాదన జరగాలి అని శాసించారు. ఇది శాశ్వత ప్రయోజనాన్ని ఉద్దేశించి నిర్దేశించింది. ధర్మరహితంగా అర్థ కామ సంపాదన చేస్తే పతనమై తీరతారని చెప్పడానికే రామాయణ భారతాలు ఆవిర్భవించాయి. ధర్మపరుడై బ్రతికే వానికి ఎన్నో సవాళ్లు ఎదురౌతాయి. ఏ కాలంలోనైనా ఇది తప్పదు. ప్రస్తుత కాలంలో మరీనూ. ఆ సమయంలో ఎటువంటి నిబ్బరాన్ని పాటించాలో మన ప్రాచీన ధార్మిక గ్రంథాలను పరిశీలించి తెలుసుకోవచ్చు.

శ్రీరామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళే ముందు కైకతో అన్నమాటలు: 

“నాహమర్థపరే లోకే విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితమ్ – నేను అర్థపరుణ్ణి కాను, కేవలం ధర్మమూ నందే నిష్ఠ కలిగిన వాడను” ధర్మంతో అర్థ కామాలను సంపాదిస్తాను అనే ధోరణి మంచిదే. అంతకన్నా ఉత్కృష్టం అర్థ కామాలకన్నా ధర్మ సంపాదనమే గొప్పదని భావించడం. ఆ ధర్మపరత్వంలో అర్థ కామాలకు హాని కలిగినా చలించరు. అటువంటి వారినే మహాత్ములని అంటాం.

మహాభారతంలో ధర్మరాజును గమనిస్తే ఆశ్చర్య చకితులవుతాం.

అరణ్య వాస సమయంలో భార్యతో, తమ్ములతో సహా దుర్గమారణ్యాలలో సంచరిస్తున్న ఆ చక్రవర్తిని ఒకరోజు భార్య ద్రౌపది ఇలా అడుగుతుంది.

“మీరెప్పుడూ ‘ధర్మం, ధర్మం’ అంటూ ఉంటారు. ఆ ధర్మం మీకేమిచ్చింది? అధర్మపడురైన వాడు రారాజై భోగాలనుభవిస్తున్నాడు. ధర్మపరులైన మీరు సపరివారంగా కానల పాలయ్యారు. ధర్మాన్ని ఆచరించి ప్రయోజనం ఏమిటి?” ఆమె అడిగిన ప్రశ్నకు సంయమనంతో సమాధానమిచ్చాడు యుధిష్ఠిరుడు.

నాహం ధర్మఫలాకాంక్షీ రాజపుత్రి! చరామ్యుత! ధర్మ ఏవ మనః కృష్ణే! 

స్వభావాచ్చైవమే ధృతమ్! ధర్మ వాణిజ్యకో హీనో జఘన్యో ధర్మవాదినామ్!! 

ధర్మరాజు వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని పట్టి చూపించే మాటలివి. ధర్మాచరణ నా స్వభావం. ధర్మం వల్ల ఏదో వస్తుందని, ఏదో రావాలని నేను ధర్మాచరణను అనుసరించలేదు. ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడు” అంటే ధర్మం వల్ల ఏదో వస్తుందనే లాభాపేక్ష ఉన్నవాణ్ణి పురుషాధముడని పేర్కొన్నాడు ధర్మరాజు.

‘ధర్మాన్ని ఆచరించడం నా స్వభావం’ అనగలిగాడంటే ఆయనలో ఎంతటి ధర్మనిష్ఠ ఉందో అర్థం చేసుకోవాలి. అయితే తాము ఫలాన్ని ఆశించకుండా ధర్మాన్ని అనుష్ఠించినా, ధర్మం ఊరుకోదు. తప్పకుండా రక్షిస్తుంది. ఆత్మ ఔన్నత్యాన్ని కాపాడటమే అసలైన సిద్ధి. ఆ సిద్ధికోసమే ధర్మపరుడు స్థిరంగా ఉంటాడు. ఆ సిద్ధిలోనే తృప్తిని సాధిస్తాడు. ధర్మాన్ని స్వభావంగా చేసుకున్న వారే ఆదర్శప్రాయులు. ఫలాపేక్ష లేని ధర్మంలోనే పరిపూర్ణత ఉంటుంది. ఇదే లక్షణం అచ్చమైన భక్తియోగంలోనూ సాక్షాత్కరిస్తుంది. అలా ధర్మనిష్టుడైన వాని పక్షాన దైవం శాశ్వతంగా నిలిచి ఉంటుంది.

అందుకే భగవానుడు పాండవ పక్షపాతి అయ్యాడు. అంటే ధర్మపక్షపాతి. భౌతికంగా ధర్మానికి పెద్ద బలగం ఉండకపోవచ్చు గానీ బలం ఉంటుంది. ఆ బలం ఆత్మబలం, దైవబలం, అది ఎటువంటి దౌర్బల్యాన్నైనా జయించగలదు. రావణుడైనా, దుర్యోధనుడైనా భౌతికబలంలో సమృద్ధి కలవారే. కేవలం వానరులతో వచ్చిన రామలక్ష్మణులు లంకా సామ్రాజ్యాధినేత, సర్వబల సంపన్నుడైన రావణుని జయించారు. అయిదుగురు పాండవులు ఏడు అక్షౌహిణులతో, పదకొండు అక్షౌహిణుల బలం ఉన్న వందమంది కౌరవులను జయించారు.

ధర్మానికి లభించే జయం, ప్రాప్తించే ఫలం శాశ్వతం, సుస్థిరం. 

“యతో ధర్మస్తతోజయః’ ఇది శాశ్వత సత్యం. దీనిని నమ్మే సమాజం, దీనికే బద్ధమైన పాలన తప్పకుండా నిజమైన క్షేమాన్ని ప్రసాదిస్తుంది.

--((**))--


ప్రాంతంలోని ప్రభ ..అంతర్జాల పత్రిక..8/6


అది ధారా నగరంలో వారవనితల వీధి. ఆ వీధిలో ఒక రంగుటద్దాల మేడ! ఆ మేడ వసారాలో, పూసల తెరల వెనుక, పందొమ్మిదేళ్ళ పడుచు పిల్ల తూగుటుయ్యాలలో ఊగుతూ ఏవేవో శ్లోకాలు రాగయుక్తంగా వల్లె వేస్తోంది.


అదే వీధమ్మట పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ భవభూతి, కాళిదాసూ వీనుల విందుగా వినబడుతున్న ఆ స్వరానికి ఆకర్షితులై అటు వైపు చూసారు. తాంబూల చర్వణంతో ఎర్రగా పండిన ఆ అమ్మాయి అధరాలు చూడగానే వారిరువురికి తాంబూలం స్ఫురణకు రాగా తమ తమ తాంబూల కరండాలని తెరచి చూసుకున్నారు. భవభూతి పెట్టెలో సున్నము నిండుకుంది. అప్పుడు భవభూతి ఆ అమ్మాయిని ఉద్దేశించి,


“తూర్ణమానీయతాం చూర్ణమ్ పూర్ణచంద్రనిభాననే”

అని అడిగేడు. అనగా, “పున్నమి చంద్రునివంటి ముఖము గల ఓ సొగసరీ! కాసింత సున్నం తెచ్చిపెట్టు” అని అర్థం. తన పెట్టెలో తమలపాకులు కూడా లేకపోవడం చూసి, వెంటనే కాళిదాసు,


“వర్ణాని స్వర్ణపర్ణాని కర్ణంతాకీర్ణలోచనే”


అంటూ శ్లోకాన్ని పూర్తి చేసేడు. అనగా, “చెంపకి చేరడేసి కళ్ళు గల ఓ చక్కని చుక్కా! పసిడివన్నె గల లేత తమలపాకులు కూడా!” అని అర్థం.


మహాకవులు వలె ఉన్న ఆ ఆగంతుకులని చూచి, చటుక్కున లేచి, అంజలి ఘటించి, వారిరువురికి ఉచితాసనాలు చూపించి, లోపలికి వెళ్లి ఆకులూ, వక్కలు, సున్నం ఉన్న వెండి పళ్లెం వారి ముందు ఉంచి, వినయము, విలాసము ఉట్టిపడుతూ ఉండగా మొదట కాళిదాసుకి తమలపాకులు, తదుపరి భవభూతికి సున్నం అందించింది ట!


“చెంప లవలె కళ్ళు కలిగే చెరువాయి

పసిడి వన్నెల మోముతోను పడుచు వాయి

తమల పాకులలో సున్న తమదయాయి

ముసిముసి నవ్వుల లలనా ముందు హాయి   

  

ఈ ప్రవర్తన చూసి భవభూతి కోపోద్రేకుడై, “ఏమిటీ పక్షపాతం? సున్నం తెమ్మని ముందస్తుగా అడిగింది నేను. తరువాత కదా కాళిదాసు ఆకులు అడిగింది? ఇదెక్కడి ధర్మం?” అని నిలదీసి అడిగేడు ట.


దానికి ఆ అమ్మాయి సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో, “క్షమించాలి. పూజా వ్యతిక్రమం జరిగితే మన్నించాలి. సామాన్య ధర్మం మాట ఎలా ఉన్నా, మా వృత్తి ధర్మం ప్రకారం మిక్కిలి రొక్కము ఇచ్చినవారంటేనే మా కులంవారు ఎక్కువ మక్కువ ప్రదర్శిస్తారు.(అనగా నకారాల కవిత్వం మిన్న)  తక్కినవాళ్లు తరువాతే!” అని గడుసుగా సమాధానం చెప్పిందిట!


ఆ జవాబు విని ఆ అమ్మాయి సమయస్ఫూర్తికి, సంవాద చాతుర్యానికి ముచ్చటపడి, కవులిద్దరూ ఆమెని మనసారా ఆశీర్వదించి, ముందుకి కదిలేరుట! అదీ కథ!!

____((()))_____


ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక....9/6


తరతరాల పరిశీలన.. కార్తెల పరిజ్ఞానం..

ఉపగ్రహ సమాచారం అందుబాటులో లేని కాలంలోనే నిత్యపరిశీలనతో వాతావరణాన్ని అంచనావేస్తూ వ్యవసాయం చేశారు రైతులు. ఏడాది 27 నక్షత్రాలను 27 కార్తెలుగా (ఒక కార్తె సుమారు 14రోజులు ఉంటుంది) విభజించి ఆయా కార్తెల్లో వాతావరణం తీరు, దానికనుగుణంగా చేయాల్సిన, చేయకూడని పనులను సామెతలుగా చెప్పారు. ఈ కార్తెలలోని వర్షపాతాన్ని బట్టి ఆ ఏడు అతివృష్టా, అనావృష్టా లేక సామాన్యమా చెప్పగలిగేవారు. తొలకరి వానలు ఆషాఢంలో మృగశిరకార్తె (సుమారు జూన్‌ 8- 21)లో ప్రవేశిస్తాయి. 


*‘మృగశిర కురిస్తే ముంగిళ్లు చల్లబడతాయి,* 

*మృగశిర చిందిస్తే మిగిలిన కార్తులు కురుస్తాయి,*

 *మృగశిర వర్షిస్తే మఖ గర్జిస్తుంది, 

మృగశిరలో తొలకరి వర్షిస్తేనే మఖలో వర్షాలు పడతాయి,* 

*మృగశిర చిందిస్తే ముసలెద్దు రంకె వేస్తుంది,* 

*మృగశిరలో వేసిన పైరు మేలు చేస్తుంది’* 

తదితర సామెతలు సేద్యంలో మృగశిర  ప్రాధాన్యాన్ని చెబుతాయి.

      ఆరుద్ర (జూన్‌ 22- జూలై 5) కార్తెలో వర్షాలు ఎక్కువ పడడం పంటకు చాలా అవసరం. ఆ అవసరాన్ని తెలిపేవే *‘ఆరుద్ర వాన అదను వాన,* 

*ఆరుద్ర కురిస్తే దారిద్య్రం ఉండదు,* 

*ఆరుద్రకార్తె విత్తనానికి- అన్నం పెట్టిన ఇంటికి చెరుపు లేదు,* *ఆరుద్రలో అడ్డెడు చల్లితే సులువుగా పుట్టెడు పండుతాయి’* లాంటి సామెతలు. 

      తరువాత కార్తెలు పునర్వసు (జూలై 6- 19) పుష్యమి (జూలై 20- ఆగష్టు 02). *‘పునర్వసు, పుష్యములు వర్షిస్తే పూరెడుపిట్ట అడుగైనా తడవదు’* సామెత ఆ రోజుల్లో వానలు తక్కువ అనే అంశాన్ని తెలుపుతుంది. ఆపై వచ్చే ఆశ్లేష కార్తె(ఆగష్టు 3- 16)లో నాన్పుడు వర్షం కురుస్తుంది. నాట్లు కూడా త్వరగా సాగుతాయి. అధిక వర్షం సాగు పనులకు ఆటంకం కలిగిస్తుంది. అరికాలు తడి అయ్యేంత వర్షం నాట్లకు అనుకూలం. అందుకే 


*‘ఆశ్లేషలో ఊడిస్తే అడిగినంత పంట*, 

*ఆశ్లేషలో అడుగునకొక చినుకు అయినా అడిగినన్ని పండలేను అందట వరి*,

 *ఆశ్లేషలో అడ్డెడు చల్లడం మేలు’* 

మొదలైనవి ఆశ్లేష కార్తెకు సంబంధించిన సామెతలు. మఖ (ఆగష్టు 17- 30) శ్రావణంలో వస్తుంది. వానలు ఎక్కువ. 


*‘మఖలో మానెడు చల్లడం కన్నా ఆశ్లేషలో అడ్డెడు చల్లడం మేలు, మఖలో చల్లిన విత్తనాలు మచ్చలు కనబడతాయి,* *మఖ ఉరిమితే వెదురు మీద కర్రయినా పండుతుంది’* లాంటివి ఈ కార్తెలో చేయాల్సిన వ్యవసాయ పనుల గురించి తెలియచేస్తాయి. 


     ముందు వచ్చే కార్తెలలో వర్షాలు అంతగా కురవకపోయినా వర్ష రుతువులో వచ్చే మఖ, పుబ్బ (ఆగష్టు 31- సెప్టెంబరు 13) కార్తెలలో తప్పక కురవాలి. లేకపోతే క్షామం తప్పదు. 


*‘మఖ పుబ్బలు వరుపయితే మహా ఎత్తయిన క్షామం*, 

*మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు’* (పుట్టగొడుగులు మఖలో పుట్టి పుబ్బలో మాడిపోతాయి. ఏదైనా స్వల్పకాలంలోనే అణగిపోతే దీనిని వాడతారు) సామెతలు దీన్ని సూచిస్తాయి. *‘పుబ్బలో చల్లడం దిబ్బ మీద చల్లినట్లే’

* అనేది పుబ్బలో విత్తడం మంచిది కాదని చెబుతుంది.

*ఉత్తర చూసి ఎత్తరగంప*


ఉత్తర కార్తె సెప్టెంబరు మధ్యలో వస్తుంది. ఖరీఫ్‌ పంట ఒకదశకు చేరుతుంది. ఈ కార్తె ప్రవేశించే నాటికి వానలు సరిగా పడకపోతే సాగు కష్టం అని చెప్పడమే ఈ సామెత ఉద్దేశం. దీన్ని సూచించేందుకే గంపను ఎత్తి పక్కన పెట్టమని చెప్పారు జానపదులు. ఉత్తరలో వరినాటడానికి ఆలస్యం అవుతుంది. వేరుశనగ, సజ్జ, పప్పు ధాన్యాలు కూడా ఈ కార్తెలో విత్తకూడదు. జొన్న మాత్రం కొన్ని ప్రాంతాలకు అనుకూలం. ఉలవ అన్ని ప్రాంతాలలో చల్లడానికి మంచి అదును. అందుకే  


‘*ఉత్తర పదును ఉలవకే అదును’* అనే సామెత పుట్టింది. *‘ఉత్తర ఉరుము తప్పినా, రాజుపాడి తప్పినా, చెదపురుగుకి రెక్కలొచ్చినా కష్టం, విశాఖ చూసి విడవర కొంప*,

 *ఉత్తర హస్తలు వృష్టికి ప్రమాణం’*లాంటి సామెతలూ ఇలాంటివే. 


      ఉత్తర తరువాత వచ్చేది హస్త (సెప్టెంబరు 27- అక్టోబర్‌ 11). ఆశ్లేషలో నాటిన వరిపంట హస్తకార్తె వచ్చే సరికి అనాకుపొట్ట దశకు వస్తుంది. చిత్తకార్తెలో (అక్టోబరు 11- 23) చిరుపొట్ట వస్తుంది. వెన్ను చిరుపొట్టతో ఉంటుంది. ఈ సమయంలో నీరు చాలా అవసరం. అప్పుడు వర్షం లేకపోతే పంట చేతికి రావడం కష్టం. 

*‘హస్త కురవక పోతే విత్తినవాడూ, విత్తని వాడూ ఒక్కటే*, *హస్తకు అనాకుపొట్ట, చిత్తకు చిరాకు పొట్ట*, 

హస్త చిత్తలు ఒక్కటైతే అందరి సేద్యం ఒక్కటే, చిత్త కురిస్తే చింతలు కాస్తాయి,

 *చిత్త స్వాతులు కురవకపోతే చిగురుటాకులు మాడిపోతాయి...’

* లాంటి సామెతలు చాలా ఉన్నాయి.

*యథా చిత్త తథా స్వాతి*


చిత్తలో వర్షం ఎలా ఉంటుందో, స్వాతిలో కూడా అలాగే ఉంటుంది. ఈ కార్తెలో సాధారణంగా గాలివానలు వస్తాయి. 


*‘స్వాతివాన చేనుకు హర్షం* (మెట్ట ప్రాంతం), 

*చిత్త చిత్తగించి, స్వాతి చల్లచేసి, విశాఖ విసరకుంటే వీసానికి పుట్టెడు పండుతానంటుంది జొన్న’

* లాంటి సామెతలు తెలుగులో ఎన్నో ఉన్నాయి. విశాఖ కార్తె వచ్చేప్పటికి వరి కోతకు సిద్ధంగా ఉంటుంది. వర్షం అవసరం ఉండదు. ఈ అనుభవంతో వచ్చిన సామెత 


*‘విశాఖ కురిస్తే పంటకు విషమే’*. అయితే.. మఖ, పుబ్బల్లో చల్లిన ఆముదాలు విశాఖలో పొట్టమీద ఉంటాయి. అప్పుడు వాటికి వర్షం అవసరం. అందుకే 

 *‘విశాఖ వర్షం ఆముదాలకు హర్షం’*! ఇక భరణి (ఏప్రిల్‌ 27- మే 10), కృత్తిక (మే 11- 24), రోహిణి (మే 25- జూన్‌ 7)లపై 


*‘భరణి కురిస్తే ధరణి పండును*,

 *కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు*,

 *రోహిణిలో విత్తితే రోటిలో విత్తినట్లే’* 

లాంటివి రైతుల ప్రకృతి పరిశీలనా దృష్టికి నిదర్శనాలు.


*ఊరిముందరి చేను... ఊళ్లో వియ్యం అందిరావు*

ఊరికి సమీపంలో చేను ఉంటే ఊళ్లో ఉండేవారు, వచ్చిపోయే వారు, పశువుల బెడద... ఇంత కష్టం ఉంటుంది. ఇక ఊళ్లో వియ్యం సంగతి... భార్యా భర్తలిద్దరిది ఒకే ఊరయితే ఆ ఇంట్లో విషయం ఈ ఇంట్లో, 

*ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో తెలిసి సంసారం ఇబ్బందికరంగా సాగుతుంది.

* ఈ సామెత పుట్టుకకు కారణం ఇదే. 

*‘కర్ణునితో భారతం సరి కార్తీకంతో వానలు సరి, ఫాల్గుణమాసపు వాన పది పనులకు చెరుపు’* ఇలా ఎన్నో సామెతలు జీవితానుభవం నుంచి పుట్టాయి. 

      వందల ఏళ్లుగా ఈ విజ్ఞానం రైతులకు దారిదీపంగా నిలిచింది. ఇప్పుడు ఈ విజ్ఞానం రూపుమాసిపోతోంది. ఇప్పటి వారికి చాలా సామెతలు, ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించినవి తెలియవు. వీటిని పాఠ్యప్రణాళికలో భాగం చేయాలి. అప్పుడే మనదైన విజ్ఞానం ముందుతరాలకు భద్రంగా అందుతుంది.

షేర్ చేయండి మిత్రులకు ఉపయాగపడుతుంది.

____((()))___       

ప్రాంజలి అంతర్జాల పత్రిక....10/6

హరిఓం ,... మీరు వృద్ధులా ఒక్కసారి ఈ కధ చదవండి

*నీ తోటి వయసు వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు...*

*నీకు అప్పటివరకూ అండగా ఉన్న నీ తల్లిదండ్రులూ, అమ్మమ్మా నాయనమ్మలూ, తాతయ్యలూ ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు...*

*బయటకి రాలేని నిస్సహాయతతో నీ స్నేహితులు ఇళ్ళల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు...*

*నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు....*

*నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. ఈ సొసైటీ   నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది...*

 నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది...*

*అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది...*

*పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో నెలల తరబడి పక్క మీద శిశువు కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు...*

*నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు...*

*ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ఏదో వ్యాధి అని చెప్పటం మొదలైనవి అన్నీ జీవితంలో భాగమైపోతాయి...*

*నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా,   చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో   నీవాళ్ళు చర్చిస్తూ ఉంటారు...*

*ఇవి వినడానికి చేదుగా ఉన్నా, పచ్చి నిజాలు...ఇలా ఎందుకు జరుగుతుంది... అంటే ఇక నీ అవసరం తీరింది కాబట్టి....నీ అవసరం ఇక వుండదు కాబట్టి..*

*ఇక్కడ తరిగింది కృతజ్ఞత , ప్రేమ , అభిమానం... పెరిగింది కృతఘ్నత , నిర్లజ్జ , అమానుషం ...*

 మీ వీధిలో, మీ కాలనీలో, మీ గ్రామంలో వున్న మీకు తెలిసిన పెద్దవారిదగ్గరకు తరచుగా వెళ్తూండండి. వారి మాటలు విసుగులేకుండా వినండి. వారికి మీ ప్రేమను పంచండి. వీలైతే చిన్నచిన్న సహాయాలు చేయండి.

వృద్ధోపసేవ అని భారతంలో బాగా శ్లాఘించబడిన ధర్మం ఇది. వృద్ధోపసేవ వలన మనిషి బుద్ధిమంతుడవుతాడు.......       

___((()))____


బంగారు గరిటె:

అనగనగా ఊరి పొలిమేరల్లో నివసించే అవ్వ వ్యవసాయం పనులు ఉన్నప్పుడు కూలీగా వెళ్తుండేది. చక్కగా శ్రమపడి నడుం వంచి పని చేసేది. అట్లా వచ్చిన డబ్బులతో ఆదివారం రోజున సంతకు పోయేది; వారానికి సరిపడా సరుకులు తెచ్చుకునేది. పండగ ఉండే రోజుల్లో ఎవరైనా ఇంటి ముందుకు వస్తే వాళ్లను ఇంట్లోకి పిలిచి కడుపు నిండా భోజనం‌పెట్టి గానీ‌ పంపేది ఎక్కువ సరుకులు తెచ్చేది.

అట్లా ఓసారి అవ్వ తను వారమంతా కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో పండగ సరుకులు తెచ్చుకున్నది. ఆ రోజే పండగ. అవ్వ తినేందుకు పులిహోర, రవ్వకేసరి చేసుకున్నది. ఆ రోజంతా ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూసింది పాపం. సాయంత్రం వరకూ ఎవ్వరూ రాలేదు గానీ, ఇక చీకటి పడుతున్నదనగా దూరదేశం నుండి ఎవరో పండితుడు ఆకలితో వచ్చి 'తినేందుకు ఏమైనా ఉందా తల్లీ?!' అని అడిగాడు.

అవ్వ ఆయన్ని లోపలికి ఆహ్వానించి తను చేసిన కేసరి పెట్టింది తినేందుకు. కేసరి అంతా తినేసాడాయన. అన్నం పెడితే అంతా అయిపోచేసాడు. పండగకు చేసిన అన్ని పదార్థాలూ తినేసాడు. అయినా ఇంకా ఆయన ఆకలి తీరినట్లు అనిపించలేదు. ఆలోగా అవ్వ తను వారమంతా గడిపేందుకు తెచ్చుకున్న కూరగాయలన్నీ వండింది. ఇంట్లో ఉన్న బియ్యమంతా వండి వార్చింది. మొత్తం ఆయనకు వడ్డించింది.

పండితుడు ఆమెకేసి సంతోషంగా చూసి, ఏమి పెడితే అదంతా తినేసాడు గబగబా. పెడితే ఇంకా తినేట్లు అనిపించాడు! అవ్వకి ఇంక ఏం చేయాలో పాలు పోలేదు. ఏమంటే ఆ సరికి ఇంట్లో తను కూడబెట్టుకున్న సరుకులు, కూరగాయలు అన్నీ అయిపోయాయి; బియ్యం కూడా ఖాళీ! డబ్బులూ లేవు!

ఇక మిగిలిందల్లా అవ్వకు వారసత్వంగా వచ్చిన పెద్ద గరిటె మాత్రమే. ఆ గరిటె అంటే అవ్వకు చాలా ఇష్టం. ఇన్నేళ్ళుగా దాన్ని చాలా భద్రంగా చూసుకుంటూ ఉండిందామె. అయితే ఇప్పుడు ఆమె చటుక్కున పోయి, దాన్ని అయిన లెక్కకు అమ్మేసి, ఆ డబ్బుతో కూరలు, సరుకులు తీసుకొచ్చి పండితుడికి వండి పెట్టింది. పండితుడు ఆమె వంటని మెచ్చుకుంటూ తిని, చెయ్యి కడుక్కుంటూ "తల్లీ! ఉన్నదంతా నాకే పెట్టినట్లున్నావు. మరి నీకు?" అని అడిగాడు.

"ఇవాళ్ళ పండగ కదా, స్వామీ! ఇవాళ్లంతా ఉపవాసం ఉండి, రేపు తింటాను నేను" అన్నది అవ్వ.

"మరి వంట చేసేటప్పుడు దేనితో‌ కలుపుతావు తల్లీ?!" అడిగాడు పండితుడు.
"సండ్రకట్టెతో కలిపితే వంట చాలా బాగుంటుంది స్వామీ!" అన్నది అవ్వ టక్కున.

పండితుడు నవ్వి, "నేను చాలా ఊళ్ళు తిరిగాను తల్లీ! కానీ ఎక్కడా నాకు కడుపు నిండలేదు. ఇవాల్టి నీ‌ త్యాగంతో నా ఆకలి తీరింది. ఇదిగో, నీకో బహుమతి" అని తన జోలెలోంచి ఒక బంగారు గరిటెని బయటికి తీసి అవ్వకు ఇచ్చాడు. "ఇదిగో తల్లీ! ఇక ఇది నీ గరిటె. దీనితో నువ్వు ఏమి వండినా అది అక్షయం అవుతుంది. అతిథి సేవకు ఇకపైన ఏ ఆటంకమూ ఉండదు" అని అవ్వను ఆశీర్వదించి, వెళ్లిపోయాడు.
ఆ తర్వాత ఇక ఆ దారిన పోయేవాళ్ళెవ్వరూ ఆకలితో‌ పోలేదు.
--((***))--
ఆత్మ🔥జ్యోతి🧘‍♀️

ప్రతి జీవిలోని … ‘ఆత్మ’....  🔥జ్యోతి మాదిరి వెలుగుతూ ఉంటుంది. 

ఆ జ్యోతి ప్రాపంచిక విషయములతో చేరితే జీవాత్మ, పరమాత్మ వైపు తిరిగితే తన స్వస్వరూపము అయిన ఆత్మ స్వరూపము అని తెలుసుకున్నాము.

ఈ జీవాత్మకు కామము, క్రోధము ఒక పొరవలె ఏర్పడి కప్పి ఉంచుతాయి. ఎలాగంటే అద్దం ఉంది. దానికి మురికి పడితే అద్దంలో మన ముఖం కనపడదు. ఆ మురికిని తుడిచి వేస్తే అద్దం నిర్మలంగా ఉంటుంది. అలాగే నిప్పు ఉంది, పొగ రావడం మొదలయితే అగ్ని కనిపించదు. ఊదితో మండుతుంది అప్పుడు పొగ ఉండదు.

ఈ కామము క్రోధము అనే పొరలు మనకు మనం సృష్టించుకున్నవి కానీ, ఎక్కడి నుండి రావు.

ఈ కామము క్రోధము అనే పొగ, మురికి పోగానే జీవాత్మ స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తుడవడమే సత్సాంగత్యము, నిష్కామ కర్మ ఆచరించడం, జ్ఞానము సంపాదించడం, కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం. దీనితో జీవాత్మకు పట్టిన మురికి తొలగి పోతుంది.

పొగతో కప్పబడినప్పుడు అగ్నికి గానీ, మురికితో కప్పబడినప్పుడు అద్దానికి కానీ, మావితో కప్పబడినపుడు శిశువుకు గానీ ఎటువంటి హానీ జరగదు. అవి తమ తమ స్వస్వరూపాలతోనే ఉంటాయి. కేవలం పొగ, మురికి మాత్రమే వాటిని కప్పి ఉంచుతుంది. ఆ మురికి తీసేస్తే వాటి నిజమైన స్వరూపాలు ప్రకటితమౌతాయి.
 
దీని వలన మనకు తేలిందేమిటంటే మనం ఆనంద స్వరూపులము. మనలో ఉన్న ఆత్మ ఎల్లప్పుడు ఆనందంతోనే ఉంటుంది. కాని మనం కామము, కోరికలు, అవి తీరకపోతే కోపము అనే వాటితో ఆ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నాము. అవి తీసేస్తే మరలా ఆనంద స్వరూపులము అవుతాము. మనం అందరం శివస్వరూపులము శివ అంటే ఆనందము. అంటే మనం అందరం ఆనంద స్వరూపులము. అని తెలుసుకుంటే మనకు మనం మసి పూసుకోము.

చాలా మంది నా జీవితం ఇంతే నేనింతే నాకు సుఖం లేదు ఈ జీవితానికి సుఖం లేదు అని అనుకుంటూ తమలో తాము బాధపడుతుంటారు. అది తప్పు.

అందరూ ఆనంద స్వరూపులే. మనం ఆ ఆనందాన్ని చేచేతులా నాశనం చేసుకొని ఏడుస్తున్నాము అంతే.

కాబట్టి ఆ పొగను మురికిని తొలగిస్తే నిత్యం ఆనందంగా ఉంటాము.

పోనీ ఇదేమన్నా కష్టమా అంటే అదీ లేదు. కాస్త విసిరితే పొగపోయి మంట వస్తుంది. కాస్త నీటిలో తడిపి తుడిస్తే అద్దం స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. వైద్యులు మావి తొలగించి శిశువును బయటకు తీస్తారు. ఇవన్నీ దైవయత్నాలు కాదు. పురుష ప్రయత్నాలు.

ఈ కామము క్రోధమును తొలగించుకోడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి కానీ నా ఖర్మ ఇంతే అని ఏడుస్తూ కూర్చోకూడదు. సోమరి తనం పనికి రాదు. కాస్త ప్రయత్నం చేస్తే ఈ కామ క్రోధములను జయించడం అంత కష్టమేమీ కాదు అని భగవానుడు మనకు భరోసా ఇస్తున్నాడు.

కామము మానవునిలో ఉన్న ఆలోచనా శక్తిని, వివేచనా శక్తిని తగ్గిస్తుంది. అంధకారంలో పడేస్తుంది. అందుకే కామాంధుడు అని కూడా మనం అంటూ ఉంటాము.

కామంతో కళ్లు మూసుకుపోయినవాడు. ఇక్కడ కామము అంటే కేవలం స్త్రీవాంఛ అనే అర్థంలో వాడినా, కామము అంటే కోరిక అని అర్ధం చేసుకోవాలి. కామము అంటే మనలో ఉన్న తీరని కోరికలు అని అర్థం. ఈ శ్లోకంలో అగ్ని, అద్దము, శిశువు అనే మూడు ఉదాహరణలు చెప్పాడు పరమాత్మ. ఈ మూడు ఉదాహరణలు కూడా చాలా ముఖ్యమైనవి.

అగ్ని నుండి పొగ వస్తుంటే, ఊదితే పొగ పోయి అగ్ని మండుతుంది. అలాగే కొన్ని కోరికలు ఉఫ్మని ఊదితే చాలు ఎగిరిపోతాయి. ఎక్కువ శ్రమపడనక్కరలేదు. కాని మరి కొన్ని కోరికలు ఉంటాయి. చాలా బలంగా ఉంటాయి. అవి అద్దానికి పట్టిన మురికిలాంటివి. అద్దానికి పట్టిన మురికిని బట్టతీసుకొని నీటిలో తడిపి అద్దం మీద రుద్దాలి. అప్పటికీ పోకపోతే డిటర్జెంట్ వాడి క్లీన్ చేయాలి. అంటే కొంత శ్రమతో కూడిన పని. అలాగే మరి కొన్ని కోరికలు చాలా బలంగా ఉండి, ఎప్పటికీ తీరవు. ఎంతో శ్రమపడితేనే గానీ ఆ కోరికల ప్రభావం నుండి బయట పడలేము. ఆ కోరికల ప్రభావంనుండి బయట పడటానికి కొంత కాలము వేచి ఉండాలి. ఓపికగా ఉండాలి.

ఎలాగంటే శిశువుకు కప్పిన మాయను వెంటనే తీసివేయలేము. తొమ్మిది నెలలు నిండి శిశువు బయటకు వస్తేనే గానీ, ఆ మాయను తీసివేయలేము. అలాగే కొన్ని కోరికలు కాలక్రమేణా పోవలసిందేకానీ, మన ప్రయత్నం వలన పోవు.

కాబట్టి మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పి ఉంచిన ఈ కామాన్ని ముందు తొలగించుకోవాలి.
___((()))___

బామ్మ మాట బంగారుబాట

కోపంగా, బుంగ మూతిపెట్టుకుని ఒంటరిగా వీధి గుమ్మంలో కూర్చొని ఆకాశం వైపు చూస్తోన్న బుజ్జీని చూసి ‘ఏమైందమ్మా.. దిగులుగా ఉన్నావ్‌’ అని అడిగాడు తండ్రి ఆనంద్‌. అంతే అంతవరకూ మౌనంగా ఉన్న బుజ్జీ.. తండ్రి చెంతకు చేరి ‘హూ... ఈ బామ్మతో నేను పడలేక పోతున్నాను డాడీ... టీవీ ఎక్కువ చూడకూడదని, కంప్యూటర్‌ ముందు రోజంతా కూర్చోకు అని, ఆంక్షలు పెడుతుంది. నా హోమ్‌వర్కు చేసుకోలేక నేను బాధపడుతుంటే నీతి పద్యాలు నేర్పిస్తాను, మంచి కథలు చెబుతాను రావే అంటూ బుర్ర తినేస్తుంది’. అంటూ వరుసగా ఫిర్యాదులు చేసింది బుజ్జీ. ‘సరే నేను బామ్మతో చెబుతానులే’ అంటుండగానే కొరియర్‌లో ఒక పెద్ద అట్టపెట్టె లాంటిది వచ్చింది. ఆనంద్‌ సంతకం పెట్టి దాన్ని తీసుకుని తెరిచేసరికి ‘ఓహో కొత్త లాప్‌టాప్‌’ అంటూ ఆనందంగా అరిచింది బుజ్జీ. తండ్రితోపాటే కూర్చొని దానిలో ఒక్కొక్క ప్రోగ్రాం ఇన్‌స్టాల్‌ చెయ్యడం గమనిస్తోంది. ఒక సీడీ మీద ‘ఏంటీ వైరస్‌’ అని రాసి ఉండటం గమనించిన బుజ్జీ ‘డాడీ... కంప్యూటర్‌కి కూడా జబ్బులు వస్తాయా? ఇదెందుకు?’ అని ఆసక్తితో అడిగింది. 

‘మన కంప్యూటర్‌ను అంతర్జాలంతో కలిపాక దీనికి హాని చేసే చెడు తలంపుతో కొంతమంది చెడ్డ ఫైళ్లను పంపిస్తుంటారు. అలాగే పెన్‌ డ్రైవ్‌ వంటివి వాడినప్పుడు కూడా హాని చేసే ఈ ఫైళ్లు కంప్యూటర్‌లోకి చేరి దీనిని పాడు చేస్తాయి. అలాంటి వాటి నుంచి రక్షణ కోసం ఇది వాడుతామన్నమాట. ఇది కంప్యూటర్‌ లోపలే ఉండి దానిని రక్షిస్తుంది’. అంటూ వివరించాడు ఆనంద్‌. బుజ్జీ ఆలోచనలో పడింది. ఇదే సరైన సమయం అనుకున్న ఆనంద్‌ ‘బుజ్జి తల్లీ... నీకో మాట చెప్పనా? కంప్యూటర్‌లానే మనుషులకూ ఏంటీ వైరస్‌ అవసరం. సమాజంలో చెడ్డ అలవాట్లు, చెడు స్నేహితులు, హాని చేసే వ్యక్తుల నుంచి మనల్ని రక్షించ గలిగేది మన నడవడికే. బామ్మ నీకు చెప్పే జాగ్రత్తలూ, నీతి కథలు, పద్యాలూ ఇలాంటివే. 
ఇవి మనసులో నాటుకుని నిన్ను మంచి దారిలో నడిపిస్తూ ఉంటాయ్‌. టీ.వీ ఎక్కువ చూడటం వల్ల సమయం వృథా అవడమే కాక ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది. కంప్యూటర్‌, స్మార్టుఫోన్లు కూడా అంతే. వాటిని పరిమితికి మించి వాడకూడదు. చాలామందికి బామ్మలే లేరు, నీకు బామ్మ దేముడిచ్చిన వరం. ఆమె మాట వింటే లోకజ్ఞానంతోపాటు మంచితనం అబ్బి నీ భవిష్యత్తు అంతా బంగారు బాట అవుతుంది’ అని చెప్పాడు ఆనంద్‌. సాయంత్రం ఏదో పని మీద బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి బామ్మ పక్కన చేరి కథ వింటూ ఊ కొడుతున్న బుజ్జీ కనబడేసరికి... ‘హమ్మయ్య’ 
___(()))___


ప్రాంజలి ప్రభ
సేకరణ మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

1।మహాచందనాది తైలం వంటివాటితో తలను, కణతలను, అరికాళ్ళను సున్నితంగా మసాజ్ చేసుకోవాలి। వీలైనంతవరకు నిద్రపోవటానికి ప్రయత్నించాలి।

దీని వలన మైగ్రెయిన్ తలనొప్పి నుండి కొంత వరకు ఉపశమనం ఉంటుంది।

2। తిప్పతీగ స్వరసాన్ని(నీళ్ళు కలుపకుండా తీసిన రసాన్ని) రెండు చెంచాలు మోతాదుగా, తేనెతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి। 

3। కుంకుమ పువ్వును ఆవు నెయ్యిలో వేసి ఒక్కో ముక్కు రంధ్రంలో రెండేసి చుక్కల చొప్పున వేసుకుని బలంగా పీల్చాలి। 

4। చందనమును(మంచి గంధం పేస్టును)నుదురుకు, కణతలకు లేపనము వలే రాసుకోవాలి।

మైగ్రెయిన్ తలనొప్పి ని తగ్గించే ఆయుర్వేద మందులు:

1। స్వర్ణ సూర్తావర్తి, 2। దశమూలారిష్టం, 3। గుడూచి సత్వం 
4। సూతశేకరరసం,  5। ప్రవాళపిష్టి, 6। గోదంతి భస్మం

--((***))--

దురాశ:

అనగనగా ఒక ఊళ్లో సోమయ్య అనే రైతు తన భార్య కాంతమ్మ , కూతురుపేరు సుమతితో నివసిస్తుండేవాడు. ఒక సంవత్సరం సోమయ్యకు వ్యవసాయంలో చాలా నష్టం వచ్చింది. పూట గడిచేందుకు కూడా డబ్బు లేదు. అదే సమయంలో కాంతమ్మ ఆరోగ్యం పాడై ఆరు నెలలపాటు మంచంలో ఉండి కన్ను మూసింది. సోమయ్య హతాశుడైనాడు.

అయితే తరువాతి సంవత్సరం బాగా వానలు పడ్డాయి; అంతా కలిసి వచ్చింది. సోమయ్య మళ్ళీ మోతుబరి అయ్యాడు. సుమతి కోసం మళ్ళీ పెళ్ళి చేసుకొమ్మని చుట్టాలు పక్కాలు అందరూ పోరారు. వాళ్ల పోరు పడలేక, ఒక్కడే సుమతిని సాకలేక, సూరమ్మని రెండో పెళ్ళి చేసుకున్నాడు సోమయ్య. సూరమ్మ ఘటికురాలు. వచ్చీ రాగానే సుమతి ఎలాంటిదో అంచనా వేసింది. సోమయ్య తత్వాన్ని అర్థం చేసుకున్నది. క్రమంగా ఇంటి ఆజమాయిషీని యావత్తూ తన చేతి క్రిందికి తెచ్చుకొని, సోమయ్యను తన గుప్పెట్లో పెట్టుకున్నది.

అప్పటివరకూ తల్లి లేకున్నా సుఖంగా బ్రతికిన సుమతికి పెద్ద పెద్ద కష్టాలు మొదలయ్యాయి. సుమతిని ఎన్నో బాధలు పెట్టేది సూరమ్మ. సుమతి చేతే వంట చేయించేది; గిన్నెలు తోమించేది; ఇల్లు అలికించేది; పశువుల పాకని శుభ్రం చేయించేది- ఒక్క క్షణం కూడా తీరికగా ఉండనిచ్చేది కాదు.

ఒకరోజు సూరమ్మ గుడికి వెళ్తూ, వంట పనిని సుమతికి పురమాయించింది- "ఇదిగో, నేను బయటికి వెళ్తున్నాను.

వచ్చేసరికల్లా వంట తయారు చేసి ఉంచు. ముందే చెబుతున్నాను- భోజనాన్ని వేరే ఎవరికీ దానం చెయ్యకు. ఏ ముష్టివాడికో వేసావంటే జాగ్రత్త, నా సంగతి నీకు తెలుసు కదా?" అని బెదిరించి చక్కా పోయింది.

సరిగ్గా సుమతి వంట పూర్తయ్యే సమయానికి ఒక స్వామీజీ వచ్చాడు- "తల్లీ భిక్షాం దేహి!" అంటూ. "వద్దు- వద్దు" అనుకుంటూనే సుమతి వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీసింది కాబట్టి ఇక ఆయన్ని లోనికి రమ్మన్నది. రమ్మన్నది కాబట్టి, 'ఇక భోజనం పెట్టకపోతే ఏం బావుంటుంది?' అని భోజనం పెట్టింది. స్వామీజీ చక్కగా భోజనం చేసి, సుమతిని దీవించి వెళ్ళిపోయాడు.

ఆయన అటు వెళ్ళాడో లేదో, ఇటు సూరమ్మ ఊడి పడి సుమతిని భోజనం వడ్డించమని చెప్పి కూర్చున్నది. చూస్తే గిన్నెలో అన్నం సగమే ఉంది! "నేను నీతో చెప్పానుగా, ఎవరికీ అన్నం పెట్టద్దని? ఇదేమైనా మీ తాతల సొమ్ము అనుకున్నావా?! నిన్ను భరించడం నా వల్ల కాదు. ఇంట్లోనుండి వెళ్ళిపో! అంతే!" అని కొట్టి, గెంటేసింది సుమతిని. ఏడుస్తూ కనబడ్డ దారినల్లా పట్టుకొని పోతూ ఉంటే సాయంత్రం అయ్యేసరికి పెద్ద మర్రిచెట్టు ఎదురయింది. చెట్టు చుట్టూ మర్రి పళ్ళు పడి ఉన్నాయి. సుమతి వాటిని ఏరుకొని తిని కొన్నిటిని మూట కట్టుకున్నది.

అంతలోనే ఉరుములు, మెరుపులతో వర్షం కూడా మొదలైంది. దాంతో ఆ పాప గబగబా చెట్టు క్రిందికి చేరి చూస్తే చెట్టుకు అటువైపుగా ఓ తొర్ర కనిపించింది. సుమతి జాగ్రత్తగా ఆ తొర్రలోకి దూరి, ముడుచుకొని కూర్చున్నదల్లా మెల్లగా నిద్రలోకి జారుకున్నది.
అర్థరాత్రి అవుతుండగా ఇద్దరు రాక్షసులు ఆ చెట్టు మీదికి వచ్చి వాలారు. వాళ్ళ బరువుకు చెట్టంతా అదిరినట్లైంది. సుమతి చటుక్కున లేచి కూర్చున్నది.

వాళ్లలో ఒకడు అన్నాడు "ఆకలిగా ఉందిరా. తినేందుకు ఏమైనా దొరికితే బాగుండు" అని. "ఈ మధ్య మనకి సరైన ఆహారమే దొరకట్లేదు. ఇప్పుడు ఎవరైనా ఇటు వస్తే బాగుండు. కడుపునిండా తినచ్చు" అన్నాడు రెండోవాడు.

సుమతి చటుక్కున తొర్రలోంచి బయటికి వచ్చి, తన చేతిలోని మర్రి కాయల మూట వాళ్ళకేసి చాచింది- "ఇదిగో, ఇవి తినండి, బానే ఉన్నాయి. నేను తిన్నాను సాయంత్రం" అన్నది అమాయకంగా.

ఒక రాక్షసుడు చటుక్కున ఆ పాప మీదికి దూకబోయాడు. అయితే రెండోవాడు వాడిని వారించాడు. సుమతి మంచితనం, అమాయకత్వం రెండూ వాడిని కదిలించాయి. "ఏవీ, ఇటివ్వు పాపా!" అని, వాడు రెండు మర్రి పళ్ళు నోట్లో వేసుకున్నాడు. "అద్భుతం! భలే ఉన్నాయి!" అన్నాడు నవ్వుతూ.

"నేను చెప్పలేదా, ఇవిగో, నువ్వు కూడా తిను. ఊరికే ఆకలితో ఉండకూడదు" అంటూ మూటని రెండోవాడికి అందించింది సుమతి. "కావాలంటే నేను ఇంకొన్ని మర్రిపండ్లు ఏరి పెడతాను" అని కూడా చెప్పింది.

సుమతి మంచితనానికి రాక్షసులిద్దరూ మైమరచిపోయారు. వాళ్ళిద్దరూ సంధ్యాసమయం వరకూ సుమతితో కబుర్లు చెప్తూ వాళ్ల ఇంటి సంగతులన్నీ అడిగి తెలుసుకున్నారు. తెలవారుతుండగా ఇక ఆ పాపను ఇంటికి వెళ్లమని, అక్కడున్న ఇసుకను ఓ నాలుగు గ్లాసులంత మూట కట్టి ఇస్తూ "ఇదిగో , ఇది తీసుకెళ్ళి మీ చిన్నమ్మకి ఇవ్వు. బంగారమని చెప్పు. నిన్ను బాగా చూసుకోవాలని కూడా మా మాటగా చెప్పు. సరేనా?!" అని ముద్దుచేసి, పంపారు.

ఇంటికి వెళ్లగానే సూరమ్మ "ఎక్కడ చచ్చావే, రాత్రంతా?! నువ్వు లేకపోతే గిన్నెలు ఎవరు కడుగుతారు?" అని తిట్లు లంకించుకున్నది.

"మర్రి చెట్టు దగ్గరికి. ఇదిగో ఈ మూటని నీకు ఇమ్మన్నారు. బంగారమట. నన్ను బాగా చూసుకోవాలని వాళ్ల మాటగా చెప్పమన్నారు" అంటూ తన చేతిలోని మూటని సూరమ్మకి అందించింది సుమతి.

"ఎవరు వాళ్ళు?!" అంటూ మూట విప్పిన సూరమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచింది. మూట నిండుగా బంగారు రజను ధగధగా మెరుస్తున్నది.

"ఎక్కడిదే, ఇది?" అని అడిగి సంగతంతా తెలుసుకున్నది సూరమ్మ. "అక్కడి ఇసుకంతా బంగారమేనట!" అనుకున్నది తప్పిస్తే, రాక్షసుల గురించి సుమతి చెప్పిందేదీ ఆమె తలకు ఎక్కలేదు. "పిచ్చిది, ఎవరినో చూసి 'రాక్షసులు' అనుకున్నది. రాక్షసులెందుకుంటారు, ఈ రోజుల్లో?!" అనుకున్నది.

సుమతికి రాత్రి మిగిలిన అన్నమూ, కూరలూ పెట్టి, "అక్కడికి వెళ్ళేందుకు దారేదే?" అని అడిగి కనుక్కున్నది. వెంటనే ఓ ఎద్దుల బండి కట్టుకొని, కావలసినన్ని సంచులు, పార తీసుకొని బయలుదేరి పోయింది.

సాయంత్రం కల్లా మర్రి చెట్టు దగ్గరికి చేరుకొని, చెట్టు తొర్రలో దాక్కుంది. చీకటి పడ్డాక రాక్షసులు వచ్చి, చెట్టు మీదే పడుకొని నిద్ర పోయారు. వాళ్ళు నిద్రపోవటం‌ చూసి నవ్వుకుంటూ బయటికి వచ్చింది సూరమ్మ. చూస్తే అక్కడి ఇసుకంతా బంగారు రంగులో మెరుస్తోంది! సూరమ్మ "ఓహో! నాకు ముందే తెలుసు ఈ సంగతి. వీళ్లదేమున్నది?!" అని తను తెచ్చుకున్న సంచుల్లోకి ఆత్రంగా ఇసుకని నింపుకోవటం మొదలెట్టింది.
అయితే ఇసకలో ఉన్న దుమ్ము కొంచెం ముక్కుల్లోకి పోయేసరికి సూరమ్మ ఇంక ఆపుకోలేక గట్టిగా ఒక్క తుమ్ము తుమ్మింది.

ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచిన రాక్షసులు "ఆహా! సూరమ్మా! నువ్వొస్తావని మాకు ముందే తెలుసు. నువ్వు లేకపోతేనే గదా, మా సుమతి పాప బాగుండేది! ఇదంతా నీ వల్లనే!" అని చటుక్కున సూరమ్మ మీదికి దూకి, గుటుక్కుమనిపించి, సంతోషంగా ఎగిరిపోయారు.
సుమతి కష్టాలు తీరాయి. వాళ్ల నాన్న మళ్ళీ పెళ్లిచేసుకోలేదు. వాళ్ల ఇంట్లో మళ్ళీ‌ సంతోషం విరిసింది.
--((***))--


*నేటి చిట్టి కథ*
ఒకానొక చక్రవర్తి యుద్ధంలో గెలిచి వచ్చాడు। భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశ యిల్లింది। తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రే ఆయనకా సమయంలో చులకనగా కనిపించాడు। దీన్నే అంటారు కళ్లునెత్తికెక్కాయని।
అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది। మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు।

'మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహ కర్తలు। ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుం డును' అన్నాడు।

అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే। కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు।

తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి। ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు। తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు।
దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి 'ఎండ మండిపోతోంది। ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు' అన్నాడు।

పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు।
'ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి। దాహం తీరి ఉండ దు। మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు' అన్నాడు మంత్రి మళ్ళీ। ।।పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు।

వెంటనే ఆలోచించాడు।।।

మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్ర ల్లోని నీటిని తెప్పించడం ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు। వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది। జ్ఞానోదయమయింది।

వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, 'గురు దేవా! మన్నించండి। గర్వాతిశయంతో కాని మాట అన్నాను। బంగారు పాత్ర విలువైనదే కావచ్చు। అందంగా ఉండవచ్చు। కాని దానికి నీటిని చల్ల్లపరిచే గుణం లేదు। మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు। అయినా నీటిని చల్ల్లగా ఉంచు తుంది। అందం కాదు గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు। నా అపరాధాన్ని మన్నించండి' అన్నాడు।

ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్ర గుప్తుడు। ఆ మహా మంత్రి మరెవరో కాదు। మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు।

*నరస్యాభరణం రూపం*
*రూపస్యాభర ణం గుణమ్‌*
*గుణస్యాభరణం జ్ఞానమ్‌*
*జ్ఞానస్యాభరణం* *క్షమా*

మానవులకు ఆభరణం రూపమని, రూపానికి ఆభరణం సుగుణమని, సుగుణానికి ఆభరణం జ్ఞానమని, జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం।

పై శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణమని చెప్పినా గుణం, జ్ఞానం, క్షమ అనేవి రూపం కన్నా అతి ప్రధానమైనవని స్పష్టం చేయబడింది।

అంటే మంచి అంద గాడైనా ఏ వ్యక్తి అయినా ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు కాడు। వినయం అనేది మనిషిలో ఎల్ల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి।

కొందరు ఓటమి చవి చూసి నప్పుడో, బాధలలో మునిగిపోయినప్పుడో తమ బాధలు వెళ్ళబుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు।

అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించి నపుడు, సంపదలు వచ్చినపుడు, మంచి పదవి ఉన్నపుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్న చూపు చూస్తారు। కించ పరుస్తారు। మాటలతో ఎదుటివారిని చులకన చేస్తారు।

అందంగా ఉండడం మంచిదే కాని తను అందంగా ఉన్నానని అందవిహీన మయిన పనులు చేయడం తగనిది।

అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నపుడు కూడా హద్దులెరిగి ప్రవర్తించాలన్నది పెద్దల మాట।

మీ కందఱకు ఈ నాటి కథను ప్రాంజలి ప్రభ  అందిస్తున్నది నచ్చితే షేర్ చేయండి  
____(((())))____

*బుద్ధి బలం:

అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. సింహం చాలా బలమైనది. రోజు రోజూ ఒక జంతువును చంపేసి తినేసేది. ఒకొక్క సారి ఆకలి లేకపోయినా ఆట కోసం వేరే జంతువులను చంపేసేది.

అడవిలో జంతువులన్నీ ప్రాణ భయంతో ఉండేవి. ఈ సమస్యని ఎడురుకోవడం ఎలా అని ఒక రోజు అన్ని జంతువులూ కలిసి అలోచించాయి. అందరూ సింహాన్ని కలిసి సంధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.

అనుకున్న ప్రకారం నక్క చేత సింహానికి కబురు పెట్టాయి. ఒక పెద్ద చెట్టు కింద జంతువులన్నీ సింహాన్ని కలవడానికి వచ్చాయి. సింహం కూడా కొద్ది సేపటికి వచ్చింది.

ఒక ముసలి కోతి సింహంతో ఇలా అంది, “మీరు మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు చాలా థాంక్స్.” సింహం దర్జాగా తల ఊపింది.

కోతి అంది, “మీరు భోజనానికి రోజుకొక్క జంతువుని చంపడం సమంజసమే. మీకు ఆహారం కావాలి. కాని అవసరానికి మించి మీరు జంతువులను చంపడం న్యాయం కాదు. మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి మేమే మాలో ఒక్కళ్ళని చీటీలు వేసుకుని ఎంచుకుంటాము. ఆ చీటీలో ఏ జంతువు పేరు ఉంటుందో, ఆ జంతువు నేరుగా మీ గుహకు వచ్చి మీకు ఆహరం అవుతుంది. ఈ ఒప్పందం మీరు ఒప్పు కుంటే అడవిలో జంతువులు ప్రశాంతంగా ఉండొచ్చు”

సింహం కి ఐడియా నచ్చింది. అడివిలో జంతువులు వాటంతట అవే బలవుతుంటే రోజూ వేటకి వెళ్ళే పని ఉండదు, హాయిగా ఉండచ్చు అనుకుని సింహం ఒప్పుకుంది.

రోజుకొక జంతువు అనుకున్న దాని ప్రాకారం సింహానికి బాలి అవ్వడం మొదలెట్టాయి.

కొన్ని రోజులకి ఒక కుందేలు వంతు వచ్చింది. పాపం కుందేలు చాలా భయ పడిపోయింది. దానికి బలి అవ్వాలని అస్సలు లేదు. ఎలాగ రా భగవంతుడా అని చాలా ఆలోచించింది. ఎలాగో గుండెను గట్టి చేసుకుని ఆ సింహం గుహ వైపుకు బయలుద్యారింది. దారిలో ఒక నుయ్యి కనిపించింది. నూతిలో నీళ్ళు చూస్తే ఒక ఐడియా వచ్చింది. అక్కడే పొద్దు పోయే దాకా కూర్చుని, సాయంత్రానికి ప్రశాంతంగా లేచి పరిగెత్తుకుంటూ సింహం దెగ్గిరకి వెళ్ళింది.

పొద్దుటి నుంచి ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం బాగా రుస రుసలాడుతూ, కోపంగా గుహ ముంగిట్లో పచార్లు చేస్తోంది.

కుందేలుని చూడంగానే “ఎమిటి ఇంత ఆలస్యం?” అని కోపంగా గర్జించింది.

కుందేలు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, “క్షమించండి మహారాజా! నేను పొద్దున్నే మీ వద్దకు రావటానికి బయలుద్యారాను. కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది. అది నన్ను తినబోతుంటే, ఈ రోజు నేను మీకు ఆహారాన్ని అన్న విషయం చెప్పాను. ఆ సింహం అస్సలు మాట వినలేదు. ఈ అడివికి నేనే రాజుని, అని నాతొ చెప్పి నా పైకి దుంకి నన్ను పట్టుకుందామని ప్రయత్నించింది. నేను ఎలాగో ప్రాణాలు కాపాడుకుని మీ దెగ్గరకు వచ్చాను!” అని చెప్పింది.

అసలే కోపం మీద ఉన్న సింహానికి ఇంకా భగ్గున మండింది. “ఎక్కడ ఆ సింహం! చూపించు నాకు!” అంది.

కుందేలు సింహాన్ని నూతి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. మరో సింహం నూతిలో ఉంటుందని చెప్పింది.

సింహం నూతిలోకి చూసింది. నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసి మరో సింహం అని అపోహ పడి గర్జించింది. ఆ గర్జన నూతిలో ప్రతిధ్వనించింది. సింహం తన ప్రతిబింబం తోనే యుద్ధం చేయడానికి నూతిలోకి దుంకేసింది. అందులోని నీళ్ళల్లో మరణించింది.

కుందేలు ప్రాణాలతో ఇలా తప్పించుకుంది. అడివిలో మిగిలిన జంతువులకు జరిగినది చెప్పింది. జంతువులన్నీ కుందేలు చాతచక్యం మెచ్చుకున్నాయి. ఆ రోజునుంచి ప్రశాంతంగా అడవిలో నివసించాయి.

బలం కన్నా బుద్ధి గొప్పదని నిరూపించడానికి ఈ కథ మరో నిదర్శనం.

--((***))--

*చిలక పలుకులు:

అనగనగా మంగపట్నంలో రాఘవయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అరటి పండ్ల వ్యాపారం చేసేవాడు అతను. పచ్చి అరటిపళ్ళు తీసుకొచ్చి, వాటిని మహా భయంకరమైన రసాయనంలో ముంచి పెడితే, ఒక్క రాత్రిలో అవి ముచ్చటగొలిపే పసిడి రంగుకు తిరిగేవి. ఈ సంగతి తెలీని అమాయకులు రోజూ రాఘవయ్య అంగడిలో అరటిపళ్ళు కొనుక్కొని పిల్లలకు తినిపిస్తూండేవాళ్ళు.

రంగయ్య దుకాణానికి దగ్గర్లో ఒక పెద్ద జువ్వి చెట్టు ఉండేది. దాని మీద చాలా చిలకలు నివాసం ఉండేవి. దారిన పోయే జనాలు వాటిని చూసి ముచ్చటపడి తమ దగ్గరున్న పప్పులో, కాయలో కొన్ని ఆ చెట్టు మొదట్లో పెట్టి పోతుండేవాళ్ళు. వాటిలో‌ కొన్ని చిలకలు మనుషుల్ని చూసీ చూసీ వాళ్లలాగా మాట్లాడటం కూడా మొదలు పెట్టాయి.

ఒకసారి ఉరుములతో కూడిన పెద్ద వర్షం కురిసింది. రాఘవయ్య దుకాణం మూసి బయటికి వస్తుంటే చెట్టు క్రింద ఒక రామ చిలుక పడిపోయి కనిపించింది. దానికి బాగా గాయాలు అయి ఉన్నాయి! జాలిపడిన రాఘవయ్య, ఆ రామచిలుకను ఒళ్ళోకి తీసుకొని, కట్టుకట్టి, సపర్యలు చేసాడు.

కొద్ది సేపటికి అది తేరుకున్నది. రాఘవయ్యకు 'థాంక్స్' చెప్పింది. "ఏం జరిగింది?'అని అడిగాడు రాఘవయ్య. "ఎవరో ఒక అతను ఇక్కడే చాలా సేపు తచ్చాడాడు. నాకు అనుమానం వచ్చింది. ఎగిరిపోవాలనుకున్నాను. అంతలోనే అతను నన్ను గులేర్‌తో కొట్టాడు. అది తగిలేసరికి ఇలా కింద పడిపోయాను. అయితే అతనికి నేను ఎక్కడ పడ్డదీ తెలీలేదు. కొంచెంసేపు వెతికి, తిరిగి వెళ్లిపోయాడు" చెప్పింది చిలుక.
అటు తర్వాత అది రాఘవయ్యకు కొంచెం దగ్గరైంది. రోజూ సాయంత్రం సమయంలో వచ్చి దుకాణంలో కూర్చునేది; రాఘవయ్య ఏమైనా ఇస్తే తినేది; చిన్న చిన్నగా ముచ్చట్లు పెట్టేది. ఒకసారి అది వచ్చే సరికి కొళాయి నుంచి నీళ్ళు చుక్కలు-చుక్కలుగా కారుతున్నాయి. కొంచెం సేపు చూసి, "నీళ్ళు కట్టేయ్! నీళ్ళు కట్టేయ్!" అని అరిచింది చిలుక. రాఘవయ్య కుళాయి కేసి చూసి, "ఏం కాదులే!" అని, తన పని తను చేసుకుంటూ ఉండిపోయాడు.
చిలుకకి నీళ్ళు వృధా అవ్వటం ఇష్టం కాలేదు. 'ఏం చేద్దాం?' అని ఆలోచించింది. 'కడుపులో దాచుకుందాం- వృధాగా పోగొట్టేదెందుకు?'అని వెళ్ళి నీళ్ళు త్రాగటం మొదలు పెట్టింది. 
కొద్ది సేపటికే దాని కడుపు నిండేసరికి, ఇక ఏం చేయాలో తోచలేదు. 'ఒంటెనైనా కాకపోతినే!' అనుకొని, చివరకు అ ప్రయత్నం నుండి విరమించుకున్నది.
అయితే అది చూస్తూండగానే నీళ్ల చుక్కలు ఆగాయి: ట్యాంకులో నీళ్ళు అయిపోయాయి. వెంటనే చిలకకు ఒక ఐడియా వచ్చింది. నేలమీద పడి తన్నుకుంటూ "దాహం-దాహం" అని అరవటం మొదలెట్టింది.
రాఘవయ్య గబగబా వచ్చి కుళాయి తిప్పి చూసాడు. నీళ్ళు లేవు! "ట్యాంకులో నీళ్ళు ఐపోయాయి" అని మోటారు వేయబోయాడు. కరెంటు లేదు! దాంతో‌ అతనికి ఇక ఏం చేయాలో‌ తోచలేదు. "కొంచెం‌ ఆగు- వేరే ఎక్కడైనా కాసిని నీళ్ళు దొరుకుతాయేమో చూసి వస్తాను" అని పోబోయాడు.
చిలుక లేచి కూర్చుని, "లేదులే, నాకు దాహం కాలేదు. నీకు బుద్ధి చెప్పడానికి ఇలా చేసాను. కుళాయిలో నీళ్ళు ఊరికే పోతుంటే సమస్య కదా!" అన్నది. 
రాఘవయ్యకి కోపం వచ్చింది కానీ, "అది చెప్పింది మంచికే గదా" అని ఊరుకున్నాడు.
తర్వాత కొన్ని రోజులకు రాఘవయ్య కొడుకు, పన్నెండేళ్లవాడు, పట్నం నుండి వచ్చాడు. రాఘవయ్య వాడిని ముద్దు చేస్తూ, తను మామూలుగా అమ్మే అరటిపళ్ళు రెండు తీసి ఇచ్చాడు తినేందుకు. సరిగ్గా అదే సమయానికి ఎగురుకుంటూ‌ వచ్చిన చిలుక వాడి చేతిలోంచి పళ్ళు లాక్కొని, పైకెగిరిపోయి కూర్చున్నది!
రాఘవయ్యకి కోపం వచ్చి తిట్లు లంకించుకున్నాడు. అతన్ని పూర్తిగా తిట్టనిచ్చి, చిలుక శాంతంగా "చూడు, నువ్వు అమ్మే అరటిపండుని ఒకరోజు తిన్నందుకే నా కడుపులో భరించలేనంతగా మంటగా ఉండింది:
ఇక నువ్వు అమ్మే పళ్లను కొనుక్కొని తినే మనుషులకు ఏమేమి రోగాలు వస్తున్నాయో, వాళ్ళు ఎంత మంటను భరిస్తున్నారో తెలీదు.
పచ్చి కాయల్ని ప్రమాదకర రసాయనాలతో నింపి అమ్ముతున్నావే, వాటివల్ల జనాలకెంత కష్టమో ఆలోచించావా? అట్లా ఆలోచించి ఉంటే నీ కొడుక్కి ఈ పండ్లు పెట్టేవాడివా అసలు?! నేను ఈ పని చేసింది నీ కొడుకు క్షేమం కోసమే!" అన్నది.
ఆ మాటలు విని రాఘవయ్య హృదయం కంపించింది. తన తప్పుకు పశ్చాత్తాప- పడ్డాడు. చిలుకకు క్షమాపణ చెప్పుకొని, అటుపైన నీతిగా వ్యాపారం చేసుకున్నాడు. మంచి పనులు తన తోటే మొదలవ్వాలన్న నిజాన్ని తెలియజెప్పిన చిలుకకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకున్నాడు.

--((***))--

నేత కార్మికుని కథ::
{తెలివితక్కువ కోరిక}
అనగనగా ఓ నేత కార్మికుడు. అతని మగ్గం విరిగిపోయింది. కొత్త మగ్గాన్ని తయారు చేసుకోవాలి. కలప కోసం గొడ్డలి పట్టుకుని అడవికి వెళ్ళాడు. ఓ చెట్టును చూశాడక్కడ. బాగుంది. గొడ్డలి ఎత్తి కొమ్మను నరకబోయాడు. అంతలో ఆ చెట్టు మీద ఉన్న యక్షుడు కార్మికుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఇలా అన్నాడతనితో.‘దయచేసి ఈ చెట్టునేం చెయ్యకు. కొమ్మలు నరికి, పాడు చెయ్యకు. నాకీ చెట్టు హాయిగా ఉంది. ప్రాణానికి సుఖంగా ఉంది. నేను దీనిని ఆశ్రయించుకుని ఉంటున్నాను. అందుకే వద్దంటున్నాను.’చేతిలోని గొడ్డలినీ, చెట్టునీ, యక్షుణ్ణీ మార్చి మార్చి చూశాడు కార్మికుడు. 

ఏం చెయ్యాలో పాలుపోలేదతనికి. అది గ్రహించాడు యక్షుడు. ఇలా అన్నాడు.‘ఈ చెట్టుకు బదులు నీకేం కావాలో కోరుకో! ప్రసాదిస్తాను.’ఏం కోరుకోవాలి? ఊహించని అవకాశం. అప్పుడూ ఏమీ పాలుపోలేదు కార్మికుడికి. ఆలోచించి ఇలా అన్నాడు.‘అయితే ఏం కోరుకోవాలో నా మిత్రుడు క్షురకుడు ఒకడున్నాడు. అతన్ని అడిగి వస్తాను. అభ్యంతరం లేదుకదా’లేదన్నట్టుగా నవ్వాడు యక్షుడు.‘నేనంటే నా మిత్రుడికి చాలా ఇష్టం. ఎప్పుడూ నా మంచినే కోరుకుంటాడతను. అందుకనే అడుగుతున్నాను. ఇబ్బందేం లేదు కదా’ మళ్ళీ అడిగాడు కార్మికుడు. లేదన్నట్టుగా తలూపాడు యక్షుడు. కార్మికుడు పరుగు పరుగున మిత్రుణ్ణి చేరుకున్నాడు. జరిగిందంతా చెప్పాడతనికి.
‘రాజ్యాన్ని కోరుకో మిత్రమా! రాజువయితే సుఖసంతోషాలకు లోటుండదు. పేరుకి పేరూ, డబ్బుకి డబ్బూ, నిన్ను మించిన వారుండరు. రాజువి కదా, ఎంతయినా దానధర్మాలు చెయ్యొచ్చు. దాంతో చెప్పలేనంత పుణ్యాన్ని మూటగట్టుకుని, స్వర్గానికి చేరుకోవచ్చు.’ అన్నాడు మిత్రుడు.అతని మాటని అనుసరించి, తనని రాజుని చేయమని యక్షుణ్ణి అర్థిస్తే పోయేది. కాని, కార్మికుడు అలా చేయలేదు. భార్యని కూడా ఈ విషయమై సంప్రదించాలనుకున్నాడు. నెత్తి మీద శని కూర్చున్నప్పుడు అన్నీ ఇలాంటి ఆలోచనలే కలుగుతాయి.ఇంటికి చేరుకున్నాడు కార్మికుడు. జరిగిందంతా పూసగుచ్చినట్టుగా భార్యకు వివరించాడు. క్షురక మిత్రుని మాటలు కూడ ఒక్క ముక్క మరిచిపోకుండా అంతా చెప్పుకొచ్చాడు.‘నువ్వేమంటావు?’ అడిగాడు.ఆమె హరికథలూ, బుర్రకథలూ వింటూ మిడిమిడి జ్ఞానాన్ని బాగానే సంపాదించింది. ఆ జ్ఞానంతో భర్తతో ఇలా అంది.

‘అమ్మో! రాజ్యాలూ, రాజులూ మనకొద్దు. రాజ్యం కోసమే కదా, రాముడు అడవుల పాలయ్యాడు. పాండవులూ అంతే! బలిచక్రవర్తి కథ కూడా నీకు తెలిసిందే! పాపం పాతాళానికి దిగజారిపోయాడు. కార్తవీర్యార్జునుడూ, రావణాసురుడూ అంతా రాజులు కావడం వల్లనే నాశనం అయిపోయారు. మనకొద్దా రాచరికాలు.’’‘డబ్బు కావాలంటే రాజు కావాలిసిందే’ అన్నాడు కార్మికుడు.‘మనకంత డబ్బు కూడా వద్దు. డబ్బుంటే దురలవాట్లకు లోనవుతాం, వద్దొద్దు.’ అందామె.‘మరింకేఁ కోరుకోమంటావు?’‘

ఏం కోరుకోమంటానంటే...ఇప్పుడు నువ్వు రోజుకో బట్టను నేస్తున్నావు. దానిని అమ్మగా వచ్చిన సొమ్ముతో నువ్వూ నేనూ బతుకుతున్నాం. అంతే! కాణీ పరకా దాచుకునే వీలు లేకుండా పోతోంది. నువ్వు కాని మరో బట్టను నేయగలిగితే, అది అమ్మగా వచ్చిన డబ్బును మనం దాచుకోగలం. ముందు ముందు మన అవసరాలకు ఆ డబ్బు పనికి వస్తుంది. పదిమందిలో మనం కాస్తంత ఉన్నతంగా బతికే అవకాశం కూడా ఉంటుంది. ఆలోచించు.’

‘నిజమే’‘ఒకటికి మరో బట్ట నెయ్యాలంటే నీకు మరో తలా, మరో రెండు చేతులూ కావాలి కాబట్టి, నువ్వు యక్షుణ్ణి అవే కావాలని అడుగు. హాయిగా బతుకుతాం.’ అంది భార్య. కార్మికుడికి భార్య సలహా బాగా నచ్చింది.రెండు తలలూ, నాలుగు చేతులూ ఉంటే రెండు మగ్గాలని ఏకకాలంలో ఉపయోగించి, రెండు బట్టల్ని నెయ్యొచ్చనుకున్నాడతను. భార్య ఆలోచనని మెచ్చుకున్నాడు. అడవికి పరుగుదీశాడు. చెట్టుని సమీపించాడు. యక్షుణ్ణి పిలిచాడు. వెంటనే యక్షుడు ప్రత్యక్షమయ్యాడు.‘చెప్పు ఏం కావాలి?’ అడిగాడు.‘నాకు రెండు తలలూ, నాలుగు చేతులూ కావాలి.’ అడిగాడు కార్మికుడు.‘తథాస్తు’ అన్నాడు యక్షుడు.

చేనేత కార్మికుడికి రెండు తలలు ఏర్పడ్డాయి. నాలుగు చేతులు పుట్టుకొచ్చాయి. తడిమి తడిమి చూసుకున్నాడు వాటిని. ఆనందం పట్టలేక గెంతాడు కాసేపు. తర్వాత ఇంటి దారి పట్టాడు. రాదారిన వస్తోంటే అతన్ని అంతా వింతగా చూడసాగారు. భయపడ్డారు. ఊరి చేనేత కార్మికుడు అని ఎవరూ గుర్తు పట్టలేదతన్ని. ఎవరో రాక్షసుడు అనుకున్నారు. దాడి చేశారు అతని మీద. కర్రలతో కొట్టి కొట్టి చంపేశారు.’’
పంచతంత్ర కథ.

--((***))--


*” ఇక చదువు”

మూడేళ్ళ పాప పుస్తకం తీసి చదవడం మొదలెట్టింది। ” అ అమ్మ, ఆ ఆవు…।” అంటూ గట్టిగా పైకి చదువుతోంది।

నేను నా పనిలో ఉన్నాను।

“ప… పండు।।”అని చదువుతూ, పుస్తకాన్ని నా దగ్గరకి తెచ్చింది। పుస్తకంలోని బొమ్మని చూపిస్తూ ” ఇదేం పండు నాన్నా?” అని అడిగింది।

” ఇదా, దీన్ని దానిమ్మ పండని అంటారు।లోపల ఎర్రని తియ్యటి గింజలుంటాయి” అని చెప్పాను।

“నాకు దానిమ్మ పండు కావాలి” అంటూ చదవడం ఆపేసి పాపాయి గొడవ చేస్తోంది।

నాకు చిరాకేసింది। “పళ్ళని జ్వరమొచ్చిన్న వాళ్ళు తింటారు। నీకేమి జ్వరం లేదుగా? చదువుకో। తెలుగు చాలు। వెళ్ళి ఇంగ్లీష్ చదువు” అన్నాను। పాపం, బిక్క మొహం వేసుకుని ఇంగ్లీష్ పుస్తకం తెరిచింది। ” ఎ ఫర్ ఆపిల్…।” అంటూ చదువుతోంది।

ఆపిల్ అనగానే గుర్తొచ్చింది। మందులు రాసాక, డాక్టర్ చెప్పారు మా ఆవిడకి ఆపిల్ పెట్టమని। మందులు కొన్నాక, మిగిలిన కొన్ని డబ్బులతో కూరలు కొందామనుకున్నను। వాటితో ఓ రెండు పూటలు గడిపేయచ్చు। కాని, మరి మా ఆవిడ కోసం ఆపిల్? నేను ఎటూ తేల్చుకోలేకపోయాను। కసేపు ఆలోచించాక, ఆపిలే కొనాలని నిర్ణయించుకున్నాను।

పాపాయి ” ఎ ఫర్ ఆపిల్…।” అనే మాటలనే వల్లె వేస్తోంది। ఉన్నట్టుండి, “నాన్నా, ఆపిల్‌ని కూడా జొరమొచ్చిన వాళ్ళే తినాలా? అంటే అమ్మ లాంటి వాళ్ళా?” అని అడిగింది।

పాపకి నేను జవాబు చెప్పలేకపోయాను। తనకేసే రెప్పలార్పకుండా చుస్తుండిపోయాను।

పాప ఇంగ్లీష్ పుస్తకన్ని దగ్గరగా తీసుకుని అందులోని ఆపిల్ బొమ్మని తదేకంగా చూస్తూ “నాకు జ్వరం ఎప్పుడొస్తుంది నాన్నా?” అని అడిగింది।
బిత్తర మోహమ్ వేసుకొని చూసా
చదివిడి చాలు ఆడుకో అన్నాను 

“సోనూ పాపాయి, బయటకి వెళ్ళకే। అక్కడంతా మట్టి, కక్కా – తెలిసిందా? ఇంట్లోనే ఆడుకోవాలి” రమ చెప్పింది। పాపాయికి పాకడం వచ్చిన రోజునుంచి రమది ఇదేవరస। పాప బయటకు వెళ్ళి మట్టిలో ఆడకోకూడదని ఆమె కోరిక।

“ఛీ, ఛీ, చెత్త మట్టి తల్లీ, దీంట్లో ఆడకూడదు। చూసావా, చేతులు కాళ్ళు ఎంత మురికిగా తయారయ్యాయో? ” అంటూ రమ సోనూని లోపలికి తీసుకొచ్చేస్తుంది, పాపాయి బయటకు వెళ్ళినప్పుడల్లా। పాపాయి అర్ధమయ్యేలా ప్రేమగా చెప్పడానికి యత్నిస్తుంది।

సోనూ నడవడం మొదలు పెట్టేసరికి మా ఇద్దరి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది। కాని ఇప్పుడు రమకి బెంగ ఎక్కువై పోయింది। పాపాయి చల్లాగా జారుకుని మట్టిలో ఆడుకునేది। రమకి కోపం వచ్చేస్తుంది। ” దీన్ని వెతికి పట్టుకుని లోపలికి తీసుకొస్తాను। క్షణంలో పారిపోతుంది। నాకు విసుగొచ్చేస్తోంది” అని నాతో చెప్పి పాప కేసి తిరిగి ” అబ్బబ్బా, నీకెన్ని సార్లు చెప్పాలి? మట్టిలో ఆడొద్దని? చెబితే అర్ధం కాదా?” అంటూ కేకలేసింది।

ఈ మధ్య రమ సోనూని తిడుతోంది, బెదిరిస్తోంది కూడా। “జాగ్రత్త, ఈసారి మట్టిలోకి వెళ్ళావంటే తోలు వలిచేస్తాను…”

” ఏం? ఇంట్లో కూర్చుని ఆడుకోలేవా? ఎప్పుడు నీ దృష్టంతా మట్టి మీదేనా?”

ఒక్కో సారి నేను కూడా పాపాయిని మందలిస్తూంటాను।
ఉన్నట్టుండి, ఏమైందో ఏమో, సోనూ మట్టిలోకి వెళ్ళడమే కాదు, ఇంట్లోను ఆడుకోడం మానేసింది। ఇంట్లోనే ఒక గదిలోంచి మరో గదిలోకి తిరుగుతుంది। బయటి గుమ్మం దాకా వెడుతుంది, మళ్ళీ అంతలోనే – “ఛీ చెత్త మట్టి…” అనుకుంటూ వెనక్కి వచ్చేస్తుంది।
ఇప్పుడు పాప్పయి మొహంలో నవ్వు లేదు, మా ఇంట్లో కిలకిలారావాలు లేవు। ఎప్పుడూ ఏదో నిశ్శబ్దం! భరించలేని మౌనం!!

సోనూ అమ్మమ్మకీ, తాతయ్యలకి ఈ సంగతి తెలియగానే వాళ్ళు కంగారు పడ్డారు। సోనూతో పాటు మమ్మల్ని కూడా వచ్చి వాళ్ళ ఊర్లో కొన్ని రోజులు ఉండి వెళ్ళమన్నారు। మాకూ ఆ పల్లెటూరుకి వెళ్ళలనిపించింది। సరేనన్నాం। ఆ రాత్రే బస్సు పట్టుకుని బయల్దేరాము। మా అత్త గారు, మావగారు, బావమరిది, మరదలు సోనూని చూసి ఎంతో సంతోషించారు।

కాని ఇక్కడికి వచ్చాక, సోనూ మరింత నిశ్శబ్దంగా ఉంటోంది। ఎంతసేపూ వాళ్ళమ్మ వొడిలోనే ఉంటోంది। కిందకి దించాలని చూస్తే ఏదుపు లంకించుకుంటోంది, మళ్ళీ అమ్మ ఒడిలోకి వెళ్ళిపోతోంది।

అప్పుడు మా మావగారు, సోనుని ఎత్తుకుని సముదాయించి బయటకు తీసుకెళ్ళారు। కాసేపటి తర్వాత ఆయన ఒక్కరే లోపలికి వచ్చారు।

“పిల్లేదండి?”నేను మా ఆవిడ ఒకేసారి కంగారుగా అడిగాము।

“బయట పిల్లలతో ఆడుకుంటోంది” అని ఆయన గంభీరంగా చెప్పి గదిలోకి వెళ్ళిపోయారు। ఇంతలో ఇంటి బయట పిల్లల సందడి వినిపించింది।
మేము బయటకి వెళ్ళి చూసాము। తోటి పిల్లలో కలిసి కేరింతలు కొడుతూ హాయిగా మట్టిలో ఆడుకుంటోంది సోను।
మా మొహాల్లో పోయిన నవ్వు తిరిగొచ్చింది। 
 ఈవయసులో అడే ఆటలు ఆ వయసులో ఆడు కోవాలి అని తాత అన్న మాటలు గుర్తుకొచ్చాయి। 

--((***))-- 

*ఒక కారు తయారీ కంపెనీ యజమాని తన కంపనిలోని ఒక ఇంజనీయర్ కు " ఒక మంచి కారును డిజైన్ చేసి తయారు చేయుమని" ఒక పని అప్ప చెప్పాడు.

ఆ ఇంజనీయర్ " ఒక అద్భుతమైన కారును "తయారుచేసి సిద్ధంగా ఉంచి యజమానికి కబురుపెట్టాడు.యజమాని వచ్చి ఆ కారును చూసి ఆశ్చర్యానందాలను వ్యక్తం చేయడంతోపాటు అతని పనితనాన్ని చాలా మెచ్చుకున్నాడు.

ఆ కారును కంపెనీ తయారు ప్రదేశం నుండి షోరూంకు తీసుకొద్దామని చూసేసరికి ప్రవేశ ద్వారం కన్నా కారు రెండు ఇంచులు ఎత్తుగా ఉంది.

కారును తయారు చేసేముందు ఈ విషయం గమనించలేక పోయినందుకు ఇంజనీయర్ లోలోపల చింతించసాగాడు.

తయారీ ప్రాంతం నుంచి వెలుపలకు కారును ఎలా తీసుకోవాలో ఆ యజమాని ఆలోచించసాగాడు.

అక్కడే ఉన్న "ఫేంటర్" కారును అలాగే బయటకు తీసుకు వద్దాం! కారు పైన కొన్ని గీతలు.. నొక్కులు పడితే తర్వాత సెట్ చేసుకోవచ్చు!! అని సలహా ఇచ్చాడు.

"ప్రవేశ ద్వారం పగులగొట్టి కారు బయటకు తీసుకువద్దాం! తర్వాత ద్వారాన్ని రిపేర్ చేయిద్దాము! " అని ఇంజనీయర్ సలహా ఇచ్చాడు.

ఈ రెండు సలహాలు విని యజమాని కన్వీనెన్స్ కాలేక పోయాడు.ఎందుకంటే అలా కారుకు నొక్కులూ,గీతలు పడడం కానీ, ద్వారాన్ని పగలగొట్టడం కానీ మంచి శకునంగా అతడు భావించలేకపోయాడు.

జరుగుతున్న విషయమంతా చూస్తున్న అక్కడే ఉన్న "వాచ్ మెన్ " భయం భయంగా సందేహిస్తూనే తన మనసులోని ఐడియా చెప్పాలని " ఒక చిన్న సలహా సార్! "అన్నాడు.

అక్కడున్నవాళ్ళు " నిపుణులే ఇవ్వలేని సలహాని వాచ్ మెన్ ఏమిస్తాడా? " అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా..

ఆ వాచ్ మెన్ ఇలా అన్నాడు.

"కారును బయటకు తీసుకురావడం చాలా ఈజీ సార్! కారు, ద్వారం కన్నా రెండు ఇంచులే ఎత్తుగా ఉందికదా సార్! కారు టైర్లలోని "గాలి" కొంత తీసేసి బయటకు తెచ్చి తిరిగి కారుటైర్లలో గాలినింపితే సరి!!" అన్నాడు.

వాచ్ మెన్ సలహా విని అతన్ని అభినందిస్తూ అక్కడున్న ప్రతీ ఒక్కరూ చప్పట్లు కొట్టసాగారు.

                          ✡✡✡✡✡

కాబట్టి ,కేవలం నిపుణుల అభిప్రాయం  తీసుకుని మాత్రమే సమస్యలను విశ్లేషించవద్దు!! 

ఒక్కోసారి చదువుకోని తాతనో, నానమ్మనో, అమ్మమ్మనో వంటి  తాము సామాన్యంగా భావించే వ్యక్తులు కూడా.. 

"ఎంతో కష్టం అని భావించిన సమస్యను అతి సులభంగా పరిష్కరించవచ్చు!! "

...ఈ కథలో నేర్చుకోవలసిన మరో నీతి కూడా ఉంది.

మిత్రులతోనో, బంధువులతోనో.. గొడవ వల్లనో మరే కారణం వల్లనో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఈ కథలోని కారులా మనం ఎత్తుగా (ఉన్నతంగా అనుకొని)  వారి ఇంటి ప్రవేశ ద్వారం చిన్నగా ప్రవేశించలేనిదానిలా కనిపిస్తుంది.

అప్పుడు ఈ కథలోని వాచ్ మెన్ సలహా పాటించాలి!!

కొంత గాలి (ఇగో) తీసివేసి...ఎత్తును (ప్రవర్తనను) అడ్జెస్ట్ చేసుకోవాలి.

నిజానికి మనమందరం ఆనంద స్వరూపమైన "ఆత్మ" కలవారం!!

కానీ, 

""అనవసరమైనవి జమ చేస్తూ ఉంటే అశాంతితో బరువెక్కిపోతాము!!!!!

ఈ చెత్తానంతా తొలగించుకుంటున్నా కొద్దీ ఆనందంతో తేలికైపోతాము!!!!!
___((()))___

కేరళ లోని ఈ ఆలయంలో విగ్రహాన్ని దొంగతనం చేసిన ప్రతిసారి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లలేక దొంగలు మళ్ళీ వదిలి వెళ్ళటం ఇలా 3సార్లు జరిగింది...

"మృదంగ శైలేశ్వరి ఆలయం"  అనేది దక్షిణ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా, ముజక్కున్ను వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయం. ఋషి పరశురామునిచే స్థాపించబడిన 108 దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది.

కేరళ శాస్త్రీయ నృత్యం "కథాకళి" ఇక్కడే ఉద్భవించింది.

దీనిని జ్ఞానానికి సంబంధించిన ఒక తాంత్రిక శక్తి పీఠంగా చెప్తారు. ఇక్కడ ప్రధాన దేవి దుర్గను "మిఝావిల్ భగవతి"  అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి "మృదంగ శైలేశ్వరి" అని పేరు రావడం వెనుక ఒక కథ ఉంది.  ఈ ప్రదేశంలో మృదంగ ఆకారంలో ఉన్న ఒక శిల స్వర్గం నుండి పడిపోయింది అని చెప్తారు. ఇక్కడే శక్తి లేదా దేవి యొక్క ఉనికిని కనుగొన్న పరశురాముడు ఆమెను విగ్రహం లోకి ఆహ్వానించి ఆమె కోసం ఆలయాన్ని స్థాపించాడు అని స్థలపురాణం.  

ఈ ఆలయంలో కొద్ది దశాబ్దాలుగా జరుగుతున్న అద్భుతం ఏమిటంటే, నాలుగుసార్లు, దొంగలు ఈ ఆలయ విగ్రహాన్ని దొంగిలించారు, కానీ వారు దానితో ఎక్కువ దూరం వెళ్ళలేకపోవడంతో దానిని వెనక్కి తిరిగి ఇచ్చారు.

ఇటీవల కేరళ డిజిపి (రిటైర్డ్) శ్రీ అలెగ్జాండర్ జాకబ్ భగవతి విగ్రహాన్ని దొంగిలించిన విగ్రహ దొంగల కథను ఒక టివి ఛానల్ లో వివరించాడు. ఈ ‘పంచలోహ విగ్రహం’ మార్కెట్ విలువ దాదాపు 1 నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది. ఆయన పనిచేస్తున్నప్పుడు ఆయన సిఫారసు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ ఆలయానికి సెక్యూరిటీ గార్డులును ఇవ్వలేదట. 

మొదటిసారిగా దొంగలు ఈ విగ్రహం దొంగతనం చేసిన తరువాత దానిని పారక్కడవు వద్ద రోడ్డుపక్కన ఒక నోట్‌తో వదిలేశారు - "ఈ విగ్రహం మృదంగ శైలేశ్వరీ ఆలయానికి చెందినది, దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం, దానిని తిరిగి ఆలయానికి తీసుకెళ్లవచ్చు అని". 

రెండో సారి, 3 సంవత్సరాల తర్వాత, దొంగలు దానిని 300 మీటర్ల దూరం మాత్రమే తీసుకెళ్లారు. రెండు సందర్భాల్లోనూ ఆలయ ఆవరణలో మరియు వారు విగ్రహం వదలిపెట్టిన స్థలంలో కూడా మలవిసర్జనలు జరిగాయి. 

మూడవసారి దొంగలు దానిని కాల్పేట వరకు తీసుకెళ్లారు. కానీ విగ్రహానికి సంబంధించిన వివరాలను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తెలియచేసి ఆ విగ్రహాన్ని అక్కడి లాడ్జిలో వదిలిపెట్టారు.

Mr. అలెగ్జాండర్ ఈ మూడు సార్లు డ్యూటీలో ఉన్నందున అతను దొంగల వైఫల్యంతో అబ్బురపడ్డాడు.  తరువాత, చాలా సంవత్సరాల తరువాత దొంగలు పట్టుబడినప్పుడు, వారు దొంగిలించబడిన విగ్రహంతో తప్పించుకోలేకపోవడానికి ఖచ్చితమైన కారణాన్ని అడిగితే వారు విగ్రహాన్ని దేవాలయం నుండి తీసి తమ వెంట తీసుకెళ్తున్నప్పుడు, వారు తమ దిశను పూర్తిగా కోల్పోతున్నారని, వాళ్ళు తిమ్మిరిలోకి వెళ్ళిపోతానున్నాము అని మరియు అన్నిటి కంటే భయంకరమైన విషయం ఏమిటంటే, వారు తమ ప్రేగు కదలికలపై నియంత్రణను కోల్పోయి మూత్ర విసర్జన మరియు మల విసర్జన అనియంత్రితంగా చేస్తారు అని దొంగలు చెప్పారు. 

ఇదే విషయమై ఆలయ పూజారులను ప్రశ్నించినప్పుడు, విగ్రహం యొక్క 'ప్రతిష్ట కర్మ' చాలా సుదీర్ఘమైన ప్రక్రియ (9 రోజుల కంటే ఎక్కువ జరిగింది) అని,  ఈ దొంగల అసమర్థత కి కారణం ఆ  'ప్రతిష్ట కర్మ' యొక్క  'తాంత్రిక విధి విధానాల' యొక్క ఫలితం అని వారు చెప్పారు.

అయితే ఈ మూడు విఫల ప్రయత్నాలు కూడా విగ్రహాల దొంగల ముఠా తదుపరి ప్రయత్నాలను నిరోధించలేదు. 

ఈసారి అది కేరళ రాష్ట్రంలోని మైనారిటీ వర్గానికి చెందిన అనుభవజ్ఞులైన దొంగల ముఠా ప్రయత్నించారు. కారణం?  వారు విగ్రహంలోని అతీంద్రియ శక్తులను విశ్వసించలేదు. కానీ వారు కూడా విగ్రహాన్ని  విడిచిపెట్టారు. తరువాత వారు పట్టుబడినప్పుడు, వారు విగ్రహాన్ని విడిచిపెట్టడానికి పైన చెప్పిన కారణాలే  చెప్పారు.

మన తెలివితేటలు మరియు మన శాస్త్రీయ పరిజ్ఞానానికి అంతు పట్టని విషయాలు మన ఈ ప్రకృతిలో ఎన్ని ఉన్నాయో?
తెలంగాణ ప్రాంత-  అల్ట్రా వైలెట్ రేడియేషన్ హెచ్చరిక: RED ALERT!!    ( ప్రచరణ కొరకై)

గత కొన్ని రోజులుగా విపరీతమైన వేడితో కూడిన గాలుల వలన, ప్రజలు ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ ప్రాంతంలో అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఇండెక్స్ = 12 చేరడంతో, హైదరాబాదులోని అశ్విని ఎలర్జీ సెంటర్ వైద్యబృందం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా 2.5 కోట్లమంది, ఎలర్జీ వ్యాధితో బాధపడుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని,  ఒక ప్రకటన విడుదల చేసింది.

అల్ట్రా వైలెట్ రేడియేషన్ index 12కు చేరడంతో, ప్రజలను ఆరోగ్య విషయంలో అప్రమత్తం చేసే విధంగా, సూచనలు విడుదల చేసింది.

అల్ట్రా వైలెట్ రేడియేషన్ index 12, ఉండడంవల్ల : 

 1)SUN ALLERGY విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ ప్రభావం వల్ల శరీరమంతా విపరీతమైన మంటలు, దురదలు, ఎర్ర దద్దుర్లు, రావడం జరుగుతోందని హెచ్చరించింది.

2) అత్యవసర పరిస్థితులు, అనివార్య అవసరాలు మినహా, ఎట్టిపరిస్థితుల్లో ఉదయం 11 గంటల నుంచి 4pm గంటల మధ్యలో ఎండలో పోకూడదని, అశ్విని ఎలర్జీ మెడికల్ టీం చీఫ్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.

3) గత పది రోజులుగా, చర్మం మీద ఎలర్జీలు తో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిందని, దీనికి కారణం సూర్యుని నుండి వెలువడుతున్న అల్ట్రావైలెట్ రేడియేషన్ మే కారణమని, అలర్జీ ఇమ్యునాలజీ వైద్యులు చెబుతున్నారు.

4) బయటికి వెళ్ళ వలసిన పరిస్థితి ఏర్పడితే SUN PROTECTION  CREAM (60spf) చర్మంపై రాసుకొని వెళ్లాలని సూచించారు.

5) ఫోటో డెర్మటైటిస్, POLYMORPHIC LIGHT ERUPTION వంటి సన్ ఎలర్జీలు తో బాధపడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

6) తలపై CAP, SUNGLASSES, LOOSE Clothing వేసుకొని బయటికి వెళ్లాలని సూచించారు.

7) అల్ట్రా వైలెట్ సూర్యకాంతి తాకిన అరగంట గంటలో, చర్మం దురదలు రావడం, చర్మంపై మంటలు రావడం, దద్దుర్లు రావడం, గమనించినట్లయితే వెంటనే దగ్గర్లోని అలర్జీ ఇమ్యునాలజీ స్పెషలిస్ట్ లను సంప్రదించవలసినదిగా సూచించారు.

8) మబ్బులు ఉన్నాయి కదా అని బయటకెళ్ళిన, ప్రమాదమని, మబ్బుల నుంచి కూడా సూర్యుని అల్ట్రా వైలెట్ రేడియేషన్ కాంతులు భూమిని తాకుతుందని, దానివల్ల కూడా అలర్జీల ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరించారు.

9) ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని బయటకు తీసుకు వెళ్ళకూడదని, దీనివలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.


డాక్టర్: వ్యాకరణం నాగేశ్వర్
Allergist & Immunologist
Environment Protection Activist
& Medical Journalist.
9949529392
www.aswiniallergycentre.com

[08/06, 07:30] Mallapragada Sridevi: *_గుండమ్మకి షష్టిపూర్తి!_*
______________________-ఎలిశెట్టి
     _07.06.1962_
***********************
*_గుండమ్మకధ.._*
షష్టిపూర్తి చేసుకుంటున్న 
ఈ సినిమా గురించి ఇప్పుడు సమీక్ష చేస్తున్నా కూడా తాజాగా చూసి రాస్తున్న అనుభూతి.మనలో చాలా
మంది పుట్టక ముందే విడుదలైన ఈ సినిమా 
విజయనగరంలోని మా వెంకటేశ్వర థియేటర్ తో పాటు ఊళ్లో నాటికి ఉన్న టాకీసులన్నిటిలోను ఎన్నెన్ని సార్లు చూసానో లెక్కే లేదు.
టీవీల్లో సరేసరి..ఇప్పుడు వచ్చినా తెరకు అతుక్కుని చూసెయ్యడమే..నా దృష్టిలో గుండమ్మకథ కమర్షియల్ కళాఖండం..అఖండం..!
నటీనటులంతా ఎవరి పాత్రకి వారు నూటికి నూరు శాతం
న్యాయం చేసిన వెండితెర అద్బుతం.హాస్యం,డ్రామా.. సెంటిమెంట్స్..
అన్నీ సమపాళ్లలో పండిన  ఫక్తు కుటుంబకథా చిత్రం..
విజయా బ్యానర్
వైభవాన్ని పెంచిన సినిమా..


*_నిక్కరులో నందమూరి.._*
*_లిక్కరులో అక్కినేని.._*
నక్కజిత్తుల గంటయ్య..
చొక్కా ఇట్టా చించుకొచ్చా
భర్తను నిలదీసే హేమలత..
తొడలు చరిచి 
చావు దెబ్బలు తిన్న 
పహిల్వాన్ రాజనాల..
అధాటున వస్తే మీకేమి
గిధాటున వస్తే మీకేమి
ఇలా ధాటిగా తిరగబడే 
పెళ్లిళ్ల పేరయ్య బొడ్డపాటి..
బక్క పల్చటి 
హోటల్ యజమాని అల్లు..
ఇదంతా ఒక టైపు సెటప్పు..
ఒక్కొక్కరికి 
ఒక్కో రకం మేకప్పు..!

*_గుండుబోగుల గుండమ్మ.._*
ఆమె చుట్టూ నడిచే కథ..
సవితి కూతురు సావిత్రి..
కోడి కూసే పాటికి 
ఇంటి పనిలో మునిగిపోయే 
మహా అభినేత్రి..
ఇంటికి పెళ్లి చూపులకి వచ్చే కాబోయే మాంగారు 
ఆజానుబాహువు 
రంగారావుకే
నిద్ర కళ్ళతో అమ్మా కాఫీ
అంటూ కనిపించే సరోజ..
ఆ పేరు చెప్పడంలోనూ
వెటకారపు జజజ్జరోజ..
నాటి పెద్దోళ్ల ఇళ్లలో
ధిలాసాగా తిరిగే
ఏకైక పుత్రుడు 
బ్యాచి హరనాథ్..
జోడీ విజయలక్ష్మి...
ఆమె అప్పా..అమ్మ..
మిక్కిలినేని,రుష్యేంద్రమణి..
మేనత్త దుర్గి..
గుండమ్మ సాటి..
ఆమెకే పోటీ..
గాంధీ గారి క్లాసులో
కాకిబుద్ధి ఛాయాదేవి..
గుండమ్మ ఇంట్లో పని 
చెయ్యలేనని అంజి పేచీ..
అదంతా గంటయ్య లాలూచీ.. 
తోటమాలి వెంకన్న గారు..
తారాగణం మొత్తం
బంధుగణం..
అందరిదీ బాగా
నటించే గుణం..!

ఇద్దరు పెద్ద 
హీరోలున్న సినిమాకి 
గుండమ్మకథ టైటిల్..
పాత్రకి..టైటిల్ కు
పూర్తి న్యాయం చేస్తూ
సూర్యకాంతం అభినయం..
పక్కన గంటన్న..
అబ్బో..
అతగాడు పెద్ద పెంటన్నా..
ఆరడుగుల రమణారెడ్డి
కంటద్దాలేమో సోడాబుడ్డి..
పాలలో మోసం..
మెలేస్తూ మీసం..
మెక్కేస్తూ అల్లు హోటల్లో
ఉల్లి,అల్లం దట్టించిన దోశ..
ఎంత పేరాశ...
పైగా నీళ్ళు కలపకుండా
పాలు తాగే మగాడెవడోయ్
అంటూ బుకాయింపు..
చాయమ్మ రాగానే 
గుండమ్మకే దబాయింపు!!

సినిమాకి హైలైట్ అంజి..
గుండమ్మ కూతురిని పెళ్ళాడి
రిక్షాలో షికారు కోసం
రెండ్రూపాయలు 
గంటయ్యను గుంజి గుంజి..
ఎన్టీఆర్ హాస్యం...
అందులో ఎంత లాస్యం..
అతడే ఆంజనేయ ప్రసాద్
అన్నది మనకి మాత్రమే
తెలిసిన రహస్యం..
నెట్టు భాయ్ 
అంటూ తమ్ముడితోనే 
కారు తోయించిన రుబాబు..
ఈ సినిమాకి 
నందమూరే నవాబు..!

*_లేచింది నిద్రలేచింది మహిళాలోకం.._*
దద్దరిల్లింది పురుష ప్రపంచం
అయ్య పెద్ద ఏదాంతి
అంటూ తిప్పిన రుబ్బు..
తొలి చూపులోనే 
గుండమ్మ బొట్టికి 
ఏసేస్తూ సబ్బు..
*_కోలోకోలోయన్న కోలో_*
*_నా సామి.._*
*_కొమ్మలిద్దరు_* 
*_మంచి జోడు.._*
సొంత తమ్ముడికే
తోడల్లుడి వరస కలిపి
అందుకున్న సాంగు..
ఎన్టీవోడు లూజు నిక్కరుతో
చెంగు చెంగు..!
*_అయినా మనిషి మారలేదు_*
*_ఆతడి కాంక్ష తీరలేదు.._*
మానవుని నైజంపై
ఎప్పటికీ మారని పచ్చి నిజం
*_అలిగిన వేళనే చూడాలి.._*
*_గోకుల కృష్ణుని అందాలూ.._*
నిజంగానే అంత 
అందంగా అన్న...
పార్కునే ప్రేమయాత్రకి
బృందావనంగా 
చేసుకున్న జమున..
గుండక్క ముద్దుల కూన...
అదే సరోజనని 
ఎస్వీఆర్ కే తేల్చి చెప్పిన
అందాల భరిణ..!

జొన్నలు దంచిన చేతులకు
పిడకలు చేసిన 
చేతులపై గెలుపు..
తీరిన చాయమ్మ బలుపు..
ఇల్లరికానికి ఎదురు
అల్లుడరికంతో శుభం కార్డు
ఈ సినిమా పెద్ద రికార్డు..!

ఘంటసాల సంగీతం..
పింగళి సాహిత్యం..
'సరస'రాజు సంభాషణలు
మార్కస్ కెమెరా..
తొలిసారి సాంఘిక సినిమా
దర్శకత్వంలో కమలాకర
విజృంభణ..
కళాఖండమో..కలకండమో 
గుండమ్మ పేరు మహిమో
అందరి కంటిచూపులో 
ఆ సినిమాయేనాయె..!

*_సూర్యకాంతం_* 
*_నభూతో నభవిష్యతి.._*
*_ఆమె అద్భుత పరిణితి.._*
ఆ పాత్ర ఆమెకే పరిమితి..
మళ్లీ తీద్దామంటే
గుండమ్మ ఎక్కడన్న
విజయావారి నీతి..నిరతి..
వెరసి..ఎందరు
మహామహులున్నా
కాంతమ్మకే దక్కిన 
'విజయ'హారతి..!

*********************
      _9948546286_
[08/06, 07:33] Mallapragada Sridevi: హరిఓం ,

*నీ తోటి వయసు వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నిన్ను ‘అరే, ఒరేయ్’ అని పిలిచే స్నేహితులొక్కొక్కరూ రాలిపోతూ ఉంటారు...*

*నీకు అప్పటివరకూ అండగా ఉన్న నీ తల్లిదండ్రులూ, అమ్మమ్మా నాయనమ్మలూ, తాతయ్యలూ ఎప్పుడో నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు...*

*బయటకి రాలేని నిస్సహాయతతో నీ స్నేహితులు ఇళ్ళల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు...*

*నీ ముందు నిక్కర్లేసుకుని తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చి నీ చుట్టూ చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటారు. నీతో మాట్లాడే సమయం కూడా వారికి ఉండదు....*

*నీ జీవితంలో నువ్వు ఎన్నో సాధించి ఉండవచ్చు గాక. నీ కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం దాన్ని ఎవరూ గుర్తించరు. నీ మీద స్పాట్‌లైట్ ప్రసరించటం మానేసి చాలా కాలం అయిపోయి ఉంటుంది. ఈ సొసైటీ   నీ గురించి పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయివుంటుంది...*

 నీ లాంటి వృద్ధుడు ఎవరో నీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఇంట్లో తన అవస్థ చెప్పుకుంటూ ఉంటాడు. నీ అమూల్య అభిప్రాయాల్ని చెప్పటానికి ఒక శ్రోత ఈ ప్రపంచంలో దొరికిన సంతోషం నిన్ను తబ్బిబ్బు చేస్తుంది...*

*అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్కగదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది...*

*పక్క మీద గంటల, రోజుల తరబడీ పడుకొని ఉండటం దినచర్య అవుతుంది. పుట్టిన కొత్తలో నెలల తరబడి పక్క మీద శిశువు కదలకుండా ఎలా ఉంటుందో తిరిగి అదే స్థితి సంభవిస్తుంది. ఒకటే తేడా ఏమిటంటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవటానికి తల్లి ఉంది. ఇప్పుడెవరూ లేరు. అప్పుడప్పుడూ వచ్చి పలకరించే కూతురూ, తప్పదన్నట్టు సేవలు చేసే కోడలూ. నీ అదృష్టం బాగా లేకపోతే అనాథాశ్రమంలో వారు కూడా ఉండరు...*

*నువ్వు కొద్దిగా ఎక్కువ తిన్నా, అసలు తినకపోయినా మెడిసిన్ చదివిన డాక్టర్లలాగా నీ పిల్లలు నీకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఒళ్ళు వెచ్చబడితే చలిలో తిరిగావనీ, జలుబు చేస్తే చన్నీళ్ళ స్నానం చేశావనీ, కాళ్ళు నొప్పులు పెడితే గుడికి ఎందుకు వెళ్ళావనీ నిన్ను మందలిస్తూ ఉంటారు...*

*ప్రొద్దున్న లేచేసరికి అకస్మాత్తుగా ఏ జలుబో, కీళ్ళ నొప్పులో ప్రారంభం అవుతాయి. బాత్‌రూంలో పడటం, కాళ్ళు విరగటం, జ్ఞాపకశక్తి నశించటం, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ చాలా క్యాజువల్‌గా ఏదో వ్యాధి అని చెప్పటం మొదలైనవి అన్నీ జీవితంలో భాగమైపోతాయి...*

*నీది మరీ మధ్యతరగతి కుటుంబం అయితే, నువ్వు సంపాదించిన డబ్బు నీ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా,   చూసీ చూడనట్టు నీ మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో నీ పక్క గదిలో   నీవాళ్ళు చర్చిస్తూ ఉంటారు...*
 
*ఇవి వినడానికి చేదుగా ఉన్నా, పచ్చి నిజాలు...ఇలా ఎందుకు జరుగుతుంది... అంటే ఇక నీ అవసరం తీరింది కాబట్టి....నీ అవసరం ఇక వుండదు కాబట్టి..*

*ఇక్కడ తరిగింది కృతజ్ఞత , ప్రేమ , అభిమానం... పెరిగింది కృతఘ్నత , నిర్లజ్జ , అమానుషం ...*

 మీ వీధిలో, మీ కాలనీలో, మీ గ్రామంలో వున్న మీకు తెలిసిన పెద్దవారిదగ్గరకు తరచుగా వెళ్తూండండి. వారి మాటలు విసుగులేకుండా వినండి. వారికి మీ ప్రేమను పంచండి. వీలైతే చిన్నచిన్న సహాయాలు చేయండి.

వృద్ధోపసేవ అని భారతంలో బాగా శ్లాఘించబడిన ధర్మం ఇది. వృద్ధోపసేవ వలన మనిషి బుద్ధిమంతుడవుతాడు.......       🙏 ...........


* ఆ నలుగురు...కలిస్తే 
---
*నలుగురు ఉంటేనే జీవితం*
*నలుగురు మెచ్చుకుంటే జీవితం*
*నలుగురు వచ్చిపోతే జీవితం*
*నలుగురి మధ్య చనిపోతే జీవితం* 
మన అనుకోవఢానికి నలుగురు ఉంటేనే జీవితం....
చివరివరకు  
నలుగురితో ఉండు
నమ్మకంతో ఉండు
నవ్వుతూ ఉండు  
నవ్విస్తూ ఉండు... 
ఎవరో పంపిన ఈ పోస్ట్ ఈ మధ్యనే చదివాను.
చదివిన దగ్గరనుంచి సంఘర్షణ మొదలయ్యింది, 
ఆ నలుగురు అన్నారు  .....
కానీ ఆ నలుగురు కలిస్తే యుద్ధాలే  జరుగుతున్నాయ్...
ఇంటా బయటా...
స్నేహితులు, బంధువులు.....
ఎక్కడ నలుగురు కలిసిన controversies....
చిన్న చిన్న విషయాలు...
పెద్ద పెద్ద గొడవలు...
చిన్న చిన్న వాటినే 
భూతద్దంలో చూడటాలు.... 
చిన్న చిన్న సంతోషాలు లేవు
చిన్న చిన్న సంగతులు లేవు
చిన్న చిన్న సరదాలు లేవు
ఎటుపోతున్నాం మనం?      
ఎక్కడ జరుగుతోంది పొరపాటు?
ఎందుకు ఆనందాలు మిస్ అవుతున్నాం?           
ఎందుకు నలుగురిలో ఇమడలేకపోతున్నాం?  
ఏమిటి దీనికి మూలకారణం? 
నా ఆలోచనా పరిధిలో 
నేను విశ్లేషించుకున్నది ఏమిటంటే?.....
చిన్న చిన్న కుటుంబాలు గిరిగీసుకొని  బ్రతికేయడం..
చెప్పే పెద్దవారు లేకపోవడం
ఒకవేళ పెద్దవారు ఉండి చెప్పినా వినిపించుకోకపోవడం...    
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమవడం....
పెద్ద పెద్ద సమస్యలు లేకపోవడం....
ప్రతిదానిని  నెగెటివ్ గా చూడటం....
నేనే గొప్ప అన్నది ఎక్కువవ్వడం.....
ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే....
ఇది కరోనా కంటే చాలా పెద్దగా కనిపిస్తున్న సమస్య….
ఒక మనిషి ఇంకొక మనిషి గురించి మంచిగా ఆలోచించడం మానేశారు...
ఎదుటి వారిలో లోపాలు ఏమున్నాయి?
ఎదుట వారిని ఎలా కించపరచాలి?
ఎదుట వారిని చూసి ఈర్ష్యపడటం....                
ఎదుటి మనిషిని అర్ధం చేసుకోలేకపోవడం....       
ఇవే రాజ్యమేలుతున్నాయి... 
ఒకప్పుడు పెద్ద పెద్ద కుటుంబాలు, ఇరుగు పొరుగు, మంచి చెడు చెప్పే పెద్దలు ఉండటం ఇలా అన్నీ ఉండేవి....
మన ప్రతి మాటను, ప్రతి పనిని ఎవరో ఒకరు గమనిస్తూ మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ  ఉండేవారు....
ఇప్పుడు జీవితం నాలుగు గోడలకు అంకితం... 
మాట్లాడుకోవడానికి  ఇష్టపడని  సంస్కృతిలో పెరుగుతున్నాం...
పొలంలో పెరుగుతున్న కలుపు మొక్కలను ఓపికగా తీసేస్తేనే రైతుకు పంట చేతికందేది...
వాటిని పెరగనిస్తే  పంటకు సారం అందనీయక  పంటసరిగా పండక రైతుకు కన్నీరే  మిగులుస్తాయి...
అలాగే మనలో ఉన్న చెడు ఆలోచనల కలుపు మొక్కలను ఆదిలోనే ఎవరో ఒకరి సాయంతో తీసివేస్తే మన మనసులు వికృతమవవు....               
మనం మంచిగా ఉంటే సమాజంలో నలుగురిని కలిసినప్పుడు ఏ సమస్య ఉండదు...
లేదంటే మనవల్ల నలుగురికి సమస్య...
ఆ సమస్యలకు భయపడి ఆ నలుగురు  అన్నమాట వదిలేసుకొని  నాలుగు గోడల మధ్య బందీలమయి ఒంటరివారమయిపోతున్నాం...
ఒంటరితనంలో మనసుని స్వాధీనంలో ఉంచుకోవడము చాలా కష్టము...
ఆ ఒక్కరు ఆ నలుగురిలో మమైకమయితే ప్రతి కలయిక ఒక మధురానుభూతి  కాగలదు...
ఒక్క క్షణం ఆలోచించండి….
ఒక మంచిమాట...
ఒక చిరు నవ్వు..
ఒక ఆత్మీయ పలకరింపు..
ఒక ఓదార్పు...
ఒక మెచ్చుకోలు...
ఇవే కావాలి మనకి... 
ఒక కోపం...
ఒక ద్వేషం...
ఒక ఈర్ష్య...
ఒక అసూయ...
ఒక అహం......
ఇవే వద్దు మనకి.... 
ఆ నలుగురితో ఉందాం.....
ఆనందంగా ఉందాం....
____((()))____


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి