2, డిసెంబర్ 2019, సోమవారం




శివ లీలలు 

గుగ్గులు కలశ నాయనారు
చోళదేశమున తిరుక్కడవూరులో గుగ్గులు కలశనాయనారు జన్మించాడు. ఆయన బ్రాహ్మణుడు. అక్కడ దైవము పేరు అమృతఘటేశ్వరుడు. దేవతలు, అసురులు అమృత కలశంతో ఆ వూరు వచ్చారు. వారు స్నానము చేయుదము అనుకొన్నారు. ఆ కలశాన్ని నేలపై నుంచి నదికి స్నానమునకు వెళ్లారు. వారు తిరిగి వచ్చి ఆ కలశమును తీసికొందామంటే నేలనుంచి అది ఫైకి రాలేదు. ఆ కలశం లింగంగా మారింది. అందుకని ఆ లింగాన్ని అమృత లింగం అంటారు. మార్కండేయుడు ఈ లింగంకే తపస్సుచేసి తన 16వ ఏట అమరుడయ్యాడు. ఇక్కడ అమ్మవారు అభిరామి అమ్మన్‌. అభిరామపట్టార్‌ ఈ అమ్మన్‌కు పరమభక్తుడు. అమె మీద ఎన్నో కీర్తనలు పాడాడు. అభిరామపట్టార్‌ యందు అమ్మకు అనుగ్రహం మెండైంది. రాజుగారి ఆగ్రహము నుండి ఈ పట్టార్‌ను తప్పించుటకు ఈమె అమావాస్యను పౌర్ణమిగా మార్చింది కూడ.

గుగ్గులు కలశనాయనారు ఈ ఆలయమున శివునికి ప్రతిదినము గుగ్గిలముతో ధూపము వేయుచు పూజ చేయువాడు. ఈకారణముచే అతనికి గుగ్గులుకలశ నాయనారు అను పేరు వచ్చింది. గుగ్గులము ధూపము శివునికి మంచి సేవ అనుకున్నాడు. చేతిలో ఒక చిన్నకుంపటి, అగ్ని, గుగ్లిలము పుచ్చుకొని నిరంతరము గుగ్గిలము ధూపము వేయుచు అర్చిస్తూ గడిపేవాడు.

ఈ భక్తుని సేవా విశేషము, అతని శివార్చణ తపన పరమశివుని పరవశింప జేశాయి. అతని పరమభక్తి విశేషాలు ప్రపంచానికి చూప నిశ్చయించాడు.
శివుని సంకల్పమున నాయనారు కటిక పేదవాడయ్యాడు. ఆస్తి అంతా అమ్ముకోవలసి వచ్చింది. కుటుంబము పస్తుంటున్నది. అయినా నాయనారు తన గుగ్గిలం సేవలు మానలేదు. ఒకరోజున భార్య అనుకుంది. అంతా అమ్మబడింది. ప్రతి స్రీ భర్త చనిపోవు నంత వరకు అట్టిపెట్టుకోవలసిన మాంగల్యము మాత్రము మిగిలి వుంది. భర్త పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. అని ఆలోచించి మెడలో పుస్తెలతో పసుపు కొమ్ము వుంచుకొని తన బంగారు మాంగళ్యమును భర్తకు తీసి యిచ్చి - దీనినమ్మి ధాన్యము తీసికొని రండు అని భర్తను బ్రతిమాలింది. అతడు అది పుచ్చుకొని అంగడికి బయలు దేరాడు.
 
బజారునకు పోవుచుండగా ఒక వర్తకుడు గుగ్గిలము మూటలను భుజముల మీద నుంచుకొని విక్రయించుటకు ఎదురు వచ్చుచుండగా అది చూచి - నాయనారు - “ధాన్యము కొనుటకంటే దేవునికి
 
ఉయోగింపవచ్చును గుగ్గిలము కొనుట చాలా మంచిది” అని మంగళసూత్రమునిచ్చి, వర్తకుని నుండి గుగ్గిలము మూటలను ఆలయమునకు తీసికొని వెళ్లి యథారీతిన గుగ్గిలము ధూపముతో తపోమగ్నుడయ్యాడు.

భార్యాపిల్లలు క్షుద్భాధ తట్టుకోలేక అలసి పడుకున్నారు. రూమురాత్రి అయినా భర్త తిరిగి రాలేదు. దైవమును ప్రార్ధింప మొదలిడింది. తనకు అతి పవిత్రమైన మాంగళ్యమును కూడా భర్తా పిల్లల ఆహారము కొరకు పసువుకొమ్ముతో సరిపెట్టుకొని ఇచ్చింది. అయినా వరమేశ్వరా ఇలా అయింది రక్షింపు అని ప్రార్ధించింది. ఆమె ప్రార్ధనకి, నాయనారు భగవత్‌సేవ నిష్ఠకు, వారి మంచితనము, పవిత్రతకు పరమేశ్వరుడు చాలా సంతుష్టి చెందాడు.
కురాల్‌ : “పతిని దైవముగను వ్రతమున్న ఇల్లాలు
కురియుమన్ల క్షణమె కురియువాన”

ఆమె కలలో శివుడు కన్పడి “ నీకు సకల సౌభాగ్యాలు ఇస్తున్నాను” అన్నాడు. ఆమె మేల్కొనగానే ఆమె చకితురాలగునట్లుగా - గృహము సకల సంపత్తులతో
నిండిపోయింది. వెంటనే ఆమె పరవశంతో పరమేశ్వరుని వినుతించింది. ఆయనపై పాటలు పాడింది. మహానంద భరితురాలై వెంటనే వంటచేసి తన బిడ్డలకు అన్నము పెట్టి భర్త రాకకైవేచి వుంది.
అట ఈశ్వరుడు నాయనారును 'ఆకలిగొని యున్నావు, ఇంటికి పోయి భుజింపుము' అని ఆదేశించాడు.

ఇంటికి పోగా అతనికి ఆశ్చర్యమైంది. ఈ భాగ్యమంతా ఎలా వచ్చింది అని భార్య నడిగాడు. అమె జరిగింది చెప్పింది. శివానుగ్రహమునకు, తాను అక్కడ చేరిన శివభక్తులును కలిసి శివుని బహుధా కీర్తించారు. నాయనారు ఈ సంపద తనదిగా భావించలేక పోయాడు. “ఇదంతా శివునిది - దీనిని శివభక్తులకే వినియోగించాలి” అనిఊఅంటూ -వాని నిరంతర సేవ కొనసాగించాడు.

ఒక రోజున నాయనారు తిరుప్పనందాళ్‌ దేవాలయము సందర్శిద్దామనుకొన్నాడు. అరుణ సతీశుని దేవాలయము అచట నున్నది. ఒక రాక్షసుని కుమార్తె తాటక, పుత్రునికై అఛ్చట శివలింగాన్ని రోజూ అర్చించేంది. ఒకరోజున ఆ లింగమును పుష్ప హారముతో అలంకరిద్దామని పూలదండను ఎత్తిపట్టుకోబోయింది. ఆమె వస్త్రము నడుము నుంచి జారబోయింది. వస్త్రమును రెండు మోచేతులతో అదిమి పెట్టింది. అందుకని ఆమె చేతులు ఎత్తలేక పోయింది. ఆమె బెడద నుండి ఆమెను తప్పించుటకు శివుడు ఒక ప్రక్కకు ఒరిగి(ఒంగి) ఆమె దండను స్వీకరించాడు. ఆ లింగము ఒంగి ఉండిపోయింది. చాలామంది ఆలింగము సరిచేయుటకు ప్రయత్నించారు వీలుకాలేదు. రాజుగారు ఆ వంవుకు మోకులు తాళ్లు కట్టించి ఏనుగులతో లాగించారు. ప్రయోజనము కలుగలేదు. రాజు గారికి ఏమీ పాలుపోలేదు.

ఈ సంగతి గుగ్గులు కలశనాయనారుకు తెలిసింది. అఛ్చటికి వెళ్లి “నేను గూడ కొంచెము ప్రయత్షించెదను” అని ఆ శివలింగం వంపును తాడుతో బిగించి ఆ తాడు కొసను తన మెడకు కట్టుకొని శివుని ధ్యానము చేస్తూ లాగాడు. తోడనే లింగము వంవు సరి అయి యథాస్థితికి వచ్చింది. దేవతలు పుష్పవృష్ఠి కురిపించారు.

రాజు దానిని చూచి “ఈతడు భక్తి రజ్జువుచే ఇట్లు చేయగలిగాడు” అని తెలిసికొని నాయనారును చాలా గౌరవించి అనేక విధముల సన్నుతి చేశాడు. అందరికి నాయనారు భక్తి ప్రపత్తులు వెల్లడయ్యాయి.

కొన్ని దినములకు వాగేశనాయనారు, జ్ఞాన సంబంధనాయనారు అచటికి వచ్చారు. గుగ్గులు కలశనాయనారు వారిని అనేక విధముల సంభావించి బ్రతికియున్నంత కాలము శివసేవలోను, శివభక్తుల సేవలలోను గడిపి అంత్యమున శివసాయుజ్య
మొందినాడు.
==(())--
మాతృ వైభవం. 
ఇది మా గురువు గారైన కీర్తిశేషులు బ్రహ్మశ్రీ “పండిత” నేమాని రామజోగిసన్యాసిరావు గారు
మాతృదినోత్సవంసందర్భంగా
భరతమాత వైభవాన్ని వర్ణిస్తూచెప్పిన అద్భుత దండకం.

జయ జయ జనయిత్రి! శ్రీభారతక్ష్మాధినేత్రీ! సదా సస్యసంపన్న సౌవర్ణధాత్రీ! జనానీక సంక్షేమ సంభావితార్థ ప్రదాత్రీ! సుగాత్రీ! మహోత్తుంగ శృంగాఢ్య శీతాద్రి వింధ్యాద్రి ముఖ్యాద్రి వర్యాంఘ్రి సామీప్య రమ్యాటవీ మధ్య సంజాత భాగీరథీ సింధు గోదావరీ ముఖ్య భవ్యాపగాతీర శోభాయమాన ప్రశాంతామలారామ రాజత్తపో భూ ప్రభావ ప్రభాభాసితాంగీ! శుభాంగీ! సదా ధర్మ సంరక్షణోద్యోగ తాత్పర్య గంభీర భావాంకితాత్మ ప్రజానీక సంక్షేమ ధౌరేయ శ్రీరామ భూమీశ కౌంతేయ ముఖ్య క్షమానాథ శౌర్యప్రతాపాది సల్లక్షణోద్భాసితానంతకీర్తీ! మహోదాత్త చారిత్ర సంతాన బాహుళ్య సంశోభితానంద మూర్తీ!

శ్రీవిక్రమాదిత్య హర్షాధిపాశోక శ్రీకృష్ణరాజేంద్ర ఝాన్సీశివాజీ ప్రధానాశయ స్థాపితోత్కృష్ట ధర్మార్థ వత్సంప్రదాయాన్వితా! విశ్వ విఖ్యాత వేదాంత విజ్ఞాన సంగీత సాహిత్య వాణిజ్య ముఖ్యాఖిలోద్యోగ నైపుణ్య రత్నావళీభూషితా! నిత్యసంతోషితా! స్వాతంత్ర్య సంగ్రామ సీమోచితోత్సాహ ధైర్యప్రకాశాఢ్య సత్యాగ్రహాద్యాయుధోపేత గాంధీ మహాత్మాది ధన్యాత్మ సంపాదితా పూర్వ సౌభాగ్య సంపద్విశేషాన్వితా! రమ్య వర్ణత్రయోద్గీత సద్భావ సంకేత సంయుక్త చారుధ్వజా! సుప్రజా! లోకవిఖ్యాత ప్రద్యోత ప్రజ్ఞామయానేక ధీర ప్రజానాయకశ్రేణి సంవర్ధితాశేష ఖండాంతరవ్యాప్త సౌభ్రాత్ర సౌహార్ద భావాంచితా! లోకసంపూజితా! జ్ఞానవైరాగ్య భక్త్యాది సన్మార్గ వైవిధ్య సంశోభితా! సాధు సంభావితా! దివ్యతేజోన్వితా! భారతక్ష్మామహాదేవతా! శాంతి సౌభాగ్య సంపన్మహాపారిజాతా! నమోవేదభూమే - నమఃపుణ్యభూమే - నమోధర్మభూమే - నమోధన్యభూమే - నమోవీరభూమే -నమోమాతృభూమే -నమస్తే - నమస్తే - నమస్తే - నమ:. జైశ్రీరాం.జైహింద్.

--(())--
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి