6, జులై 2020, సోమవారం

గురు పౌర్ణమి


ఈ శరీరం-ఆత్మ ఏమిటి? భగవద్గీతలో ఏం చెప్పారు, దేనిని దేంతో పోల్చారు?

మనల్ని మనం చూసుకొనేపుడు ముందుగా కన్పించేది భౌతిక శరీరం. ఒకచోటు నుంచి మరోచోటుకి పోవాలన్నా, జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే ప్రాపంచిక విషయాలను గ్రహించాలన్నా చైతన్యం ఉంటేనే సాధ్యమవుతుంది. మన దైనందిత జీవితంలో జాగ్రదావస్థలోనే గాకుండా, గాఢ నిద్రలో ఉన్నపుడు మనస్సు , ఇంద్రియాలు పనిచెయ్యవు. ఐనా ఊపిరి పీల్చుకోడం, గుండె కొట్టుకోవడం అనే ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు మనలను జీవింప జేసేది ప్రాణము. అది శ్వాస రూపంలో ప్రాణశక్తిగా శరీరాన్ని, అవయవాలను నడిపిస్తుంది. ఈ ప్రాణ శక్తి మనలో ఉండే సూక్ష్మ శక్తి. దేహంలో ఉండే చేతనమంతా ప్రాణము యొక్క వ్యాపారమేనని చెప్తారు.

జీవం అంటే శరీరానికీ ప్రాణానికీ ఉండే సంబంధమని చెప్పుకోవచ్చు. ఈ సంబంధం తెగిపోతే ప్రాణం పోయిందని అంటాం. అప్పుడీ భౌతిక శరీరాన్ని మృతదేహమంటాం.
 వాస్తవానికి శరీరం గాని, ప్రాణం గాని స్వతఃగా చైతన్యం లేనివే. మరి వీటికి చైతన్యాన్ని కలిగించే దేదో తెలుసుకోవాలి.

ఒక విషయం గాని, వస్తువుగాని మనకు తెలియాలంటే అక్కడ చూసే వాడొకడు ఉండాలి. చూడబడే వస్తువు లేక విషయం ఉండాలి. ఈ రెండిటినీ కలిపే చూడటం అనే ప్రక్రియ జరగాలి. అంటే చూసేవాడు, చూడబడే వస్తువు, చూడడం అనే క్రియ ఉండాలి. ఆ వస్తువుతో భౌతిక సంబంధం లేకపోయినా మనస్సు జ్ఞానేంద్రియాల ద్వారా; ఆ జ్ఞానాన్ని కల్గించేది చైతన్యమే. మనస్సు, ఇంద్రియాలు అన్నీ ప్రకృతి నుంచే ఏర్పడ్డాయి. ప్రకృతి జడము. అంచేత ఇవి చైతన్యవంతములు కావు. చూసే వస్తువుకు, చూసే వాడికి చూడడం అనే ప్రక్రియలకు వెనుక ఎరుక ఉన్నపుడే ఆ వస్తువు తెలియ బడుతోంది. ఆ ఎరుకే(awareness) చిత్త వృత్తి ద్వారా విషయానుభవం కలిగించేది.

స్వప్న జాగ్రదావస్థలలో సహితం శరీరాన్ని ఆశ్రయించి ఉండే ప్రాణం కూడ ఇంద్రియాలూ, మనస్సులాగ శాశ్వతం కాదు. కాని వీటన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చేది, చిత్త వృత్తుల ద్వారా విషయానుభవం కలిగించేదీ, చూసే వాడి వెనుక ఉండే చైతన్యమనే ఎరుకను ఆత్మ అంటారు. అదే అన్ని భూతాల అంతరాత్మగా చెప్పబడే బ్రహ్మము, లేక క్షేత్రజ్ఞుడు.
ఇదే విషయాన్ని ప్రశ్నోపనిషత్తులో ప్రాణం ఆత్మ నుంచే అంటే బ్రహ్మము నుండే ఉద్భవించి నట్లుగా చెప్పబడింది.

ప్రాణానికీ ఆత్మకూ గల సంబంధం మనిషికీ నీడకూ ఉండే సంబంధం వంటిదని అంటోంది. అంటే నీడను మనిషి నుంచి విడదీయలేం. అలాగే ప్రాణానికీ ఆత్మకూ ఉండే సంబంధం కూడా విడదీయలేనిదే. శరీరంలో ఆత్మ ఉన్నదంటే ప్రాణము ఉంటుంది. ఛాందోగ్యోపనిషత్తులో ప్రాణము ముఖ్య ప్రాణముగా చెప్పబడింది. ఆత్మ దేన్లో అద్దమునందు వలె ప్రతిబింబము చెందుతుందో, అదే ప్రాణమని చెప్పబడింది. రాజువద్ద ముఖ్యాధికారి పనులన్నిటినీ ఎలా చేసి పెడుతుంటాడో, అలా ఆత్మ క్రింద, సర్వాధికారాన్నీ ప్రాణము జరుపుతుంది. ఇది పరమాత్మను నీడలా అంటి ఉంటుందని చెప్ప బడింది.

మనస్సు ఆత్మకు అనుభవాలను కలిగించే పని ముట్టు లాంటిది. మనస్సు ద్వారా బాహ్యవిషయాలను అనుభవంలోకి తెచ్చుకొని, తిరిగి కర్మేంద్రియాల ద్వారా పనులను చేయిస్తుంది. ఇలా ప్రాణమే మనలో సమస్తాన్ని నడిపిస్తూ, ఆత్మ వల్ల చైతన్యం కలిగి ఉంటుంది. ఆత్మ ప్రాణ వాయువూ కాదు, మనస్సూ కాదు. అది శుద్ధమైనదని వేదాలు చెబుతున్నాయి.

రమణ మహర్షి వారు ఆత్మను గురించి ఇలా అంటారు. "చూడబడేది, చూసేది, చూపు అన్నీఅదే. ఆత్మ సాక్షాత్కారంలో చూడబడేదేమీ ఉండదు. ఎరుకయే దాని సస్వరూపం. దాని వెలుగులోనే శరీరము, అహంకారము, ప్రపంచమూ ప్రకాశిస్తాయి. మనస్సెంత ఉరకలు వేస్తున్నా అది అత్మవల్లనే. మనస్సు, శరీరం, ప్రపంచం వీటికి ఆత్మను విడిచి ఉనికి లేదు. చూసేవాడు ఆత్మ. కాని ప్రజలది తెలిసికోక, చూడబడే దానివెంట పరుగులు పెడుతుంటారు. తానున్నాని తెలిసినా, తానెవరో మాత్రం తెలియదు. అతడు ప్రపంచాన్ని చూస్తాడు. కాని అది బ్రహ్మమేనని గ్రహించడు".

"తెంపులేని ఎరుకయే ఆత్మ. మనిషి అంటే దేహము, ఆత్మ, మనస్సుల కలయిక. ఆత్మే చైతన్యవంతమైన శక్తి. దాన్నుంచే పుట్టి ; మనస్సు జడమైన దేహంతో కలసి ఇది నేను, అది నేను అంటుంది. అదే దేహాత్మ బుద్ది. ఆత్మ లేకుండా మనస్సు నిలువలేదు. మనస్సు ప్రాణం సహాయంతో దేహానికి కదలికను ఇచ్చి, తను చక్రవర్తిలా దేహేంద్రియాలతో ఇష్టం వచ్చినట్లు పనులు చేయించు కుంటుంది".

భగవద్గీతలో ఆత్మ గురించి ఇలా చెప్పబడింది. ఈ విశ్వమంతా వ్యాపించివున్న ఆత్మనాశనం లేనిది. దానినెవరూ అంతం చేయలేరు. నాశనం లేని ఆత్మకు ఈ శరీరాలు శాశ్వతాలు కావు. ఆత్మ చంపేది కాని చచ్చేది కాని కాదు, ఆత్మకు పుట్టడం చావడం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకపోవడం జరగదు.

 జన్మరహితమూ, శాశ్వతమూ, అనాది సిద్ధమూ అయిన ఆత్మ నిత్యం. మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టేసి కొత్తబట్టలు వేసుకున్నట్లే ఆత్మ కృశించిన శరీరాలను వదలి కొత్త దేహాలు పొందుతుంది. ఈ ఆత్మను ఆయుధాలు నరకలేవు; అగ్ని కాల్చలేదు; నీరు తడుపలేదు; గాలి ఎండబెట్టలేదు. ఆత్మ ఖండించరానిది, కాలనిది, తడవనిది, ఎండనిది; అది నిత్యం, సర్వవ్యాప్తం, శాశ్వతం, చలనరహితం, సనాతనం. ఆత్మ జ్ఞానేంద్రియాలకు గోచరించదు. మనస్సుకు అందదు. వికారాలకు గురికాదు. ఇది స్థిరమైనది, అభిన్నము, ఆకారము లేనిది. దేశ, కాల, నిమిత్తాలకు అతీతమైనదీను. నిత్య పరిశుద్ధం. పరిపూర్ణము.

ఆ ఆత్మయే బ్రహ్మమని 'అయమాత్మా
బ్రహ్మ' - అని బృహదారణ్య
కోపనిషత్తు నందు చెప్పబడింది. అంటే ఈ జీవాత్మయే బ్రహ్మ. ఐతరేయోపనిషత్తు తృతీయాధ్యాయం మానవునికీ భగవంతునికీ ఉండే సంబంధాన్ని వివరిస్తుంది. అన్ని కార్యకలాపాలకూ ఆత్మే ఆధారమనీ, ఆ ఆత్మే బ్రహ్మమనీ చెబుతోంది. శరీరం లయమైనా ఆత్మలయమవ్వదు. నిత్యము, శుద్ధము, బుద్ధము (అంటే జ్ఞానరూపము), ముక్తము ( బంధం లేనిది), ఇది ఇంత అని చెప్పడానికి తగ్గ కారణం లేపోడం వల్ల నిరవధికము. దేశాన్ని బట్టి గాని కాలాన్ని బట్టి గాని దీనికి పరిమితులు లేవు గనుక అనంతమని చెప్పబడింది. జ్ఞానానికి అవధి లేదు గనుక సర్వజ్ఞమని చెప్పబడింది.

****

ఓం నమః శివాయ
శ్రీ ఆది శంకరాచార్య విరచితం
గురు అష్టకము

“నిజమైన గురువుకి సమానమైనదానిని మూడులోకాలలోను చెప్పలేము. పరుసవేది దేన్నైనా బంగారంగా మార్చుతుందేమో కాని ఇంకొక పరుసవేదిగా మార్చదు. కాని ఒక గురువు తన్ను నమ్మి శరణుజొచ్చిన శిష్యుడిని తనంతటివాడిని చేస్తాడు. కాబట్టి గురువు అసమానుడు. అల్ప బుద్ధి కలవాణ్ణి కూడా పండితుణ్ణి చెయ్యగలడు గురువు.


జగద్గురువులైన ఆదిశంకరులు గురువు గురించి చాలా గొప్పగా చెబుతారు. వారు ఒకచోట అడుగుతారు,“ఎన్ని ఉన్నా, మనస్సు గురు పాదములను పట్టుకోకపోతే ఏమిటి దాని ఉపయోగం?” అని. వారి రచించిఅన్ ‘గురు అష్టకం’లో ప్రతి చోట అడుగుతారు.ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? అని.ఎనిమిది శ్లోకములలోను దీన్ని మకుటంగా ఉంచి మనల్ని ప్రశ్నిస్తున్నారు.


శ్రీశంకర భగవత్పాదులు రచించిన గురు అష్టకం శిష్యునికి ఉండాల్సిన ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తుంది. శిష్యుడికి ఉండాల్సింది గురువు మీద నమ్మకం, విశ్వాసం. మనకు ఎవరిమీద ఐతే గురి కలుగుతుందో వారే గురువు. లోకంలో నిషిద్ధ గురువులు కూడా ఉంటారు. వాళ్ళని పట్టుకోవడం అంటే బురదపాము నోట్లో ఉన్న కప్పవంటి జీవితం అవుతుంది.

ॐॐॐॐॐॐॐॐ

శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం/గుర్వాష్టకం

ॐॐॐॐॐॐॐॐ

1) శరీరం సురూపం తథా వా కళత్రం  యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే  తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్॥

మంచి దేహధారుడ్యము, అందమైన భార్య, పేరు ప్రతిష్టలు, మేరు సమానమైన ధనం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


2)కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం  గృహం బాంధవాః సర్వ మేతద్ద్విజాతం!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే  తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

భార్య, ధనము, పిల్లలు, వారి పిల్లలు, ఇళ్ళు, బంధువులు, గొప్ప వంశంలో జన్మ ఉన్నప్పటికి గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


3) షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా  కవిత్వాది గద్యం సుపద్యం కరోతి!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే  తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

ఆరు వేదాంగములు (శిక్ష, చందస్సు, వ్యాకరణం, నిరుక్త, కల్ప, జ్యోతిష్య), నాలుగు వేదాలు, గద్య పద్య రాయగల జ్ఞానం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


4) విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచారవృత్తేషు మత్తో న చాన్యః!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

విదేశాలలో మంచి పేరు, స్వదేశంలో హోదా పలుకుబడి, అందరూ మెచ్చే గుణము, మంచి జీవితం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


5) క్షమామండలే భూపభూపాలవృందౌ సదా సేవితం యస్య పాదారవిందమ్! 

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

గొప్ప రాజ్యానికి చక్రవర్తివైనా, రాజులు మహారాజుల చేత సేవింపబడుతున్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?

6) యశో మే గతం దిక్షు దానప్రతాపాత్  జగద్వస్తు సర్వం కరే సత్ప్రసాదాత్!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

నీ ఖ్యాతి నలుదెశలా వ్యాపించి ప్రపంచమంతా నీ దయాగుణాన్ని ప్రశంచించినా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


7) న భోగే న యోగే న వా వాజిరాజౌ  న కాన్తాసుఖే నైవ విత్తేషు చిత్తం!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

భోగము, యోగము, ఇష్టము, అగ్నికార్యము, విషయ సుఖము, విత్తములపై నీ మనస్సు విరక్తి పొందినా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


8) అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

నీ మనస్సు అరణ్యమున ఉన్నా, ఇంట్లో ఉన్న, సమాన్య విషయములపై తిరుగుతూ ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


9) అనర్ఘ్యాణి రత్నాది ముక్తాని సమ్యక్  సమాలింగితా కామినీ యామినీషు!

మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం॥

వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్రవైఢూర్యాలు సదా నిన్ను అనిగమించే అంటిపెట్టుకునే భార్య ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?


10) గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ !

లభేత్ వాంఛితార్థ పదం బ్రహ్మసంజ్ఞం గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం ॥

ఫలశ్రుతి:-

ఎవరైతే ఈ గుర్వాష్టకాన్ని చెదువుతారో, నేర్చుకుంటారో, మననం చేస్తారో, గురువు చెప్పిన విషయాలను నిత్యం స్మరిస్తూ గురు పాదపద్మములపై మనస్సు లగ్నం చేస్తారో, అటువంటివారు యోగి అయినా, సన్యాసి అయినా, రాజు అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్తు అయినా తనికి శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది.


సదాశివ సమారంభాం, శంకరాచార్య మధ్యమాం!

అస్మదాచార్య పర్యంతం, వందే గురు పరంపరాం!!


🕉🌞🌎🌙🌟🚩

శ్రీ ఆది శంకరుల విరచిత
!!..గౌరీదశకమ్..!!
                  
1) లీలారబ్ధస్థాపితలుప్తాఖిలోకాం లోకాతీతైర్యోగిభిరన్తశ్చిరమృగ్యామ్|
బాలాదిత్యశ్రెణిసమానద్యుతిపుంజాం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||

తన లీలచే సమస్తలోకములను సృష్టించి కాపాడి నశింపచేయునదీ, లోకాతీతులైన యోగులచే చిరకాలముగా వెతకబడుచున్నదీ, బాలసూర్యసమూహము వంటి కాంతి మండలము కలదీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


2)ప్రత్యాహారధ్యానసమాధిస్థితిభాజాం నిత్యం చిత్తే నిర్వృతికాష్టాం కలయంతీమ్|
సత్యజ్ఞానానన్దమయీం తాం తనురూపాం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||

ప్రత్యాహారము-ధ్యానము-సమాధి అనుయోగముల నాచరించు యోగుల మనస్సునందు ఎల్లప్పుడు సంతోషమును కలిగించునదీ, సత్యము- జ్ఞానము- ఆనందములు స్వరూపముగా కలదీ, సూక్ష్మరూపమున్నదీ, పద్మములవంటి కన్నులు కలదీ,అగు జగదంబయైన గౌరీదేవిని నేనుస్తుతించుచున్నాను.


3) చన్ద్రాపీడానన్దితమన్దస్మితవక్త్రాం చన్ద్రాపీడాలంకృతనీలాలకశొభామ్|
ఇంద్రొపెంద్రాద్యర్చితపాదామ్బుజయుగ్మాం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడేె||

చంద్రచూడుడగు శివునిచే ఆనందింపచేయబడిన చిరునవ్వు ముఖము కలదీ, తన నల్లని కురులలో చంద్రుని అలంకరించుకున్నదీ, ఇంద్రుడు- విష్ణువు మొదలగు దేవతలచే పూజింపబడు పాదపద్మములు కలదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


4) ఆదిక్షాన్తామక్షరమూర్త్యా విలసన్తీం భూతె భూతె భూతకదంబ ప్రసవిత్రీమ్|
శబ్దబ్రహ్మానందమయీం తాం తటిదాభాం గౌరీమంబామంబురుహాక్షీమహమీడే||

’అ’ కారము మొదలు ’క్ష’ కారము వరకు ఉన్న అక్షరములు తన స్వరూపముగా విలసిల్లుచున్నదీ, పంచమహాభూతములలో (భూమి- నీరు- గాలి- అగ్ని- ఆకాశము) ప్రతి దానియందు అనేక ప్రాణులను సృష్టించునదీ, శబ్దబ్రహ్మస్వరూపిణియైనదీ, ఆనందముతో నండినదీ మెరుపువలే ప్రకాశించునదీ, పద్మముల వంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీ దేవిని నేను స్తుతించుచున్నాను.


5) మూలాధారాదుత్థితవీథ్యా విధిరన్ధ్రం సౌరం చాన్ద్రం వ్యాప్య విహారజ్వలితాఙ్గీమ్|
యేయం సూక్ష్మాత్సూక్ష్మతనుస్తాం సుఖరూపాం గౌరీమంబామమ్బురుహాక్షీమహమీడే||

సుషుమ్నానాడీ మార్గము ద్వారా మూలాదారచక్రము నుండి బ్రహ్మరంధ్రము వరకు సూర్య చంద్రస్థానములైన ’ఇడా’ ’పింగళా’ నాడుల యందు విహారించు తేజోమూర్తియైనదీ, సూక్ష్మమైన పధార్థము కంటే సూక్ష్మమైనదీ, సుఖస్వరూపిణియైనదీ, పద్మముల వంటి కన్నుల కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని స్తుతించుచున్నాను.


6) నిత్యః శుద్ధో నిష్కల ఎకో జగదీశః సాక్షీ యస్యాః సర్గవిధౌ సంహరణే చ|
విశ్వత్రాణక్రీడనలోలాం శివపత్నీం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||

నిత్యుడు- శుద్దుడు- పరిపూర్ణుడు- ఒక్కడు- జగదీశుడు అగు పరమేశ్వరుడు గౌరీదేవిని చేయు సృష్టి స్థితిలయలకు సాక్షి, ప్రపంచరక్షణము అను క్రీడయందు ఇష్టము కలదీ, శివుని భార్య యైనదీ, పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


7) యస్యాః కుక్షౌ లీనమఖణ్డం జగదణ్డం భూయోభూయః ప్రాదురభూదుత్థితమేవ|
పత్యా సార్ధం తాం రజతాద్రౌ విహరన్తీం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||

గౌరీదేవి గర్భమునందున్న సమస్తలోకములు మరల మరల పుట్టుచుండును. లీనమగుచుండును. భర్తతో కలిసి వెండికొండపై విహరించునదీ,పద్మములవంటి కన్నులు కలదీ, అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


8) యస్యామోతం ప్రోతమశేషం మణిమాలా సూత్రే యద్వత్ క్వాపి చరం చాప్యచరం చ|
తామధ్యాత్మజ్ఞానపదవ్యా గమనీయాం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||

చరాచరరూపమైన ఈ ప్రపంచమంతయు, దారము నందు మణులవలే గౌరీ దేవియందు అల్లుకుని ఉన్నది. అద్యాత్మజ్ఞానమార్గముచే తెలుసుకొనదగినదీ, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


9) నానాకారైః శక్తికదమ్బైర్భువనాని వాప్య స్వైరం క్రీడతి యేయం స్వయమేకా|
కల్యాణీం తాం కల్పలతామానతిభాజాం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||

గౌరీదేవి తాను ఒక్కతేగానే ఉండి శక్తివంతములైన నానారూపములతో లోకములనన్నిటినీ వ్యాపించి స్వేచ్చగా క్రీడించిచున్నది. కళ్యాణస్వరూపిణి, భక్తుల పాలిట కల్పలత, పద్మములవంటి కన్నులు కలదీ. అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.

10) ఆశాపాశక్లేశవినాశం విదధానాం పాదామ్భోజధ్యానపరాణాం పురుషాణామ్|
ఈశామీశార్ధాఙ్గహరాం తామభిరామాం గౌరీమమ్బామమ్బురుహాక్షీమహమీడే||

తన పద్మములను ధ్యానించు మనుషులకు ఆశాపాశములవలన కలుగు బాధలను నశింపచేయునదీ, పరమశివుని అర్ధాంగి, పరమేశ్వరీ, పద్మములవంటి కన్నులు కలదీ అగు జగదంబయైన గౌరీదేవిని నేను స్తుతించుచున్నాను.


11) ప్రాతఃకాలే భావవిశుద్ధః ప్రణిధానా- ద్భక్త్యా నిత్యం జల్పతి గౌరీదశకం యః|
వాచాం సిద్ధిం సంపదమగ్ర్యాం శివభక్తిం తశ్యావశ్యం పర్వతపుత్రీ విదధాతి||

ఎవడైతే శుద్ధమైన హృదయమును కలవాడై భక్తితో ప్రాతఃకాలమునందు ఈ గౌరీ దశకమను స్తోత్రమును పఠించునో అతనికి వాక్సిద్దినీ, ఉన్నతమైన సంపదను, శివభక్తినీ గౌరీదేవి తప్పక ప్రసాదించును.

॥ జయ జయ శంకర హర హర శంకర ॥     
                 

🕉🌞🌏🌙🌟🚩

శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం
🕉🌞🌏🌙🌟🚩
1)కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీవామభాగమ్ |

సదాశివం రుద్రమనంతరూపం చిదంబరేశం హృది భావయామి ||



2)వాచామతీతం ఫణిభూషణాంగం గణేశతాతం ధనదస్య మిత్రమ్ |

కందర్పనాశం కమలోత్పలాక్షం చిదంబరేశం హృది భావయామి ||



3)రమేశవంద్యం రజతాద్రినాథం శ్రీవామదేవం భవదుఃఖనాశమ్ |

రక్షాకరం రాక్షసపీడితానాం చిదంబరేశం హృది భావయామి ||



4)దేవాదిదేవం జగదేకనాథం దేవేశవంద్యం శశిఖండచూడమ్ |

గౌరీసమేతం కృతవిఘ్నదక్షం చిదంబరేశం హృది భావయామి ||



5)వేదాంతవేద్యం సురవైరివిఘ్నం శుభప్రదం భక్తిమదంతరాణామ్ |

కాలాంతకం శ్రీకరుణాకటాక్షం చిదంబరేశం హృది భావయామి ||



6)హేమాద్రిచాపం త్రిగుణాత్మభావం గుహాత్మజం వ్యాఘ్రపురీశమాద్యమ్ |

శ్మశానవాసం వృషవాహనస్థం చిదంబరేశం హృది భావయామి ||



7)ఆద్యంతశూన్యం త్రిపురారిమీశం నందీశముఖ్యస్తుతవైభవాఢ్యమ్ |

సమస్తదేవైః పరిపూజితాంఘ్రిం చిదంబరేశం హృది భావయామి ||



8)తమేవ భాంతం హ్యనుభాతిసర్వమనేకరూపం పరమార్థమేకమ్ |

పినాకపాణిం భవనాశహేతుం చిదంబరేశం హృది భావయామి ||



9)విశ్వేశ్వరం నిత్యమనంతమాద్యం త్రిలోచనం చంద్రకలావతంసమ్ |

పతిం పశూనాం హృది సన్నివిష్టం చిదంబరేశం హృది భావయామి ||



10)విశ్వాధికం విష్ణుముఖైరుపాస్యం త్రిలోచనం పంచముఖం ప్రసన్నం |

ఉమాపతిం పాపహరం ప్రశాంతం చిదంబరేశం హృది భావయామి ||



11)కర్పూరగాత్రం కమనీయనేత్రం కంసారిమిత్రం కమలేందువక్త్రమ్ |

కందర్పగాత్రం కమలేశమిత్రం చిదంబరేశం హృది భావయామి ||



12)విశాలనేత్రం పరిపూర్ణగాత్రం గౌరీకలత్రం హరిదంబరేశమ్ |

కుబేరమిత్రం జగతః పవిత్రం చిదంబరేశం హృది భావయామి ||



13)కళ్యాణమూర్తిం కనకాద్రిచాపం కాంతాసమాక్రాంతనిజర్ధదేహమ్ |

కపర్దినం కామరిపుం పురారిం చిదంబరేశం హృది భావయామి ||



14)కల్పాంతకాలాహితచండనృత్తం సమస్తవేదాంతవచోనిగూఢమ్ |

అయుగ్మనేత్రం గిరిజాసహాయం చిదంబరేశం హృది భావయామి ||



15)దిగంబరం శంఖసితాల్పహాసం కపాలినం శూలినమప్రయేమ్ |

నాగాత్మజావక్త్రపయోజసూర్యం చిదంబరేశం హృది భావయామి ||



16)సదాశివం సత్పురుషైరనేకైః సదార్చితం సామశిరస్సుగీతమ్ |

వైయ్యాఘ్రచర్మాంబరముగ్రమీశం చిదంబరేశం హృది భావయామి ||



17)చిదంబరస్య స్తవనం పఠేద్యః ప్రదోషకాలేషు పుమాన్ స ధన్యః |

భోగానశేషాననుభూయ భూయః సాయుజ్యమప్యేతి చిదంబరస్య ||


ఇతి శ్రీచిదంబరేశ్వరస్తోత్రం సంపూర్ణమ్ ||

🕉🌞🌎🌙🌟🚩

భగవాన్, మహర్షి, స్వామి, అవధూత, జ్ఞాని, సద్గురు ... ఈ పదాలన్నీ బిరుదులు కాదు, అవి పరమేశ్వరునికి పర్యాయపదాలు.

నీవు 'రోగం' అని దేనినైతే అంటున్నావో,  నిజానికి అది కూడా "ఆత్మానుభవం"లో భాగమే.

శిష్యుడు:- అపరోక్షం అంటే?

గురువు:- తాను ఉంటేనే ప్రత్యక్షమైనా, పరోక్షమైనా ఉండేది.  కాబట్టి తానే 'అపరోక్షం'.


గురు స్తోత్రం~~గురు గీత నుండి
💫💫🌏🌙🌞💫💫
🕉ఓం శ్రీమాత్రే నమః 🕉

గురు గీతలో గురువును స్తుతించే స్తోత్రం ఒకటి ఉంది.  అది 29 శ్లోకములతో అలరారుతోంది. గురుసంప్రదాయంను  అనుసరిమచే వారు నిత్యం పఠించే యోగ్యమైన స్తోత్రము ఇది. ఇది అందరూ నిత్యము చదువుకుంటారని అశిస్తాను. నా మటుకు నాకు ఇది ఎంతో మానసిక శక్తిని ప్రసాధించిన అద్భుత స్తోత్రం.
ఇదిగో మీ కోసం.

1) గురు ర్బ్రహ్మా గురు ర్విష్ణుః గురు ర్దేవో మహేశ్వరః
గురు రేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః      58

2) అఙ్ఞాన తిమిరాంధస్య ఙ్ఞానాంఙన శలాకయా
చక్షు రున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః     59

3) అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః    60

4) స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరం
త్వత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః   61

5) చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం స చరాచరం
అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః     62

6) నిమిష న్నిమిషార్ధ్వాద్వా యద్వాక్యాదై విముచ్యతే
స్వాత్మానం శివ మాలోక్య తస్మై శ్రీ గురవే నమః    63

7) చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం
నాద బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః    64

8) నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవ చ వ్యాప్తం యేన జగత్సర్వం తస్మై శ్రీ గురవే నమః     65

9) స పితా స చ మే మాతా స బంధుః స చ దేవతా
సంసార మోహ నాశాయ తస్మై శ్రీ గురవే నమః      66

10) యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతి తత్
యదానందేన నందంతి తస్మై శ్రీ గురవే నమః    67

11) యస్మిన్స్థిత మిదం సర్వం భాతి యద్భాన రూపతః
ప్రియం పుత్రాది యత్ప్రీత్యా తస్మై శ్రీ గురవే నమః   68

12).యేనేదం దర్శితం తత్వం చిత్త చైత్యాదికం తథా
జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మై శ్రీ గురవే నమః   69

13) యస్య ఙ్ఞాన మిదం విశ్వం న దృశ్యం భిన్న బేధతః
సదైక రూప రూపాయ తస్మై శ్రీ గురవే నమః    70

14) యస్య ఙ్ఞాతం మతం తస్య మతం యస్య న వేదసః
అనన్య భావ భావాయ తస్మై శ్రీ గురవే నమః   71

15) యస్మై కారణ రూపాయ కార్య రూపేణ భాతి యత్
కార్య కారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః    72

16) నానారూపమిదం విశ్వం న కేనాప్యస్తి భిన్నతా
కార్య కారణ రూపాయ తస్మై శ్రీ గురవే నమః   73

17) ఙ్ఞాన శక్తి సమారూఢ తత్వ మాలా విభూషణే
భుక్తి ముక్తి ప్రదాత్రేచ తస్మై శ్రీ గురవే నమః   74

18) అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే
ఙ్ఞానానిల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః  75

19) శోషణం భవ సింధోశ్చ దీపనం క్షర సంపదాం
గురోః పాదోదకం యస్య తస్మై శ్రీ గురవే నమః  76

20) న గురో రధికం తత్వం న గురో రధికం తపః
న గురో రధికం ఙ్ఞానం తస్మై శ్రీ గురవే నమః     77

21) మన్నాథః శ్శ్రీ జగన్నాథో మద్గురుః శ్రీ జగద్గురుః
మమాత్మా సర్వ భూతాత్మా తస్మై శ్రీ గురవే నమః   78

22) గురు రాది రనాదిశ్చ గురుః పరమ దైవతం
గురు మంత్ర సమో నాస్తి తస్మై శ్రీ గురవే నమః      79

23) ఏక ఏవ పరో బంధుః విషమే సముపస్థితే
గురుః సకల ధర్మాత్మా తస్మై శ్రీ గురవే నమః       80

24) గురు మధ్యే స్థితం విశ్వం విశ్వ మధ్యే స్థితో గురుః
గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః    81

25) భవారణ్య ప్రవిష్టస్య దిఙ్ఞ్మోహ భ్రాంత చేతసః
యేన సందర్శితః పంథాః తస్మై శ్రీ గురవే నమః  82

26) తాపత్రయాగ్ని తప్తానా మశాంత ప్రాణినాం భువి
యస్య పాదోదకం గంగా తస్మై శ్రీ గురవే నమః     83

27) అఙ్ఞాన సర్ప దష్టానాం ప్రాణినాం కశ్చికిత్సకః
సమ్యక్ ఙ్ఞాన మహా మంత్ర వేదినం సద్గురు వినా  84

28) హేతవే జగతా మేవ సంసారార్ణవ సేతవే
ప్రభవే సర్వ విద్యానాం శంభవే గురవే నమః      85

29)ధ్యాన మూలం గురో ర్మూర్తిః పూజా మూలం గురోః పదం
మంత్ర మూలం గురో ర్వాక్యం ముక్తి మూలం గురోః కృపా   86.

🚩🔔🚩🔔🚩🔔🚩

శ్రీ శంకరాచార్య స్తవః(శ్రీశంకరాచార్యవర్యం)


1) సర్వలోకైక వంద్యం భజే దేశికేంద్రమ్ |

ధర్మప్రచారేఽతిదక్షం యోగిగోవిందపాదాప్తసన్యాసదీక్షమ్ |

దుర్వాదిగర్వాపనోదం పద్మపాదాది శిష్యాలిసంసేవ్యపాదమ్ ||


2)శంకాద్రిదంభోలి లీలం కింకరాశేష శిష్యాలి సంత్రాణశీలమ్ |

బాలార్కనీకాశ చేలం బోధితాశేష వేదాంత గూఢార్థజాలమ్ ||


రుద్రాక్షమాలా విభూషం చంద్రమౌలీశ్వరారాధనావాప్తతోషమ్ |

విద్రావితాశేషదోషం భద్రపూగప్రదం భక్తలోకస్య నిత్యమ్ ||


4) పాపాట వీచిత్రభానుం జ్ఞానదీపేన హార్దం తమో వారయంతమ్ |

ద్వైపాయన ప్రీతిభాజం సర్వతా పాపహామోఘబోధప్రదం తమ్ ||


5) రాజాధిరాజాభి పూజ్యం రమ్య శృంగాద్రివాసైక లోలం యతీడ్యమ్ |

రాకేందు సంకాశవక్త్రం రత్నగర్భేభవక్త్రాంఘ్రిపూజానురక్తమ్ ||


6)శ్రీభారతీతీర్థ గీతం శంకరార్యస్తవం యః పఠేద్భక్తియుక్తః |

సోఽవాప్నుయాత్సర్వమిష్టం శంకరాచార్యవర్యప్రసాదేన తూర్ణమ్ ||


ఇతి శ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి కృత శ్రీ శంకరాచార్య స్తవః ||

🕉🌞🌏🌙🌟🚩

Om Namaha Shivaya:
శ్రీమచ్చంకరాచార్య విరచిత శ్రీ సద్గురు పాదుకా స్తవము

1) శ్లో|| శ్రీ సమంచిత మవ్యయం పరమ ప్రకాశ మగోచరం|

  భేద వర్జిత మప్రమేయ మనన్త మాద్య మకల్మషం||

  నిర్మలం నిగమాన్త మద్వయ మప్రతర్క్య మబోధకం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||



 2)శ్లో|| నాదబిన్దు కళాత్మకం దశనాద భేద వినోదకం|

  మంత్రరాజ విరాజితం నిజమండలాంతర భాసితం||

  పంచవర్ణ మఖండ మద్భుత మాదికారణ మచ్యుతం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||



 3)శ్లో|| వ్యోమ వద్బహిరన్తరస్థిత మక్షరం నిఖిలాత్మకం|

  కేవలం పరిశుద్ధ మేక మజన్మహి ప్రతి రూపకమ్‌||

       బ్రహ్మతత్త్వ వినిశ్చయం నిరతాను మోక్ష సుబోధకం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం|| 



 4)శ్లో|| బుద్ధిరూప మబుద్ధికం త్రితయైక కూట నివాసినం|

  నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకమ్‌||

  పశ్చిమాన్తర ఖేలనం నిజశుద్ధ సంయమి గోచరం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||  



 5)శ్లో|| హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం|

  నీల మధ్య సునీల సన్నిభ మాది బిన్దు నిజాం శుకమ్‌||

  సూక్ష్మ కర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం|| 



 6)శ్లో|| పంచ పంచ హృషీక దేహ మనశ్చతుష్క పరస్పరం|

  పంచభూత సకామ షట్క సవిూర శబ్ద ముఖేతరమ్‌||

  పంచ కోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||



 7)శ్లో|| పంచ ముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం|

  విద్యుదాది ధగద్ధగిత్వ రుచిర్వినోద వివర్థనమ్‌||

  చిన్ముఖాన్తర వర్తినం విలసద్విలాస మమాయకం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||



 8)శ్లో|| పంచ వర్ణ రుచిర్విచిత్ర విశుద్ధ తత్త్వ విచారణం|

  చంద్ర సూర్య చిదగ్ని మండల మండితం ఘన చిన్మయం||

  చిత్కళా పరిపూర్ణ మంతర చిత్‌ సమాధి నిరీక్షణం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం|| 



 9)శ్లో|| హంసచార మఖణ్డనాద మనేక వర్ణ మరూపకం|

  శబ్ద జాలమయం చరాచర జన్తు దేహ నివాసినమ్‌||

  చక్రరాజ మనాహతోద్భవ మేక వర్ణ మతః పరం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||                                   


 10)శ్లో|| జన్మకర్మ విలీన కారణ హేతుభూత మభూతకం|

  జన్మకర్మ నివారకం రుచి పూరకం భవతారకం||

  నామరూప వివర్జితం నిజ నాయకం శుభదాయకం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||



 11)శ్లో|| తప్తకాంచన దీప్యమాన మహాణు మాత్ర మరూపకం|

  చన్ద్రికాన్తర తారకైరవ ముజ్జ్వలం పరమాస్పదమ్‌||

  నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||



 12)శ్లో|| స్థూల సూక్ష్మ సకారణాన్తర ఖేలనం పరిపాలనం|

  విశ్వతైజస ప్రాజ్ఞచేతస మన్తరాత్మ నిజాంశుకమ్‌||

  సర్వకారణ మీశ్వరం నిటలాన్తరాళ విహారకమ్‌|

  ప్రాతరేవహి మానసాంతర్భావయేత్‌ గురుపాదుకాం||

     
      ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచిత శ్రీమద్గురు పాదుకాస్తవ స్సంపూర్ణం.

🕉🌞🌎🌙🌟🚩

వేదవ్యాసుడు - వ్యాసపూర్ణిమ - గురుపూర్ణిమ
ॐॐॐॐॐॐॐॐॐॐ

వేదవ్యాసుడు: వేదవ్యాసుడు సత్యవతీ పరాశరుల పుత్రుడు. వశిష్టుని మునిమనుమడు. ఇతనికే కృష్ణ ద్వైపా యనుడు, బాదరాయణుడు అని కూడ పేర్లు. యమునా నదీ ద్వీపంలో కృష్ణ(నల్లని) వర్ణంతో జన్మించినాడు గావున కృష్ణద్వైపాయనుడని పిలువబడినాడు. ప్రపంచ వాజ్మయంలోనే ఇతనికి సమానమైన విద్వాంసుడు మనకు గోచరించడు. అందుకే "వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం” అని లోకోక్తి.


వ్యాసుడు వేదవాజ్మయాన్ని లోతుగా అధ్యయనం చేసి పలువురికి ఉపయోగ పడునట్లు క్రమపద్ధతిలో సవరణలు, విభజనలు గావించి ప్రసరింపచేసినాడు అంటే వేదాలను విన్యాసమొనర్చినాడు కాబట్టి వేదవ్యాసుడన్నారు. శ్రీకృష్ణుడు “మునీనాం అప్యహం వ్యాసః” అనగా మునులలో నేను వేదవ్యాసుడను అని గీతలో అన్నాడు. వ్యాసుడు తన శిష్యులలో పైలునకు ఋగ్వేదమును, వైశంపాయనునకు యజుర్వేదమును జైమినికి సామవేదమును, సుమంతునకు అధర్వవేదమును అప్పగించి లోకమున ప్రసరింపజేసినాడు. వీరు వేదములను పరిరక్షించారు. అందుకే ప్రతి హిందువు నిత్యం వీరికి జలాంజలి సమర్పించాలి.


వేదవ్యాసుడు తత్త్వజ్ఞానం విద్వాంసుల వద్ద మాత్రమే ఉండడం సముచితం కాదు. అది సార్వజనికం కావాలి, సామాన్య జనుల వద్దకు వెళ్ళాలి అనే ఆలోచనలో కథల రూపంలో అష్టాదశ పురాణాలను రచించి ప్రజలకు ఉత్తమ మార్గదర్శనం లోకానికి మహోపకార మొనర్చినాడు. వీటిలోని భాగవత పురాణం చిత్తశాంతిని కలిగిస్తుంది. పంచమ వేదం వంటి మహాభారత గ్రంథాన్ని రచించి ఒక ఇతిహాస కారకుడుగా, చారిత్రకుడుగా, ఆధ్యాత్మికవేత్తగా, ఆర్థికవేత్తగా, రాజనీతివేత్తగా లోకప్రసిద్ధి వేదవ్యాసుడు పరిపూర్ణతత్త్వజ్ఞానంతో బ్రహ్మసూత్రములను రచించాడు. నాలుగు అధ్యాయాలు, పదహారు పాదాలు ఐదువందల యాభై సూత్రాలు. వాటిలో విశ్వంలోని ఏ యొక్క తాత్త్విక విచారధారను

విడిచిపెట్టకుండా ఆత్మ-అనాత్మల విషయంతో సహా సరళ సుందర శైలిలో చర్చించి తత్త్వోపదేశం చేశాడు.


లక్క ఇంటినుండి తప్పించుకొని వెళ్ళుచున్న పాండవులకు వ్యాసుడు కనిపించి ధర్మమును పాటింపుమని హితవులు చెప్పి ధర్మపక్షమైన పాండవపక్షం వెనుక ద్రుపద మహారాజు ప్రచండశక్తి ఉండాలనే భావనతో అర్జునుని ద్రౌపదీ స్వయంవరానికి పంపిచేను పంచపాండవుల పత్నిగా నిర్ణయించాడు. "వ్యాసుడు చెప్పాడంటే అడిగేదేముంది? అది యోగ్యమైనది ధర్మబద్ధమైనదే అయి ఉంటుంది" అని ప్రజలు భావించేలా సమాజాన్ని ప్రభావితం చేసినాడు. వ్యాసుడు చేసిన పని సరైనదే అనే సామాజిక దృఢనిశ్చయాన్ని కలిగించాడు.


వేదవ్యాసుడు మేరునగముపై శివుని గూర్చి తపస్సుచేసి రాగాతీతుడైన పుత్రునిపొందాడు. అతడే శుకమహర్షి వ్యాసుడు కాశీపట్టణంలో నివసించు చునప్పుడు ఒక సారి ఏ ఇంటను భిక్ష లభించకపోవుటచే కాశీపట్టణమును శపించబోగా పార్వతి అడ్డుపడి అతని క్షుద్బాధతీర్చి కాశీ బహిష్కరణ గావించింది. ఎంతటి వారైనను చేసిన తప్పునకు శిక్ష అనుభవింపక తప్పదు కదా!.


వ్యాసుడనునది ఒక్కని పేరు కాదు. అది యొక వ్యవస్థ అది యొక పీఠము, ద్వాపర యుగమందు ఆర్ష విద్యా ధర్మము లొకొక్కనిచే విస్తరింపబడుతుంటాయి, ద్వాపరమున స్వయంభువు, ద్వితీయ ద్వాపరమున ప్రజాపతి వ్యాసులైనారు, పక్షుడు, బృహస్పతి, వసిష్ఠుడు, త్రివరుడు, మొదలగువారు వ్యాసులై ఆ స్థానమనలంకరించి వేద ప్రసార ధర్మమును నిర్వహించినారు. ఇప్పుడు మనం చదుకుంటున్న ఈ పరాశర పుత్రుడు ఇరువది యేడవ వ్యాసుడుగ లోక ప్రసిద్ధుడు. అలరించిన రోజునే మనం వ్యాసపూర్ణిమగ గురుపూర్ణిమగ స్మరించుకుంటాం. మానసపుత్రుడైన అపాంతరతముడను వాడే ఈ వేదవ్యాసులుగా అవతార మెత్తినాడు. అందుకే వ్యాసుడు సామాన్య మానవుడు కాడు. వ్యాసపీఠము వాజ్మయ పఠనీయ దేవతా పీఠము. దాని నుండి తత్త్వజ్ఞానము, వ్యాసుని బుద్ధి మరియు గణపతి కలములనే త్రివేణీ సంగమము నుండి జాలువారిన ఆర్షవాజ్మయ జలధార. దీన్ని అధ్యయనం చేసి ఆచరణలో పెట్టుటతో మనం పునీతులం కావాలి.


అచతుర్వదనో బ్రహ్మ | ద్విబాహు రపరోహరి:

అఫాలలోచనః శంభుః ! భగవాన్ బాదరాయణః!

నాల్గుముఖములు లేనప్పటికిని బ్రహ్మ వంటివాడు, నాలుభుజములకు బదులు రెండు భుజములు కలిగినట్టి విష్ణువు వంటివాడు. లలాటమునందు నేత్రం లేనప్పటికిని సాక్షాత్తు శివుని వంటివాడు ఈ భగవాన్ బాదరాయణుడు మనమంతా ధర్మమార్గంలో పయనించడమే వారికి మనం సమర్పించే వందనం.


ఓం నమో పరమాత్మయే నమః

భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకస్థానం ఉంది. యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి.


 గురుసంప్రదాయంలో శివుడే ఆదిగురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం(శబ్దం) పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉపాదేశించాడు (శివకేశవులకు బేధం లేదు, ఇద్దరూ ఒకే పరమాత్మ యొక్క భిన్న కోణాలు). బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి, ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు.


ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది, అనేక మంది ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది. కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు(అందుకే వేదానికి 'శ్రుతి' అని పేరు). మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుష్యుల యొక్క ఆయుషును(జీవిత కాలాన్ని), బుద్ధిని, జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని, కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు.


 ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు. వాటిని తన నలుగురు శిష్యులకు ఉపదేశించి ప్రచారం చేయమని ఆదేశించారు. వేదాన్ని అర్ధం చేసుకోవడం కష్టమని, అందరికి అర్దమయ్యే విధంగా వేద సారం మొత్తాన్ని అష్టాదశ(18) పురాణాల్లోనూ, ఉపపురాణాల్లోనూ నిక్షిప్తం చేశారు. బ్రహ్మసూత్రాలను రచించారు. పంచమవేదంగా ప్రసిద్ధిచెందిన మహాభారతాన్ని వినాయకుడి సాయంతో గ్రంధస్థం చేశారు. ధర్మాచరణలో వేదమే ప్రామాణికం. మన సంస్కృతికి ఆది, పూనాది వేదమే. అటువంటి వేదాన్ని నాలుగుగా విభజించి, లోకానికి ఎంతో ఉపకారం చేసిన వేదవ్యాస మహర్షికి కృతజ్ఞతగా ఆషాఢ పూర్ణిమను గురుపూర్ణిమగా, వ్యాసపూర్ణిమగా జరుపుకుంటాం.


వ్యాసమహర్షి తనకు పరంపరాగతంగా వస్తున్న విద్యను తన పుత్రుడైన శుకమహర్షికి ఉపదేశించాడు.


 శుకమహర్షి గౌడపాదాచార్యులవారికి, ఆయన గోవిందపాదాచార్యులవారికి, గోవిందపాదులు శ్రి శంకరాచార్యులవారికి ఉపదేశించారు. వైదిక సంస్కృతిని బౌద్ధ, చార్వాక, జైన మతాలు అంతం చేసే పరిస్థితి ఏర్పడినప్పుడు కైలాస శంకరుడే ఆదిశంకరాచరుడిగా అవతరించాడు. శ్రీ శంకరాచార్యులవారు దైవ, ఋషి పరంపరగా వస్తున్న ఈ మహాద్భుత జ్ఞానాన్ని తన నలుగురు శిష్యులైన పద్మపాదాచార్యులు, హస్తమలకాచార్యులు, తోటకాచార్యులు, సురేశ్వరాచార్యులవారికి ఉపదేశించారు. వైదిక సంస్కృతిని పునరుద్దరించారు.


ఆత్మ జ్ఞానమైన, బ్రహ్మజ్ఞానమైన, వేదమైన, ఎటువంటి జ్ఞానమైన ఆధునిక కాలంలో కొత్తగా తెలుసుకుని/కనిపెట్టి చెప్పినవారు లేరు. నారాయణుడి దగ్గరినుండి పరంపరగా వస్తున్న జ్ఞానాన్ని, ఏదైతే వ్యాసుడి చేత చెప్పబడిందో, అది మాత్రమే చెప్తారు. వ్యాసుడి చెప్పినదానికి భిన్నంగా ఏది చెప్పలేరు. ఒకవేళ చెప్పినా అది ఆమోదయోగ్యం కాదు. ఎంతో పురాతనమైన, సనాతమైన ఈ సంపద మనకు అందడంలో ముఖ్యపాత్ర పోషించిన వ్యాసమహర్షిని మన గురువులలో చూసుకుని ఆరాధించడమే గురు పూర్ణిమ.


వ్యాసాయ విష్ణు రూపాయ
వ్యాస రూపాయ విష్ణవే!

గురు అనే శబ్దానికి చీకటిని పోగెట్టేవాడు అని కూడా అర్థము ఉంది.
చీకటి అఙ్ఞానాన్ని పోగొట్టి ఙ్ఞానం అనే వెలుతురు చూపించే గురువుకి నేను నమస్కరిస్తున్నాను.

🕉🌞🌏🌙🌟🚩

🌝గురు పౌర్ణమి🌝  
🕉🌞🌎🌙🌟🚩

ఇంద్రాది దేవతల్ ఇష్టాన గొలువగా
             నయమైన రూపమ్ము నభము వెలిగె

కృత్తికా సంయోగ కేళిలో  ధృతినొంది
              కాంతులు విరజిమ్మె కలువరేడు

ధవళ వర్ణము నంత దండిగా పొడి జేసి 
               చిలకరించిన భంగి చిందుచుండె

పున్నమి వెల్గుల పుడమంత పులకించ 
                అమృత తరంగిణి యవని బారె

అవని జేరిన అందాల యంబుజుండు
కార్తికపు మాస దీపాల కాంతి గాంచి
తనను మించిన సౌందర్య దౌరు చూసి
సిగ్గుతోడగ తలవంచి చిన్న బోయె

ॐॐॐॐॐॐॐॐॐॐ

రచన:- మల్లేపల్లి ప్రమోద్ కుమార్ 
గానం:- శ్రీమతి బాల సుజాత గారు

🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి