13, జులై 2022, బుధవారం

🙏నమస్కారం🙏 స్టోరీస్


ప్రాంజలి ప్రభ కథలు....114

*తోలుసంచీ కధ *  : కాకికథ      ( తప్పకుండా చదవండి)

పూర్వం చంద్రగిరిలో భద్రయ్య అనే వ్యాపారి ఉండేవాడు. చంద్రగిరి చుట్టుప్రక్కలే కాక, సుదూర ప్రాంతాలకు కూడా సరుకు తీసుకెళ్లి వ్యాపారం చేస్తూ బాగా సంపాదించాడు అతను. స్వభావ రీత్యా స్నేహశీలి, దయాశాలి అవ్వటంతో అందరూ భద్రయ్యని చాలా అభిమానించేవారు. సాటి వర్తకులు నష్టాల్లో ఉంటే వారిని ఆదుకోవటమే కాదు, సలహాలిచ్చి వ్యాపారానికి సాయపడుతూండేవాడతను.
ఇలా ఉండగా ఒకసారి ప్రక్కన చోళ దేశంలో సుగంధ ద్రవ్యాలకు కొరత ఏర్పడిందని, మంచి గిరాకీ ఏర్పడిందని తెలిసింది అతనికి. దాంతో కావలసినంత సరుకు తీసుకొని, కొందరు పనివాళ్లను వెంటబెట్టుకొని చోళదేశం చేరుకున్నాడు.
సుగంధ ద్రవ్యాలకు అక్కడ నిజంగానే కొరత ఉంది. భద్రయ్యకు వ్యాపార చిట్కాలు బాగా తెలుసు. విశేష అనుభవం ఉంది. ఎక్కడ ఏ వస్తువులకు గిరాకీ ఉంటే అక్కడ ఆ వ్యాపారమే చేస్తాడు. ఆ విధంగా చోళదేశంలో అతడి సుగంధ ద్రవ్యాల వ్యాపారం ఎంతో లాభసాటిగా సాగింది. చేతిలో సరుకు మొత్తం అయిపోయింది. మరి కొంత సరుకుతో ఇంకోసారి చోళదేశం రావాలని నిశ్చయించుకొని, చంద్రగిరికి తిరుగు ప్రయాణమయ్యాడు.
అతనితోపాటు నలుగురు సేవకులు ఎడ్లబండ్ల మీద బయలుదేరారు.
చోళదేశంలో తను సంపాదించిన డబ్బునంతా బంగారు నాణాలుగా మార్చి, వాటిని ఒక తోలు సంచిలో వేసి, చక్కగా మూతికట్టి, తన దగ్గరే ఉంచుకున్నాడు భద్రయ్య. "ఎంత నమ్మకస్తుడికైనా ఎప్పుడు ఏ దుర్భుద్ధి పుడుతుందో" అని, "మనిషిని ప్రలోభ పెట్టే గుణం ధనానికి ఉంది" అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకునే భద్రయ్య, ఆ సంచిని మాత్రం తను నమ్మే సేవకుల చేతికి కూడా ఎప్పుడూ ఇవ్వడు.
కొంత దూరం వచ్చేసరికి వాళ్లకు పాపయ్య అనే తోటి వ్యాపారస్తుడు, అతని ఇద్దరు సేవకులు కలిసారు. చూసీ చూడగానే భద్రయ్య దగ్గర ఉన్న తోలు సంచిని పసిగట్టేసాడు పాపయ్య. దాన్నిండా బంగారు నాణాలు ఉన్నాయని కూడా‌ అతనికి తెలిసిపోయింది! అతని బుద్ధి అసలు మంచిది కాదు. మంచిగా ఉంటూనే గోతులు త్రవ్వేస్తాడు. అయితే ఈ సంగతి భద్రయ్యకు తెలీదు. వ్యాపారి అంటే "వ్యాపారి కదా, మన ఊరివాడు" అనుకున్నాడు.
చీకటి పడే సమయానికి వాళ్లంతా సింహపురికి చేరుకున్నారు. ఆరోజు రాత్రికి ఒక సత్రంలో బసచేసారు. భోజనాలు చేసి పడుకునేటప్పుడు పాపయ్య అడిగాడు: "వేకువజాముననే ప్రయాణం ఆరంభి-ద్దామా?" అని.
కానీ "ఇక్కడి నుండీ మొత్తం అడవి దారి కదా, చోర భయం ఉంది. ఏదో ఒక బిడారు గుంపు బయలుదేరే వరకూ ఆగటం మంచిది" అన్నాడు భద్రయ్య.
"తోలు సంచి కొట్టెయ్యాలంటే ఇదే అదను.. అవకాశం మళ్ళీ రాదు.. సంచీ తీసేసుకొని, వేకువనే వెళ్లిపోవాలి!" అని ఆ క్షణాన్నే నిశ్చయించుకున్న పాపయ్య, రాత్రికి రాత్రే ఆ తోలు సంచిని దొంగిలించాడు. తన మనుషులిద్దర్నీ నిద్రలేపి, చడీ‌చప్పుడు కాకుండా బయలుదేరి వెళ్లిపోయాడు. మార్గామాసంతో గాఢ నిద్రలో ఉన్న భద్రయ్యకు ఆ సంగతి ఏదీ తెలీనే తెలీదు- తెల్లవారి చూస్తే ఏముంది? సంపాదన యావత్తూ దాచుకున్న తోలుసంచీ లేదు; ప్రక్కన పాపయ్య కూడా లేడు!
జరిగిన మోసం అర్థమైంది అతనికి. అయినా "ఆ సొమ్ము నాకు రాసి పెట్టి లేనట్టుంది.
అందుకే పోయింది!" అని సరిపుచ్చుకున్నాడు భద్రయ్య. తన దగ్గర ఇప్పుడు డబ్బు లేదు: కాబట్టి దొంగలు దోచుకుపోతారన్న భయం కూడా లేదు. అందుకని ఇక వెంటనే బండి కట్టుకొని, ప్రశాంతంగా చంద్రగిరికి ప్రయాణమయ్యాడు అతను.
సాయంకాలం అయ్యేసరికి ఎడ్లబండ్లు ఒక కొండవాగును చేరుకున్నాయి. విశ్రాంతి కోసం అక్కడ ఆగారు వాళ్ళు. అంతలో ఒక బిడారు వాగుదాటి ఇవతలికి వచ్చింది.
బిడారు నాయకుడు వీరబాహుడు, గతంలో చాలా సార్లు భద్రయ్య బండ్లతో కలిసి ప్రయాణించాడు. భద్రయ్యను చూడగానే నవ్వుతూ దగ్గరకొచ్చాడు. "అయ్యా..చాలా రోజుల తర్వాత కనిపించారు- నమస్కారం" అన్నాడు.
"చోళదేశంలో వ్యాపార నిమిత్తం చాలా రోజులు ఉండిపోయాను. అందుకే కనబడలేదు! నువ్వు బాగున్నావా వీరబాహూ?" అంటూ పలకరించాడు భద్రయ్య.
"మేం బాగున్నామయ్యా. ఓసారి ఈ తోలు సంచీ చూడండి, తమదే అనుకుంటాను.." అంటూ తోలుసంచీ అందించాడు వీరబాహు.
ఆ సంచిని చూసి ఆశ్చర్యపోయాడు భద్రయ్య. అది తనదే!
"ఇది నాదే, వీరబాహూ! చోళదేశంలో చేసిన వ్యాపారం తాలూకు డబ్బు మొత్తం ఇందులోనే ఉంది. నిన్న రాత్రి సింహపురి సత్రంలో నిద్రపోతుంటే పాపయ్య అనే వ్యాపారి దీన్ని దొంగిలించుకొని పోయాడు-" అని ఆగి, "మరి ఇప్పుడు అది నీ చేతికి ఎట్లా వచ్చింది?" అని అడిగాడు.
"అయితే పాపయ్యకు తగిన శాస్తి జరిగిందిలెండి. మీకు గుర్తుందా? పోయిన సంవత్సరం మీరు నా బిడారుతోపాటు విజయనగరానికి వచ్చారు. ఆ సమయంలో మీరూ నేనూ కలిసి వెళ్ళి ఈ తోలు సంచిని కొన్నాం. అందుకే దీన్ని చూడగానే 'ఇది మీది' అని గుర్తించగలిగాను నేను. ఇవాళ్ళ మధ్యాహ్నంగా మాకు ఓ దొంగల గుంపు ఎదురైంది. వాళ్ళు పాపయ్య ఎద్దులబండి మీద దాడి చేస్తున్నారు. ఆ దాడిలో పాపయ్య చనిపోగా, పనివాళ్ళు ఇద్దరూ‌ పారిపోయారు. అదే అదనుగా మేమూ‌ ఆ దొంగలతో పోరాడి, వాళ్లందరినీ తుదముట్టించేసాం. "వాళ్ళ దగ్గర ఏమున్నది?” అని వెతుకుతుంటే ఈ సంచీ కనబడింది-. 'ఇది మీదే కదా, మీరు గానీ ఈ దొంగల పాల పడ్డారా?' అని నాకు దు:ఖం వేసింది. అందుకని మీకోసమే మేం మళ్ళీ ఈ వాగు దాటి, ఇటుగా వచ్చాం!" చెప్పాడు వీరబాహుడు.
తన క్షేమం గురించి అంతగా ఆలోచించిన వీరబాహుడికి ధన్యవాదాలు చెప్పాడు భద్రయ్య. "చూసావా?! పరుల సొమ్ముకు ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు పాపయ్య? అంతా మన మంచికే అని చెబుతారు. ఈ సంచీ నా దగ్గరే ఉంటే నేనే ఆ దొంగలకు బలై ఉండేవాడిని కదా!" అన్నాడు.
"అట్లా ఏమున్నది లెండి- మీకు ఏమీ అయిఉండేది కాదేమో, మీరూ నేనూ కలిసి దొంగలకు బుద్ధి చెప్పేవాళ్లమేమో, అసలు దొంగలే ఎదురయ్యేవాళ్ళు కారేమో, మరి ఇంకేమైనా జరిగి ఉండేదేమో‌" అని నవ్వాడు వీరబాహుడు.
కొత్తపల్లి వారి సౌజన్యం.
--((***))--

115

: కాకికథ      ( తప్పకుండా చదవండి)
......నాపేరు "కాకి"నాకది మనుషులు పెట్టిన పేరు... "అస్థిపంజరం" ఇది నేను మనుషులకు పెట్టిన పేరు... ఎందుకో ఈ కథ చివరలో మీకు అర్థమవుతుంది.....

నాకు నలుగురు పిల్లలు..... అందులో రెండు నా పక్క చెట్టు మీద ఉండే కోయిలవి ....కోయిలకి గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు, పిల్లలుగా మార్చడం తెలియదు... కానీ ,మాకు గుడ్లు పెట్టడం ,వాటిని పొదగడం, బిడ్డలుగా మార్చటం మాత్రమే కాదు వేరే తల్లీబిడ్డలను మా బిడ్డలుగా కంటికి రెప్పగా కాపాడ్డం కూడా తెలుసు.....

ఆ రోజు ఆదివారం జోరువాన.. బంగాళాఖాతంలో వాయుగుండం అంట ఎవరో ఇద్దరు చెట్టుకింద మాట్లాడుకుంటుంటే విన్నాను...

పిల్లలేమో ఆకలి అంటున్నాయి.. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీల్లో ,డ్రైనేజ్లో ఏమి దొరకని పరిస్థితి ఒకపక్క పిల్లల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది....

"మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని, మనం ప్రేమించే వాళ్లకి దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన మనసు ఉండదు కదా".. అందుకే వాటికోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను....

ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి, ఆకలి కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి, వానచినుకులు విసిరిన రాళ్ళలా శరీరాన్ని తూట్లు చేస్తున్నాయి... కాసేపు అలసట తీర్చుకుందామని ఇంటిముందున్న మామిడి చెట్టు మీద వాలాను...

సరిగ్గా సమయం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు ...నా అదృష్టం కొద్దీ అప్పుడే ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నారు ..వాళ్లు తినే దాకా ఉంటే కనీసం నాలుగు మెతుకులు అయినా చేతులు కడిగేసిన కంచాల్లో దొరక్క పోవా అని నా ఆశ ...ముందు పచ్చడి ,తరవాత కూర ,ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ...

మొత్తం నలుగురు... ఒకతను మాత్రం ముసలివాడు ఒక 70 ఏళ్ళవరకు ఉంటాయి ...పాపం అతని కంచంలో మాత్రం అన్నం ,ఎర్రటి రంగులో మామిడి పచ్చడి...

"అమ్మ తాతయ్యకి కూర వేయొచ్చుగా".. అని ఆ పెద్దాయన  పక్కనున్న చిన్న పిల్లాడు అన్నాడు...
వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ .."ఏంట్రా వేసేది నోరు మూసుకుని తిను ...తిండి పెట్టడమే ఎక్కువ... దేవుడు కొంతమందిని తీసుకుపోకుండా భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో అర్థం కాదు... కూరలు కావాలంట కూరలు ఎక్కడి నుంచి వస్తాయి" అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ...

ఆమెని అలా చూసి ఆ సిచువేషన్తో సంబంధంలేని నాకే భయం వేసింది ఇంకా ఆ పిల్లోడెంత....

అక్కడ అంత జరుగుతున్న ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు ..
"ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి "అని పోయించుకుని తింటున్నాడు ...
వాడు అచ్చం బురదలో పడుకునే పందికి ముందు రెండు కాళ్లు తీసేసి చేతులు పెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలా ఉన్నాడు ....పాపం వాడి ముఖాన్ని వాడు రోజు అద్దంలో ఎలా చూసుకుంటున్నాడో???

పాపం ఆ పెద్దాయనకి అన్నం కలుపుకోవడానికి కూడా చేతుల్లో బలం లేదు... అయినా సరే బాగా ఆకలేస్తుంది అనుకుంటా త్వరత్వరగా అన్నం కలుపుతున్నాడు వణుకుతున్న చేతులతో... మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒకముద్ద తీసి నోట్లో పెట్టుకున్నాడు... వెంటనే నీళ్లు తాగాడు ...బాగా మంటగా ఉందనుకుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి ,మొఖం ఎర్రగా మారిపోయింది ...
ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు కానీ ,అడగడానికి ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు... అయ్యో !!ఎంత దారుణం, పాపం పెద్దాయన...
వాళ్లు తినడం అయిపోయింది.. అందరూ లేచారు ...ఆ పెద్దాయన కూడా చెంబులో నీళ్లు మొత్తం తాగేసి లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు ...అప్పుడు ఆయనకి నేను కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు... ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి....

"పెద్దాయనా!!! నీ ఆకలి తీరకపోయినా నా ఆకలి తీరుస్తున్నవు ...నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటా" అని మనసులో అనుకొని.. నేను కొన్ని మెతుకులు తిని ,కొన్ని మెతుకులు గొంతున బట్టి గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చా.....

సరిగ్గా 26 రోజుల తర్వాత అనుకుంటా "ఎప్పటిలాగే వేట కోసం ఏటి మీదుగా వెళ్తున్నా" ఏటి ఒడ్డున ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు ...కాసంత తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను... ఎదురుగా ఉన్న ఫోటోని చూసి ఆశ్చర్యపోయాను అది నా పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన పెద్దాయన...." ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు దిగజారిపోయాయి...

"అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి ...మీ నాన్నగారు వాటి రూపంలో వచ్చి తింటారు" అని పూజారిగారు చెప్పారు ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ... ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది ,నల్లటి నా మొఖం తెల్లబారిపొఇంధి".. ఎందుకంటే ఆ కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి....

వారిని మనుషులు!!! మీరేం మనుషులురా బాబు ... బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా చచ్చిన తర్వాత బ్రతికించడం కోసం పెడుతున్నారా??

పోవడం కోసం కోరికలు కోరుకొని ,కాకి రూపంలో రావడానికి పూజలు చేస్తున్నారా??

బ్రతికినంత కాలం రాబందుల్లా పీక్కుతినీ విసిరేసింది తినడానికి కాకుల్ని పిలుస్తున్నారా??

ప్రాణం ఉన్నంత కాలం పెద్దయిన కప్పుకోవడానికి కండవ కూడా ఇవ్వకుండా, పోయాక కట్టుకోడానికి పట్టుపంచ పెట్టారా... ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య...

పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదిన గండంగా బ్రతికేలా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా ఫోటోకి దండం పెడుతున్నాడు.... అసలు వీన్ని నా ముక్కుతో పొడిచి ,పొడిచి చంపాలి...

ఏరా వెధవా!! ఇంటి చెట్టు మీద వాలితే  ఈసడించుకున్న కాకిలో ఈరోజు నీ నాన్నని చూసుకుంటున్నావా ... కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??

ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్న కాకి ..పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??

అలా మనసులో  వాడిని తిడుతున్నప్పుడు నా ఆవేశం కట్టలు తెంచుకుంది ...వెంటనే గాల్లోకి ఎగిరాను ...చుట్టూ ఉన్న నా  కాకుల స్నేహితుల దగ్గరికి వెళ్లి జరిగింది చెప్పి ఆ పిండాన్ని ఎవరు తినొద్దని చెప్పాను అందరూ సరే అన్నారు...

గంటా ,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి... పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు... చుట్టూ ఉన్న జనాల్లో అనుమానం మొదలైంది... "బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగా చూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు" అని ఒకడు... "ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన రావట్లేదు" అని ఇంకొకరు... "నేను రోజూ చూసే వాడిని అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు అందుకే ఇప్పుడు రావట్లేదు" అని మరొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ...
అది విని ఫోటో ముందు కూర్చున్నా ముసలాయన కొడుక్కి తల తీసేసినట్టు అనిపించింది ...అలాగే ఉండిపోయాడు... కనీసం తల చెప్పుకోలేని పరిస్థితి... పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు ,బ్రతికున్న చచ్చినట్టు అనిపిస్తుంది అతనికి ... నా బిడ్డల ఆకలి  తీర్చినందుకు  ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను... ఈరోజు ఒక మంచి పని చేశా అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను....

రేయ్ మనిషి !!వింటున్నావా!! నీకే చెప్పేది!!
" సెంటు పిలిస్తే మంచి వాసన వచ్చిందని తాగితే బలం వస్తుందనుకోవడం అమాయకత్వం... అలాగే, డబ్బు అవసరం తీర్చే వస్తువులు ఇచ్చిందని ,ప్రేమించే మనుషుల్ని కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం...

అయినా "ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు, ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు"..

"ప్రేమతో వస్తువులు కొనుక్కోవచ్చు ,వస్తువులు కొనుక్కున్నట్టు ప్రేమను కొనుక్కోలేవు" ..రేయ్ !మనిషి అర్థమైందా...

"ఒక మనిషి గొప్పతనాన్ని అతను చేసిన పనుల బట్టో, మంచిని బట్టో కాకుండా అతనికున్న డబ్బును బట్టి నిర్ణయించే సమాజంలో బతుకుతున్నావ్ "....త్వరగా బయటపడరా మనిషి....

ఇన్ని చెప్పిన లాస్ట్ లో ఒక పంచు డైలాగ్ చెప్పకపోతే నా హీరోయిజం ఏముంటుంది చెప్పు ....అందుకే సిచువేషన్కి సరిపోకపోయినా ఒక మూడు డైలాగులు చెప్తాను విను ....రేయ్ మనిషి విను....

"ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం ,ఓటమి తర్వాత వచ్చే అనుభవం ,గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం" ...వృధాగా పోవు....

"బాగా తిన్న తర్వాతే ఆకలి నుండి ,పూర్తిగా అనుభవించిన తర్వాతే బాధనుండి, మొత్తం  భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం.... వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు"....

చూడప్పా మనిషప్పా నేను గాలిపటం లాంటిదాన్ని దానికి దారం ఉంటుంది ,నాకు దారం ఉండదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్...

అయినా క్లైమాక్స్ లో హీరో మనం అయితే వచ్చే కిక్కే వేరప్పా.....
_________

చివరి మాట : కొన్ని కాకుల శరీరం నలుపు అవ్వచ్చు కానీ మనసు మాత్రం తెలుపు.... (ఈమాట కాకుల కంటే మనుషులకే ఎక్కువ వర్తిస్తుంది)

రచన : రంజిత్ గంగవరపు

--(())--

116..
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక కధలు
ఈ నాటి శ్రమదానం కధ

ఉకారసంధి- ఉడుకుమోతు అత్తగారు- కొంటె కోడలు

అత్త : ఇదో కోడలు పిల్లా! ఓ సారిలా రా!

కోడలు : వస్తున్నా నత్తయ్యా!

అ: ఏమే! అత్తయ్యా అని అనలేవూ? నత్తయ్యా, గిత్తయ్యా అని అనకపోతే

కో: నేను నత్తయ్యా అన్నానా? మడిగట్టుకుని గూడ వున్నారు, అబద్ధమాడ కత్తయ్యా! మైల పడిపోతారు.

అ: ఇప్పుడేమన్నావ్! కత్తయ్యా అనలేదటే! పరమ సాత్వికురాలిని నన్నే కత్తయ్యా అంటావా!

కో: అయ్యో! నా ఖర్మకొద్దీ దొరికా రత్తయ్యా మీరు!

అ: మళ్ళీ ఇంకో కొత్త కూత! ఇప్పుడు రత్తయ్యా అని అన్నావా లేదా?

కో: అయ్యో! నా రాత! అది సంధి. మీరు తెలుగు సరిగ చదువుకోలేదత్తయ్యా!

అ: మరో మాయదారి కూత. దత్తయ్యా అట! వాడెవడు? అయ్యో! అయ్యో! నేను నీలాగ చదువుకోలేదని నన్ను నత్తయ్యా, కత్తయ్యా , రత్తయ్యా, దత్తయ్యా అంటూ వెధవ పేర్లతో పిలుస్తావటే! అబ్బాయిని ఇంటికి రానీ!

కో: అలా ఉడికిపోయి ఆయాసం తెచ్చుకోకండి. బిపి పెరుగుతుంది. మీరనుకున్నవన్నీ ‘ఉకారసంధి’ వలన ఏర్పడిన పదాలత్తయ్యా!

అ: ఓరి దేవుడో! నన్ను మళ్ళీ లత్తయ్యంటోంది నాయనో!

కో: 🤭

అ: మాట్లాడవే! ఇంకా ఏమనాలో తెలియటంలేదా?

కో: 🤭

అ: అమ్మాయ్! ఇందు! నిన్నే మాట్లాడవేం?

కో: 🤭

అ: నీలాగ ‘ఇందు’ బొందు అని కాకున్నా, లక్షణంగ సుబ్బమ్మ అని నా పేరు. అయినా నన్నేదో అనకుండ నువ్వుండలేవిందు!

కో: ఏమిటీ! నేను విందునా! అవున్లెండి ఎలాగూ రోజూ వేపుకు తింటున్నారు గదా! అనండి.

అ: అయ్యో! ఇప్పుడు నేనేమన్నాననే ఆ ఆఘాయిత్యం! ఇటు చూడిందు!

కో: ఏమిటీ! డిందూనా? సలక్షణమైన అమ్మవారి పేరుని డిందు, దిండు అని పిలుస్తారా! కళ్ళు పోతాయి.

అ: నా కళ్ళకే పెట్టావా ఎసరు! నేనలా అన్లేదు. కావాలంటే మీ మావగారి మీద ఒట్టేస్తానిందు!

కో: అదిగో మళ్ళీ! నిందు ఏమిటి సందు లాగ! మీ ఇళ్ళ లాగ మా పుట్టిల్లు సందుల్లో గొందుల్లో వుండదు!

అ: మధ్యలో పుట్టింటి గొడవెందుకే ఇప్పుడు? అయినా అత్తకోడళ్ళన్న తర్వాత సరదాగా మాట్లాడుకోవాలిందూ!

కో: సరదాలా? చట్టుబండలా? ఐనా లిందూ ఏమిటి, లింగు, లిటుకు లాగా? ఇంకా నయం- బొంగు అన్లేదు.

అ: అర్ధమైంది. నాతో పెట్టుకోడానికి ఇది నీకొక వంకిందూ!

కో: అదో మళ్ళీ! కిందూ ఏమిటి ? ఇదా మీ తెలుగు? మావగారు మొగల్సరాయ్ స్టేషన్ మాష్టర్ గా ముప్పైఏళ్ళు పని చేస్తే మాత్రం మీరంతా తెలుగు మర్చిపోతారా?

అ: ఎక్కడో పై లోకంలో వున్న ఆయన ఊసెందుకే ఇప్పుడు? దాహం వేస్తోంది. ఇంక ఆపిందూ!

కో: పిందూనా? మీరిలా నన్ను పిలుస్తున్నప్పుడు వింటే మా నాన్న ఉరేసుకుంటాడు. పిందు, కిందు - అసలిది తెలుగేనా? అయ్యో నాన్నా! ఈ బెంగాలీ అత్తగారిని నాకంటగట్టి నా కొంప కొల్లేరు చేసావా?

అ: బెంగాలీ ఏమిటే నీ అసాధ్యం కూలా! మావి శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ పుటకలే తల్లీ! ఈ బెంగాలీ పేర్ల కంటే ఆ నత్తయ్య, గత్తయ్య, దత్తయ్య బావున్నాయి. నీకు నచ్చిన పేరుతో నన్ను పిలుచుకోవే అమ్మాయ్! నోరార్చుకొని పోయింది నా నోట్లో కాస్త చల్లటి మంచినీళ్ళు పొయ్యవే నీకు పుణ్యముంటుంది!

అయ్యో బాబోయ్.నవ్వ లేక చచ్చాను.
మీరు కూడ హాయిగా నవ్వుకోండి.

అరణ(మద్రాసుమువ్వలు) దీనిని పంపారు.
117..

ఓంశ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 8 /16 /06 /2023
హృదయాన్ని వెలిగించు (చిన్న కధ )

ఒక సాధకుడు దైవత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నాడు.
ఎలాగయినా సాధన చేసి మూడవకన్ను (జ్ఞాననేత్రం) తెరుచుకునేలా చేసుకోవాలని చాలా ఆశగా ఉన్నాడు.
ఒక గుహలో తపస్సు చేసుకుంటున్న గురువుగారి దగ్గరకు వెళ్ళేడు.
గుహలోకి వెళ్ళేటప్పుడు అతనికి చిన్నవెలుగు కనిపించింది. దానికి దగ్గరగా వెళ్ళేకొద్దీ తగ్గిపోతూ చివరికి పుర్తిగా చీకటి అయిపోయింది.
ఆ కటిక చీకటిలో అతనికి చాలా భయంవేసి ఆర్తితో”ఓం నమశ్శివాయ” అని అరిచాడు.
ఆ పిలుపు విన్న గురువుగారు ఎవరది అని అడిగారు.
మీ అనుగ్రహం కోసం వచ్చాను అని సాధకుడు చెప్పేడు.
ఆ గురువుగారు ఆ గుహలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు.
ఈ సాధకుడిని పరీక్షించాలని అక్కడ ఉన్న దీపం వెలిగించమని చెప్పారు.
సాధకుడు ప్రయత్నించినా అది వెలగలేదు. అగ్గిపెట్టెలో ఉన్న పుల్లలు అన్నీ అయిపొయాయి, కాని దీపం వెలగడం లేదు అని సాధకుడు గురువుగారితో చెప్పాడు.
అప్పుడు ఆ గురువుగారు ఆ ప్రమిదలో ఉన్న నీటిని తీసివేసి, నూనెతో నింపి వెలిగించమని చెప్పారు.
సాధకుడు అలా ప్రయత్నించినా కూడాఅది వెలగలేదు.
అప్పుడు గురువుగారు ప్రమిదలో ఉన్న వత్తి నీటిలో నానిపోయి ఉంటుంది కాబట్టి దానిని బాగ ఆరబెట్టి అప్పుడు ప్రయత్నించమని చెప్పారు.
అలా చేసి సాధకుడు దీపం వెలిగించగలిగాడు.

ఈసారి తనని అనుగ్రహించమని గురువుగారిని అడిగాడు.
గురువుగారు ఆశ్చర్యతో ఇంతసేపూ నీకు అనుగ్రహం పొందే మార్గమే కదా బోధించాను అన్నారు.
అప్పుడు సాధకుడు తన అజ్ఞానాన్ని క్షమించమని అర్థమయ్యేలా చెప్పమని అడిగాడు.
గురువుగారు ఈ విధమగా వివరించారు.
నీ హృదయం అనే ప్రమిదలో వత్తి అనబడే ఆత్మ ఉంది.
అది ఇన్నాళ్ళూ కోరికలు, లోభం, అసూయ,అహంకారం మొదలైన దుర్గుణాలు అనే నీటిలో నానిపోయిఉంది.
అందువల్ల నువ్వు జ్ఞానం అనే దీపాన్ని వెలిగించ లేకపోతున్నావు.
అవన్నీ తీసివేసి నీ హృదయాన్ని వెలిగించు.
--((***))--
--(())--
118

యోగి వేమన

చాలా మందికి వేమన గురించి....
సినిమా వాళ్ళు ఎంత చూపించారో అంతే తెలుసు.....
కానీ వాస్తవం వేరు.....!!

ఈయన అసలు పేరు "" బెదమ కోమటి చిన వేమారెడ్డి ""....
ఈయన అన్న పేరు ""బెదమ కోమటి పెద వేమారెడ్డి"".....
అప్పటి 'కడప, కర్నూలు & అనంతపురం' కలిపి ఒకే రాజ్యంగా ఉండేవి....
దానికి సామంత రాజు బెదమకోమటి పెదవేమారెడ్డి గారు.
అతని మంత్రి "తురగారాముడు"...
తురగారాముడు ఎలాగైనా అన్న-దమ్ములిద్దరినీ చంపి
తాను రాజు కావాలని ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటాడు...

ఇప్పుడు మనం చినవేమారెడ్డి ని వేమన అని పిలిచుకుంటున్నాము....
ఇతడు మహా ధైర్యవంతుడు...
పేరుకే   అన్నగారు రాజు...
కానీ మొత్తం రాజ్యం వేమన్న ధైర్యసాహసాలు - కనుసన్నులలో ఉంటుంది....
అతని ధైర్యానికి ఉదాహరణ...
ఒక మదపుటెద్దు ఊరి మీద పడి అందరినీ కుమ్ముతూ
హడలెత్తిస్తూ ఉంటుంది...
అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతూ వుంటారు...
ఎద్దుకు మదమెక్కితే దాన్ని ఆపడం  ఏ పహిల్వాన్ చేత కూడా కాదు....
అటుగా వస్తున్న వేమన మీదికి వెళుతుంది....
అది ముందరికి రాగానే ఒక్కసారిగా గట్టిగా దాని కళ్ళలోకి చూసి   ""ఏయ్"'  అని గద్ధిస్తాడు...
ఆ శబ్దం ఆ ఎద్దు చెవులనుంచి దూరి ఊరి మొత్తం ప్రతిధ్వనిస్తుంది.....
దాని కళ్ళకు వేమన మహా సింహం లాగా కనిపిస్తాడు.... హడలెత్తి తోకముడుచుకొని పారిపోతుంది....

దాన్ని ప్రత్యక్షంగా చూసిన తురగారాముడు ముందు
వేమన్నను మట్టు బెడితే గానీ తన పని సులువు కాదని,,,
వేమన ఉన్నంత వరకూ తానేమీ చేయలేనని తెలుసుకుంటాడు...
తన దృష్టిని వేమన మీద ఉంచుతాడు....

వేమనకు భోగగత్తెల ( వేశ్యల ) సాంగత్య కాంక్ష ఎక్కువ....
ఎక్కడైనా కొత్తగా భోగసానిగా వృత్తిలోకి వచ్చింది అంటే
ఈయనే  ముందు వెళ్ళేవాడు....
వేమనకు " విశ్వద " అనే ఒక ప్రేయసి కూడా ఉంటుంది...
వేమన అంటే ఆమెకు చాలా ఇష్టం....
ఎన్నోసార్లు తన రాజ్యం గురించి,,,,తాను నిర్వర్థించాల్సిన ధర్మం గురించి అనేక సార్లు హెచ్చరిస్తూ ఉంటుంది....
కానీ వేమన అవేమీ పట్టించుకునేవాడు కాదు....!!

మీరు శరీర అందం వెనుక పరిగెడుతున్నారు....
కానీ అది శాశ్వతమ్ కాదు ....
అందం వెనుక అందవికారం కూడా దాగి ఉంటుంది...
యవ్వనంలో కనపడినట్లు ఈ శరీరం ముసలితనంలో
తన ప్రాభవం కోల్పోతుంది ...
"ఏదైతే ఇప్పుడుండి ఇక మీదట ఉండదో దాని కొరకు
మీరు పరిగెడుతున్నారు....
మీరు కాస్త ఆగి యోచించాలని హెచ్చరిస్తుంది"....
కానీ వేమన పట్టించుకునే వాడు కాదు....
తురగారాముడి కుయుక్తులను కూడా గుర్తు చేస్తుంది...కానీ ఫలితం ఉండదు....

అప్పుడే దసరా తిరునాళ్ళు మొదలవుతాయి....
వెంపల్లి సంబరాలకు ముస్తాబవుతుంది....
ఆ తిరునాళ్ళలో మహా అందెగత్తె ""మాంచాల నాగులు""  భోగమాటను ప్రారంభిస్తుంది....
ఆమె గురించి ఆ నోటా,,,ఈ నోటా,,,వేమనకు చేరుతుంది...
వేమన ఒక సారి వెంపల్లెకు వెళ్లి చూస్తాడు.....
ఆమె అందానికి దాసుడై పోతాడు....

ఇక తన మకాం పూర్తీగా వెంపల్లె నాగుల యింటికి మారుస్తాడు....
ఓ ప్రేయసీ కంటే ఎక్కువగా అభిమానిస్తాడు.
నెలలు గడుస్తాయి.....
నెలల కొద్దీ ఇంటికి రాకపోయే సరికి అన్నకు వదినకు సందేహం కలుగుతుంది....
వేమన నాగుల అనే వేశ్య ఇంట్లో పరిమితమయ్యాడని తెలుసుకుంటారు..
డబ్బులన్నీ ఇలా ఆమెకు దారపొయ్యడం మంచిది కాదని,,,
రాజ్యం శిస్తులన్నీ వాడుకోవడం ధర్మం కాదని..
రాజ్యం పరిపాలన దెబ్బతింటుందని వదిన వారిస్తుంది ....

" విశ్వద " కు వేమన్న భవిష్యత్తు కళ్లముందర కనిపిస్తుంది..
అతని భవిష్యత్తు అంధకారమై పోతుందని గ్రహించి...
సత్యం చెప్పే తీరాలని నిర్ణయించి వేమన్నను పిలిచి..
తొందరలోనే మీరు మరణించబోతున్నారు...
శరీరానికి నెలలు కాదు... రోజులు మాత్రమే ఉన్నాయి...
ఈ శరీరం దేనికోసం తీసుకున్నావో దానిని ఇక మీరు నిర్వర్తించ లేరు...
ఇప్పటికైనా మేల్కొనండి....
జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోండి...
ఆ మార్గంలోకి వెళ్లే ప్రయత్నం చెయ్యండి అంటుంది...

వేమన పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు...
వేమన ""నాగుల"" కి పచ్చి బానిస అయ్యాడని గ్రహించిన
తురగారాముడు వెళ్లి నాగులను లోబర్చుకుంటాడు....
కొంత మంది సైన్యాన్ని కూడా లోబర్చుకుని ఉంటాడు...
సైన్యంతో నాగుల దగ్గరకు వెళ్లి ఆమె చేతికి విషం ఇచ్చి దాన్ని వేమన మీదికి ప్రయోగం చేయవలసిందిగా చెబుతాడు....
దానికి గానూ ఆమెకు డబ్బు,,,
జాగీరు ఎరగా చూపుతాడు....
చెయ్యకపోతే తానే వేమన్నను చంపి ఆ అభియోగం నీమీదికి తీసుకొస్తానని బెదిరిస్తాడు....
చేసేది లేక ఆమె ఒప్పుకుంటుంది....

ఒక అమావాస్య రోజు పాయసం చేసి భోగలాలసలో వున్నప్పుడు తాగమని ఇస్తుంది....
వేమన తన ప్రేయసి ఎంతో ప్రేమతో చేసిందని తాగుతాడు....
అంతే పూర్తీగా దాదాపు శరీరాన్ని వదిలేసినంత కోమాలోకి వెళ్ళిపోతాడు..
నాగులు తురగారామునికి పని పూర్తీ అయిందని కబురు బెడుతుంది...
తురగారాముడు తన సైన్యాన్ని పురమాయించి శవాన్ని దట్టమైన కారడవులలో వేయించేస్తాడు....

ఆ అడవులలో అభిరామ  అనే వైద్యుడు ఆకుల రసాలతో ఇనుమును బంగారంగా చేసే విద్యను నేర్చుకుంటూ ఉంటాడు....
ఒక రోజు ఆకుల కోసం వెళ్ళినప్పుడు వేమన్న శవాన్ని చూస్తాడు....
అతని నాడిని చూసి ఎక్కడో ఒక మూల ప్రాణం ఉందని గ్రహించి అతన్ని తీసుకెళ్లి తన వైద్యం తో బ్రతికిస్తాడు....

మెలకువ వచ్చిన తర్వాత వేమన ఏమీ మాట్లాడేవాడు కాదు....
మౌనంగా కూర్చునేవాడు...
ఏ వివరాలూ ఎంత అడిగినా చెప్పేవాడు కాదు...
మహా మౌనంగా ఉండేవాడు...
తాను చేసే వైద్య వృత్తిలో కాస్త మక్కువ చూపేవాడు....
విశ్వద చెప్పిన సత్యం   _నాగులు , తురగారాముడు_ చేసిన మోసం కళ్ళముందు కదిలేవి....
తానే యామరపాటుగా ఉన్నానని తెలుసుకునే వాడు..
ఆకులు అలముల కోసం అప్పుడదప్పుడూ అడవులకెళ్లి తెచ్చేవాడు....

అభిరాముడు ..తన గురువుగారైన విశ్వకర్మ యోగి ని కలిసి జ్ఞానాన్ని తెలిసుకుంటూ ఉండేవాడు....
ఒక రోజు విశ్వకర్మయోగి తాను శరీరం వదిలేస్తున్నానని,,,
తాను సంపాదించిన జ్ఞానాన్ని తనకు వాహకత్వం ఇస్తానని రేపు రావలసిందిగా చెబుతాడు...
అలాగే అని చెప్పి అభిరాముడు వెళ్ళిపోతాడు...

మరుసటి రోజు అభిరాముడు ఆకుల కోసమని వేమనతో చెప్పి బయలుదేరుతాడు...
దారిమధ్యలో ఒక పులి కనబడడంతో పరుగులు పెడతాడు....
దాంతో ఆ అడవులలో దారి తప్పిపోతాడు......
అభిరాముడు ఎంతకూ ఆకులు తీసుకురాలేదని గ్రహించి చీకటి పడుతుండడంతో వేమన బయలుదేరుతాడు....

వేమన సరాసరి విశ్వకర్మయోగి ఉన్న గుహలోకి వెళతాడు.....
విశ్వకర్మయోగి చెందవలసిన వాడు,,,,
రావలసిన వాడు రానే వచ్చాడు ,,
అని వేమన్నను పిలిచి ధ్యాన,,,జ్ఞాన,విద్యను నేర్పించి,,
మూడొకన్నును ఉద్దేపనం చెందించి వాహకత్వం ఇచ్చి శరీరం వదిలేస్తాడు....
ఆ క్షణమే వేమనకు జగత్తు సత్యం అర్థమైపోతుంది....
అంతలోనే అభిరాముడు అక్కడికి చేరుకుంటాడు....
తాను పొందవలసిన దాన్ని పొందలేక పోయానని బోనాకిష్టమై...

వేమన దానికి అభిరామా....దుఃఖిించకు ,,భాధ పడకు,,,
నా ప్రేయసి నా కళ్ళు ఎన్నోసార్లు తెరిపించినప్పటికీ నేను పెడచెవిన పెట్టాను....
ఈ రోజు నువ్వు పొందవలసిన దాన్ని దైవం ఇచ్చలో భాగంగా నేను పొందడం జరిగింది...

విస్వద...అభిరామా ఇద్దరూ చెబుతూ వుంటే వేమన్న వింటున్నట్టుగా ప్రపంచానికి తెలియపరుస్తానుఅని చెబుతాడు...

విస్వద అభిరామా ఇద్దరూ కలిసి వినరా వేమా...
అని నాకు భోధిస్తున్నట్టుగా,,,చెబుతున్నట్టుగా  ప్రపంచానికి చెబుతాను అని చెబుతాడు ...
అందుకే ..
విశ్వదాభిరామా  వినురావేమా ..

--(())--




.. 🌹రద్దీగా ఉన్న విమానంలోకి ఒక అందమైన ప్రయాణికురాలు ప్రవేశించి తన సీటు కోసం వెతుకసాగింది.

రెండు చేతులు లేని ఒక వ్యక్తి ప్రక్క తన సీటు ఉండడాన్ని చూసి, అతని ప్రక్కన కూర్చోవడానికి సందేహించింది.......!!!

ఆ "అందమైన స్త్రీ "ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ..

" నేను ఇక్కడ కూర్చుని సుఖంగా ప్రయాణం చేయలేను. నా సీటును మార్చగలరా?'' అని అడిగింది.

"మేడమ్! దయచేసి కారణం తెలుసుకోవచ్చా?" అడిగింది ఎయిర్ హోస్టెస్.

" ఇలాంటి వారంటే నాకు అసహ్యం.వీరి ప్రక్కన కూర్చుని ప్రయాణించడం నాకు ఇష్టం ఉండదు." అంది ఆ అందమైన స్త్రీ.

చూడడానికి హుందాగా - అందంగా - నాగరికంగా కనిపిస్తున్న ఆమె నోటి నుండి వచ్చిన ఈ మాటలను విని ఎయిర్ హోస్టెస్ చాలా ఆశ్చర్యపోయి చూసింది.

ఆ అందమైన స్త్రీ మళ్లి తనకు "ఈ సీటు వద్దు. మరో సీటు కావాలని డిమాండ్ చేసింది."

"కొద్దిసేపు ఓపిక పట్టండి. నేను మీకోరికను నెరవేర్చే ప్రయత్నం చేస్తాను." అని ఎయిర్ హోస్టెస్ ఎక్కడైనా సీటు ఖాళిగా ఉందేమోనని వెతికింది. కాని ఎక్కడా దొరకలేదు.

ఆ ఎయిర్ హోస్టెస్ తిరిగి వచ్చి "మేడమ్! ఈ ఎకనామి క్లాస్ లోని సీట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. అయినా మా విమానంలో ప్రయాణించే వ్యక్తుల కంఫర్ట్ కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నించడం మా ఫాలసి. కెప్టెన్తో మాట్లాడి వచ్చి చెబుతాను కాస్త ఓపిక పట్టండి." అంటూ కెప్టెన్ దగ్గరికి వెళ్లింది.

కొన్ని క్షణాల తరువాత తిరిగి వచ్చి " మేడమ్! మీకు కలిగిన అసౌఖర్యానికి చింతిస్తున్నాము. ఈ విమానం మొత్తంలో ఫస్ట్ క్లాసులోని ఒకే ఒక సీటు ఖాళిగా ఉంది.మావాళ్లతో మాట్లాడి ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాము. ఒక ఎకనామి క్లాస్ లోని వ్యక్తిని ఫస్ట్ క్లాసులోకి పంపడం మా కంపని చరిత్రలోనే మొదటిసారి.....

ఆ అందమైన స్త్రీ ఆనందంగా ఏదో చెప్పబోయే లోపల ....

ఎయిర్ హోస్టెస్ ఆమె పక్కసీట్లో కూర్చున్న వ్యక్తితో...

" సార్! దయచేసి ఎకనామి క్లాస్ నుండి ఫస్ట్ క్లాసులోకి రాగలరా? ఒక సంస్కారం తెలియని వ్యక్తి ప్రక్కన కూర్చుని ప్రయాణించవలసిన దురదృష్టాన్ని మేము మీకు తప్పించాలనుకుంటున్నాము." అంది.

ఎయిర్ హోస్టెస్ మాటలను విన్న మిగతా ప్రయాణికులందరూ ఒక్కసారిగా.. చప్పట్లు చరుస్తూ ఆ నిర్ణయాన్ని స్వాగతించసాగారు.

ఆ అందమైన స్త్రీ ముఖం పాలిపోయింది.

అప్పుడా వ్యక్తి లేచి నిలుచుని ...

"నేనొక మాజి సైనికుడిని.కాశ్మీర్ బోర్డర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో నా రెండు చేతులను కోల్పోయాను.

మొదట ఈమె మాటలు విన్న తరువాత 'ఇలాంటి వాళ్ల కోసమా మా జీవితాన్ని ఫణంగా పెట్టింది.' అనిపించింది.

కాని, మీ అందరి ప్రతిస్పందన చూశాకా దేశం కోసం నా రెండు చేతులను కోల్పోయినందుకు గర్వపడుతున్నాను."

...... అంటూ ప్రయాణికుల చప్పట్ల మధ్య ఫస్ట్ క్లాసులోకి వెళ్లిపోయాడు.

ఆ అందమైన స్త్రీ రెండు సీట్లలోనూ ఒక్కతే సిగ్గుతో కూలబడిపోయింది.....

అందం అంటే కంటికి కనిపించే

ముఖంలోనూ,మేనులో కాదు..

ఉన్నతమైన అలోచనలు 

ఉన్నతమైన భావాలు ఉన్న

మంచి మనసులో ఉంటుంది...

( FROM A FRIENDS WALL )



*🧘‍♂️150) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 15*

*సత్యం ఏకం - అదే ఆత్మ, బ్రహ్మం*

*శ్లోకం 09:-*


*गुणैः संवेष्टितो देहस्तिष्ठत्यायाति याति च ।*

*आत्मा न गन्ता नागन्ता किमेनमनुशोचसि ॥ १५-९ ॥*


*గుణైః సంవేష్టితో దేహస్తిష్ఠత్యాయాతి యాతి చ ।*

*ఆత్మా న గంతా నాగంతా కిమేనమనుశోచసి ॥ 15-9 ॥*


శ్లో|| గుణైస్సంవేష్టితో దేహస్తిష్ఠత్యాయతి యాతి చ | 

ఆత్మా న గన్తా నాగన్త కిమేనమనుశోచసి || 9.


*gunaih’ samvesht’ito dehastisht’hatyaayaati yaati cha ।*

*aatmaa na gantaa naagantaa kimenamanushochasi ॥ 15-9 ॥*


*టీకా*


 గుణైః = గుణములతో, సంవేష్టితః = చుట్టబడినదై, దేహః = దేహము, తిష్ఠతి = ఉంటున్నది, సః = అది, అయాతి = వచ్చుచున్నది, యాతి = పోవుచున్నది, ఆత్మా = జీవాత్మ, న గన్తా =  పోవునది కాదు, న ఆగన్తా = వచ్చునది కాదు, కిం = ఎందు కొఱకు, ఏనం = దీనిని గూర్చి, అనుశోచసి = దుఃఖించుచున్నావు? 


*వివరణ:-*


ప్రకృతిలోని పంచభూతాలతో నిర్మింపబడి శరీరం పుడుతున్నది. జీవిస్తున్నది, నశిస్తుంది. ఆత్మ రావడమూ లేదు, పోవడమూ లేదు. దేనిని గురించి విచారిస్తున్నావు?


*తాత్పర్యం:-*


పంచభూతాలతో నిర్మింపబడిన శరీరం మరల అందులో కలిసిపోవలసిందే. శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. బాహ్యంగానూ అంతరంగానూ మన వాసనల కనుగుణంగా అనుభవాల నందించడం కోసం శరీరం రూపుదాల్చింది. ఈ శరీరంలో అహంకారం ఏర్పడి, వశిస్తూ, శరీరంతో అనుభవాలను పొందుతూ ఉంటుంది.


 ఈ విధమయిన ఇన్నిరకాల స్థితులలోనూ, సర్వాన్నీ తెలియబడేలా చేస్తూ ఉంటుంది • చైతన్యం. అనాదీ అచలమూ అయిన ఆత్మ ఎక్కడనుండీ రానూ లేదు. ఎక్కడికీ పోవడమూ లేదు. ఆత్మ మార్పు చెంది రూపుదాల్చలేదు, జీవించలేదు, చనిపోలేదు. ఎప్పుడూ స్థిరంగా ఉంటూ అన్నిటినీ ప్రకాశింప చేస్తున్నది,


ఇది నిత్యం,సత్యం,ఆ పరమాత్మే నీ సహజస్వరూపం అయితే శరీరం మరణించి నప్పుడు ఎందుకు దుఃఖిస్తున్నావు? సముద్రంలో అలలు కరిగిపోయినంత మాత్రాన సముద్రం వాటికోసం దుఃఖిస్తుందా?


ఇక్కడ వర్ణింపబడిన భావమూ విధానము కూడా భగవద్గీతను గుర్తుకు తెస్తున్నాయి. (భగవద్గీత 2వ-11,13,16,18)


అశోచ్యానన్వశోచస్త్వం 

ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।


గతాసూనగతాసూంశ్చ 

నానుశోచన్తి పణ్డితాః ॥11


శ్రీ కృష్ణభగవానుడు చెప్పెను - (ఓ అర్జునా !) నీవు శోకింపదగని వారిని గూర్చి శోకించితివి. పైగా బుద్ధివాదముతో గూడిన వాక్యములనుగూడా పలుకుచున్నావు. జ్ఞానులగు వారు మరణించిన వారిని గుఱించిగాని, జీవించియున్నవారిని గుఱించిగాని యెన్నటికిని దుఃఖింపరు.


దేహినోஉస్మిన్ యథా దేహే 

కౌమారం యౌవనం జరా ।


తథా దేహన్తరప్రాప్తిః

ధీర స్తత్ర న ముహ్యతి ॥13


జీవునకు ఈ శరీరమునందు బాల్య, యౌవన, వార్ధక్యములను అవస్థ లెట్లు కలుగు చున్నవో అట్లే మరణాంతరము మఱియొక శరీరమును బొందుటయు తటస్థించుచున్నది. కావున ఈ విషయమున జ్ఞానియగువాడు ఎంతమాత్రమును మోహమును (శోకమును) జెందడు.


నాసతో విద్యతే భావో 

నాభావో విద్యతే సతః ।


ఉభయోరపి దృష్టోஉన్తః

త్వనయో స్తత్త్వదర్శిభిః ॥16


అసత్యములై (నామరూపాత్మకములై , నశించు స్వభావము గలవియై) నట్టి దేహాదులకు ఉనికిలేదు, సత్యమైనట్టి ఆత్మకు లేమిలేదు. తత్వజ్ఞానులగువారీ రెండింటి యొక్క నిశ్చయమును బాగుగ తెలుసుకొనియున్నారు.


అన్తవన్త ఇమే దేహా 

నిత్యస్యోక్తా శ్శరీరిణః ।


అనాశినోஉప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ॥18


ఓ అర్జునా! నిత్యుడును, నాశరహితుడును, అప్రమేయుడును అగు దేహి(ఆత్మ) యొక్క ఈ దేహములు నాశవంతములుగ జెప్పబడినవి. (ఆత్మయో శాశ్వతుడు) . కాబట్టి (ఆత్మనుగూర్చికాని, దేహమునుగూర్చికాని శోకమును వదలి) నీవు యుద్ధము చేయుము.


🕉️🌞🌍🌙⭐🚩


*🧘‍♂️151) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 15*

*సత్యం ఏకం - అదే ఆత్మ, బ్రహ్మం*

*శ్లోకం 10:-*


*देहस्तिष्ठतु कल्पान्तं गच्छत्वद्यैव वा पुनः ।*

*क्व वृद्धिः क्व च वा हानिस्तव चिन्मात्ररूपिणः ॥ १५-१० ॥*


*దేహస్తిష్ఠతు కల్పాంతం గచ్ఛత్వద్యైవ వా పునః ।*

*క్వ వృద్ధిః క్వ చ వా హానిస్తవ చిన్మాత్రరూపిణః ॥ 15-10 ॥*


శ్లో|| దేహస్తిష్ఠతు కల్పాంతం గచ్ఛత్వ ద్యైవ వా పునః I 

క్వవృద్ధిః క్వ చ వా హానిః తవ చిన్మాత్ర రూపిణః|| 10.


*dehastisht’hatu kalpaantam gachchhatvadyaiva vaa punah’ ।*

*kva vri’ddhih’ kva cha vaa haanistava chinmaatraroopinah’ ॥ 15-10 ॥*


  *టీకా*


 దేహః పునః = దేహమయితే, కల్పాంతం = కల్పాంతమువరకు, తిష్ఠతు = ఉండుగాక!, వా = లేక, అద్యైవ = ఇప్పుడే, గచ్ఛతు = పోవుగాక, చిన్మాత్రరూపిణః = జ్ఞానమాత్ర స్వరూపుడవగు, తవ = నీకు, వృద్ధిః = వృద్ధి, క్వ = ఎక్కడ, హానిః = హాని, క్వ = ఎక్కడ?


*వివరణ:-*


శరీరం కల్పాంతమూ ఉన్నా, ఈ దినమే నశించినా, నీకు కలిగే హాని ఏమీ లేదు. నీవు నిత్యంగా ఆత్మ చైతన్యంగా ఉన్నావు.


*తాత్పర్యం:-*


మనస్సుకోరే కోరికలకు అనుగుణంగా శరీరం చైతన్యంలో పుట్టి పెరిగి నశిస్తుంది. ఈ ప్రపంచమంతా స్థితి కలిగి ఉన్నా, నశించినా, ఆత్మకు ఏవిధమయిన హానీ జరుగదు.



 స్తంభంలో భూతభ్రమ కలిగినా నశించినా స్తంభం మార్పు చెందనట్టే. చిత్తశుద్ధి కలిగిన సాధకుడు మృత్యువునకు భయపడవలసిన అవసరం ఏముంది?


శరీరానికి ఆత్మతో ఏవిధమైన సంబంధమూ లేదు. నిత్యమైన ఆత్మవే నీవు.


 🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️152) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 15*

*సత్యం ఏకం - అదే ఆత్మ, బ్రహ్మం*

*శ్లోకం 11:-*


*त्वय्यनन्तमहाम्भोधौ विश्ववीचिः स्वभावतः ।*

*उदेतु वास्तमायातु न ते वृद्धिर्न वा क्षतिः ॥ १५-११ ॥*


*త్వయ్యనంతమహాంభోధౌ విశ్వవీచిః స్వభావతః ।*

*ఉదేతు వాస్తమాయాతు న తే వృద్ధిర్న వా క్షతిః ॥ 15-11 ॥*


శ్లో|| త్వయ్యనన్త మహామ్భోధౌ విశ్వవీచిః స్వభావతః | 

ఉదేతువాఽస్త మాయాతు న తే వృద్ధిర్నవా క్షతిః ||11.


*tvayyanantamahaambhodhau vishvaveechih’ svabhaavatah’ ।*

*udetu vaastamaayaatu na te vri’ddhirna vaa kshatih’ ॥ 15-11 ॥*



అనన్తమహామ్భోధౌ = అపార మహాసముద్రుడవగు, త్వయి = నీయందు, విశ్వవీచిః = ప్రపంచరూప తరంగములు, స్వభావతః = స్వాభావికముగనే, ఉదేతు =  ఉదయించునుగాక, వా = లేక, అస్తం ఆయాతు = అస్తమించునుగాక, తే = నీకు, వృద్ధిః = వృద్ధి, న = లేదు, క్షతిః = నాశమున్ను, న = లేదు.


*వివరణ:-*


చైతన్యసాగరమయిన నీలో ప్రపంచ దృశ్యాలయిన తరంగాలు ఎన్ని కదలాడినా నీకు వృద్ధి క్షయములు ఉండవు.


*తాత్పర్యం:-*


ఈ గీతలో ఆరవ అధ్యాయం రెండవ శ్లోకంలోని భావమే ఇక్కడ మళ్ళీ చెప్పబడింది. ఆత్మలో ప్రపంచం ఉన్నట్టుగా స్పురిస్తూ లయం అవుతుంది.



దీనివలన ఆత్మకు ఏవిధమయిన మార్పూ సంభవించడం లేదు. ప్రపంచ సృష్టి స్థితి లయములు మనఃకల్పిత భ్రమలు మాత్రమే.



అహంకారానికి మాత్రమే అనుభవయోగ్యమయిన ఈ ప్రపంచం, ఆత్మ చైతన్యంలో లేనే లేదు. స్వప్నాలు వచ్చినా పోయినా జాగ్రతం పురుషునికి ఏ విధంగానూ సంబంధం లేనట్టే.


🕉️🌞🌍🌙⭐🚩

*🧘‍♂️153) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 15*

*సత్యం ఏకం - అదే ఆత్మ, బ్రహ్మం*

*శ్లోకం 12:-*


*तात चिन्मात्ररूपोऽसि न ते भिन्नमिदं जगत् ।*

*अतः कस्य कथं कुत्र हेयोपादेयकल्पना ॥ १५-१२ ॥*


*తాత చిన్మాత్రరూపోఽసి న తే భిన్నమిదం జగత్ ।*

*అతః కస్య కథం కుత్ర హేయోపాదేయకల్పనా ॥ 15-12 ॥*



శ్లో|| తాత! చిన్మాత్రరూపోఽసి న తే భిన్నమిదం జగత్ |

అతః కస్య కథం కుత్ర హేయోపా దేయ కల్పనా ||12.


*taata chinmaatraroopo’si na te bhinnamidam jagat ।*

*atah’ kasya katham kutra heyopaadeyakalpanaa ॥ 15-12 ॥*


*టీకా*


 తాత = నాయనా! (త్వం = నీవు), చిన్మాత్రరూపః = చైతన్యమాత్ర స్వరూపుడవు, అసి = అగుచున్నావు, ఇదం = ఈ, జగత్ ప్రపంచము, తే = నీకంటే, భిన్నం = భిన్నమైనది, న = కాదు, అతః = ఈ కారణమువలన, హేయోపాదేయ కల్పనా = త్యాజ్య గ్రహణముల యొక్క కల్పన, కస్య = ఎవనికి?, కథం = ఎట్లు? కుత్ర = ఎక్కడ? 


*వివరణ:-*


కుమారా! శుద్ధచైనత్య రూపానివి నీవు. ఈ జగత్తు నీ నుండి విడిగా లేదు. అయినప్పుడు, ఎక్కడ (?) ఎందుకు (?) ఏవిధంగా (?) నీలో స్వీకార నిరాకరణ భావాలు ఉండగలవు ?


*తాత్పర్యం:-*


ఎవరైనా తనను తాను ఏవిధంగా యిష్టంగాని అయిష్టంగాని పడగలరు? ఉన్నదంతా ఒకే ఒక చైతన్యం, అదే నేను, అయినప్పుడు నేను స్వీకరించవలసిన దేముంటుంది? రెండవదేదీ లేనప్పుడు నేను నిరాకరించవలసినది మాత్రం ఏది?


దేనినైనా సత్యమనిగాని అసత్యమనిగాని భావించినా ఆ భావాలన్నీ మనస్సుకు చెందినవి మాత్రమే. శుద్ధ చైతన్యమయిన నాకు మనస్సే లేదు. ఇక మనో భావాలతో నాకు నిమిత్త మేముంది?


యోగవాశిష్ఠంలో ఇదే భావం ఇలా వ్యక్తీకరించబడింది.


విచిత్రవర్ణతా యద్వద్ దృశ్యతే కఠినాత పే


విచిత్ర శక్తితా తద్వద్ దేవేశ సదసన్మయీ. (యోగవాశిష్ఠం.) 


మధ్యవేసవికాలపు మధ్యాహ్నంలో ఆకాశంలో అనేక రంగులు గోచరిస్తాయి. ఇదే విధంగా సగుణ నిర్గుణ స్వరూపమయిన "భగవంతునిలో అద్భుతంగా అనేక లీలలు కనిపిస్తాయి.


🕉️🌞🌏🌙🌟🚩

*🧘‍♂️154) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 15*

*సత్యం ఏకం - అదే ఆత్మ, బ్రహ్మం*

*శ్లోకం 13:-*


*एकस्मिन्नव्यये शान्ते चिदाकाशेऽमले त्वयि ।*

*कुतो जन्म कुतो कर्म कुतोऽहङ्कार एव च ॥ १५-१३ ॥*


*ఏకస్మిన్నవ్యయే శాంతే చిదాకాశేఽమలే త్వయి ।*

*కుతో జన్మ కుతో కర్మ కుతోఽహంకార ఏవ చ ॥ 15-13 ॥*


శ్లో|| ఏకస్మిన్నవ్యయే శాన్తే చిదాకా శేఽమలే త్వయి | 

కుతో జన్మ కుతః కర్మ కుతోఽహంకార ఏవ చ || 13.


*ekasminnavyaye shaante chidaakaashe’male tvayi ।*

*kuto janma kuto karma kuto’hankaara eva cha ॥ 15-13 ॥*


*టీకా*


ఏకస్మిన్ = ఒకటి అయినటువంటిన్నీ, అమలే = నిర్మలమైనటువంటిన్నీ, అవ్యయే = అవినాశి అయినటువంటిన్నీ, శాన్తే = శాంతుడవైనటువంటిన్నీ, చిదాకాశే = చిదాకాశ రూపుడవునైన, త్వయి = నీయందు, జన్మ = జన్మము, కుతః= ఎక్కడ నుండి?, కర్మ = కర్మ, కుతః = ఎక్కడనుండి?, అహంకారః = అహంకారము, కుతఃతి = ఎక్కడనుండి? (భవతి = కలుగుచున్నది).   


*వివరణ:-*


పరిణామరహితము, శాంతము, చిత్స్వరూపము, నిష్కళంకము, ఏకము అయిన ఆత్మవు నీవు. నీలో జన్మ, కర్మ, అహంకారం, ఏదయినా ఎలా ఉండగలదు?


*తాత్పర్యం:-*


అద్వయమయిన అనంతసత్యం పరిణామరహితమై ఉండాలి. పరిణామం ఉంటే పరిమితమూ అనేకత్వమూ ఉంటాయి.

శుద్ధమైన చైతన్యము మనస్సు కతీతంగా ఉంది కాబట్టి ఇది నిత్యశాంతమై ఉండాలి.



 మానసిక కల్లోలాలేవీ మనస్సు కతీతమయిన చైతన్యాన్ని చేరలేవు కదా! చైతన్యప్రకాశం వాసనలను కూడా తెలియబడేటట్టు చేస్తుంది. కాబట్టి చైతన్యంలో వాసనలుండే అవకాశం లేదు. అందుచేత అది నిష్కళంకమైనది.



ఈ విధంగా "అవ్యయమూ శాంతమూ చిదాకాశమూ నిష్కళంకమూ అయిన ఆత్మే నీ నిజ స్వరూపం" అని అష్టావక్రులు నిస్సందేహంగా చెప్పుతున్నారు. సత్యాన్ని సరిగ్గా గ్రహించని అజ్ఞానం నుండి జనించిన జన్మ, జీవితం, అహంకారం, సహజంగా సత్యమైన నీలో ఉండజాలవు.



ఇందులో వాడబడిన "చిదాకాశం" అనే పదం యొక్క అర్థం అనంత గంభీరయుతం. యోగవాశిష్ఠం మొదలయిన గ్రంథాలలో ఈ మాట ఇక్కడ నుండి గ్రహింపబడి విరివిగా వాడబడి బహుళ ప్రచారం పొందింది.



ఆకాశమే ఆన్ని వస్తువులకు తనలో ఉనికిని స్థలాన్ని యిస్తోంది. ఆకాశంలోనే వస్తువులు ఉండి తెలియబడుతున్నాయి. మనం చూసే బాహ్య ప్రపంచంలోని వస్తువులన్నీ ఉండే ఆకాశాన్ని "మహాకాశం" అంటారు. ఆలోచనలు ఉనికి కలిగి తెలియబడే ప్రదేశాన్ని "చిత్తాకాశం" అంటారు.



సర్వాన్నీ తెలుసుకునే తెలివి కలిగిన బుద్ధి స్థానాన్ని "చిదాకాశం" అంటారు. ఈ చిదాకాశంలోనే అనంతమైన ఆత్మ స్వరూపం రేఖామాత్రంగా తెలియబడుతుంది. ఈ శ్లోకంలో సాధకుని సహజ స్వరూపం "చిదాకాశం" గా బోధించబడింది. 


🕉️🌞🌍🌙⭐🚩


*🧘‍♂️155) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 15*

*సత్యం ఏకం - అదే ఆత్మ, బ్రహ్మం*

*శ్లోకం 14:-*


*यत्त्वं पश्यसि तत्रैकस्त्वमेव प्रतिभाससे ।*

*किं पृथक् भासते स्वर्णात् कटकाङ्गदनूपुरम् ॥ १५-१४ ॥*


*యత్త్వం పశ్యసి తత్రైకస్త్వమేవ ప్రతిభాససే ।*

*కిం పృథక్ భాసతే స్వర్ణాత్ కటకాంగదనూపురం ॥ 15-14 ॥*


శ్లో|| యత్త్వం పశ్యసి తత్రైకః త్వమేవ ప్రతిభాస సే |

కిం పృథగ్భాసతే స్వర్ణాత్ కటకాంగదనూపురమ్ || 14.


*yattvam pashyasi tatraikastvameva pratibhaasase ।*

*kim pri’thak bhaasate svarnaat kat’akaangadanoopuram ॥ 15-14 ॥*


*టీకా*


 త్వం = నీవు, యత్ = దేనిని, పశ్యసి = చూచు చున్నావో, తత్ర = అచ్చట, ఏకః = ఒకడవైన, త్వమేవ = నీవే, ప్రతిభాససే = ప్రతిభాసించుచున్నావు, కటకొంగద నూపురం =  కడియములు, భుజకీర్తులు, అందెలు మొదలగు ఆభరణములు, స్వర్ణాత్ = బంగారముకంటే, పృథక్ = వేరుగా, భాసతే కిం =  భాసించునా?


*వివరణ:-*


నీచే చూడబడేదంతా నీవే అయి ఉన్నావు. గాజులు, హారాలు మొదలైన ఆభరణాలు మూల పదార్థమయిన బంగారం కంటే వేరుగా ఉండ గలవా?


*తాత్పర్యం:-*


అయినా బంగారు ఆభరణాలెన్ని రకాలైనా కేవలం నామరూపాలలోనే వేరుగా ఉంటాయి; అవన్నీ బంగారమే నామరూపాత్మకమయిన ఈ విశాల విశ్వమంతా నీ సహజ స్వరూపమయిన చైతన్యం నుండే ఉద్భవించింది. 


అయినప్పుడు ఈ విశాల విశ్వంలో నీవు కానిదేది? ఛాందోగ్యోపనిషత్తు ఈ విషయాన్నే ఇలా ధృవపరుస్తుంది.



సౌమ్యే కేన మృత్పిండేన 

సర్వం మృన్మయం విజ్ఞాతం !

స్యా ద్వాచారమ్భణం వికారో నామధేయం 

మృత్తి కేత్యేవ సత్యమ్!!

(ఛాందోగ్యోపనిషత్తు)


ప్రియమైన కుమారా! ఒక మట్టి ముద్ద నీకు తెలిస్తే మట్టితో తయారు కాబడిన సర్వవస్తువులూ తెలిసినట్టే. నిజానికి వాటిలో ఉన్నదంతా మట్టే నామరూపాలు మాత్రమే వేరు.


సంగ్రహముగా చెప్పాలంటే కార్యములన్నీ కారణము యొక్క రూపాంతరములే. ఇదే విధంగా ఈ విశాల విశ్వమంతా చైతన్యమయమయిన ఆత్మే వేరే రూపంలో అనుభవింపబడుతున్నది.


🕉️🌞🌍🌙⭐🚩


*🧘‍♂️156) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 15*

*సత్యం ఏకం - అదే ఆత్మ, బ్రహ్మం*

*శ్లోకం 15:-*


*अयं सोऽहमयं नाहं विभागमिति सन्त्यज ।*

*सर्वमात्मेति निश्चित्य निःसङ्कल्पः सुखी भव ॥ १५-१५ ॥*


*అయం సోఽహమయం నాహం విభాగమితి సంత్యజ ।*

*సర్వమాత్మేతి నిశ్చిత్య నిఃసంకల్పః సుఖీ భవ ॥ 15-15 ॥*


శ్లో|| అయం సోఽహమయం నాహం విభాగమితి సంత్యజ | 

సర్వమాత్మేతి నిశ్చిత్య నిస్సంకల్ప స్సుఖీభవ || 15.


*ayam so’hamayam naaham vibhaagamiti santyaja ।*

*sarvamaatmeti nishchitya nih’sankalpah’ sukhee bhava ॥ 15-15 ॥*


*టీకా*


  సః = ఆ, అయం = ఇతడు, అహం = నేను, అయం = ఇతడు, నాహం = నేనుకాను. ఇతి = ఈ ప్రకారమగు, విభాగం = విభాగమును, సంత్యజ = విడిచి పెట్టుము, సర్వం = సమస్తమును, ఆత్మా = ఆత్మ స్వరూపము, ఇతి = ఇట్లని, నిశ్చిత్య నిశ్చయించి, త్వం = నీవు, నిస్సంకల్పః = సంకల్పరహితుడవై, సుఖీభవ = సుఖింపుము.


*వివరణ:-*


"అతడే నేను", "ఇది నేను కాదు" ఇటువంటి భేదభావాలను పూర్తిగా విడిచి పెట్టు. ఉన్నదంతా ఆత్మే అని తెలుసుకుని కోరికలు లేకుండా హాయిగా జీవించు.


*తాత్పర్యం:-*


అష్టావక్రుని భావంలో, భావాతీతమయిన ఆత్మ చైతన్యమూ, అనంత నామరూప భావసమన్వితమయిన ప్రపంచమూ వేరు కావు.


 తరంగాలు సముద్రం నుండి ఏవిధంగానూ వేరు కావు. సముద్రమే చలనంలో తరంగాలుగా గుర్తింపబడుతుంది. కోరికల ఒత్తిడి వలన చైతన్యమే నామరూపాలతో భావాలుగా ప్రపంచంగా భావంతో గుర్తింపబడుతున్నది. నామరూపాలేవైనా, బాహ్యంగా ఎట్లు గుర్తింపబడినా గుర్తింపబడినవన్నీ చైతన్యం నుండి వేరు కావు.


ఈ విధంగా బాహ్యంగా గుర్తింపబడే ప్రపంచమంతా తన కంటే వేరు కాదని గుర్తించిన జ్ఞానికి కోరికలెలా ఉంటాయి? మననుండి వేరుగా ఏదైనా ఉంటేనే మనం దానిని కోరగలం. వేరుగా రెండవదేదీ లేనప్పుడు కోరిక ఎలా ఉండగలదు?


ఆత్మానుభవంలో జాగృతులైన ఋషులు ఇలా అంటున్నారు. "ఆత్మైవ ఇదం జగత్ సర్వమ్"--ఇవన్నీ ఆత్మ కంటే వేరు కావు. "సర్వం బ్రహ్మైవ జగత్ "---నిరంతర పరిభ్రమణశీలి అయిన ఈ మహావిశ్వమంతా తన మూలమయిన ఆత్మ కంటే భిన్నం కాదు.


 కాబట్టి "అయం స్వోహం"--అతడే నేను--అని చెప్పడంలో నేను వేరనే భావం ధ్వనించి అజ్ఞానం కనిపిస్తున్నది! ఇదే విధంగా "అయం-నాహం" నేను మనశ్శరీరాలూ ప్రపంచమూ కాదు---అని చెప్పడం అజ్ఞాని అయిన బాలకునివలె పరిమితమయిన అహంకారం యొక్క ఉన్మత్త ప్రలాపాలే!!


"ఇదంతా నేనే--నాకంటే వేరుగా ఏదీలేదు. నేను సర్వవ్యాపినై ఉన్నాను" ఈ మహోన్నత జ్ఞానంలో స్థిరపడి మానసిక కల్లోలాన్ని విడనాడి నిశ్చలంగా శాంతంగా స్థిరంగా నీ స్వస్థితిలో నిలబడి సుఖంగా ఉండు. 


🕉️🌞🌍🌙⭐🚩


*🧘‍♂️149) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 15*

*సత్యం ఏకం - అదే ఆత్మ, బ్రహ్మం*

*శ్లోకం 08:-*


*श्रद्धस्व तात श्रद्धस्व नात्र मोऽहं कुरुष्व भोः ।*

*ज्ञानस्वरूपो भगवानात्मा त्वं प्रकृतेः परः ॥ १५-८ ॥*


*శ్రద్ధస్వ తాత శ్రద్ధస్వ నాత్ర మోఽహం కురుష్వ భోః ।*

*జ్ఞానస్వరూపో భగవానాత్మా త్వం ప్రకృతేః పరః ॥ 15-8 ॥*



శ్లో|| శ్రద్ధత్స్వ తాత! శ్రద్ధత్స్వ నాత్ర మోహం కురుష్వభోః| 

జ్ఞానస్వరూపో భగవాన్ ఆత్మా త్వం ప్రకృతేః పరః ||8.


*shraddhasva taata shraddhasva naatra mo’ham kurushva bhoh’ ।*

*nyaanasvaroopo bhagavaanaatmaa tvam prakri’teh’ parah’ ॥ 15-8 ॥*


*టీకా*


భో! తాత! = ఓ నాయనా!, శ్రద్ధత్స్వ = శ్రద్ధనుంచుము, శ్రద్ధత్స్వ = శ్రద్ధ నుంచుము, అత్ర = ఈ విషయమై, మోహం =  మోహమును, న కురుష్వ = చేయకుము, త్వం = నీవు, జ్ఞానస్వరూపః = జ్ఞానస్వరూపుడవు, భగవాన్ = ఈశ్వరుడవు, ప్రకృతేః = ప్రకృతికి, పరః = పరుడుగా నున్నావు.


*వివరణ:-*


కుమారా ! శ్రద్ధను వీడకు,శ్రద్ధను నిలుపుకో,సందేహించకు. నీవు జ్ఞాన స్వరూపానివే, నీవే ఈశ్వరుడవు, నీవే ఆత్మవు, నీవు ప్రకృతికి అతీతంగా ఉన్నావు.


*తాత్పర్యం:-*


భగవద్గీతలో కూడా శ్రద్ధ గలవారు మాత్రమే ఆత్మజ్ఞానం పొందగలరని నొక్కి చెప్పబడింది.


శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయ తేంద్రియః!


జ్ఞానం లబ్ధ్వా పరాంశాంతిం అచి రేణాధి గచ్ఛతి!! (భగవద్గీత 4-39)



ఇంద్రియాలను నిగ్రహించి శ్రద్ధతో ప్రయత్నించే వారికే జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానంతో పరమశాంతి లభిస్తుంది. ఇక్కడ కొద్దిగా ఆగి "శ్రద్ధ" అనే పదానికి అర్ధాన్ని గ్రహించాలి. సాధా రణంగా అన్ని మతాలలోనూ, అందరిచేతనూ కూడా అపార్థం చేసుకోబడిన ఏకైక పదం ఇదే. "శ్రద్ధ" అనగానే గుడ్డినమ్మకంతో బుద్ధి లక్షణాలయిన వివేక విచక్షణ తర్క మీమాంసాదులను విడచి, శాస్త్రంలో చెప్పబడినవానిని ఆచరించడం అనే అపోహ చాలామందికి ఉంది.


నిజానికి "శ్రద్ధ" యొక్క అర్థం ఇది కాదు. శాస్త్రం మీద అచంచలమైన నమ్మకం ఉంచి, సత్యాన్ని దర్శించేవరకూ ధీరత్వంతో, సహనంతో, వివేక విచక్షణాయుక్త నిత్య విచారణా శీలత్వంతో, బుద్ధి ఏకాగ్రతతో ఉండగలగడం, వేదాంత పరిభాషలో "శ్రద్ధ"ను ఇలా నిర్వచించినారు.


శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావ ధారణమ్!


సా శ్రద్ధా కథితా సద్భిర్యయా వస్తూపలభ్యతే!!

(వివేకచూడామణి-25)


శాస్త్రమూ గురువూ చెప్పినవాటిపై నమ్మకం ఉంచి, యథార్థాన్ని యథాతథంగా గ్రహించగలుగుతూ, భావార్థ గంభీరమయిన వాక్యాల వాచ్య, లక్ష్యార్థాలను ధీరత్వంతో, శాంతసహనాలతో గ్రహించగలగడం శ్రద్ధ అనబడుతుంది.


సంగ్రహంగా శ్రద్ధను నిర్వచించాలంటే, ఇవాళ నేను నమ్మే విషయాన్ని త్వరలో నిశ్చయంగా తెలుసుకోగలుగుతాను అనే భావమని చెప్పాలి. తన బుద్ధి మీదా, శాస్త్రం మీదా నమ్మకం ఉంచుతూ, సునిశితమూ శాంతమూ తీక్షణమూ అయిన బుద్ధితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.


తన బుద్ధి మీద, తన లక్ష్యం మీద, స్వశక్తి మీద, విశ్వాసం శ్రద్ధ ఉన్నవారు మాత్రమే గమ్యాన్ని చేరగలరు. దే విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పుతున్నారు మహర్షి.


ఈ సందర్భంలో యోగవాశిష్ఠంలోని ఒక శ్లోకం గుర్తుకు వస్తుంది.


యదిదం వచ్మి తత్సర్వం ఓమిత్యాదాతుమర్హసి!


అస్మాభిశ్చరమన్విష్టం నాత్ర కార్యా విచారణా!! (యోగవాశిష్టం) 


మేము చెప్పే దానిని ఓంకారంతో పాటుగా గ్రహించే అర్హత నీకుంది. ఇంతకాలమూ విచారణ చేసి అన్వేషించిన సత్యాన్ని చెప్పుతున్నాము. దీనిని నీవు తర్కించవలసిన అవసరం లేదు. భావాతీతమయిన వాటి గురించి చెప్పే ఈ వాక్యాల మీద, మహర్షుల మీద, నమ్మకం ఉంచి స్వీకరించు.


ఇటువంటి శ్రద్ధను నిత్యమూ నిలుపుకోగలుగుతేనే ధ్యానం సఫలమవు తుంది. మనస్సు శాంతంగా నిశ్చలంగా సహకరిస్తుంది. మనస్సు శాంతించి భావశూన్యంగా ఉన్నప్పుడు ధ్యానం ద్వారా సత్యాన్ని దర్శించే అవకాశం లభిస్తుంది. మహోపనిత్తు ఇలా అంటోంది.


యత్తు చంచలతాహీనం తన్మనోమృత ఉచ్యతే!


తదేవ చ తపః శాస్త్ర సిద్ధాన్తే మోక్ష ఉచ్యతే!! (మహోపనిషత్తు-6-101) 


"అలజడి అశాంతి లేకుండా నిశ్చలంగా ఉన్న మన స్సే అమృతత్త్వము అదే తపస్సు. ఉపనిషత్ వాజ్మయంలో దీనినే మోక్షమని అంటారు.

🕉️🌞🌍🌙⭐🚩

*🧘‍♂️148) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 15*

*సత్యం ఏకం - అదే ఆత్మ, బ్రహ్మం*

*శ్లోకం 07:-*


*विश्वं स्फुरति यत्रेदं तरङ्गा इव सागरे ।*

*तत्त्वमेव न सन्देहश्चिन्मूर्ते विज्वरो भव ॥ १५-७ ॥*


*విశ్వం స్ఫురతి యత్రేదం తరంగా ఇవ సాగరే ।*

*తత్త్వమేవ న సందేహశ్చిన్మూర్తే విజ్వరో భవ ॥ 15-7 ॥*



శ్లో|| విశ్వం స్ఫురతి యత్రీదం తరంగా ఇవ సాగరే |

తత్త్వమేవ న సందేహః చిన్మూర్తె విజ్వరో భవ || 7.


*vishvam sphurati yatredam tarangaa iva saagare ।*

*tattvameva na sandehashchinmoorte vijvaro bhava ॥ 15-7 ॥*


*టీకా* 


యత్ర = ఏ స్థానమునందు, ఇదం = ఈ, విశ్వం = ప్రపంచము, సాగరే = సముద్రమునందు, తరంగా ఇవ = అలలవలె, స్ఫురతి = తోచుచున్నదో, తత్ = అది, త్వమేవ = నీవే (అగుచున్నావు), న సందేహః =  సందేహము లేదు, చిన్మూ ర్తే  = జ్ఞాన స్వరూపమైన ఆత్మవిషయమై, విజ్వరః = సంతాపరహితుడవుగా, భవ = అగుము.


*వివరణ:-*


చిదానందరూపా! చైతన్యమయిన నీలో, సాగరంలో తరంగాల వలె, భావాలతో విశ్వం స్ఫురిస్తుంది. మానసిక కల్లోలాన్ని విడనాడి సుఖంగా జీవించు.


*తాత్పర్యం:-*


"తత్త్వమసి"----హిందూ వేదాంత వాజ్మయసారమయిన నాలుగు మహా వాక్యాలలోనూ ఒకటి. ఆష్టావక్రుని ఈ శ్లోకంలో ఆ మహావాక్యం ప్రతిధ్వనిస్తుంది. గురువు శిష్యునికి బోధిస్తున్నాడు.



"వివిధ ప్రత్యేకరూప సమన్వితమయిన ఈ మహా విశ్వమంతా, నీలో, సాగరంలో తరంగాలవలె, స్ఫురిస్తున్నది, భాసిస్తున్నది." "చిన్మూర్తి"వి నీవు భావాలు తరంగాలైతే నీవే చైతన్యసాగరానివి "తత్త్వమసి" . ---అది నీవే.



మన సహజ స్వరూపాన్ని సత్ చిత్ ఆనంద పరబ్రహ్మగా గుర్తించడము అంటే మనస్సుతో తాదాత్మ్యం పోయిందన్నమాటే. ఫలితంగా కోరికలన్నీ నశిస్తాయి.



బాహ్యప్రంపచంలో ఉండే వస్తువులు తమంతతాముగా మనకు దుఃఖాన్ని ప్రసాదించవు. ఆ వస్తువుపై మనకుండే కోరికలే వాటికి శక్తి నిస్తున్నాయి. ఆ శక్తితో అవి మనలను బంధిస్తున్నాయి, బాధిస్తున్నాయి. బానిసలుగా మారుస్తున్నాయి. ఈ కోరికలు నశిస్తే మనస్సు ఉద్రేకాలకు బాధలకు భయాలకు లోనుగాకుండా శాంతంగా హాయిగా ఉంటుంది.


🕉️🌞🌍🌙⭐🚩


*🧘‍♂️147) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 15*

*సత్యం ఏకం - అదే ఆత్మ, బ్రహ్మం*

*శ్లోకం 06:-*


*सर्वभूतेषु चात्मानं सर्वभूतानि चात्मनि ।*

*विज्ञाय निरहङ्कारो निर्ममस्त्वं सुखी भव ॥ १५-६ ॥*


*సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని ।*

*విజ్ఞాయ నిరహంకారో నిర్మమస్త్వం సుఖీ భవ ॥ 15-6 ॥*


శ్లో||  సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని |

విజ్ఞాయ నిరహంకారః నిర్మమస్త్వం సుఖీభవ || 6. 


*sarvabhooteshu chaatmaanam sarvabhootaani chaatmani ।*

*vijnyaaya nirahankaaro nirmamastvam sukhee bhava ॥ 15-6 ॥*


*టీకా* 


సర్వభూతేషు = సమస్త భూతముల యందును, ఆత్మానం = ఆత్మను (తనను), ఆత్మని = తనయందు, సర్వభూతాని = సమస్తభూతములను, విజ్ఞాయ = తెలుసుకొని, నిరహంకారః = అహంకార రహితుడవై, నిర్మమః = మమత్వము లేనివాడవై, త్వం = నీవు, సుఖీభవ = సుఖివికమ్ము.


*వివరణ:-*


అన్ని ప్రాణులలోనూ చైతన్యంగా నీవు ఉన్నావు చైతన్యమయిన నీలో సర్వసృష్టి ఉంది, దీనిని తెలుసుకుని అహంకారం మమకారరహితుడవై సుఖంగా జీవించు.


*తాత్పర్యం:-*


నేను నాది అనే భావాలతో అహంకారం వ్యక్తమవుతూ జీవిస్తూ ఉంటుంది. నేను అనే భావం వ్యక్తిత్వంగా బలపడి, వాసనా బలంతో కొన్ని కోరికలతో కొన్ని వస్తువులను "నాది" గా భావిస్తూ ఉంటుంది.



ఈ "నేను", "నాది" యొక్క సంబంధంతో ఆ భావాలు పరస్పరం బలపడడంతో వ్యక్తిత్వం బలపడుతుంది, ఫలితంగా బలమైన వ్యక్తిత్వం "నాది" అని బలీయంగా పట్టుకుంటుంది, రాగ ద్వేషాలు దృఢపడుతూ ఉంటాయి.



వాసనలు మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. నేను నాది అనే భావాలతో అహంకారం అపారమైన సంసార సాగరాన్ని ఈదలేక ఈదుతూ ఉంటుంది. ఈ అహంకారం నాచే చూడబడే విషయం మాత్రమే అనే దృఢజ్ఞానంతో, అహంకారాన్ని అధిగమించి "నేను"గా నిలబడడమే సర్వదుఃఖ నివారణోపాయం.



అజ్ఞాన జనితమైన అహంకారం మమకార భావాల్ని జ్ఞానంతో అర్థం చేసుకుని అధిగమించి జయించడమే ఆత్మజ్ఞాన ప్రాప్తి. అజ్ఞానం నశిస్తే ఆత్మ అక్కడే స్వయంగా వ్యక్తమవుతుంది. ప్రతి ప్రాణిలోనూ చైతన్యం ఉంది, కాబట్టి అవి జీవించి ఉన్నాయి, నా శరీరంలోనూ చైతన్యం ఉండబట్టే జీవించి ఉన్నాను, అన్నిటినీ తెలుసుకుంటున్నాను.



సర్వప్రాణులలోనూ చైతన్యమైన నేనున్నాను. చైతన్యమైనవానిలో సర్వప్రాణులూ తెలియబడుతూ ఉన్నాయి. ఇది బాగా అర్థం అయితే నాలో తెలియబడే సర్వమూ నా భావాలే కాబట్టి కనబడే సర్వచరాచర సృష్టి కూడా అనంత నామరూపాలతో నాలో కదలాడే భావాలు మాత్రమే అని స్పష్టంగా తెలుస్తుంది.



ఏకమూ అనంతమూ అయిన చైతన్యం అంతటా అన్నిటిలోనూ ఉంటూ అన్నీ తెలుసుకుంటుంది---భావాలుగా, నామ రూపాలుగా, పరిపూర్ణమయిన ఈ అవగాహనలో అహంకారం లయం అయి పోతుంది.



మరొక నామంగా, భావంగా నాలో ఉంటుంది. భూతాత్మా"---ఏకంగా నేను ఉన్నాను. రెండవదేదీ, ఎప్పుడూ, ఎక్కడా లేనే లేదు. ఇదే అజాత వాదం, భారతీయార్ష విజ్ఞాన సర్వస్వం, అష్టావక్ర మునీంద్రల ప్రవచనం, ప్రస్థాన త్రయ సందేశం. పరమశుభమయిన "నా" స్వరూపం.



పరమాత్మ సృష్టి అంతటిలోనూ ఉంటూ అతీతంగా గూడా ఉందన్న గీతా సిద్ధాంతాన్ని అష్టావక్ర మహర్షులు కూడా ఈ శ్లోకం మొదటిపాదం గీతా శ్లోకంలోని మొదటి పాదమే.



సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని!


ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః!! (భగవద్గీత-6-29) 


భగవాన్ కృష్ణుడు అంటున్నారు. యోగబలంతో తనను సర్వప్రాణులలోనూ, సర్వసృష్టిని తనలోనూ యోగి చూడగలడు. కాబట్టి సర్వత్రా సమత్వ బుద్ధిని కలిగి ఉంటాడు.



ఈ విధంగా సర్వసృష్టినీ నీవే అని తెలుసుకుని సర్వాత్మభావంతో సుఖంగా జీవించమని సలహా ఇస్తున్నారు మహర్షి.


🕉️🌞🌍🌙⭐🚩


*🧘‍♂️146) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 15*

*సత్యం ఏకం - అదే ఆత్మ, బ్రహ్మం*

*శ్లోకం 05:-*


*रागद्वेषौ मनोधर्मौ न मनस्ते कदाचन ।*


*निर्विकल्पोऽसि बोधात्मा निर्विकारः सुखं चर ॥ १५-५ ॥*


*రాగద్వేషౌ మనోధర్మౌ న మనస్తే కదాచన ।*


*నిర్వికల్పోఽసి బోధాత్మా నిర్వికారః సుఖం చర ॥ 15-5 ॥*


శ్లో||  రాగద్వేషౌ మనోధర్మౌ న మనస్తే కదాచన |


నిర్వికల్పోఽసి బోధాత్మా నిర్వికార స్సుఖం చర ||5. 


*raagadveshau manodharmau na manaste kadaachana ।*


*nirvikalpo’si bodhaatmaa nirvikaarah’ sukham chara ॥ 15-5 ॥*


*టీకా*


రాగద్వేషౌ = రాగద్వేషములు, మనోధర్మౌ = మనోధర్మములు, తే = నీకు, మనః = మనస్సు, కదాచన = ఒకప్పుడును, న = లేదు, (త్వం = నీవు), నిర్వికల్పః = వికల్పరహితుడవు, నిర్వికారః = వికారరహితుడవు, బోధాత్మా = జ్ఞానస్వరూపుడవును, అసి అగుచున్నావు, (అతః =  ఇందువలన), సుఖం = సుఖపూర్వకముగా, చర = మెలంగుము.


*వివరణ:-*


రాగద్వేషాలు మనోధర్మాలు, నీది అనబడే మనస్సు నీవు కావు. చైతన్యమయిన నీ సమక్షంలో అవి తెలియబడుతున్నాయి. నీలో ఏ మార్పూ రావడం లేదు. ఇది తెలుసుకుని సుఖంగా జీవించు.


*తాత్పర్యం:-*


ఉద్రేకాలు, కోరికలు, రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, ఇవన్నీ మనస్సులోని చలనాలే, ఇవన్నీ నీ మనోబుద్ధులకు చెందినవి మాత్రమే.



అనంతమూ శుద్ధమూ అయిన ఆత్మ చైతన్యం వలన వాటిని తెలియబడేటట్టుగా చేస్తున్నది, మనోబుద్ధులే నీవు కాదు. చైతన్యపు సామీప్యంలో మనోబుద్ధులలోని భావాలు అలా తెలియబడే మనోబుద్ధుల బాధలూ భయాలూ భావాలూ నీవి కావు, నీవు భయపడటం లేదు, బాధపడడం లేదు, భావంగా మారనూ లేదు.



నిత్యమూ సత్ చిత్ ఆనంద రూపమయిన ఆత్మగా ఉన్నావు. దీనిని అర్థం చేసుకుని సుఖంగా జీవించమని మహర్షి అంటున్నారు.


🕉️🌞🌍🌙⭐🚩

*🧘‍♂️145) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 15*

*సత్యం ఏకం - అదే ఆత్మ, బ్రహ్మం*

*శ్లోకం 04:-*


*न त्वं देहो न ते देहो भोक्ता कर्ता न वा भवान् ।*

*चिद्रूपोऽसि सदा साक्षी निरपेक्षः सुखं चर ॥ १५-४ ॥*


*న త్వం దేహో న తే దేహో భోక్తా కర్తా న వా భవాన్ ।*

*చిద్రూపోఽసి సదా సాక్షీ నిరపేక్షః సుఖం చర ॥ 15-4 ॥*


శ్లో|| న త్వం దేహో న తే దేహో భోక్తా కర్తా న వా భవాన్ |

చిద్రూపాఽసి సదా సాక్షీ నిరపేక్షః సుఖం చర || 4.


*na tvam deho na te deho bhoktaa kartaa na vaa bhavaan ।*

*chidroopo’si sadaa saakshee nirapekshah’ sukham chara ॥ 15-4 ॥*


*టీకా*


త్వం = నీవు, దేహః = శరీరము, న = కావు, తే = నీకు, దేహః = దేహము, న = లేదు, వా = అయితే, భవాన్ = నీవు, భక్తా = భోక్తవుగాని, కర్తా = కర్తవుగాని, న =  కావు, (కిం తు = మరేమనగా), చిద్రూపః = జ్ఞానస్వరూపుడవును, సదా = ఎల్లప్పుడు, సాక్షి = సాక్షివి, నిరపేక్షః = కోరిక లేనివాడవు, అసి = అగుచున్నావు, సుఖం = సుఖముగా, చర = మెలగుము. 


*వివరణ:-*


ఈ శరీరమే నీవు కాదు, శరీరం కూడా నీది కాదు. నీవు కర్తపూ కావు, భోక్తవూ కావు, నిత్యమూ సాక్షిగా ఉండే ఆత్మ చైతన్యమే నీవు. ఇది తెలుసు కుని సుఖంగా జీవించు.



*తాత్పర్యం:-*


ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలనే అభిరుచిగల శిష్యులకు తన బోధను కొనసాగిస్తున్నారు. "ఈ శరీరమే నేను" అని భ్రమతో ఇంద్రియాలను తృప్తిపరచడం కోసం విషయభోగాలను వాంఛిస్తాము.



అందుకనే ఇక్కడ గురువుగారు హెచ్చరిస్తున్నారు---"ఈ శరీరమే నీవు కాదు, "శరీరం కూడా నీది కాదు, ఈ శరీరం పట్ల ఈ , "నేను" "నాది" అనే భావాలను విడనాడాలి. అహంకార మమకారాలు అర్థరహితాలు.



శరీరం పనులు చేస్తోంది, అనుభవిస్తుంది. కాబట్టి నేను కర్తనూ కాదు, భోక్తనూ కాదు. ఈ కర్తృత్వ భోక్తృత్వ భావనలు కలిసి మనలో అహం కారంగా గుర్తింపబడుతున్నాయి. నాచే చూడబడే శరీరం నేను కాదు, కాబట్టి దాని కర్మలూ అనుభవాలూ కూడా నావి కావు, ఈ వివేకంతో అహంకారాన్ని అణగద్రొక్కాలి.



ఈ విధంగా స్థూల సూక్ష్మ శరీరాలు నేననే భావం నుండి విడివడిన శిష్యునికి, స్వరూపాన్ని నేరుగా తెలియజేస్తున్నారు మునీంద్రులు---- "శుద్ధమైన చైతన్యమే నీవు" ---ఈ చైతన్యం వలన బుద్ధి ప్రకాశింపబడి విషయాలు తెలియ బడుతున్నాయి.



కాబట్టి, శారీరక మానసిక బుద్ధిపరమైన అనుభవాలకు ఆలోచనలకు నీవు సాక్షివి మాత్రమే. సాక్షిచే చూపబడే దృశ్యం యొక్క (ఉపాధియొక్క) సుఖదుఃఖాలేవీ సాక్షిని స్పృశించవు. "దీనిని తెలుసుకుని హాయిగా జీవించు" అని ఆశీర్వదిస్తున్నారు అష్టవక్ర మహర్షి.


🕉️🌞🌍🌙⭐🚩

*🧘‍♂️144) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 15*

*సత్యం ఏకం - అదే ఆత్మ, బ్రహ్మం*

*శ్లోకం 03:-*


*वाग्मिप्राज्ञामहोद्योगं जनं मूकजडालसम् ।*

*करोति तत्त्वबोधोऽयमतस्त्यक्तो बुभुक्षभिः ॥ १५-३ ॥*


*వాగ్మిప్రాజ్ఞామహోద్యోగం జనం మూకజడాలసం ।*

*కరోతి తత్త్వబోధోఽయమతస్త్యక్తో బుభుక్షభిః ॥ 15-3 ॥*



శ్లో|| వాజ్మి ప్రాజ్ఞమహోద్యోగం జనం మూకజడాలసమ్ | 

కరోతి తత్త్వబోధోఽయం అతస్త్యక్తో బుభుక్షుభిః || 3.


*vaagmipraajnyaamahodyogam janam mookajad’aalasam ।*

*karoti tattvabodho’yamatastyakto bubhukshabhih’ ॥ 15-3 ॥*


*టీకా* 


అయం = ఈ, తత్త్వబోధ = తత్త్వజ్ఞానము, వాగ్మిప్రాజ్ఞమహోద్యోగం = అతి వక్త పండితుడు, గొప్ప ఉద్యోగియగు, జనం = జనుని, మూక జడాలసం = మూగ వానినిగను - జడునిగను -అలసునిగను, కరోతి = చేయుచున్నది, అతః = ఈ కారణమువలన, బుభుక్షుభిః = భోగేచ్ఛగలవారల చేత, అయం = ఈ బోధము, త్య క్తః = విడిచి పెట్టబడుచున్నది.  


*వివరణ:-*


చురుకుగా తెలివిగా చక్కగా వ్యవహరించే వానిని ఈ జ్ఞానం - మూగవానిగా జడసమునిగా నిర్లిప్తంగా మారుస్తుంది. కాబట్టి విషయభోగ వాంఛారతులైన వారు ఈ జ్ఞానాన్ని గర్హిస్తారు, ద్వేషిస్తారు.


*తాత్పర్యం:-*


ప్రపంచవ్యవహారాల్లో ప్రగతిని సాధించాలంటే మంచి తెలివితేటలు, చురుకుదనము, వాగ్దాటి, ప్రపంచ జ్ఞానము ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే వ్యవహారపరంగా ఉండే పోటీలో నెగ్గగలరు. ధ్యానశీలి అయిన సాధకుడు సాధన దశలో అజ్ఞాన జనితమయిన ప్రపంచం నుండి తన దృష్టిని మళ్ళిస్తాడు. కాబట్టి సహజంగా అతని ప్రవర్తన మూఢునివలె, జడసమునివలె, నిర్లిప్తంగా మారుతుంది. కాబట్టి విషయాలను అనుభవించాలనుకునేవారు ఈ జ్ఞానాన్ని గర్హిస్తారు.



అధ్యాత్మిక జీవితమంటే నిరాశా నిస్పృహలతో జీవన్మృతునివలె జీవించడం అని ఆపోహపడకూడదు. బుద్ధుడు బోధివృక్షం క్రింద కూర్చుని తపస్సు చేసుకునే రోజుల్లో, పనికిరానివాడుగా, సోమరిపోతుగా, సమాజానికి భారంగా భావింపబడి ఉంటాడు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించిన తరువాత భగవాన్ బుద్ధుడు గా ఆరాధింపబడుతున్నాడు.


విషయలోలురైన మామూలు మనుష్యుల దృష్టిలో ఈ నాటికి కూడా కారుణ్యమూర్తిగా అనేకమంది హృదయాలలో ఆరని జ్యోతిగా ఈ ఆరాధింపబడుతున్నాడు. విషయంలోలురైన మామూలు మనుషుల దృష్టిలో ఆధ్యాత్మిక జీవితం నిరాశా పూరితంగా నిర్వీర్యంగా నిష్ఫలంగా కనిపిస్తుంది. ప్రాపంచిక జీవితం అందంగా అర్థవంతంగా అనిపించి విషయ భోగాలననుభవిస్తూ వాసనలను క్షయింపజేసుకుంటారు.



"యథేచ్చసి తథాకురు" ----యథేచ్ఛగా జీవించు అని క్రిందటి శ్లోకంలో శిష్యునితో చెప్పేరు మునీంద్రులు. ఈ శ్లోకంలో అలా అనడంలోని అంతరార్థాన్ని ఈ స్పష్టంగా వివరించారు.


🕉️🌞🌍🌙⭐🚩





  


*🧘‍♂️141) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 15*


 *సత్యం ఏకం - అదే ఆత్మ, బ్రహ్మం*   


అష్టావక్రగీత మొత్తంలో, అనంతభావ గర్భితమూ, అపూర్వ సందేశ సమన్వితమూ అయిన అధ్యాయం ఇదే అని చెప్పక తప్పదు.



పరమ సత్యమైన ఆత్మ సందేహరహితమైన పదాలతో ఇందులో ఇలా నిర్వచింప బడింది. "ఏకమైన ఆత్మ చైతన్యము సృష్టి అంతటిలోనూ, సృష్టి అంతా ఆత్మ చైతన్యంలోనూ ఉన్నది.



శాస్త్రాలలో "తత్" పదంచే సూచింపబడే సత్ చిత్ ఆనంద స్వరూపం, భగవత్తత్త్వము ---అహంకార రహితమైనది, అనాది, అకర్త: అటువంటి ఆత్మతత్త్వంలో ఎన్నడూ రెండవ దేదీ లేనే లేదు. ఈ భావమే అజాతవాదంగా రూపొందింది. కార్యకారణ సంబంధంగా మనస్సుచే తెలియ బడే నామ రూపాత్మకమైన మిథ్యా ప్రపంచమంతా ఆత్మ మాత్రమే, రెండవ దేదీ ఎక్కడా ఎన్నడూ లేదు.



అష్టావక్రుడు ఎంతో ప్రేమతో---"శ్రద్ధస్వ, శ్రద్ధస్వ" --- ఈ అద్భుతమైన సత్యంలో విశ్వాసము ఉంచమని అంటున్నారు.



వివిధ అవస్థలలోనూ సర్వత్రా సమానంగా వ్యక్తమవడం మాత్రమే కాదు, ఈ పరిశుద్ధమైన ఆత్మ చైతన్యము భగవంతునివలె ఆరాధనీయమైనది, అతి పవిత్రమైనది.



బ్రహ్మతత్త్వము సాధకులందరికీ ప్రత్యక్షమయ్యే రీతిలో అవగాహన అయే విధంగా ఈ అధ్యాయంలో వివరింపబడింది. అష్టావక్రుడు ప్రగాఢమూ నిగూఢమూ అయిన తన అనుభవంతో దీనిని చెప్పుతున్నారు.



 హిందూతత్త్వ శాస్త్ర గ్రంధాలలో మరే గ్రంధమూ కూడా బ్రహ్మతత్త్వాన్ని ఇంత స్పష్టంగా సాధకుల బుద్ధికి అందించ లేదని ఒప్పుకుని తీరాలి.



 అగాధమయిన తత్వ రహస్యాన్ని, అపూర్వమయిన సాధనా విధానాలతో, అద్భుతంగా,అసమానంగా, సాధకులు సత్యాన్వేషణాతురమయిన సునిశిత తీక్షణబుద్ధికి అందించగలదీ గీత. ప్రగాఢమయిన ధ్యానంలో దారిగానక పరితపించేవారికి అర్హమయిన సూచనలను అనువైన విధానంలో అందించగలిగినదీ గీత మాత్రమే.


🕉🌞🌏🌙🌟🚩

*🧘‍♂️140) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 14*

 *ఆత్మ - శాంత స్వరూపమే*

*శ్లోకం 04:-*


*अन्तर्विकल्पशून्यस्य बहिः स्वच्छन्दचारिणः ।*

*भ्रान्तस्येव दशास्तास्तास्तादृशा एव जानते ॥ १४-४ ॥*


*అంతర్వికల్పశూన్యస్య బహిః స్వచ్ఛందచారిణః ।*

*భ్రాంతస్యేవ దశాస్తాస్తాస్తాదృశా

ఏవ జానతే ॥ 14-4 ॥*


శ్లో|| అంతర్వికల్ప శూన్యస్య బహిః స్వచ్ఛందచారిణః | 

భ్రాంత స్యేవ దశాస్తాస్తా: తాదృశా ఏవ జానతే || 4.


*antarvikalpashoonyasya bahih’ svachchhandachaarinah’ ।*

*bhraantasyeva dashaastaastaastaadri’shaa eva jaanate ॥ 14-4 ॥*


*టీకా*


  అంతర్వికల్ప శూన్యస్య = అంతఃకరణమునందు వికల్పములు లేనటు వంటిన్ని, బహిః = వెలుపలకు మాత్రము, భ్రాంతస్య ఇవ = భ్రాంతుడువలె నున్నటు వంటిన్ని, స్వచ్ఛందచారిణః = స్వతంత్రముగా సంచరించుచున్న అతని యొక్క, తాఃతాః = ఆయా, దశాః = అవస్థలను, తాదృశా ఏవ = అటువంటి వారే, జానతే = తెలుసుకొనుచున్నారు.


*వివరణ:-*


ఆంతర్యం భావశూన్యంగా, బహిరంగంగా బాలకునివలె స్వేచ్ఛగా విహరించే జ్ఞాని, బాహ్యంగా భ్రమకు లోనై వ్యవహరిస్తున్నట్టే గోచరిస్తుంది. కాని నిజానికి అతని స్థితి అటువంటి మరొక జ్ఞానికి మాత్రమే తెలుస్తుంది.


*తాత్పర్యం:-*


శూన్యచిత్తుడై భావశూన్యుడై చైతన్య స్వరూపమయిన జ్ఞానిలో మనస్సు శాంతంగా బుద్ధి ఆలోచనా రహితంగా నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి సహజంగా అతనిలో సంకల్ప వికల్పాలు, సంశయ, సందేహాలు ఉండవు.


అహంకారరహితుడై ఆనందంగా చరించే అతనికి సామాజిక, లౌకిక, మతధర్మాలేవీ వర్తించవు. అతనిలో కోరికలేమీ ఉండవు కాబట్టి అతడేపని చేసినా పరిణామాన్ని దృష్టిలో ఉంచుకోడు.


అట్టి మహాత్ముల అడుగుజాడలు అఖిల మానవాళికి అనుసరణీయాలు. అయినప్పటికీ అట్టి వారి స్వేచ్ఛాచార ప్రవృత్తి మన సామాజిక, లౌకిక, రాజకీయ, మతధర్మాలకు ఒక సాకులాగా ప్రశ్నార్థకంగా అనిపించక మానదు! వారికి వారే ధర్మనియంతలు. ధర్మస్వరూపం రూపు దిద్దుకుంటుంది.


వారి అడుగుజాడలలో అట్టి జ్ఞానులను నిర్ణయించడానికి మరొక జ్ఞానికి మాత్రమే సాధ్యమవుతుంది. జ్ఞానుల యొక్క బాహ్య ప్రవర్తన ఈ విధంగా అగమ్య గోచరంగా ఉండడంతో బాహ్య లక్షణాలను బట్టి జ్ఞానులను నిర్ణయించడం అసాధ్యం అవుతుంది.


అట్టి మహాపురుషులను గూర్చి యోగవాశిష్టం ఇలా అంటుంది. 


సంశాంతాంతఃకరణో గలితవికల్పః స్వరూప సారమయః!


పరమ శమామృత తృప్త స్తిష్ఠతి విద్వాన్నిరావరణ!! (యోగవాశిష్టం)


"భావసంచలనము అణగిపోగా, శాంతస్థితిని నొందిన మనో బుద్ధులతో, మాయా అవనికను ఛేదించి, అనంత శాంతమనే అమృతాన్ని ఆస్వాదిస్తూ, సదాశాంతుడై జీవన లీలను సాక్షిగా చూస్తూ ఉంటాడు" అట్టి జ్ఞానులు మానవాళికి మార్గదర్శకులై ధృవ తారలై ప్రకాశిస్తూ ఉంటారు!


🕉️🌞🌍🌙⭐🚩

**🧘‍♂️139) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 14*

 *ఆత్మ - శాంత స్వరూపమే*

*శ్లోకం 03:-*


*विज्ञाते साक्षिपुरुषे परमात्मनि चेश्वरे ।*

*नैराश्ये बन्धमोक्षे च न चिन्ता मुक्तये मम ॥ १४-३ ॥*


*విజ్ఞాతే సాక్షిపురుషే పరమాత్మని చేశ్వరే ।*

*నైరాశ్యే బంధమోక్షే చ న చింతా ముక్తయే మమ ॥ 14-3 ॥*


శ్లో|| విజ్ఞాతే సాక్షిపురు షే పరమాత్మని చేశ్వరే |

నైరా శ్యే బన్ధమోక్షే చ న చినా ముక్తయే మమ || 3.


*vijnyaate saakshipurushe paramaatmani cheshvare ।*

*nairaashye bandhamokshe cha na chintaa muktaye mama ॥ 14-3 ॥*


*టీకా*


 సాక్షి పురు షే = సాక్షి మాత్రుడును, (ప్రత్యగాత్మ స్వరూపుడును), పరమాత్మని =  పరమాత్మ యగు, ఈశ్వరే = ఈశ్వరుడు, విజ్ఞాతేసతి = తెలియబడినవాడగుచుండగా, నైరాశ్యే = ఆశారహితమైన, బంధమోక్షే = బంధము యొక్క, విముక్తి యందు, మమ = నాకు, ముక్తయే = ముక్తి కొఱకు, చిన్తా = చింత, న = లేదు.


*వివరణ:-*


సర్వానికి సాక్షి అయిన పరమపురుషుని గ్రహించగలిగినాను. ఇందువలననే బంధ మోక్ష భావ భ్రాంతిని వీడి శాంతంగా ఉదాసీనంగా ఉంటున్నాను.


*తాత్పర్యం:-*


శాంతి చతుష్టయమనదగిన ఈ నాలుగు శ్లోకాలలోనూ జనకుడు ఆత్మానుభవం ఎందుకు అనంత శాంతి స్వరూపమో, ఆ శాంతి మనశ్శరీరాల మాలిన్యాలతో ఎందుకు కలుషితం కావడం లేదో వివరించడానికి ప్రయత్నిస్తున్నారు.


శుద్ధచైతన్య స్వరూపమయిన పరమాత్మ బాహ్యాభ్యంతరాలలో సంభవించే సర్వ సంఘటనలనూ సాక్షిగా తెలుసుకుంటూ ఉంటుంది.


ఈ చైతన్యపు సన్నిధే సర్వచరాచర ప్రపంచాన్ని నియమిస్తూ, శాసిస్తూ, నడిపిస్తూ, ఈశ్వరుడుగా గుర్తింపబడుతున్నది. ఈ ఈశ్వరతత్త్వమే సాధకుని సహజ నిత్యస్వరూపమని గ్రహించిన తరువాత అతనికి బంధమోక్షాలు వ్యర్థపదాలుగా తోచి వాటిపట్ల నిర్లిప్తత వహిస్తాడు.


బంధంలో ఉన్న వానికి ముక్తి, స్వరూపజ్ఞానం లభించిన సాధకునికి బంధం యొక్క బాధలూ, ముక్తి లభించిందనే సంతోషమూ కూడా ఉండవు. ఈ సంతోష విచారాల కతీతంగా భావరహిత శాంత స్థితిలో ఉంటాడు.


శరీరసంబంధమైన కోరికలూ, మానసిక ఉద్రేకాలూ బుద్ధిలో భావ సంఘర్షణా జనిత దుఃఖమూ---ఈ మూడింటి సమ్మేళన మనదగిన దుఃఖమయ ప్రపంచ భావము లయం కాగా బంధమేలేని జ్ఞానికి మోక్షం మీద ఆసక్తి ఆతృత ఉండవు.


ప్రస్తుతం మన ఉపాధిలో ఉన్న ఉపకరణాలతో పరిమితమైన విషయాలను మాత్రమే గ్రహించగలము. అపరిమితమూ పూర్ణమూ అయిన ఆ శాంత స్థితిని, ఈ పరిమిత ఉపకరణాలతో గ్రహించడం అసాధ్యం, అసంభవం.


ఒక చిన్న గరిటతో సముద్ర జలాన్ని పూర్తిగా ఖాళీ చేయడం సాధ్యమేనా? పరిమితమైన ఈ మనస్సు పరిపూర్ణ శాంతస్వరూపాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. అపరిమితమూ అచింత్యమూ అయిన ఆత్మను సూచించడానికి మాత్రమే భావాలు సహాయపడగలవు.


🕉️🌞🌍🌙⭐🚩


🧘‍♂️138) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 14*

*ఆత్మ - శాంత స్వరూపమే*

*శ్లోకం 02:-*


*क्व धनानि क्व मित्राणि क्व मे विषयदस्यवः ।*

*क्व शास्त्रं क्व च विज्ञानं यदा मे गलिता स्पृहा ॥ १४-२ ॥*


*క్వ ధనాని క్వ మిత్రాణి క్వ మే విషయదస్యవః ।*

*క్వ శాస్త్రం క్వ చ విజ్ఞానం యదా మే గలితా స్పృహా ॥ 14-2 ॥*


శ్లో|| క్వ ధనాని క్వ మిత్రాణి క్వ మే విషయదస్యవః |

క్వ శాస్త్రం క్వ చ విజ్ఞానం యదా మే గళితాస్పృహా ||2.



*kva dhanaani kva mitraani kva me vishayadasyavah’ ।*

*kva shaastram kva cha vijnyaanam yadaa me galitaa spri’haa ॥ 14-2 ॥*


*టీకా*


యదా= ఎప్పుడు, మే= నా యొక్క, స్పృహా = కోరిక, గళితా = జారిపోయినదో, తదా = అప్పుడు, మే = నాకు, ధనాని = ధనములు, క్వ = ఎక్కడ, మిత్రాణి = మిత్రులు, క్వ = ఎక్కడ, విషయదస్యవః = విషయములనే దొంగలు, క్వ = ఎక్కడ, చ = మఱియు, శాస్త్రం = శాస్త్రము, క్వ = ఎక్కడ, విజ్ఞానం = విజ్ఞానము, క్వ = ఎక్కడ?


*వివరణ:-*


కోరికలే లేని నాలో సంపదలు, మిత్రులు, విషయరూపమైన దొంగలు ఎక్కడ ఉన్నారు? ఇంతే కాదు,శాస్త్రాలు విజ్ఞానం కూడా నాలో ఎక్కడ ఉన్నాయి?


*తాత్పర్యం:-*


అహంకార సహితుడయిన వ్యక్తిగా ఉన్నంతకాలం ధనం, మిత్రులు, శాస్త్రాలు, విజ్ఞానము ఎంతో విలువైనవి. వీటి వలననే వ్యక్తికి భద్రత, సుఖము, తృప్తి లభిస్తాయి.



 అహంకారం ఉన్నంతకాలమూ విషయాలు వ్యామోహ రూపంలో మనలోనికి జొరబడి శాంతిని హరించి బాధలకు లోనుచేస్తాయి. ఈ విషయ వ్యామోహం లోపల ప్రవేశించిందంటే మన సమత్వ బుద్ధినీ, వివేకాన్నీ, విజ్ఞానాన్నీ, సంస్కృతినీ, సర్వాన్నీ హరించగలదు. ఇది నిజంగా నిజమే.



కానీ, కోరికలన్నీ నశించి, తానే అనంతానంద స్వరూపమైన ఆత్మనని తెలుసుకున్న జ్ఞానికి విషయాల మీద విలువ ఎలా ఉంటుంది? సంపద, మిత్రులు, శాస్త్రాలు, విజ్ఞానం, ఇవన్నీ కలిసి మనదనుకునే మాయా ప్రపంచాన్ని సృష్టించి చూపించి మోహపరుస్తున్నాయి. ఇవన్నీ జ్ఞానిలో ఎక్కడ ఎలా ఉండగలవు?



స్వరూపనిష్ఠుడయిన జ్ఞానికి శాస్త్రాలెందుకు? విజ్ఞానం మీద విలువ ఎలా ఉంటుంది? ఈ శాస్త్రాలు విజ్ఞానమూ కూడా తన స్వరూపాన్ని నిరూపించి, చూపించడానికి ఉపయోగపడే మార్గాలు మాత్రమే.



గమ్యం చేరిన వానికి మార్గంతో ప్రయోజన మేముంటుంది? మార్గం గుర్తుండడం వలన అవసరం మాత్రం ఏమిటి? ఈ కారణంగానే జ్ఞానికి శాస్త్రాల మీదా విజ్ఞానం మీదా కూడా విలువ ఉండదు. ఇదేవిషయం భగవద్గీతలో ఇలా చెప్పబడింది.



యావానర్ధ ఉదపానే

సర్వతః సంఫ్లుతోద కే! 


తావాస్ సర్వేషు వేదేషు

బ్రాహ్మణస్య విజానతః!!

-(భగవద్గీత-2.46)


వరదనీరు పొంగిపొర్లేచోట చిన్న కొలను ఏవిధంగా ఉంటుంది? ఇదే విధంగా బ్రహ్మ విదుడైన జ్ఞానికి వేదాలతో ప్రయోజనం ఏమిటి?


🕉️🌞🌍🌙⭐🚩

*🧘‍♂️137) అష్టావక్ర గీత🧘‍♀️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*అధ్యాయం - 14*

 *ఆత్మ - శాంత స్వరూపమే*

*శ్లోకం 01:-*


*जनक उवाच ॥*


*प्रकृत्या शून्यचित्तो यः प्रमादाद् भावभावनः ।*

*निद्रितो बोधित इव क्षीणसंस्मरणो हि सः ॥ १४-१ ॥*


*జనక ఉవాచ ॥*


*ప్రకృత్యా శూన్యచిత్తో యః ప్రమాదాద్ భావభావనః ।*

*నిద్రితో బోధిత ఇవ క్షీణసంస్మరణో హి సః ॥ 14-1 ॥*


జనక ఉవాచ :


శ్లో || ప్రకృత్యా శాన్త చిత్తో యః ప్రమా దాద్భావ భావనః | 

నిద్రితో బోధిత ఇవ క్షీణసంసరణీ హి సః || 1.


*janaka uvaacha ॥*


*prakri’tyaa shoonyachitto yah’ pramaadaad bhaavabhaavanah’ ।*

*nidrito bodhita iva ksheenasamsmarano hi sah’ ॥ 14-1 ॥*


*టీకా* 


యః = ఏ పురుషుడు, ప్రకృత్యా = స్వాభావికముగానే, శాన్తచిత్తః = శాంత చిత్తుడైయున్నాడో, నిద్రితః = పండుకొనినవాడు, బోధిత ఇవ = మేల్కొలుపబడిన వానివలె, ప్రమాదాత్ = ప్రమాదమువలన, భావభావనః = పూర్వవిషయములను భావించు వాడైనను, సః = అట్టివాడు, క్షీణసంసరణః = క్షీణించిన సంసారము గలవాడే, (సంసార రహితుడు)


*వివరణ:-*


సహజంగా వృత్తిరహితమూ భావశూన్యమూ అయిన మనస్సుతో ప్రాపంచిక విషయాలపై జ్ఞాపకము ధ్యాస లేకుండా, వచ్చిన సంఘటనలను వచ్చినట్టే చూస్తూ జీవిస్తాడు జ్ఞాని.



ఈ కారణంగా అతడు మేలుకుని ఉన్నా నిద్రపోయినట్లే. శారీరకంగా నిద్రపోయినా ఆత్మానుభవంలో సదా మేలుకొని ఉన్నట్టే.


*తాత్పర్యం:-*


శరీరాన్ని దాటిన ఏ అనుభవాన్నైనా భాషతో వర్ణించడానికి వీలు కాదు. భావాతీతమయిన ఆత్మ చైతన్యానుభవాన్ని వర్ణించడానికి ప్రయత్నించిన మహర్షులంతా తప్పనిసరిగా కొన్ని పద్ధతులను ఉపయోగించి అసంపూర్ణ వాక్యాలతో, సూచనలతో పూర్ణత్వాన్ని బుద్ధికందించే ప్రయత్నం చేసినారు.



 'శాంతచిత్తః ---శాంతమయిన మనస్సు గల జ్ఞాని ప్రపంచంలో ఎలా వ్యవహరించేది తెలియజెప్పడానికి జనకుడు ఇక్కడ ప్రయత్నించడంలో ఈ విషయం గోచరిస్తుంది.



ప్రాపంచిక విషయాలతో మనకు గల గత అనుభవాల జ్ఞాపకాలు మన చిత్తంలో నిక్షిప్తమై భవిష్యత్తును రూపొందిస్తుంటాయి. వీటిని వాసనలు అంటారు.



ఈ వాసనారూప జ్ఞాపకాలు కోరికలై మనశ్శరీరాలను కర్మకు పురిగొల్పుతూ ఈ జ్ఞాపకాలతో మరల అనుభవించాలనే కోరికలతో అహంకారం జీవిస్తూ బలీయమవుతూ ఉంటుంది.



జ్ఞాని ఈ వాసనలను అధిగమించినవాడు కాబట్టి---"క్షీణ సంసరణః ----అని వర్ణించినాడు. వాసనలు లేనివానికి జ్ఞాపకాలు కూడా ఉండవు. వాసనా రహితమయిన ఈ స్థితిలో మనస్సు భావశూన్యంగా శాంతంగా ధ్యానమగ్నమయినట్లుగా నిశ్చలంగా ఉంటుంది. జీవన్ముక్తునిలో ఈ స్థితి సహజంగా ఉంటుంది. "ప్రకృత్యా'---స్వభావసిద్ధంగా ఉంటుంది. 



సహజంగా సర్వకాలాల్లోనూ తానే ఏకమూ అనంతమూ అయిన చైతన్యాన్ననే అనుభవసహిత జ్ఞానం ఉన్నప్పటికీ, జ్ఞాని యొక్క పూర్వప్రారబ్ధానుసారంగా అతని మనశ్శరీరాలు విషయానుభవాలను పొందుతూ ఉంటాయి.



సమయాల్లో కూడా అట్టి జ్ఞాని ఆత్మనిష్ఠుడై ఉండి, ఆ అనుభవాలను నిద్రలో వలె అనుభవించడం జరుగుతుంది. అతడు మాత్రము సదా ఆత్మానుభవంలోనే జాగృతుడై ఉంటాడు.



ఈ స్థితి యోగాభ్యాసము వలననూ మత్తు మందుల వలననూ సాధింపబడినది కాదు. ఆత్మనిష్ఠుడయిన బ్రహ్మ జ్ఞానికి ఈ దృష్టి అప్రయత్నంగా సహజంగా నిత్యమూ ఉంటుంది. నానాత్వం కలిగిన ఈ జగత్తు అతని చైతన్యపు ఉపరిభాగాన నవరస భరితమయిన దృశ్య చిత్రంగా తెలియబడుతూ ఉంటుంది.


🕉️🌞🌍🌙⭐🚩


 🙏నమస్కారం🙏

   👨‍🦳 పదవి విరమణ పొందిన ఒక  ఉద్యోగి అంతరంగం 👨‍🦳

🕦సమయం  గడిచిపోయింది, 
 ఎలా  గడిచిందో తెలియదు, జీవితమనే..పెనుగులాటలో..... వయసు  గడిచిపోయింది తెలియకుండానే....

✍భుజాలపైకి ఎక్కే పిల్లలు  భుజాలదాక వచ్చేశారు. తెలియనేలేదు..

✍అద్దె ఇంటి నుండి  చిన్న గా మొదలైన  జీవితం. ఎప్పుడు  మన ఇంట్లో కి వచ్చామో,
 తెలియనే లేదు.......

✍ఆయాసంతో   సైకిల్  పెడల్ కొడుతూ..కొడుతూ.. కారు లో తిరిగే స్ధాయి కి ఎప్పుడొచ్చామో,
 తెలియనే లేదు......

✍ఒకప్పుడు  తల్లిదండ్రుల బాధ్యత  మాది. కానీ ఇప్పుడు  నా పిల్లలకు  నేను బాధ్యత గా మారాను ఇది కూడా  ఎలా  జరిగిందో  తెలియనే లేదు.....

✍ఒకప్పుడు   పగలు  కూడా  హాయిగా  నిద్ర పోయే వారం..
కానీ ఇప్పుడు  నిద్ర రాని  రాత్రులు  ఎన్నో ఇది కూడా ఎలా జరిగిందో తెలియనే లేదు....

✍ఒకప్పుడు  నల్లని కురులనుచూసుకొని  గర్వంగా  వగలు పోయే వాళ్ళం..
అవన్నీ  ఎప్పుడు  తెల్లగా  మారాయో, తెలియనే లేదు...

  ✍ఉద్యోగం  కోసం  తిరిగి  తిరిగి  ..ఉద్యోగం పొందాక ఎప్పుడు  రిటైర్  అయ్యామో..
తెలియనేలేదు....

✍పిల్లల కోసం  ప్రతిదీ  అని ఎంత తాపత్రయం  పడ్డామో.. వాళ్ళు  ఎప్పుడు  దూరంగా  వెళ్లి పోయారో, తెలియనే లేదు.....

✍రొమ్ము విరుచుకొని అన్నదమ్ముల,అక్కచెల్లెండ్ల  మధ్య  గర్వంగా  నడిచే వాడిని  ఎప్పుడు  అందరూ...దూరమయ్యారో తెలియనే లేదు....

✍ఇప్పుడు   ఆలోచిస్తున్నాను.. నా కోసం..నా శరీరం  కోసం   ఏమైనా  చేసుకోవాలని..
కానీ..శరీరం  సహకరించడం లేదు. 

 ✍ఇవన్నీ..జరిపోయాయి.. కానీ  కాలం  ఎలా  గడిచిందో.... తెలియనేలేదు..... తెలియనేలేదు....

--(())--

 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 86 🌹

🌻. చేయవలసినది- చేయదలచినది - 2 🌻

ఇతర దేశాలలో వేదాధ్యయనం చేస్తూన్న వారు కొన్ని లక్షల మంది ఉన్నారు‌ ఏదో ఒక రకంగా ప్రొద్దున్నే రోజూ కాస్సేపు గుణగుణలాడి దేవుని దగ్గర సణిగినట్లుగా చేసి ఆఫీసుకి పోయినట్లుగా కాక వారు చాలా నిష్ఠగా చేస్తూ ఉన్నారు‌. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గాయత్ర్తీ మంత్రం ప్రపంచశాంతికై చేస్తూన్న వాళ్ళు ఉన్నారు.

ప్రపంచ శాంతికై, ఒక దేశానికి మరొక దేశానికి మధ్య యుద్ధం రాకుండా ఉండటం కొరకు, ప్రపంచంలోని మానవజాతి శాంతిగా ఉండాలి, పరస్పరం ఒకరికొకరు సమన్వయంతో ఉండాలి అనే దృష్టితో అహోరాత్రాలు నమకచమకాలు చేస్తూన్నవారు, ప్యారిస్ లో, లండను లో, కొన్ని వేల మంది ఇప్పటికి 6 సంవత్సరాల నుండి చేస్తున్నారు‌ (1980-82 నాటికి) అఖండమైన నామజపం కూడా ఇప్పుడు చెప్పిన దేశాలలోను మరియు న్యూయార్కులోను కొన్ని వేల మంది ఉన్నారు. ఈ విధంగా అఖండ నామజపం కూడా (24 గంటలు) 6 సంవత్సరాల నుండి నడుస్తున్నది.

ఇదంతా దేనికండీ అనగా ప్రపంచశాంతికై ఈ మహా యజ్ఞ నిర్వహణ జరుగుతోంది. అయితే ఇంతగా మనం భారతదేశంలో మనం చేస్తున్నమా? మనం మళ్ళీ వాళ్ళను (పాశ్చాత్యులను) చూసి నేర్చుకొనే రోజులు వస్తున్నాయి.

Masters బ్రహ్మ విద్య అందరికీ అర్థమయ్యేటట్లు చేయటం కోసం, Madam Blavetsky అనే ఆమె ద్వారా "గుప్త విద్య" (Secret Doctrine) అను దానిని సరహస్యంగా ప్రయోగోపసంహార పూర్వకంగా ఇచ్చారు.

అటుపైన 20వ శతాబ్దిలో 1934-35 సంవత్సరాల నుండి అఖండంగా ఒక 35 సంవత్సరాలు ఏలిస్ ఏ బెయిలీ అను ఆమె ద్వారా 24 సంపుటాలుగా బ్రహ్మవిద్య మళ్ళీ ప్రసాదింపబడినది‌.

ఇతర దేశాలను ఈ విషయమున గమనించినచో, ఈ గ్రంథముల అధ్యయనము అఖండ బ్రహ్మ విద్యా పారీణత తత్వపరిషత్తులు, గోష్ఠులు మొదలయినవి ఇంగ్లండ్, ఫ్రాన్స్, బెల్జియం, స్విట్జర్లాండ్, హాలండ్, నెదర్లాండ్స్ లోని ఇతర దేశాలలో మనకు చక్కగా కనిపిస్తాయి.

ఏ దేశానికి వెళ్లినా, బ్రహ్మ విద్యను అనుష్ఠిస్తున్న వాళ్ళు భగవద్గీతను పారాయణం చేస్తూన్న వాళ్ళు, వేదం ఉపనిషత్తులు అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు...
....✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
--(())--

కదలని ఆకాశంలో భూమి కదలడం మహిమ కాదా!
కదిలే భూమిపై మనం నిశ్చలంగా ఉండడం మహిమ కాదా!

⚡️✨⚡️✨⚡️✨

ప్రతి కదలిక "చైతన్యపు" మహిమే అని కనుగొన్న వాడే 'సిద్ధుడు'.

ఇది నిజం అనుకుంటేనే అన్ని బాధిస్తాయి.ఇది కల(మాయ) అని ఉంటే ఏది బాధించదు.

🕉🌞🌎🌙🌟🚩

*మెలకువలో సమాధానం ఉండదు.,
నిద్రలో ప్రశ్న ఉండదు.*

⚡️✨⚡️✨⚡️✨

ముష్టి చెట్టు తన పక్కనే ఉన్న చందనం చెట్టు యొక్క గొప్పతనం తెలుసుకుని, తాను అలా అవ్వాలని సాధన చేసిందట.

 ఇంతకీ దానికి కలిగిన జ్ఞానోదయం ఏమంటే--

 చందనం చెట్టు కి ఏది ఆధారమో నాకు అదే (భూమి) ఆధారం అని తెలుసుకుంది.

 బాహ్యంగా దేని ప్రత్యేకత దానికి ఉంటుందని,

అంతరంగా అంతా ఒకటే అని తెలుసుకున్నది.

 పోల్చుకోవడం మానితే అదే సాక్షాత్కారం అని గ్రహించినది.

🕉🌞🌏🌙🌟🚩

 ( శ్రీ రమణ మహర్షి బోధనలు )
🕉🌞🌎🌙🌟🚩

 ప్రశ్న: సాక్షాత్కారానికి అడ్డంకులు ఏమిటి?

జవాబు: జ్ఞాపకాలు, వాసనలు, ఆలోచనలు.

⚡️✨⚡️✨⚡️✨

 ప్రశ్న: ఆత్మ సాక్షాత్కారానికి సూచనలు చెప్పండి?

జవాబు: 1. ప్రాపంచిక దృష్టి నుంచి మనసును మరలించాలి.

2. మనసులోని అంతరమైన క్రియాశీలత విడనాడాలి

3. మనసును వాసనారహితంగా చేయాలి.

4. మనసును ఎల్లపుడూ ఆత్మవిచారణలో వుంచాలి.

🕉🌞🌎🌙🌟🚩
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 79 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 తమకొక ప్రత్యేక స్వభావమును అభ్యాసము చేసికొనకుండుట, దాని యందు కట్టుబడకుండుటయే యోగుల స్వభావము.  

కలియుగమున సాధకుని సమర్పణ బుద్ధిని బట్టి కలిధర్మము సోకని వాడుండును. 

దైవ ధర్మమే తన జీవితముగా మలచుకొన్న వానికి కలిధర్మము తనలో ఇమిడి ఒక మూల నిలిచి యుండునే కాని అంతరింపదు. అది ఇతరుల ప్రవర్తనపై తన అభిప్రాయముల రూపమున ఉండును. 

మోక్షమన్నది మానవులలో ఎవని స్థితిని బట్టి వారు ఏర్పరచుకొను పరిమితమైన భావము అది అపరిమితత్వమును గూర్చి ఏర్పడిన పరిమిత భావము......
✍ మాస్టర్ ఇ.కె. 🌻
🌹 🌹 🌹 🌹 🌹


🌹. సాధనా చతుష్టయ సంపత్తి - దమము 🌹

శమము, దమము , ఉపరతి, తితిక్ష , శ్రద్ధ, సమాధానము అను ఆరింటిని  శమాది షట్క సంపత్తి అంటాము.

దమము అనగా  బాహ్యేంద్రియ నిగ్రహము

బాహ్యేంద్రియములు అనగా
కర్మేంద్రియములు  - పాదములు , చేతులు, నోరు, మల మూత్ర విసర్జక అవయవములు అను ఐదు బాహ్య జగత్తులో వ్యవహరించుటకు లేక పనిచేయుటకు ఉపయోగపడతాయి. ఈ ఐదింటిని   కర్మేంద్రియములు అంటారు.

జ్ఞానేంద్రియములు - చెవులు, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు అను ఐదు శబ్ద, స్పర్స్య, రూప, రస , గంధములు అను పంచ విషయముల యొక్క జ్ఞానము తెలిసికొనుటకు ఉపయోగపడతాయి. కనుక వీటిని జ్ఞానేంద్రియములు  అంటారు.
ఈ పదింటిని కలిపి బాహ్యేంద్రియములు అంటారు.

సాధకులకు ప్రాధమికముగా భోగ్య వస్తువులు ఎదురుగా  ఉన్నను భోగించకుండా నిగ్రహించుకోవడాన్ని దమముగా చెపుతారు. అనగా ఇంద్రియములు మరియు  భోగ్య వస్తువులు మద్య చెపుతారు.

కాని నిజమునకు విషయి విషయాకార వృత్తి పొందకుండా ఉంచగలగడాన్ని దమము అంటారు.

విషయి అంటే విషయములకు సాక్షి.
విషయము అంటే మనస్సులోని ఆలోచనా తరంగములు.

అంటే ఎప్పుడైతే మనస్సులో ఇంద్రియవిషయ భోగ సంబందిత  ఆలోచనలు వచ్చాయో అప్పుడు వెంటనే దానికి వ్యతిరేక ఆలోచనను ప్రవేశపెట్టి మనస్సులోని ఆలోచన విషయాకార వృత్తి పొందకుండా ఉంచగలగటాన్ని దమము అంటారు. దమమును విషయి , విషయముకు మధ్య చెబుతారు.

కర్మేంద్రియములను సత్కర్మ ఆచరించుటకు , జ్ఞానేంద్రియములను  దైవీ సంబందిత విషయములలో వినియోగించుట వలనను దమమును అలవరచుకొనవచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹

A:-- multidimension అంటే అనంతమైన కోణాలలో విస్తరించిన తలాలు అని అర్థం.

1) మన జీవితాన్ని,మన జన్మ పరంపరలకనుగుణంగా(అంటే ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ అలాగ) చూస్తే టైం అనేది మనకు ఏక దిశలో (uni directional) ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇలా పరిగణించినట్లైతే కర్మ సిద్ధాంతం ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ టైం అనేది మన 3d intelligence కి అందే స్థితిలో లేదు.టైం అనేది ఒక భ్రమ.

2) time అనేది multidimensional రాశి. అలానే ఆత్మ కూడా multidimensional.

3) ఆత్మ యొక్క జన్మలు గతం,వర్తమానం,భవిష్యత్తు అన్నీ ఏకకాలంలో ఒకేసారి సంభవిస్తుంటాయి.

4) భూమి మీద మనం జీవించేకాలం ..... కాస్మిక్ టైం స్కేల్ లో చూస్తే ..... దేహంలో ప్రతి క్షణం అణువులు పుడుతూ చస్తూ ఉన్నంత కాలం మాత్రమే. అనగా కాస్మిక్ టైం స్కేల్ ప్రకారం 100 సంవత్సరాల మనం బతికాం అనుకుంటే మన దేహంలో డైలీ పుడుతూ చనిపోతూ ఉన్న అణువులు ఎంత కాలం జీవిస్తున్నాయో అంతకాలం మనం జీవించినట్టన మాట అంటే కనీసం ఒక్క సెకను కూడా జీవించనట్టు.

5) మన అంతర్ ప్రపంచం ఇంటెలిజెన్స్ తో పోలిస్తే మన 3d ఇంటెలిజెన్స్ సముద్రంలో నీటిబొట్టంత.

6) ఏకదిశలో మనం కర్మ తర్వాత జన్మ అని పరిగణిస్తే ఆత్మ ఒక్కొక్క మెట్టు ఎదగాలి. అనగా past లైఫ్ లో 8వ తరగతి పాస్ అయినట్లయితే ఇప్పుడు 9వ తరగతి 10వ తరగతి lessons అనగా జీవిత పాఠాలు పాస్ అవ్వాలి అనమాట.

7) ఆత్మ అనేది multidimensional. ఆత్మ ఒక్క దేహానికే పరిమితం కాదు అని తెలుసుకుంటే ఇక కర్మసిద్ధాంతం వర్తించదు.

8) మన అంశాత్మలు కోటానుకోట్ల లోకాల నుండి గడించిన జ్ఞానం మనం మన అంతరప్రపంచం నుండి ఈ క్షణమే పొందవచ్చు.ఏక కాలంలో అనేక దేహాలతో మనమున్నాము అనే విషయాన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ వుంటే multidimensional కోణంలో ఉన్న అవకాశాలన్నీ మనకు అందుబాటులోకి వస్తాయి.

9) సర్వకళలు, సకల శాస్త్రాలు అపరిమితమైన జ్ఞానం,నిరంతర ప్రవాహం వలే అంతర్ ప్రపంచాన్ని చేరుకుంటుంది.అన్ని కళలు, సకల శాస్త్రాలకు సంబందించిన జ్ఞానాన్ని మనం సంకల్పిస్తే ఈ క్షణమే మనం అందుకోగల సర్వ సమర్ధతలను మనం కలిగివున్నాము.

10) multidimensional ఆత్మగా పరిణామం చెందుతున్న మనకు multidimensional రాశి అయిన టైం లో అన్ని జన్మలు ఒకేసారి సంభవిస్తున్నాయి.

11) 🕸 చక్రాన్ని గమనించండి

మధ్యలో dot మన ఆత్మ.
ఆ dot(చుక్క) దెగ్గర నుండి 12 గీతలు ఉన్నాయని ఊహించుకోండి.ఆ బొమ్మలో 7 గీతలు మాత్రమే ఉన్నాయి.
12 గీతలు 12 కాలాలుఅంటే గతకాలం వర్తమానం,భవిష్యత్తు అలాగ
(క్రీస్తుపూర్వం (100bc,110bcఅలాగ) క్రీస్తుశకం (120ac,130ac) అనుకుందాం.

1) ఆ 12 గీతలు మనం తీసుకున్న జన్మలు.గతం,వర్తమానం,భవిష్యత్తు.....ఇలా అన్నీ జన్మలు ఒకేసారి తీసుకుంటున్నాము.అంటే ఆత్మ ఒక్కటే,అంశాత్మ లుగా మనం డాక్టర్ గాను ,engineer గాను,పేదవాడు గాను,దనికుడిగాను,అంగవైకల్యంతో ఇలా అన్ని జన్మలు ఏకకాలంలో తీసుకుని అన్ని అనుభవాలను ఒకేసారి పొందుతున్నాము.అంటే ఆత్మకు అన్ని జన్మల తాలూకు జ్ఞానం ఉంటుంది.

           మనకు సంగీతం నేర్చుకోవాలనిపించింది అనుకోండి. already మన అంశాత్మ వేరే dimension లో సంగీతవిద్వాంసురాలనుకోండి, ఆ జ్ఞానాన్ని మనం మన అంతర్ ప్రపంచం ద్వారా పొందవచ్చు.

12) ఒక గోళాన్ని (🏀)
గమనిద్దాము.
ఈ గోళంలో అనంతమైన గత జన్మలు,అనంతమైన భవిష్యత్తు జన్మలు,అనంతమైన వర్తమానం జన్మలు ఏకకాలంలో ఈ క్షణంలోనే అనంతమైన జన్మలు తీసుకుని ఉన్నాము.అంటే అనంతమైన అనుభవాలు,అనంతమైన జ్ఞానం ఈ క్షణమే మనకు ఉంది అని అర్థం చేసుకోండి.

13) ఒక సైకిల్ చక్రం ఒక దిశలో వెనుకకు ముందుకు మాత్రమే కదలగలదు.ఒక గోళం ఏ దిసలోనైన దొర్లగలదు. అలా ఎన్ని దిశలలోనైన దాని గమనం ఉంటుంది.

     అలా టైం ని మనం ఒక నిర్దిష్ట దిశలో కాకుండా ఏ దిసలోనైన ఉంటుందని అర్థం చేసుకోండి.
ఒక సెకను ని పది లక్షల భాగాలుగా విభజిస్తే ఒక భాగంలోని కాలంలో ఈ విశ్వం లోని మూల చైతన్యం కొన్ని కోట్ల రెట్లు వ్యాకోచం చెంది ఉంటుంది. ఆ కాల వ్యవధిలో కోటానుకోట్ల లోకాలు సృష్టింపబడి ఉంటాయి. ఆ సృష్టి లో ఉన్న అనంతమైన dimensions లో అన్ని లోకాలు చైతన్య పరిణామం చెందుతున్నాయి.ఈ బ్రహ్మాండం లో మనం లీనమయ్యేదంటూ ఉండదు.


🌹. క్లీం బీజ సాధన  మహాత్మ్యము 🌹

క్లీం= (క+ ల+ ఈ+ ం ) చతుర్వర్ణ సమన్వితము. కామకలాబీజము; మన్మధబీజములను నామములు. ఇందు 'క' కార+ 'ం' బిందువులు - ''విష్ణు'' ప్రతిపాదకములు. 'ల' కార 'ఈ' కారములు= ''లక్ష్మి'' ప్రతిపాదకములు. సర్వసమిష్టిగా - ''క్లీం'' బీజము లక్ష్మీ= నారాయణాత్మకము.

24 గంటలని సద్వినియోగ పరచుకోవటం ఎలా అన్నది క్లీం భీజ సాధన చెప్తుంది. అశరీర ధారులైనవంటి ఈ 3 శక్తులు (భూ:,భువ:,స్వ:) ఈ మూడింటిని అర్ధం చేసుకోవాలి.

క్లీం బీజ సాధకుడు సాధన చేసేప్పుడు ఆ శబ్ధాన్ని క్లీం బీజము నా శరీరములో ఎక్కడ ధ్వనిస్తోంది అనేది గమనించుకోవాలి. ఆ స్పందనలను పట్టుకోవాలి. కంప్యూటర్ కర్సర్ నొక్కితే ఏది కావాలో అది మనము సెలెచ్ట్ చేస్కోగలము, చేసుకున్నాక మనకు కావల్సిన మార్పులు మనము చేసుకోవచ్చు. అదే విధముగా ఆ శబ్ధము ఎక్కడ నొక్కబడుతుందో అర్ధం చేసుకోవటము చాలా అవసరము.

వేళ్ళకు భూమినుండి శక్తి వస్తే అది ప్రతి ఆకుకు చేరుతుంది, అలాగే నిద్రా స్ధితిలో మీకు శక్తి లభిస్తే భౌతిక జగత్తులో మీకు కావల్సిన శక్తి మీ శరీరానికి సహజంగా వస్తుంది. పరిణామ క్రమాన్ని అర్ధము చేసుకొని మీ జీవిత విధానాన్ని మీదైన రీతిలో మల్చుకోవటము నేర్చుకోవాలి. 

జాగృతావస్థలో మన జీవితము 5 ఇంద్రియాలకు లొంగిపోయి ఉంటుంది. క్లీం బీజ సాధన ద్వారా మీరు వీటిని మీ అదుపులోకి తెచ్చుకోవచ్చు.

నా శరీరము కూడా ఒక కణమే, దీని లోపల బయట కొన్ని రసాలు ఉన్నాయి, రసోవైసహ:. సముద్రంలో మునిగితే మన లోపల అనేక జివరసాలు ఉన్నాయి, సముద్రము బయట నీరు ఉన్నది. మనం అలాంటి ఒక ప్రాణ సమద్రములో నిండి ఉన్నాము. 

ఈ క్లీం బీజ ధ్యానాన్ని బాగా అర్ధం చేస్కొని ఆచరించండి. మన శరీరములో సమత్వం ఈ క్లీం బీజము వలన వస్తుంది

క్లీం పరమాణువులు, శ్రీం పదార్ధము హ్రీం కణాలు. కణాలు స్వయంపోషక ప్రవృత్తిని ఇచ్చే శక్తి, కణాలు ఈ శక్తిని పరమాణువులకు, పదార్ధానికి కల్గిస్తాయి.
🌹 🌹 🌹 🌹 🌹
యోగస్థితి

శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉన్నతమైన యోగస్థితిని ఎలా పొందగలమో వివరించాడు. అభ్యాసం, వైరాగ్యం అనే రెండు మాటలతో మనసును స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన మార్గం చూపించాడు. దీన్నే అభ్యాస యోగం, సాధన యోగం అంటారు.


మనసు స్వాధీనానికి తప్పనిసరిగా ‘యమ’ (అహింస, సత్యవ్రతం, దొంగతనం చేయకుండా ఉండటం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం), ‘నియమ’ (శారీరక, మానసిక, పరిశుభ్రత, సంతృప్తి, శాస్త్రాధ్యయనం, దైవారాధన) అనే అభ్యాసాలు సాధన చేయాలని యోగశాస్త్రాలు చెబుతున్నాయి.


మనసు అల్లకల్లోలమైనప్పుడు మనం ఊపిరి వేగంగా తీసుకుంటాం. క్రమబద్ధతా ఉండదు. మనసును శాంతపరచడానికి శ్వాసను క్రమబద్ధం చేయడం ఒక పద్ధతి. నిండుగా గాలిని పీల్చి వదలడాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే నిశ్చలమైన మానసిక స్థితిని పొందవచ్చు. ప్రాణశక్తి మీద పట్టు సాధించడం కోసం ఊపిరిని నియంత్రించడమే ప్రాణాయామం.


యోగి ఎవరన్నదానికి గీతలో కృష్ణుడు సమాధానమిచ్చాడు. ఈ ప్రాపంచిక కోరికలు, వాంఛల నుంచి మనసును అధిగమించి స్వతంత్రంగా, వ్యక్తిగా ఉండగలిగేవారే యోగి.


మనసును అధిగమించడమంటే దాన్ని నొక్కిపెట్టి ఉంచడం, నియంత్రించడం కాదు. మనసనేది ఆలోచనల ప్రవాహం. కోరికలు, వాంఛలూ ఆలోచనలతో సంక్రమించేవే. అంతవరకూ అనుభవంలోకి రాని దాన్ని అనుభవించాలనుకోవడం కోరిక. అదే అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనుకోవడం వాంఛ.


ఆలోచనతో గుర్తింపు అంటే- ‘నేను కోపంగా ఉన్నాను’ అనుకోవడం కాకుండా ‘నా మనసు తెరమీద కోపం కనిపిస్తోంది’ అనుకోవాలి. ఆ కోపాన్ని చూడగలిగినప్పుడు ఆలోచనను వేరుచేయడం కుదురుతుంది. ఆ ఉద్వేగాన్ని తన నుంచి దూరంగా ఉంచినప్పుడు అది బలహీనపడుతుంది. ఆలోచనలను ఒక సాక్షిగా చూడగలిగినప్పుడు వ్యక్తికి, అతడి ఆలోచనకు ఖాళీ ఏర్పడుతుంది. యోగి కావడానికి కోరిక అడ్డుకాదు. ఆ కోరిక కోసం పాకులాడటం, దానికి అతుక్కుపోవడం చేయకూడదు. అందుకే మనసును అధిగమించాలి.


ఒకే గమ్యం చేరుకోవడానికి నాలుగు యోగమార్గాలను సూచించారు. నిత్య జీవితంలో ఇంటాబయటా ఎటువంటి అహం లేకుండా పనిచేసుకుపోతూ, కొంత దైవ చింతనతో ఇతరులకు సహాయాన్ని అందించడం కర్మయోగ.


సాధకుడు ప్రార్థన, దైవారాధన, నిర్నినిబంధంగా ఇతరులను ప్రేమించడం భక్తియోగలో భాగం.


మానసిక విజ్ఞానం తెలుసుకుని చేసే ఒక ప్రయాణం లాంటిది రాజయోగ. జీవశక్తి (ప్రాణం) గురించి అవగాహన, ధ్యానంతో మనసును ప్రభావితం చేయాలి అనుకునేవారికి రాజయోగ చక్కని మార్గం.


బుద్ధిజీవులకు తోడ్పడేది జ్ఞానయోగ. వేదాంతాన్ని ఒక వాహనంగా తీసుకుని మనశ్శక్తితో ముందుకెళ్ళడం. వ్యక్తిగత స్వభావాల గురించి తెలిసుండాలి. ఇతర మార్గాల్లోని పాఠాలను గ్రహించినవారు ఈ మార్గంలో ఆత్మజ్ఞానం పొంది ఆధ్యాత్మిక బాటలో పయనిస్తారు.


‘యోగ అన్నది విజ్ఞానశాస్త్రం. సాధకులకు మనసును అధిగమించడమెలాగో నేర్పుతుంది’ అని పతంజలి యోగ సూత్రాలు చెబుతున్నాయి. స్థితప్రజ్ఞత గురించి ప్రస్తావిస్తూ, ఏ చర్య చేపట్టాలన్నా యోగికి ఉండే కౌశలాన్ని సంపాదించాలంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు.


యోగ సాధన వల్ల మనసులో సద్భావనలు చోటుచేసుకుంటాయి. చిత్తశుద్ధి ఏర్పడుతుంది.


‘వెయ్యిమందిని వెయ్యిసార్లు యుద్ధంలో ఓడించినవాడికన్నా తన మనసును జయించినవాడే పరాక్రమవంతుడు’ అంటాడు గౌతమ బుద్ధుడు.

🕉🌞🌎🌙🌟🚩

మర్కట కిశోర... మార్జాల కిశోర న్యాయము.....

మనకు భక్తిలో నవవిధ భక్తి విధానాలు ఉన్నాయి... 

1) శ్రవణం,
2) కీర్తనం,
3) స్మరణం,
4) పాదసేవనం,
5) దాస్యం,
6) సఖ్యం,
7) అర్చనం,
8) వందనం,
9) ఆత్మ నివేదనం.

..ఇలా ఉన్నాయి. మనము దేవ దేవుని మీద అచంచల భక్తి ప్రపత్తులు కలిగి ఉంటే అయన ఎన్నడూ మన చేయి విడువడు. మనలను ఎల్లప్పుడూ సరి అయినా దారిలో నడిపిస్తాడని మనకు అనేక ఉదంతాలు మన ఇతిహాసాలే కాదు చరిత్ర నిండా ఉన్నాయి.

భగవంతుని మీద నిశ్చల భక్తితో "అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ" అన్న రీతిలో మనం జీవనం గడపాలి.

గజేంద్ర మోక్షమే చూడండి.. నేను బలవంతుడిని అని మొసలితో వేల సంవత్సరాలు గజేంద్రుడు పోరాడాడు. కుదరలేదు అపుడే భగవంతుడు గుర్తుకొచ్చి పిలిచాడు. అబ్బే ఎలాగైతేనేం ఇపుడు గుర్తుకొచ్చానులే పోదాం పద అని వెంటనే రాలేదు. ఇలా వేడగా వేడగా గజేంద్రునికి కలడు కలడు అనేవాడు కలడో లేదు. నా అంతటి వాడు శరణు అని పిలిస్తే వెంటనే రాడేమీ అనుకున్నాడు. ఇంక శక్తి సన్నగిల్లింది నీవు తప్ప ఇహ పరము లేదే ఇక అని వేడుకున్నాడు. అపుడే తాను వైకుంఠములో ఉన్నా అన్నీ మరచిపోయి వచ్చి శ్రీహరి రక్షించాడు.

ద్రౌపదీ వస్త్రాపహరణం సంఘటనే తీసుకోండి.. వస్త్రాపహరణం వేళ దుశ్శాసనుని తాను నిలువరించగలను అని పెనుగులాడింది.. కానీ మదించిన ఆ దుశ్శాసనుని ముందు తన శక్తి నిలువదని, సభలో ఎవరు తనను రక్షించేవారే లేరని తనకు ఇక దిక్కు ఆ శ్రీకృష్ణుడు ఒక్కడే అని తెలుసుకొని అప్పుడు శరణు కోరింది. అపుడే శ్రీకృష్ణుడు రక్షించాడు.

భగవతములో అంబరీష దుర్వాస వృత్తాంతము మనకు తెలిసిందే.. తనను నమ్మిన అంబరీషుని దుర్వాసుడు సృష్టించిన శక్తి నుండి రక్షించడానికి చివరకు మహర్షి అయినా దుర్వాసుని సైతం వదలలేదు.. అదీ స్వామి తనను నమ్మిన వారిని కాపాడడానికి భక్తవత్సలుడై ఎంతటి వారిని అయినా ఉపేక్షించడు అని చెప్పే వృత్తాంతము.

మన దైవ భక్తిలో దైవము మనలను ఎలా కాపాడతారనేదానికి మన పురాణాలలో కొన్ని న్యాయాలు ఉన్నాయి. అవి మర్కట కిశోర న్యాయము లేదా మార్జాల కిశోరన్యాయము అని.

మనం చెట్ల మీద గెంతే వానర రాజాలను చూసే ఉంటాము. అవి చిటారు కొమ్మకు వెళ్లి ఒక కొమ్మ నుండి మరో కొమ్మ మీదకు ఎగిరి దూకుతూ ఉంటాయి. ఒక్కోసారి తల్లి కోతి కడుపుకు అతుక్కుని పిల్ల కోతి ఉంటే భీతి అన్నదే లేకుండా తల్లి కోతి ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు ఎగిరి దూకుతుంది. గోడల మీద దాటుతుంది. తన తల్లి కోతిని ఆ పిల్ల కోతి ఎట్టి భయము లేకుండా అలాగే అతుక్కుని ఉంటుంది. మా అమ్మ కిందపడితే నేను కూడా కింద పడిపోతానేమో అనే సందేహము దానికి ఏ కోశానా ఉండదు.

అలాగే మనము పిల్లలను పెట్టిన పిల్లిని చూస్తాము. ఈ రెండు రోజులు ఇక్కడ ఉన్న పిల్లి అక్కడ తన పిల్లలకు రక్షణ లేదు అనిపించిందా లేదా ఏ కుక్క శబ్దమో మరేదైనా విని పసిగట్టిందా వెంటనే తన పిల్లలను నోట గరచుకుని సురక్షితం అనిపించే మరో చోటుకు మార్చివేస్తుంది.

అలాగే మనము భగవంతుని ఒక కోతి పిల్ల తన తల్లి మీద ఎటువంటి సంకోచం లేకుండా తన తల్లి ఉంది తనకు ఏమీ కాదని భావిస్తుందో అలా భగవంతుని మీద మనము అనన్య ఏకాగ్రతతో ఎటువంటి సంకోచం లేకుండా స్థిర చిత్తముతో నమ్మాలి. దీనినే మర్కట కిశోర న్యాయము అంటారు. మనము నమ్మిన భగవంతుడు ఒక పిల్లి తన పిల్లలను రక్షించడానికి ఎన్ని ఇళ్ళు మారుస్తుందో అలాగే దైవము మన వెంట ఉండి అన్నీ తానై నడిపిస్తాడు. దీనినే మార్జాల కిశోర న్యాయము అంటారు...

|| ఓం నమః శివాయ ||

సమాధి - వివిధ రకాల సమాధి స్థితులు - విశ్లేషణ:

 యోగ శాస్త్రంలో 8 రకములైన సమాధి స్థితుల వర్ణన కలదు. ఇవి 8 రకాలైన జ్ఞానోదయ పద్ధతులు కూడా. అయితే ఈ "సమాధి" స్థితిని వర్ణించడం  దుర్లభం కూడా. అయితే, ఈ సమాధి అనుభవం కూడా అంతే దుర్లభం.

   సమాధి స్థితిలో, ఏ లక్ష్యమూ లేకుండా చిత్తాన్ని ఉంచినపుడు జ్ఞాన స్వరూపమూ, శాశ్వతమూ, సర్వవ్యాప్తమై వెలిగే స్వస్థితిని సాధకుడు పొందుతాడు. అంటే అర్ధం మాత్రమే భాసిస్తుంది. ఇదే యోగుల గమ్యమైన "సమాధిస్థితి" సమాధులు 1. సంప్రజ్ఞాత సమాధి, 2.అసంప్రజ్ఞాత సమాధి 3.సవితర్క సమాధి 4.నిర్వితర్క సమాధి 5.సబీజ సమాధి
6.నిర్బీజ సమాధి 7.ధర్మ మేఘ సమాధి అని 8. ప్రకృతి లయ సమాధి...అని రకములు.

ఇంకనూ అనేక సమాధి స్థితులు ఉన్ననూ, ప్రస్తుతానికి ఇవి చాలును.

   సంప్రజ్ఞాత సమాధి 

  దీన్లో చిత్తవృత్తులు శాంతించే ఉంటాయి. కాని బీజరూపంలో సంస్కారాలు మిగిలి, సమయం వచ్చినపుడు తిరిగి మొలకెత్తడానికి అనువుగా ఉంటాయి. కాబట్టే దీన్ని "సబీజ సమాధి" అనికూడా అంటారు. ధ్యాన, ధారణా, సబీజ సమాధులను పొందిన యోగికి  సర్వశక్తులు, సర్వజ్ఞత్వము కలుగుతాయి గాని ముక్తుడు కాలేడు. ఇంకా పునర్జన్మను కలిగించే కర్మబీజాలు ఉంటాయి. అణిమాది సిద్ధులు కలుగుతాయి.

అసంప్రజ్ఞాత సమాధి 

 దీన్లో నేను అనే అహంకారం ఉండదు. బీజరూపంలో ఉండే చిత్త వృత్తులు నశిస్తాయి. కర్మబీజం దగ్ధమై ఉండటంవల్ల "నిర్బీజ సమాధి"అని అంటారు. దీన్లో వాసనలు నశించి, మనో నాశనము కూడ కలగటం వల్ల, యోగి పరమాత్మను తెలిసుకొని ముక్తిని పొందుతాడు.

    వితర్కం, విచారణం (యుక్తాయుక్త విచక్షణ) – ఆనందం, ఆస్మితం అనే స్థితులతో కూడుకున్న సమాధిస్థితిని సంప్రజ్ఞాత సమాధి అంటారు. సంప్రజ్ఞాత సమాధి మళ్ళీ నాలుగు రకాలు.

మొదటిది – సవితర్క సమాధి. ఇందులో మనసు ఒకానొక విషయాన్ని, తదితర విషయాల నుండి వేరు చేసి, దాన్నే పదే పదేధ్యానిస్తూ ఉంటుంది.

రెండవది – నిర్వితర్క సమాధి. దేశ కాలాల నుండి పృధివ్యాది భూతాలని వేరు చేసి, వాటిని వాస్తవ రూపంలో చింతన చేస్తే దానిని నిర్వితర్కమంటారు.

మూడవది... నిర్విచార సమాధి – పైన చెప్పిన ధ్యానంలో దేశ కాలాలని తొలగించి, సూక్ష్మ భూతాలను వాటి వాస్తవ రూపంలో చింతన చేస్తే ఆ ధ్యానాన్ని నిర్విచార సమాధి అంటారు.

నాల్గవది ..... ఆనంద సమాధి.  స్థూల, సూక్ష్మభూతాలను కూడా వదిలివేసి, అంతరింద్రియ మనసు ధ్యేయమై, అంతఃకరణం రజస్తమోగుణరహితమై ఉందని భావిస్తే దానిని ఆనంద సమాధి అంటారు. చిత్తవృత్తులనన్నింటినీ నిరాకరించే, నిరంతర అభ్యాసం ద్వారా లభించే, అవ్యక్త సంస్కారాలు మాత్రమే చిత్తంలో శేషించి ఉండే మరొక సమాధి స్థితి ఉంది. ఇదే అతీంద్రియ జ్ఞానావస్థ అయిన అసంప్రజ్ఞాత సమాధి. దీని వల్ల మోక్షం లభిస్తుంది. కానీ ప్రకృతి తత్వాలను దాటాలి కదా! ఇదే కదా, సాంఖ్యం చెబుతుంది.

అభ్యాస వైరాగ్యాలను అవలంబించకుండా, మనసును సంకల్ప శూన్యం చేసేవాడు మూర్ఖుడు. మనసును వృత్తి శూన్యం చేయాలంటే ఉత్కృష్ట బలం, అత్యున్నత నిగ్రహం కావాలి.(తీవ్ర వైరాగ్యం లేకుంటే ఈ సమాధి) విదేహు (దేవత)లకూ, ప్రకృతి లయులకూ పునర్జన్మ హేతువవుతుంది.
 
క్షీణవృత్తులు కల యోగి చిత్తం ఆత్మ లేక పురుషునిలో వర్ణయుక్త వస్తువులు ఎదుట ఉన్న స్ఫటికం వలే తాదాత్మ్యం పొందుతుంది. ద్యానస్థిత యోగి పువ్వు ముందున్న స్ఫటికం వంటివాడు. పువ్వు ఎర్రగా ఉంటే, దాని దగ్గర ఉండే స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. సమాపత్తి అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందడమే సంప్రజ్ఞాత సమాధి ఫలం.
శబ్దం, అర్థం, జ్ఞానం అనే మూడు కలిసి ఉన్నప్పుడు సవితర్క సమాధి అంటారు.
 స్మృతి పరిశుద్ధమై గుణరహితమై ధ్యేయపు అర్థాన్ని మాత్రమే భాసింపచేస్తున్నప్పుడు నిర్వితర్క సమాధి కలుగుతుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే శబ్దార్ధజ్ఞానాలని వేర్వేరుగా గ్రహించగలం. దీన్నే "నిర్వికల్పసమాధి" అంటారు. సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు బీజసమాధులై ఉంటాయి. ఇవి పూర్వకర్మ బీజాలను నిర్మూలించలేవు. కాబట్టి వీటి వల్ల మోక్షం సిద్ధించదు

 నిర్విచార సమాధిలో పొందే ప్రజ్ఞ సత్య పరిపూర్ణమైనది. ఈ స్థితిని అందుకొన్న యోగి పొందే ప్రజ్ఞే ఋతంభర ప్రజ్ఞ.
 ప్రత్యక్షానుభవాలతో లభించే జ్ఞానం సామాన్య విషయాలను తెలుపుతుంది.

ఈ సమాధి వల్ల కలిగే ప్రజ్ఞ, ప్రత్యక్షానుమానాలతో గ్రహించలేని విషయాలను ప్రకాశింపచేస్తుంది. వేదాలనన్నింటినీ పఠించినా, మనకెట్టి సాక్షాత్కారం కలగదు. అయితే వేదవిదులని అనుసరించి సాధన చెయ్యడం వల్ల అవాఙ్మానసగోచర అఖండసచ్చిదానంద స్థితి పొందగలం అని ఈ సూత్రకారుడి అభిప్రాయం. అయితే పతంజలి... ఋషి కాబట్టి...ఆ మహితాత్ముడు చెప్పినది "ఆప్తవాక్యమే"... హేతువాదం మరియు తర్కజ్ఞానంతో అతీంద్రియ జ్ఞానం కలగదని మనకి తెలుసు. ఆత్మ, పరమాత్మల వంటి తత్త్వాలు బాహ్యేంద్రియగోచరాలు కాజాలవు. ఇంద్రియజన్య జ్ఞానాన్ని దాటితే తప్ప సాక్షాత్కారం అనేది ఎప్పటికీ కలగదు. తార్కిక జ్ఞానాతీతుడు కాదగ్గ శక్తి మనిషికి ఉంది. యోగాభ్యాసంతో ఈ శక్తి వికసించగానే మనిషి తార్కిక జ్ఞానాతీతుడై అతీంద్రియ విషయాలను ప్రత్యక్షంగా అవలోకిస్తాడు. అయితే...సమాధి వల్ల కలిగే సంస్కారం,  ఇతర సంస్కారాలన్నింటినీ నిరోధిస్తుంది.

చిత్తాన్ని ఏకాగ్రం చేయటానికి ప్రారంభించగానే చిత్త వృత్తులు విజృంభిస్తాయి. కానీ పైన చెప్పిన సాధన వలన ఏకాగ్రత పెరిగి, తద్ద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలని నిరోధించగలిగేంత ప్రబలంగా ఉంటాయి.
ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించడం వల్ల సర్వం నిరోధితమై నిర్భీజసమాధి ఏర్పడుతుంది.

పామరుడు తన శరీరమే ఆత్మ లేక పురుషుడు అనుకుంటాడు, పండితుడు అయినా తన మనసే ఆత్మ అనుకుంటాడు. ఇద్దరూ భ్రమలోనే ఉన్నారు. వివిధ చిత్త వృత్తులు పురుషుని ఆవరించి ఉండడం వల్ల, ఈ ఆవరణం ద్వారా పురుషుని ప్రతిబింబమే మనకు ఛాయామాత్రంగా గోచరిస్తుంది. కాబట్టి కోపం అనే చిత్తవృత్తి కలిగిన వెంటనే “నాకు కోపం వచ్చింది” అంటూ, పురుషునికి కోపం వచ్చినట్టు అనుకుంటాం. ప్రేమ అనే చిత్త వృత్తి కలిగితే, ఆ ప్రతిబింబాన్ని పురుషునిలో చూసి “మాకు ప్రేమ ఉంది” అని చెబుతాం. చిత్తం అనే సరస్సును, వృత్తులు అనే తరంగాలు ఆవరించిఉన్నంతకాలం పురుషుడిని దర్శించాలేం. కాబట్టి మొదటగా చిత్త వృత్తుల స్వభావ స్థితుల గురించి, తర్వాత చిత్త వృత్తులని నిరోధించే ఉపాయాలని గురించి, అగ్నిని అగ్నియే దహిస్తుంది – అన్న రీతిలో ఒక్క వృత్తియే, ఇతర వృత్తులనన్నింటినీ నిరోధించేదాకా ఆ వృత్తిని ప్రబలం చేసే విధానాన్ని పతంజలి బోధించాడు. ఒకటే చిత్త వృత్తి మిగిలి ఉన్నప్పుడు దానిని నిరోధించడం సులభం. అప్పుడు కలిగే సమాధినే "నిర్భీజసమాధి" అంటారు.

ఇలా వృత్తి నిరోధం సిద్ధించగానే, అద్వితీయ – కేవల – జననమరణరహిత – నిత్య – నిర్వికార – స్వయంజ్యోతి అయిన పురుషుడు సహజ వైభవంతో ప్రకాశిస్తాడు.-------మహర్షి పతంజలి

అభ్యాస వైరాగ్యాలను అవలంబించకుండా, మనసును సంకల్ప శూన్యం చేసేవాడు మూర్ఖుడు. మనసును వృత్తి శూన్యం చేయాలంటే ఉత్కృష్ట బలం, అత్యున్నత నిగ్రహం కావాలి.(తీవ్ర వైరాగ్యం లేకుంటే ఈ సమాధి) విదేహు (దేవత)లకూ, ప్రకృతి లయులకూ పునర్జన్మ హేతువవుతుంది.

 క్షీణవృత్తులు కల యోగి చిత్తం ఆత్మ లేక పురుషునిలో వర్ణయుక్త వస్తువులు ఎదుట ఉన్న స్ఫటికం వలే తాదాత్మ్యం పొందుతుంది. ద్యానస్థిత యోగి పువ్వు ముందున్న స్ఫటికం వంటివాడు. పువ్వు ఎర్రగా ఉంటే, దాని దగ్గర ఉండే స్ఫటికం కూడా ఎర్రగా కనిపిస్తుంది. సమాపత్తి అనగా సాక్షాత్కారము. సాక్షాత్కారము పొందడమే సంప్రజ్ఞాత సమాధి ఫలం.
శబ్దం, అర్థం, జ్ఞానం అనే మూడు కలిసి ఉన్నప్పుడు సవితర్క సమాధి అంటారు.
 స్మృతి పరిశుద్ధమై గుణరహితమై ధ్యేయపు అర్థాన్ని మాత్రమే భాసింపచేస్తున్నప్పుడు నిర్వితర్క సమాధి కలుగుతుంది. నిర్వితర్క ధ్యానాన్ని చిరకాలం అభ్యాసం చేస్తే శబ్దార్ధజ్ఞానాలని వేర్వేరుగా గ్రహించగలం. దీన్నే "నిర్వికల్ప సమాధి' అంటారు. సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు బీజసమాధులై ఉంటాయి. ఇవి పూర్వకర్మ బీజాలను నిర్మూలించలేవు. కాబట్టి వీటి వల్ల మోక్షం సిద్ధించదు.
నిర్విచార సమాధిలో పొందే ప్రజ్ఞ సత్య పరిపూర్ణమైనది. ఈ స్థితిని అందుకొన్న యోగి పొందే ప్రజ్ఞే "ఋతంభర ప్రజ్ఞ"
 ప్రత్యక్షానుభవాలతో లభించే జ్ఞానం సామాన్య విషయాలను తెలుపుతుంది.

   ఈ సమాధి వల్ల కలిగే ప్రజ్ఞ, ప్రత్యక్షానుమానాలతో గ్రహించలేని విషయాలను ప్రకాశింపచేస్తుంది. అయితే వేదవిదులని అనుసరించి సాధన చెయ్యడం వల్ల అవాఙ్మానసగోచర అఖండసచ్చిదానంద స్థితి పొందగలం అని సూత్రకారుడి అభిప్రాయం. అయితే పతంజలి... ఋషి కాబట్టి...ఆ మహితాత్ముడు చెప్పినది "ఆప్తవాక్యమే"... హేతువాదం మరియు తర్కజ్ఞానంతో అతీంద్రియ జ్ఞానం కలగదని మనకి తెలుసు. ఆత్మ, పరమాత్మల వంటి తత్త్వాలు బాహ్యేంద్రియ గోచరాలు కాజాలవు. ఇంద్రియజన్య జ్ఞానాన్ని దాటితే తప్ప సాక్షాత్కారం అనేది ఎప్పటికీ కలగదు. తార్కిక జ్ఞానాతీతుడు కాదగ్గ శక్తి మనిషికి ఉంది. యోగాభ్యాసంతో ఈ శక్తి వికసించగానే మనిషి తార్కిక జ్ఞానాతీతుడై అతీంద్రియ విషయాలను ప్రత్యక్షంగా అవలోకిస్తాడు. అయితే...సమాధి వల్ల కలిగే సంస్కారం,  ఇతర సంస్కారాలన్నింటినీ నిరోధిస్తుంది.

చిత్తాన్ని ఏకాగ్రం చేయటానికి ప్రారంభించగానే చిత్త వృత్తులు విజృంభిస్తాయి. కానీ పైన చెప్పిన సాధన వలన ఏకాగ్రత పెరిగి, తద్ద్వారా కలిగే సంస్కారాలు ఇతర సంస్కారాలని నిరోధించగలిగేంత ప్రబలంగా ఉంటాయి.
ఇతర సంస్కారాలను నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించడం వల్ల సర్వం నిరోధితమై నిర్భీజసమాధి ఏర్పడుతుంది.

సమాధిని పొందిన వ్యక్తికి , ఇంకా సూక్ష్మ శరీర భావన ఉంటుంది. ముక్తిని పొందకుండా లయమయ్యే విదేహులను , ప్రకృతి లయులు అంటారు. ప్రకృతి లయుల యొక్క అత్యున్నత ధ్యాన దశను "ప్రకృతి లయ సమాధి" అంటారు.

    పామరుడు తన శరీరమే ఆత్మ లేక పురుషుడు అనుకుంటాడు, పండితుడు అయినా తన మనసే ఆత్మ అనుకుంటాడు. ఇద్దరూ భ్రమలోనే ఉన్నారు. వివిధ చిత్త వృత్తులు పురుషుని ఆవరించి ఉండడం వల్ల, ఈ ఆవరణం ద్వారా పురుషుని ప్రతిబింబమే మనకు ఛాయామాత్రంగా గోచరిస్తుంది. కాబట్టి కోపం అనే చిత్తవృత్తి కలిగిన వెంటనే “నాకు కోపం వచ్చింది” అంటూ, పురుషునికి కోపం వచ్చినట్టు అనుకుంటాం. ప్రేమ అనే చిత్త వృత్తి కలిగితే, ఆ ప్రతిబింబాన్ని పురుషునిలో చూసి “మాకు ప్రేమ ఉంది” అని చెబుతాం. చిత్తం అనే సరస్సును వృత్తులు అనే తరంగాలు ఆవరించి ఉన్నంతకాలం పురుషుడిని దర్శించలేం. కాబట్టి మొదటగా చిత్త వృత్తుల స్వభావ స్థితుల గురించి, తర్వాత చిత్త వృత్తులని నిరోధించే ఉపాయాలని గురించి, అగ్నిని అగ్నియే దహిస్తుంది – అన్న రీతిలో ఒక్క వృత్తియే, ఇతర వృత్తులనన్నింటినీ నిరోధించేదాకా ఆ వృత్తిని ప్రబలం చేసే విధానాన్ని పతంజలి బోధించాడు. : ఇక్కడ ధర్మ మేఘ సమాధి గూర్చి, సూత్రకారుడేం చెబుతున్నాడో చూద్దాం! సర్వ తత్వాలను, చక్కగా వివేచించే జ్ఞానాన్ని పొంది, ఫలాపేక్ష లేక ఉండేవానికి, అలాంటి పరిపూర్ణ వివేకికి "ధర్మ మేఘం" అనే సమాధి సిద్ధిస్తుంది. ఇలాంటి వివేకాన్ని పొందిన యోగికి, అణిమాది అష్ట సిద్ధులన్నీ కలుగుతాయి. కానీ నిజమైన యోగి వాటిని పరిత్యాగం చేస్తాడు. అలాంటి యోగికి, "ధర్మ మేఘం" అనే విచిత్ర, వికాస అపూర్వ జ్ఞానం కలుగుతుంది. అటువంటి యోగి సమస్త జ్ఞానం తననుండే కలుగుతుందని గ్రహిస్తాడు.
 ఇక్కడ, యోగికి వివేక ఖ్యాతి లభించినచో, దాని సహాయముతో, సర్వ భావాధిష్ఠాతృత్వాది సిద్ధులను, ఆశించినచో , ఆ యోగి "కుసీదుడు" అనబడును. (సద్గురు మళయాళ స్వామి వచనం)


🕉🌞🌎🌙🌟🚩

:
 మన గ్రూప్ సభ్యులకు రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి, కరోనతో సహజీవనాన్ని కొనసాగించటానికి కొన్ని సూచనలు: 

1) నిమ్మకాయ: రోజు నిమ్మకాయ రసం త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది. 

2) బాదాం: ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తిన్నండి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది. 

3)పెరుగు: రోజు పెరుగును తినండి, తేనే కూడా  బాగుంటుంది. ఇది విటమిన్ D తో కూడివుంటుంది. 

4) పసుపు: మీ వంటలలో  పసుపును ఎక్కువగా వాడండి.  ఏది ఇమ్యూన్ బూస్టర్.

5) పాలకూర: ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. 

6) అల్లం: గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది. 

7) వెల్లులి: ఇది ఒక ఆధ్బుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. 

8) డైలీ వాకింగ్ చేయండి  ఆసనాలు వేయండి ప్రాణాయామం చేయండి మెడిటేషన్ కూర్చోండి

9) ఎండు ద్రాక్ష ( కిస్ మిస్ ) : ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ కలిగిన పండు. 

పైన వివరించిన పండ్లు, ఆకుకూరలు, ,వంట దినుసులు మీ ఆహరం లో తీసుకోవడం వాళ్ళ మీ శరీరం కరోనా వైరస్ రోగం తో ధైరంగా పోరాడే శక్తి ని ఇస్తుంది మరియు దరి చేరనివ్వదు.🙏
 Mallapragada Sridevi: జయ జయ శంకర - హర హర శంకర

భౌమాశ్విని - 

భౌమాశ్విని (అశ్విని నక్షత్రంతో కూడిన మంగళవారం అరుదుగా లభ్యమయ్యే యోగం.) నాడు దేవీ అధర్వశీర్షం ప్రకారం దేవీమంత్రపారాయణ చేయడం ద్వారా మహామృత్యువును కూడా తరమవచ్చు. కంచి కామకోటిపీఠ మూలామ్నాయ సర్వజ్ఞపీఠాధిపతులు,  జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ మహాస్వామి వారి సందేశ సారం 

భౌమాశ్విన్యాం మహాదేవీసన్నిధౌ జప్త్వా మహామృత్యుం తరతి !
స మహామృత్యుం తరతి ! య ఏవం వేద ! ఇత్యుపనిషత్!

భౌమాశ్విని పర్వదినం నాడు అనగా 16 Jun 2020 మంగళవారం, ఏకాదశి తిథి, అశ్విని నక్షత్రం నాడు అమ్మవారి అనుగ్రహం కోసం సర్వులూ శంకరులు కైలాసం నుంచు తెచ్చిన మంత్రరూపమైన స్తోత్రం సౌందర్యలహరి, లలితా సహస్ర నామ పారాయణం, విరాట పర్వంలోని అమ్మవారి స్తోత్ర పారాయణం, సప్తశ్లోకి పారాయణం, దుర్గా చంద్రకళా స్తుతి పారాయణం, అచ్యుతానంతగోవింద నామజపం యథాశక్తి చేయవలెను. చండీపాఠ పారాయణం, జపం, హోమం ఇంట్లోకానీ, గుడిలోకాని ప్రజలు ఎక్కువ గుమిగూడకుండా, ప్రజా క్షేమం కోరి నిర్వహించాలి. ఈ భౌమాశ్వని పర్వకాలంలో చేసే అనుష్ఠానానికి మన నిత్య అనుష్ఠానానికన్నా ఎక్కువ ఫలితాలుంటాయి. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః .. 

రోగానశేషా నపహంసి తుష్టా దుష్టాతుకామాన్ సకలాబభీష్టాన్
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యా శ్రయతాం ప్రయాంతి !!

స్వర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి
ఏవమేవ త్వయా కార్యం అమద్వైరి వినాశనం !!

ఈ సందర్భంగా అమ్మవారి అనుగ్రహం తో పరాశక్తి అనుగ్రహంచేత మహాశక్తిమంతులుగా మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రార్థన - ప్రయత్నం రెండూ చేసుకోవాలి...

- కంచి కామకోటిపీఠ జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ మహాస్వామి

--(()0--
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 2012 నుండి ఉన్నటువంటి ఏకైక అంతర్జాల పత్రికా ఈ వరం 10 కధలు చదవండి 

..

1. వైద్య నిధి
2. ఇంట్లో పాటించాల్సిన - పాటించకూడని ఆచారాలు.
3. అసలు ఏం జరుగుతోంది మన దేశంలో
4. 55 సంవత్సరాలు, ఆ దరిదాపుల్లో ఉన్నవాళ్ళు
5.  మోహం కధ
6. కాశీలో వస్త్రధారణ నియమం..
7. శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే..?
8. ఆరోగ్యం కోసం ఈ శ్లోకాన్ని ప్రార్థించండి
9.కాకి  ని   జాతీయ    పక్షి 
 10 *అమ్మవారి ప్రధాన రూపాలు
-



1. వైద్య నిధి

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.....?

శరీర అవయవాల్లో ప్రధానమైన వాటిల్లో మూత్రపిండాలు ఒకటి. అవి సరిగ్గా పని చేస్తేనే మిగిలిన భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో పేరుకున్న టాక్సీ న్లని నీటిని బయటకు పంపడం రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపించడం ఇలా ఎన్నో విధుల్ని నిర్వహిస్తాయి. అయితే ఇటీవల రకరకాల కారణాలతో చాలా మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు.ఆ సమస్య రాకుండా నియంత్రించాలంటే విధిగా ఆహారంలో వీటిని తీసుకుంటే సరి.

* నీళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ అది మితిమీరికూడదు. ఆడవాళ్లు 8 మగవాళ్లు 13 గ్లాసుల నీరు తాగితే సరిపోతుంది. అయితే ఎవరైనా ఎంత నీరు తాగితే సరిపోతుంది. అయితే ఎవరైనా ఎంత నీరు తాగాలి అనేది ఆయా వ్యక్తుల శరీర తత్వం వాళ్ళ దినచర్యని బట్టి ఉంటుంది.

* ఉల్లి ఎరుపు రంగు క్యాప్సికంలో పొటాషియం తక్కువగా ఉండటం వల్ల అవి మూత్రపిండాలకు మేలు చేస్తాయి. అలాగే ఉల్లిలోని క్రోమియం జీవక్రియకి మంచిదే కిడ్నీల ఆరోగ్యానికి క్యాలీఫ్లవర్ ఎంతో మేలు. దీన్ని ఉడికించి లేదా వేడి నీళ్లలో ఓసారి ముంచి తీసి తినాలి.

* రోజు ఓ ఆపిల్ తినడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు రాకుండా నిరోధించవచ్చు.ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు కిడ్నీల పనితీరుని పెంపొందిస్తాయి. గుమ్మడి గింజలు కూడా మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి. ఉదారంగు చిలగడదుంప పుచ్చకాయ ఎర్ర ద్రాక్ష స్ట్రాబెర్రీ చెర్రీలు కూడా కిడ్నీ వ్యాధులు రాకుండా రక్షిస్తాయ

--((***))--

2. ఇంట్లో పాటించాల్సిన - పాటించకూడని ఆచారాలు.
     కాలం మారిపోయింది. హైటెక్ హంగుల మాయలో పడి పూర్వ కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను, ఆచారాలను చాలా మంది పాటించడం లేదు. ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి, ఎలాంటి ఆచారారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలివి.

1. కొంత మంది వేళ పాళ లేకుండా చేతి గోళ్ళను కత్తిరించడం, తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు. కానీ అలా చేయడం తగదు. చాలా మందికి చేతి వేళ్ళ గోళ్ళను కొరుకుతుంటారు. చేతి గోళ్ళను తిన్నవాడు వినాశమును పొందుతాడు.

2. లేత ఎండ, శవధూమము, విరిగిపోయిన ఆసనము - ఇవి మంచివి కావు. ఊరకనే మట్టిని మర్థించువాడు, గడ్డి పరకలను తుంచువాడు, ఎదుటి వాని ఉన్న దోషములను కాని, లేని దోషములను కాని చెప్పు వాడు, శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందుదురు.

3. రెండు చేతులతో తలగోక కూడదు. ఎంగిలి చేతులతో తలను ముట్టుకోవద్దు. తలను విడిచి కేవలము కంఠ స్నానము చేయకూడదు. (తల స్నానము ఆరోగ్య భంగకరమైనప్పుడు స్నానము చేసియే కర్మానుష్ఠానము చేసి కొనవచ్చునని జాబాలి వచనములో ఉన్నది).

4. రాత్రుల్లు చెట్ల కింద ఉండరాదు. దూరంగా ఉండాలి.

5. ఎక్కువ కాలం జీవించాలనుకునే వాడు వెంట్రుకలను, బూడిదలను, ఎముకలను, కుండ పెంకులను, దూదిని, ధాన్యపు ఊకను తొక్కరాదు.

6. చాలా మంది సరదా కోసం పాచికలు (జూదము) ఆడుతారు. అలా ఆడటం సరికాదంటున్నారు. పాదరక్షలను చేతితో మోసికొనిపోరాదు. పక్క మీద కూర్చుని ఏమియు తినరాదు. చేతిలో తినే పదార్థాన్ని పెట్టుకొని కొంచెం కొంచెంగా తినకూడదు. ఆసనము మీద పెట్టుకొని ఏ వస్తువును తినరాదు.

7. రాత్రి సమయంలో నువ్వులతో గూడిన ఏ వస్తువును తినకూడదు. వస్తహ్రీనుడై(బట్టలు లేకుండా) పడుకోకూడదు. ఎంగిలి చేతితో ఎక్కడకు వెళ్ళకూడదు.

8. కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనము చేయాలి. దాని వలన దీర్ఘాయువు కలుగును. తడి కాళ్ళతో నిద్రకు ఉపక్రమించకూడదు.

--(())--

3. అసలు ఏం జరుగుతోంది మన దేశంలో
1. ఏ రెస్టారెంట్ కి వెళ్లినా జనాలతో నిండుగా కళకళలాడుతోంది.
2. ఫుడ్ కోర్టులు జనాలతో కిటకిటలాడుతున్నాయి.బారులలో టేబుళ్లు ఖాళీగా కనపడటం లేదు.
3. ola, uber వాళ్ళు బాగా బిజీగా కనపడుతున్నారు.
4.సినిమాలు వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి.
5.పండుగలప్పుడు మిఠాయి దుకాణాల వ్యాపారం మనకు తెలిసిందే.
6.రోడ్డు మీద నడిచే జనాల కన్నా వాహనదారులు ఎక్కువ కనపడుతున్నారు
7. ఏసీ లు LED టీవీల అమ్మకాలు/వాడకం పెరిగింది.
8.వెండి, బంగారం, పెట్రోలు, డీజల్ ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు/ వాడకం పెరిగింది.
9.రైల్ రిజర్వేషన్ లిస్ట్ ఎంత పొడవుగా ఉంటుందో చూస్తూనే ఉన్నాం.
10.swiggy, zomato లు పల్లెటూళ్ళకి కూడా వచ్చేసాయి.
11.వార్త పత్రికల్లో,టీవీలో ప్రకటనల హోరు తగ్గలేదు.
12. డాక్టర్ల దగ్గర పేషంట్లు బాగా ఉంటున్నారు.
13. CA లు బాగా బిజీగా ఉన్నారు.
14. లాయర్లకి కేసుల హడావిడి బాగానే ఉంది.
15. ఫ్లైట్ టిక్కెట్లు అంత సులభంగా దొరకడం లేదు.
16.హోటళ్లు, రిసార్ట్లు బుకింగ్ లతో నిండుగా ఉంటున్నాయి.
17.ఇన్ఫ్రా ప్రాజెక్టులు బాగానే సాగుతున్నాయి.
18.రోజుకో కొత్త క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు
నెట్ వాడకం బాగా పెరిగింది.
19.ఆడవాళ్లు జిమ్ కి, మగవాళ్ళు గుళ్ళకి వెళ్లడం పెరిగింది
20.బ్యూటీ పార్లర్ల విషయం చెప్పాల్సిన అవసరం లేదు.
21.ఏ షాపింగ్ మాల్స్ చూసినా జనాలు నిండా ఉంటున్నారు.
22.EMI లో వస్తువులు కొనడం పెరిగింది.
23.డిజిటల్ లావాదేవీలు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి.
24.ఈక్విటీ,mutual funds లో పెట్టుబడులు పెరుగుతున్నాయి.
25.ఆయిల్ దిగుమతులు రోజు రోజుకి పెరుగుతున్నాయి.
26. income tax కట్టే వాళ్ళ సంఖ్య రికార్డ్లు బద్దలయ్యాయి
ఇంకా జనాల దగ్గర డబ్బులేదని అంటుంటారు, ఆర్ధిక మాంద్యం రాబోతోందని గోల చేస్తున్నారు.

--(())--


4. 55 సంవత్సరాలు, ఆ దరిదాపుల్లో ఉన్నవాళ్ళు ఈ మెసేజ్ ని శ్రధ్ధగా చదవండి.. ఎందుకంటే రాబోయే జీవితానికి ఇది చాలా పనికివస్తుంది..

7. సుఖమయమైన వృధ్ధాప్యం కోసం..

1. మీ సొంతఊరిలో, సొంత గడ్డ మీద నివసించండి... స్వతంత్రంగా జీవించడంలో కల ఆనందాన్ని పొందండి..

2. మీ బ్యాంకు బేలెన్స్ మరియు స్థిరాస్థులు మీ పేరు మీదనే ఉంచుకోండి.. అతి ప్రేమకు పోయి ఇతరుల పేరు మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి.

3. పెద్దవయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ ఆశపడకండి.. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ వారి ప్రాధాన్యతలు మారవచ్చు... ఒక్కోసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నా కూడా, చూడలేని పరిస్థితులు ఎదురవ్వవచ్చు.

4. మీ శ్రేయస్సు కోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి...

5. ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి, ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆశ పెట్టుకోకండి..

6. మీ సంతానం యొక్క జీవితాలలో జోక్యం కలుగచేసుకోకండి.. వారిని వారి పధ్ధతులలో జీవించనివ్వండి.. మీరు మీ తరహాలో జీవించండి.

7. మీ వృధ్ధాప్యం వంకతో ఎవరి చేతనైనా సేవ చేయించుకోవాలి అనో , లేదా, నా వయసు కారణం గా ఎదుటివారు నాకు గౌరవం ఇవ్వాలి అనో ఆశించకండి...

8. అందరి సలహాలూ వినండి.. కానీ మీ స్వంత ఆలోచన ప్రకారం, మీకు ఏది వీలుగా ఉంటుందో అది ఆచరించండి.

9. ప్రార్ధించండి కాని, అది భిక్షమెత్తుకుంటున్నట్టు ఉండకూడదు.... చివరికి భగవంతుని కూడా ఏమీ కోరుకోవద్దు.. దేవుణ్ణి ఏదైనా కోరుకున్నాము అంటే అది కేవలం మనం చేసిన పొరపాట్లకు క్షమాపణ, లేదా జీవించడానికి అవసరమైన ధైర్యం మాత్రమే కోరుకోండి.

10. ఆరోగ్యం మీద శ్రధ్ధ వహించండి. మీ ఆర్థిక పరిస్థితిననుసరించి, చక్కని పౌష్టికాహారం తీసుకోండి.. శరీరం సహకరించినంత వరకు మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న సమస్యల మీద దృష్టి పెట్టకండి..పెద్ద వయసు వచ్చాక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సహజమే...

11. ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి... మీరు సంతోషంగా ఉంటూ, ఇతరులకు ఆనందాన్ని పంచడానికి ప్రయత్నించండి.

12. ప్రతి సంవత్సరం మీ జీవిత భాగస్వామితో కలిసి చిన్న టూరు కు వెళ్ళిరండి.. దీనివలన జీవితం పట్ల మీ దృష్టికోణం మారుతుంది.

13. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవటం నేర్చుకోంది... ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి.

14. జీవితంలో శాశ్వతమైనదేదీ లేదు.. అలాగే దు:ఖాలు కూడా శాశ్వతం కాదు.. ఈ మాటను విశ్వసించండి..

15. రిటైర్మెంట్ సమయానికి మీ బాధ్యతలన్నిటినీ తీర్చేసుకోండి. మీకోసం మీరు జీవించడం మొదలుపెట్టినప్పుడే అది అసలైన స్వేచ్చతో జీవించడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి..

అందరికీ సుఖమయ జీవన శుభాకాంక్షలు...


--((***))--

5.  మోహం కధ

ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు..

ఎదురుగా వున్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు.
సాధువుకి మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే వుండమని కోరాడు ఆ ఇంటి యజమాని.
మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ, యజమాని, " ఏమిటో నండీ ! సంసారంలో సుఖం లేదండీ..మీజీవితమే హాయి !! అన్నాడు.

వెంటనే ఆ సాధువు " అయితే నా వెంట రా ! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు.

యజమాని కంగారుపడుతూ.
" అలా ఎలా కుదురుతుంది ??
పిల్లలు చిన్నవాళ్ళు.. వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా !!" అన్నాడు.

సాధువు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి.
ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూ‌సి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేశాడు.

మాటలలో సాధువు అన్నాడు, " పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కదా నా వెంట రా! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " యజమాని తడబడుతూ " ఇప్పుడే కాదు స్వామీ ! పిల్లలు స్థిరపడాలి...
వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి ....." అన్నాడు.

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్లీ అదే.... యజమాని ఆతిథ్యం... సాధువు అదే మాట ..... యజమాని జవాబు కొంచెం విసుగ్గా.." పిల్లలకి డబ్బు విలువ తెలియదు.. అందుకని నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను..వీలు చూసుకుని చెబుతాను. ఒక పెద్ద ఇల్లు కట్టాలి.. మీలాగా నాకు ఎలా కుదురుతుంది " అన్నాడు..

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి
సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళి పోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు .
అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు.. సాధువు కి కొంచెం బాధనిపించింది.
ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు.. చెట్టు కింద ఒక కుక్క కూర్చుని వుంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు..

సందేహంలేదు యజమాని కుక్కగా పుట్టాడు.. సాధువు మంత్రజలం దాని మీద జల్లి ,
" ఏమిటి నీ పిచ్చి మోహం ???!కుక్క గా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా ?? నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను "
అన్నాడు.. యజమాని " ఆ మాట మాత్రం వినలేను..
ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా " అన్నాడు.

మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు . కుక్క కనపడలేదు పక్కవారిని అడిగితే అది పోయిందని చెప్పారు.అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది.. పరీక్షగా చూసాడు ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ  పాము గా...
మంత్రజలం చల్లి, " ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా ???
అన్నాడు.

ఆ ఒక్క మాట మాత్రం అనకండి. నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా..

సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి , అతని కొడుకులతో " మీ నాన్న ఆ చెట్టు కింద ధనం దాచిపెట్టాడు. కానీ జాగ్రత్త! అక్కడ పాము ఉంది " అనగానే కొడుకులు ఎగిరి గంతేసి,,

కర్రలు తీసుకుని బయలుదేరారు. తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు
కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది

నీతి
గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు కాని మోహబంధాలు ఎంత గట్టిగా ఎంతవరకూ మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం.

ఇహమే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి .... !!!

🐆

6. 👆👆👆కాశీలో వస్త్రధారణ నియమం..
నూతన నిబంధనలు తీసుకొచ్చిన వారణాసి ఆలయం.

ప్రసిద్ధ కాశీ పుణ్యక్షేత్రంలో జ్యోతిర్లింగాల్ని తాకాలంటే ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే. ఈ మేరకు గర్భగుడిలోకి వచ్చే భక్తులకు డ్రెస్‌కోడ్‌ అమలు చేయాలని వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం నిర్ణయించింది.

జ్యోతిర్లింగం స్పర్శ దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ధోతీ-కుర్తా, చీర లాంటి సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది.

కాశీ విద్వత్‌ పరిషత్‌తో సమావేశమైన అనంతరం ఆలయ పాలనా విభాగం ఈ మేరకు నూతన నిబంధనలు తీసుకొచ్చింది.

ప్యాంట్‌, షర్ట్‌, జీన్స్‌, టీషర్ట్‌ లాంటి మోడ్రన్‌ దుస్తులు ధరించి వచ్చే భక్తులు ఇకపై దూరం నుంచి మాత్రమే విశ్వేశ్వరుడిని దర్శించుకునే వీలుంటుందని, వారిని గర్భగుడిలోకి అనుమతించబోమని ఆలయ అధికారులు వెల్లడించారు.

జ్యోతిర్లింగం స్పర్శ దర్శనం చేసుకోవాలంటే పురుషులు తప్పనిసరిగా ధోతీ-కుర్తా, మహిళలు చీర ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ నూతన నిబంధనలను ఆలయ పాలనా విభాగం అతి త్వరలోనే అమలు చేయనున్నట్లు యూపీ పర్యాటక మంత్రి డాక్టర్‌ నీలకంఠ్‌ తివారీ వెల్లడించారు.

దీంతోపాటు అర్చకులను సులువుగా గుర్తించేందుకు వీలుగా వారికి కూడా ఓ డ్రెస్‌కోడ్‌ తీసుకురానున్నట్లు చెప్పారు.


--(())--

7. 🙏🙏శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే..? బియ్యం కొలిచే పాత్రను బోర్లిస్తే?🙏🙏

శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. సంపదలతో తులతూగాలి అనుకునే వారు శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి. ఇంకా ఇంట పసుపు, ఉప్పు అయిపోయాయనే మాట వినబడ కూడదు. పసుపును కొనాలి. లేదా ఉప్పును తేవాలి అని చెప్పడం చేయొచ్చు.

ఉప్పు, పసుపు అయిపోయేంతవరకు ఉపయోగించకూడదు. అవి అయిపోయే లోపు ఇంట తెచ్చుపెట్టుకోవడం చేయాలి. అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం. ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బోర్లించకూడదు.

ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు పొందాలంటే.. విడిచిన బట్టలను తలుపుకు వేలాడదీయకూడదు. విడిచిన బట్టలను రెండో రోజు, మూడో రోజు ధరించకూడదు. ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్ర్యం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు.

* శుక్రవారం నాడు సాత్త్విక ఆహారాన్ని తీసుకోవాలి. పాలను వినియోగించాలి.

* శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి, రంగ వల్లికలతో అలంకరించి.. దీపారాధన చేయాలి.

* రోజూ లేదా శుక్రవారం రాత్రిపూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో వుంచి వంటింట్లో వుంచడం సంప్రదాయం. ఇలా చేస్తే పితరులు, దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ వుండుగాక అంటూ దీవిస్తారని ప్రతీతి.

* శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచివుంటుంది. ఇంకా స్టిక్కర్లను నుదుటన ధరించకుండా తెల్ల వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

* తెల్ల వక్కలను, నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి, కుంకుమ పువ్వు పొడిని కలిపి చూర్ణం చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది. ఈ కుంకుమను నుదుటన ధరించడం ద్వారా సుగంధ భరితమైన సువాసనతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ధనవృద్ధి వుంటుంది.

* శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం. తెల్లని వస్త్రాలంటే శుక్రునికి, మహాలక్ష్మీకి ప్రీతికరం. తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

* అలాగే శుక్రవారం పూట కమలములతో, కలువలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పుష్పాలను దానం చేసినా, అన్నదానం చేసినా, వస్త్ర దానం చేసినా శుభఫలితాలుంటాయి. కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించినా, శుక్రవారం వర్జ్యం వున్న సమయంలో మౌనవ్రతం పాటించినా ఆ ఇంట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.

🙏🙏🙏 🙏🙏🙏
--(())--

8. ఆరోగ్యం కోసం ఈ శ్లోకాన్ని ప్రార్థించండి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
" జటాధరం పాండురంగం
శూలహస్తం కృపానిధిం
సర్వరోగహరం దేవం
దత్తాత్రేయమహంభజే "

ఈ శ్లోకాన్ని త‌ర‌చూ ప‌ఠిస్తుంటే ఆయుఆరోగ్యాలు భ‌క్తుల‌కు ద‌క్కుతాయ‌ని ప్ర‌తీతి. ఆ శ్లోకం శ్రీ ద‌త్తాత్రేయుడిని స్తుతిస్తుంది. ఆ గురు ద‌త్తుడే ఆరోగ్యాన్ని అందిస్తాడ‌ని పండితులు చెబుతున్నారు.

 ద‌త్తాత్రేయుడు ఆ శ్రీమ‌న్నారాయ‌ణుడి అవ‌తార‌మేన‌ని భాగ‌వ‌త‌మూ, అలాగే విష్ణు పురాణ‌ము చెబుత‌న్నాయి. పిల్ల‌ల కోసం అత్రి మ‌హ‌ర్షి, అన‌సూయ దంప‌తులు మ‌హాత‌పస్సు చేయ‌గా… త్రిమూర్తులు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. ఆ ముగ్గురు మూర్తుల అంశతో ద‌త్రాత్రేయుడు జ‌న్మిస్తాడు. దత్తం..అంటే సమర్పించుకోవడం. దత్తుడు జ్ఞానబోధ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు.

అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడన్న పేరూ వచ్చింది.దత్తతత్వాన్ని తెలుసుకోవాలంటే అహాన్ని వదిలిపెట్టాలి. శరణాగతి సూత్రాన్ని పాటించాలి. రాక్ష‌సుల‌ను కూడా ద‌త్తాత్రేయుడు సంహ‌రించాడు. జంభాసురుడనే రాక్షసుడు ప్రజల్ని హింసిస్తుంటే దేవతలంతా…విష్ణు స్వరూపుడైన దత్తాత్రేయుడిని ప్రార్థించారు. ఆ రాక్ష‌సుడిని నా ద‌గ్గ‌రికి తీసుకురండి అని చెప్పాడు ద‌త్తుడు. దేవ‌త‌లు యుద్దం చేస్తున్న‌ట్టు న‌టిస్తూ రాక్ష‌సుడిని ద‌త్తుడి ద‌గ్గ‌రికి తీసుకొచ్చారు. ఎదురుగా…ఒడిలో అందాల రాశితో, మహాభోగిలా దర్శనమిచ్చాడు దత్తాత్రేయుడు.

జంభాసురుడి కళ్లు ఆ సౌందర్యరాశి మీదికి మళ్లాయి. ఆమె శ్రీమహాలక్ష్మి అన్న ఇంగితం కూడా లేకుండా… బలవంతంగా తీసుకెళ్లి నెత్తిమీద పెట్టుకున్నాడు. సంపద నెత్తికెక్కిందంటే, పతనం మొదలైనట్టే. జంభాసురుడి బలం క్షీణించసాగింది. దేవతల పని సులువైపోయింది. అసుర సంహారం జరిగిపోయింది. అలా ద‌త్తాత్రేయుడు అసుర సంహ‌రానికి నాంది ప‌లికాడు.

ద‌త్తుడి రూపం చాలా శోభాయ‌మానంగా ఉంటుంది. ఆరు చేతులూ, మూడు తలలూ, చేతిలో డమరుకమూ, త్రిశూలమూ ఆయుధాల‌తో అపురూపంగా ఉంటుంది అత‌ని రూపం. ద‌త్తుడి చుట్టూ ఎల్ల‌ప్పుడూ కుక్కలు ఉంటాయి. ఆయన వె
నకాల కనిపించే గోవు…ఉపనిషత్తుల సారం.

దత్తజయంతినాడు ఆస్తికులు…జపతపాలతో, పూజలతో గడుపుతారు. పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం భజనలూ సత్సంగాలూ నిర్వహించుకుంటారు. దత్తచరిత్ర, అవధూత గీత తదితర గ్రంథాల్ని పారాయణ చేస్తారు. నేపాల్లో ద‌త్త‌క్షేత్రాలు ఉన్నాయి. ముగ్గురు మూర్తుల రూప‌మైన ద‌త్తాత్రేయుడిని త‌రించుకుంటూ స‌క‌ల సంప‌ద‌లు, ర‌క్ష‌ణ‌, ఆరోగ్యం పొందొచ్చు.

దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా !
దిగంబరా దిగంబరా అవథూత చింతన దిగంబరా !

ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ! జై గురుదత్త !

--(())--

9. కాకి  ని   జాతీయ    పక్షి 

  మిత్రులారా     ఇది   చదవండి    కనుక   కాకి  ని   జాతీయ    పక్షి  గా    ప్రకటించవచ్చు      thanks to  mr prakaash  raaj     కాకి... ఏ రంగులు కలిసిలేని ఏకైక రంగు గల ఒక #నల్లనిపక్షి.
దీనిని సంస్కృతంలో వాయసం అంటారు. ఇవి #కార్విడే కుటుంబానికి చెందిన కూత పక్షులు. ఇవి కావ్ కావ్ అని కూస్తుంటాయి.
వీటిని మామూలు పక్షుల వలె ఇళ్ళలో పెంపకానికి వాడుటం ససేమీరా జరుగదు. ఆసియా ఖండంలో విస్తరించిన పొడుగైన ముక్కు కలిగిన కాకిని "మాలకాకి" గా వ్యవహరిస్తారు.
ప్రస్తుతం కొందరు అడవిజాతి క్రూరులు,కిరాతులు ,కాకులను పట్టి ,దాని మాంసమును కూడా భుజించడం / తినడం వలన వీటి సంఖ్య కూడా క్రమేణా గణనీయంగా తగ్గిపోతున్నది.

భారతీయ పురాణాలలో కాకులకు ప్రాధాన్యత కలదు. పురాణాల ప్రకారం కాకి శనైశ్చరుడు (శని దేవుని) యొక్క వాహనంగా ఉంది. ఈ కారణంగా దీనికి కొన్ని చోట్లా పూజలు చేయడం జరుగుతున్నది.

రావణుడికి భయపడి, కాకి రూపాన్ని ధరించిన యముడు కాకులకు గొప్ప వరాలిచ్చాడు.
తాను ప్రాణులన్నింటికీ రోగాలను కలిగించేవాడు కనుక, తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువల్ల ..
ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలేవీ రావన్నాడు.
అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరమిచ్చాడు యముడు.

యమలోకంలో నరక బాధలను భరించేవారి బంధువులు,
అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరక లోకంలోని వారికి తృప్తి కలుగుతుందన్నారు. యముడు స్వయంగా వాయుసాలకు (కాకులకు) ఈ వరాలిచ్చినందువల్లనే ఈ నాటికీ పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతున్నారు.... కారణం మరణించినవారు ఈ కాకుల రూపంలో వచ్చి ఆరగిస్తారనీ ఇప్పటికీ విశ్వసించడమే !

అన్ని పక్షలులకు ఉన్నట్టే పరులు చూడటానికి రెండు కళ్ళున్నట్టే కనిపిస్తాయి కానీ నిజానికి ఒకే కన్నుతో చూడ గలిగే పక్షి ఈ కాకి  ... అది రెండు వైపులా చూడగలదు,అందుకే తన తలను అటూ ఇటూ తిప్పుతూ ఎగిరి కూర్చుంటూ చూస్తుంది ఒకే కన్నుతో ,,

మన పూర్వీకుల విశ్వనీయం ప్రకారం మనుషుల జీవితం ,మరణం కాకితో లింక్ అయి ఉన్నట్టు చెబుతారు.

ఇవి 95% వరకూ మాంసాహారులు, క్రిములు కీటకాలు,ఎలుకలు బల్లులు,జంతుకళేభరాలు ఇలా అనేకరకాలైన విషపూరిత ఆహారాన్ని తీసుకుంటాయి,వీటికి శాపవశాత్తూ ఒకే కన్ను కనిపిస్తుందని వినికిడి. మనము చూసినంతవరకు కాకులు నలుపురంగులోనే ఉంటాయి,అరణ్యాలలో తెలుపు వర్ణo కలిగిన కాకులు (మారిషస్ దీవుల్లో)కూడా ఉంటాయట. కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాము.

కాకి తన జంట కాకిని తెలియనివ్వదు ..అది జతకూడుతున్న కూడా ఎవ్వరికీ కనిపించదు . కాకి ఎప్పుడూ ఒంటరిగానే తిరుగుతుంది ఆపద వచ్చినపుడు  మాత్రమే గుంపులుగా కనిపిస్తాయి
కాకికి ఒక రకమైన #టెంపరితనం ఉంటుంది ..
దానికవసరమున్నా లేకున్నా అన్నీ వస్తువులను అది ఎత్తుకుపోతుంది .

కాకి అప్రమత్తంగా ఉంటుంది ఎవరినీ #నమ్మదు .

1) కాకి మన/మనిషి  తలను దాని కాళ్లతో తన్నితే ... వెంటనే వెళ్లి తలస్నానం చేసి దేవాలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఇలా కాకి తాను కాళ్లతో తన్నితే మనిషికి మరణం సంభవిస్తుందని పెద్దలు చెబుతారు,

దీనిలో శాస్త్రీయత/సైన్స్ దాగి ఉంది... ఎందుకనగా కాకులు ఎక్కువగా కుళ్లిపోయిన మాంసాహారాన్ని వాటికాళ్లకు ,నోటికి ఎప్పుడు అశుభ్రతతో ఉంటాయి గనుక అవి మన తలపై తాకి మన శరీరానికి అంటుకుని విషప్రయోగం జరుగుతుందనే అలా చెబుతారు.

2) చనిపోయిన మన పూర్వీకులు కాకుల రూపంలో ఉండి మన భవిష్యత్ వర్తమానాలు నిర్ణయిస్తారని నమ్మకం.

3) మీరు బయటకు ప్రయాణం చేసే ముందు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు వెళ్లే పని సంపూర్ణ విజయం చేకూరుతుందని అర్ధం.

4) నీళ్లు నిండుగా ఉన్న కుండపై /నీటి నిలువచేసిన ఏదైనా పాత్రపై కాకి కూర్చొని ఉండటం ఎవరైతే చూస్తారో త్వరలోనే ధనవంతులవుతారని అర్ధం.

5) కాకి తన నోట్లో రొట్టె ,బ్రేడ్ ,మాంసపు ముక్కతో మీకు కనబడితే ...
ఎదో శుభవార్త వింటారని అర్ధం ఆ మాంసపు ముక్క ఎవరిపైనైనా పడిందంటే అది అశుభానికి సంకేతం,కొన్ని గ్రంధాలప్రకారం అది మరణానికి సంకేతం.

6) ఒకవేళ కాకి ఎగురుతూ.. వెళుతో ఎవరినైనా తాకిందంటే అది అనారోగ్యానికి సంకేతం

7) గుంపులు గుంపులుగా కాకులు అరుస్తూ కనబడితే అది చెడు అశుభవార్తకు సంకేతం

8) ఒకవ్యక్తి తలపై కాకి తాకితే ఆ వ్యక్తి స్కామ్ లో ఇరుక్కోవటం,తాను ఉన్న సమాజంలో అవమానాల పాలుకావడం జరుగుతుంది. గౌరవం కోల్పోతారని సంకేతం

9) మహిళా తలపై కాకి కూర్చుంటే ఆమె భర్త సమస్యల వలయంలో పడతారని సంకేతం

10) సాయంత్రం పూట కాకి ఆగ్నేయం నుండి రావడం జరిగితే ద్రవ్యలాభం పొందుతారని సూచిస్తుంది.

11) ఒకవేళ కాకి గట్టిగా రెక్కలు కొడుతూ అరుస్తూ కనిపించిందంటే ..చెడువార్త /మరణంసూచిస్తుందని సంకేతం.
12 ) కాకికి రోజు ఆహారం పెడితే (మనంఎది తింటామో అది) వ్యాపార వృద్ది జరుగుతుందని నమ్మకం .

కాకి అరిస్తే చుట్టాలొస్తారని పురాణాలలో రామాయణం కారణంగా వచ్చిందని చెబుతారు. లంకలో ఉన్న సీతమ్మతల్లిని వెతికే క్రమంలో సీతమ్మకూర్చున్న చెట్టుమీదనున్న కాకి అరవడం వల్ల ఆంజనేయుడు వచ్చినట్టు సీతమ్మకు సమాచారం ఇచ్చిందని , ఈ కాకి అరవటం వల్లనే శుభం జరిగింది కాబట్టి,శుభసూచకంగా చెబుతారు.

భారతదేశంలో కాకి'కి చాలా ప్రాధాన్యముంది. కాకి పితృదేవతలకు ప్రతినిది అంటారు. శ్రాద్ధ కార్యక్రమాలు జరిపించాక.. పిండ ప్రధానం చేస్తారు ఆ పిండాలను కాకి వచ్చి అరగిస్తేనే... ఆ మరణించినవారి ఆత్మ శాంతిస్తుoదని నమ్ముతారు.
కోకిల తన గుడ్లను కాకి గూట్లో పెడితే... అవి పిల్లలు కాగానే కనిపెట్టేస్తుంది కాకి, అవి అన్నీ
 ఒకే రంగులో ఉన్నా కోకిల పిల్లలను గుర్తించి కాకి వెళ్లగొడుతుంది. అందుకే కాకిని తెలివైన పక్షి అంటారు....

నాకు తెలిసినంత వరకు సమాచారం మాత్రమే ... అందరికీ తెలియాలనే ... నా పిచ్చి తపన ...నేనుపెద్ద జ్ఞానినేమీ కాదు ... ఈ సమాచారమంతా స్వయంగా నేను ఇంకొకరి నుండి విని తెలుసుకున్నదే.

అన్యధా భావించవద్దు ... మీకేమీ ... తెలీదని ... నేను అనుకోవడం లేదు .......
: 🙏🙏🙏🌷👌👌  🙏🙏🙏🙏🙏💐🌷.
    

 
10 *అమ్మవారి ప్రధాన రూపాలు
--------------------
ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాలిగోటిని సందర్శించి తనను తాను శుద్ధి చేసు  కుందామని ఆశించినా దర్శనం కాలేదు.

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
 

శ్రీకృష్ణున్ని అవతరింపజేయటం కోసం లోకజనని అయిదురూపాలు ధరించింది . ఒక్కొక్క రూపానికి మళ్ళీ అనేక బేధాలున్నాయి. భక్తులను అనుగ్రహించటం కోసం ,తన బిడ్డలైన వారి అభ్యర్దన మేరకు ఎన్నెన్నో అవతారాలు ధరించింది అమ్మ.

అయితే మూలప్రకృతినుంచి ఆవిర్భవించిన రూపాలు ప్రధానమైనవి మాత్రం ఇవి

వాటిలో మొదటిరూపం:-

 శివప్రియ,గణేశమాతదుర్గ. 

శివరూప, విష్ణుమాయ, నారాయణి, పూర్ణబ్రహ్మ స్వరూపిణి, సర్వాధిష్టాత్రి, శర్వ రూప, సనాతని,ధర్మసత్య,పుణ్యకీర్తి.

యశోమంగళ దాయిని, సుఖమోక్ష, హర్ష ధాత్రి, శోఖార్తి దు:ఖనాశిని,శరణాగత దీనార్తపరిత్రాణపరాయణ, తేజ:స్వరూప, సర్వశక్తి స్వరూప, సిద్ధేశ్వరి, సిధ్ధరూప. సిద్ధి, బుద్ధి, నిద్ర క్షుత్తు, పిపాస, చాయ, తంద్ర,దయ,స్మృతి, జాతి,క్షామ్తి,భ్రాంతి,శాంతి,చేతన, తుష్టి, పుష్టి లక్ష్మీ,ధృతి, మాయ....

ఇత్యాది నామాలతో కీర్తింపబడుతుంది

ఇక రెండవది:-

 శుధ్ధ శక్తి స్వరూప మహాలక్ష్మి.

సర్వ సంపత్స్వరూప .సంపదధిష్టాత్రి, పద్మ,కాంత, దాంత, శాంత.సుశీల, సర్వ మంగళ,లోభకామ మోహ మదహంకార వివర్జిత భక్తానురక్త, పతివ్రత, భగవత్ప్రాణతుల్య, భగవత్ ప్రేమపాత్ర ,ప్రియంవద ,సర్వాత్మిక, జీవనోపాయరూపిణి. వైకుంఠం లో ఈ మహాలక్ష్మి పతిసేవాపరాయణయై నివసిస్తూ ఉంటుంది. సర్వప్రాణి కోటిలోనూ శోభారూపంగా ఉంటుంది . స్వర్గం లో స్వర్గ లక్ష్మిగా, రాజులలో రాజ్య లక్ష్మిగా,గృహాలలో గృహలక్ష్మిగా విరాజిల్లుతుంటుంది .

పుణ్యాత్ములకు కీర్తిరూప, నరేంద్రులకు ప్రభావరూప, వైశ్యులకు వాణిజ్యరూప,
పాపాత్ములకు కలహాంకురరూపణి. వేదాలలో హయరూపంగా వర్ణింపబడినది సర్వపూజ్య,సర్వ వంద్య.

ఇక మూడవరూపం:-

 వాగ్బుధ్ధివిద్యాజ్ఞానాధిష్టాత్రియైన సరస్వతి.

 సర్వవిద్యాస్వరూప, బుధ్ధి కవిత, మేధ, ప్రతిభ, స్మృతి, ఇత్యాదులన్నీ మానవులకు ఈవిడ దయవలనే కలుగుతున్నాయి. సిధ్ధాంత బేధాలు అర్ధబేధాలు కల్పించేది ఈతల్లే. ఈవిడే వ్యాఖ్యాస్వరూపిణి, బోధస్వరూపిణి సర్వ సందేహ భంజని. విచారకారిణి ,గ్రంథ కారిణి, శక్తిరూపిణి,.సర్వసంగీత సంధాన తాళ కారణ రూపిణి, విషయ జ్ఞాన వాగ్రూప, ప్రతివిశ్వోపజీవని, వ్యాఖ్యావాదకరి,శాంత .వీణాపుస్తకధారిణి, శుద్ధసత్వరూప, సుశీల, శ్రీహరిప్రియ, హిమ, చందన. కుంద,ఇందు, కుముద, అంభోజసన్నిభ. రత్న జపమాలికతో శ్రీకృష్ణున్ని ధ్యానించే తప:స్వరూపిణి. తప:ఫలప్రద .సిద్ధవిద్యాస్వరూప. సర్వసిధ్ధి ప్రద.

ఈ తల్లి లేకుంటే సర్వజనులు మూగవారవుతారు .

ఇక నాల్గవరూపం:-

 చతుర్వర్ణాలకు చతుర్వేదాలకు వేదాంగాలకు అధిష్టానదేవత .
సంధ్యావందనమంత్రతంత్ర స్వరూపిణి, ద్విజాతిజాతిరూప, తపస్విని, జపరూప, బ్రహ్మణ్యతేజోరూప సర్వసంస్కారరూపిణి,సావిత్రి, గాయత్రి, బ్రహ్మప్రియ.

ఆత్మశుద్ధికోసం సర్వతీర్ధాలు ఈతల్లి సంస్పర్షను కోరుకుంటాయి.
శుధ్ధస్పటికవర్ణ, శుధ్ధ స్వరూపిణి పరమానంద, పరమ, సనాతని పర బ్రహ్మస్వరూపిణి నిర్వాణప్రదాయిని బ్రహ్మతేజోమయి,

ఈతల్లి పాదధూళిసోకి జగత్తు పునీతమవుతున్నది.

అయిదవరూపం:-

 పంచప్రాణాలకు అధిష్టానదేవత .

పంచ ప్రాణ స్వరూపిణి ,ప్రాణాధికప్రియతమ, అందరికన్నా అందగత్తె .సౌభాగ్యమానిని గౌరవాన్విత ,వామాంగార్ధస్వరూప, తేజోగుణసమన్విత. పరాపరసారభూత ,పరమ. ఆద్య.సనాతని పరమానందరూపిణి, ధన్య,మాన్య, పూజ్య,

శ్రీకృష్ణునికి రాసక్రీఢాధిదేవత, రాసమండల సంభూత, రాసమండల మండిత, రాసేశ్వరి, సురసిక, రాసావాస నివాసిని, గోలోకవాసిని, గోపీవేష విధాయక. పరమాహ్లాదరూప .సంతోష హర్షరూపిణి ...
నిర్గుణ, నిరాకార, నిర్లిప్త, ఆత్మస్వరూపిణి, నిరీహ, నిరహంకార. భక్తానుగ్రహ నిగ్రహ,

విచక్షణులు వేదానుసార జ్ఞానం తో ఈవిడను తెలుసుకుంటారు.
సురేంద్రమునీంద్రాదులైనా చర్మచక్షువులతో ఈవిడను చూడలేరు.

వహ్నిలాంటి అంశుకాన్ని ధరించి ఉంటుంది .

 నానాలంకార విభూషిత. కోటిచంద్రప్రభ. పుష్టిసర్వశ్రీయుక్తవిగ్రహ. శ్రీకృష్ణుని పట్లభక్తితో దాస్యం చేస్తూ ఉంటుంది.

వరాహావతారకాలంలో ఈవిడ వృషభానుని ఇంట కూతురుగా ఉద్భవించింది .

ఈ తల్లి పాదస్పర్శతో వసుంధర పావనమయ్యింది.

 శ్రీకృష్ణుని వక్షస్థలం లో నివసిస్తూ నీలమేఘావృతమైన ఆకాశం లో మెరుపుతీగలా భాసిస్తున్నది.

ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడ కాలిగోటిని సందర్శించి తనను తాను శుద్ధిచేసుకుందామని ఆశించి అరవైవేల దివ్యసంవత్సరాలు తపస్సుచేసినా ఫలితం దక్కలేదు.

కనీసం కలలోనైనా దర్శనం కాలేదు. అతడికి అలాదొరకని సందర్శన భాగ్యం భూలోకంలో లభించింది.

బృందావనంలో రాధగా దర్శనమిచ్చింది.
ఈరాధ దేవీ పంచమరూపం

ఈ విషయాలన్నీ బ్రహ్మ దేవులు నారదునికి వివరించి స్త్రీ అంటే ఎవరో తెలియచేసారు.
---------------------------------
నారదా !

సృష్టిలో కనిపించే ప్రతిస్త్రీలోనూ దేవీరూపం కళారూపంగానో, కాలరూపంగానో, అంశరూపంగానో కళాశాంశా రూపంగానో ఉంటూనే ఉంటుంది .

స్త్రీలందరూ దేవీ స్వరూపాలే.

పరిపూర్ణ స్వరూపాలు మాత్రం ఈ అయిదే.
***********
అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బెద్దమ్మ, సురాలులమ్మ కడు పారడి పుచ్చినయమ్మ, దన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.

ఈ విధం గా మనం అమ్మను తలుచుకుంటే అమ్మ కరుణారసం మనమీద ఎల్లప్పుడూ
ఉంటుందట.
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
శుభోదయం
   
           కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది.
           అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది.

🙏🌅🙏🌅🙏🌅🙏🌅🙏🌅🙏

కంద పద్యాలు


* అమ్మలుగన్నపెద్దమ్మ 
మమ్మేలుచునున్న దేను మాతల్లీయే 
కమ్మని పిలుపుల తల్లీ
నెమ్మది శాంతము గనవలె - నెలతా లక్ష్మీ

* ఆకలికి రుచి తెలియదే
ఆకలి లేకయు కరకర ఆత్రము చూపెన్
మకిలమ్ము మనసు పలికే
తకిలీ లాగున తిరుగుట తకధిమ చిందుల్

* అంకపాంకములేకే
అంకితముగనే మనస్సు ఆరాటముగన్
అంకురముకదిలె దేశము
అంకురితముగా మనస్సు అంకిలి లేకన్

* అమ్మ పలుకలే మనకిట
నమ్మకమున్ కలుగుట కళ నమ్మే పల్కుల్
కమ్మని మాటలు మనసును
దమ్మును పెంచియు ను దొర్ల దోషము తొల్గున్ 

* అంగారక వారము యే
అంగూరురసమును ఇచ్చె ఆలోచనగా
అంగీకృతమై బ్రతుకులు
అంగన ఉపవాసమేను ఆశలు ఏలన్

* అన్ని తెలిసి గర్వ మగుట
కొన్ని ట పనులు గెలుచటయు కొలతలు గానే
సన్నిత మైనవి తెలిపియు
మన్నిక చూసియు కళలను మనసున చేర్చున్

* అబలా కాదు అనామిక
ప్రభలావెలుగవ్వుటేను ప్రతిభా చూపెన్
సబలై ఆకలి తీర్చే
అభయామృతమై సహనమె ఆడది అనుటన్

* అందము నీ సొంతము యే
అందల మెక్కుము త్రినయిని ఆనందముగా
అంధకరిపువే తోడులె
అంధతమసమును తరిమియు అంబను చేరెన్

అద్దం ఎదురైన మనిషి
అద్దం అడిగే ఎవరవు అసలైనోడ్నీ 
అద్దం పకపక నవ్వెను
అద్దం కొమ్ముల మనిషియె అందం పలికే

అనుభూతి పులకిత కళే
ఈనిముషాల కళలన్ని ఇష్టము కొరకే
కనిపించు మెరుపుల గతీ
మనమాధుర్యం తొణికియె మాటలు కరువై

* ఈ క్షణం మన తలపే
అక్షర వేదములు గాను ఆర్ద్రత పెరిగే
సాక్షి గ బ్రతుకే నిత్యము
కక్షలు లేనిది సహనము కారణ లింగమ్

*..కష్టాలుచిన్నవేనులె
నష్టాలబ్రతుకులలోన నమ్మకముగ నే
ఇష్టాలు తెలుసు కొనుటే
పుష్టి కరమైన మనసుకు పూర్వపు కళయే

* కొత్తొక వింతయు అగుటయు 
పాతొక రోతయను చెప్పు పాఠము మాత్రమ్
చిత్తే అనుటయు బుద్ధియు
కొత్తయ చెరవాణిచాలు కోరిక తీరున్

* గమ్యం అర్ధం అనుటే
సౌమ్యంగా బ్రతుకు లోన సౌఖ్యం అలిగే
కామ్యం కొరకు ను కదులుట
రమ్యము కలుగుట ప్రయత్న రాజ్యము యగుటే

*శ్రీ గురు దీవెనలు మనకు
శ్రీ గురు దీక్షను తెలిపిరి శీఘ్రం గతి గన్
శ్రీ గురు వాక్కులు వేదము
శ్రీ గురునామజపవాంఛ శ్రీ లక్ష్యముగన్

* పలుకే నిజము యు నీకే
పలుకేబంగారమాయె పాఠమగుటయే
తెలివే ఉండాలి మనకు
చెలి మోనమును మార్చు చేరువ పలుకే

* విడిపోవట మంటేలే
ఓడి పోవట మేను కాదు ఓదార్పు కళల్
కడుపున పుట్టిన వారియె
వాడిపోవటమే మనస్సు వాదన యగుటన్

* " నారాయణేష్టభామిని ..
  తారాపతిసోదరి సిరితల్లీ ..కనుమా.
నీరాకఁగోరెదసతము
మా! రాజీవాసన !మము..మాధవి..దయతో !!! "

* నాయందు దయయు నిర్మల
ధ్యైయంబు వాత్సల్యముగను దైవం తెలుపే
ప్రాయంబు గురువు కరుణే
కాయం జ్ణాణామృతమ్ము కావ్యము చరితమ్

* నువ్వు స్పర్శించుటయే 
మువ్వకదిలినట్లుగాను ముందుకు కదిలెన్
నవ్వు స్పర్శించుట కళ
నవ్వు లపాలవకనేను నటనలు తెలిపెన్

* లాలసరాగ..న.స.ర.ర.గ...
మనసు కధ సాధించి..మార్గమ్ము నీవే
తనువు కళ పొందేటి...తన్మాయ నీవే
అణువు నిధి లభ్యమ్ము..ఆరోగ్య మీవే
చినుకులు లె భాగ్యమ్ము..జీవమ్ము నీవే

* వత్సల వందన వరుసలు
నుత్సవములుగా జరిగెను నూతన కళతో
నుత్సుకపొంగియు కదిలెను
వత్సర వేడుకలుగాను బయటన పూజల్

*..పలుకే అర్ధం మనలో
పలుకే దాహం మనసున ప్రశ్నలు వలదే
పలుకే ఊరట బ్రతుకు కు
పలుకే జీవితము మలుపు ప్రతిభే ప్రగతీ 

*..మనిషే ధర్మాన్ని నిలుపు
మనసే ప్రకృతి ఒడిలో న మనుగడ ధర్మమ్
మనలో మనమే ఒకటై
అణువణువు ధర్మముగానె జీవిత సుఖమున్

*..మమతల కోవెల కళలే
కమనీయంగా కదులుట కనువిందుకధే
సమతుల్యమ్ముగబ్రతుకే
సమరమను సుఖము విజయము సమయములో నన్

*..మరిపించు మనసు తల్లియె
చిరునవ్వును పొందుటేను చింతలు వలదే
కరుణించేమాత పలుకు
తరుణమ్ము సుఖము విజయము తీర్పుగ మాకున్

* మంచే చెడ్డను కప్పును
మంచే మనుగడన లీల మనసే మార్చే
ముంచే కళ్ళ కు చెందిన
మంచే చెడ్డతొ కలవక మనసున మండెన్

*...విధి ఆట యిదే మనసుకు
కదిలే జీవితము మీది కధలే కదిలే
కుదిపించేనులె బ్రతుకును 
అదియే బ్రహ్మమును గూర్చి అనుకరణగుటన్

*..ప్రకృతి చ్చినరూపముయే
స్వీకృతి ప్రవేశము పొందు సమయమ్ము కళే
ఆకృతి ఆనందముగా
ప్రకృతి లోకనికరమ్ము పరమానందమ్

* శోకంబియనివానికి
శోకించుచు జ్ఞాని వోలె సూక్తులనెల్లన్ 
నాకు వచించెద వీవున్
శోకించడు జ్ఞాని, పొందసుఖశోకములన్

* సత్యము అహింస పలుకుల్
నిత్యము మన దృష్టి కోణ నీతినితెల్పెన్
పత్యము దేనికి దీనికి
ముత్యము వలనే మెరియుచు ముఖ్యము అగుటన్

* ఎ‌ర్రన పెదవే జూచిన
జుర్రుచు మనసార ముద్దు సన్నుతి పొందెన్
కర్రి అనకయే మనసై
నెర్రన ఏకరువు పెట్టె నెల్లర ముందున్

* నమ్మకు పోకిరి పలుకును
నమ్మ వలయు తల్లి తండ్రి నయనాల కళే
నమ్మ వలయు గురు పాఠము
నమ్మినచో లక్ష్యముకళ నమ్మ పలుకుటే

* నేనే నీ తరువాత ను 
నే నెవరితో జతగూడ నేమి అలస టే
నే నాదారిన వేచెను 
నన్ను కనీసము యె చూడ నమ్మక మేదీ

* నేనే నీ తరువాత ను 
నే నెవరితో జతగూడ నేమి అలస టే
నే నే దారిన వేచెను 
నేనే నీసము యె చూడ నమ్మక మేదీ

* నిరతము నిన్నే తలచితి
కరుణను వేడే కళలను కధలను తెలిపెన్
తరుణిని చూచెన్ తరుణము
వెరుపది ఏలా అనుటయు వెతలును తొలగున్

* వ్యక్తి తలపునుంచేలే
శక్తి యు జలపాతమౌను సమయమ్ముననే
యుక్తి యె మనజీవితాన
ముక్తి అవసరము మనిషికి ముప్పుకు రక్షే

* గుట్టును చూసెను నేతా
గట్టును చెరకయె బుధ్ధి గుట్టును విప్పే
కట్టును చూపియు కదిలే
పెట్టెను చిక్కులను గాను పిలుపే మరిచే

* కొంచం వెలుగే చాలును
కంచం భోజణమునకు ను కాంతి యు నిండెన్ 
మంచం పవలింపుకలే
లంచం అలవాటు వద్దు లాస్యం వలదే

* ధనమే ఆశకు మూలము
ధనమే రోగమును తెచ్చు ధరణియందే
ధనమే డాంబికులందున్
ధనమే లేక కడు బాధ దారులు మారున్

* డబ్బులకట్టలె తనదున్
జబ్బును నయమునొసంగుఁ జక్కఁగనెపుడున్
అబ్బురమేమియుఁగనమే
డబ్బేసర్వస్వమనెడి డాంబికులందున్.."

* గుట్టును చూసెను నేతా
గట్టును చెరకయె బుధ్ధి గుట్టును విప్పే
కట్టును చూపియు కదిలే
పెట్టెను చిక్కులను గాను పిలుపే మరిచే

* వలదను రేడే వరుసలు
వలచెను నేడే వినయపు వలదను పలుకుల్ 
తలచిన వాడే తెలుపుట
కలలకు తోడై కలియుట కాలము తీర్చెన్

* నావంతు తెలిపె మీకూ
మీవంతు చేయ గలిగిన మీరును నేనూ
వ్యవధీ రామకు తెలుపుట
భవధీయుని పలుకుబట్టి బాధ్యత మీకున్

హృదయము కవచము నౌనులె
మధురిమ నేత్రాలు కలిసి మనసును మార్చున్
మధుఅస్త్రములే శిఖలై
విధిఆటలనుజరుపెనులె శిరస్సు శివుడై

మదిలో నిన్ను తలచి నా
కదిలించే కలలు కొన్ని కాలము తీర్చున్
విదిలించుకుని ఉన్నా
వదలని భావములు కొన్ని వెంటాడుటయున్

మాట విలువ తరుగుదల 
మూట విలువ పెరుగుదల ముడుపులు కొరకే
పూట గడుచు టే కాలము
ఆటల జీవిత మనసును ఆశల కొరకే

మనిషికి గుణమే ఆస్తియు
వినయము కలగలిపి యుండు విశ్వము నందున్
మనసే మందిర మవ్వుట
మనమే ఒకరికొకరు గను మనసుపలుకుగన్

శారీరిక బలమేనులె
నారీమణి తోడు గనులె నాట్యము చేయున్
కోరీ చేరుట శక్తియె
నారీ శాంతం కొరకుయె వాక్కులు తెల్పెన్

ఓహో గానము ఒహొ హో
ఓహో మనమున మనస్సు ఒకటై ఓహో
ఓహో రాగము ఓహొ హో
ఓహో చూపుల పిలుపులు ఓర్పుకు ఓహో

రారండని పిలవంగనె
ప్రారంభమునుండి పూజ ప్రార్ధన కళలే 
నారాయణుడే సూర్యుడు
పారాయణమే నిలిచియు ప్రాణమలుపుకై

జయహో జ్యోతి వెలుగులే
జయహో ధర్మ చరితమ్ము జాతి నందు
జయహో జనదీక్ష మనసు
జయహో సత్య పలుకు కళ జయమే యగుచన్

పట్టిన వానలు తగ్గే
చెట్టూ గట్టూ తడిసియు చేనుకళకళన్
చుట్టూ సంతోషముయే
మట్టిని నమ్మే బ్రతుకులు మనసే విచ్చెన్

మనముగ ఏకము పిలుపే
జనహృదయాశలకుధీన  జనబంధువుగా
ఘనమైన ప్రకృతి తోడై
వినయము ప్రతిభయు కళలులె వేగిర పరిచే

సోపానాలు ప్రతిభ కే
ఉపాయము లు ప్రగతికేను ఊతం మవ్వున్
అపాయము నుండి ధైర్యము
ఉపాధి కలిగించు టేపు ఉద్యమ పలుకే

వరదకు పంటలు నష్టము
మరువక ముందే తెలిపెను మనసున కష్టం
తీరని దాహము పెరిగే
తరుణం ఆసన్నమైంది తరుణీ దుఃఖం

జనమే మూలము జగముకు
గుణమే మార్గము బ్రతుకు కు గళమే దిక్కూ
ధనమే కాలము నేర్పును
మనమే అనుకొని బ్రతుకు ట మానస జీవమ్

కొంచపు నరుసంగతిచే
సంచితముగ కీడువచ్చునది యెట్లన్నన్
గించిత్తు తల్లి కొట్టిన
వంచన పెరిగే మనసున వాదన పెరిగే

కవ్వంలాచిలికే మది
కావ్యం కధల కదలికలు కళలను తీర్చున్
కవ్వించడమే విధిగా
నవ్వించడమే నటనల నమ్మిన బ్రతుకుల్

దారుణ మైన పరిస్థితి
మారిన గుంటల తొ రోడ్లు మాప్రభుతఇదీ
పరుగు పరుగునా మార్పులు 
మెరుగు పడేట్లు గమనించె మేర్పాట్లు గనే

మనముగ ఏకము పిలుపే
జనహృదయాశలకుధీన  జనబంధువుగా
ఘనమైన ప్రకృతి తోడై
వినయము ప్రతిభయు కళలులె వేగిర పరిచే

మోత్తం పంచెద ననుచును
చిత్తంబనుచూ జరజర చిమ్ముచు జలమల్
ఎత్తుల నుండి కదిలెనే
మోత్తుకొనుచునే విధియని వెడలే సంద్రమ్

నాడే నదిలా కదిలే
నేడే కలుపు గొనుచుండె నెమ్మది కళలే
ఎండల తీవ్రత తగ్గెను
మెండుగ జలమై పరుగులు మేలుగ చేసెన్

తెలుగున్ సాహితి తోటలొ 
కళకళ కవనంపు పూలు --కనుగవ కెదురన్ 
తొలుకాడు వాటి సౌరభ 
ముల ముద మారంగ గ్రోలు మొ -- గృహలక్ష్మి

పసుపుం కుంకుమములతో 
పసదనములశోభనముల -- భాసిల్లెదు సొం 
పెసలారు పిండివంటలు    
ముసలలు ము త్తైదు లుం త్రూ -- ముదమున లక్ష్మీ

పెళ్లి కి వచ్చితి నేడే
పెళ్లి మీ ముందు నేను ? మాటలు రావే?
పెళ్లి కి చేసెను తొందర
పెళ్లి కి ఓ నూలుపోగు..పేరున లక్ష్మీ

*..నమ్మించటమే తేలిక
నమ్మకముపైన తలబడె నటనల బ్రతుకే
నమ్మిన మోసము జరిగే
నమ్మక పోతే జనాల నాట్యము బ్రతుకే

*..నిద్దుర పోరా తనయా
ముద్దుల బాబూ నిదురపొ ముందర సుఖమే 
మొద్దుల మధ్యన బ్రతుకులు
అద్దములానిజముగాను హాయీ ఇదిరా

*అందాలు చిందు సంద్రము
పందాలు వేసు కొనేటి పక్కా కెరటం
విందులు వనోదములుగా
పొందెటి యిసకన జనాలు పండుగ కళలే

*పుస్తకమే రాయొచ్చు ను
మస్తక ప్రభావ మగుటయె మనసున దీక్షా
విస్తరణ కళే కదులట
చూస్తూ వ్రాస్తూ చదువుట ఊపిరి యగుటే

*తీర్థమయీపుణ్య పుడమి
సర్వార్ధముగానురక్ష సర్వేస్వరుడే
నిర్గుణ ధారణ శక్తి యె
గిరిజా రమణశివ దీక్ష నీశ్వరి కృపయున్

*" ఉరుశౌర్యపరాక్రముఁడా !
  ఉరుభ క్తిమతిద ! వరిష్ట ! యో హరిభక్తా !
  ఉరుభీతిహరణ ! హనుమా
  సురభూలోకాభినుతా ! సుగ్రీవాప్తా !!! "

*" ఉరుభీమపరాక్రముఁడా !
  ఉరుశ క్తిమతిద  వరేణ్య ! యోగిమునినుతా!
  ఉరుకామ్యదాత !వంశద !
  సురభూలోకాభివంద్య 'సుబ్రహ్మణ్యా' !!! "

*..రాపిడి చేస్తే ఉష్ణం
ఓపిక తర్కం అనేది ఓర్పుకు మూలం
జపమై పరిశీలిస్తే
ఉపదేశం ఇది మనసుకు ఊతం జ్ణానం

*..పాత్రోచిత బంధమ్మే
నేత్రోచిత సుఖములేలు నేటిప్రకృతిగన్
యాత్రోచిత సమభావం
క్షేత్రోచిత ప్రాణమౌను క్షేమంకలుగున్

*..సరియైన శైలి తెలుపే
తరుణాన గమనము తేరు తపనలు చెందున్
కరుణా పదవాక్కులుగా
చిరుహాసపు నిస చరితము చింతలు తీర్చున్

* వేదము చదువుట నిత్యము 
బేధములేనిది విధాన బేషజ మేళన్ 
కాదనుచు తెల్పు నాశా 
వాది వధాని యనుటయె యబద్దము శిష్యా

*మాటలు కలిసాయనియే  
ఆటలనుచూసి మరువకు ఆశలు పెరుగున్ 
వేటలు మొదలగును ఇపుడు     
పోటును పడుతున్నదనియు పరుగులు తప్పవ్   

*.పువ్వులకు కులుకు లెక్కువ
పువ్వులకు కవుల కవితలు పూలలొ కులుకుల్
పువ్వులకు భక్తి ఎక్కువ
పువ్వులకు బిడియము వల్ల పువ్వు పరిమళమ్ 

*..దేహము విజ్ఞానము గా
మోహము ప్రపంచముగాను మోజు స్థిరమున్
ఆహార అహము సంపద
దాహము అచంచలమగుట దాశ్యపు బ్రతుకుల్

*..ప్రతీ విషయమ్ము జ్ఞానము 
సతి పతుల పలుకుల వల్ల సమరము జరుగున్ 
గతిలేక బ్రతుకు అనుచునె 
ప్రతిభే లేదని సణుగుడు ప్రతినిముషమునే    

*..కూర్చుని రోదించే కళ  
మార్చుఘటనలే మనసున మార్పుల కోర్కళ్ 
చేర్చును ఆశల పల్లకి 
తీర్చు కలలన్ని కథలుగ తీరులు మారున్

*..బతకమని పుట్టుక ఇదా
పంతాల బంధము వల్ల పాపమవుటయే
చింతల జీవిత మగుటే
మోత్తము శివలీలలేను మోక్షం బ్రతుకే

*..గాలి బుడగ జీవితమే
జాలి గలిగి యే మెరుపుల జిలుగు కదలికల్
మేలి ముసుగు మలుపులు గా
రాలెడి ఆకుల నునెంచి రాశులు బ్రతుకే

*..చెట్టుఫలాలను దానము
నీటిని త్యాగము ను చేయు నదులే మనకూ
చెట్లే ఇచ్చును గాలిని 
పట్టుగ లోకాన్ని మొయుచు పృధ్వీ నుండెన్

*..నేర్పెద నిలకడ విద్యను 
మార్పులు చేర్పులు తలవని మానస కళలల్
నేర్పుకు యీఅవ కాసము
ఓదార్పు కళలొ కచోట ఓర్పే వాణీ 

*.నిమిషము నిరాశ బ్రతుకే
తమకము పెరిగే దురాశ దుఃఖానికి కే
విముఖతగను అడి యాసలు
సమయము పాశమున చిక్కి సమరము యగుటే

* సర్వాంతర్యామివిలే 
నిర్వేదము ఏల నీకు నేటి జగతిపై  
సర్వార్ధమును తెలుపుమా 
కర్మానుసారి గుణములు గనుమా శివుడా 

*చరణాలుపట్టి వేడుక 
చిరుహాసమేళ గధూళి చిన్మయముగనున్  
కరుణాళుడుగా పూజలు  
శిరసే వంచియు హరహర శివశివ అనుచున్   

*వేరుశనగ వేయి0చిన
మారుపలుక లేక మొట్టె మాటుగ తినుటే
మరిగించిగాను రుచియే 
మరి కాయలోని మహిమను మనసుకు తెల్పెన్

*కలలెన్నో కవితలుగా
చెలరేగిన జీవితాల చిలక పలుకుల్
వలలోచిక్కిన కధలే
తలనే బంధించుటేను తలమునక లగున్

*నిన్నే వెలుగొచ్చిందిలె
మోన్నే వానలు వరదలు మొపుఎక్కువయ్యెన్
మిన్నున మేఘఘర్జన
మన్నున పాములు పురుగులు మాయను కమ్మెన్

*జలమే జేపకు నిలయం 
గిలగిల లాడును పుడమిన గేలను బ్రతుకో
పిల్లులు తినునే ఎలుకలు
విలియమ్మోచ్చినచొ  నేమి వింత జరుగునా

*దీసాలికి వందనములు
చేసేసన్నానముగను..చేరువగటయే
ఆశయ సాధన పద్యము
చేసిన పుణ్యం ఫలములు చేష్టలు యగుటన్

*లౌక్యం చూపుటకు కళే
లక్ష్యం దగ్గరకు చేరు లావణ్య గతీ
వాక్యం తెలుపే సమయము
సౌఖ్యం కలి గించుటేను సౌందర్య కళే

*పూదోట బెంప నేర్వుము 
సాదరమున నీరుపోసి చతురమ మెరయున్ 
లేదనక వలయు పూవుల 
మోదమున పరిగ్రహింపుమో - గృహలక్ష్మీ  

*ఆనంద మాయె మాటలు 
మానసము వెన్నపూసిన - మాధురి యగుటన్ 
తాననగ తంద నానని 
గానమున వినోద మేను గమ్యము తెల్పెన్

*పలికించు నిజము నిన్నే 
గెలిపించు ధనము మనస్సు గెల్చుకొనుటయే 
చలిపెట్టు మనసు ధనమే  
మలుపులు అబద్ధపు తలపు మాయవలననే

*సాధించే లక్ష్యముగా 
పొందుము సహనపు కళలను పొంతన వద్దే 
భేద అసంతృప్తి దేనికి 
ఇదియే జీవిత మనుచునె ఇచ్చా పలుకే

*గంగను తాకిన మేలులె  
గంగాధర అనియె కోరి కడసేవలుగన్  
శృంగారపు బ్రతుకులివియు 
సాగరమున చిక్కిపోయె సంగమ బ్రతుకుల్

*అడుగేస్తే పని మొదలౌ
మడుగై వర్షపు చినుకుల మలుపై కదిలెన్
పిడుగై రాలెను పుడమిన
గొడుగే ఆధారముగను గొప్పగ నడిచెన్

* తెలుగున్ సాహితి తోటలొ 
కళకళ కవనంపు పూలు --కనుగవ కెదురన్ 
తొలుకాడు వాటి సౌరభ 
ముల ముద మారంగ గ్రోలు మొ -- గృహలక్ష్మి

*అమ్మలుగన్నపెద్దమ్మ 
మమ్మేలుచునున్న దేను మాతల్లీయే 
కమ్మని పిలుపుల తల్లీ
నెమ్మది శాంతము గనవలె - నెలతా లక్ష్మీ

*పసుపుం కుంకుమములతో 
పసదనములశోభనముల -- భాసిల్లెదు సొం 
పెసలారు పిండివంటలు    
ముసలలు ము త్తైదు లుం త్రూ -- ముదమున లక్ష్మీ

*పెళ్లి కి వచ్చితి నేడే
పెళ్లి మీ ముందు నేను ? మాటలు రావే?
పెళ్లి కి చేసెను తొందర
పెళ్లి కి ఓ నూలుపోగు..పేరున లక్ష్మీ

*హద్దులు దాటని మానవ
పద్దుల మనసుల వలేను పలుకులు కోరే
శ్శిధ్ధము వల్లన తీర్చే
వద్దన్నావచ్చె వర్ష విజయము లక్ష్మీ

*కొత్త మనుషులే వచ్చే
కొత్త విధానాలు గాను కోరెడి బుద్ధీ
పొత్తులు అభ్యర్ధులు గా
పొత్తుకు చిక్కియు కదులుట పోరున లక్ష్మీ

*బండన భీముడు తెలిపే
కొండా కోనా మలుపులు కోర్కెల వెలుగుల్ 
ఉండెడిది మనసు కోరే
బండగ మారినది బుధ్ధి భాధ్యత లక్ష్మీ

*ఆదరణ లేని కరుణా
వాదన తెలపనిది బుద్ధి వారసు డెవరో
వేదము ముఖపుస్తక మా
పదములు తెలుగే తెలియని పలుభాషలుగా

*మనసున్న మనిషి మనలో
మానవమానమెరుగకయె మాత్రము సుఖుడై
కానని విద్యను తెలిపే
అనుభవ చాగంటి పలుకు అభయం శక్తే

*వెన్నే వేడికి కరిగే
మన్నే కరుణానిధి గను మమతలు పంచే
మిన్నే గాంభీర్యత గను
ఉన్న మనిషే పెరిగేను ఉలుకేలకళే

*చాగంటి పలుకు మనసై
చాగంటి గళం వినినను జాడ్యం తొలగున్
చాగంటి పలుకు మధురము  
చాగంటి కళయే మనసుకు  శాంతిని యొసగున్

* వేదము చదువుట నిత్యము 
బేధములేనిది విధాన బేషజ మేళన్ 
కాదనుచు తెల్పు నాశా 
వాది వధాని యనుటయె యబద్దము శిష్యా

*మాటలు కలిసాయనియే  
ఆటలనుచూసి మరువకు ఆశలు పెరుగున్ 
వేటలు మొదలగును ఇపుడు     
పోటును పడుతున్నదనియు పరుగులు తప్పవ్   

*.పువ్వులకు కులుకు లెక్కువ
పువ్వులకు కవుల కవితలు పూలలొ కులుకుల్
పువ్వులకు భక్తి ఎక్కువ
పువ్వులకు బిడియము వల్ల పువ్వు పరిమళమ్ 

*..దేహము విజ్ఞానము గా
మోహము ప్రపంచముగాను మోజు స్థిరమున్
ఆహార అహము సంపద
దాహము అచంచలమగుట దాశ్యపు బ్రతుకుల్

*..ప్రతీ విషయమ్ము జ్ఞానము 
సతి పతుల పలుకుల వల్ల సమరము జరుగున్ 
గతిలేక బ్రతుకు అనుచునె 
ప్రతిభే లేదని సణుగుడు ప్రతినిముషమునే    

*..కూర్చుని రోదించే కళ  
మార్చుఘటనలే మనసున మార్పుల కోర్కళ్ 
చేర్చును ఆశల పల్లకి 
తీర్చు కలలన్ని కథలుగ తీరులు మారున్

* మాలో ఏలే కధలే
ఆలోచనకొమ్మకేను కాసిన ఉదయం 
మేలే చీకటి కనులై
కల్లోల హృదయ మలుపులు కావ్యము తెలిపే

" * కవి *దార్శనికుఁడనందురు
      * రవి * కాననిదౌవిశేషరహితోఁగాంచున్
* భువి * ప్రజకుమేలుసేయును
* చెవి *యొగ్గివినును సమరసశిష్టఁపుసూక్తుల్ !!! "

*..ఎవ్వానిరోదసి పలుకు
ఎవ్వానినామమేను ఈశ్వరు డగుటే
ఎవ్వాని చిత్త శుద్ధి యు
ఎవ్వానిశుభ ముముక్షువు ఏకమగుటయే

*..విష గుళికలు గా మారెను
నిష పెంచుననే కధలగు నేటి జగతిలో
వేషం ధరించి పిలుపుయె
విషమే కక్కెడి మనసులు వేగపరుచుటన్

*..నలుపు తెలుపు చద రంగమ్ 
అలుపెరుగని ఆటయే ను పందెం సమరమ్
కలలన్ని తీర్చు సమయమ్
పలు భటులు రాజులు మంత్రి పోరుల రంగమ్

మేధస్సు ను పెంచుకొనే చదరంగం ఈశ్వరా

*..కాలమిది గడచి పోవుట
నిలకడ నిట్టూర్పులే ను నిజమే యగుటే
తలపులు తెరిచి పిలుపులే
కలతలు తీర్చుటయె హాయి కధలేలగునో

*..లేఖలు రాశా బ్రతుకును
సుఖమేదొ తెలియని దీను సుభ్రత కళలే
సఖిపలుకు వెన్నెలలు లే 
ముఖపర్యంతము ఒదిగియు ముఖ్యమగటయే

* జరిగేది జరుగు చుండుట  
జరగనిది జరగుచునుండు జర పాఠమగున్     
తరుణాన కధలు మారును 
అరుణో దయము కిరణాలు నమ్ముట నిత్యం 

*..మత్తుపికము చిన్న పదము 
జిత్త మిచట నిన్ను బిలిచె చిందులు యగుటన్
వత్తువనుచు దెన్నులెపుడు
సత్తముగను నిన్ను గనుట.. సంతోషముగన్

*..నిత్యము అధ్య య గ్రంధము 
అత్యంత బంధముల కళ ఆధారముగన్
వ్యత్యాసం కానరాని ది
సత్యం వాక్కులు మనసుకు శాంతిని పెంచున్

*..జ్ణాన సముపార్జనదుకే
జ్ణాన పరమాత్మ పలుకులె జ్ణప్తికి తెచ్చెన్
జ్ణానపు సంపద సాక్ష్యము
జ్ణాన సృజనకే వినయము జ్ణాపక కళలే

*. ఎండలు వానలు చలియే 
దండను మాదిరిగ వచ్చు దాయాదులులే 
మొండి పతి సతీ కలిసే 
ఉండుట ఆకలిని తీర్చి ఊతమగుటయే

* కన కూడదనే ఆడది
కనలేని మనోమ యం వలదులే జీవమ్
కన్నకడుపుతీపి యగు
మన్నన పొందే దిసృష్టి ముందుకు అమ్మే

* భారతి కనుమా యీస్థితి
హారతి అగుటే నరులలొ ఆశలు మరిగెన్
వరమే లేకయు బ్రతుకు లొ
కరుణే చూపి విజయమ్ము కాలము నెంచెన్

కలము తొ కళలను వ్రాసితి
మెలుకువ పలుకే శుభముల మేలును కోరెన్
యేలిక తీరిక తెచ్చి న
కాలము దీపముల తీర్పు తెల్పెటి దైవమ్

నీ చూపుల బాణముయే
గుచ్చే గాయపడలేదు బాధయె లేదే
నచ్చే మనిషై పుట్టిన
విచ్చే వలపేలె కాల మాయలు పొందే

* పుస్తకమే రాయొచ్చు ను
మస్తక ప్రభావ మగుటయె మనసున దీక్షా
విస్తరణ కళే కదులట
చూస్తూ వ్రాస్తూ చదువుట ఊపిరి యగుటే

* తీర్థమయీపుణ్య పుడమి
సర్వార్ధముగానురక్ష సర్వేస్వరుడే
నిర్గుణ ధారణ శక్తి యె
గిరిజా రమణశివ దీక్ష నీశ్వరి కృపయున్

" ఉరుశౌర్యపరాక్రముఁడా !
  ఉరుభ క్తిమతిద ! వరిష్ట ! యో హరిభక్తా !
  ఉరుభీతిహరణ ! హనుమా
  సురభూలోకాభినుతా ! సుగ్రీవాప్తా !!! "

" ఉరుభీమపరాక్రముఁడా !
  ఉరుశ క్తిమతిద  వరేణ్య ! యోగిమునినుతా!
  ఉరుకామ్యదాత !వంశద !
  సురభూలోకాభివంద్య 'సుబ్రహ్మణ్యా' !!! "

*..రాపిడి చేస్తే ఉష్ణం
ఓపిక తర్కం అనేది ఓర్పుకు మూలం
జపమై పరిశీలిస్తే
ఉపదేశం ఇది మనసుకు ఊతం జ్ణానం

*..పాత్రోచిత బంధమ్మే
నేత్రోచిత సుఖములేలు నేటిప్రకృతిగన్
యాత్రోచిత సమభావం
క్షేత్రోచిత ప్రాణమౌను క్షేమంకలుగున్

*..సరియైన శైలి తెలుపే
తరుణాన గమనము తేరు తపనలు చెందున్
కరుణా పదవాక్కులుగా
చిరుహాసపు నిస చరితము చింతలు తీర్చున్

*..నమ్మించటమే తేలిక
నమ్మకముపైన తలబడె నటనల బ్రతుకే
నమ్మిన మోసము జరిగే
నమ్మక పోతే జనాల నాట్యము బ్రతుకే

*..నిద్దుర పోరా తనయా
ముద్దుల బాబూ నిదురపొ ముందర సుఖమే 
మొద్దుల మధ్యన బ్రతుకులు
అద్దములానిజముగాను హాయీ ఇదిరా

* అందాలు చిందు సంద్రము
పందాలు వేసు కొనేటి పక్కా కెరటం
విందులు వనోదములుగా
పొందెటి యిసకన జనాలు పండుగ కళలే
   
*..బతకమని పుట్టుక ఇదా
పంతాల బంధము వల్ల పాపమవుటయే
చింతల జీవిత మగుటే
మోత్తము శివలీలలేను మోక్షం బ్రతుకే

*..గాలి బుడగ జీవితమే
జాలి గలిగి యే మెరుపుల జిలుగు కదలికల్
మేలి ముసుగు మలుపులు గా
రాలెడి ఆకుల నునెంచి రాశులు బ్రతుకే

*..చెట్టుఫలాలను దానము
నీటిని త్యాగము ను చేయు నదులే మనకూ
చెట్లే ఇచ్చును గాలిని 
పట్టుగ లోకాన్ని మొయుచు పృధ్వీ నుండెన్

*..నేర్పెద నిలకడ విద్యను 
మార్పులు చేర్పులు తలవని మానస కళలల్
నేర్పుకు యీఅవ కాసము
ఓదార్పు కళలొ కచోట ఓర్పే వాణీ 

*.నిమిషము నిరాశ బ్రతుకే
తమకము పెరిగే దురాశ దుఃఖానికి కే
విముఖతగను అడి యాసలు
సమయము పాశమున చిక్కి సమరము యగుటే

* సర్వాంతర్యామివిలే 
నిర్వేదము ఏల నీకు నేటి జగతిపై  
సర్వార్ధమును తెలుపుమా 
కర్మానుసారి గుణములు గనుమా శివుడా 

*చరణాలుపట్టి వేడుక 
చిరుహాసమేళ గధూళి చిన్మయముగనున్  
కరుణాళుడుగా పూజలు  
శిరసే వంచియు హరహర శివశివ అనుచున్   

*వేరుశనగ వేయి0చిన
మారుపలుక లేక మొట్టె మాటుగ తినుటే
మరిగించిగాను రుచియే 
మరి కాయలోని మహిమను మనసుకు తెల్పెన్

*కలలెన్నో కవితలుగా
చెలరేగిన జీవితాల చిలక పలుకుల్
వలలోచిక్కిన కధలే
తలనే బంధించుటేను తలమునక లగున్

*నిన్నే వెలుగొచ్చిందిలె
మోన్నే వానలు వరదలు మొపుఎక్కువయ్యెన్
మిన్నున మేఘఘర్జన
మన్నున పాములు పురుగులు మాయను కమ్మెన్

*జలమే జేపకు నిలయం 
గిలగిల లాడును పుడమిన గేలను బ్రతుకో
పిల్లులు తినునే ఎలుకలు
విలియమ్మోచ్చినచొ  నేమి వింత జరుగునా

*దీసాలికి వందనములు
చేసేసన్నానముగను..చేరువగటయే
ఆశయ సాధన పద్యము
చేసిన పుణ్యం ఫలములు చేష్టలు యగుటన్

*లౌక్యం చూపుటకు కళే
లక్ష్యం దగ్గరకు చేరు లావణ్య గతీ
వాక్యం తెలుపే సమయము
సౌఖ్యం కలి గించుటేను సౌందర్య కళే

 పూదోట బెంప నేర్వుము 
సాదరమున నీరుపోసి చతురమ మెరయున్ 
లేదనక వలయు పూవుల 
మోదమున పరిగ్రహింపుమో - గృహలక్ష్మీ  

ఆనంద మాయె మాటలు 
మానసము వెన్నపూసిన - మాధురి యగుటన్ 
తాననగ తంద నానని 
గానమున వినోద మేను గమ్యము తెల్పెన్

పలికించు నిజము నిన్నే 
గెలిపించు ధనము మనస్సు గెల్చుకొనుటయే 
చలిపెట్టు మనసు ధనమే  
మలుపులు అబద్ధపు తలపు మాయవలననే

సాధించే లక్ష్యముగా 
పొందుము సహనపు కళలను పొంతన వద్దే 
భేద అసంతృప్తి దేనికి 
ఇదియే జీవిత మనుచునె ఇచ్చా పలుకే

గంగను తాకిన మేలులె  
గంగాధర అనియె కోరి కడసేవలుగన్  
శృంగారపు బ్రతుకులివియు 
సాగరమున చిక్కిపోయె సంగమ బ్రతుకుల్

అడుగేస్తే పని మొదలౌ
మడుగై వర్షపు చినుకుల మలుపై కదిలెన్
పిడుగై రాలెను పుడమిన
గొడుగే ఆధారముగను గొప్పగ నడిచెన్
*మధ్యం ఆరోగ్యానికి
మధ్యం అనేది ప్రభుత్వ మందనిత్రాగున్
మధ్యం హాని కరము యే
మధ్యం ధనముయ సుఖమ్ము మనసును చంపున్

*ఊహించని దే దాహము
దేహము విజ్ఞాన నిధియు దివ్యమగుటయున్
మోహము పైనుండి మదము
స్నేహము దాహాన్ని తీర్చి సిరులే పంచున్

*'నేనే దేవుడు అనేది
ప్రాణము బయటే ఉంటే ప్రధమం దోషం
ప్రాణం లోపల సత్యము
మనిషే మనధర్మములను మనసు న మార్చెన్

*..నాసిరి అక్షర మాలయె
కసిగా తెలిపే మనస్సు కళలే విధిగా
మసిబారి కధలు కదిలే
విసిరేసి నా విషయమ్ము వేదము అయ్యే

*..నినుతాకి తనువు తపించె
నిను నేను మరవక నుండె నిప్పువు నీవే
కనుచూపే మరువలేను
చినుకులు కలిపింది తీపి చేదు ల సుఖమే

*..ఎగిరెగిరి పడే ఆకులు
చిగురాకుమిడిసిపడేది చెంగున కదిలే
పొగరెక్కినాకు ఊగెను
సొగసరి చూపలతొ ఆకు సోకుమెరుపులే

*..హృదయము సుభాషితాలులె
మధురిమ పంచెడి మనస్సు మమతల కొలువై
విధియే నేర్పెను పాఠము
మదిలో భావములు పంచి మౌనామృతమై

*..నా భారత దివ్యధాత్రి
సంభావన గాను నుండె సంతోషముగా
ప్రభావితమైన ఉషస్సు
ప్రభోదముప్రతి నిముషము ప్రభవించుటయే

***



10, జులై 2022, ఆదివారం

తేటగీతి పద్యాలు

   ప్రాంజలి ప్రభ

రచయిత మల్లాప్రగడ రామకృష్ణ 


           *చరవాణి తేటగీతి మాల*


ప్రథమ  వాయుభాషణ క్రియ ప్రగతి తెల్పు 

శాఖ  ద్వితీయ యంత్రము  శాంతి గణన

చిత్ర  తృతీయం ఛాయల  చిత్ర రమణి |

వృద్ధి యు చతుర్థ  విక్రయ  వృద్ద బాల 


పంచమం  జ్యోతి చీకటి ప్రణయ కళలు 

షష్టమం క్రీడ విలసిత షక లకగను 

సప్తమం చిత్ర దర్శిని  సంఘ వృద్ది 

అష్టమం ఖండ తర దర్శ ఆత్మ ఇదియు


నవమి సర్వప్రాంత విహారి నయన మౌను 

దశమ మార్గదర్శిని విద్య ధరణి యందు 

స్థలము ఏకాదశ  ముఖ పుస్తకమగుటయు 

ద్వాదశం వ్యర్థ  సందేశ ద్వార మగుట 

ఇదియు ద్వాదశ నామానీ ఈశ్వరి కళ


చరిత వాణీ నమస్తుభ్య చరణ మాయె 

సర్వ వార్తల సమన్విత సంఘ మాయె 

చర చరా స్వరూపేణగా చిత్త చిత్ర 

 గ్రాస భక్షిణీ విధ్యుత్ గ గతి 🌹మతి గను 


చిత్రగ్రహణమై రూపేణ చిచ్చు పెట్టు 

యంత్ర గణన రూపిణి గను యాత్ర చెప్పు 

క్రయ విక్రయ సర్వ ణీ మది కలలు తీర్చు 

గృహము ప్రాంగణ దర్శిని గుప్త పరచు 


సర్వ స్తోత్రాణి గానాని  శాంతి చెప్పు 

విద్య కర్ణాంతరాళ శ్రావణియు విధిగ 

దూర ప్రాంతేషుమార్గాణి  ధర్మ బోధ

అంతర్జాల సందర్శిని  ప్రాంజలి యగు 


మధ్యమాంగుళ తర్జన్య మాధురిగను 

స్పర్ళ  మాత్రేణ శోభినీ సంపద యగు 

సర్వ మానవ హస్తేన  మనసు పంచు 

నిత్య  దర్శనం ఆరోగ్య నియమ మగును 


సర్వక్రీడా సముత్పన్న సంత సమ్ము 

సర్వ వస్తు విలక్షణ సేవసంస్థ 

దూరభారాణి విచ్ఛేద భూరి యగుట 

వాయుమార్గ సంచారిణీ వాదనవదు 


మనిషి ఖండాంతర నివాసి మనుగడ ఇది 

నిత్య భాషణేషు సమీప నియమ మిదియు 

వాయు సంకేత గ్రాహేణ వారధిగను 

సమ సమీపేన సందర్శి సమయశక్తి 


వినము మానవ హస్తేన  ఏదనలు లె 

క్షణక్షణ విచారిణ క్షమయు యుక్తి 

సుఖము  వాణి సభా మధ్య సంబ రమ్ము 

నిత్య  సంభాషణే విధి నీడ లగుట 


కార్య కారణ సంబంధ కర్మ యగుట 

మధ్య వాయు విహారిణీ మనసు యగుట 

విజయ సందేశ సంకేత వినయ వాణి 

కళ పురోగతి రోదక కామ్య మగుట 


 విత్త జ్ఞాన శూన్య మగుటే  విద్య పొందు 

లింగ భేదాన్య లేదులే లయలు చూపు 

చరిత చరవాణి చేతి లో సెప్ప కలుగు 

పశువు రూపేణ గణనము పగలు రాత్రి  


జల మధ్యే జంతు మధ్యే ప్ర యాణే గమనేషుచ|

గృహ మధ్యే కార్య మధ్యే ప్రయాణ ప్రాంగణేషుచ |

యాజ్ఞీకేషు యాచకేషు వైద్య వైజ్ఞానికేషుచ| 

దేవాలయే విద్యాలయే చరవాణీ సందర్శనమ్ 


భక్తి వాగ్భూషణం చరభాషణమ్ము 

భుక్తికి చరవాణీ హస్త భూషణమ్ము 

శక్తి కర్ణ వార్తలకునులె శ్రవణమ్ము 

నిత్య చరవాణి లీలలి నియమ మందు.


కంపనం ఆగమనముయే కళలు తీర్చు 

సూక్ష్మ ప్రాణి వినాశనం సూత్ర మగుట 

సంభవము చేయు ఈ క్షణముna సర్వాణి 

గళము వాయు మార్గేనను గమ్యతేను 


సంఖ్య మాత్రేణ ఆహ్వాన సమయ తీర్పు 

సంఖ్య ధీనేన వర్తినీ సంతసమ్ము 

 పాఠ వ్యర్థేన కాలక్షేపాయ మిదియు 

బంధ బాధ్యత వ్యర్థపు భాషణమ్ము


జ్ఞప్తి పత్రాణి సంయుక్త జ్ఞానసింధు 

నామ పత్ర సమన్విత నమ్మకమ్ము 

ఇదియు పత్ర వినాశన ఇష్ట ఘోష్టి 

నయన సర్వ సంబంధము నాశనమ్ము 


             ఫలము

ప్రీతి పయనమందు సలహా పిలుపు మల్లె

అధిక ఉపయోగ లాభము ఆత్ర మొద్దు

వైద్య విద్య సంభాషణ వైనతి యిది

పదెపదే వాడుటయు వద్దు పరమ గతియు


కళల ఆరోగ్య పనులుగా కలలు తీర్చు

పిల్లలకు  అనారోగ్యమ్ము పిచ్చి పెంచు

మృత్యువు తలపు మార్గము ముందు చూపు

లేని ఇల్లు లేదు లె సెల్లు లేత మనసు

మల్లాప్రగడ రామకృష్ణ: ముక్కోటి ఏకాదశి రోజున శ్రీహరిని ప్రార్ధిస్తూ
కవిత్వం....అక్షర లక్ష్యం

న.ఊహ లయల భావ మదియు ఉన్న తమ్ముగా నమఃశివాయ
స్నేహ చరిత లక్ష్య మేను సేతు బంధమే నమఃశివాయ
ఆహు తవని కవి కలముయె ఆది బోధయే నమః శివాయ
బాహు బలము కాదు బుద్ధి సానుకూలతే నమః శివాయ 

అక్షరం విత్తుగా నాటినా  పంట మనసు 
అక్షరాలు కళ లయితే ఆట చెలిమి 
పూల తోట కవిత్వమ్ము పూజ్య మగుట
అక్షరాలు ముత్యాలుగా హార మెరుపు

అక్షర కిరణాలయితేను ఆస్తి గాను 
అక్షరం తేనె చుక్కగా ఆశ పెంచు
జిహ్వకుపసందు కవితయు చేష్ట లగుట 
అక్షరాలు రాగాలయి అలక దీర్చు 

అక్షర ఇటుకలైతేను పొందు గృహము 
అక్షరాలన్ని ఆకులై కదలు చుండు 
అక్షరాలు తారకలైణ వెన్నలగుట 
అక్షరాలు మేఘాలైతె చదువు జల్లు 

అక్షరాలు ఆలోచనలైతె పలుకు 
అక్షరాలు ప్రవాహమై జిలుకు వాన 
అక్షర ప్రాంజలి చదువు అందరి మది
అక్షరాల సత్యము ఇది అచ్చు హల్లు

 అక్షరములసమాహారమౌనుహృదయ
మక్షిభావాలసాకారమైనిలుచును
కుక్షిభరమగువిద్దెలకౌశలమును
సాక్ష్యమైనిచ్చువాగ్ఝరి శారదాంబ !!! "
----

అందరికీ అంతర్జాతీయ కవితా దినోత్సవ శుభాకాంక్షలు
మీ విదేయుడు  మల్లాప్రగడ రామకృష్ణ

 ప్రాంజలి ప్రభ కుటుంబం

తే:: చిత్త మనెడి వేరు శిధిల జీవ మయ్యె 
      వింత జరుగుటే సకలమ్ము వీధి పరుగు 
      అంత కంతకు మనసుయే ఆత్ర మాయె 
      బ్రతుకు లోన కలుగు భయం బాధ్య తాయె 

తే:: ప్రకృతి యనెడువిత్తుయు చెట్టు పడును పిదప 
      ఆకృతి ఆకలి పెరుగుట ఆశ పెరుగు 
      సుకృతి కోర్కల కొమ్మతో శుభము కోరు 
      వికృతి జరుగుటే సహజమే వినయ ముంచె 

తే:: ఇంద్రియ జ్ఞానము విషయమ్ము ఇచ్ఛ యగును 
      నిర్ణ య గుణము వల్లనే నిజము తెలుపు 
      స్మ్రుతి కలిగించు శీఘ్రము సూత్ర మగుట  
       కర్తగా అహం తోడుగా కలలు కలుగు       

తే:: ఆత్మ నుండి అహముగాను ఆట పెరుగు 
      అహముతో మనసుయె మర్కటమగు చుండు 
      నిశ్చ యాత్మక మైనదే నీడగుండు  
      చిత్తము నియమాలు జరిగి జాడ్య మగుట 

తే:: ప్రణయ రాజ్యపు రమతోడ బవ్వళింపు 
       అద్భుతాశ్చర్యములు గొల్పు నంద మగును 
       ఎవ్వరైననూ తప్పదు ఏలు బ్రతుకు 
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభల గీత     

తే:: భార్య కోపించిన ఎగిరే భర్త గిన్నె 
      వీక్షిస్తారులే అన్నిటినీ వినయముగను   
      చంద్ర బింబమని తెలుపి చక్క జేయు  
      మధ్యన పగలే తారలు మాయ జూపు 

తే:: దూర మనునది దగ్గర స్పూర్తియగుట 
      దూర భార అపార్థాలు దరికి రావు     
      ఆమె అనుమాన కాలమ్ము ఆట పట్టు 
      నేను చెప్పనివీ విని నీతి చెప్పు 


తే:: వేయిసూర్యుల కాంతివివేక తల్లి   
       కొన్ని కోట్ల జన్మలబంధ కోర్క తల్లి 
       అమ్మవారి ఆవిర్భావ ముందరి కళ 
       చిన్మ యస్వరూపిణి అమ్మ చిత్ర మేళ   
  
తే:: నంచు హిమబాష్పముల విలపించు దరులు
       గాంచు పుష్పఫలము మాల గమ్య మగుట 
       కంచు కంఠగానము విని కనులసొంపు 
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 
  
తే:: ఉదయ పవనములం దాడుచుండె దివిని
      సవ్య సాధన కళ లల్ని సాగుచుండె    
      చిత్ర భానుని లీలలే చిన్మయమగు 
      గగన సీమంతినియు నవ్వు గనులు తెరచి"
 
తే:: మన నిజాయతీ నాటితే మనసు మార్చు  
      మిత్రు ల్లో మంచి నాటితే మేలు జరుగు  
      తృప్తి వినయాన్ని నాటితే  తృణము సుఖము 
      గొప్పదనము నిగర్వము పొందుతారు

తే:: దృక్పధం నాటితే మంచి దృష్టి పొందు
       శ్రమను నాటితే విజయమ్ము శాంతి నిచ్చు 
       క్షమను నాటితే చెలిమి అక్షయము గాను 
       ప్రార్ధనలు నాటితే భగవానుని కళ

స్త్రీ ల ప్రత్యేకత తేటగీతి పద్యాలు నేడు దైవ నిర్ణయం 
(
01) శ్రీ మహా విష్ణువక్షంబు స్థిరముగుండె
వాసమున నున్న లక్ష్మియే వ్యాధి మార్చు
విభవ ము లొసగు దయతో ను విజయ మిచ్చె
శుభములు కలిగించి మనసు సుఖము మెండు

02). శ్రీ మతియెసల హాలను శ్రీ క్రమము న
సార మదిని మార్చెడిదిట్ట సంఘ ముననె
ఘోర జలధి లో సంసార ఘోరముగను
జాణ యౌ విహారంబున జాతి మనది

(03) జ్ణానసంపద ఓదార్పు జ్ణాతిగనలె
ఓర్పు ఆయుధంగా యుక్తి ఒడిసి పట్టు
శక్తి  తో వనరులు పొంది సమయ తృప్తి
పంచెడి మహిళా మమతతో భాష తెలుపు

(04) బహు జనములహర్షంబులు బ్రహ్మ వాక్కు
కోమలులకు ఫలంబులు కోర్కె మేర
మధురపు రుచులు జిహ్వ లై మనసు జేర్చు
వినయ మహిళా మణుల తీర్పు విజయ మిచ్చు

(05) నీకొరకు కొన్ని నిజమగు నీతులివియు 
నమ్ము సౌకర్యముగ తెల్ప నయన వెలుగు 
గైకొనుచు నుండు మదితో గడుపు చదవు
శుభములు కొనుమమ్మాసతి సుఖము నిచ్చు       

(06) పుడమి పలికెను ఆహ్వాన పుట్టినిల్లు 
పరమ గురువుల దీక్షల ప్రతిమ యిల్లు 
సంస్కృతీ సంప్రదాయాల సంఖ్య పెరుగు
విజయ వాంఛలుతీర్చేటి విరుల జల్లు

(7) కుంకు మంబు అద్దిన భంగి కులుకు జూడు   
కాంచన మెరుపు వర్ణంబు కాల మగుట 
తొలకరి పలక రింపులు తోడు జూడు 
పులక రింతల తెలిపెను పుడమి తల్లి

(😎  అరుణ మేఘము తుంపర ఆశ జూపు    
జలదములు నలు దిక్కులు జపము చేయు 
నేల లోనువచ్చు సెగలు నేడు జూడు 
కొత్త జంటల విరహాలు కోటి మలుపు  

(9) కన్నె పిల్లలు చేతులు కలిపి ఆడు
 చూడ చక్కని ముచ్చట చురుకు చేయు     
 బ్రతుకు రంజిల్లు లతలన్ని భాగ్య మగుట 
 సుదతు లంతా పరమబంధ సుఖము చెందు

(10) లీల లన్నియు జూపుచు నీతి తెల్పు 
నిత్య  గృహధర్మములు నేర్చి నియమముండి 
కీర్తి సూత్రమైన గృహిణి కీలకమగు       
గృహిణి వగుదువు వినయమ్ము గృహ లక్ష్మి

(11) పనులలోన చెలిమిగాను ప్రధమ మగుట 
నన్న దమ్ముల, చెల్లెళ్ళ నటన గనుము 
మమత గనుము కుటుంబంలొ మనసు మాట     
సహన శాంతంబు వలయు జయము జరుగు

(12) నీవు మెలగ వలయుఁ ధర్మ నీతి నెంచి 
యల్ల మలరు చేయవలయు యాశ తీర్చె
చిడుగుడు పనిలో నెప్పుడు చింత వలదు  
మన్ననలు పొందు వారికీ మనసు యుండు

(13) మూడు మాటకు లొంగెడి ముచ్చటగను
పదము యోక్క యర్ధము నెంచి పదుల మాట
దెలప గలిగిన పనులను తెల్పు చుండు
మెండు గాను మురిపముగా మేలు జేయు

(14) గురువుతొ గరపడి చదువు గుణము పెంచు
విడువక పఠియించుట యేను విధియె అనుట
జ్ణాన విజ్ఞాన కాంతులు జ్ణప్తి గుండు
మది సకాలము స్వచ్ఛత మలుపు నెంచు

(15) తల్లి తండ్రులు మెచ్చెడి తనయి గుండి
ఘనము సంతృప్తి గను బొంద గల్గెదువులె
వినయము శ్రధ్ధ కలిగియు విజయ మోందు
చదువు నేర్వంగ మంచిదే జయము కలుగు

(16). కక్ష లేనిదై కారుణ్య కట్టి వేయు
దీక్షలో ఉండి విజయమ్మ ధీన మౌను
శిక్షణ వలెనే ఇప్పుడు చింత తొలుగు 
రక్షణ కవచం చదువుటే రమ్య తరుణి

(17) అంధ కారమే వెలుగుతో అంత మగుట
నిత్య అపవిత్ర త నశింప నియమ మగుట
లోపల పరిపూర్ణత చెంది లోప మాపు
సంకు చిత్వాన్ని తరిమేసి సమయ తరుణి

(18) గురువు వద్ద నేర్చిన విద్య కుదుర గుండె
మమతతొ మదిలో భావమ్ము మాయ నెంచు
నిత్య లోకంబు తెలుసుకో నిర్మలమగు
ప్రకృతి ఒడిలో న విడుదల ప్రధమ మగుట

(19) ఎండమావులు దాహము ఏల తీర్చు
లంచగొండితనమ్ము ఏలెను లె ఇపుడు
సమ సమాజంలో బ్రతుకుల సమర మగుట
మానవత్వం బ్రతుకు తుంది మనసు ధరణి

(20) విత్తము కొరకు విద్యలు వెల్లు వెత్తు
వాంఛ వీడు ఉద్యోగులు వాదనొద్దు
భూషణమ్ము విద్య యగుట భూరి వెలుగు 
విద్య నియమాలు నేర్పును వింత మలుపు 

(21) పద్య రత్నము లారసి పాడ గలవు
భారతము భాగవతమును బాగ జదువు
బాగ దెలియ సారంబుయు భక్తిగా ను
జదవ జదవ మంచిగనుటే జపము తరుణి

(22) నీతి కధలు చదువు తున్న నీకు మేలు
తెలివి చాతుర్యంబుపెరిగి తెల్ప గలవు
మాటలో మార్పు కీర్తియే మనుగడగను
నిత్య తృప్తియే సంతృప్తి నీకు తల్లి 

(23) సతుల కధలు చదవ వలే సంఘ నీతి 
వన్నె కెక్కిన పతి బక్తి వలదు వలదు 
మతివతుల చెలిమియు నీకు మమనుగడగను      
బుడ్డి కుసలత మనుగడ ఉత్తమవ్వు 

(24) భక్తితో పిల్పు భాగ్యము బంధ మగును   
సూక్తులను జెప్పి సూక్షము సూత్రమగును
రక్తిని సలిపి రక్షణ రాగ మగును 
ముక్తి మోహన మోహము ముఖ్య మగును 

(25) మంచి మనసు ఆలోచన మంచి చేయు
రూపముయుకాదు గుణముయే ఊత మవ్వు
అసలు సిస లైన అందము అర్థముగను
రంగుల కళలు రాట్నమై రవ్వ వెలుగు 

(26) జీర్ణమైపోవు కలలన్ని జీవితాన 
శిధిలమైపోవు కళలన్ని స్థిరములేక 
అమృత భాన్డాము త్రాగినా ఆశ వుండు 
భక్తుల భగవన్నామము బంధ మగును 
   
(27) జీవిత వసంతాన్నితెలుపు జీవ యాత్ర  
 తనివి తీర కంఠము విప్పు తప్పు కాదు 
 తేనెలొలుకు తియ్య దనము తీపి గుండు
 లోకమై పోకు నిజమును లోల కమ్ము

(28) సాహస పరులై మహిళలు సాధనగుట 
జన్మ భూమికి సేవలు జ్ఞప్తి కొచ్చు 
మక్కువను తెల్పి గొల్చును మగని ఇంట 
చక్కని తెలివి రాజ్యము చలము వలెను       
 
(29) మధుర మధురమ్ము లాహిరి మచ్చ మార్చు  
ప్రణయ రాగ జీవనముఏ ప్రముఖ మగును      
దెచ్చుకొమ్ము వీరత్వము దినము దినము 
ధైర్యము బలిమిని గనుమా దైవ నీతి 
  
(30) చిన్న తనములో నేర్చిన చింత తొలగు  
సన్నుత సుగుణములె కీర్తి సంపదగును  
 యెన్నడు తిరుగంగ వలదు ఏమి అనకు 
వినయ విశ్వాస లక్ష్యము విద్య యగును  
 
(31)బొరుగుటిండ్లకు పోకుమా పోరు జఱుగు   
లేని పోని జగడముయే లేత మనసు  
అనువు స్థలమున పఠనము అనుక రించు 
గీతములను పద్యములను గీటు తరుణి 
 
(31) కాల మే తంతు గా  కామి తార్ధ మగును 
గాళ మే వేసె నే  గమ్య గాయ మగుట  
మేళ మే మ్రోగె నే మేను యేను చిందె 
పెళ్ళి యే జర్గె పెత్త నం పెర్గె నేను 

(32) నాదు డెందమ్ము నాదము నటన కాదు 
ఈదు లాటే ను ఈశ్వరా ఈల యేమి  
వద్దు లే అన్న ఆశ కే వేకువగుట 
పొందు సల్పి తీ బాధ్య తా పోరు తరుణి 
 
(33) బాధలీ రాత్రి బంధమే భాద్యతగును  
బోధ నే ప్రేమ ముద్దులే సోధనగును 
వేదనే కాదు చల్లగా వేడిగాను   
వాదనా లేదు వేడుకే వలపు  తరుణి 

(34) జీవ పీయూష చేదుగా జీతమగును  
నావనే లాగి నాట్యమే నాకు పరుగు  
కావుమా మమ్ము జాప్యము కాల జాల 
తావునే చూడ  తాపమే తరుణి మార్చు 

(35) వేద నా కార వెల్గునా వేకువగుట  
శోధనా ప్రేరణే శోద్య  సోకు యగుట  
బంధమే మార్గ మగుటయే బేధ మేద్దు  
సాధనా‌ తత్వమేయేను శాంతి తరుణి 

(36) త్రోవ చూపించు నిత్యమూ తోష మొందు 
భావమే నాది జీవిత భాగ్యమేను    
సేవ యే కాల సమయము  సంతసమ్ము   
దైవమే తోడు నీడయే ధర్మ మేను   


(చూడమ్మా మనము కొన్ని విషయాలలో జాగర్తగా ఉండాలి, వాటిననుసరించి మనము మారీ దేశానికి కుటుంబానికి సహకరించాలి    
తల్లిదండ్రులు,  గురువును(ఆచార్యున్ని), పవిత్రత,  నిజాయితి, కఠోర శ్రమ,  సోమరితనం,  పరనింద,  ప్రవర్తన, అబద్ధం, ఈర్షాద్వేషం, అహంకారం, అపార్ధం, కోపం, కోరిక,  ధైర్యం, కీర్తి,ప్రశాంతత, వాగ్దానము, మంచివారిస్నేహం, వాత్సల్యం, మాట్లాడే విధానం,పని,సత్ప్రవర్తన, దానగుణం,సేవాభావం ఇలా ఎన్నో వున్నాయి )

(37) తల్లి తనయులకు ప్రేమ తృప్తి నిచ్చు 
తండ్రి తనయుల మనుగడ తపము తీర్చు   
తల్లి హృదయము పంచియు త్యాగమూర్తి 
తండ్రి సంపద కూర్చియు తరుణ మవ్వు 

(38) గురువు తనవిద్య బోధించి గుప్తముగను   
గురువు కాలాన్ని బట్టియు గుణము చూపు  
గురువు సకలమ్ము తెలిపియు గుర్తు పట్టు 
గురువు విశ్వాస మేవిద్య కూర్చు నిజము  

(39) మన పవిత్రత మన ధైర్య మందు తెలుపు 
ప్రేమ కు పవిత్రతయు ముఖ్య పరువు తెచ్చు 
సకలము పవిత్రత వలన సాగుచుండు 
వినయము పవిత్రత జయము విశ్వమందు  

(40) మనిషి లో నిజాయితి బత్కు మనసు నిచ్చు  
మగువలో నిజాయితి విశ్వ మాయ యగును 
జయము లో నిజాయితి ధైర్య జాడ్జ మగును  
కళల లో నిజాయితి వల్ల కార్య శిద్ధి   

(41) మనిషిలో కఠోర శ్రమ మంచి చేయు 
మగువలో కఠోర ప్రేమ మనసు చేరు 
వినయమే కఠోర శ్రావ్య మవ్వు చుండు 
నిత్యమూ కఠోర భ్రమ నిన్ను తాకు

(42) సోమరితనం తొ బతుకులో చింత చేరు 
సోమరి తనమే నిత్యమూ సోమ్బె రవ్వు 
సోమరితనం వరుస శక్తి శల్య మవ్వు 
సోమరితనము శాంతికి స్వేశ్చ తగ్గు   

(43) నీవు పరనింద చేసినా నీకు హాని 
నీలొ పరనింద భావము నిన్నె మార్చు 
నచ్చనివి పర నిందలు నాకు నీకు 
కష్ట మొచ్చిన పరనింద కొలువ వద్దు

(44) నిత్య నడవడికల ప్రేమ నిజము చుట్టు 
మనిషిలొ ప్రవర్తన సమ మైత్రి పెంచు 
ఉత్చవమ్ము నడవడిక ఊపు తెచ్చు 
కలలొ న ప్రవర్తన మంచి కార్య మవును  

(45) నిత్యము అబద్ధ మాడితే నీకు హాని 
నిత్యమూ అబద్దమ్మునీడ నిన్ను మార్చు  
సత్య వాక్కుఅబద్ధము చేర్చ కుండు 
ఎప్పుడైనా అబద్ధమ్ము ఎదను తాకు     

(46) ఎవరితో ఈర్ష ద్వేషము ఎపుడు వద్దు 
ఏమి టిది ఈర్ష ద్వేషము ఎదను మార్చు  
నీరులా ఈర్ష ద్వేషము నిన్ను చేరు 
గాలిలా ఈర్ష ద్వేషము  కమ్ముకొచ్చు   

(47) మనసు లో అహం కారము మాయ గుండు 
మగని లో అహంకారము మ్రోగు చుండు 
మగువలో అహంకారము మౌన మవ్వు 
కధలలో అహంకారము కలుగ చేయు 

(48) జీవితంలోఅపార్ధము చింత తెచ్చు 
ఊహలో అపార్ధము చోటు ఊయలగును 
ప్రేమలో అపార్ధ౦ సర్వ పతన మగును 
కాల జగతి అపార్ధమ్ము కధలు చెప్పు     

(49) కోపపు పలుకు కొందరి కొంప లార్పు 
కోప మున్న మనిషి చెప్పుకోక అరుచు 
కోప భావము ఎప్పుడూ కొంప లార్పు  
కోప పడకుండ విజయము కోరు వెలుగు 

50) కోరిక మనిషిలో మార్పు కొంత వచ్చు 
కోరికప్పుడూ బాధతో కోర్క రగులు  
కోరి కే లేని మనిషిగా  కోప మహిమ 
కోరిక యె జీవితమ్ములో కోల లాడు  

51) ఏమి లేకున్న ధైర్యము ఏలు చుండు  
భ్రమలు తరిమేది ధైర్యమే భక్తి కరుణ 
ధైర్య సాహసములు అన్ని ధర్మ మవ్వు 
నిత్య ధైర్యపు జీవితం నిజము తెలుపు 

52) కీర్తి కలిగిశ్ర మించుట మేలు జరుగు  
కళల పంచేటి కాలము కీర్తి తెచ్చు 
కలల చైతన్య తీర్పులు కీర్తి తెచ్చు 
సంపదలుకన్న సుఖముతో కీర్తి పంచు   

53) మానవుని లో ప్రశాంతత మాయ మార్చు  
మార్పులన్ని ప్రశాంత తే మరుపు తెచ్చు 
హాస్యములలొప్రశాంత తే హాయి నిచ్చు  
నవ్య జీవన శాంతియే నాణ్య తవ్వు

54) పట్టుదలలోను వాగ్దాన పసయు తేల్చు 
నిత్య వాగ్దానములు తీర్చు నిముష మవ్వు 
సత్య వాక్కుల వాగ్దాన నిత్య జీవి  
మనిషి వాగ్దానములు తెల్వి మార్చు చుండు  

55) మంచివారితో స్నేహమ్ము మనసు గెలుచు  
మంచివారిలొ స్నేహమ్ము మదిని మార్చు 
మంచివారిలొ స్నేహమ్ము మగువ తీర్పు 
మంచివారిలొ స్నేహమ్ము మనిషి బ్రతుకు 

56) ఒకరి వాత్సల్యపు పలుకు ఓర్పు పెంచు 
ప్రేమ వాత్సల్యపు పిలుపు పేరు తెచ్చు   
కరుణ వాత్సల్యపు మనసు కధలు తెల్పు 
సమయ వాత్సల్యపు ఘటన సౌఖ్య మిచ్చు

57) నీవు మాట్లాడె కళ విధ్య నీకు రక్ష  
మనసు మాట్లాడ లేదులే మాయ లొలుకు   
మనము మాట్లాడు మాటలో మనసు దాగు  
మదిలొ మాట్లాడె మనుగడే మగువ మెచ్చు 

58) అంద నంతకు ఎదిగినా ఆశ కలుగు  
జీవితమ్ములో పనులన్ని జితమగుట  
పనులు అన్నిక్రమముగాను పేరు తెచ్చు  
పనుల వేటలో విశ్వాస పలుకు నమ్ము

59) చెపితె మన సత్ప్రవర్తన చేరువవ్వు 
రసము  తెలుపు సత్ప్రవర్తనలు వల్ల 
రామ సత్ప్రవర్తన వల్ల రమ్య కధలు 
మనిషి సత్ప్రవర్తన వల్ల మమత పెరుగు  

60) ఎవరి వద్ద దానగుణము  ఏది దాగు 
బతికి బతికించు దానగుణ బంధ మగును  
నవరసభరితం దానగు ణముయె తృప్తి 
ధర్మ నడక దానగుణము దారిచూపు    

61) చేరువలొ సేవ భావము చింత తొలుగు 
కరుణతో సేవ భావాలు కలలు తీర్చు 
కధలు సేవలు  భావాలు కరుణ చూపు 
సహజ సేవలు పడతికి సౌమ్య మవ్వు  

62) నోరు(నాలుక) రెండు విధాలుగా నాట్య మాడు
మంచి గామాట్లాడి మనసు మార్గ‌ మవ్వు
చెడుగ పలికియు భయమును చింత పెంచు
పలుకులో పసందు మనసు పాక  మొవ్వు 


పరుగు మాధవ ప్రేమను పంచు కొనుట 
సిరులు కల్పించే గానమ్ము స్థితియు లీల
మరచి పోలేని కృష్ణుని మమత చరిత
తరుణి తమకము తికమక తరుణ తపతి   

కాల మాయకు చిక్కిన కళలు దక్కు
దక్షత దీపమే అందరి ధరణి  చూపు
కరుణయు దయయు భయమును కామ్య శక్తి
సర్వ శక్తితొ నిత్యము శాంతి గొలుపు  

శోక మోహము లేకయు లోక మందు 
కర్మ చేయుచూ ఉన్నట్టి కార్య దక్ష 
మాటల కరుణ శుభములు మాయలగుట 
తలచు  జీవిత ముక్తుడు అగుచు ఉండు  

కాల చక్రము ఇప్పుడే కదులు చుండు 
మాయ, యీ జన్మ పరమాత్మ మాయ లీల 
ధనము కూడు కరోనాతొ ధరణి మాయ
ఏ నిముషమున ఏమౌను ఏమి తెల్ప   

రైలు రాకతొ ప్రధాని రధము యాత్ర
వామ హస్తమ్ము ఛత్రమ్ము వాలు గుండి 
దేశ సేవకు ప్రజలలో దైవ తీర్పు 
నీలి మేఘాల జల్లులు నీడ లగుట  

మంచి మనసుకు మంచిధై మంచి ఫలము
ఒక్క రొక్కరు ఏకమై ఒకటి యగుట 
ధర్మ రక్షణ ఓదార్పు ధరణి యందు 
మనిషి రోగిగ మారక మందు వాడు    

సకల శాస్త్రములు జదివి సమయ మిదియు 
దెలప గలరు, చావు దెలప దేశ మిదియు 
చావు దెలపలేని చదువు చాలు మాకు 
చదువు ఉద్యోగము గృహము చలము వలెను   

*మధుర గానము మనసును మక్కువగుట 
పలుకు పల్లవి మంగళ పదము అగుట 
సుస్వ రాలతో సంగీత సుమము ఇదియు 
ప్రజ్ఞ థీమణి వినయపు ప్రతిభ వాణి   


నేను తెల్ల కాగితముగా నియమ ముంచి 
ప్రేమ మది ఊహ కందని ప్రియశి మనసు
అద్ది అడుగులు ఏడును,  అది  గీత
కలిపి ఒకటిగా చిత్రాన్ని కలయ చూపు  

నాన్న వేలును బట్టియు నడిచు మార్గ
మంత చూపియు ధైర్యాన్ని మాన చేయు
అమ్మ వేలును బట్టియు  అంది కళలు  
పుచ్చి ఆకలి తీర్చి యు పుడమి నందు 

అంద మైన వర్ణ ఛత్రము అందనంత 
హృదయ మంత నిజము తెల్పు హాయిగొనుట 
తొడుగు మడుగు కడుగు వర్ష తోడు గుండు 
వీధి దీప వెలుగు ఇంటి  వింత కలుగు     

మధుర వినయ తలపు మాట మధ్యమగుట 
నిత్య సత్య మధ్య బోధ వల్ల
వద్దు అన్న వెంట అయస్కాంత ఆకర్ష
జీవితాన్కి మలుపు తలపు దిక్కు  

*తే..ఖనిజ సంపద లవణము కాంచ గలుగు
ఎన్ని సుడిగండముల గున్న ఏమి మారు
నదుల కలసినా కెరటాలు నడక ఒకటె
సాగర ఘోషలు తప్పవు సమయ మందు

* కళ్ళలోన కవిత్వము కళ్ళ కెరుక
అనుభవం ఆదరణ పొందు ఆశ కెరుక
ఆత్మ తృప్తి యు ఆకలి ఆట కెరుక
పాశ మే దైన బంధ పదాలు ఎరుక

* ఆకలి కొరకు చేసేటి ఆట యిదియె
రోగ నిర్దారణ కొరకు రంగు యిదియె
దాన ధర్మాలు నమ్మకం దారి యిదియె
దైవ నిర్ణయాలు తెలిపే ధరణి యిదియె
భక్తుల చదరంగం ఆట యిదియె ఈశ్వరా
 
ముసుగు లో ప్రజాస్వామ్య ము  ముందు కులుకు
తదిపరి ప్రతీకారము తన్ను కొనుట
జ్వాల నృత్యహేళ కరాళ జాడ్జ మగుటె
నేటి రాజకీయ బ్రతుకు నిమ్మ జలము

ఎన్ని సార్లు ను చెక్కితే ఏది శిలయె 
ఎన్ని మాటలు పల్కినా ఏది పలుకు   
ఎన్ని చిత్రాలు గీసిన ఏది గొడుగు  
ఎన్ని మయసభల కళలు ఏమి బ్రతుకు

పెదవి మెదిపితే శృంగార పదము లొలుకు 
పదము భావము అర్ధము పలుకు చినుకు 
చెదలు కావివి కావ్యపు చేల గుంపు 
చేలు ఎన్నయినా మన చేత చిక్కు

కణము కదలి కే మనసున కల కలము యె
అణిమ సిద్ధులు బ్రతుకు నా కళలు నేర్పు
మణి వెలుగు చేరి మగువలో మనసు మార్చు
రణ మడిగిన భక్తజన రక్షింపు గనుము

బుధ్ధి మాధ్యమ పుల్లింగ పెళ్లి ఏల
మగడు లేక యే గర్భము మగువ లీల
కుత్రిమము సౌఖ్య మగుటయే కులము గీత
కాకి కోకిల యగునటే కవివరేన్య

నిత్య జీవితంలో బుధ్ధి  నీటి బుగ్గ
సత్య వాక్కులు బ్రతుకు కు స్వేచ్ఛ బుగ్గ
మచ్చ ఉండినా గతములో మాయ బుగ్గ
కాకి కోకిల యగునటే కవివరేన్య

దోపిడి యె ధనం దుర్బుద్ధి దత్త తగును
బుధ్ధి యే పశ్చాత్తాపము భక్తి యగును
సంస్క్రతిని బట్టి బుధ్ధియే సందడగును
విశ్వమున పాశ్చాత్యులు ఉన్న విజయ మగును

ఎవరె వరుకుండు ఓర్పుయు యదలొ మార్పు
ఉన్న ఋణము ను తీర్చుట ఊహమారు
జన్మ బంధమే సంభంధ జాతి యగును
ధుఃఖ భావమే సుఖముగా దురద యగుటె  

ఎన్ని చెప్పినా బుధ్ధియు ఏల మారు
మంచి చేసినా చెడ్డయే మారు పలుకు
ఉన్న విషయము తెల్పినా ఊసు లేదు
కాకి కోకిల యవ్వునా కవి వరేన్య

* 25-07-2022

 * అప్పు ఆడంబర ము కైన అత్మ తృప్తి
ఒప్పుకొని తీర్చు ఆప్పుయు ఓర్పు నిజము
తప్పు ఆనందమున యైతె తనదు ముప్పు
ముప్పు తెచ్చు అప్పుయు తప్పు ముందు బ్రతుకు

*దేహ జ్ఞానేంద్రియములేలు దివ్య మార్గ     
మనసు జ్ఞానేంద్రియములతో మహిమ జూపు 
బుద్ధి బలశాలి విజయము పుడమి నందు  
ఆత్మ బుద్ధి కన్న అధికం అందరిగను   

* కళ్ళు మూసుకుంటేపని కవిత సాగు  
 ఏకమగు పదార్ధంబులు ఎలా అనఋ   .
 మనసు మూసుకుంటే శక్తి మానసమ్ము  
 నీదు పలుకుల వెప్పుడు నిత్యమమ్ము     

*..కలలు ఆకాంక్ష కల్లోల కాంక్ష వల్ల
కల విశృంఖలం వల్ల కలకలమ్ము
శాంతన గొలుపు విశ్రాంతి కాంతి లేదు
మెదడు అద్భుత ప్రక్రియ మనసు మంట

* కలల సాకార మును పొంద కానిదైన
పట్టుబట్టి హస్వముపైన బయలుదేరె
వంటిమీద పోగులు లేక వేగ మనుచు
నిద్ర చెదిరె ను కలలోన నేత బ్రతుకు

*దేహమేదైవ ప్రకృతిగా దీర్చగలుగు 
దాహమే ప్రేమ సుకృతము ధ్యానమందు 
మొహమే స్వీయ లబ్ధియు మహిమ గాను 
ప్లీహము పంచుటే జగతిన ప్రేమచేరు

*..ఇప్పుడు జవాబు దేనికి యిష్టమైన
ప్రశ్నలను మార్చి చెప్పుమా ప్రతిభ జూపి
వేచి ఉండటం దేనికి వేగ మవదు
నేర్చు కన్నదీ తెల్పుటే నిజము యగును

మనసు అనంత జీవన మార్గ మగుట 
అమృత వర్షము వళ్ళనే ఆశ పెరిగె 
ఆస్రితులకు సహాకార ఆత్రుతగుట 
అందరికి అంద చేయుట అమృత జలము 
 
నిత్య బంధాలుగనులే నీడ లగుట 
నేనొక ప్రణయ భందాన్ని నిజము యగుట 
నీ వసంతంతొ వికసించు నీల మగుట 
అందరికి అంద చేయుట అమృత జలము

సరస సల్లాప సారము సమయ మగుట 
ఆకలి అను రాగముగాను ఆశ యగుట   
అర విరిసిన అందాన్నిగా ఆధార మగుట 
అందరికి అంద చేయుట అమృత జలము

ప్రకృతిలో వైవి దానాన్ని ప్రభల యగుట 
వైవిధానముయే ఏకత్వ విజయ మగుట 
సుందర స్వప్నమును పొందు శుభము యగుట  
అందరికి అంద చేయుట అమృత జలము

దైవ దత్తమైన వరాలు ధైర్యమిచ్చు  
లలిత సంగీత స్వరాన్ని లాహరియగు 
చల్లని సమీర మగు జల్లే చలవ జేయు 
 పంచ భూతాల సహకార ప్రతిభ యగుట 

మధుర భావాల సత్యాన్ని మాయ జేయు 
కవి హృదయము  సాహిత్య కావ్యమగుట 
స్మృతి సుమధర పరిమళ0 శుభము జేయు 
 కవుల హృదయాలసాహిత్య కావ్య ప్రభలు 

నేనొక ప్రేమ తత్వాన్ని నిజము యగుట 
ప్రేమ తాపాన్ని తగ్గించు ప్రేయసి కల  
కలుపుతా ప్రేమ తన్మయ కళలు తీరు 
ప్రేమ శృంగార తత్వాన్ని ప్రీతిగుండు 

--((*))--

*..తీరము కొరకు వెతుకుతూ తేరు కొనుట
చేరు సమయము నిర్ణయం చింత వలదు
దుఃఖము వలనే సుఖము యే ధరణి యందు
మాయ పాచిక రీతిలో మనుగడే ను

*.నెగడు రాజేస్తె మంటలు నెగడి తన్ను
గుండె రగిలితే జ్వాలలు గుర్తు తెచ్చు
మాటల మనసు మై మార్చి మంట తెలుపు
లక్ష్య సాధన తూటాలు లహరి మాట

*. నే నెవరు విచారణ వద్దు విధియె తలపు
దేహమే అంబర మగుటే ధరణి నలుపు 
ధర్మమే దయా గుణముగా దాహ మలుపు 
శిక్షణా చర్య పలుకు లే స్వేచ్ఛ తెలుపు

*..చక్క చక్కని చుక్కాని చురుకు జూపె
పక్క ననె మక్కువ సిరిలే పలుకు జూపె
ఒక్క గానొక్క చెలి కళ ఓర్పు జూపె
తక్కువ ఎక్కువ లోకాన తపము జూపె

*..మనకు మాత్రమే కనిపించె మదము కొవ్వు
ఎంత చెప్పినా తక్కువే ఏల అనకు
నమ్ము నమ్మక పోతివా నటన యగుటె
అది గది అను కోపము వచ్చు ఆట కాదు

* ప్రతి మనిషిగాను ధ్యాని ఏ ప్రీతిగాను   
జీవి పాఠము గను యోగి జైత్రయాత్ర 
జ్ఞాన సంపదతో ఋషి జీవ యాత్ర 
బ్రతుకులాటలో న మహర్షి బ్రహ్మ వ్రాత 

*మనిషి వేరు మమతలు వేరు మనసు బుద్ది  
నీరు వేరు అలలు వేరు నీకు కళలు 
నీలొ అజ్ఞాన మను ఆశ నీరు కార్చు
నీరు అల ఏకత్వ జ్ఞాన ముయె బుద్ది

* నామ రూపాలు తానుగా నటన చేయు  
హేమ 'సత్యాన్ని' తెలుసుకో హేళ వలదు 
'హేమయే అబద్ద పలుకే హేయ బుద్ది 
సత్యము తెల్పినా అర్దము సమము కాదు 

* ఆకు పువ్వు మొగ్గలు పిందె ఆకృతిగను     
కాయ పండడం సాధన క్రమము గాను  
పండు రాలడం సిద్ధిఏ ప్రకృతి గాను  
ఆకు రాలడం సృష్టికి మాల యగును

*..ఉదయ భానుని ముదమున ఉడుకు జూసి
ఇంటి ముందర ముగ్గేయు ఇంటి పడుచు
కళ్ళ చూపుల అలివేణి కన్ను కొట్టె
ఇంక నే వేగ ఆగలే ఇదియె ఘటన

ఆ..కూడు పెట్టు రైతు కూడుకే విలలాడు
నేడె నేసె బ్రతుకు నేత వ్యధయె 
నిత్య నీడ గుడ్డ నీతి లేని తనమే
కూడు గూడు కరువు గడ్డ లేక

*..మరచి పోలేని కందాలు మరులు గొలిపె
తరువులు ఎదిగి నట్లుగా తరచు తట్టె
విరివిగా చదువ గలిగి వేగ పరిచె
శర్మ గారి రచన కంద శోభ లల్లె
0
సముద్రము వర్ణన 

సంధ్రమే జీవితం  సహనమో పోరాటం
అలలను వాంఛలే  యలసి పోక!
సాగుతూ మమతల  వాగువంకలతీరు
నచ్చుతూనడకల నదులుకలుపు!

అగ్ని పర్వతములు యాహిమ గిరులెల్ల
దాచుయాత్మలలోతు దాతనీవు!
నిరతము హోరుతో నిండు గర్భిణివోలె
జలములెల్లయుఁద్రావుఙ్ఞానధునివి!
తేటగీతి 

పంచిసమకూర్చిచినుకులపవనములను
మేఘ మాలవైనర్తింతు యోగభాను
సశ్యరాశుల నందించు సవిత స్నేహ
కడలివనునీవుయసమానకాలరూప..

*..నిన్న చదివింది మార్చలేని గతి ఇదియె
రేపు చదివేది ఏమిటో రీతు మారు
నేడు చదివినా చెప్పలేని మతి ఇదియె
హృదయ తలుపులు ప్రేమతో హాయి గొలుపు

*..శ్రద్ధ జీవితానికి తోడు శ్రమకు నీడ
మృత్యువు సహజం సంశయ మేల నీకు
నీవు విశ్వాసము కలిగి నియమ మగుటె
శ్రమకు తగ్గఫలము చాలు శాంతి నిచ్చు

*..ప్రజల ఆశయ ప్రోత్సాహ ప్రభలు ఇవియు
విజయ వాంఛకు సహకార వెల్లువగుట
సృజన ప్రశ్న జవాబులు కృషికి తోడు
ప్రాంజలి ఘటించి తెలిపెద కళల వెలుగు

*..ముర్ము ద్రౌపది సేవలు ముఖ్య మగుట
రాష్ట్ర పతి పదవి వరమ్ము రాణి కెక్కె
వెనుకబడ్డ వారి ప్రగతి వేకువగుటె
అనుభవము దేశ సేవకు హాయి నొందు

*..అద్భుత విచిత్ర చిత్రమే అమర ప్రేమ
హృదయ కమలం గమనశబ్ద హాయి గొలుప
ప్రెయసి ఆజానుబాహుని ప్రేమ పిలుపు
ఏక వస్త్రముతో జంట ఏలు చుండె



ఉత్సాహము ..24/07/2022

కాల మాయ జూపి నావు ..కాని దంత మాపటీ
కాలు తుండె కట్టె నేను... కమ్ము కొచ్చె చీకటీ
మేలు చేయ లేక నుండె..మేత కష్ట వాకిటీ
జాలి లేని వారి మధ్య...జాతి బత్కు కుంపటీ

పెదవి విరుపు చూసి ఆశ..పేరు మార్పు తెచ్చుటే
పదవి పువ్వు పొంది నాక..పెద్ద తీర్పు వచ్చుటే
ముదిమి వయసులో న...మోక్ష మవుట నవ్వుటే
మొదటి నవ్వు చూసి నాక..మౌన మనిగ బత్కుటే

యుర్వి నెల్ల ఏలు చున్న ఉదయ కిరణ మూర్తివై
సర్వ శక్తి నంత నిచ్చి....సమయ సౌమ్య దాతవై
ధైర్య బాట చూపి నడుపు.. దాన ముందు మంత్రివై
సౌర్య వీక్ష నమ్మె యిదియు..సౌమ్య భావ సాక్షివై

పన్ను లోని  రూపు గాంచి..కమ్మని కధ తెల్పుటే
మన్ను నమ్మి తెల్పు చుండు..మదిని గాంచి ఒప్పుటే
మిన్ను తలుపు పొందు పరచి...మేలు చేసి నప్పుటే
కన్న ఫలము చూపు లన్ని..కామ్య మనసు కప్పుటే

గడవ నున్న కాల మిదియు..గాంచ లేరు ఎప్పుడూ
విడవ మన్న కోరికలను.. వీడ లేరు ఎప్పుడూ
నిల్వ మన్న సాధనలను.. నీతరఫున ఎప్పుడూ 
కొల్వ మన్న ప్రకృతి నెపుడు..కొల్వ లేరు ఎప్పుడూ

కాలమేదియైన నీవు...కర్తగాను సాగుమా
గోల అనుట వద్దు మీరు... గొప్ప మనిషి సాగుమా
తాళ లేక ఉండు టేల...తాప మేళ సాగుమా
పాల లోన నీళ్ళు లాగ..బాధ తీర్చి సాగుమా

ఉత్సాహ వృత్తము 

ప్రేమ యిదియు మందగమన.. ప్రేయసి కళ పేరుగా
ప్రేమ గమన చందనమున.. ప్రేయసి కధ ప్రేమగా
ప్రేమ వయసు విందులగను.. ప్రేయసి మది ప్రీతిగా
ప్రేమను గను వందిత సమ.. ప్రేయసి హృది ప్రీతిగా

మనసులు కలసిన తనువులు... మమతలు గల మోహనా
తనువు తపన తహ తహలుగ... తమరు ఏల మోహనా
అణువు ప్రణయ ప్రేమ చూడు...అర్ధ మగను మోహనా
కణము నెరిగిన హృదయము యె...కన్నుల కళ మోహనా

మనసు తలపు పైన మగువ  -- మహిమ చూప దాల్చినే 
వినయ వాంఛ లన్ని నీడ -- విశ్వ మందు పోల్చెనే 
అణువు ఆశ తలపు లన్ని -- ఆల మంద లాగునే 
కణము కదలిక లగు శివుడు - కామ్య తృప్తి తీర్చునే

ఎవడొ ఏమి అన్న నేమి..ఏమి ఫలము కోరుటే
మధుర లీల గనము ఇపుడు..మహిమ జనని తీర్చుటే
తెలిపినారు దేని నైన.. తేట తనము పొందుటే
శారద దయ జూపు వేళ...సాను భూతి కల్గుటే
ప్రాంజలి ప్రభ
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ 

           *చరవాణి తేటగీతి మాల*

ప్రథమ  వాయుభాషణ క్రియ ప్రగతి తెల్పు 
శాఖ  ద్వితీయ యంత్రము  శాంతి గణన
చిత్ర  తృతీయం ఛాయల  చిత్ర రమణి |
వృద్ధి యు చతుర్థ  విక్రయ  వృద్ద బాల 

పంచమం  జ్యోతి చీకటి ప్రణయ కళలు 
షష్టమం క్రీడ విలసిత షక లకగను 
సప్తమం చిత్ర దర్శిని  సంఘ వృద్ది 
అష్టమం ఖండ తర దర్శ ఆత్మ ఇదియు

నవమి సర్వప్రాంత విహారి నయన మౌను 
దశమ మార్గదర్శిని విద్య ధరణి యందు 
స్థలము ఏకాదశ  ముఖ పుస్తకమగుటయు 
ద్వాదశం వ్యర్థ  సందేశ ద్వార మగుట 
ఇదియు ద్వాదశ నామానీ ఈశ్వరి కళ

చరిత వాణీ నమస్తుభ్య చరణ మాయె 
సర్వ వార్తల సమన్విత సంఘ మాయె 
చర చరా స్వరూపేణగా చిత్త చిత్ర 
 గ్రాస భక్షిణీ విధ్యుత్ గ గతి 🌹మతి గను 

చిత్రగ్రహణమై రూపేణ చిచ్చు పెట్టు 
యంత్ర గణన రూపిణి గను యాత్ర చెప్పు 
క్రయ విక్రయ సర్వ ణీ మది కలలు తీర్చు 
గృహము ప్రాంగణ దర్శిని గుప్త పరచు 

సర్వ స్తోత్రాణి గానాని  శాంతి చెప్పు 
విద్య కర్ణాంతరాళ శ్రావణియు విధిగ 
దూర ప్రాంతేషుమార్గాణి  ధర్మ బోధ
అంతర్జాల సందర్శిని  ప్రాంజలి యగు 

మధ్యమాంగుళ తర్జన్య మాధురిగను 
స్పర్ళ  మాత్రేణ శోభినీ సంపద యగు 
సర్వ మానవ హస్తేన  మనసు పంచు 
నిత్య  దర్శనం ఆరోగ్య నియమ మగును 

సర్వక్రీడా సముత్పన్న సంత సమ్ము 
సర్వ వస్తు విలక్షణ సేవసంస్థ 
దూరభారాణి విచ్ఛేద భూరి యగుట 
వాయుమార్గ సంచారిణీ వాదనవదు 

మనిషి ఖండాంతర నివాసి మనుగడ ఇది 
నిత్య భాషణేషు సమీప నియమ మిదియు 
వాయు సంకేత గ్రాహేణ వారధిగను 
సమ సమీపేన సందర్శి సమయశక్తి 

వినము మానవ హస్తేన  ఏదనలు లె 
క్షణక్షణ విచారిణ క్షమయు యుక్తి 
సుఖము  వాణి సభా మధ్య సంబ రమ్ము 
నిత్య  సంభాషణే విధి నీడ లగుట 

కార్య కారణ సంబంధ కర్మ యగుట 
మధ్య వాయు విహారిణీ మనసు యగుట 
విజయ సందేశ సంకేత వినయ వాణి 
కళ పురోగతి రోదక కామ్య మగుట 

 విత్త జ్ఞాన శూన్య మగుటే  విద్య పొందు 
లింగ భేదాన్య లేదులే లయలు చూపు 
చరిత చరవాణి చేతి లో సెప్ప కలుగు 
పశువు రూపేణ గణనము పగలు రాత్రి  

జల మధ్యే జంతు మధ్యే ప్ర యాణే గమనేషుచ|
గృహ మధ్యే కార్య మధ్యే ప్రయాణ ప్రాంగణేషుచ |
యాజ్ఞీకేషు యాచకేషు వైద్య వైజ్ఞానికేషుచ| 
దేవాలయే విద్యాలయే చరవాణీ సందర్శనమ్ 

భక్తి వాగ్భూషణం చరభాషణమ్ము 
భుక్తికి చరవాణీ హస్త భూషణమ్ము 
శక్తి కర్ణ వార్తలకునులె శ్రవణమ్ము 
నిత్య చరవాణి లీలలి నియమ మందు.

కంపనం ఆగమనముయే కళలు తీర్చు 
సూక్ష్మ ప్రాణి వినాశనం సూత్ర మగుట 
సంభవము చేయు ఈ క్షణముna సర్వాణి 
గళము వాయు మార్గేనను గమ్యతేను 

సంఖ్య మాత్రేణ ఆహ్వాన సమయ తీర్పు 
సంఖ్య ధీనేన వర్తినీ సంతసమ్ము 
 పాఠ వ్యర్థేన కాలక్షేపాయ మిదియు 
బంధ బాధ్యత వ్యర్థపు భాషణమ్ము

జ్ఞప్తి పత్రాణి సంయుక్త జ్ఞానసింధు 
నామ పత్ర సమన్విత నమ్మకమ్ము 
ఇదియు పత్ర వినాశన ఇష్ట ఘోష్టి 
నయన సర్వ సంబంధము నాశనమ్ము 

             ఫలము
ప్రీతి పయనమందు సలహా పిలుపు మల్లె
అధిక ఉపయోగ లాభము ఆత్ర మొద్దు
వైద్య విద్య సంభాషణ వైనతి యిది
పదెపదే వాడుటయు వద్దు పరమ గతియు

కళల ఆరోగ్య పనులుగా కలలు తీర్చు
పిల్లలకు  అనారోగ్యమ్ము పిచ్చి పెంచు
మృత్యువు తలపు మార్గము ముందు చూపు
లేని ఇల్లు లేదు లె సెల్లు లేత మనసు

ఆ:: గెలుపు గొప్పకాదు గేలిచేయక నుండు 
      జ్ఞాన మంత పంచి జ్ఞప్తిగుండు 
      విజయ కాంక్ష వదలి వినయము చూపుము  
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

ఆ:: పిల్ల చంక బెట్టి పేరు అడుగు రీతి 
      పడ్డ కష్ట మంత పడతి బిడ్డకొరకు
      మనసులోన మనిషి మరచియే వెదుకుట 
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత  

ఆ:: హృదిని బాధపెట్టు హాస్యమేల ఇపుడు 
      తప్పు జరుగు సహజ తాప మగుట
      అనుభవము తీర్పు తెలుపుటే అదరవద్దు   
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత



తే :: తెలుగు లో వాక్ప టుత్వమ్ము తెలుప గాను 
      వ్యాక రణముతో పరిపూర్ణ పాట గాను .
      కీర్తి కాదు జన హృదయ మేలు గాను
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

తే :: నిలిచి పోయేటి మనసున నెమ్మదియును 
      అలుపెరగక పోరిన విధి నంత చూసె    
      మరణ శయ్యపై బ్రతికేను మహిమ ఏల 
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత
 
తే :: సాగె కాలుని కేమయ్యె సాధ్య కరుణ 
      ఇది విచిత్రము చిత్రము ఈశ్వరేచ్చ  
      ముఖ్య యమునికి దయయేను ముసురు పట్టె 
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

తే :: పాటల సిరిమూటలు ఎన్నొ ఆటలాగ
       హాని చేయని మనిషిగా హాస్య బతుకు 
       ప్రాణి, గానము నలరించె ప్రతిభ గాను
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

తే :: కాల మంతయు పాటలు ప్రాణ మయ్యె
       జీవ నమునకు మూలము జయము పాట
       వచ్చి పోతివా ప్రాంజలి వరద మల్లె
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

తే :: పండితారాధ్యుల కళలు పాలు నీళ్లు 
       ఎందుకో చేసినది పుణ్య ఏల రాదు 
       తిరిగి రానట్టి లోకాల తేటగీతి 
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

(అపర గాన గంధర్వుని మృతికి చింతిస్తూ.... బాధాతప్త హృదయంతో.ప్రాంజలి ప్రభ నివాళి  )
--(())--

తే:: సృష్టి కధకు మూలము పాశ సృజన యగుట 
నడుపు ఇచ్ఛా శక్తి యు కీల కముగ నుండు 
జీవులలొ శక్తి అత్యంత జాగృతి యగు
ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత
 
కార్య ములొ అనురాగపు కాంక్ష యుండు
వ్యక్తి గతమైన కోరిక వ్యాకులమ్ము  
మూల మేమన ఆరాధ ముఖ్య శక్తి
ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత
 
ఇచ్ఛ  అనునది ధర్మము ఈశ్వరేచ్చ  
సహజ నిర్మాణ సౌందర్య సమయమేను
ధనము ఉన్నను వైభవ దయయు మారు 
ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

స్వేశ్చ అనుభూతి పొందేటి సేవలేవి 
ధనము లేకయున్న తృప్తియు ధరణి యందు  
ధనము కొరకును దైవము దారి వెతుకు 
ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

సత్యమును కోరి తపనతో సమర దృష్టి  
తీవ్ర మైనట్టి  నిష్ఠతో తేజమివ్వు  
రాగ స్వరూప పాశము రంగ రించు   
ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత


తే:: దెబ్బలకు దెయ్యమైవేట దేహ మంట 
      డబ్బులకు దండమే యాట డాబుగునట 
      జబ్బుగా మారె బుద్ధియు చక్క కాదు 
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 
 
తే:: అవసరంబు బట్టియు సాగు ఆలుమగలు 
      ఆత్మ వంచన లేకుండ అర్ధ మగుట
      నిత్య అభివృద్ధి ఐక్యత నేటి నిజము    
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

తే:: బాది తీయవచ్చు మఖిలం బట్ట మురికి  
      కడిగి తీయవచ్చుట వేళ్ళ కాళ్ళబురద
      మనసులోనిమకిలి తీయ మలుపు ఏది:  
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 

తే:: నీడనే నేను చూసాక నిద్ర రాదు  
      అదిరిపడుతుండి భయముతో ఆత్రమగుట 
      అంత ఒంటరినయ్యాను అర్ధ మవక  
      గడిచి పోయిన జీవితమ్ గాధలగుట  

తే::యువత నైపుణ్య ప్రతిభఏ యుజ్వలమగు 
     జీవన కళలే బ్రతుకుకు జయము నిచ్చు  
     ఆరితేరితే దిట్టగా ఆశయమ్ము 
     ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 

తే::  సత్యమైనమాట వలన చందుబాట
       మందబలపుమాట మహిమ మనసు నుండు  
       ధర్మ పథముదప్పిన ఫలం దాడిజేయ
        యొకటిగా గుమ్మి గూడినా ఓటు చెల్లు 

తే:: తేలి కగుటయే మనసుకు తెలివి పుట్టు 
      విసుగు జాడవెతికి నాక వెడలగొట్టు
      మదిని తేటపరుచు హాయి మంత్ర మగుట 
      మితపు సేవనమువలన మేలు గలుగు

తే:: రాక గోరుచు నింగిలో రంగు వెలుగు 
      స్వాగతమ్ముబలికె నులే సద్దుజేసి
      కలువ పూలన్ని నీటిలో కాచు కొన్న
      విరియు ఎళ్లవేళలు తాము వెలుగు జూచి

తే::  తిరిగె భ్రమరాలు లతలపై తీరు బడులె 
       విజయ రాణుల గలియను వెలుగు లోన
       చెఱువు చెంత శీఘ్రగతిని చెమ్మ చెక్క 
        ప్రా0జలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 
      
తే::  ఆలసించక రావయ్య యంబరమణి
       నీదు కిరణాలనింపుమా నెనరుతోడ
       ధరణి ప్రాణుల గాచెడు ధర్మమూర్తి
       వందనాలు తిమిరనాశ వందమార్లు.


తే:: చైతన్య విభూతి మనసుగా చేయికలిపి 
      సంఘ జీవనమ్ముగనుండి సంబరమ్ము 
      అంతర్యాలతో పరిచయం ఆశయమ్ము 
      భారతీ సాంస్కృతిదసరా భాగ్య సీమ  

తే:: గురు పరంపరా బోధలే స్ఫూర్తి నిచ్చి   
      సర్వ ప్రాణుల సేవగా  సంతసమ్ము  
      సర్వ మూఈశ్వ రాధన సమ్మతమ్ము 
      స్వీయ ఉద్ధరణ సమాజ స్వేశ్చ కోరి 👏👏

తే:: వినయ విశ్వాసమ్మును ఉంచి విజయ మొందు    
       శ్వాస విశ్వ0లొ పయనమై శాంతి నిచ్చు 
       మనిషిలో అవిశ్వాసమే మనసు ప్రశ్న   
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత   

తే:: మధురభక్తి భావుకులకు మధుర మొవ్వు 
      దివ్య ప్రేమ రసానంద తేజ మతడు 
      బ్రహ్మ అనుభవం కల్గుతూ భక్తి మార్గ     
      కరుణ వల్ల భక్తుల రామ కార్య సిద్ధి  
  
తే:: భావ దేహమనేదియు బంధ మగుట
      సగుణము పరాత్మ దేహము సమయ మేలు  
      దివ్య సూక్ష్మ దేహమగుట ధీర రామ 
      శక్తిపూరిత అద్భుత సిద్ధులగను 

తే:: ఒక అనంత చైతన్యమూ ఓర్పు కలిగి 
      శాస్త్రములను సత్ఫలితము శాంతి నిచ్చు 
      జాతి, విద్య, రూపము, కులం జయము నిచ్చు 
      స్థితిని అనుగ్రహించెడి రామ స్థిరము నిచ్చు  

తే:: రామ నామము నాలుకై రసము లూరు  
      రామ రూపమే నిత్యము  ఆదు కొనును 
      కీర్తి గానమే నిత్యము వినికిడిగను
      రూపము గుణము, హృదయము రమ్య పరచు 
     
తే:: కార్య సాధన మనిషిగా కర్మ యేను  
      కర్మ నిర్వాహణలు నిత్య కాల మగుట  
      క్రియలు ఎన్నైనా జీవిత కీర్తి కొరకు 
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 

తే:: కామ సృష్టి చీకటి కళ కర్మ యగుట 
      మోహ నల్ల మబ్బులు కమ్మి మోక్షమగుట 
      లాభ మదము క్రోధ ప్రేమ లభ్య మగుట 
      లోభ మద మత్సరాలకు లొంగి బ్రతుకు    

ఆ:: మనసులోన మమత మగువ చుట్టు తిరుగు   
       బాధతో మౌన మున్నను భందమగుట 
       అవసరము ఉచ్చ స్వరమ్ము ఆనతిగను 
       కోపగించినట్లు కోరిక కోరకూ 


తే:: చైతన్య విభూతి మనసుగా చేయికలిపి 
      సంఘ జీవనమ్ముగనుండి సంబరమ్ము 
      అంతర్యాలతో పరిచయం ఆశయమ్ము 
      భారతీ సాంస్కృతిదసరా భాగ్య సీమ  

తే:: గురు పరంపరా బోధలే స్ఫూర్తి నిచ్చి   
      సర్వ ప్రాణుల సేవగా  సంతసమ్ము  
      సర్వ మూఈశ్వ రాధన సమ్మతమ్ము 
      స్వీయ ఉద్ధరణ సమాజ స్వేశ్చ కోరి 👏👏

తే:: వినయ విశ్వాసమ్మును ఉంచి విజయ మొందు    
       శ్వాస విశ్వ0లొ పయనమై శాంతి నిచ్చు 
       మనిషిలో అవిశ్వాసమే మనసు ప్రశ్న   
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత   

తే:: మధురభక్తి భావుకులకు మధుర మొవ్వు 
      దివ్య ప్రేమ రసానంద తేజ మతడు 
      బ్రహ్మ అనుభవం కల్గుతూ భక్తి మార్గ     
      కరుణ వల్ల భక్తుల రామ కార్య సిద్ధి  
  
తే:: భావ దేహమనేదియు బంధ మగుట
      సగుణము పరాత్మ దేహము సమయ మేలు  
      దివ్య సూక్ష్మ దేహమగుట ధీర రామ 
      శక్తిపూరిత అద్భుత సిద్ధులగను 

తే:: ఒక అనంత చైతన్యమూ ఓర్పు కలిగి 
      శాస్త్రములను సత్ఫలితము శాంతి నిచ్చు 
      జాతి, విద్య, రూపము, కులం జయము నిచ్చు 
      స్థితిని అనుగ్రహించెడి రామ స్థిరము నిచ్చు  

తే:: రామ నామము నాలుకై రసము లూరు  
      రామ రూపమే నిత్యము  ఆదు కొనును 
      కీర్తి గానమే నిత్యము వినికిడిగను
      రూపము గుణము, హృదయము రమ్య పరచు 
     
తే:: కార్య సాధన మనిషిగా కర్మ యేను  
      కర్మ నిర్వాహణలు నిత్య కాల మగుట  
      క్రియలు ఎన్నైనా జీవిత కీర్తి కొరకు 
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 

తే:: కామ సృష్టి చీకటి కళ కర్మ యగుట 
      మోహ నల్ల మబ్బులు కమ్మి మోక్షమగుట 
      లాభ మదము క్రోధ ప్రేమ లభ్య మగుట 
      లోభ మద మత్సరాలకు లొంగి బ్రతుకు    

ఆ:: మనసులోన మమత మగువ చుట్టు తిరుగు   
       బాధతో మౌన మున్నను భందమగుట 
       అవసరము ఉచ్చ స్వరమ్ము ఆనతిగను 
       కోపగించినట్లు కోరిక కోరకూ 

తే:: మనిషిలో రస ధాతువు మెరుగు చెంది  
      రక్తము జలము మాంసము రంగు జేరి 
      కొవ్వు గా ఎము కను మజ్జ, కోరి జేరి 
      వీర్య మనెడి ఓజస్సు గా విశ్వవ్యాప్తి 

తే:: గుర్తు చేస్తావు రోజూ సుకొత్త మలుపు  
      పేరు పలుకను గొంతెత్తి పిలుపుగాను 
       చెప్ప లేకను చేసినా చింత కినుకు  
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 

తే:: మనసు వికసించడం వంతు మరులు గొలుపు    
      ఉదయ భానుస్పర్శతగిలి యూత మగుట  
      విరుల చూపుల రెక్కలు విప్ప తలపు 
      మైమరుపుచుక్క వీక్షించి కైపు కెక్కె   
  
తే:: మనిషి తనరూపు తహతహ మెరుపు కోరి  
      ఒక ఎరుపు రుమాలు గ ప్రేమ ఓర్పు జూపి 
     ఎర్ర ని పెదాల వెలుగులే  ప్రకృతి యనియు       
     మనిషి కోరేది సంతృప్తి మాయ వలపు    


అష్ట కష్టాలు పొంది ఆదర్శ రాణి   
ఇష్ట సౌఖ్యాలు పొంది సౌందర్య వాణి
స్పష్ట తే తెల్పి సర్వ లారాధ్య వేణి   
కృష్ణ  కృష్ణా  యటంచు  నా కీరవాణి

కంట నీరేణు లేని నా కృష్ణవేణి  
కంఠ శోషేను లేని నా కావ్య రాణి   
కంటి చూపేను నాకు దృశ్యవాణి  
ఇంటి దీపమ్ము నాకు ఇచ్ఛ వాణి  


దత్తపది... కలిమి, లేమి, కావడి, కుండ

కలిమి బలిమి చెలిమి కళలు తీర్చుట తృప్తి
లేమి వల్ల కలుగ లేత మనసు
కావడి కదలికయె కధలు కధలుగా ను
కుండ బద్ద లగుట కులము నందు
.........
సద్గురువు ని ఎలా గుర్తించాలి?
నిన్ను ఎప్పుడూ గమనించి నీడ నిచ్చి
నీకు విద్యాబుద్ధులు నేర్పి నిజము తెలిపి
నిన్ను నిన్నుగా గుర్తించి నీకు రక్ష
నీ మనసు అర్ధం గ్రహించ నీకు తోడు
---
పువ్వు పరిమళించే కళ పుడమి తీరు
జీవి బ్రతుకుకే గాలిగా జీత గాడు
ప్రకృతి పరవశం కెరటాల పేర చూపు
స్త్రీ పురుష లైంగిక విధమే సేతు బంధు
---
నేను నువ్వని భేదము లేక నడువు
లోపల బయటఅనక యే లోతు తెలుపు
సాధనేసరళమగు టే సాధ్య మవదు
నీకు నిస్వార్ధ బుధ్ధియే నిన్ను మార్చు
.........
సుఖమే కుటుంబమగుటే
సఖ్యత కష్టాన్ని కూడ సాధ్యం అనుటే
ముఖ్య శతృవు లే మిత్రులగు
సంఖ్యే కాదే ఇదేను సమయం సమరం
........
బ్రహ్మచర్యము సత్యమై బడయు నీతి
మనసు వాక్కాయకర్మలు మాన మగుటె
ఆచరణ త్రికరణ శుద్ధి ఆత్మ తెలుపు
పరమ ధర్మముయె అహింస పుడమి నందు
........
అద్బుత రూపిణీ  యంబవుశాంభవీ
దినదినవర్ధిని ధిగ్విజయవు!
శంకరి శుభకరీ చంద్రసుహాసినీ
ఇందిరా సుందరి యీశ ప్రియవు!
కుందన కువలయ కూర్మ సహోధరీ
బింధువు సింధువే బింభప్రభవు!
చిందుల విందువు చిన్మయానందవు
విశ్వవినోదవు  వీరధరివి!

ఆటవెలది 
ముగ్థ మోహనముగ మురిపించుముక్తేశ
మూర్తి ప్రియవు విశ్వ  స్పూర్తిగావ!
ఆర్తితోడ పిలువయాదరింతువు యంభ
మ్రొక్కు మోకరిల్ల  మోదమిచ్చు
****